12, జులై 2013, శుక్రవారం

భగవత్కథలు - కొత్త శీర్థిక - మీ స్పందన తెలియ జేయండి!

ముందు మాట.

మన తెలుగులో గొప్ప సాహిత్యం ఉంది. అది వేయేళ్లకు పైగా కష్టపడి చిలికి జనుల దోసిట్లో కవిచక్రవర్తులు పోసిన అమృతం.

తినగ తినగ వేము తియ్యనుండు అన్నాడు వేమన అనే ఒక కవి. ఆ సంగతి యేమో గాని తినగా తినగా గారెలు చేదెక్కాయని ఒక సామెత ఉంది.  అలాగా తెలుగువాళ్ళకి తెలుగు మాట్లాడీ మాట్లాడీ విసుగెత్తిపోయినట్లుంది.  ఈ‌ మధ్యన అసలు తెలుగు మాట్లాడటమే నామోషీ అయిపోయింది.

ఈ రోజుల్లో జనం అన్నం అనటం మానేసి రైస్ అంటున్నారు.  పాటను సాంగు అంటున్నారు.  అమ్మా నాన్నా అని పిలవటం మోటు అనుకుంటున్నారు.  తెలుగు వద్దూ‌ అనుకుంటున్నారు.  నష్టం‌ ఎవరికీ?

మన ఎంత బాగ ఇంగ్లీషు వెంటబడినా ఇంగ్లీషువాళ్ళం మాత్రం కాలేము.  మనని మనం తెలుగువాళ్ళం అనుకోవటానికి మొహమాట పడుతున్నాం.  మనం‌ ఎవరిగా మిగల బోతున్నాం?  ఈ విషయం కాస్త ఆలోచించుకోవాలి మనం.

నేటి తల్లిదండ్రుల అతి కారణంగా పిల్లలకు తెలుగు అనేది ఒక చదువదగ్గ వ్రాయదగ్గ మాట్లాడ దగ్గ భాషలాగే కనబడటం లేదు.

మనం కోల్పోతున్నది మన ఉనికిని అని దయచేసి అందరూ అర్థం చేసుకోవాలని నా విజ్ఞప్తి.  మన సాహిత్యం కూడా మన ఉనికిలో అతి ముఖ్యమైన భాగమేనని సవినయంగా మనవిచేస్తున్నాను. కాదని వాదించే‌ వారితో ప్రతివాదనకు దిగననీ మనవి చేస్తున్నాను. మనం అంతా కావాలనుకుంటే మన తెలుగు బ్రతికి బట్టకడుతుంది.  లేకపోతే కృశించి నశిస్తుంది. అంతా మన చేతిలోనే ఉంది.

ప్రస్తుత పరిస్థితులలో తెలుగు ఒక సబ్జెక్టుగా అభ్యసించే విద్యార్థులలో ఆసక్తి గలవారు మినహాయించి పిల్ల లెవరికీ తెలుగు పద్యాలు చదివి అర్థం చేసుకొనే శక్తి ఆసక్తి లేదు. నిజానికి చాలామంది మధ్యవయస్కుల పరిస్థితీ అదేనేమో. అందువలన శ్యామలీయం‌ బ్లాగులో కొన్ని ప్రబంధ భారత భాగవతాది కథలను పరిచయం చేయాలని ప్రయత్నిస్తున్నాను. 

ఈ ప్రయత్నంలో భాగంగా కొన్ని పద్యాలూ కథలతో‌పాటే చెప్పుకుందాం అర్థతాత్పర్యాలతో సహా. ఇది కొంత మేలు చేస్తుందని ఆశిస్తున్నాను. పద్యం చదవటం పట్ల ఆసక్తి పెరిగి, కొద్ది మందైనా తిరిగి సంప్రదాయిక సాహిత్యాన్ని చదవాలనుకుంటే నా కృషి ఫలిస్తుంది.

అందు చేత చదువరులు యీ శీర్షికను స్వాగతిస్తారని ఆశిస్తున్నాను.


దయచేసి మీ స్పందనను తెలియజేయండి.