17, మే 2015, ఆదివారం

దేవుడవని మొన్ననే తెలిసికొంటిని



దేవుడవని మొన్ననే తెలిసికొంటిని
కావుమని నిన్ననే వేడుకొంటిని
ఈవేళ వత్తువని వేచియుంటిని నీ
వేవేళకు వత్తువో తెలియకుంటిని

కబురు చేయుదమంటే కనబడరే నా కెవరూ
కబురు పంపుటకు నీకు కనబడలేదా ఎవరూ
గుబులాయె రామ ఈ జీర్ణకుటీరము నీకు
సబహుమానముగ తగిన స్వాగత మిచ్చేనా
॥దేవుడవని॥
గొప్పగొప్పవారు నిన్ను కొలువ వైకుంఠములో
తప్పనిసరి పనుల మధ్య తలమునక లైతివో
ఎప్పటికి వీలు చిక్కి యిటు వచ్చెదవో రామ
అప్పటికే జీర్ణకుటిని ఆరగించు కాలము
॥దేవుడవని॥
వేదాంతిని కాను నేను విద్యలేవి నేర్వలేదు
నీ దారితెన్నులను నేనెఱుగ నేనెఱుగ
ఓ దయామయ నమ్మి యున్నాను వత్తువని
వేదన లడలించవయ్య విచ్చేయ వయ్య రామ
॥దేవుడవని॥



10, మే 2015, ఆదివారం

నిన్ను కాక వే రెవరిని సన్నుతింతురా రామ

తిన్ననైననడత లేని నన్ను కటాక్షించితి విక
నిన్ను కాక వే రెవరిని సన్నుతింతురా రామ

ధర్మమొక్క టున్నదని తలదాల్చుట యుచిత మని
నిర్మలాచరణుల కది నిత్యరక్ష సలుపు నని
దుర్మోహపు పరిణామము దుష్కర్మాచరణ మని
కర్మఫలానుభవము చాల కఠిన మనుచు నెరుగ నట్టి   ॥తిన్ననైన॥

పెద్దలాడు మాటలలో సుద్దులెరిగి వర్తించక
గద్దరినై పలువురతో కలహించుచు గడపి నట్టి
పద్దువేసి ఎత్తిచూపి పాశధరుని లేఖకుడు
గద్దించుచు పలుకుదినము కలదని తలపోయ నట్టి   ॥తిన్ననైన॥

నీ‌ పాదములకు పూజ నే నెన్నడు చేసితిని
నీ పావన నామమును నే నెంత జపించితిని
నీ పారమ్యము నమ్మని నీచులతో చేరితిని
నా పగిది వారి నైన నమ్మకముగ బ్రోతునని   ॥తిన్ననైన॥


4, మే 2015, సోమవారం

ప్రజ పోర్టల్‍లో ప్రచురితమైన నా ముఖాముఖీ

మున్నుడి.

ఈ క్రింద ప్రచురించిన విషయం అంతా తెలుగు బ్లాగు కాలక్షేపం సరుకు కాదని గర్వంగా అనుకునే రోజు రావాలి - శ్యామలరావు అనే శీర్షికతో ప్రజ పోర్టల్ కోసం నేను ఇచ్చిన ముఖాముఖీ  ప్రకటితమైన ఈ ఏప్రిల్ 26నాటి టపా నుండి యథాతధంగా స్వీకరించి పునర్ముద్రణ కావించబడుతున్నది. అక్కడ ప్రచురితమైన స్పందనలకు నకళ్ళు చేసి ప్రచురించటం ఉచితంగా ఉండదు కాబట్టి అలా చేయటం లేదు. పాఠకులు అసౌకర్యంగా భావించక అక్కడ వాటిని పరిశీలించగలరు.



తాడిగడప శ్యామల రావు


శ్యామలీయం ...... ఈ పేరు వినగానే 'మాష్టారు' అని వెంటనే గుర్తుకు వస్తుంది. అయితే ఆయన మాష్టారు కాదు....... ఈ పేరు వినగానే తెలుగు పండితుడిని తలచుకున్నట్లుంటుంది. కానీ ఆయన తెలుగు పండితుడూ కాడు. కేవలం మాతృ భాషపై అభిమానంతో తెలుగుపై పట్టు సాధించిన ఆయన వృత్తి రీత్యా సాఫ్ట్ వేర్ రంగంలో ఉన్నారు. నేటి నెటిజెనులకు తెలుగులో తప్పులను సవరించాలన్నా, సలహాలివ్వాలన్నా ముందుగా గుర్తుకువచ్చే పేరు శ్యామలీయం గారిదే. రాముడు మంచి బాలుడు అన్నట్లుగా ఆయన బ్లాగులోకంలో గౌరవించదగిన వ్యక్తి. రామభక్తుడు కావడం కూడా ఆయన మంచి లక్షణాలకు కారణమనిపిస్తుంది. ఆయనను 'రామభక్త శ్యామలీయం' అని పిలిస్తే బాగుంటుందనుకుంటాను. అనేక విషయాలపై పట్టున్న శ్యామలీయం గారిని ' ప్రజ ' వివిధ ప్రశ్నలతో ఇంటర్వ్యూ చేయడం జరిగింది. వివిధ అంశాలపై  తాడిగడప శ్యామలరావు గారి అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఈ ఇంటర్వ్యూ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను.



