29, డిసెంబర్ 2020, మంగళవారం

దయచూపవయా దాశరథీ

దయచూపవయా దాశరథీ భవ
భయము బాపి నాబాధలు తీరిచి

అభయదాయక హరి సర్వాత్మక
ఉభయదాయక యుర్వీనాయక
విభవదాయక విమలగుణప్రద
సభల నాపలుకు సవ్యముచేసి

మానవనాయక మహితగుణోన్నత
దానవనాయకదర్పవిదారక
జానకినాయక జనహితదాయక
మానిపించి కలిమాయలనింక

రవికులవర్ధన రణవిహరణచ
దురితనివారణ కరుణాభరణ
భవభయవారణ భక్తజనావన
అవలీలగ నాయలసట బాపి


27, డిసెంబర్ 2020, ఆదివారం

నీ‌ మహిమ తెలిపే‌ పాట

నీ‌ మహిమ తెలిపే‌ పాట నిజముగ మంత్రమే
మా మీద దయగల రామచంద్ర

శ్రవణసుభగమైన రసమయమైన పాట
భవదీయగుణచరితాపావననామ
వివరంబుల నొప్పి వెలయుచుండగ నది
భవతాపహరమంత్ర మవుగాదే హరి

ఒకమారు నీనామ ముఛ్ఛరించిన చాలు
ప్రకటితమగును శుభపరంపర లనగ
మకరందబిందుకోటిమాధురి గల నామ
నికరముగల పాట నిరుపమము హరి

శక్తిగల మంత్రమై సరిసాటిలేనిదై
ముక్తిప్రదంబై ముచ్చటైన పాట
రక్తిమీఱ పాడుట రామచంద్ర నీ
భక్తులైనవారిల భాగ్యము కద హరి


అన్ని యూళ్ళు మావే

అన్ని యూళ్ళు మావే యందరు మావారే

అన్ని చోట్ల మాకు స్వగృహంబు లున్నవి


కల రన్నదమ్ములు కల రప్పచెల్లెండ్రు

కల రెందరో బందుగణ మన్ని యూర్లను

కలవు మాకు స్వగృహంబుల తోడ భూములును

కలవారు గాన మా తలిదండ్రు లనగ


ఏమేమొ పనులపై రామయ గారింటికి

భూమిజనాళి వచ్చిపోవుచుందు రెపుడు

ఏమూల మాతండ్రి రామయ్య గారి పేరు

శ్రీమంతమును గొప్ప చేయని వారున్నారు


చెలువుగ సీతారాముల సంతానమే

యిల నింతలింతలై యిన్నిన్ని యూళ్ళాయె

కలయ నందరికన్న ఘనులు మాపితరులు

తెలియుడీ భరతభూమి దివ్యరామభూమి



26, డిసెంబర్ 2020, శనివారం

మొక్కండి మొక్కండి

మొక్కండి మొక్కండి చక్కనయ్యకు

చక్కగా మొక్కండి చల్లనయ్యకు


పిల్లలో అని వచ్చి వేడుకొనే వాళ్ళు

అల్లు డెక్కడయ్యా అని అడిగే వాళ్ళు

తల్లికి వైద్యమని తపనపడే వాళ్ళు

ఇల్లూ వాకిళ్ళనూ ఇమ్మనే వాళ్ళూ


విద్యనూ బుధ్ధినీ వేడుకొనే వాళ్ళు

ఉద్యోగం వేటలో ఉసురుసురను వాళ్ళు

చోద్యంగా ధనమున్నా సుఖంలేని వాళ్ళు

గద్యపద్యాలతో గడబిడగా మెక్కండి


తమరు మోక్షార్ధులై తరలి వచ్చినారా

ఇమడలేక వీళ్ళ మధ్య ఇటుగా ఉన్నారా

తమరు కూడ రాముడికి తప్పక మొక్కండి

తమరు గొప్పవారైనా తప్పక మొక్కండి


కనుగొంటిరే వాడే ఘనుడైన రాముడు

కనుగొంటిరే వాడే ఘనుడైన రాముడు
మనరాముడు మనరాముడు మనదేవుడు

కరుణాళువు వాడే కౌసల్యా రాముడు తన
చిరునగవుల మునులనైన చిత్తుచేయువాడు
పొరి దశరథనయనకుముద పూర్ణచంద్రుడు
పరాక్రమము నందు హరివంటివాడై తోచు

అడవులలో నున్నాడీ అయోధ్యారాముడు సుఖ
పడవలసిన వయసులోన పడతి సీత తోడ
విడిసియున్నాడు ఘోరవిపినభూము లందు
మడమత్రిప్ప నట్టి సత్యమంగళ స్వరూపుడు

కొండపై నున్నాడీ కోదండరాముడు వాని
కండగా నిలచినాడు హరిగణేశుడు తన
కండయై నిలచిన హరి కతికృతజ్ఞు డతడు
దండు నిదే పిలిచినాడు దండయాత్ర వెడలగ

అడిగడిగో వాడే అనందరాముడు భళి
తొడగొట్టి లంకేశుని పడగొట్టినాడు
వడివడిగా నిజపురికి బయలుదేరినాడు
పడతి సీత సౌమిత్రి పరమాప్తగణముతో

23, డిసెంబర్ 2020, బుధవారం

ఆడరో‌పాడరో అప్సరో‌గణము (అన్నమయ్య కీర్తన, సవ్యాఖ్యానం)

ఆడరో పాడరో అప్సరోగణము
వీడెము లిందరో విభవము నేఁడు

కమలారమణుని కళ్యాణమునకు
తమి నదె గరుడధ్వజ మెసగె
తెమలుచు మ్రోసెను దివ్యదుందుభులు
గమనించరో దివిఁగల దేవతలు

వెలయగ లక్ష్మీవిభుని పెండ్లికిని
బలసి అంకురార్పణ మదివో
కలగొన నిచ్చేరు గంధాక్షత లవే
చెలఁగి గైకొనరొ శ్రీవైష్ణవులు

బడి శ్రీవేంకటపతికి శ్రీసతికి
అడరిన తలఁబా లందె నిదె
నడఁచీ బరుషలు నానా ముఖముల
ముడుపులు చదువరొ ముయిగా నరులు  

 

అన్నమయ్య చెప్పిన పెండ్లిపాట ఇది. లక్ష్మీవిభుని పెండ్లికి అన్నమయ్య చెప్పిన పాట. ఈ కీర్తన శృంగారసంకీర్తనాల్లోనిది. కాని నిజానికి ఇది ఒక అధ్యాత్మికసంకీర్తనం ఇది 22వ సంపుటంలో 1216వ రేకు పైన ఉన్న సంకీర్తన. ఈ అన్నమాచార్యుల సంకీర్తనకు మంగళకౌసిక రాగం అని ఇచ్చారు. ఈరాగం‌ ప్రచారంలో లేదు. బాలకృష్ణప్రసాద్ గారు దీనిని రామక్రియా రాగంలో పాడారు.



ఈ పాట పల్లవిలో‌ అడరో‌పాడరో అప్సరోగణము అన్నారు. ఈ అప్సరసలను గురించి నాటకాలా సినీమాల పుణ్యమా అని సమాజంలో తక్కువస్థాయి అభిప్రాయం‌ కనిపిస్తుంది. అది పొరపాటు. దేవతలు దివ్యదేహులు. మనవంటి పాంచబౌతికమైన దేహాలూ అభిరుచులూ ఉన్నవారు కారు. అప్సరసలు అందరూ విశ్వచైతన్యానికి వివిధరకములైన ప్రతీకలు. 

పురూరవుడి కథ అని ఒకటుంది. ఆయన ఊర్వశిని కాంక్షిస్తాడు. సరే కొంత కథ నడుస్తుంది. ఆవిడ వెళ్ళిపోతే మరలా రమ్మని కోరుతాడు. అదొక కథ. ఆమె వస్తుంది.ఆ ఊర్వశీపురూరవులు ఒక కొండమీద విహరిస్తుండగా ఆమె అంటుంది "రాజా, ఇక్కడ ప్రహ్లాదుణ్ణి అనుగ్రహించిన నరసింహస్వామి వారు వెలసి ఉన్నారు. మరుగై ఉన్నారు. వెదుకుదాం పద" అని అలా చెప్పి ఆరాజు చేత నరసింసస్వామిని అన్వేషింప జేసి ఆఅ సింహాచలం అప్పన్నను నరలోకానికి అందిస్తుంది. పురూరవుణ్ణి తరింప జేస్తుంది. ఆయన భౌతికవ్యామోహాలను వదలలేక పోతుంటే ఆయనకు బ్రహ్మవిద్యను ఉపదేశిస్తుంది. ఇదిగో అప్సరసలు ఇలాంటి వారు.

ఇటువంటి అచ్చరో గణం అంతా దేవుడి పెళ్ళికి వచ్చారట. మీరంతా దేవుడి కోసం ఆడండి ఆయన కీర్తిని పాడండి అన్నమయ్య పురికొల్పుతున్నారు.

దేవుడి పెళ్ళికి అందరూ‌ పెద్దలే. ఎందరెందరో మహానుభావులు. నరలోకంలోని శ్రీవైష్ణవులు. స్వర్గం నుండి దేవతానీకం ఇతరలోకాలనుండి మహాత్ములు ఎందరెందరో కుతూహలంతో ఉత్సాహంగా వచ్చారు. అందరికీ ఈ వైభవం జరుగుతున్న సమయంలో తాంబూలాలనిచ్చి ఆహ్వానించండీ అని అన్నమయ్య చెప్తున్నారు. ఎవరికీ? అప్సరసలకే లెండి. వారంతా అక్కడ పేరంట్రాండ్రు. పెళ్ళిపెద్దలు.

ఇక్కడ అన్నమయ్య చెప్పిన పెండ్లి హడావుడి విశేషాలు చూదాం.

  • కమలారమణుని కళ్యాణమునకు తమి నదె గరుడధ్వజ మెసగె 
  • తెమలుచు మ్రోసెను దివ్యదుందుభులు 
  • వెలయగ లక్ష్మీవిభుని పెండ్లికిని బలసి అంకురార్పణ మదివో 
  • కలగొన నిచ్చేరు గంధాక్షతలు 
  • బడి శ్రీవేంకటపతికి శ్రీసతికి అడరిన తలబా లందె నిదె 
  • నడచీ పరుషలు నానా ముఖముల   అన్న

అన్నమయ్య ఏ దైవతాన్ని ఉద్దేశించి సంకీర్తనం చేసినా ఆ దైవతం తరుమలకు రావలసిందే, వేంకటేశముద్ర వేయించుకోవలసిందేను.

ఇక్కడ పెండ్లి ఎవరిదయ్యా అంటే  ఆ విషయం చివరి చరణంలో చెప్తున్నారు శ్రీవేంకటపతికి శ్రీసతికి పెండ్లి అని. మొదటి చరణంలో ఆయన్ను కమలారమణుడు అంటున్నారు.

ఆయన అప్పటికే కమల అంటే లక్ష్మీదేవికి భర్త అని చెప్పనే చెప్తున్నారు కదా మరలా చివరన శ్రీవేంకటపతికి శ్రీసతికి పెండ్లి అంటారేం, ఎన్నిసార్లు చేస్తారూ‌ పెండ్లి అని అడగకండి.

భగవంతుడి కళ్యాళం లోకకళ్యాణం. అందుకే గుళ్ళల్లో దేవుడి పెళ్ళి చేసినప్పుడు మాంగల్యాధారణం మంత్రంలో చిన్న మార్పుతో చెప్తారు గమనించండి. సాధారణంగా ఆమంత్రంలో వరుడి చేత మమజీవన హేతునా అని చెప్పిస్తారు. వరుడి జీవనానికి అప్పటి నుండి ఈ వస్తున్న భార్యయే అధారహేతువు అని అ వరుడే స్వయంగా చెప్పుకుంటున్నాడన్న మాట. కాని దేవుడి పెళ్ళిలో ఆ ముక్కని మార్చి లోకరక్షణ హేతునా అని చెప్పిస్తారు.

అంటే ఏమన్న మాట? 

దేవుడి పెళ్ళి లోకరక్షణార్ధం. అది లోకకళ్యాణహేతువు.

అందుచేత భక్తులు గుళ్ళల్లో యథాశక్తి లోకసంగ్రహార్ధం దైవకళ్యాణం జరిపించి పుణ్యం‌ మూటకట్టుకుంటారు.

గుళ్ళల్లో అనే ఏముంది, శక్తి ఉంటే సందర్భం కుదిరితే ఇళ్ళదగ్గరా దైవకళ్యాణమహోత్సవం జరిపించవచ్చు.

చేయించిన వారికి పుణ్యం.

దర్శించిన వారిదీ పుణ్యం.

ఇలా దైవకళ్యాణం భక్తిగా చేయటం అనేది వేదోక్తమే, ఆగమోక్తమే.

అటువంటి లోకకళ్యాణార్ధం జరుగుతున్న వేంకటేశ్వర స్వరూపుడైన శ్రీమహావిష్ణువునకూ పద్మావతీ అమ్మవారి రూపంలో ఉన్న శ్రీలక్ష్మీ అమ్మవారికీ జరుగుతున్న కళ్యాణం యొక్క వైభవాన్ని అన్నమయ్య కీర్తిస్తున్నాడు.

కమలారమణుని కళ్యాణము, లక్ష్మీవిభుని పెండ్లి అని మరలా  శ్రీవేంకటపతికి శ్రీసతికి అనీ‌ పదేపదే‌ చెప్పటంకేవలం భక్త్యావేశాన్ని సూచించటం.భక్తిసాహిత్యంలో అందుకే పునరుక్తి దోషం లేదు. కళ్ళకు కట్టినట్లు చెప్పటంలో ఆ సంతోషాన్ని వ్యక్తం చేయటానికి అదే సంగతిని వివిధాలుగా చెప్పటం అన్నది సహజం. అది బాగుంటుంది కూడా.

అ వేంకటేశ్వర ప్రభువు కళ్యాణంలో గరుడధ్వజం ఎత్తారు అని చెప్పారు. అ సందర్భంలో సర్వం‌ ప్రతిధ్వనించేలా దేవదుందుభులు మ్రోగాయట. ఈదేవదుందుభులు అనటంలో ఒక విశేషం ఉంది. మన వద్ద ఉన్న దుందుభులు ఐతే ఎవరో పని కట్టుకొని వాయించాలి. వాటంతట అవి ఎందుకు మ్రోగుతాయీ - మ్రోగవు కదా. అందుకే ఇవి దేవదుందుభులు అనటం. ఒక మహావిశేషం జరుగుతున్నప్పుడు ఆ దేవలోకపు దుందుభులు వాటంతట అవే బ్రహ్మాండమైన శబ్దాలతో మ్రోగుతాయి. అలా ఇప్పుడు మ్రోగుతున్నాయి. జరుగుతున్నది దేవుడి పెళ్ళి ఐతే మ్రోగవా మరి?

