27, జనవరి 2015, మంగళవారం

గీతాధ్యయనం గురించి అరవిందుడి అభిప్రాయం.

ఉపోద్ఘాతంగా ఈ మధ్య జరిగిన ఒక బ్లాగు చర్చా సందర్భాన్ని ముందుగా ప్రస్తావిస్తాను.

ఈ‌నెలారంభంలో,  రచ్చబండ చర్చావేదికవారు  భగవద్గీతలోని ఈ శ్లోకం యొక్క విశ్లేషణ మీరు చేయగలరా? అని ఒక ప్రశ్న వేసారు.

వారు చర్చకు పెట్టిన శ్లోకం

తమేవ శరణంగచ్చ సర్వభావేన భారత।
తత్ప్రసాదాత్పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం॥

అన్నది.  ఇది భగవద్గీతలోని మోక్షసన్యాసయోగంలోని 62వ శ్లోకం.

ఈ చర్చలో మొదటగా నేను స్పందిస్తూ ఒక వ్యాఖ్యను పెట్టాను. పాఠకుల సౌకర్యార్ధం ఆ నా వ్యాఖ్యను యథాతదంగా ఇక్కడ ప్రచురిస్తున్నాను.

ఈ విధంగా ఒక గీతాశ్లోకాన్ని బహిరంగ చర్చకు పెట్టవలసిన అవసరం యేముంది? భగవద్గీతకు అనేకమంది పెద్దలు వ్రాసిన ప్రామాణిక వ్యాఖ్యానాలున్నాయి కదా, అందుబాటులో. .మీరు స్వయంగా చదువుకొనవచ్చును. హఠాత్తుగా ఒక శ్లోకం వెంటబడినంతమాత్రాన అది పూర్తిగా బోధపడకపోవచ్చును. గీతాధ్యయనం అవసరం కావచ్చును. అటువంటి సంధర్భంలో ఇక్కడ చర్చించటం వలనా ప్రయోజనం ఉండదు. ఇది సరైన విధానం కాదని నా అభిప్రాయం. మీ అభిప్రాయం వేరుగా ఉంటే ఉండవచ్చును.


ఆ తరువాత చర్చ విస్తారంగా కొనసాగింది.

పై వ్యాఖ్యకు అదనంగా మరేమీ వ్యాఖ్యానించే ఉద్దేశం లేకపోయినా K.S. CHOWDARY గారి అభ్యర్థన మేరకు మరికొంత వ్రాయటం తప్పలేదు. ఆ తరువాత నా అనేక వాదోపవాదాలు కొనసాగాయి. ముఖ్యంగా శ్రీకాంత్ చారి గారు అవకాశాన్ని అందిపుచ్చుకొని నన్ను ఎద్దేవా చేయటానికి కాను నా మాటలను పూర్వపక్షం చేయటానికి మిక్కిలి ప్రసంగించారు.  చివరకు "పవిత్రత ముసుగులులో వాస్తవాలు వెలికి రాకుండా గొంతు నొక్కాలనే" ప్రయత్నం నేను చేస్తున్నాననే మహదభిప్రాయాన్నీ సభాముఖంగా వెలిబుచ్చారు. సరే, సభాముఖంగా మరికొన్ని అటువంటి ఆణిముత్యాల్లాంటి మాటలూ దొర్లాయనుకోండి చర్చలో.

ప్రస్తుతవిషయం. 

గీతాధ్యయనం పై అరవిందుడి అభిప్రాయం గురించి ఈ రోజున ఒక బ్లాగులో కొన్ని మాటలు చదివాను. అది  Integral Yoga of Sri Aurobindo & The Mother  అనేది. అందులో The message of the Gita అనే టపాలో ఈ‌ క్రింది వాక్యం కనిపించింది.

In his commentary on the Gita, Sri Aurobindo emphasized that in order to understand the true message, one must patiently read it as a “developing argument” over eighteen chapters, instead of spotlighting a few chapters or scattered verses of one’s liking. 

ఐతే చదువరుల్లో కొందరైనా అరవిందుడు చెప్పిన మాటలు యథాతధంగా తెలుసుకో గోరతారు కాబట్టి వాటిని ఈ క్రింద ఉటంకిస్తున్నాను.