(తాడిగడప శ్యామలరావు)


ప్రశ్న   :  మీ పూర్తి పేరు ?
జవాబు : తాడిగడప శ్యామలరావు. మా అమ్మానాన్నలు నా పేరు శ్యామలరావు అని పెట్టటం‌ కేవలం యాదృఛ్చికం కాదు. 

 ప్రశ్న:     తల్లిదండ్రుల వివరాలు? 
జవాబు: మానాన్నగారు స్వర్గీయ శ్రీ తాడిగడప వేంకట సత్యనారాయణగారు. మా అమ్మగారు స్వర్గీయ శ్రీమతి రంగనాయకమ్మగారు. మా నాయనగారు ఆవిడ పేరును రంగమణిగా వ్యవహారంలోనికి తెచ్చారు. 

 ప్రశ్న:     మీరు పుట్టిన ఊరు వివరాలు?
జవాబు:  పుట్టిన ఊరు మా స్వగ్రామం తూర్పుగోదావరిలోని లక్ష్మీపోలవరం గ్రామం. ఇది ప్రసిధ్ధపుణ్యక్షేత్రం ర్యాలి దగ్గర ఉంది. ర్యాలి అంటే తెలుసుగా, అక్కడ శ్రీజగన్మోహినీకేశవస్వామివారు కొలువై ఉన్నారు. అయన ఎదురుగా ఉమాకమండలేశ్వరస్వామివారు నెలకొని ఉన్నారు. నేను పశ్చిమగోదావరి జిల్లాలోని తణుకు పట్టణంలో జన్మించాను. అ సమయంలో మా మాతామహులు స్వర్గీయ శ్రీ పాలకోడేటి భీమశంకర రావుగారు అక్కడ ఉద్యోగరీత్యా నివసిస్తూ ఉండేవారు. వారు అప్పట్లో అద్దెకు ఉన్న ఇల్లు ఒక అయ్యంగార్ గారిది. నేను పెద్దయ్యాక ఒక పర్యాయం ఆ అయ్యంగార్ గారిని హైదరాబాద్ లోనే దర్శించటం జరిగింది. సంగతి సందర్భాలు అంతగా గుర్తుకు రావటం లేదు. మా మేనమామ గారు పిజియస్ఆర్ కృష్ణారావుగారు నన్ను అయ్యంగార్ గారి నివాసానికి తీసుకొని వెళ్ళారని మాత్రం గుర్తుంది.

ప్రశ్న     : మీ పుట్టిన తేది  ?
జవాబు : నిజానికి నేను పుట్టింది 1952, మే 6వ తారీఖున రాత్రి 10గం. 20నిముషాలకు. కాని స్కూలు రికార్డులలో అగష్టు 12గా నమోదయింది.

ప్రశ్న:    మీ విద్యార్హతలు?
జవాబు: విద్యార్హతలు నేను సైన్స్ గ్రాడ్యుయేట్‌ని. పోష్ట్ గ్రాడ్యుయేషన్ అన్నది తీరని కలగానే మిగిలి పోయింది. నిజానికి బి.ఎస్సీ కాగానే ఆంద్రా యూనివర్శిటీలో అప్లైడ్ మాధమేటిక్స్ చదువటానికి అవకాశం వచ్చింది - అప్పట్లో సీట్లు చాలా పరిమితంగానే ఉండేవి. ఐనా సీటొచ్చింది కాని వైజాగ్ వెళ్ళలేదు. ఆర్థిక కారణాల వలన ఎమ్మెస్సీ చేయలేకపోయాను. ఆ తరువాత అచిరకాలంలోనే సంసారబాధ్యతలు చేపట్టటంతో పోష్టుగ్రాడ్యుయేషన్ ఎండమావి ఐపోయింది. 

