12, సెప్టెంబర్ 2014, శుక్రవారం

ఛానెళ్ళపై నిషేధం ఎత్తివేత గురించిన ఒక టపా పై స్పందన


వారు నిషేధం ఎత్తేయమని విజ్ఞప్తి చేయటం వరకూ బాగానే ఉంది. కాని ఆ వ్యాసం ధోరణి నాకైతే నచ్చలేదు.  ఒక వ్యాఖ్య చేదామని మొదలుపెడితే అది చాలా పెద్దదైపోయింది. అందుచేత నా పాత అలవాటు ప్రకారం, దాని ఇక్కడ ఒక విడి టపాగా ఇస్తున్నాను. కాని ఇక్కడ నుండి అంతా ఆ టపాను ఉద్దేశించే వ్రాయటం జరుగుతుంది.

తెలుగుమీడియా కబుర్ల వారూ -

మీ వ్యాసంలో కూడా అనేక అభ్యంతరకరమైన విషయాలున్నాయి. ఈ సంగతి మీకు స్పష్టంగా తెలిసే ఈ‌ వ్యాసం వ్రాసారని విశ్వసిస్తున్నాను.

మొట్ట మొదటిది, "సీఎం. కేసీఆర్ గారూ..ఇకచాలు నిషేధం ఎత్తేయరూ.." అన్నశీర్షిక.. ఈ శీర్షికను చూస్తే

- ఎత్తేయరూ అని  వేడికోలు దేకికి? కేసీఆర్‌గారు సీఎం హోదాలోనే కొన్నిఛానెళ్ళమీద నిషేధిం విధించారని మీరు నిర్థారిస్తున్నారు. కానీ దీన్ని ప్రభుత్వం ఎంతమాత్రం ఒప్పుకోవటం‌ లేదు. అటువంటప్పుడు తాము చేయని నిషేధాన్ని తాము ఎట్లా తొలగిస్తారూ కెసీఆర్‌గారు?

- మీడియా అనేది ప్రభుత్వం దయాదాక్షిణ్యాలమీద ఆధారపడి నడుస్తోందనో నడవాలనో మీరు తీర్మానం చేసేస్తున్నారు. ఇది సబబా? మీడియా అంటే సర్కారీ‌మీడియా అని అర్థం తీయవచ్చునా? నిషేధించే అదికారం ఉందంటే దానికి ముందే అనుమతించే దొరతనమూ ఉండాలి కదా? అలా  మీడియాను అనుమతించటం, నిషేధించటం సర్కారువారి యిష్టారాజ్యం అని జర్నలిష్టులే అంటే ఎలా?

-ఇకచాలు అన్న మాట ఎందుకు వాడారండీ? అంటే నిషేధం అనేది మౌలికంగా సరైన చర్య అనే మీరు తీర్పు ఇచ్చేస్తున్నారు. సరైన శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు ప్రభుత్వానికి క్షమాభిక్ష కోసం అర్థింపుపత్రం పంపుకుంటున్నట్లుగా ఉంది మీ ధోరణి. ఈ నిషేధం మీద మీకు సానుకూలమైన అభిప్రాయం ఉన్నందుకు విచారం వ్యక్తం చేస్తున్నాను.

ఈ రెండు ఛానెల్స్ ను బ్లాక్ చేసినందుకు ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత లేదనేది నమ్మాల్సిన సత్యం అని మీరు సెలవిచ్చారు. ప్రజల్లో వ్యతిరేకత లేదూ అని ప్రభుత్వం రోజూ చేస్తున్న ప్రచారాన్నే మీరూ ఈరోజు చేస్తున్నారు. ఉద్యమాల పేరుతో కొందరు రాజకీయులు ప్రజల్ని విజయవంతంగానో కొండొకచో బలవంతంగానో వీధుల్లోకి ఈడ్చి అల్లర్లు సృష్టించినట్లుగా ఈ ఛానెళ్ళవాళ్ళు ప్రజల్ని సమీకరించి వీధిపోరాటాలు చేయించలేదు కాబట్టి వ్యతిరేకత ఏమీ లేదని మీ తీర్మానమా?

నిషేధం విధించడం ఈ కాలమాన పరిస్థితులు, ముఖ్యమంత్రి మొండితనం నేపథ్యంలో ఒక భయంకరమైన విషయమేమీ కాదని మీ‌ అభిభాషణ చూస్తే మీరు ఈ నిషేధం పట్ల సానుకూలంగా ఉన్నారని మీరే ప్రకటిస్తున్నట్లు వెల్లడి అవుతోంది. మీడియాపై నిషేధం‌ భయంకరమైన విషయమే అని మీ వృత్తిలో వారికి తెలియదని అనుకునే అమాయకత్వంలో లేను. నిషేధం నేడు రెండు ఛానెళ్ళమీదనైనా రేపు మరిన్నో మొత్తం ప్రభుత్వేతర ఛానెళ్ళన్నిటిమీదనో అయ్యే అవకాశం లేదా? తోటకూర దొంగిలించిన నాడే బుధ్ధి చెప్పాలన్న ఇంగితం మీకెందుకు లేదు?

