12, సెప్టెంబర్ 2014, శుక్రవారం

ఛానెళ్ళపై నిషేధం ఎత్తివేత గురించిన ఒక టపా పై స్పందన


వారు నిషేధం ఎత్తేయమని విజ్ఞప్తి చేయటం వరకూ బాగానే ఉంది. కాని ఆ వ్యాసం ధోరణి నాకైతే నచ్చలేదు.  ఒక వ్యాఖ్య చేదామని మొదలుపెడితే అది చాలా పెద్దదైపోయింది. అందుచేత నా పాత అలవాటు ప్రకారం, దాని ఇక్కడ ఒక విడి టపాగా ఇస్తున్నాను. కాని ఇక్కడ నుండి అంతా ఆ టపాను ఉద్దేశించే వ్రాయటం జరుగుతుంది.

తెలుగుమీడియా కబుర్ల వారూ -

మీ వ్యాసంలో కూడా అనేక అభ్యంతరకరమైన విషయాలున్నాయి. ఈ సంగతి మీకు స్పష్టంగా తెలిసే ఈ‌ వ్యాసం వ్రాసారని విశ్వసిస్తున్నాను.

మొట్ట మొదటిది, "సీఎం. కేసీఆర్ గారూ..ఇకచాలు నిషేధం ఎత్తేయరూ.." అన్నశీర్షిక.. ఈ శీర్షికను చూస్తే

- ఎత్తేయరూ అని  వేడికోలు దేకికి? కేసీఆర్‌గారు సీఎం హోదాలోనే కొన్నిఛానెళ్ళమీద నిషేధిం విధించారని మీరు నిర్థారిస్తున్నారు. కానీ దీన్ని ప్రభుత్వం ఎంతమాత్రం ఒప్పుకోవటం‌ లేదు. అటువంటప్పుడు తాము చేయని నిషేధాన్ని తాము ఎట్లా తొలగిస్తారూ కెసీఆర్‌గారు?

- మీడియా అనేది ప్రభుత్వం దయాదాక్షిణ్యాలమీద ఆధారపడి నడుస్తోందనో నడవాలనో మీరు తీర్మానం చేసేస్తున్నారు. ఇది సబబా? మీడియా అంటే సర్కారీ‌మీడియా అని అర్థం తీయవచ్చునా? నిషేధించే అదికారం ఉందంటే దానికి ముందే అనుమతించే దొరతనమూ ఉండాలి కదా? అలా  మీడియాను అనుమతించటం, నిషేధించటం సర్కారువారి యిష్టారాజ్యం అని జర్నలిష్టులే అంటే ఎలా?

-ఇకచాలు అన్న మాట ఎందుకు వాడారండీ? అంటే నిషేధం అనేది మౌలికంగా సరైన చర్య అనే మీరు తీర్పు ఇచ్చేస్తున్నారు. సరైన శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు ప్రభుత్వానికి క్షమాభిక్ష కోసం అర్థింపుపత్రం పంపుకుంటున్నట్లుగా ఉంది మీ ధోరణి. ఈ నిషేధం మీద మీకు సానుకూలమైన అభిప్రాయం ఉన్నందుకు విచారం వ్యక్తం చేస్తున్నాను.

ఈ రెండు ఛానెల్స్ ను బ్లాక్ చేసినందుకు ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత లేదనేది నమ్మాల్సిన సత్యం అని మీరు సెలవిచ్చారు. ప్రజల్లో వ్యతిరేకత లేదూ అని ప్రభుత్వం రోజూ చేస్తున్న ప్రచారాన్నే మీరూ ఈరోజు చేస్తున్నారు. ఉద్యమాల పేరుతో కొందరు రాజకీయులు ప్రజల్ని విజయవంతంగానో కొండొకచో బలవంతంగానో వీధుల్లోకి ఈడ్చి అల్లర్లు సృష్టించినట్లుగా ఈ ఛానెళ్ళవాళ్ళు ప్రజల్ని సమీకరించి వీధిపోరాటాలు చేయించలేదు కాబట్టి వ్యతిరేకత ఏమీ లేదని మీ తీర్మానమా?