ఓ దేవతలారా, మీ‌లోకంలో ఉన్న దుందుభులు విశ్వం మారుమ్రోగేలా ఉరుముతున్నాయి వింటున్నారా గమనిస్తున్నారా దేవుడి పెళ్ళి వేదుకనూ అని అన్నమయ్య హెచ్చరిస్తున్నారు.

పూర్వం జరాసంధుడి దుర్గం మీద రెండు అద్భుతమైన దుందుభులు ఉండేవి. ఎవరైనా శత్రుభావంలో కోటలోనికి వస్తున్నట్లైతే అవి రెండూ‌ వాటంతట అవే‌ భీకరంగా మ్రోగేవి. రెండు ఉండటంలో ఒక గడుసుతనం ఉంది. మీరు ఒకదాన్ని పగలకొట్టగానే ఎలాగో అలా ఆ రెండోది ఈలోగా అల్లరి చేస్తుంది. రెండూ ఒకసారి పదకవేస్తే తప్ప నగరంలోనికి హెచ్చరిక వెళ్ళకుండా అపలేం‌ కదా. అందుకని శత్రువులకు కోటలో దూరటం దుస్సాధ్యంగా ఉండేది. 

ఐతే‌ శ్రీకృష్ణపరమాత్మ దీనికి విరుగుడు చేసాడు. ఆయన సూచన మేరకు భీముడు ఆ రెండు దుందుభుల మీదకీ ఒక్కసారిగా దూకాడు. అవి రెండూ‌పచ్చడి అయ్యాయి ఒకేసారి. జరాసంధుడికి శత్రువుల రాక తెలియ లేదు.

మానవలోకం లోనే రెండు వాటంతట అవే‌ మ్రోగే దుందుభులు అంటూ ఉన్నాయి కదా, ఏదో విశేషంగా ఐనా, మరి దేవలోకంలో వాటంతట అవి మోగవా ఏమి?

అదిగో మ్రోగుతున్నాయి మీ దుందుభులు గమనించారా? దేవుడి పెళ్ళి అని అన్నమయ్య హెచ్చరించాడన్న మాట.

పెళ్ళిలో అంకురార్పణం అని చేస్తారు. లోకవ్యవహారంలో అంకురార్పణం అంటాం కాని అసలైన పేరు అంకురారోపణం. పెండ్లి కుమార్తె చేత పాలికలలో నవధాన్యాలను మొలకలుగా నాటిస్తారు. ఇలా అంకురములను (విత్తనాలను)  పాలికలలో ఆరోపించటం (నాటటం) కాబట్టి ఇది అంకురారోపణం. జనం నోటిలో ఈమాట క్రమంగా అంకురార్పణం అయింది. ఇదీ  బాగానే అర్ధవంతంగానే ఉంది. అంకురములను ప్రకృతికి (మొక్కలుగా ఎదిగెందుకు) అర్పించటం  కాబట్టి అంకురార్పణం అన్నది సబబైన మాటయే అవుతున్నది.

అంకురాలను మొలవేయటం ఎందుకూ అంటే‌ ప్రాణులకు ఆధారం అన్నం. దీనిని ఉపనిషత్తుల భాషలో రయి అని కూడా అంటారు. ఇప్పుడు ఇద్దరు, కాని మున్ముందు వీరు వంశాభివృధ్ధి చేస్తారు. అందరికీ అన్నం‌ కావాలి. అన్నానికి మూలమైన అంకురాలను ప్రకృతికి అర్పించి పూజించటం అన్నది ఇక్కడ ఆచారంలోని అంతరార్ధం.

అదిగో‌ అంకురార్పణ మహోత్సవం జరుగుతోంది. అందరికీ గంధపుష్పాక్షతలను ఇస్తున్నారు. విష్ణుభక్తులు అందరూ అందుకోండి అని అన్నమయ్య దైవకళ్యాణానికి ఇచ్చేసిన భక్తవైష్ణవులను ఆహ్వానిస్తున్నాడు.

పెళ్ళిలో తలంబ్రాల తంతు వచ్చింది. 

అసలు సిసలు తంతు ఐన జీలకర్రా బెల్లం కార్యక్రమానికీ, అతి ముఖ్యమైన తంతు ఐన మాంగళ్యధారణకీ కన్నా ఈ తలంబ్రాలకి విశేషమైన స్పందన ఉంటుంది. వధూవరుల నుండీ, ఆహూతుల నుండీ‌ కూడా. మిగతావి వైదికమైన కార్యక్రమాల్లో భాగం మాత్రమే ఐనా తలంబ్రాలు మాత్రం గొప్పవినోదం. అందరికీ కూడా.

ఈవినోదం దర్శించటానికి భక్తులు తహతహ లాడుతున్నారు. నడిచీ‌ పరుషలు నానా ముఖముల అంటే అన్ని దిక్కులనుండీ భక్తసమూహాలు కదలి వస్తున్నారని మనకి చెప్తున్నారు.

చూసారు కదా ఓ‌నరులారా, భక్తులారా, ఇంక ముడుపులు సమర్పించుకోండయ్యా అంటున్నారు అన్నమయ్య గారు. ఇక్కడ ఆచార్యుల వారి ముయిగా అన్నారు. ఈ‌పదం ఇప్పుడు వాడుకలో లేదు కాబట్టి అర్ధం స్పష్టత లేదు. వేరొక కీర్తనలో ముట్టినదెల్లా ముయి పట్టినదెల్లా బంగారు అంటారు. మరొక కీర్తనలో ముట్టితేనే ముయిముచ్చటలూ అంటారు. దీనిని బట్టి ముయిగా అంటే చక్కగా వంటి అర్ధం తీసుకోవాలి అనిపిస్తున్నది.


22, డిసెంబర్ 2020, మంగళవారం

రారా?

వ్రాయించుట నీ‌ముచ్చట
వ్రాయుట యీ యాత్మ కీవు బహుమానముగా
చేయించెడు గౌరవమని
నా యాత్మేశ్వర యెఱిగి వినమ్రుడ నగుదున్

వ్రాయుచుంటి నన్న భావనయే లేదు
మాటలన్ని నీదు మహిమ చేత
పరచుకొనుచు నుండ బహుకీర్తనంబులై
నే నుపకరణమును నిశ్చయముగ

ఏమి కొఱత కలుగు నెవరు చదువకున్న
చదువ వచ్చునట్టి సజ్జనులకు
కొఱత లేదు సూవె కోదండరామ నీ
కరుణవలన నేటి వరకు నాకు

రారా విబుధవరేణ్యులు
రారా హరిభక్తియుతులు రారా మిత్రుల్
రారా మోక్షాపేక్షులు
రారా శ్రీరామచంద్ర రమ్యచరిత్రుల్

రాకపోరు రాకపోరు
నీ కొఱకని రాకపోరు
నాకు వారి రాక చాలు
నీకు వారి రాక చాలు

21, డిసెంబర్ 2020, సోమవారం

శ్రీకాళహస్తిమాహాత్మ్యంలో శివస్తుతి హరిగతిరగడ

హరిగతి రగడలో పాదానికి ఎనిమిది చతుర్మాత్రాగణాలు. పాదం‌ మధ్యలో యతిమైత్రిస్థానం. అనగా నాలుగుగణాల పిదప ఐదవగణం‌ మొదటి అక్షరం మీద యతిమైత్రి చేయాలి. ప్రాస నియమం ఉంది. సంప్రదాయం ప్రకారం ప్రాసనియమం ఉన్నపద్యాల్లో ప్రాసయతి వేయకూడదు.

పాదాంతవిరామం తప్పనిసరిగా పాటించాలి.

హరిగతిరగడకు చతుర్మాత్రాగణాలు అని చెప్పాను కదా. చతుర్మాత్రా గణాలను లెక్క వేదాం. అన్నీ‌ లఘువులతో తొలి చతుర్మాత్రాగణం I I I I అవుతున్నది. ఒక గురువును వాడవచ్చును అనుకుంటే అప్పుడు ఏర్పడే చతుర్మాత్రాగణాలు [U I I,  I U I, I I U ] అని మూడు సిధ్ధిస్తున్నాయి. రెండు గురువులను వాడచ్చును అనుకుంటే చతుర్మాత్రాగణం U U అవుతున్నది. I U అన్న క్రమాన్ని ఎదురునడక అంటారు. దేశిఛందస్సుల్లో ఎదురునడకని సాధారణంగా అంటరానిదిగా చూస్తారు. I U I కూడా ఎదురునడకే కాబట్టి అది చతుర్మాత్రా గణంగా వాడరు అన్నది కూడా గమనించాలి. ఎదురునడక నిషిధ్ధం కాబట్టి I U I గణాన్ని మనం వాడకూడదు. ఐతే కొందరు పూర్వ కవులు ఈ‌  I U I గణాన్ని వాడారు.

రగడల్లో మొదట్లో ప్రాసనియమం కాని అంత్యప్రాసలను కూర్చటం‌ కాని లేదు. కాలక్రమేణ ఇది ఒక పద్దతిగా రూపుదిద్దుకుంది. అలాగే కొందరు పూర్వకవులు తమతమ రగడల్లో ఎదురునడకనూ వాడారు కాని చాలా అరుదు.

మరొక ముఖ్యవిషయం. తెలుగు ఛందస్సుల్లో గణాల దగ్గర పదం విరుగుతూ ఉంటే బాగుంటుంది. అలాగని ప్రతి గణమూ ఒక కొత్తమాటతో ప్రారంభం అయ్యేలా చూడటం దుస్సాధ్యం. కాని వీలైనంత వరకూ ఇది ఒక నియమంలా పాటించాలి. రగడలనే కాదు కందంతో‌ అన్ని రకాల దేశిఛందస్సుల్లోనూ ఇది శ్రధ్దగా పాటిస్తే పద్యాల్లో పఠనీయత పెరుగుతుంది. దేశి ఛందస్సుల ముఖ్యలక్షణమైన గానయోగ్యతను ఇనుమడింప జేస్తుంది.

రగడలకు ప్రాసనియమమూ, అంత్యప్రాసనియమమూ ఉన్నాయని చెప్పుకున్నాం‌ కదా. ఈ రెండు నియమాలూ వదిలి పెట్టి వ్రాయటం‌ అన్న పద్దతి కూడా ఒకటి తప్పకుండా ఉంది. అలా రగడలను వ్రాయటం‌ మంజరి అంటారు. హరిగతి మంజరీ రగడ అంటే హరిగతి రగడనే ప్రాసనూ‌ అంత్య ప్రాసనూ నియమంగా తీసుకోకుండా వ్రాయటం‌ అన్నమాట. మనం ద్విపదలనూ ప్రాసలేకుండా వ్రాస్తున్నప్పుడు వాటిని మంజరీద్విపదలు అంటున్నాం‌ కదా, అలాగే నన్న మాట.

హరిగతికి పాదానికి ఎనిమిది చతుర్మాత్రాగణాలు అన్నారు. అంటే 8 x 4 = 32 మాత్రల ప్రమాణం వస్తున్నది ప్రతిపాదానికి. గణాల కలగలుపు కూడదు. ఏగణానికి ఆగణం విడిగా రావాలి. "రాజరాజునకు" అని వాడామనుకోండి అది ఎనిమిది మాత్రల ప్రమాణం వస్తున్నది కదా దానిని రెండు చతుర్మాత్రాగణాలుగా తీసుకోండి అంటే‌ కుదరదు.

రగడను ఎవరూ‌ కేవలం రెండు పాదాలకు సరిపెట్టరు. కవులు అలా తోరణంగా వ్రాసుకుంటూ పోతారు.

హరిగతి రగడకు దగ్గరి బంధువు మధురగతి రగడ. హరిగతికి పాదానికి ఎనిమిది చతుర్మాత్రాగణాలు ఐతే, మధురగతి రగడకు పాదానికి నాలుగు చతుర్మాత్రాగణాలు. అంటే మధురగతి పాదాన్ని రెట్టిస్తే హరిగతి రగడ అన్నమాట.

హరిగతి రగడ అంతా చతుర్మాత్రలతో‌ నడుస్తున్నది కదా, అందుచేత ఈరగడకు చతురస్రగతి  నప్పుతుంది గానం చేయటానికి. తాళంగా ఏకతాళమూ త్రిపుట బాగుంటాయి.

ఇంక ధూర్జటి గారి శివస్తుతి రగడను చూదాం.









జయజయ కలశీసుత గిరికన్యా శైవలినీతట కల్పమహీరుహ
జయజయ దక్షిణరజతక్షితిధర సంయమిసేవిత పాదసరోరుహ

జయజయ పీన జ్ఞానప్రసవాచలకన్యా కుచ ధృఢపరిరంభణ
జయజయ కృతదుర్గాధరణీధర సామ్యవినోదవిహార విజృంభణ

జయజయ భారద్వాజాశ్రమ నవసరసిజకేళీవన పరితోషణ
జయజల నీలక్ష్మాధరణపుణ్యస్థల కాపాలిక భాషితభూషిత

జయజయ మోహనతీర్థాలోకన సంభ్రమరత భవబంధవిమోచన
జయజయ శిఖితీర్థాశ్రిత యోగీశ్వరమానస సంవిత్సుఖసూచన

జయజయ సహస్రలింగాలయ దర్శనమాత్ర స్థిరమోదాపాదక
జయజయ ఘనమార్కండేయమునీశ్వర తీర్థనిషిక్త విపఛ్ఛేదక

జయజయ నిర్జరనాయకతీర్థ స్నాతకజన కలుషేంధనపావక
జయజయ కరుణేక్షణ రక్షిత నిజచరణారుణ పంకేరుహసేవక

దేవా నిను వర్ణింప రమా వాగ్దేవీ వల్లభులైనను శక్తులె
నీ విధ మెఱుగక నిఖిలాగమముల నేర్పరులైనను జీవన్ముక్తులె

కొందఱు సోహమ్మని యద్వైతాకుంఠిత బుధ్ధిని నిను భావింతురు
కొందఱు దాసోహమ్మని భక్తిని గుణవంతునిగా నిను సేవింతురు

కొందఱు మంత్రరహస్యమవని నిను గోరి సదా జపనియతి నుతింతురు
కొందఱు హఠయోగార్థాకృతివని కుండలిచే మారుతము ధరింతురు

తుది నందరు తమ యిచ్చల నేయే త్రోవలబోయిన నీ చిద్రూపము
గదియక గతిలేకుండుట నిజముగ గని చాలింతురు మది సంతాపము

నిను సేవించిన కృతకృత్యుడు మఱి నేరడు తక్కిన నీచుల గొల్వగ
నిను శరణంబని నిలచిన ధీరుడు నేరడు తక్కిన చోటుల నిల్వగ

నీవనియెడు నిధి గాంచిన ధన్యుడు నేరడు తక్కిన యర్థము గోరగ
నీవే గతియని యుండెడు పుణ్యుడు నేరడు తక్కిన వారల జేరగ

భవదుర్వాసన పాయదు నీపదపంకజముల హృదయము వాసింపక
చవులకు గలుగవు సకలేంద్రియములు సతతమ్మును నిన్ను నుపాసించక

జననమరణములు ధరలో నిన్నును సమ్మతితో సేవింపక పాయవు
మననమునకు నీ చిన్మయరూపము మరగింపక యణిమాదులు డాయవు

మీ‌మాహాత్మ్యము మే మింతింతని మితి చేయగ మతి నెంతటి వారము
మామీదను కృపగల్గి మహేశ్వర మన్నింపుము నీకు నమస్కారము





20, డిసెంబర్ 2020, ఆదివారం

రారు!