ఈ అంశం మీద కవిత, వినోద్ వెళ్లి డిస్కషన్స్ లో పాల్గొనడమే పెద్ద తప్పు. ముఖ్యమంత్రి కూడా ఇలాంటి ట్రాప్ లోనే పడి జర్నలిస్టులపై నోరు పారేసుకుని బద్నాం అయ్యారు  ఆహా! ఎం చెప్పారండీ? వాళ్ళు తమ పక్షాన సరైన వాదన వినిపించలేక పోవటం జరిగిందా లేక వారి దగ్గర సరైన వాదనే లేదా? ఏది నిజమో మీకు తెలీదా?  పైగా ముఖ్యమంత్రి ట్రాప్‌లో పడటం ఏమిటీ? శాంతియుతంగా జర్నలిష్టులు మౌననిరసన చేస్తుంటే అది ఒక ట్రాప్ ఎలా అయిందీ? అలా ఎందుకయిందీ?  అయన పక్షంలో ఏ లోసుగూ లేకుంటే ఆయనకు ఇబ్బంది ఏముండిందీ? ఆయన్ను బద్నాం చేసింది ఏదన్నా ఉందంటే అది ఆయన సంస్కారహీనమైన నోరే కాని మరేదీ కాదని మీకూ‌ చక్కగా తెలుసును.

మనోళ్ళను పట్టుకుని మనమే పది కిలోమీటర్ల లోతులో బొంద పెడతామనడం కరెక్టుగా లేదు అనటం సరైనదేనా?  మీ‌ ధోరణి చూసి ఈ‌ముక్క అనక తప్పదు. మనోళ్ళు కాని జర్నలిష్టులను అలా బొందపెట్టినా మీ‌కు అభ్యంతరం లేదన్న మాట!

మీడియా కోసం ఒక ప్రవర్తనా నియమావళి అర్జెంటుగా రూపొందించాలని మీరన్నది తీవ్రమైన మాట. మీ అభిభాషణ లన్నింటిలోను‌ తీవ్రాతితీవ్రమైన సంగతి. మీడియాకు ప్రభుత్వాలు ప్రవర్తనా నియమావళిని ఇవ్వటం అంటే ప్రభుత్వం అభిమతానికి అనుగుణంగా తాళం వేయవలసిందే తప్ప, మరో దారి లేదు మీకూ అని మీడియాకు ప్రభుత్వం స్పష్టంగా హుకుం జారీ చేయటమే.

జర్నలిజం అంటే ఒక దగుల్బాజీ వృత్తి కాదని, సామాజిక గురుతర బాధ్యత అన్న మెసేజ్ వెళ్ళేలా చేయాలి.  ఆ మాట నిజమే. అలాంటి పరిస్థితి తప్పక రావాలనే కొరుకుందాం. కాని ఎలా వెడుతుందండీ అలాంటి మెసేజీ? ఇలా అదే వృత్తిలో ఉన్నవారే వృత్తిగౌరవం గురించి తెలిసీ తెలియని చిత్రమైన మాటలు వ్రాస్తుంటే. 

ఇకపోతే ఒక మాట చెప్పాలి. జర్నలిజం ప్రమాణాలు క్షీణించటానికి కారణం మీరన్నటు త్రికా స్వేఛ్చ అంటే... యజమానుల స్వేఛ్చ కాదు. జర్నలిస్టుల స్వేఛ్చ, స్వాత్రంత్రాలు అన్న స్పృహ లోపించటమే. ఐనా, ఛానెల్స్ కు ఒక ఝలక్ అవసరమైన సమయంలోనే ఇది జరిగిందని మీ రనటం‌ హర్షించలేక పోతున్నాను. ఇది ఒక రకంగా మంచి పరిణామం అని మీలా అనుకోలేను. ఎమర్జన్సీలోనూ‌ మీడియాకు ఘట్టి దెబ్బలే తగిలాయి.  ఇప్పుడు కూడా ఘట్టి దెబ్బే తగిలింది. రెండుసార్లూ ప్రభుత్వాలే ఆ దెబ్బలు వేసాయి. రెండు సార్లూ అవసరమైన దెబ్బలే అని ఆయా ప్రభుత్వాలు సమర్థించుకున్నాయి కూడా.  ముందు ముందు మరికొన్ని రాష్ట్రప్రభుత్వాలూ ఇలాంటి దెబ్బలు వేస్తాయి మీడియా మీద ఇప్పు డది సరిగ్గా స్పందించకపోతే. ఇది కూడా ఒక అనుశాసన పర్వం అని మీరూ పాపం ఆప్పట్లో వినోబాభావే గారి లాగే అపోహలో కూరుకు పోతే ఎలా? దయచేసి ఆలోచించండి. 

నాకు రాజకీయాలపైన స్పందించాలన్న ఆసక్తి లేదు.  కాని ఇది రాజకీయవిషయం కాదు. పత్రికాస్వేఛ్చ విషయం. ఒక ప్రజాస్వామ్య మూలస్థంభం యొక్క ఆరోగ్యానికి సంబంధించిన అతిముఖ్యమైన విషయం. అందుకే చాలా అయిష్టంగానే తప్పనిసరి పరిస్థితిలో ఈ టపా వ్రాయవలసి వచ్చింది.