నిషేధం విధించడం ఈ కాలమాన పరిస్థితులు, ముఖ్యమంత్రి మొండితనం నేపథ్యంలో ఒక భయంకరమైన విషయమేమీ కాదని మీ‌ అభిభాషణ చూస్తే మీరు ఈ నిషేధం పట్ల సానుకూలంగా ఉన్నారని మీరే ప్రకటిస్తున్నట్లు వెల్లడి అవుతోంది. మీడియాపై నిషేధం‌ భయంకరమైన విషయమే అని మీ వృత్తిలో వారికి తెలియదని అనుకునే అమాయకత్వంలో లేను. నిషేధం నేడు రెండు ఛానెళ్ళమీదనైనా రేపు మరిన్నో మొత్తం ప్రభుత్వేతర ఛానెళ్ళన్నిటిమీదనో అయ్యే అవకాశం లేదా? తోటకూర దొంగిలించిన నాడే బుధ్ధి చెప్పాలన్న ఇంగితం మీకెందుకు లేదు?

ఈ అంశం మీద కవిత, వినోద్ వెళ్లి డిస్కషన్స్ లో పాల్గొనడమే పెద్ద తప్పు. ముఖ్యమంత్రి కూడా ఇలాంటి ట్రాప్ లోనే పడి జర్నలిస్టులపై నోరు పారేసుకుని బద్నాం అయ్యారు  ఆహా! ఎం చెప్పారండీ? వాళ్ళు తమ పక్షాన సరైన వాదన వినిపించలేక పోవటం జరిగిందా లేక వారి దగ్గర సరైన వాదనే లేదా? ఏది నిజమో మీకు తెలీదా?  పైగా ముఖ్యమంత్రి ట్రాప్‌లో పడటం ఏమిటీ? శాంతియుతంగా జర్నలిష్టులు మౌననిరసన చేస్తుంటే అది ఒక ట్రాప్ ఎలా అయిందీ? అలా ఎందుకయిందీ?  అయన పక్షంలో ఏ లోసుగూ లేకుంటే ఆయనకు ఇబ్బంది ఏముండిందీ? ఆయన్ను బద్నాం చేసింది ఏదన్నా ఉందంటే అది ఆయన సంస్కారహీనమైన నోరే కాని మరేదీ కాదని మీకూ‌ చక్కగా తెలుసును.

మనోళ్ళను పట్టుకుని మనమే పది కిలోమీటర్ల లోతులో బొంద పెడతామనడం కరెక్టుగా లేదు అనటం సరైనదేనా?  మీ‌ ధోరణి చూసి ఈ‌ముక్క అనక తప్పదు. మనోళ్ళు కాని జర్నలిష్టులను అలా బొందపెట్టినా మీ‌కు అభ్యంతరం లేదన్న మాట!

మీడియా కోసం ఒక ప్రవర్తనా నియమావళి అర్జెంటుగా రూపొందించాలని మీరన్నది తీవ్రమైన మాట. మీ అభిభాషణ లన్నింటిలోను‌ తీవ్రాతితీవ్రమైన సంగతి. మీడియాకు ప్రభుత్వాలు ప్రవర్తనా నియమావళిని ఇవ్వటం అంటే ప్రభుత్వం అభిమతానికి అనుగుణంగా తాళం వేయవలసిందే తప్ప, మరో దారి లేదు మీకూ అని మీడియాకు ప్రభుత్వం స్పష్టంగా హుకుం జారీ చేయటమే.

జర్నలిజం అంటే ఒక దగుల్బాజీ వృత్తి కాదని, సామాజిక గురుతర బాధ్యత అన్న మెసేజ్ వెళ్ళేలా చేయాలి.  ఆ మాట నిజమే. అలాంటి పరిస్థితి తప్పక రావాలనే కొరుకుందాం. కాని ఎలా వెడుతుందండీ అలాంటి మెసేజీ? ఇలా అదే వృత్తిలో ఉన్నవారే వృత్తిగౌరవం గురించి తెలిసీ తెలియని చిత్రమైన మాటలు వ్రాస్తుంటే. 