The Gita can only be understood, like any other great work of the kind, by studying it in its entirety and as a developing argument. But the modern interpreters, starting from the great writer Bankim Chandra Chatterji who first gave to the Gita this new sense of a Gospel of Duty, have laid an almost exclusive stress on the first three or four chapters and in those on the idea ̇ karma, the work that is of equality, on the expression kartavyam karma to be done, which they render by duty, and on the phrase “Thou hast a right to action, but none to the fruits of action” which is now popularly quoted as the great word, mahavakya of the Gita. The rest of the eighteen chapters with their high philosophy are given a secondary importance, except indeed the great vision in the eleventh. This is natural enough for the modern mind which is, or has been till yesterday, inclined to be impatient of metaphysical subtleties and far-off spiritual seekings, eager to get to work and, like Arjuna himself, mainly concerned for a workable law of works, a dharma. But it is the wrong way to handle this Scripture.

(Sri Aurobindo.  Essays on the Gita, pp 35 - 36.)


అరవిందుల అభిప్రాయం నేను మొన్నమొన్న రచ్చబండలో వెలిబుచ్చిన అభిప్రాయలకు ఎంత దగ్గరగా ఉన్నదీ చదువరులు అర్థం చేసుకోగలరని ఆశిస్తున్నాను.

ఈ మాటలు వ్రాయటం ద్వారా వినయం వదలి అతిశయం అనే దాన్ని ఆశ్రయించి మాట్లాడటం ఏమీ చేయటం లేదు నేను. ఈ మాటలు వ్రాయటంలో నా ఉద్దేశం నేను లోగడ రచ్చబండలో ఏమి చెప్పానో, అది పూర్వం పెద్దలచే చెప్పబడినదే కాని, కొందరు ఆక్షేపిస్తున్నట్లుగా నేను కొత్తగా సత్యాన్వేషణా నిరోధం కోసం చేస్తున్న ప్రయత్నం కాదని మరొకసారి అందరి దృష్టికీ తేవటానికి మాత్రమే. 

ఇప్పుడు ఎవరన్నా అరవిందులపైన కూడా అభియోగారోపణలూ గట్రా చేస్తారేమో నాకు తెలియదు.  అటువంటి సాహసాన్ని ఎవరైనా చేసినా అరవిందులకు కాని గీతకు కాని వచ్చే నష్టం ఏమీ ఉండదు లెండి.  కాని ఇప్పుడు ఈ‌ టపాకు ఎటువంటి వ్యాఖ్యలు వస్తాయో తెలియదు కాని ఉచితమైన వ్యాఖ్యలను మాత్రం అంగీకరించవచ్చును కాని అన్ని వ్యాఖ్యలనూ ప్రచురించటం అవసరమని అనుకోను.


16, జనవరి 2015, శుక్రవారం

నీ‌ కరుణ తప్ప నేనేమీ యెరుగను




నీ నామ మెఱుగను నీ రూప మెఱుగను
నీ ధామ మెఱుగను నిన్నెఱుగను

నీ తీరు నెఱుగను నీ సౌరు నెఱుగను
నీ వారి నెఱుగను నిన్నెఱుగను

నీ యున్కి నెఱుగను నీ‌ మన్కు లెఱుగను
నీ తత్త్వ మెఱుగను నిన్నెఱుగను

నీ శక్తు లెఱుగను నీ‌ యుక్తు లెఱుగను
నీ చెయ్వు లెఱుగను నిన్నెఱుగను

నిన్ను ధ్యానించు విధమును నే నెఱుగను
నిన్నెఱింగెడి విధమును నే నెఱుగను
నిత్య మీశ్వర నాపట్ల నడచుచుండు
నీదు కరుణకు నితరంబు నే నెఱుగను





15, జనవరి 2015, గురువారం

సంక్రాతి గంగిరెద్దుల వాళ్ళని దయతో ఆదరించండి







తే. రంగురంగుల బొంతల గంగిరెద్దు
ముంగిళుల ముందు విన్యాసములను చేయు
పండువిది వచ్చె తోచిన పగిది రూక
లిచ్చి పంపుడీ మనసార మెచ్చి మీరు

తే. చెప్పులైనను నోచరు జీర్ణవస్త్ర
ధారులీ మేళగాండ్రు మీ దయకు పాత్రు
లాదరించుడు మనసార నయ్యలార
అమ్మలార సురవిటపి కొమ్మలార