పద్యముల కట్టు వారును
పద్యములను కుట్టు వారును
ఆ కట్టుకుట్ల గొప్ప లెంచు వారును
ఉరక భళీయటంచు యరచు వారును
నావ్రాత లరయ రారు.

కవుల మనువారు
బిరుదులు గలుగు వారు
కవుల సభలందు పాల్గొనగలుగు వారు
కవిముఠాలను నడిపించ గలుగు వారు
విరసులై యుంద్రు
నావ్రాత లరయ రారు

ఎప్పుడో ఎవ్వరో యిటు
తప్పిజారి చదువవత్తురు కాని
బ్లాగ్జాల కవులు గివులు పండితులును రారు
కేవలమును దారితప్పిన కొందరు తప్ప రారు

19, డిసెంబర్ 2020, శనివారం

మనుచరిత్రలోని ద్విరదగతి రగడ

 రగడలు తెలుగువారి విలక్షణ ఛందస్సులు.

లోగడ వృషభగతి రగడను పరిచయం చేసాను కదా అచ్చతెనుఁగు కావ్యం శృంగారశాకుంతలంలోని వృషభగతిరగడ అన్న టపాలో. ఇప్పుడు అల్లసాని వారి ద్విరదగతి రగడను చెప్పుకుందాం.

రగడలు మాత్రాఛందస్సులు. ఈ ద్విరదగతి లక్షణం ఏమిటంటే రెండేసి పాదాలు ఒక పద్యంగా ఉండే దీనిలో‌ ప్రతిపాదానికి నాలుగేసి పంచమాత్రాగణాలు వాడుతారు. ప్రాసనియమం తప్పనిసరి. పాదం సరిగా మధ్యలో విరిచి యతిమైత్రి పాటిస్తారు.  రగడలకు సాధారణంగా అంత్యప్రాసను పాటిస్తారు.  పాదాంతవిరామం తప్పనిసరిగా పాటించాలి.

ఇకపోతే‌ పంచమాత్రా గణాలు అంటే చెప్పాలి కదా.  సూర్యగణాలూ‌చంద్రగణాలూ ఇంద్రగణాలూ అంటూ సాధారణగణవర్గాలని మర్చిపోండి కాస్సేపు. ఇక్కడ రగడల్లో మాత్రల కొలతే ముఖ్యాతిముఖ్యం. పంచమాత్రా గణం అంటే లఘువు ఒక మాత్రగానూ గురువు రెండు మాత్రలు గానూ‌ లెక్కిస్తూ ఐదు మాత్రల కొలత వచ్చే అక్షరసంపుటి ప్రతిది మంచమాత్రాగణమేను.

కొందరికి ఒక శంక కలుగవచ్చును ద్విరదగతికి నాలుగు పంచమాత్రాగణాలు కలిసి ఒక పాదం అన్నారు కదా. అంటే పాదానికి  5 x 4 = 20 మాత్రలు అని చెప్తే సరిపోతుంది కదా మళ్ళా  5 + 5 + 5 + 5 మాత్రలు అన్నట్లు చెప్పటం ఎందుకూ అని. 

కారణం ఉంది.

ఐదేసి మాత్రల దగ్గర విడిపోవాలి అక్షరాలు.

"రారాజేమయ్యే" అంటే అది కూడా పది మాత్రల ప్రమాణం వచ్చిందా లేదా? "రారాజేమయ్యే రణాంగణంబు వదలి" అంటే చక్కగా ఇరవై మాత్రల ప్రమాణం వచ్చిందా లేదా?

కాని అలా వ్రాయకూడదు. ఇక్కడ ఐదేసి మాత్రల దగ్గర విడగొట్టటం‌ కుదరదు అక్షరాలను కాబట్టి. "రారాజే" అనగానే ఆరు మాత్రలు అయ్యాయి. ఐదవ ఆరవ మాత్రలు కలిసి ఒకే అక్షరంలో ఇరుక్కున్నాయి. అలా కుదరదన్నమాట.

ఎందుకైనా మంచిదని, మనం‌ ఈ‌పంచమాత్రా గణాలను లెక్కించి చూదాం. ఒక్క గురువూ లేకుండా ఒకే ఒక పంచమాత్రాగణం I I I I I అనేది. ఒక గురువును వాడదాం అనుకుంటే ఇంక మూడు లఘువులకే చోటు ఉంటుంది కాబట్టి అలా ఏర్పడే పంచామాత్రా గణాలు [ U I I I,  I U I I,  I I U I,  I I I U ] అనే నాలుగు. రెండు గురువులను వాడుదాం అనుకుంటే ఒక లఘువుకు మాత్రం చోటుంటుంది కాబట్టి అలా ఏర్పడే పంచమాత్రా గణాలు [I U U,  U I U,  U U I] అనే మూడు. మూడు గురువులతో‌ పంచమాత్రా గణాలు రానే రావు. 

ఐతే ఇలా లెక్కకు వచ్చిన పంచమాత్రా గణాల్లో సాధారణంగా I U I I కాని I U U కాని వాడరు. I U అన్న క్రమాన్ని ఎదురునడక అంటారు. దేశిఛందస్సుల్లో ఎదురునడకని సాధారణంగా అంటరానిదిగా చూస్తారు. I U I కూడా ఎదురునడకే కాబట్టి అది చతుర్మాత్రా గణంగా వాడరు అన్నది కూడా గమనించాలి.

ఒక ముఖ్య విషయం ఏమిటంటే రగడపద్యలక్షణంగా రెండుపాదాలే‌ కాని ఎవ్వరూ కేవలం రెండుపాదాల పద్యంగా ఒక రగడను వ్రాసి సరిపెట్టరు. కవులంతా ఒకే‌రగడ ఛందంలో అనేక పద్యాలను ఒక తోరణంలాగా వ్రాసుకుంటూ‌ పోతారు.  మీకు తెలిసే ఉంటుంది ఒక వృత్తాన్ని కూడా ఒక మాలిక లాగా ఎన్ని పాదాలైనా వ్రాయవచ్చునూ‌ అని. ఎవరిదాకానో‌ఎందుకూ పెద్దన గారే పూఁత మెఱుంగులుం బసరుపూఁప బెడంగులుఁ అంటూ ఒక పెద్ద ఉత్పలమాలికను చెప్పారు కదా అని.

ఏమిటయ్యా తేడా ఇక్కడ అంటే ఇలా రగడను పొడుగ్గా వ్రాసుకుంటూ‌ పోయేటప్పుడు ద్విపదకు లాగా రెండేసి పాదాలకు ఒకసారి ప్రాసను మార్చుకోవచ్చును. అదీ‌ సంగతి.

ద్విరదగతి రగడ ఐదేసి మాత్రల చొప్పున పాదంలో నాలుగుసార్లు విరుపుతో ఉంటుంది కాబట్టి ఇది ఖండగతిలో పాడటానికి నప్పుతుంది. అసలు రగడలన్నీ పాడటానికి చాలా బాగుంటాయి. 

రగడల్లో మొదట్లో ప్రాసనియమం కాని అంత్యప్రాసలను కూర్చటం‌ కాని లేదు. కాలక్రమేణ ఇది ఒక పద్దతిగా రూపుదిద్దుకుంది. అలాగే కొందరు పూర్వకవులు తమతమ రగడల్లో ఎదురునడకనూ వాడారు కాని చాలా అరుదు.

మరొక ముఖ్యవిషయం. తెలుగు ఛందస్సుల్లో గణాల దగ్గర పదం విరుగుతూ ఉంటే బాగుంటుంది. అలాగని ప్రతి గణమూ ఒక కొత్తమాటతో ప్రారంభం అయ్యేలా చూడటం దుస్సాధ్యం. కాని వీలైనంత వరకూ ఇది ఒక నియమంలా పాటించాలి. రగడలనే కాదు కందంతో‌ అన్ని రకాల దేశిఛందస్సుల్లోనూ ఇది శ్రధ్దగా పాటిస్తే పద్యాల్లో పఠనీయత పెరుగుతుంది. దేశి ఛందస్సుల ముఖ్యలక్షణమైన గానయోగ్యతను ఇనుమడింప జేస్తుంది.

రగడలకు ప్రాసనియమమూ, అంత్యప్రాసనియమమూ ఉన్నాయని చెప్పుకున్నాం‌ కదా. ఈ రెండు నియమాలూ వదిలి పెట్టి వ్రాయటం‌ అన్న పద్దతి కూడా ఒకటి తప్పకుండా ఉంది. అలా రగడలను వ్రాయటం‌ మంజరి అంటారు. ద్విరదగతి మంజరీ రగడ అంటే ద్విరదగతి రగడనే ప్రాసనూ‌ అంత్య ప్రాసనూ నియమంగా తీసుకోకుండా వ్రాయటం‌ అన్నమాట. మనం ద్విపదలనూ ప్రాసలేకుండా వ్రాస్తున్నప్పుడు వాటిని మంజరీద్విపదలు అంటున్నాం‌ కదా, అలాగే నన్న మాట.

అలాగూ ద్విపదలను కూడా ఇక్కడ ప్రస్తావించాం‌ కాబట్టి ఒక పోలిక చెప్పుకోవాలి. ద్విపదను ద్విరదగతి రగడలో ఇమడ్చవచ్చును సులభంగా. నాలుగు పంచమాత్రాగణాలనూ మనం ద్విరదగతిలో ఉన్న అదనపు మాత్రాగణాలను వదలి పంచమాత్రా ఇంద్రగణాలతో వ్రాయాలి. చివరి పంచమాత్రాగణం మొదట సూర్యగణం కలిసి వచ్చేలా వ్రాయాలి. అంతే సరిపోతుంది. చిత్రం ఏమిటంటే యతిమైత్రి స్థానం కూడా ఏమీ‌ ఇబ్బంది పెట్టదు ఆ ఇమిడిన ద్విపదకూ మనం వ్రాస్తున్న ద్విరదగతికీ కూడా ఒకే చోట యతిమైత్రి స్థానం. బాగుంది కదా.

ఇక పెద్దన్న గారి ద్విరదగతి రగడను చూదాం.

నేర్పుమై నల్లయది  నెఱులఁ దొలుపూఁ దుఱిమె,
దర్పకున కర్పింపఁ దలఁప దెంతటి పెరిమె?

యింతి పావురపురొద యేల వినె? దారజము
వింతయే? విరహిణుల వెతఁ బెట్టు బేరజము;

సురపొన్న క్రొన్ననలు సొచ్చి నలుగడ వెదకు
తఱగ దందుల తావితండంబు క్రొవ్వెదకు;

నఱిమి ననుఁ జివురునకు నగునె కంటక మాడఁ?
జుఱుకు మనె వేఱొక్కచోటఁ గంటక మాడఁ?

గుందములు నీ కొసఁగఁ, గూర్చితిని గైశికము
నిందులకు వెల యడుగ నేల? విడు వైశికము!

చిఱుఁదేంట్ల కొసఁగె గుజ్జెనఁగూళ్ళు గొజ్జంగ,
యెఱుఁగ కది పూ వంద నేల? యిటు రజ్జంగ?

నెదిరింపఁ బోలు నీ వింతి! రతిపతిఁ దెగడఁ
బొదలఁ జిగురులు తుదలఁ బూచి యున్నది పొగడ;

పుడుకు మల్లన గందవొడికి నీ ప్రేంకణము
దడయ కిటు నీకిత్తుఁ దగ రత్నకంకణము;

నెరసి పోఁ జూచెదవు నిలునిలువుమా, కనము,
గురియు తేనెల జీబుకొన్న దంతట వనము;

కా దల్లయది ఫుల్లకంకేళి, పన్నిదము,
మోదు, గోడిన నీదు ముత్యాలజన్నిదము;

ఏటవా లైనయది యీ యరఁటిబాలెంత,
చేటునకె యగు, చూలుచేఁ గలుగు మే లెంత?

నెలఁత! యీ గేదంగి నీకబ్బె బుక్కాము,
చిలుకు నీ పుప్పొళ్ళు చెంచెతల బుక్కాము;

మితిలేని తేనె నామెత చేసె విరవాది,
యితరలతికల మరిగి యేఁగు నది పరవాది;

కలిగొట్లు ప్రాఁకువేడ్కలె నీకుఁ దఱచెదను,
నలినాక్షి! కడిమిగండమున కే వెఱచెదను;

గురువెంద నదె గిలుబుకొనియెఁ బయ్యెరదొంగ,
విరులఁ గరికుంభకుచ! వెరఁజు మై యరఁ గ్రుంగ;

మెరమెరని కొలనిదరి మీలంచు లకుముకులు
మరగె నీకనుదోయి, మాయింపు చకచకలు;

ఏకాంతమని తొలఁగె దెందు నీవటె వేఱు?
చేకొనవె మున్నాడి చెలువ! యీ వటివేరు;

అరిది యీ యేడాకులరఁటి నగుకప్పురము
సరిరాదు దాని కల శశియొడలు కప్పురము;

పాళ కల్లది పోఁకఁ బ్రాఁక బందము దెగియె.
నాళి యది దిగజాఱునట్టి చందము నగియె;

మలయపవనుని బిలిచె మావి బళి! యీ వేళ
మలయు కోవెల పంచమస్వరం బను నీల;

సులభమై దొరకె మంజులవాణి! చంపకము,
చిలువానెఁ బూఁబొదలు, చేరి యిఁక వంపకుము;

చనకుఁ డిఁక దవ్వులకు సఖులార! పువ్వులకు
ననుచు నలరులు గోసి రతివ లల్లన డాసి.