ప్రశ్న   :    మీ విద్యాభ్యాసం వివరాలు?
జవాబు : విద్యాభ్యాసం వివరాలు నా విద్యార్థిదశ లక్ష్మీపోలవరం, గెద్దనాపల్లి, కొత్తపేట, అమలాపురం అనే చోట్ల జరిగింది. ఇందులో లక్ష్మీపోలవరం మా స్వగ్రామం. అక్కడ ప్రాథమిక విద్య అభ్యసిస్తుండగా మూడవ క్లాసులో ఉండగా కాబోలు గెద్దనాపల్లికి నా చదువు మారింది. అక్కడ ఎనిమిదవ తరగతి వరకే ఉంది. ఏడవ తరగతిలో ఉండగా నా చదువు కొత్తపేటకు మారింది. కొత్తపేటలో పన్నెండవ తరగతి వరకూ చదువు. అపైన అమలాపురం ఎస్.కె.బి.అర్. కాలేజీలో బి.ఎస్సీ చదువు. మానాన్నగారు ఉపాధ్యాయులు కాబట్టి నా చదువు ఊళ్ళుపట్టుకు తిరిగిందన్నమాట. విశేషం ఏమిటంటే మానాన్నగారు కూడా ఉన్నతవిద్య అంతా కొత్తపేటలోనే చదివారు. మళ్ళీ అదే హైస్కూలుకు అయన ఉపాధ్యాయులుగా వచ్చారు. చదువులో చురుగ్గానే ఉండేవాడిని. కాని అప్పట్లో అంటే అరవైల్లో రాంకుల యావ లేదు. ఏదన్నా గైడ్ పుస్తకం అన్నది సుతరామూ మానాన్నగారి కంటబడటానికి కూడా వీల్లేదు. చిన్నతనం కొద్దీ ఎలాగూ‌ పాసవుతానులే అన్న ధైర్యంతో మరీ శ్రధ్ధగా ఏమీ చదివే వాడిని కాను. క్లాసులో పాఠం వినటం, మళ్ళా పరీక్షలప్పుడు ఒకసారి పాఠ్యగ్రంథం తిరగేయటం అన్నట్లుగా ఉండే వాడిని.

ప్రశ్న     : మీ ప్రస్తుత నివాసం ?
జవాబు  : ప్రస్తుతం నివాసం హైదరాబాదు గచ్చిబౌలిలోని స్వగృహంలో.

ప్రశ్న   :  మీ హాబీస్  ?
జవాబు : పుస్తకాలు చదవటం పైన అపరిమితమైన ప్రీతి ఉండేది. ఇప్పుడు ప్రీతి ఉన్నా సమయం లేదు. ఒకప్పుడు హోమియోపతీ హాబీగా ప్రాక్టీస్ చేసాను. ముఖ్యంగా ఇ.బి. నాష్ ధోరణిలో పోయేవాడిని. కాని దానికి తగిన సమయం ఇవ్వలేనని పాతికేళ్ళ క్రిందటనే హోమియోకు స్వస్తి చెప్పాను. జ్యోతిషాధ్యయనం ఒక చిన్న హాబీ. దాని సంగతీ అంతే ఆసక్తి ఉన్నా అధ్యయనానికి సమయం కేటాయించలేక వదలివేసాను. బ్రిడ్జ్ బాగానే ఆడేవాడిని. దానినీ పట్టించుకొనే సమయం లేదు కదా. ప్రస్తుతం నా హాబీ అనండీ, ప్రవృత్తి అనండీ అది నా ఆధ్యాత్మిక చింతన ఒకటే.


ప్రశ్న     : మీ అభిమాన రచయిత  ?
జవాబు : ముఖ్యంగా విశ్వనాథవారు. ఇంకా అడవి బాపిరాజుగారు, నోరి నరసింహశాస్త్రిగారు వంటి మహామహులు చాలామందే ఉన్నారు.

ప్రశ్న     :  మీకు నచ్చే రచనలు?
జవాబు : చిన్నతనంలో అన్ని రకాల పుస్తకాలూ చదివాను. కాలక్రమేణా కాల్పనిక సాహిత్యం చదవటం బాగా తగ్గింది. అథ్యాత్మిక సాహిత్యం పట్ల మొదటినుండీ ఉన్న అభిరుచి బాగా పెరిగింది. ఇప్పుడు ఏదైనా చదవటానికి సమయం దొరకటం దుర్లభంగా ఉంది. వీలుంటే మరొకసారి రామాయణకల్పవృక్షం చదవాలనుకుంటున్నాను.