ఉ. వండిన పిండివంటలను వారికి పెట్టుడు మానుడమ్మ ఆ
యెండిన డొక్కలం గనియొ కించుక బువ్వననుగ్రహించరే
పండువగాదె వారికిని భవ్యమనస్కులు పాతదైననుం
కండువ నయ్యగారి దయగా నిడరే పరమాత్మ మెచ్చగన్

కం. ఈ యేడు వచ్చినారని

పై యేటికి వత్తురనుచు భావింపగ రాద
న్యాయంబుగ నేటేటికి
మాయంబగుచుండి రనెడు మాట దలచుడీ

కం. వీరికి తిండిలేదు మరి వీరల బిడ్డలు పాపలందరున్
నోరు వచింపలేని గతి నుందురు ముద్దకు నోచకుందురున్
వారిని చేరదీయగను వారికి బళ్ళను విద్యనేర్పగన్
కోరవుగా ప్రభుత్వములు కొంచెపువారల పెత్తనంబులన్

కం. అయగారని యమ్మాయని
నయమున ప్రార్థించి మ్రొక్కినారని యైనన్
దయచూపుడు మీరైనను
జయమిచ్చును మీరు చూపు జాలియె మీకున్




14, జనవరి 2015, బుధవారం

మకరసంక్రాంతి శుభాకాంక్షలు.



ర   సం క్రాం తి   శు భా కాం క్ష లు



సంక్రాంతి శుభవేళ సకలాంధ్రజనులు
సకలోర్విజనులును సకలభూతములు
సకలవిధంబుల సంతోషమంది
యకళంకస్థితి నుండు నా పరమాత్మ
కృపకుపాత్రత నొంద పృధ్విని శాంతి
సౌఖ్యంబు లికమీద సమృధ్ధమగుచు
జీవనంబులు శుభభావనంబులుగ
వర్థిల్లుగావుత పరమోత్సవముగ





12, జనవరి 2015, సోమవారం

ప్రశ్న



వ్రాయాలా?
నిజంగా?

ఒకవేళ వ్రాస్తే నీ గురించి వ్రాయాలి
లేదంటే యిక నా గురించి వ్రాయాలి

నీ గురించి ఏమి వ్రాయాలో తెలియదు
నా గురించైతే వ్రాయటానికి ఎమీ లేదు

నీ లీలావిలాసమంతా రహస్యాఖ్యానాలమయం
నా జీవనగ్రంధమంతా రహస్యాధ్యాయాలమయం

నీ మహర్దివ్యప్రకాశానికి కళ్ళు మూతలుపడి ఇబ్బంది
నా తిమిరమయలోకంలో కళ్ళు కనిపించక ఇబ్బంది

అందుకే నీ గురించిన సత్యాలేవీ వ్రాయగల శక్తి నాకు లేదు
అలాగే నా గురించి అసత్యాలు వాయగల యుక్తి నాకు లేదు

నా కోసం ఎదురుచూస్తున్నావని వ్రాస్తే సరిపోతుందా
నీ కోసం వెదుకులాడుతున్నానని వ్రాస్తే సరిపోతుందా

నీ వెలుగే నా గాయాలన్నీ మాన్పుతోందని తెలుసు
ఆ వెలుగులో నే లీనం కావటం మంచిదని తెలుసు

ఆ ఒక్కముక్కా వ్రాసేస్తే సరిపోతుందా
అసలా ముక్క వ్రాయ నవసరముందా

నాకు నీనుండి ఆదేశం రావాలి
అవసరమంటేనే నేను వ్రాయాలి


10, జనవరి 2015, శనివారం

కథను రక్తికట్టించే మరికొన్ని పాత్రలు






నామాటలను మెచ్చి నాపక్ష మగువారు
నావారలే యది నా కెఱుకయె

నాతోడి స్నేహంబు నడిపించువారును
నావారలే యది నా కెఱుకయె

నాయందు ప్రేమతో నాకండ యగువారు
నావారలే యది నా కెఱుకయె

నాయున్కిమన్కి కానందించు వారెల్ల
నావారలే యది నా కెఱుకయె

నాదు ప్రస్తుతజీవననాటకమున
కథను రక్తికట్టించగా కలిగి నట్టి
పాత్రలుగ వీరినెంచద సూత్రధారి
వీవటంచును గమనింతు నీశ యెపుడు




కథను రక్తికట్టించు పాత్రలు






నామాటలకు జాల నవ్వుకొనెడు వారు
నావారలే యది నా కెఱుకయె

నాపైన వైరంబు నడిపించువారును
నావారలే యది నా కెఱుకయె

నా యందు ప్రేముడి నటియించువారును
నావారలే యది నా కెఱుకయె

నాయున్కి నెఱుగమి నటియించువారును
నావారలే యది నా కెఱుకయె

నాదు ప్రస్తుతజీవననాటకమున
కథను రక్తికట్టించగా కలిగి నట్టి
పాత్రలుగ వీరినెంచద సూత్రధారి
వీవటంచును గమనింతు నీశ యెపుడు




9, జనవరి 2015, శుక్రవారం

తెలుగుభాషకు పడుతున్న దుర్గతిని గమనించండి.