ఈ ద్విరదగతి రగడలో 22పద్యా లున్నాయి. గణాలదగ్గర పదం విరగని తావులు ఈమొత్తం రగడలో లెక్కిస్తే కేవలం 23 మాత్రమే ఉన్నాయి. ప్రతిపద్యంలోనూ ఎనిమిది పంచమాత్రాగణాలు చొప్పున మొత్తం‌ రగడలో 176 గణాలున్నాయి. కేవలం వాటిలో 23మాత్రమే పదం గణారంభం‌ మీదరా లేదంటే నియమభంగం ఐనది 13% గణాలకే. అంటే మీరే గమనించండి పదాలను ఎలా గణాలతో సమన్వయం చేయాలో దేశికవిత్వంలో అన్నది.

యతిమైత్రి స్థానం విషయానికి వస్తే అక్కడ ఎలాగూ‌ గణారంభం ఉంది. ఈ 22పద్యా లున్నాయి కదా వీటిలో‌ కేవలం 6 సందర్బాల్లో మాత్రమే యతిస్థానం పదం మధ్యలోనికి వచ్చింది. అంటే 44పాదాల్లో‌ యతిమైత్రి స్థానం పదారంభంగా లేనిది కేవలం 13.6% సందర్భాల్లోనే.

పాదాంతవిరామం విధిగా పాటించబడిందని గమనించవచ్చును.


18, డిసెంబర్ 2020, శుక్రవారం

ధనమేరా అన్నిటికీ‌ మూలం‌ - 2 (రెండు కథలు)



ఎందుకో కాని ఈ రెండు కథలనూ కొంచెం‌ క్లుప్తంగా ఐనా తప్పకుండా అందరికీ చెప్పాలీ అనిపించింది.

రెండూ అలనాటి కథలే.  అంటే దశబ్దాల క్రిందటి కథలే.

ఉత్తుత్తి కథలు కావు. నిజంగా జరిగిన కథలే. ఈ రెండూ కూడా ఒకే ఊరి కథలు.

మొదటి కథ శ్రీరామమూర్తి-భగవంతరావు గార్లనే అన్నదమ్ముల కథ.  శ్రీరామమూర్తి గారంటే ఒకప్పుడు తూ.గో.జి.లో ప్రసిధ్ధులైన డాక్టరు గారు. ఆయన ఆర్.ఎం.పీ. డాక్టరు గారు. ఐతేనేం ఇంగ్లీషు మందులూ‌ ఇచ్చే వారు. ఆయుర్వేదం‌ మందులూ ఇచ్చే వారు. ఇదం బ్రాహ్మ్యం - ఇదం క్షాత్రం అన్న ట్లన్నమాట.

శ్రీరామమూర్తిగారికి కొత్తపేట మెయిన్ రోడ్ మీద ఒక క్లినిక్ ఉండేది. ఆ క్లినిక్ ముందు అంబారుఖానా శ్రీరామమూర్తి అని చాలా పెద్దపెద్ద అక్షరాలలో వ్రాసి ఉండేది.

ఎందుకో తెలియదు కాని ఆ బోర్డుమీద అయన తమ్ముడు భగవంత రావు గారి పేరు ఉండేది కాదు.

భగవంత రావు గారు అన్నగారితో పాటు ఆ హాస్పిటల్‌లో వైద్యం చేస్తూ మహా బిజీగా ఉండే వారు. ఆయన కూడా ఆర్.ఎం.పీ డాక్టరు గారే.

పేషంట్లను చూడాలి బయటకు వెళ్ళి అన్నప్పుడు భగవంత రావు గారు ఒక పెద్ద మోటర్ సైకిల్ మీద అన్నగారిని తీసుకొని వెళ్తూ ఉండే వాడు. తరచుగా తానొక్కడే వెళ్ళటం కూడా ఉండేది.

వారి ఆహార్యాలు తమాషాగా అనిపించేవి. ముఖ్యంగా శ్రీరామ మూర్తి గారి విధానం. ఆయన కొంచెం గోదుమ రంగు పంచె చొక్కా వేసేవారు. ఆచొక్కాని పంచలోనికి టక్ చేసే వారు. ఆపంచను తన బూట్లలోనికి దోపేవారు. అవి కూడా హంటర్ బూట్లు అంటామే‌ అలాంటివి. భగవంతరావు గారు ఎప్పుడు మల్లెపూల వంటి తెల్లటి పేంట్ షర్టు వేసుకొనే వారు. ఇతరత్రా అహార్యంలో వీరిద్దరినీ ఎప్పుడూ చూడలేదు.

ఇద్దరూ వైద్యం‌ చేస్తున్నా అందరూ శ్రీరామమ్మూర్తి గారి ఆస్పత్రి అనే అనే వారు.

ఆ ఆస్పత్రి నిజంగా ఒక ధర్మాసుపత్రి అనే చెప్పాలి. ఇచ్చే వారు వారి తాహతుని బట్టి ఇచ్చే వారు. ఇవ్వలేని బీదాబిక్కీ ఇవ్వరు. ఎవ్వరూ‌ ఇంత అని అడగటం కూడా ఉండేది కాదు. ఐనా ధనవర్షం‌ బాగానే కురిసేది.

కురవదా మరి? ఊళ్ళో శ్రీరామ్మూర్తి గారిదే వైద్యం ముఖ్యంగా. 

ఒక్క కాశిన చిన్నంరాజు గారని ఒక ఎంబీబీయస్ డాక్టరు కూడా ఉండే వారు కాని వారు ఖరీదైన డాక్టరనే‌ ప్రతీతి. అందుచేత ఎక్కువ మంది వెళ్ళేది శ్రీరామమూర్తి గారి దగ్గరకే. 

అదీ‌కాక ఈ‌ చిన్నంరాజు గారికి ఒక తమాషా పేరుండేది - ఎంత చిన్న సమస్య కైనా పేజీకి తక్కువ మందులు వ్రాయరని. అది నిజమే  కూడాను. మా పక్కవాటా వక్కలంక నరసింహ మూర్తి గారి సతీమణికి ఒకసారి చాలా ఉధ్ధృతంగా శిరోవేదన వచ్చింది. ఇక తప్పదని డాక్టరు గారిని పిలిచారు. చిన్నంరాజు గార్ని అన్నమాట. ఆయన వచ్చి పరీక్షించి అక్షరాలా పేజీ నింపేశారు మందులతో. అవన్నీ ఇక్కడ దొరుకుతాయా మన కొత్తపేటలో అంటే  ప్రయత్నించండి అన్నారు. దొరకనివి చాలానే ఉండినవి - వాటిని మర్నాడు రాజమండ్రికి వెళ్ళి కొనాల్సిందే అనుకున్నారు. ఆరాత్రికి ఆవిడకు ఏమన్నా మందులు ఇచ్చారా అన్నది తెలియదు. ఏదైతేనేం తెల్లవారేసరికి తలనొప్పి గిలనొప్పి జాడలేదు. రాజమండ్రి పోలేదు. మందులూ తేలేదు. అందరూ చాలా కాలం నవ్వుకొనే వారం ఆ డాక్టరు గారి మందుల పట్టీ చూసి.

ఎందుకు అందరూ శ్రీరామ్మూర్తి గారి దగ్గరకు వెళ్ళి ఒకటి రెండు రూపాయల వైద్యంతో హాయిగా ఉండే వారో అర్ధం ఐనది కదా. అదీ సంగతి.

ఒక ముఖ్యమైన సంగతి చెప్పాలి. ఈ‌ భగవంతరావు గారు మానాన్నగారికి చిన్ననాటి స్నేహితుడే - బెంచిమేట్ అనుకుంటాను. అందుచేత సహజంగా మా యింటి వైద్యం అంతా శ్రీరామమూర్తి గారు మరియు భగవంత రావు గార్ల చేతిలో నడిచేది.

ఈ శ్రీరామమూర్తి గారు కొత్తపేట ఊరి చివరన, పలివెల వెళ్ళే దారిలో మెయిన్ రోడ్ మీద భవంతి కట్టుకున్నారు. గృహప్రవేశం కోలాహలంగా జరిగిందని విన్నాను కాని వివరాలు గుర్తులేవు. కాని ఆ తరువాత కాలంలో ఆయన సత్యనారాయణ వ్రతం చేసుకున్నారు. మాకు కూడా ఒక ప్రత్యేకమైన అహ్వానం అందింది. హాస్పిటల్‌కు వచ్చిన వారికి ఆహ్వానం ఇచ్చినట్లుగా ఇవ్వటం కాదు, ఇంటికి వచ్చి మమ్మల్ని పిలిచారని గుర్తు.

ఆరోజున సత్యనారాయణ వ్రతం మధ్యలో చదివింపులు మొదలయ్యాయి. డాక్టరు గారికి అన్నమాట. అవేమి చదివింపులో గంటో గంటన్నరో ఐనా తెమలటం‌ లేదు. ఆతరువాత మానాన్నగారు చెప్తే అర్ధమైంది. డాక్టరు గారు వైద్యం చేస్తున్నందుకు కృతజ్ఞతగా ఊరి వారు యథాశక్తిగా కానుకలు సమర్పించుకోవటం అది అని. ముఖ్యంగా ఈచదివింపుల్లో ముప్పాతిక మువ్వీసం ధనరూపంలోనే. అలా వచ్చింది ఎన్నో వేలుంటుంది ఆ అరవైల్లోనే అంటే అతిశయోక్తి ఏమీ‌ లేదు.

ఈ వ్రతం జరిగే నాటికి నేను హైస్కూలు విద్యార్ధిని. దరిమిలా కొన్ని సంవత్సరాల తరువాత నేను హైదరాబాదుకు ఉద్యోగనిమిత్తం వచ్చాను. కొంతకాలం తరువాత శ్రీరామ మూర్తి గారు కాల గతి చెందారు.

ఆపుడు తెలిసింది ధనం అంటే ఏమిటో‌ దాని ప్రభావం ఏమిటో అన్నది.

శ్రీరామమూర్తి గారూ భగవంతరావు గారూ ఇద్దరూ రామలక్ష్మణులే అన్నట్లుండే వారు. రాముడెక్కడన్నా లక్ష్మణుడిని ముంచుతాడా నిలువునా?

ఈ కలియుగ రామ మూర్తి గారు ముంచారనే జనం విస్తుపోయారు.

ఆస్తిపాస్తులన్నీ రామమూర్తి గారివే. చివరకు భగవంత రావు గారి దర్జా స్కూటరూ శ్రీరామ మూర్తి గారి పేరనే ఉంది. ఈ లక్షణుడికి కనీసం ఉండటానికి స్వంత ఇల్లు ఐనా లేదు. పూచిక పుల్లంతైనా ఆస్తి పాస్తులన్నవి లేవు.

యావజ్జీవం ఏ‌హాస్పిటల్ కోసం ఊడిగం చేసాడో అందులో కాలు పెట్టరాదన్నారు.

కట్టుబట్టలతో మిగిలాడు ఈ అభినవ లక్ష్మణుడు. 

తానూ‌ డాక్టరే, వేరే చిన్న ఆస్పత్రి పెట్టుకున్నాడు. 

మిగిలిన కథ ఏముంది. ఉనికి కోసం కష్టపడ్డారు భగవంత రావు గారు. పిల్లలు అంది వచ్చారు లెండి దైవకృప వలన.

అన్ని పరిణామాలూ ఈకథలో నాకు అంత వివరంగా తెలియవు.


* * *


ఇప్పుడు రెండవ కథ. చెప్తాను. ముళ్ళపూడి వారు వారి ఇంటి పేరు. ఈ ఇంటిపేరు కల వారు అనేక వర్ణాల్లో ఉన్నట్లున్నారు. వీరు బ్రాహ్మణులు. శాఖా గీకా గురించి నాకు తెలియదు. అదేమీ ముఖ్యం కాదు. 

ఇంట్లో ఉండేది కొంచెం మందే. గృహస్థు, ఆయన భార్య, బావమరది, కుమారుడు మాత్రమే. ఇందులో నాకు తెలిసిన వ్యక్తి ఆ కుమారుడు ఒక్కడే. వాడి పేరు సత్యనారాయణ. మాస్కూల్‌మేట్. నాకన్నా ఒక క్లాసు దిగువన చదివే వాడు. కాని నాతో‌  మంచి దోస్తీ‌ ఉండేది. 

ఒక చేదు జ్ఞాపకం. ఎందుకో కాని వాడూ‌ నేనూ ఒకనాడు స్కూలు గ్రౌండ్‌ లోనే‌ బాగా తన్నుకున్నాం. ఎందుకో గుర్తులేదు. ఎవరిది తప్పూ అన్నది ఎవరికి గుర్తు. కొట్టుకున్నాం ఏదో చిన్న చిలిపి కారణానికే. కాని అది మా స్నేహానికి కించిత్తు కూడా దెబ్బ కొట్టలేదు. 

సత్యనారాయణ తండ్రి గారు ఆయుర్వేద వైద్యం చేస్తూ ఉండే వారు. సంప్రదాయిక వైద్యుడు. ఆయన మీద గురి ఉన్న వాళ్ళు కూడా బాగానే ఉండే వారేమో - వారి జరుగు బాటు బాగానే ఉండేది. వారి ఉనికి వారి స్వంత ఇంటిలోనే. చిన్నదే అయినా పక్కా పెంకుటిల్లు. ఆయింటికి నేను బోలెడు సార్లు వెళ్ళాను. వాడు కూడా మాయింటికి లెక్కలేనన్ని సార్లు వచ్చాడు. 

సత్యనారాయణ తండ్రిగారు అయన బావమరది కూడా ఆయుర్వేద వైద్యులే. ఈ బావమరది గారు స్వయాన వైద్యుడు కాకపోవచ్చును అని నా ఉద్దేశం. వైద్యం ఆపెద్దాయన చేస్తూ ఉంటే మందులు చేయటంలోనూ పేషంట్లను చూసుకోవటం లోనూ బావమరది సహాయకుడిగా ఉండే వారు. ఆయన చెప్తుంటే ఈ‌బావమరది మందులు కలపటమూ‌ నూరటమూ వంటివి చేస్తూ ఉండటం నేను స్వయంగా చాలా సార్లే చూసాను.