ప్రశ్న     : సాహిత్యం తో మీ ప్రయాణం ఎలా ప్రారంభమయింది?
జవాబు : చిన్నతనంలో వల్లమాలిన అల్లరిచేసేవాడిని. నా ధోరణిలో‌మార్పు తేవటానికి నాన్నగారు పుస్తకాలు చేతికిచ్చి చూసారు. మొట్ట మొదటిది చందమామ పత్రిక. ఒకే సంచిక చదివాను. అది నా కోసం కొన్నది కాదు. మా నాన్నగారి సహోద్యోగి ఒకాయన కొని ముందు నువ్వు చదువుకో అని నా కిచ్చారు. ఆ తరువాత, ఆ వేసవి సెలవల్లో మా నాన్నగారు స్కూల్లో లైబ్రరీలో నన్ను కూర్చోబెట్టి పిల్లలపుస్తకాలు చేతిలో పెట్టి తాను ఆఫీసు పనిచూసుకొనేవారు. అప్పట్లో మానాన్నగారు గెద్దనాపల్లెలో మిడిల్ స్కూల్ హెడ్మాష్టరుగారు. క్రమంగా రుచిమరిగి నేను ఆ పుస్తకాలనుండి ఇంట్లో ఉన్న పోతనగారి దశమస్కంథం మీదకీ, తిక్కన భారతం మీదకీ దూకటం‌ జరిగింది. మొదట్లో అవి అర్థం కాకపోయినా చదవగా చదవగా అవి అవగతం కావటం మొదలయ్యింది. స్కూలు వార్షికోత్సవాలకు ఒకసారి మానాన్నగారు పద్యాలు కంఠస్థం చేయటం మీదా పోటీ పెట్టించారు. ఆ సంవత్సరం నాకన్న సంవత్సరమే పెద్దదైన మా బేబీపిన్ని నాతో మాటే మావూళ్ళో ఉండి చదువుకునేది. ఇక ఇద్దరం కనిపించిన పద్యమల్లా భట్టీయం వేసేసాం. పద్యం బట్టీ‌పట్టటం, మా నాన్నగారిని అర్థం చెప్పమని పీడించటం - ఒకటే పట్టుదలగా పద్యాల వెంటబడటం. అ దెబ్బతో ఛందస్సుమీదా కొంచెం అవగాహన వచ్చింది. ఎనిమిదిలో‌ఉండగానే సొంతప్రయత్నాలు చేసాను. కొత్తపేటలో శ్రీవేదుల వేంకటరావుగారని మా తెలుగు ఉపాధ్యాయులు నాకు ఛందోవిద్యాగురువు. ఆయన మంచి ఆశుకవి కూడా. కాలేజీ రోజుల్లో చివరి సంవత్సరంలో వ్యాసరచనపోటీలో నేను ఏకంగా పదో ఇరవయ్యో పద్యాలు కూడా సొంతంగా వ్రాసాను నా వ్యాసంలో. అవన్నీ అప్పటికప్పుడు వ్రాసినవే. నా ఉద్యోగపర్వం మొదలైన తొలిదశలోనే మా నాయనగారు పరమపదించటంతో ఉద్యోగబాధ్యతలతో పాటు లంకంతసంసారం బాధ్యతా మీదపడటంతో నా జీవితంలో సాహిత్యవ్యాసంగం నిద్రపోవలసి వచ్చింది చాలా కాలం పాటు. మరలా మా మేనమామ శ్రీ ప్రసాద్ ఆత్రేయగారితో ఆంతరంగికస్నేహం నా సాహిత్యాభిలాషను పైకి లాగుకొని వచ్చింది.


ప్రశ్న     : మీ అభిమాన నాయకుడు  ?
జవాబు : వివేకానందుడు

ప్రశ్న     : మీ అభిమాన నటుడు  ?
జవాబు : పాతతరం సినిమాల్లోని మహానటులందరూ, మహానటీమణులందరూ నచ్చేవారే. కాని వీరాభిమానాలేమీ లేవు.



ప్రశ్న     :  మీకు నచ్చిన సినిమా  ?
జవాబు : తెలుగుసినీ స్వర్ణయుగపు సినిమాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా మాయాబజారు, పాతాళభైరవి, గుండమ్మ కథా, నర్తనశాల, బందిపోటు ఇలా చాలా.....,

ప్రశ్న     : మీకు ఇష్టమైన ఆహారం?
జవాబు :  సాత్వికాహారం. (వట్టి బడాయి. కారం తగ్గించాను. అంతే)