మన తెలుగుభాష దుస్థితి ఎలా ఉందో తెలిపేందుకు ఉదాహరణగా నిలిచే సంఘటన ఒకటి నిన్న రాత్రి నాగార్జున నిర్వహిస్తున్న మీలో ఎవరు కోటీశ్వరుడు అనే షోలో తటస్థించింది.

నిన్నరాత్రి షోలో అభ్యర్థిగా పాల్గొన్న ఒకాయన పేరు లక్ష్మీనారాయణగారు.

ఆయన తెలుగులో డాక్టరేట్ పట్టా పుచ్చుకున్నారు. అయన పరిశోధించిన అంశం కరీంనగర్ జిల్లాలో భజన సంప్రదాయాలు.

ఆయనకు వచ్చిన ప్రశ్నల్లో కొన్ని అయనను ఇబ్బంది పెట్టాయి. ఆ ఇబ్బందులేమిటో మీరే చదివి ఆనందించండి!

తెలుగు అక్షరాలలో  గ జ డ ద బ లను యేమని పిలుస్తారు?

మొదటగా లక్ష్మీనారాయణగారిని ఇబ్బంది పెట్టిన ప్రశ్న ఇది.  నిజానికి యీ ప్రశ్నకు యే పాఠశాలావిద్యార్థి ఐనా జవాబు చెప్పగలడు. కాని డాక్టర్ లక్ష్మీనారాయణ అనిపించుకున్న మహనుభావుడికి జవాబు తెలియలేదు. సూచించబడిన నాలుగు సమాధానలలో సరైనదీ తప్పక ఉంటుంది, ఉంది కూడా. కాని యీయన తికమక మకతిక పడిపోయి, చివరికి స్టూడియోలో ఉన్న ప్రేక్షకులను సూచించమని లైఫ్ లైన్ అడిగాడు. వారి చలువతో, గండం గడిచి చివరకు గజడదబ లను సరళములు అంటారు అని గ్రహించి అదే జవాబుగా ఇచ్చారు. నాగార్జున ఆశ్యర్యపోయి ఈయనకు ఎందుకు ఇబ్బంది వచ్చిందన్నట్లు అడిగితే, నాకు తెలుసును కాని ఎందుకో తికమకపడ్డానని చెప్పారు.

కొద్ది సేపటికి మరొకప్రశ్న వచ్చింది మరికొంచెం ఇబ్బంది పెట్టటానికి.

యుధిష్టిరుడికి అజ్ఞాతవాసంలో ఉన్నప్పటి పేరు యేమిటీ?

ఈ ప్రశ్నకు ఆలోచించి అలోచించి సరిగ్గానే అక్కడ ఉన్న ఆప్షన్ 'కంకుభట్టు' అన్నది ఎన్నుకున్నారు డాక్టర్ గారు.  ఆ 'కంకుభట్టు' అంటే అర్థం యేమిటంటే జూదం ఆడేవాడు కాబట్టి కంకుభట్టు అన్న పేరు అని చెప్పారు! అవునా? ఎక్కడా వినలేదు!

నిజానికి 'కంకుభట్టు' కాదు 'కంకభట్టు' అన్నది సరైన పదం. ఈ సంగతి డాక్టర్ లక్ష్మీనారాయణగారికి తెలియదు!  కంకము అన్నదానికి సంస్కృతంలో పద్మము అనే అర్థం ఉంది. భట్టు అన్నది సరే భట్టువంశీకుడన్నది సూచించే పదం అనుకుంటే అది ఒక ముని, పండితుడు అన్న అర్థాన్నిచ్చే పదం. నన్నయ భట్టారకుడు లేదా నన్నయ భట్టు అన్నదానిలో భట్టు పదం ఇటువంటిదే. అగ్నిభట్టారకుడనే మాటకూడా వాడుకలో ఉంది. కాబట్టి భట్టారక లేదా భట్ట శబ్దం శ్రేష్టతా వాచకం. కాబట్టి,  ఈ కంకభట్టు అనే పదం పండితశ్రేష్ఠుడు అన్న అర్థం ఇస్తుంది. ఈ మహానుభావుడికి ఇలాంటి విషయాలేమీ తెలిసినట్లు అనిపించదు.