కాలం ఎప్పుడూ ఒకలాగే ఉండదు కదా. ఉన్నట్లుండి ముళ్ళపూడి వారు జబ్బుపడ్దారు. ఊరిలో ఉన్న వైద్యులు కొన్నాళ్ళు వైద్యం చేసి చేతులెత్తే సారు. కాకినాడ పెద్దాస్పత్రిలో చేర్పించి వైద్యం చేయించండి అని సలహా ఇచ్చారు.

ఊళ్ళో‌ వైద్యం అంటే అది వేరే సంగతి. ఎంతైనా సాటి వైద్యులన్న గౌరవంతో ఎవరూ రొక్కించి అడగక పోవటంతో ఆట్టే ఖర్చు లేకుండానే ఇంత కాలమూ నడిచింది. కాకినాడ పట్నమే. ఎరగని ఊరే మరి. అక్కడెలా?

సకుటుంబంగా కాకినాడ వెళ్ళారు. వైద్యం నడుస్తోంది. దనం ధారాళంగా కర్చు అవుతున్నది.

మరీ అంత ఉన్నకుటుంబం కాదాయిరి. ఊళ్ళో నుండి కొంత సహయం అందిందేమో కొన్నాళ్ళు ఎలాగో అలా ఖరీదైన వైద్యానికి తట్టుకొని నిలిచారు.

జబ్బు తగ్గటం లేదు.

చివరికి తమ స్వంత ఇల్లు తెగనమ్మి వైద్యం చేయించాలని నిశ్చయించారు.

నిశ్చయించటం అంటే ఎవరిది నిర్ణయం?

సత్యనారాయణ తల్లికి ఉన్న దిక్కూ సలహా దారు తన తమ్ముడే. సత్యనారాయణ అంటే ఇంకా చిన్నపిల్లాడే‌ కదా.

వినండి. తప్పని సరై ఇల్లు అమ్మేసారని ఊరంతా గుప్పుమంది.

అందరూ చాలా బాధపడ్దారు. ఆకుటుంబం మంచి అందరికీ తెలుసును ఊళ్ళో. మా అమ్మగారూ‌ నాన్నగారూ కూడా బాధపడటం‌ నాకు బాగానే గుర్తుంది. తెల్లవారిలేస్తే ఈ సత్యనారాయణ అనే చిన్నపిల్లవాడు కళ్ళముందు తిరుగుతూ ఉండే వాడు కదా. అస్తమానం మాయింటికి వస్తూనే ఉండే వాడు కదా. వాడి కుటుంబానికి వచ్చిన కష్టం కదిలించకుండా ఉంటుందా చెప్పండి.

పెద్దాయన వైద్యం కోసం అని చెప్పి,  అక్కాతమ్ముళ్ళు వచ్చి ఇంటిని ముఫ్ఫైవేలకు అమ్మి సొమ్ముతో‌ అదరాబాదరా వెళ్ళిపోయారు కాకినాడకు.

మరి కొద్ది రోజుల్లోనే దుర్వార్త వినవలసి వచ్చింది.

దానితోపాటే అందర్నీ కలచివేసింది మరొక ముఖ్యమైన సంగతి.

సొమ్ముని మగదిక్కు తమ్ముడు గారు జాగ్రత్తగా పట్టుకొని అక్కగారితో‌ కాకినాడ వెళ్ళాడు. ఆవిడ భర్తను చూడటానికి అదరాబాదరా పరుగెత్తింది. 

కొద్ది సేపటికి డబ్బు సర్దుబాటు చేసుకొని వచ్చారా అని ఆస్పత్రి వారు అడిగారు. అవునండి, ఇదిగో మా తమ్ముడి దగ్గరుందీ.. అంటూ ఆవిడ తమ్ముడి కోసం చూసింది.

ఇంకా ఎక్కడి తమ్ముడు?

ఇంకా ఎక్కడి డబ్బు?

ఆ తమ్మయ్య గారి జాడ ఎవ్వరికీ ఎన్నటికీ దొరకలేదు.

ఇటు పెద్దాయనా దక్కలేదు.

అక్షరాలా అన్నీ పోగొట్టుకొని కట్టుబట్టలతో వెనక్కు వచ్చారు స్వగ్రామానికి! ఇంకా ఏం‌ స్వగ్రామం, ఇక్కడ నిలువ నీడ లేదు.

ఊరందరికీ మతిపోయినంత పని అయింది.

సత్యనారాయణ ఇలా జరిగింది అని కన్నీళ్ళతో చెప్తుంటే వింటున్న మాకు మతిపోయినంత పని అయింది.

సత్యనారాయణా వాళ్ళమ్మ గారూ‌ మరి ఎలా నిలద్రొక్కుకున్నారో నాకు సరిగా తెలియదు. వారు ఆ తరువాత పొన్నాడ రత్తమ్మ గారి ఇంట్లో అద్దెకు ఉండే వారు. ఇప్పుడు ఆ సత్యనారాయణ ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో!

 

****

 

ఈ రెండు కథలను గమనించారుగా, డబ్బు ఎలాంటి ఎలాంటి తమాషాలకు కారణం అవుతుందో. అందుకే‌ అన్నారు "మాతాపుత్ర విరోధాయ హిరణ్యాయ నమోనమః" అని. డబ్బు ముందు అన్నీ‌ దిగదుడుపే అవుతున్నాయి దురదృష్టవశాత్తు. మానవసంబంధాలను ఈడబ్బు ఈడ్చి అవతల పారేస్తున్నది.


16, డిసెంబర్ 2020, బుధవారం

ధనమేరా అన్నిటికీ‌ మూలం.

ధనమేరా అన్నిటికీ‌ మూలం‌ అనగానే కొంతమందికి ఒక మంచి సినిమాపాట గుర్తుకు వస్తుంది. ఇదిగో ఆపాట. అన్నట్లు కొంతమందికే‌ గుర్తుకు వస్తుందీ అని ఎందుకనటం అంటే ఆధునికుల్లో అనేకులు తెలుపు-నలుపు సినిమా అంటే చచ్చినా చూడరు. అ పాతచింతకాయపచ్చడి సినిమాల్లో ఏముంటుందీ అనేస్తారు. రంగురంగుల హంగుల సినిమాల్లోనే ఎంతో గొప్పగొప్ప కథలూ నీతులూ అదేదో‌ ఎంటర్‌టైన్‌మెంట్ అంటారే అదీ, ఇంకా బోలెడు విలువైనవీ ఉంటాయని వాళ్ళ గాఠ్ఠి నమ్మకం మరి.



 

వార్తాపత్రిక తెప్పించటం మానివేసి చాలాకాలం ఐనది. ఎప్పటి నుండీ అని అడక్కండి. నాకూ తెలుసు, మీకూ తెలుసు కరోనాకాలం మొదలైనప్పటినుండి అని. కరోనామూలంగా వాడు పేపర్ వేయటానికి లేకుండా పోయింది. ఈమధ్య మళ్ళా పేపర్ వేస్తానూ అంటూ ఫోన్ చేస్తే, వద్దులే నాయనా మేం ఇలా అలవాటుపడిపోయాంలే అని చెప్పేసాం.

నిజానికి పేపర్ వస్తున్నాసరే బహుకాలంగా వార్తలకోసం టీవీలోని వార్తాఛానెళ్ళూ వివిధపత్రికలవాళ్ళ అంతర్జాలపత్రికలూ ఉపయోగించటం చేస్తున్నాం.

ఒకప్పుడు కొత్తవార్తలు అంటే అవి ఉదయం వచ్చే వార్తాపత్రికతోనూ లేదా రేడీయోలో సమయప్రకారం వచ్చే వార్తాప్రసారాలతోనూ మనదాకా వచ్చేవి. ఆ రేడియోల కాలం పోయింది. ఇప్పుడు ఎఫ్‌ఎమ్‌ అంటూ రణగొణధ్వానాల స్టేషన్‌లు వచ్చాయి కాని వాటిని వినే ఓపిక మాకు లేదు. ఇక టీవీలో ఐతే వచ్చే వార్తలకన్నా నరజీవులకుండే ఓపికను పరీక్షించే అడ్వర్టైజ్‌మెంట్ల గోలే చాలా ఎక్కువ.

అందుచేత తీరిక దొరికినప్పుడు అంతర్జాలంలో చూస్తాను వార్తల కోసం. 

అలా ఈఉదయం‌ కంటబడ్డది నయనకంటకమైన వార్త ఒకటి - కన్నతల్లిదండ్రుల ఫోటోకు చెప్పుల దండ వేసిన ప్రబుధ్ధుల గురించి.



(పైన ఇచ్చిన ఫోటో, ఆంధ్రజ్యోతి వారి వార్తతో ప్రచురించినది.)

ఏమిటీఅన్యాయం!

నిన్న టీవీలో వార్త చూశానన్నారు మిత్రులు విన్నకోట వారు.   అన్ని విలువలనూ పూర్తిగా వదిలేసిన సమాజంలాగా తయారవుతోంది. మీడియా, సినిమాలు, వ్యాపారులు ఈ రుగ్మతకు కారణం అంటున్నారు వారు.

కలికాలం అన్నారు మిత్రులు శర్మ గారు.

నిజం చెప్పాలంటే, డబ్బుకు తప్ప జీవితంలో మరి దేనికీ విలువే లేదన్న ఆధునిక జీవనసత్యాన్ని ఊహ తెలిసినప్పటి నుండి పిల్లలకు ఈకాలంలొ తలిదండ్రులే నూరిపోస్తున్నారు. చివరికి ఇలాంటి వికృత పరిణామాలు ఎదురైతే అందరూ గుండెలు బాదుకుంటూ గోలపెడుతున్నారు!

కొన్ని దశాబ్దాల క్రిందటి సంఘటన ఒకటి గుర్తుకు వస్తున్నది. నేను హైదరాబాదుకు వలసవచ్చిన రోజులవి. అప్పట్లో మా మేనమామ గారింట్లో కొన్నాళ్ళున్నాను. ఆ తరువాత కాలంలో కూడా వారింటికి వెళ్తూనే ఉండేవాడిని. ఒకరోజున ఆయన తన కుమార్తెపైన కోపగించుకుంటుండగా వెళ్ళాను.

ఆ పిల్ల అప్పుడు ఎల్‌కేజీలోనో యూకేజీలోనో ఉంది. స్కూల్లో క్లాస్ మెత్తానికి నాలుగవస్థానంలో వచ్చిందట. అంతక్రిందటి సంవత్సరం మొదటిదానిగా వచ్చిందట. ఇలా చదువులో వెనుకబడిపోతే ఎలా? ఇలా చదివితే పెద్ద జాబ్ ఎలా వస్తుంది, ఎలా దర్జాగా బతుకుతావూ అని ఆ అమ్మాయి మీద అరుస్తూ‌ క్లాస్ తీసుకుంటున్నాడు! ఆ పిల్ల ఈమానవుడికి ఏమయిందో అర్ధం కాక బిక్కమొఖం పెట్టి చూస్తోంది.

ముక్కుపచ్చలారని వయస్సులోనే మనం పిల్లలకి డబ్బు ఎంత ముఖ్యం అంటే దానితరువాతే‌ జీవితం సుమా అని నూరిపోస్తున్నాం. ఆముక్కలు చాలాబాగా వంటబట్టించుకొన్న కొందరు ఆ డబ్బుకోసం ఆ తలిదండ్రులమీదే అఘాయిత్యాలు చేస్తున్నారు మరి. తప్పెవరిది?

ఎప్పుడు ఎరుకలోనికి వచ్చిందో ఇప్పుడు సరిగా గుర్తులేదు కాని మరొక సంఘటన ఇలాంటిదే ఉంది. 

ఒక జంటకు ఇద్దరు పిల్లలు. ఆ భార్యాభర్తలకు ఏమాత్రం సఖ్యత లేదు కాని పిల్లల్ని మాత్రం కళ్ళల్లో పెట్టుకొని పెంచారు. సఖ్యత లేక పోవటం అంటే మరేమీ లేదు భార్యకు చిరుకోపం భర్తకు పెనుకోపం అన్నమాట. చిరుకోపం ఎందుకంటే డాక్టరు తినొద్దయ్యా అన్నవన్నీ తింటాడు ఇంటాయన. నువ్వు తినకూడదుగా అంటూ వండి పెట్టకపోతే ముందు అలుగుతాడు - ఆతరువాత కోపంతో అరుస్తాడు. రోజూ‌ తిండిదగ్గర పేచీలేను.

అన్నట్లు పిల్లలిద్దరికీ పెళ్ళిళ్ళై ఎప్పుడో వెళ్ళిపోయారు. కూతురు సరే సరి, కొడుకు వేరు కాపురం కదా, అదన్నమాట. 

ఒకరోజున కొడుకు వచ్చాడు. ఆలూమగలు సంబరపడ్డారు. కొడుక్కి ఇష్టమైనవి అంటూ‌ ఇంటాయన లిష్టు చదివాడు. వాడికోసం కొంచెం చేస్తానులే అని కసిరింది ఆవిడ. లడాయి మొదలు.

కాని భోజానాలు పూర్తయ్యాక అసలు లడాయి మొదలైంది. ఎలాగూ మీరు నాదగ్గర వచ్చి ఉండవలసిందే కదా రేపోమాపో, అందుకని ఈ ఇల్లూ, కొట్టూ వగైరా అంతా ఇప్పుడే రాసిచ్చేయి అన్నాడు కొడుకు.

అమ్మానాన్నా కుదరదన్నారు. 

అంతే అతడు పట్టుబట్టడం, వాదు పెరగటం జరిగింది.

అసలే కోడలు వచ్చి కొడుకుని నిజంగానే దూరం చేసిందన్న కక్షతో ఉన్న అమ్మ కొంచెం మాట విసిరింది. ఇదంతా నీకు నీ‌ పెళ్ళాం నూరిపోసిందిలే అని.

కొడుకు విచక్షణ కోలుపోయాడు. అమ్మని లాగి లెంపకాయ కొట్టాడు.

అమ్మానాన్నలు మ్రాన్పడిపోయారు.

అమ్మ గ్రుడ్లనీరు కుక్కుకుంది. కాని కొడుకుతో ఏమీ మాట్లాడాలి అనిపించక కాబోలు మౌనంగా ఉండిపోయింది.

తండ్రి రంకెలు వేసాడు. నా యింట్లోంచి బయటకు నడు అంటూ, ఏమేమో అన్నాడు.