ప్రశ్న     : జీవితంలో అన్నింటికంటే ముఖ్యమైనదేది అంటే ఏమి చెప్తారు?
జవాబు :  మనిషికి అన్నింటికంటే ముఖ్యమైనది తృప్తి. తృప్తిం జెందని మనుజుడు సప్తద్వీపముల నైన జక్కంబడునే అని భాగవతం. ఎవరికీ త్రికరణశుధ్దుడై హాని దలచని వాడు, ఉన్నంతలో సంతోషంగా ఉండటం నేర్చుకున్నవాడు తృప్తిగా జీవించగలడు. లేదా జీవితం అంతా ఎత్తులూ పైయెత్తులుగా ఉండి మనశ్శాంతి కరువైపోతుంది. అనాయాసేన మరణం వినాదైన్యేన జీవనం దేహాంతే తవసాయుజ్యం దేహిమే పార్వతీ పతే అని ప్రార్థన చేస్తాం కదా. ఆశ కారణంగానే మనిషికి దైన్యం అనేది. రాముడి దయవలన దైన్యం లేదు. నాకు మిగిలిన ఇహలోకపు కోరిక అనాయాసమరణమే. మరేమీ నాకు ముఖ్యమైనది లేదు. ఈ‌ జీవుడికి నిర్దేశితమైన కార్యక్రమంగా ఇవ్వబడిన కర్తవ్యాన్ని నెఱవేర్చగలిగాను రాముడి అనుగ్రహంతో. ఇప్పుడు కేవలం పిలుపు కోసం ఎదురుచూడటం. దేహం ఉన్నందుకు తత్పోషణార్ధం వృత్తిగతమైన కార్యక్రమాలు. ఇంకా ఇక్కడే వేళ్ళాడుతున్నాను కాబట్టి ఉన్నన్నాళ్ళు నాకు తెలిసినది నలుగురితో పంచుకోవటం. అంతే తప్ప నాకిక్కడ వేరే ముఖ్యమైన పనులేవీ లేవు. ఐతే, నా సోది పక్కన పెడితే, అందరికీ జీవితంలో ముఖ్యమైనది తృప్తి. తన మనస్సాక్షి తనను ఎన్నడూ తప్పుపట్టని జీవితం కన్నా తృప్తినిచ్చేది ఏముంటుంది. అందరూ దానికోసం ప్రయత్నించటం అవసరమని నా ఉద్దేశం. ఈ మాటలు అందరికీ నచ్చాలని పట్టుబట్టను.

ప్రశ్న     : మీకు ఇతరులలో నచ్చేవి ఏవి? నచ్చనివి ఏవి?
జవాబు : నచ్చేది ఋజుస్వభావం. నచ్చనిది కపటం.

ప్రశ్న     : మీలో మీకు నచ్చేవి ఏవి? నచ్చనవి ఏవి?
జవాబు : నాలో నా నచ్చేది ఒకటే రామచింతన. నచ్చనిది ఒకటే నా ప్రథమకోపం.

ప్రశ్న     :  మీ రోల్ మోడల్ ఎవరు? 
జవాబు :  ఏదైనా సాధించి చూపిన వారిని రోలుమోడలో మద్దెలమోడలో ఎవరన్నా ఉన్నారా అని అడిగితే సబబుగా ఉంటుంది. నేను అతి సామాన్యుడిని. సాధించిందీ ఏమీ‌లేదు సాధించగలిగేది కూడా ఏమీ కనిపించటం లేదు. ఐనా సినిమావాళ్ళూ క్రికెటర్లూ తప్ప మరెవరూ ప్రస్తుతతరాల వాళ్ళకు కంటికి నదురుగా కనబడని రోజుల్లో, ఏదో అప్పుడప్పుడు చేతోవాతో గిలికే నేను ఏ విశ్వనాథ వంటి సాహిత్యకారుడి పేరో లేదా మరో భక్తుడి పేరో చెబుతే జనం నవ్వుతారు కూడా. సూటిగా సమాధానం కావాలంటున్నారా? సరే, అలాగేనండి. నాకు రోల్ మోడల్ ఎవరూ లేరు నాకు తెలిసి.

ప్రశ్న     :  మీకు నచ్చే వృత్తి? 
జవాబు : చదువు చెప్పటం. కాని నా జీవిక అంతా కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ అనే దానితో ముడిపడిపోయింది. మా తాతగారు టీచర్. అలాగే, మా నాన్నగారూ ఉపాధ్యాయులే - ఆయనకు జిల్లాస్థాయిలో అఖండమైన పేరుండేది. అందుచేత నాకూ టీచింగ్ మీద బలే మోజుగా ఉండేది. డిగ్రీ చేసాక దాదాపుగా ఒక సంవత్సరం పాటు ఖాళీగానే ఉన్నాను. ఆసమయంలో కొందరు ట్రైబల్ స్టూడెంట్లకు పదవతరగతి పరీక్షలకు కోచింగ్ ఇచ్చాను. మాణిక్యం అని కాబోలు, ఒక కుర్రవాడు స్కూలు సెకండ్ వచ్చాడని గుర్తు. నా దగ్గరకు మా నాన్నగారు పంపినప్పుడు అతడికి ఎనిమిదవ తరగతి స్థాయి కూడా లేదు చదువు.