మన డాక్టరేట్ యోగ్యతాసన్మానితుణ్ణి ఇబ్బంది పెట్టిన ముచ్చటైన మూడవపశ్న.

బుచ్చిబాబు అన్న కలంపేరుతో ప్రసిధ్ధుడైన రచయితగారి నిజమైన పేరు ఏమిటి?

దీనికి సమాధానంగా సూచించబడిన పేర్లు శివరాజు వెంకట సుబ్బారావు, దేవులపల్లి కృష్ణశాస్త్రి,  శ్రీరంగం శ్రీనివాసరావు, మరొకాయన-పేరు-గుర్తు-లేదు

మన డాక్టర్ లక్ష్మీనారాయణగారు బోర్లా పడిపోయారీ ప్రశ్నకు. దేవులపల్లి కృష్ణశాస్త్రి కాదు,  శ్రీరంగం శ్రీనివాసరావు కాదు, ఆ మరొకాయనా కాదు అనుకున్నాడు - అదీ అనుమానం గానే. కాని శివరాజువారు అవునా కాదా అన్నది తెలియలేదు. చివరకు ఆటను విడిచిపెట్టేశారు.

మీరు మిగతా ముగ్గురూ కాదనుకున్నారు కదా, బుచ్చిబాబుగారి ప్రసిథ్థమైన పుస్తకం 'చివరకు మిగిలేది' లాగా ఇక్కడా 'చివరకు మిగిలేది' శివరాజు వెంకట సుబ్బారావు అన్నదే సరైన సమాధానం అని నాగార్జున చమత్కరించాడు. మీరు తెలుగు సాహిత్యంమీద రీసెర్చి చేసారు కదా ఎందుకని ఇబ్బంది కలిగిందీ అని అడిగితే మన హీరోగారు చెప్పిన సమాధానాలు చూడండి.

శివరాజు వెంకట సుబ్బారావు గారి గురించి తెలియదు.
బుచ్చిబాబు అన్న పేరు ఎప్పుడూ వినలేదు.
'చివరకు మిగిలేది' అనే నవలపేరు ఎన్నడూ వినలేదు.

ఇదండీ, మన తెలుగుభాషలో, అందులోనూ సాహిత్యరంగంలో పరిశోధనచేసి డాక్టరేట్ పుచ్చుకున్న మహావీరుడు చూపిన ప్రజ్ఞ.

ఇలాంటి వారిని చూసి నవ్వాలా?
ఇలాంటి వారికి కూడా డాక్టరేట్ పట్టాలు ఎలా వచ్చేస్తున్నాయని ఆశ్యర్యపోవాలా?
ఇలాంటివారు తెలుగు లెక్ఛరర్లుగా విద్యార్థులకు జ్ఞానప్రదాతలుగా ఎలా వెలుగుతున్నారో అని ఆవేదనపడాలా?
మన తెలుగు భాషకు పడుతున్న దుర్గతిని చూసి ఏడవాలా?

మీరే చెప్పండి.

8, జనవరి 2015, గురువారం

నా గురించి నేను


ఉ. పుట్టితి నేల పుట్టితిని పుట్టిన పుట్టువు సార్థకంబుగా
నెట్టుల నేమి జేసితి నికెన్ని దినంబులు నేలనుందు ని
ప్పట్టున నేమి యాజ్ఞ భగవానుడు సేయగ నెంచు నే
తుట్ట తుద న్ముదం బలర తొల్లిటి గూటికి చేరుకొందునో

ఉ. చేరక నేలపై దిరిగి చేసిన చెయ్వుల మంచిచెడ్డలం
జేరిన పుణ్యపాపముల జేసి యవశ్యము క్రొత్తతిత్తిలో
దూరి మరొక్కమారు పెడద్రోవల బోవుదునో విదుండనై
కూరిమి దేవునిం గొలుచుకొందునొ యన్న దెఱుంగరాదుగా