కొడుకు కోపంలో తండ్రికి తగ్గ వారసుడేగా. ఊగిపోతూ తండ్రిమీదికి దూకాడు.

తండ్రిమీద చేయి వేసేలోగా ఉన్నట్లుండి విరుచుకొని పడిపోయాడు.

ఎందుకంటే తల్లి చీపురుకట్ట తిరగేసి వాడి తలమీద ఒక్కటిచ్చింది బలంగా! 

ఎంతైనా కన్నప్రేగు కదా. కొడుక్కేమైందో అని ఆలూమగలు లబలబ లాడారు. ఎన్నో ఉపచారాలు చేసారు. అదృష్టవశాత్తూ ఏమీ కాలేదు వాడికి. కొద్దిసేపటికే స్పృహలోనికి వచ్చాడు. అమ్మానాన్నల్ని అనరాని మాటలన్నాడు. మీ అంతుచూస్తాను అని కూడా అన్నాడు. ఆతరువాత తండ్రికి వేలు చూపిస్తూ ఇంటినుండి వెళ్ళిపోయాడు.

సంగతి అంతా తెలిసి ఊళ్ళొనే ఉండే కూతురు అన్నగారి మీద పోలీసులకి ఫిర్యాదు చేసింది. వాడి మీద ఇప్పటికే  రౌడీషీటర్ అన్న బిరుదు ఉంది. మా అమ్మానాన్నలకి ప్రాణాపాయం ఉంది అని. వార్త పేపర్లకి ఎక్కింది.

ఏదో‌ నాదృష్టిలో ఉన్నది ఒకటి వ్రాసాను కాని ఇలాంటి తరచు చూస్తూనే ఉన్నాం.

నాగరికత పేరుతో ఆధునిక విద్యపేరుతో మనం సామాజిక విలువలను ఎప్పుడో ధ్వంసం చేసుకున్నాం. అందుకే ఇటువంటి సంఘటనలు సాధారణం అయిపోయాయి.

వేమన పద్యం ఒకటి గుర్తుకు వస్తున్నది.


తల్లి తండ్రి మీద దయలేని పుత్రుండు
పుట్టనేమి వాడు గిట్టనేమి
పుట్టలోన చెదలు పుట్టవా గిట్టవా
విశ్వదాభిరామ వినురవేమ


వేమన పద్యాలను ఈరోజుల్లో ఎక్కడా బళ్ళల్లో చెప్పరు. సుమతీ శతకం చెప్పరు. కృష్ణ శతకం చెప్పరాదు. అవన్నీ పాత చింతకాయలు. పనికిరావు నేటి చదువులకి. పసిపిల్లల చేత రైన్ రైన్ గో అవే‌వంటి దౌర్బాగ్యపు రైమ్స్ మాత్రం చెప్పిస్తారు. అదీ చూస్తామంటారా ఇదిగో



వీళ్ళకి వాన రావటం ఇష్టం లేదట. చాలా బాగుంది. వానలు పడకపోతే ముద్ద నోటికి ఎలావస్తుందో మరి.

అమ్మానాన్నలనూ, ఆమాటకు వస్తే అందరినీ గౌరవంగా ఎలా చూడాలో ఆదర్శంగా అచరించి చూపిన రాముడి కథను మెచ్చదు నేటి మేథావి గణం. రామాయణం విషభాండం అనో విషవృక్షం అనో చెప్తారు. టీచర్లను ఎలా ఎగతాళీ చెయ్యాలో పాపం స్కూళ్ళల్లో నేర్పటం లేదు కాని అందుకోసం మన సినిమాలవాళ్ళు ప్రతిసినిమాలోనూ తప్పకుండా పాఠాలు చెబుతూనే ఉంటారు.

దిక్కుమాలిన చదువులూ దిక్కుమాలిన నాగరికతాను, అమ్మానాన్నల్ని అవమానించటం మాత్రం బాగా నేర్పుతున్నాయి.

15, డిసెంబర్ 2020, మంగళవారం

శివలింగముపై చీమప్రాకిన

శివలింగముపై చీమప్రాకిన
శివునకు కొరత కలిగేనా ఆ
చీమకు ఘనత కలిగేనా

సజ్జనుని గని దుర్జను డరచిన
సజ్జనునకు దుర్గతి కలదా ఆ
దుర్జనునకు సద్గతి కలదా

భక్తుని పామరు డెంత తిట్టిన
భక్తుని ఘనత తొలగేనా ఆ
పామరునకు ఘనతబ్భేనా

ఏనుగు వెడలిన కుక్క మొఱగిన
ఏనుగు దర్జా తొలగేనా ఆ
కుక్కకు దర్జా కలిగేనా

సూర్యునిపై నొక డుమిసి నంతట
సూర్యుని తేజము తరిగేనా ఆ
ధూర్తుని మొగమే తడిసేనా

గుడిలో దేవుని కూడని వడుగ
వడి దేవుడు వరమిచ్చేనా ఆ
అడుగువాడు చెడిపోయేనా

హరిహరులకు బేధముల నెంచిన
హరిహరులకు వాదయ్యేనా ఆ
నరునకు నరకం బయ్యేనా

రాముని రాక్షసు లెంత తిట్టిన
రాముని యశమది తరిగేనా ఆ
రాక్షసులకు యశ మబ్బేనా

నవ్వినవ్వి యలసిన

నవ్వినవ్వి యలసిన నాడది నీదయ యందును

నవ్వే లేని బ్రతుకైన నాడును నీదయ యందును


బలములు బలగములు నంది వచ్చిన నీదయ యందును

బలములు బలగములు నాకు తొలగిన నీదయ యందును

నలుగురు నను పొగడుచున్న నాడది నీదయ యందును

నలుగురు నను తెగడుచున్న నాడును నీదయ యందును


నాలుగు పాటలు పాడిన నాడది నీదయ యందును

నాలుక కొకటియును రాని నాడును నీదయ యందును

నా లక్ష్యము సిద్ధించిన నాడది నీదయ యుందును

నా లక్ష్యము సిధ్ధించని నాడును నీదయ యందును


జయములు కలిగిన వేళల స్వామీ నీదయ యందును

భయములు కలిగిన వేళల వలయును నీదయ యందును

తులలేని సద్భక్తి నాకు కలిగెను నీదయ యందును

జలజాక్ష రామా నీవే సకలము నాకని యందును


14, డిసెంబర్ 2020, సోమవారం

నీ ఘనత చెప్ప తరము కాదు శివలింగమా

శివలింగమా ఓ శివలింగమా
నీ ఘనత చెప్ప తరము కాదు శివలింగమా

మారేడు చెట్టు కింద శివలింగమా
ఆ - చెట్టు దెంత భాగ్యమే శివలింగమా
అది - పత్రిపూజ చేసెనే శివలింగమా
అది - నిత్యపూజ చేసెనే శివలింగమా
ఏ  - ఆశలేని పూజచేసె శివలింగమా
దాని -  కింక జన్మ మున్నదా శివలింగమా
అది - మోక్షమునే పొందునే శివలింగమా

చెట్టు కింద పుట్టలో శివలింగమా
ఆ - పుట్టదెంత భాగ్యమే శివలింగమా
అది  - ఉరగహారముల లిచ్చె శివలింగమా
ఆ  - పాములా భాగ్యమేమి శివలింగమా
వాటి -  కింక జన్మమున్నదా శివలింగమా
అవి - -మోక్షమునే పొందునే శివలింగమా
ఆ - పుట్ట కట్టె చీమలెన్నొ శివలింగమా
అవి - మోక్షమునే పొందునే శివలింగమా

గొల్లపడుచు గూటిలో శివలింగమా
ఆ  - పడుచుదెంత భాగ్యమే శివలింగమా
అది - నీకిన్ని పాలుపోసె శివలింగమా
ఏ - మంత్రాల పూజలనూ శివలింగమా
అది -  యెరుగనే యెరుగదే శివలింగమా
అది - -మనసారా పాలుపోసె శివలింగమా
ఆ - పడుచు కింక జన్మమేది శివలింగమా
అది - మోక్షమునే పొందునే శివలింగమా

పుట్టనే పెళ్ళగించి శివలింగమా
ఒకడు - పాములను వెళ్ళగొట్టె శివలింగమా
వాడు - మారేడు చెట్టెక్కెను శివలింగమా
పత్రి - నెత్తుకొని పోయెనే శివలింగమా
వాడు -  శివపూజకు పత్రినమ్మె శివలింగమా
వాడి -  దెంతెంత పాపమే శివలింగమా
వాడు -  మోక్షమునకు దూరమే శివలింగమా
వాడి - భార్య గొల్లపడుచు శివలింగమా
వాడి - పాపమే మెరుగదాయె శివలింగమా

అంతలోన నేమాయె శివలింగమా
ఆ - పాపమెల్ల పోయెనే శివలింగమా
వాడు -పత్రి కోయుచుండగా శివలింగమా
కొంత - జారి నీపైన పడెనె శివలింగమా
వాడు - పూజ చేసి నట్లాయె శివలింగమా
దాని - పుణ్య మింతనరాదే శివలింగమా
వాడి - పాపమెల్ల పోయెనే శివలింగమా
వాడు - మోక్షమునే పొందునే శివలింగమా

మరల పుట్ట పెరిగెనే శివలింగమా
ఆ - పాము లన్ని చేరెనే శివలింగమా
అ - చెట్టు పత్రి పూజించే శివలింగమా
అ - గొల్లభామ పూజించే శివలింగమా
కడు - మంచిపూజ లిట్టివే శివలింగమా
అవి - మంచి చేయు పూజలే శివలింగమా
అ - సహజమైన పూజలకు శివలింగమా
నీవు - మెచ్చి ముక్తి నిత్తువే శివలింగమా

13, డిసెంబర్ 2020, ఆదివారం

జీవితమున కాధారము

జీవితమున కాధారము శ్రీరాముని నామము

జీవులను తరింపజేయు శ్రీరాముని నామము


శ్రీరాముని నామము చిత్తశుద్ధి కలిగించును

శ్రీరాముని నామము చింతలన్ని తొలగించును

శ్రీరాముని నామము చేకూర్చును శుభములను

శ్రీరాముని నామము భూరియశము నిచ్చును


శ్రీరాముని నామము శ్రీకరంబగు మంత్రము

శ్రీరాముని నామము శివుడు జపించే మంత్రము

శ్రీరాముని నామము శీఘ్రమే ఫలించు మంత్రము

శ్రీరాముని నామము జిహ్వకింపైన మంత్రము


శ్రీరాముని నామము చింతితార్ధముల నిచ్చును

శ్రీరాముని నామము క్షేమము కలిగించును

శ్రీరాముని నామము జీవులను రక్షించును

శ్రీరాముని నామము చేయవలయు నెల్లపుడు


భవవినాశకనామ

భవవినాశకనామ పరమపావననామ
పవనజనుతనామ పాహిపాహి

ధరణిజాప్రాణనామ దనుజాంతకనామ
పరమశివనుతనామ భయనివారణనామ
గిరిసుతామోక్షనామ కేవలానందనామ
దురితనివారణనామ దుఃఖవిఛ్ఛేదనామ

మునిగణవినుతనామ మోక్షకారణనామ
వనజభవనుతనామ వాంఛితార్ధదనామ
ఘనసుఖాస్పదనామ అనిమిషార్చితనామ
మనశ్శాంతిదనామ మంగళాస్పదనామ

నిగమాగమనుతనామ నిర్వాణసుఖనామ
జగద్విఖ్యాతనామ శత్రుహరణనామ
జగద్వందితనామ జన్మసాఫల్యనామ
విగతకల్మాషభక్తవిజయసంధాననామ

 

శ్రీరామచంద్రునకు నీరాజనం

నీరాజనం జగన్నియామకున కీశ్వరునకు
శ్రీరామచంద్రునకు నీరాజనం

కారుణ్యధామునకు కమనీయగాత్రునకు
మారకోటిసుందరునకు నీరాజనం
భూరిపరాక్రమునకు భువనమోహనాకృతికి
ధారుణీవలయపతికి నీరాజనం

ఘోరభవాంతకునకు కువలయార్తిహరునకు
వారిజభవనుతునకు నీరాజనం
సీరధ్వజునల్లునకు సీతాసమేతునకు
ధారాధరవర్ణునకు నీరాజనం

వారిజాతాక్షునకు వాంఛితార్ధప్రదునకు
మేరునగధీరునకు నీరాజనం
శూరలోకేశునకు మారీచమథనునకు
నారాయణమూర్తికి నీరాజనం

కరుణామయుడ వీవు

కరుణామయుడ వీవు చిరమిత్రుడవు నీవు

నరనాథుడవు నీవు నాస్వామీ


హరి వచ్యుతుడ వీవు పరమేశ్వరుడ వీవు

నిరుపమానుడ వీవు నిర్గుణుండవు

నిరుపాధికుడ వీవు నరసింహుడవు నీవు

ధరణిజాపతి వీవు దశరథాత్మజా


సుగుణాన్వితుడ వీవు శుభ్రకీర్తివి నీవు

జగదీశ్వరుడ వీవు జయశాలివి

నిగమవేద్యుడ వీవు విగతరాగుడ వీవు

భగవంతుడవు నీవు పట్టాభిరామా


సుజనాశ్రయుడ వీవు సుందరాకృతి వీవు

నిజబంధుడవు నీవు నీరజనయన

కుజనాంతకుడ వీవు కోసలేశ్వరుడ వీవు

విజితామరారి వీవు విజయరామా


న్యాయమా రామచంద్ర

న్యాయమా రామచంద్ర నా మొరాలకించవు

నీ యందే నా చిత్తము నిలిచియున్న ది


మోసకారి కలిమాయలు మోమాటపెట్టు చుండ

త్రోసిపుచ్చుచు రానా నే తొల్లిటి నుండి

దాసుడనై నీ సేవలు వీసమంత విసువులేక

చేసికొనుచు నుంటి కదా చిత్తగించవు


ఇన్ని జన్మముల నుండి ఇంపుగా నీకు సేవ

లన్ని వేళలను చేయునట్టి వాడనే

చిన్నచిన్న దోసముల నెన్ని మౌనమూనుదువు

మన్నించవు కదా తండ్రి విన్నపములను


నీవు కరుణించుదాక నిన్నే సేవింతుగాని

భావించగనేర నెంత వారినైనను

నీవు చేయుపరీక్షకు నిలిచితిన్ని జన్మములుగ

నీవింకను దయను చూపనేరవా ప్రభూ


నిన్నే నమ్మి యున్నవాడ

నిన్నే నమ్మి యున్నవాడ నీదే భారము చిక్కు
లన్ని దీర్చి భవముడిపి యాదరించవే

మున్ను దీనుడౌ గజేంద్రు ముదమున రక్షించినావు
మున్ను బాలప్రహ్లాదుని వెన్నుగాచి నాడవు
మున్నంబరీషుని మునిముప్పు నుండి కాచినావు
నన్నేల కావవయ్య నారాయణ శ్రీరామ