ప్రశ్న     :  మీ బ్లాగు వివరాలు  ?
జవాబు : నా ప్రథానమైన బ్లాగు శ్యామలీయం. దాని చిరునామా syamaliyam.blogspot.in ఇందులో నా కవిత్యం ఉంటుంది. ఎక్కువగా అథ్యాత్మిక రచనలు ఉంటాయి. తదితరాలు కూడా ఉన్నా వాటిది అల్పసంఖ్యాకవర్గమే. ఇది కాక మరికొన్ని ఇతర బ్లాగులూ ఉన్నాయి నాకు.

ప్రశ్న     :  మీరు బ్లాగులోకంలోకి ఎలా ప్రవేశించారు?
జవాబు : 1994లో అమెరికాలో‌ ప్రవేశించాను. 1995లో సోషల్.కల్చర్.ఇండియా.తెలుగు అనే న్యూస్ గ్రూప్‌లో అముక్తమాల్యదలోని తల పక్షఛ్ఛట గ్రుక్కి బాతువులు... అన్న పద్యాన్ని వ్యాఖ్యానించి అంతర్జాలంలో అడుగుపెట్టాను. పిల్లలమర్రి రామకృష్ణగారి స్నేహం కూడా లభించింది. అనంతర కాలంలో, తెలుసా (తెలుగు సాహిత్య వేదిక) అనే ఒక చర్చావేదిక ఒకటి ఆవిర్భవించింది. దానిలో చేరమని రామకృష్ణగారే అనుకుంటాను ఆహ్వానించారు. ఆ వ్యాసంగం కొన్నేళ్ళు నడిచింది.  తెలుసా పుటలు ఇంకా అంతర్జాలంలో వెదికితే దొరికుతాయనే అనుకుంటున్నాను.  2004లో భారతదేశానికి తిరిగివచ్చాక మెల్లగా ఐ.బి.యమ్‌లో కుదురుకున్నాను. శ్రీమతి అక్కరాజు విజయ అనే స్నేహితురాలి ప్రోద్బలంతో‌ 2010లో శ్యామలీయం బ్లాగుతో బ్లాగులోకంలోనికి ప్రవేశించాను. ఆవిడకూ ఒక బ్లాగు ఉంది. ఆవిడ కూడా తెలుగుభాష బాగు కోసం తపిస్తూ ఉంటారు. http:/virajaaji.blogspot.in/

ప్రశ్న     :  బ్లాగరుగా మీ అనుభవాలు?
జవాబు : నేను సంప్రదాయిక కవిత్వం వ్రాసుకుందుకు శ్యామలీయం బ్లాగును ప్రారంభించాను. నాది ప్రధానంగా అధ్యాత్మికధోరణి కవిత్వం. ఇటువంటి కవిత్వానికి ఈ రోజుల్లో చదువరులు స్వల్పాతిస్వల్పం. ఐనా ఫరవాలేదు. నా పద్యాలటపాల్లో అనేకం పట్టుమని పదిమందీ చదవనివి ఉన్నాయి. ఎప్పుడన్నా రాజకీయ విషయంపైనా ఒక టపా వ్రాస్తాను. ఒక్క రోజులో నాలుగు వందలమంది పైబ చదువుతారు. తమాషాగా అనిపిస్తుంది. ఈ బ్లాగుప్రపంచంలో నాకు మంచి మిత్రులు లభించారు. కాని వృత్తిజీవితంలో ఒత్తిడుల కారణంగా నా బ్లాగుల్లో అనుకున్నంత చురుగ్గా వ్రాయటం కుదరటం లేదు. అది చాలా బాధగా ఉంది. కాని సమయం దొరకటం ప్రస్తుతం అసాధ్యం స్థాయిలో ఉంది. వీలైతే త్వరలోనే దీనికొక పరిష్కారం చూడాలి.