ఇకపోతే ఒక మాట చెప్పాలి. జర్నలిజం ప్రమాణాలు క్షీణించటానికి కారణం మీరన్నటు త్రికా స్వేఛ్చ అంటే... యజమానుల స్వేఛ్చ కాదు. జర్నలిస్టుల స్వేఛ్చ, స్వాత్రంత్రాలు అన్న స్పృహ లోపించటమే. ఐనా, ఛానెల్స్ కు ఒక ఝలక్ అవసరమైన సమయంలోనే ఇది జరిగిందని మీ రనటం‌ హర్షించలేక పోతున్నాను. ఇది ఒక రకంగా మంచి పరిణామం అని మీలా అనుకోలేను. ఎమర్జన్సీలోనూ‌ మీడియాకు ఘట్టి దెబ్బలే తగిలాయి.  ఇప్పుడు కూడా ఘట్టి దెబ్బే తగిలింది. రెండుసార్లూ ప్రభుత్వాలే ఆ దెబ్బలు వేసాయి. రెండు సార్లూ అవసరమైన దెబ్బలే అని ఆయా ప్రభుత్వాలు సమర్థించుకున్నాయి కూడా.  ముందు ముందు మరికొన్ని రాష్ట్రప్రభుత్వాలూ ఇలాంటి దెబ్బలు వేస్తాయి మీడియా మీద ఇప్పు డది సరిగ్గా స్పందించకపోతే. ఇది కూడా ఒక అనుశాసన పర్వం అని మీరూ పాపం ఆప్పట్లో వినోబాభావే గారి లాగే అపోహలో కూరుకు పోతే ఎలా? దయచేసి ఆలోచించండి. 

నాకు రాజకీయాలపైన స్పందించాలన్న ఆసక్తి లేదు.  కాని ఇది రాజకీయవిషయం కాదు. పత్రికాస్వేఛ్చ విషయం. ఒక ప్రజాస్వామ్య మూలస్థంభం యొక్క ఆరోగ్యానికి సంబంధించిన అతిముఖ్యమైన విషయం. అందుకే చాలా అయిష్టంగానే తప్పనిసరి పరిస్థితిలో ఈ టపా వ్రాయవలసి వచ్చింది.

13 కామెంట్‌లు:

  1. శ్యామలీయం గారు,
    చాలా బాగా అడి(కడి)గారు.
    నిజానికి మీడియా అంటే రోత కలగటానికి జనాలకు, ఆయా సంస్థల అధిపతులకంటే, ఇలాంటి మరుగుజ్జు, హస్వదృష్టి జర్నలిస్ట్, లే కారణం.

    గురువింద గింజ కు తన నలుపు తెలియనట్లు, ఓ ప్రక్క మీడియా యజమానులను వాళ్ళ కుల, ప్రాంత feelings ను తప్పు బడుతూ, అంతకంటే ఎక్కువుగా కళ్ళు మూసుకు పోయిన, ఈ కబోదు జర్నలిస్ట్ లను ఏమనాలో తెలియదు!!

    ఓ ప్రక్క అసలు బ్యాన్ కు, KCR కు ఏమి సంబంధం అని బుకాయింపు, మరో ప్రక్క ఈ బతిమాలుడు, అది ఓ మీడియా వాళ్ళగా!!(చస్, వీళ్ల బ్రతుకులకంటే, అడుకొన్నే వాళ్ళు ధైర్యం గా, దర్జాగా అడుకొంటున్నారేమో)

    రిప్లయితొలగించండి
  2. ఏం చేయను చెప్పండి. ఈ‌ వ్యాసం వ్రాయవలసి వచ్చినందుకు విచారంగా ఉంది. కాని కొందరు సదరు వ్యాసంలోని అభిప్రాయాలమాయలో పడిపోకుండా వ్రాయక తప్పింది కాదు. మీడియా మీద ప్రభుత్వనియంత్రణ దొరతనాలకు మీడియాను కత్తిరించే పీక ఉత్తరించే అధికారం బంగారుపళ్ళెంలో పెట్టి ఇవ్వటం. అదికావాలని కొందరు జర్నలిష్టులే అడగటం - ఎంత ఘోరం!

    రిప్లయితొలగించండి
  3. శ్యామలీయం గారు,

    చాలా బాగా రాసారండి. అభినందనలు!