కన్నబిడ్ఖ లటుల నీవు కాచితివే పాండవులను
మిన్నగా ద్రోవదికి నీవే మేలుచేసినాడవు
సన్నుతాంగ వారి వలెనె శరణము జొచ్చితిని నిన్ను
నన్ను రక్షించవయ్య నారాయణ శ్రీరామ

అన్నన్నా భక్తుడనని యనుకొనవో నన్ను నీవు
పన్నుగ నను రక్షింప వచ్చునట్లు తోచదు
ఎన్నెన్నో జన్మలెత్తి యెంతో విసివితిని తండ్రి
నన్ను దయచూడవయ్య నారాయణ శ్రీరామ

 

చూడనే చూసినది

చూడనే చూసినది చుప్పనాక అందగాని
చూడనే చూసినది చుప్పనాక సీతను

వీడు మన్మథుని వంటి వాడు సరిజోడు నాకు
వీడు నాకు జోడైతే వేడుకయే‌ ప్రతిదినము
వీడు నాకు తోడైతే విరుగు నా వైరిగణము
వీడు నా పగను తీర్చు వీరుడని యెంచినది

అనరణ్యుడు మున్ననడే యినకులము నందొకడు
జనియించును రావణుని సంహరించు ననుచు
యినకులేశు డితడు నా పనిదీర్చు పసగలాడు
ఘనముగ వీని పొందుదు ననుచు యెంచినది

కాదనునో వీడిపుడు కలదు కదా వీని తరుణి
ఆదుష్టుని కడకు పోయు యగ్గించి దీని సౌరు
పాదుకొలుపుదు పోరు వాడు వీని చేనణగు
నా దైన్యము తీరునని నమ్మి హరిని చేరినది

11, డిసెంబర్ 2020, శుక్రవారం

ఎంత మంచివాడ వయ్య

ఎంత మంచివాడ వయ్య యినకులేశ్వరా నీ
వెంత అమాయకుడవో అవనిజాపతీ

పట్టాభిషేకవేళ పట్టుబట్టి కైకమ్మ
కట్టించ నారలే కటకటా వేగ
నట్టడవికి కిమ్మనకనె నడచిపోయితి వయ్య
కట్టుకున్న భార్యతో‌ కడుగూర్చు తమ్మునితో

అడవిలోన రాకాసి యాలినెత్తుక పోయె
పడరానిపాట్లు పడి వానిని పట్టి
వడి యుధ్ధము చేయువేళ వా డలసి నాడనుచు
విడచి రేపు రమ్మను టది వెఱ్ఱితనము కాదటయ్య

పదివేల యేండ్ల పిదప పనిలేని వాడెవడో
వదరినాడని చెడ్డవాక్య మొక్కటి
అదేజనవాక్యమనుచు అవనిజనే యడవుల
అదయుడవై విడచితివేవే అది పిచ్చియె కాదటయ్య

 

10, డిసెంబర్ 2020, గురువారం

హరిని కీర్తించ

హరిని కీర్తించ రం డమ్మలారా మీరు

హరిని కీర్తించ రం డయ్యలారా


హరేరామ యనుచు రం డమ్మలారా మీరు

హరేకృష్ణ యనుచు రం డయ్యలారా

హరేరామ హరేకృష్ణ యనుచు రం డందరును

హరే నారసింహ యనుచు నందరు రండి


పరమాత్ముని కీర్తించగ భక్తులారా మీరు

త్వరత్వరగ హరిభజనకు తరలి రండి

పరమహర్షము తోడ పరుగున రండి నేడు

హరిభజనానందంబున కందరు రండి


హరినామకీర్తనమే హరిగుణకీర్తనమే

హరికథావర్ణనమే యమితసుఖము

పరమాత్ముని కీర్తించు వారలదే పుణ్యము

హరిని పొగడి యాడిపాడ నందరు రండి


కలలోన నీకెవరు

కలలోన నీకెవరు కనిపించినా రయా

కలలోన వేలుపులను కాంచితిని సీతా


కలలోన వేలుపులు సెలవిచ్చిన దేమని

ఇలమీదకి నీరాక యిందుకేనా యని

నిలదీసిరి సీతా నిష్ఠురములు పలికిరి

జలజాక్ష ఆమాటలు చాల చిత్రంబులు


వచ్చిన పని మరచితివని పలికిరి యది యేమో

అచ్చెరువా రామ నీవు యజనసంభవుడవై

వచ్చినా వేమొ వారి పనిమీదను భువికి

అచ్చముగ నాకు నదే యనిపించును సీతా


మాపని చెడరాదనుచును మాటలాడిరే

ఆపని యది యిట్టిదని అనరేల సీతా

ఈపట్టాభిషేకము నిపుడు కానిండు

రేపు మీకు తెలుపగలరు శ్రీవసిష్ఠు లదేమో


నిడుద నామము వా డతడు

నిడుద నామము వా డతడు

    పొడుగు చేతుల వా డతడు

నడుము సన్నని వా డతడు

    వడిగల తూపుల వా డతడు


స్మరశతసముడగు వా డతడు

    వరగుణనిథియగు వా డతడు

నరులకు పతియగు వా డతడు

    అరులకు యముడగు వా డతడు

సురలకు హితుడగు వా డతడు

    సురగణ నుతుడగు వా డతడు

సురరిపు విధ్వంసను డతడు

    వరచరితుండగు వా డతడు


నిరుపమానుడగు వా డతడు

    నిరమిత్రుండగు వా డతడు

పరమవీరుడగు వా డతడు

    స్థిరయశస్కుడగు వా డతడు

పరము లొసంగెడి వా డతడు

    పరమయోగిగణనుతు డతడు

పురుషోత్తముడగు వా డతడు

    పరమాత్ముండగు వా డతడు


కువలయాక్షుడగు వా డతడు

    భువనము లేలెడి వాడతడు

రవికులపతియగు వా డతడు

    కువలయతనయా పతి యతడు

పవనజసంసేవితు డతడు

    భవమోక్షణుడగు వా డతడు

భువి కరుదెంచిన హరి యతడు

    అవునతడే మన శ్రీరాముడు


కొల్లలుగ వరములు

కొల్లలుగ వరములు వెల్లువగ దయలు హరి

యెల్లరకు నొసగ చింత లెవరి కుండును


హరి యను దైవంబు గలడని తెలియని వారికి

హరి యందు విశ్వాస మది లేని వారికి

హరి సేవనమున శ్రధ్ధ యలవడని వారికి

తరచుగాను చింతలవి తగులుకొనును గాక


హరి యందు ద్వేషమే యధికమైన వారును

హరిహరులకు భేదంబు లరయుచుండు వారును

హరి కప్యదైవంబుల నర్చించెడు వారును

పరిపాటిగ బహుచింతల పాలగుదురు గాక


హరిసేవన మందు గడుపు నట్టి వారికి లేవు

హరికన్యము తలపకుండు నట్టి వారికి లేవు

హరేరామ హరేకృష్ణ యనెడు వారికి లేవు

మరి యితరులు చింతలతో మ్రగ్గుచుంద్రు గాక


9, డిసెంబర్ 2020, బుధవారం

సత్య మిదని తెలియరే

 సత్య మిదని తెలియరే సర్వవిధముల మీరు సత్యమైన మార్గమున సంచరించరే

నిత్యుడైన పరమాత్ముని నిర్మలులై సేవించి నిశ్చయముగ ముక్తులై చెలంగ నేరరే


పాపమని యొకటిలేదు పుణ్యమని యొకటిలేదు పాపపుణ్యములు మనసుచేయు భావనలు

పాపపుణ్యముల మనసు భావించు టుడుగుదాక భవము లెన్నేని గలవు బాధలు గలవు

రూపరక కర్తనను భావనము జీవునకు పాపపుణ్యములు పట్టి పీడించును

ఏ పగిది రెండింటి నీసడించుట యన్న నీశ్వరుని భావించుటే మార్గము


జీవుడు భగవంతుని చిత్తమం దేమరక భావించుటే భవము దాటు మార్గము

భావించి దేవుని వదలక నిదురనైన సేవించుటే పరము చెందు మార్గము

సేవించి యీశ్వరుని చింతలన్ని విడచుటే జీవునకు ముక్తిసిధ్ధించు మార్గము

జీవుడు ముక్తుడై ప్రకృతి కతీతుడై దేవునిలో‌ నైక్యమై తేజరిల్లును


ముక్తుడైన వాడు శోకమోహములను పొందక ముదమున నీశ్వరుని పొంది యుండును

ముక్తుడైనవాడు లోకసంగ్రహార్ధమై వచ్చు ముముక్షువుల మేలుకై భూమి మీదకు

ముక్తుడైనవాని వలన ముముక్షువు దారితెలిసి ముక్తిమార్గమున బోయి ముక్తి చెందును

ముక్తుడైనవాని వలన  రామభక్తి మార్గమే ముక్తిమార్గ మగుట తెలిసి ముక్తి చెందును


ఈనామమే చాల హితవైన నామము

ఈనామమే చాల హితవైన నామము
మానక జపియింతు నీ మంచినామము

ఆక్కజముగ రాక్షసులను మిక్కిలి భయపెట్టు నామము
వెక్కసముగ సజ్జనులకు వేయిమేళ్ళు గూర్చు నామము
మక్కువతో పలుకువారికి మంచిగతుల నిచ్చు నామము
చక్కని శ్రీరామ నామము సర్వసుజనసేవ్యనామము

సురవరులు కొలుచు నామము హరుడు నిత్యము తలచు నామము
వరమునులు పొగడు నామము వరములొసగు భవ్యనామము
పరమసులభమగు నామము పరమపావనమైన నామము
నిరుపమమానము రామనామము పరమపదము చేర్చు నామము

మిక్కిలి ప్రియమైన నామము చక్కగ నన్నేలు నామము
చిక్కులు తొలగించు నామము చక్కని శ్రీరామ నామము
దిక్కులన్నిట మారుమ్రోగు దేవదేవుని దివ్యనామము
మక్కువతో‌ హరుడిచ్చిన మంచినామము రామనామము

8, డిసెంబర్ 2020, మంగళవారం

పాహి పాహి రామ

పాహి పాహి రామ భవబంధమోచనా వై
దేహీసహిత నీవే దిక్కు దైవమా

వచ్చి పోవు వారేలే బ్రహ్మాదులన్న నింక
వచ్చిపోవు జీవుల లోపము లెన్న నేటికి
ముచ్చటగా మాయావిమోహితుడీ జీవుడు తా
నెచ్చటెచ్చటనగ తిరిగి యిపుడు నిన్నెఱిగితినో

రకరకముల పుట్టువుల రాటుదేలి తుట్టతుదకు
ప్రకటించితి నీకు నేను పాదదాసుడ నని
సకలలోకములను తిరిగి సర్వేశ్వర యెఱిగితి నీ
వొకడవె యీ తిరిగుడాప నోపుదువని నిజముగ

భక్తజన మందారుని భగవానుని నిన్ను నే
శక్తి కొలది ప్రార్ధింతును జానకీనాయక
ముక్తి కోరి నీదుపాదముల నాశ్రయించితి ఏ
యుక్తి చేసి నన్ను వేగ నుధ్ధరింతువో రామ

 

పాహి పాహి పద్మనాభ

పాహి పాహి పద్మనాభ పాహి పట్టాభిరామ
పాహి పాహి లోకావన పాహి పరమపావన

పాహి పాహి లక్ష్మీపతి పాహి సీతాపతి
పాహి పాహి సకలసద్భక్తప్రాణనాథ
పాహి పాహి ఆదిశేషపర్యంక శయాన
పాహి పాహి రామ శేషాహిలక్ష్మణాగ్రజ

పాహి పాహి వైకుంఠ పాహి కోశలేశ
పాహి పాహి సకలసద్భక్తజనజీవన
పాహి పాహి సదాసుపర్ణ దివ్యవాహన
పాహి పాహి రామ సుపర్ణసంసేవిత

పాహి పాహి శాంగధర పాహి కోదండధర
పాహి పాహి సకలసద్భక్తసర్వార్తిహర
పాహి పాహి సదాదుర్వారరాక్షసాంతక
పాహి పాహి రామ గర్వాంధరావణాంతక

4, డిసెంబర్ 2020, శుక్రవారం

సెటిలర్స్

తరచుగా ఆంధ్రాప్రాంతం వారిని ఉద్దేశించి సెటిలర్స్ అని సంబోధించటం గమనించవచ్చును. ఇప్పటికీ ఆ దిక్కుమాలిన సంబోధన మారటం లేదు. ఇదిగో ఈరోజున కొండలరావు గారు కూడా తన బ్లాగులో ఒకవ్యాఖ్యలో ఈ రోజున "ఇప్పటివరకూ విశ్లేషణలు చూస్తుంటే సెటిలర్స్ మాత్రమే టీ.ఆర్.ఎస్ ను కాపాడారనిపిస్తోంది." అని ఆ పదాన్ని ప్రయోగించారు. ఎంతో‌ విచారం కలుగుతూ ఉంటుంది ఆ సెటిలర్ అన్న మాట తటస్థించినప్పుడల్లా. మరొకరూ ఆసెటిలర్స్ అన్నపదాన్ని కొనసాగించారనీ మనం అక్కడ గమనించవచ్చును.

సెటిలర్. ఈ మాటకు అర్ధం‌ నాకు తెలుసుననే అనుకుంటున్నాను. ఇదే‌ కదా? "తన స్వస్థలం విడచి పరాయి ప్రాంతంలో స్థిరనివాసం ఏర్పరచుకున్న వ్యక్తి" అని.

ఈ‌ మాట విన్నప్పుడల్లా నాకు చాలా బాధ కలుగుతూ ఉంటుంది.

ఇదేదో తప్పుమాట అని కాదు. ఈమాటను తెలుగువాళ్ళు అన్వయిస్తున్న విధానం వలననే నాకు మనస్తాపం కలగతున్నది.