ప్రశ్న      :  బ్లాగు ప్రపంచంలో ఎదురైన ఆటంకాలు, ఇబ్బంది అనిపించిన సందర్భాలు?
జవాబు  : ఇబ్బంది పెద్దగా ఏమీ‌ లేదండి. శ్యామలీయం వ్రాసేది కవిత్వం. అందులోనూ పద్యాలు వగైరా కాబట్టి వాడి బ్లాగుల్లోకి అజ్ఞాతలు జొరబడేది కూడా లేదు పెద్దగా. చూస్తూ ఊరుకోలేక తాపత్రయంతో వ్యాఖ్యల రూపంలో ఉబోస (ఉచిత బోడి సలహా)లను ఇస్తూ ఉంటాను. నా వల్ల పాపం కొందరు ఇబ్బంది పడుతున్నారా విషయంలో. నా ప్రథమకోపం కారణంగానూ, ముక్కుసూటిగా నా అభిప్రాయం చెప్పటం కారణంగానూ కొన్ని కొన్ని చర్చల్లో అల్లరిపాలయింది వాస్తవం. నేను కొన్ని రాజకీయవ్యాసాలూ వ్రాసాను నా శ్యామలీయం బ్లాగులో - అలా చేయటం నా హితైషులు చాలా మందికి నచ్చలేదు. నిజానికి నాకూ పెద్దగా ఆ వ్యాసంగం నచ్చదు. నా అధ్యాత్మిక సాధనకు సంబంధించి వ్రాసుకోవటమే నాకు చాలా ఇష్టం. ఆ విషయంలో ఎవరినుండీ‌ నాకేమీ ఇబ్బందులు రాలేదు.

ప్రశ్న     : మీ బ్లాగులో మీకు నచ్చిన పోస్టులు?
జవాబు : ఈ‌ ప్రశ్నకు సమాధానం చెప్పటం కష్టం. ముప్పాతికమువ్వీసం సరుకు మనస్ఫూర్తిగా వ్రాసినదే కదా శ్యామలీయంలో. Bertrand Russell వ్యాసం ఒకటుంది Book of an hour and a book of all time అని గుర్తు దాని పేరు. కొన్ని రచనలకు శాశ్వతమైన విలువలు ఉంటాయి. కొన్నింటి విలువ తాత్కాలికమే అని దాంట్లొ చర్చిస్తాడు. అలాగ కొన్ని టపాలు దీర్ఘకాలికమైన విలువలు కలవి కాకపోవచ్చును. టపాలను పునస్సమీక్షించటమూ, పునర్వర్గీకరించటమూ అవసరం కావచ్చు. ఆలోచించాలి. ఐనా అడిగారు కాబట్టి ఒకటి రెండు టపాలను ప్రస్తావిస్తాను. 
ఒకటి     : http://syamaliyam.blogspot.in/2011/09/blog-post_8337.htmlబండి అన్నది, 
మరొకటి : http://syamaliyam.blogspot.in/2011/08/blog-post.html మంత్రం అనేది. 
ఇంకా     : http://syamaliyam.blogspot.in/2013/09/blog-post_12.html చిలుకల చదువు.

ప్రశ్న     : కొత్త బ్లాగర్లకు మీరిచ్చే సలహాలు?
జవాబు : నా తృప్తికోసం నేను మొదలు పెట్టాను. మీరు మొదలు పెట్టేదీ మీ తృప్తికోసమే ఐతే, తదితరాల గురించి ఆలోచించకండి. ఎవరికోసమూ వ్రాయకండి. మీ కోసమూ మీ తృప్తి కోసమూ వ్రాయండి. నచ్చిన వారు చదువుతారు. అనేకులకు నచ్చాలని కోరి వ్రాయటానికి భ్రమసితే మనకు ఆట్టే నచ్చని టపాలు వ్రాయవలసి వస్తుంది. అసంతృప్తి కలుగుతుంది. నాణ్యతమీద దృష్టిపెట్టండి. భాషని గౌరవించండి.