    రిప్లయితొలగించండి
  4. శ్యామలీయం గారు,
    చాలా బాగా చెప్పారు. నిజమే, గురవింజ గింజకు తన కింద వున్న నలుపు గురుంచి తెలియదు!!
    కృష్ణ

    రిప్లయితొలగించండి
  5. మీరు రెండు విషయాలు (ఎమర్జెన్సీ సెన్సార్ & ప్రస్తుత "బాన్") ఉటంకించారు సంతోషం. ఇంకా ఎన్నెన్నో సంగతులు సమీప భూతకాలంలో జరిగాయి. మచ్చుకు కొన్ని.

    1. నిజామాబాదు ఉప ఎన్నికలప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్ న్యూస్ (ప్రస్తుత టీ-న్యూస్) ప్రసారాలు రెండు రోజులు ఆపేసింది
    2. మానుకోట ఘటన తరువాత ఇదే కులదీప్ సాహనీ (తెలంగాణా ఎమేస్వో నాయకుడు) సాక్షి చానెల్ "బాన్" చేసారు
    3. ఆంద్ర ప్రాంతంలో టీ-న్యూస్, వీ6 చానెళ్ళు ఎప్పటినుండో "బాన్" అయి ఉన్నాయి
    4. దినేష్ రెడ్డి గారిపై కథనం రాసినందుకు హిందూ నగేష్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వచ్చింది
    5. ప్రస్తుతం బెజవాడ ఎమేస్వోలు టీవీ5 "బాన్" చేసారు
    6. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నమస్తే తెలంగాణ, సాక్షి పేపర్లకు మరియు టీ-న్యూస్, వీ6, సాక్షి చానెళ్లకు పాసులు నిరాకరిస్తుంది.

    వీటి గురించి పట్టించుకున్న నాదుదేడీ? వేమూరికి తప్ప మిగిలిన వారికి పత్రికా స్వేచ్చ వర్తించదా?

    ఏతావాతా తేలేది ఏమిటంటే తమకు నచ్చని వారు చేసే పని అసమదీయులు చేస్తే ఫరవా లేదు!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జైగారూ, నేను హైదరాబాదులో నివాసం ఉన్నాను. దైనందినసీమాంధ్రసంగతులు నా దృష్టికి రావటం నిజంగా తక్కువ. నాకు అస్మదీయులే కాని తస్మదీయులెవరూ లేరు. మీ రుదహరించిన విషయాలు నాకు నిజంగా తెలియవు. పత్రికల స్వేఛ్ఛను ఏప్రాంతంలో రాజకీయజోక్యం ఏ కారణం చూపి కబళించినా హర్షించను. ఐతే ఒక ప్రాంతానికి పరిమితమైన ఛానెళ్ళు మరొక ప్రాంతంలో పెద్దగా ఆదరణ పొందకపోవటం విశేషం కాదు కాని ఆ కారణం చేత కేబుల్ నిర్వాహకులు వాటిని నిషేధించటం ఉచితం కాదు కాబట్టి సాంకేతికమైన చిక్కులేవీ లేకపోతే అందుబాటులో ఉన్న ఛానెళ్ళను అందించవలసిందే నని నా అభిప్రాయం. ప్రభుత్వాలు ఈ‌ విధంగా కేబుల్ నిర్వాహక సంస్థలో సంఘాలో స్వయం నిర్ణయం తీసుకోకుండా తగిన నిబంధనలు విధించటం చేయాలి . ఇందులో‌ చట్టపరమైన చిక్కులున్నాయేమో‌ చెప్పలేను. పత్రికా స్వేఛ్ఛ అన్నది ప్రజల కోసమే కాని ఏ మీడియా మొఘల్ కోసమో, సంపాదకరత్నం కోసమే, విలేఖరిమహాశయుడి కోసమో వగైరా కాదు కాబట్టి ఫలానివారికి లాభం‌కలిగే స్వేఛ్ఛ అని నిర్వచిస్తానని ఎలా అనుకున్నారో‌ బోధపడలేదు. మీరు నా వ్యాసానికి అనుబంధంగా, అవసరమైన విమర్శతో సహా విపులంగా మీ బ్లాగులో ఒక వ్యాసం వ్రాస్తే నా బోటివారికి చాలా విషయాలు తెలియవచ్చును.

      తొలగించండి
    2. మీ నైజం నాకు తెలుసు. నేను మిమ్మల్ని వేలెత్తి చూపలేదు. Knowing your nature well, I will never even dream of accusing you.