ఈ మాటను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఎవరు ఎలా వాడుతున్నారో అనో లేదా దేశవ్యాప్తంగా ఎక్కడ ఎవరు ఎలా వాడుతున్నారో అనో నా బాధ కాదు. తెలుగువాళ్ళే సాటితెలుగువాళ్ళ పట్ల ఎంత అవమానకరంగా ఎలా వాడుతున్నారో అని నా బాధ.

మన తెలుగువాళ్ళలో కూడా తోలుమందం మనుష్యులు కోకొల్లలుగా ఉన్నారు. కాని వాళ్ళతో‌పాటే నాలాంటి కొంచెం‌ సున్నితమనస్కులు కూడా ఉన్నారు. తోలుమందం జనాభాకైతే పట్టించుకోకుండా కించిత్తూ బాధపడకుండా ఉండే హక్కు ఎలాగైతే ఉందో, నాలాంటి వారికి కొద్దో గొప్పో‌ బాధపడే  హక్కు కూడా అలాగే ఉంది. తోలుమందం జనాభాకు మౌనంగా మాటల్ని భరించే హక్కు ఎలా ఉందో (అదీ‌ ఒక హక్కే‌నా అని ఎవరికన్నా అనుమానం వస్తే మంచిదే!), నాలాంటి వారికి భరించలేక తమ అభిప్రాయాన్నీ నిర్మొగమాటంగా చెప్పే‌ హక్కూ‌ అలాగే ఉంది. అందువలన ఒకరి అనుమతి అవసరం లేదు నా అభిప్రాయ ప్రకటనకు.

పాలపొంగు ఒకటి తెలుగుప్రజల రాష్ట్రాన్ని ఎలా రెండుముక్కలు చేసిందో అందరమూ చూసిందే. దరిమిలా ఒక తెలుగురాష్ట్రం (ప్రస్తుతానికి) రెండుగా మారి, తెలుగువారికీ రెండు రాష్ట్రాలు ఏర్పాటై, తమకు ఒక్క రాష్ట్రమేనా అని విచారించే అమృతహృదయులకు ఎలా ఊరట చేకూర్చిందో అందరికీ తెలిసిందే.

ఒకటి చివరకు రెండు ఐన తెలుగుప్రాంతంలో ఏర్పడిన ప్రభుత్వాలు చివరకు ఎలా అభివృధ్ధిపథంలో దూసుకొని పోతున్నాయో కూడా మనందరికీ‌ బాగా అవగతం అవుతూ ఉన్నదే.

ఈ విషయంలో నాకు విచారించటానికి వ్యక్తిగతంగా కారణం ఏమీ‌ లేదు. కాని చిక్కల్లా ఆ మహర్దినం దాకా స్వరాష్ట్రంలోనే ఉన్నవాడిని కాస్తా హఠాత్తుగా నా చిరనివాసప్రాంతంలోనే పరాయి వాడిని ఐపోవటమే. అలా ఐపోయానని నేను అనుకొనటం‌ మానటం అంత ముఖ్యమైన సంగతి కాదు. నేను అలా పరాయివాడినీ‌ అని ఘడియకు ఒకసారి గుర్తుచేసే సహృదయవాక్యాలను తట్టుకోవటం ఎంత కష్టంగా ఉంటుందీ‌ అన్నదే‌ ముఖ్యమైన సంగతి.

కాని ఈరాష్ట్రంలోనికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రావతరణానికి ముందే వచ్చిన వాళ్ళు మాత్రమే తెలంగాణా వారిగానూ మిగతా వారంతా పరాయి వారుగానూ తెలంగాణా రాష్ట్రప్రభుత్వాధినేతయే చేసిన ప్రకటనలు ఎంతమందికి ఇంకా గుర్తున్నాయో నాకు తెలియదు. ఈకొద్ది సంవత్సరాలలోనే అదేదో గత త్రేతాయుగం నాటి సంగతి కదా ఇప్పుడెవ్వరికి పట్టింది అన్నట్లు మర్చిపోగల వాళ్ళకు ఒక నమస్కారం. అది నావల్ల కాదు. కానే కాదు. ఎందుకో చెప్పనివ్వండి.

నేను నలభైయేడేళ్ళ క్రిందట పొట్టచేత్తో పట్టుకొని వచ్చాను హైదరాబాదు నగరానికి. అప్పటికి అదింకా నిర్వివాదంగా తెలుగువాళ్ళ స్వరాష్ట్రానికి ముఖ్యపట్టణం. అందుచేత నేను అప్పట్లో నాస్వరాష్ట్రరాజధానికి ఉద్యోగనిమిత్తం వచ్చాను కాని ఏదో పరాయి ప్రాంతానికి ప్రవాసం పోలేదు. నేను వచ్చింది నా పొట్టపోసుకుందుకే‌ కాని ఏదో తెలంగాణా ప్రజల పొట్టకొట్టి ఇంద్రుణ్ణో చంద్రుణ్ణో ఐపోయి పెత్తనం చేదామని కాదు. ఆ వచ్చింది కూడా భారతప్రభుత్వం అధీనం లోని సంస్థకు కాని ఇక్కడి ఏదో‌ ప్రైవేట్ కంపెనీకి ఐనా కాదు.

నేను వచ్చిన కొద్ది కాలానికే నా కుటుంబం అంతా, మా నాన్నగారి నిర్యాణానంతరం, నా దగ్గర ఉండటానికి వచ్చారు. అందరం ఇక్కడే ఉన్నాం అప్పటినుండి. నాసోదరసోదరీమణులంతా ఈ హైదరాబాదులోనే చదువుకున్నారు. మా చెల్లెళ్ళందరినీ హైదరాబాదు వాస్తవ్యులకే ఇచ్చి వివాహాలు చేసాం.

పందొమ్మిది వందల యాభైఆరు నవంబరు కన్నా ముందుగానే దీర్ఘదర్శనులై మా తాతగారు హైదరాబాదు వచ్చి స్థిరావాసం ఏర్పరుచుకొన లేదు కాబట్టి మేమంతా పరాయి వాళ్ళం అన్న తెలంగాణా ప్రభుత్వం‌ మాట ఎలా సబబు అని మాకు అనిపిస్తుంది చెప్పండి?

ఈ రెండురాష్ట్రాలు ఏర్పడినప్పటినుండీ నాకు 'సెటిలర్' అన్న బిరుదు ఇస్తానంటే నేనెలా ఒప్పుతాను చెప్పండి?

ఆంధ్రాప్రాంతం నుండి హైదరాబాదుకు వచ్చి అర్ధశతాబ్దం కావస్తున్నది. అక్కడివారికి ఇప్పుడు దాదాపుగా పరాయివాడిని. ఇక్కడి వారికి కూడా నేనొక 'సెటిలర్'ను అనగా పరాయివాడికి. చాలా బాగుంది. ఇదెక్కడి న్యాయం?

మా ఆఖరు తమ్ముడు ఇక్కడే‌ జన్మించాడు. ఇక్కడే చదువుకున్నాడు. ఇక్కడే ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఇక్కడే ఉంటున్నాడు. ఇప్పుడు వాడికీ ఒక కుటుంబం ఉంది. వాళ్ళంతా కూడా 'సెటిలర్స్' అనటం‌ అసహజం అభ్యతరకరం కాదా?

నాలాంటి వారు ఈ‌హైదరాబాదులో కొల్లలు. ఎవరి కథ వారిది. వాళ్ళంతా పొట్ట చేతపట్టుకొని ఉద్యోగాల కోసం వచ్చినవారే.

అంద్రాప్రాంతం నుండి వచ్చిన వారంతా దుష్టులు అని అ తెలంగాణా ఉద్యమం రోజుల్లో తిట్టిపోసింది చాలు. ఒక పెద్దమనిషి, నా స్నేహితులే‌ లెండి, అవసరం ఐతే ఆంద్రావారంతా చచ్చిపోయి ఐనా తెలంగాణా రావలసిందే అని చెప్పారు. ఉద్యమం వేడి అట. వేడి! ఎంత చక్కని మాట.

ఆంద్రావాళ్ళు బిర్యానీ‌చేస్తే పేడలా ఉంటుంది అని వెక్కిరించి వెకిలిగా నవ్వులు చిలికించిన పెద్దమనిషి ఓట్ల అవసరం రాగానే ఆంధ్రావాళ్ళమీద కొంచెం ప్రేమ ఒలికించే‌మాటలూ మాట్లాడారు అనుకోండి. అంతమాత్రం చేత ఆ గుండెల్లో ప్రేమను చూడటం నావల్ల కాదు.

సరే జరిగిందేదో జరిగిపోయింది. రాజకీయాల్లో బోలెడు జరుగుతూ ఉంటాయి. వాటికి ఎవరూ ఏమీ చేయలేరు.

కాని ఇంకా అంధ్రప్రాంతం వారిని 'సెటిలర్స్' అంటూ వేరుగా చూడటం సమంజసమా?  ఆప్రాంతం నుండి వచ్చి ఈతెలంగాణాలో స్థిరపడిన కుటుంబాలు మరొక ఐదువందల యేళ్ళైనా సెటిలర్స్ అనే పిలవబడుతారా?

ఈ‌హైదరాబాదులో అంధ్రప్రాంతం నుండే‌ కాక భారతదేశంలోని అనేక ప్రాంతాలనుండి వచ్చి 'సెటిల్' ఐన కుటుంబాలు కొల్లలు. కాని చూస్తుంటే వారెవర్నీ 'సెటిలర్స్' అన్నట్లు కనిపించదు. ఆంద్రప్రాంత నుండి వచ్చి ఇక్కడ స్థిరపడిపోయిన ఈ  సాటి తెలుగువాళ్ళే తెలంగాణావారికి పరాయి వారు, 'సెటిలర్స్' అన్నమాట. భారతదేశంలోని ఏయితర ప్రాంతనుండి ఇక్కడికి వచ్చి స్థిరపడిన వారూ తెలంగాణా ద్రోహులు కారు. సాటి తెలుగువారైన ఆంధ్రాప్రాంతం వారే తెలంగాణాద్రోహులు (పుట్టుకచేతనే ఆంధ్రాప్రాంతం వారు తెలంగాణాద్రోహులు అన్నమాటనూ రాజకీయులు అనగా విన్నాను.). కాబట్టి సాటి తెలుగువారికి ద్రోహులు అని నిత్యం గుర్తుచేయటానికి వారిని మాత్రమే‌ సెటిలర్స్ అంటారన్నమాట.

ఎన్నికలూ వగైరా అవసరాలు వచ్చినప్పుడు ఓట్లకోసం అంధ్రప్రాంతం వాళ్ళకి మెరమెచ్చు మాటల చెప్పే ఈరాజకీయులు 'ఆంధ్రానుండి వచ్చినవాళ్ళూ మావాళ్ళే' అంటూ ఉండటం విన్నదే. ఆమాటల్లో ఉన్న నిజాయితీ గురించి మేధావులు అనబడే‌ కొందరు ఎంతో చక్కటి విశ్లేషణలు అందిస్తారనటంలో సందేహం లేదు. కాని అవన్నీ పైపై మాటలే అన్నసంగతి మాత్రమే అసలు నిజం.

నేను అమెరికాలో‌ కొన్నేళ్ళు ఉండి వచ్చాను. ఎందరో అమెరికాలో సెటిల్ అయ్యారు మన తెలుగువాళ్ళు. కాని అక్కడ సెటిల్ ఐనా మన వాళ్ళని ఎవరూ అక్కడ 'సెటిలర్స్' అనరు.

ఏదో నాగోడు నేను చెప్పుకున్నాను. ఎందరు ఏకీభవిస్తారో, ఎవరు ఏకీభవించరో అన్నది వేరే‌ విషయం. సత్యం కళ్ళముందే ఉంది. అటు ఆంధ్రకూ ఇటు తెలంగాణకూ చెందని రెండింటికీ చెడిన రేవడులే ఈ సెటిలర్స్ అన్నదే ఆనిజం.

ఒక్కొక్కసారి అనుకుంటూ‌ ఉంటాను. నేను కూడా ఎంతో‌ మంది సాటి తెలుగువారిలాగే ఆ అమెరికాలోనే సెటిల్ అయ్యుంటే ఈ‌అవమానకరమైన సెటిలర్ టైటిల్ నా నెత్తి మీద ఉండేది కాదు కదా అని.

1, డిసెంబర్ 2020, మంగళవారం

హరిహరి అంటే తప్పు లన్ని

హరిహరి అంటే తప్పు లన్ని ఒప్పు లయ్యేనా
హరిహరి  అనడా ఒప్పు లన్ని తప్పు లయ్యేనా

వింతవింత మాటలేల వీర హరి భక్తులార
అంతగ మీ రతిశయోక్తు లాడనేమిటికి
ఎంతైన హరిభక్తి నెన్ని పల్కుదురుగాక
సుంత నమ్మదగిన విధము చూచి పలుకరేల

హరినామము పూర్వపాప మంతటిని దహించును
మరల తప్పుచేయ డతడు మరిపాప మెక్కడ
హరి నెన్నని వాని పాప మంతరించు దారేది
హరే రామ హరే కృష్ణ యని తరించు గాక

హరినామస్మరణమున  నంతగొప్ప లాభమా
హరినామము తప్ప కలిని మరి దారే లేదు
హరేరామ హరేకృష్ణ యంటే సరిపోవునా
నరుడెంతగ నమ్మికొలుచు నంతగొప్పఫలము

మన రామయ్యకు మంగళము

మన రామయ్యకు మంగళము మంగళమూర్తికి మంగళము
మన జానకమ్మకు మంగళము మంగళదాయికి మంగళము

కువలయపతికుల సందీపనునకు గోవిందునకు మంగళము
అవనీసుతయై అవతరించిన హరియిల్లాలికి మంగళము
అవలీలగ శివధనువును విరచిన అతివీరునకు మంగళము
భువనేశ్వరు డీ రాముని పతిగా పొందిన తల్లికి మంగళము

జనకుని పనుపున వనముల కఱిగిన మన రామయ్యకు మంగళము
తనపతి వెనుకనె వనముల కఱిగిన జనని జానకికి మంగళము
దనుజుని చెఱలో పతిరాకకు వేచిన మనతల్లికి మంగళము
దనుజుని ద్రుంచి సతిని గ్రహించిన మన రామయ్యకు మంగళము

జయశీలునకిదె మంగళము త్రయీస్తుత్యునకు మంగళము
దయాశాలికిదె మంగళము ధర్మరూపునకు మంగళము
దయాశాలినికి మంగళము ధర్మరూపిణికి మంగళము
రయమున భక్తుల నేలే సీతారాముల కెప్పుడు మంగళము