20, మార్చి 2026, శుక్రవారం

పద్యం వ్రాయటం గురించి - 3


 ఏలలితకళకు ఐనా సహజసిద్దం ఐన ప్రతిభ కొంత ఉండితీరాలి అన్నాను. ఆముక్క మీద చర్చించుకోవలసినది మరికొంత ఉంది.

సహజసిధ్ధం అంటే  పుట్టుకతో వచ్చినది అని అర్ధం. దానినే దైవదత్తంగా వచ్చిందనీ అంటూ ఉంటాం.

ఇక్కడ దైవం అంటే భగవంతుడు అన్న అర్ధం కాదు. దైవం అంటే మనిషికి పురాకృతమే. ఏజన్మము ఐనా అది అంతము ముందు నడచిన జన్మపరంపరకు కొనసాగింపుగానే తెలుసుకోవాలి.

పూర్వజన్మ కర్మములయందు మన జీవునకు అంటిన వాసనాబలం ప్రస్తుతజన్మకు సహజమై వస్తుంది. ఒకడు యోగసాధకుడుగా ఉంటాడు. జన్మాంతం ఐనది. మరుజన్మకు తన సాధనాబలం తీసుకొని వస్తాడు. తగిన సమయసందర్భాలు ఏర్పడగానే మరల యోగసాధనను అవలంబిస్తాడు. ఈవిషయం భగవద్గీతాంతర్గతంగా ఉన్నదే కాని నేను చెప్పే మాట కాదు.

మంగళంపల్లి వారు  తన ఏడవయేటనే సంగీతకచేరీ చేసారు. సూర్యగాయత్రి గొంతులో లయను తల్లి మూడవయేటనే గుర్తించింది - ఆమె యిప్పుడు ప్రముఖగాయని - పదేళ్ళక్రిందటినుండే మంచి గాయనిగా గుర్తింపుపొందింది. కన్నడ ఛానెల్ వి మ్యూజిక్ టేల్స్ వీడియోల్లో కనిపించే ఆత్రేయ సిస్టర్స్ సంగతీ అటువంటిదే. చిన్నవయస్సులోనే అష్టావధానాలు చేస్తున్న వాళ్ళను చూస్తున్నాం. మావాళ్ళల్లో కొందరు చిన్నపిల్లలు అద్భుతంగా బొమ్మలు వేస్తున్నారు.

ఇటువంటి వారి వెనుక జన్మపరంపరాగతమైన వాసనాబలం ఉందని చెప్పకతప్పదు.

పుట్టుకతో  కవిత్వం వ్రాసే ప్రజ్ఞ రాకపోతే నేర్వకూడదా అంటే తప్పక నేర్వవచ్చును. అది కూడా సంభవమే. కవిత్వం అయేది మరొకటి అయేది పట్టుబట్టి నేర్చుకుంటే అలవడ కూడని విద్య యేమీ కాదు. కాని అందుకు ఎంతో దీక్ష అవసరం. మంచి శిక్షణ అవసరం. సులభమార్గాలూ ఉపాయాలూ అంటూ అడ్డదారుల ప్రలోభాలను జయించటం ముఖ్యం. మంచి గురువు ముఖ్యం. గొప్ప సాధన ముఖ్యం.

సహజంగా పుట్టువుతో ఒక కళ మీద ప్రజ్ఞ రాకపోయినా ఇలా కొందరు రాటుదేరతారు. పట్నం సుబ్రహ్మణ్యం అయ్యరు గారి కంఠం పాటకు అనువు కాదని గురువులు తిరస్కరిస్తే ఆయన వారిని మెప్పించటానికి కఠోరమైన సాధన చేసారు. ఎంత మంచి కంఠాన్ని సాధించి ఎంత గొప్ప గాయకులు అయ్యారో అందరికీ తెలుసు.

కొందరకు  ఎంత సాధన చేసినా కొన్ని కళలు పట్టుబడక పోవచ్చు. భగవంతుడు మరొక దారి చూపుతాడు.

ఏదైనా కళ మీద అభిమానం కల్గటం మంచిదే. అకళను అభ్యాసం చేయాలనుకోవటం మంచిదే. కాని ఎంత సాధనచేసినా పట్టుబడనప్పుడు వదిలిపెట్టటం కూడా మంచిదే.

సాధన అన్నది ఎంత చిత్తశుధ్ధిగా చేసాము అన్నది ముఖ్యం. ఎంత తీవ్రంగా చేసాము అన్నది ముఖ్యం.

సాధనాక్రమంలో ఏర్పడే దురదను నిగ్రహించుకోవటం మరీ ముఖ్యం.

కవిత్వం విషయం లోనికి వస్తే ఒక పద్యం వ్రాస్తే ఈ రోజుల్లో దాన్ని ప్రచురించి జనం మీదకు వదలటం మహాసులువు. అభ్యాసం కోసం వ్రాస్తున్న ప్రతి పద్యం ప్రచురణ చేస్తే ఎలా? 

విశ్వనాథ వారిని ఎవరో అడిగారు. మీరు ఇంతవరకూ ఎన్ని పద్యాలు వ్రాసి ఉంటారు అని. నేను వ్రాసి చించివేసిన పద్యాలే ఒక ముఫ్ఫైవేల కంటే ఎక్కువే ఉంటాయి అన్నారు. అంటే ఏమన్న మాట? అంత కఠోరసాధన చేసారు అని. తనదైన శైలి ఒకటి ఏర్పడే దాకా, తన ధారశుధ్ధి వగైరాలు సంతృప్తికరంగా అనిపించేదాకా ఆయన తన పద్యాలను జనం ముందుకు తేలేదు.

ఇప్పుడు? ఔత్సాహికులు పద్యం వ్రాయటం ఆలస్యం అది బాగా వచ్చిందా లేదా అన్న పట్టింపు లేకుండా జనం మీదకు విసురుతున్నారు.

ఒక పద్యం బాగా వచ్చిందా అని మొదట్లో మనకు ఎలా తెలుస్తుంది?

ఎవరైనా గురువులను ఆశ్రయించాలి.  

మొకానికల్ టూల్స్ గురువులు కాలేవు.

మీరు పద్యం వ్రాయటానికే ఒక టూల్ వాడుతూ, ఆ టూల్ కాస్తా పద్యం పూర్తయింది అనగానే మంచిపద్యం వచ్చేసింది అని భ్రమపడటం అక్షరాలా అజ్ఞానం.

ఒకరు కాకపోతే నలుగురు పెద్దలసాయంతో తప్పులు దిద్దుకుంటూ పరిశ్రమ చేస్తే క్రమంగా పద్యం వ్రాయటం పైన పట్టుసాధించవచ్చును. కొందరికి ఏడాది పట్టవచ్చు. కొందరికి ఏడేళ్ళు పట్టవచ్చు. కొందరికి వల్లకాకపోవచ్చును కూడా.