ఉ. పుట్టగరామి సత్యమగు బుట్టిన దాదిగ లక్షకష్టముల్
జుట్టుకొనంగ శాంతి యది శూన్యముగా క్షణమాత్రసౌఖ్యమౌ
నెట్టుల వచ్చెనేని యది యెంతయు భాగ్యముగా దలంచి నే
నిట్టటు గ్రుమ్మరం గడచెనే బహుకాల మికేమి చేయుదున్

ఉ. మంచిగ నా దయామయుడు మానవజన్మము దేని కిచ్చెనో
యించుక యైన నే నెఱుగ కీశ్వరమాయయొ బుధ్ధిలౌల్యమో
వంచన చేయగా భ్రమసి పాడొనరించితి బుట్టువెల్ల నే
వంచిన బుఱ్ఱ నెత్తక నవశ్యము సొమ్ములకై  శ్రమించుచున్

ఉ. లోకము నందు పెక్కులగు లోలుపతం గలిగించు వస్తువుల్
నా కనునిత్యచింత్యము లనం జన నేండ్లునుబూండ్లునుం దుదిన్
లోకము నశ్వరం బనుచు లో నతిస్పష్టముగా గ్రహించితిన్
నా కొఱగాని పుట్టువున నష్టనివారణభాగ్య మున్నదే

క. గత జన్మల పాపంబులు
వెతలను కలిగించి చాల వేచుటయును నా
గత జన్మల పుణ్యంబులు
సుతిమెత్తని సౌఖ్యములను చూపుటయును గా

శా. ఈ‌ జన్మంబిటు సాగుచున్నయది ము న్నీరీతిగా సాగుటే
సాజం బన్నటు లెన్ని జన్మముల నీ‌ సంసార మీదంగా లే
దీ జీవుం డను నట్టులుండ నికపై నేని న్విరక్తుండనై
రాజీవాక్షుని పాదపద్మముల నారాధింపగా నేర్తునో

ఉ. నే నను వాడ నొక్కడను నేడిపు డుండిన నుంటి గాని యీ
నే నను చెప్పుకొంచు గడు నిక్కెడు వాడను లేకపోవుచో
రా నగు నష్ట మున్నదె ధరాతలమందున నన్ను బోంట్లు రా
పో నను నిత్యము న్నొకడు పుట్టుట గిట్టుట యేమి చోద్యమౌ

ఉ. కొందరు గాలిలో నుఱక గ్రుమ్మరు ధూళికణంబు లట్లుగా
నుందురు వారి కాశయము లుండవు మ్రెక్కగ బుట్టునట్టి వా
రెందును లక్ష్యమేమియును నెంచి గ్రహించి కృషించ నేరకన్
మందత నుండి జచ్చెదరు మానక వచ్చుచు పోవుచుందురున్

చ. స్తుతమతులైన కొందరన సూక్ష్మవిచారము చేయనేర్చి యీ
బ్రతుకున కేమి యర్థమని భావన చేసి సమస్తవిశ్వము
న్నతులిత లీలమై నడపు నట్టి మహాత్ముడు మాకు దిక్కు మే
మతనిని జేరుకొందుమని మాధవు వేడి తరింతు  రెప్పుడున్

చ. అనఘులు కొంతమంది మరి యట్టి మహాత్ముల లోన సాటి వా
రును తరియించు మార్గమును రోసి ప్రబోధము చేయుచుండు వా
రనిశము నట్టి వారలకు నంజలి యొగ్గి నమస్కరింతు నా
ఘనులను జేసి మందులకు గల్గును గాదె శుభేఛ్చ సత్యమై

ఉ. కాలము చేత సర్వమును కల్పితమై తనరారు చుండు నా
కాలము నందు జీవులకు గల్గుచు నుండును రాకపోకలున్
కాలపు మాయ చేత పొడగట్టు శుభాశుభభావనంబులన్
మేలగు సత్యముం దలచి మిక్కిలి శాంతి వహించు టొప్పగున్

ఉ. మంచిది నేటికైన పరమేశ్వరదత్తవివేకనేత్ర మి
ట్లించుక విచ్చుకొన దనిపించెడు నంతయు నీశ్వరాజ్ఞ గా
వించిన మేలుగా దలచి యిప్పటి నుండియు నుర్వి నాకు శే
షించిన కాలమున్ గడప నెంచెద నాతని కర్పణంబుగన్