      నేను మాట్లాడుతున్నది "హైదరాబాదులో ఉన్న సగటు చదువుకున్న ఆంధ్రుల" గురించి.

      నేను రాసిన విషయాలలో అన్నీ హైదరాబాదులో తెలిసేవే. హిందూ నగేష్ & చంద్రబాబు పాసుల విషయాలు కొద్దో గొప్పో పబ్లిసిటీలోకి వచ్చాయి కూడా.

      తమకు నచ్చని విషయాలను ఇగ్నోర్ చేసేవారు కొందరయితే అలాంటి విషయాలు తెలుసుకునే అవకాశం లేని వారు కొందరు. ఉ. ఆంధ్రజ్యోతి మాత్రమె చదివే వ్యక్తికీ ఒకప్పుడు తెలంగాణా ఎమేస్వోలు సాక్షిని బాన్ చేసారన్న విషయం తెలియదు. This leads to an inbuilt filter (or even bias) in the very process of data acquisition.

      తొలగించండి
    3. జైగారూ, మీ అభిమానానికి కృతజ్ఞతలు.

      మీరు చెప్పిన విషయం అవశ్యం ఆలోచించ దగ్గది. అందుచేతనే, ఈ వ్యవహారం గురించిన పూర్వాపరాలు వివరిస్తూ మీరొక టపా వెలువరించవలసిందని కోరటం‌ జరిగింది.

      తొలగించండి
  6. Jai Gottimukkala గారు చెప్పిన విషయాలతో నేను ఏకీభవిస్తున్నాను .
    సాక్షి ని చంద్రబాబు తన చాయలకు కూడా రానివ్వడు. దీన్ని అడిగేవాడు ఎవ్వడూ లేదు . "ఆంధ్ర" జ్యోతి మాత్రం తెలంగాణలో కావాలా ?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జైగారి ముఖ్యమైన విషయాలు ప్రస్తావించారు. అందులో సందేహం లేదు. కాని అందరికీ నేను మరొకసారి చేసే విన్నపం ఏమిటంటే నా వ్యాసాన్ని ఏ పార్టీ(ల)నో, ఏప్రభుత్వా(ల)నో లేదా ఏ రాష్ట్రాన్నో / ఏ రాష్ట్రాలనో‌ దృష్టిలో పెట్టుకుని వ్రాయలేదు. కేవలం మీడియాస్వేఛ్ఛవిషయంగానే స్పందించి వ్రాసాను. అండుచేత నన్ను రాజకీయప్రశ్నలు అడగటం భావ్యం కాదు. రాజకీయాలను చర్చకు తీసుకురావద్దని అందరికీ నా విజ్ఞప్తి.

      తొలగించండి
  7. స్లాన్టింగ్ ఎలా ఉంటుందో చూపించే ఒక ఉదాహరణ:

    http://telanganaassange.blogspot.in/2014/09/blog-post_36.html

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జైగారు. వార్తలకు రంగురుచివాసనలను అద్ది వదలటం అంటే ఎలా ఉంటుందో మీ రిచ్చిన పేజీలో స్పష్టంగా చూపబడింది. పత్రికలకు విలువలకన్నా చలామణీ ముఖ్యం అన్న సూత్రం వర్తించినప్పుడు పరిస్థితి ఇలాగే దిగజారుతుంది. దీనివలన పత్రికల విశ్వసనీయతా చెడుతుంది, ప్రజల్లో సౌభ్రాతృత్వమూ చెడుతుంది. ఐతే ఈలోగా తాత్కాలికంగా కొందరి బొక్కసం మరికొంచెం నిండుతుంది. అంతే. ఇక్కడ ఒక చిక్కు ప్రశ్న ఏమిటంటే ఈ‌రకమైన ధోరణులను ఎలా నిరోధించటం?

      తొలగించండి
  8. వాళ్ళు చేసారు కదా మేము చేస్తే తప్పేమిటి అన్న ధోరణి ఎవరికీ మంచిది కాదు. అసలు ఏమి చెయ్యలన్నదాని మీద చర్చిస్తే ఎవరికైన ప్రయోజనం ఉంటుంది. ఖండించాల్సిన విషయాలు స్థలకాలాదులూ, ప్రాంతీయ సంకుచిత భావాలతో సంభంధం లేకుండా ఖంఢనీయాలే.

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.