ఉ. కాలము వ్యర్ధవాదపరికల్పితఖేదవినోదడోలికా
ఖేలనదుర్విలోలచణకిల్బిషబుధ్ధిని బుచ్చ నేటికిం
జాలును మేలు గూర్చగల సత్యపథంబున వోవు టొప్పు నిం
కేల విమోహజాలమని యెంచితి నీశు దలంచితిన్మదిన్

శా. లోకానేకసమూహకల్పనకళాలోలుం బ్రసన్నాత్మునిన్
లోకోపద్రవవారణైకనిపుణున్ లోకేశు నిర్ద్వందునిన్
లోకాత్మున్ మది నెంచి మ్రొక్కెదను నాలోనున్న లౌల్యంబులం
బోకార్చం దగునంచు తండ్రివగుచున్  బ్రోవంగదే యటంచున్

ఆ,వె. చింతలెల్లమాని శ్రీచరణంబుల
జేరియుంట కన్న సేమమేది
కోరదగిన దొకటె కోరుకొంటినిగాన
చేరదగినపదము చేరుకొందు

5, జనవరి 2015, సోమవారం

వంద వసంతాలూ - ఒక గ్రీష్మమూ



శతవసంతాలనీ ఒక క్షణంగా గడిపేసాను
అప్పుడొచ్చింది యుగాంతపర్యంతగ్రీష్మం
ఈ క్రూరత్వం ప్రకృతిసహజం అనుకోనా

నిర్వాజపరోపకారసుకృతి వంటారే నిన్ను
ఈ గ్రీష్మాతపాన్నుండి కాపాడేదెవరయ్యా
కనీసం నువ్వైనా పూనుకోకపోతే నాకోసం

వేదాంతం‌ ప్రకారం ప్రకృతిపై నీదే పెత్తనం
నాకర్మం‌ ప్రకారం ప్రకృతిదే పూర్తి పెత్తనం
ఇప్పుడేం చేయాలో పాలుపోకుందే మరి

నీకోసం ప్రకృతిని కొలవటం మానేసాను
అందుకే ఇప్పుడది పగతీర్చుకుంటోంది
నువ్వా యోగనిద్ర నుండి లేస్తావా లేదా

ఇంతకన్నా ఇంకెలా చెప్పాలో తెలియదు
ఎంతచెప్పినా నీకు వినిపించటమే లేదు
నువ్వూడిపడేలోగా నేను పడేలాగున్నాను


1, జనవరి 2015, గురువారం

అందుకే ఇది శుభవత్సరం కావాలి







వస్తూనే ఉంటాయి సంవత్సరాలు
వస్తూపోతుంటాయి కష్టసుఖాలు 


ఊరంతా వాడంతా గడబిడ తప్ప
ఊడిపడిందేమీ లేదు నిన్నటిరాత్రి

ఋతుచక్రంలో మార్పేదీ రాలేదు
కొత్త ఋతువు రాక కనబడలేదు

జన్మలో శివరాత్రిజాగరణ చేయని
ఈ జనం రాత్రంతా నిదురమాని
ఎంత ఎదురుచూసారో అర్థరాత్రి
నూత్నహూణవత్సరం రాక కోసం

ప్రతిసారీ పోయినేడు పీడాకారమే
ప్రతిసారీ ఈరోజు కెదురుచూడ్డమే

ఈసారైనా కోరిన శుభపరంపరలు
కొత్తసంవత్సరం కొసరి వడ్డించేనా

ఈసారైనా కాసిని శాంతిసౌఖ్యాల్ని
కొత్తసంవత్సరం కొసరి వడ్డించేనా

రాజకీయరణాంగణంగా మారిన
తెలుగింటిప్రాగణంలో నే కోరిన
శాంతివనం మొలకెత్తి పూచేనా

సకల రాజకీయశనిగ్రహసాహస్రిపై
ఇకనైనా కాలపు కొరడా ఎగిరేనా

ఈసారైనా ఈ ఎదురుచూపులు
ఫలించేనా కాలం కరుణించేనా
మరోసారి ఎదురుచూడ మనేనా

కోటి ఆశలతో ఎదురుచూడటం
అలవాటైపోయిన నరప్రపంచం
ప్రతిసంవత్సరానికి ఆశాజ్యోతుల
కాంతిపుంజాల కళకళల మధ్య
స్వాగితించటం చక్కని రివాజు

శుభకామన మాకు తీరని మోజు
కాదని ఈసారైనా కాలం చెప్పాలి
అందుకే ఇది శుభవత్సరం కావాలి