ప్రశ్న     :  తెలుగు బ్లాగుల అభివృద్ధికి మీరిచ్చే సూచనలు ఏమిటి?
జవాబు :  తెలుగుబ్లాగుల్లో చాలా రకాలున్నాయి. వేటి సమస్యలు వాటివి. కొద్దిమంది సంప్రదాయిక కవిత్వం వంటివి వ్రాస్తున్నారు. అనేకులు ఆధునిక కవిత్వం వ్రాస్తున్నారు. అందంగా కూడా వ్రాస్తున్నారు. కాని కొందరు బ్లాగర్లు తెలుగులో ఇప్పటికే ఉన్న ఆధునిక కవిత్వ ధోరణులను అధ్యయనం చేయటానికి బధ్ధకిస్తున్నారో, నిరాకరిస్తున్నారో తెలియదు కాని అధ్యయన లోపం కారణంగా ప్రతీకలను సృష్టించటం లేదా వాడటం వంటి సాంకేతికాంశాల్లోనైతే నేమి, పాదవిభజన వంటి నిర్మితికి సంబంధించిన అంశాల్లో‌నైతే నేమి, క్లుప్తత, స్పష్టత, భావప్రకటన, రసస్ఫూర్తి వంటి విషయాల్లోనైతేనేమి చాలా అపరిపక్వంగా వ్రాస్తున్నారు తరచూ. కొందరు రాజకీయాలపైన అభిప్రాయాలు వ్రాస్తున్నారు. అందులో అనేకులు కొందరు పార్టీలకో, వ్యక్తులకో మద్దతుగా వ్రాస్తున్నారే కాని విశ్వసనీయత అన్నది తక్కువగా ఉంటోంది వారి వీరాభిమానాల కారణంగా. కొన్ని సినిమాకబుర్లబ్లాగులున్నాయి. ఆశ్చర్యం ఏమిటంటే, చాలా వరకూ రొట్ట బ్లాగులే ఐనా, సకృత్తుగా మంచి బ్లాగులూ ఉన్నాయి. కొన్ని సిధ్ధాంతప్రచారాలు చేసే బ్లాగులూ ఉన్నాయి. వాటిలో కూడా తరచూ పిడివాదాలే కనిపిస్తున్నాయి కాని హుందాగా ఉండేవి కొద్దిగానే ఉన్నాయి. ఈ‌మధ్య చర్చావేదికల బ్లాగులు పుట్టుకొస్తున్నాయి. ఐతే వ్యాఖ్యాతల్లో అత్యుత్సాహంతో కొందరూ, దురుసుదనంతో కొందరూ, రెచ్చగొట్టి తమాషాచూసేందుకు కొందరూ ప్రయత్నించటంతో ఇబ్బందులు వస్తున్నాయి. అందుచేత అటువంటి బ్లాగుల వలన ఆశించిన ప్రయోజనాలు వస్తున్నట్లు నాకైతే అనిపించటం లేదు. కొద్దిమంది మాత్రం నా టపా పదిమందికీ ఉపయోగపడాలి అన్న సదాశయంతో తాపత్రయంతో వ్రాస్తున్నారు. వాటికి మంచి గౌరవమూ వస్తోంది - ఈ సంగతి ఆకర్షణీయతే ముఖ్యమని భ్రమపడే బ్లాగర్లు తొందరగా గుర్తించాలి. ఈ నాటి పరిస్థితి ఏమిటంతే సగటున బ్లాగుటపాలు నాణ్యత విషయంలో చాలావరకు నాసిరకంగానే ఉంటున్నాయి. ఆకర్షణీయంగా వ్రాయటం మీద దృష్టి పెట్టటమే కనిపిస్తోంది కాని పదిమంది ప్రింటుకొట్టి దాచుకునే స్థాయిలో ఉండాలి నా టపా అనుకుని బ్లాగర్లు వ్రాయాలి తమ టపాలని. అప్పుడే వాసిపెరిగి తెలుగుబ్లాగులకు గౌరవం పెరుగుతుంది.

ప్రశ్న     :   మీకు నచ్చే బ్లాగులేవి?
జవాబు : నిజానికి నేను కొన్ని బ్లాగులను ప్రత్యేకంగా ఎంపిక చేసుకొని అనుసరించటం అన్నది ఇంతవరకూ జరగలేదు. కాని నాకు నచ్చే‌బ్లాగులు చాలానే ఉన్నాయి. నచ్చే బ్లాగర్లూ చాలా మందే ఉన్నారు. 
క్లుప్తంగా ప్రస్తావిస్తాను. 
1.కష్టేఫలే (https://kastephale.wordpress.com/) 
2.శంకరాభరణం (http://kandishankaraiah.blogspot.in/) 
3.కల్లూరి భాస్కరం (http://kbhaskaram.blogspot.in/) 
4.ఆంధ్రామృతం (http://andhraamrutham.blogspot.in/), 
5.సరసభారతి ఉయ్యూరు (http://kbhaskaram.blogspot.in/) 
6.వనజ వనమాలి (http://vanajavanamali.blogspot.in/) 
7.పద్మార్పిత (http://padma4245.blogspot.in/
8.శోభనాచల (http://sobhanaachala.blogspot.in/) 
9.లక్ష్మీఫణి కబుర్లు (https://harephala.wordpress.com/) 
10.భండారు శ్రీనివాసరా(http://bhandarusrinivasarao.blogspot.com/) 
11.నల్లమోతుశ్రీధర్ సాంకేతికాలు (http://computerera.co.in/blog/) 
ఇలా చాలా బ్లాగులే ఉన్నాయి. 

బ్లాగర్లలో శ్రీ కష్టేఫలే బ్లాగు శర్మగారు, వలబోజు జ్యోతిగారు, మీరు (కొండలరావు), కంది శంకరయ్యగారు, జిలేబి గారు, లాస్య రామకృష్ణగారు, జై గొట్టిముక్కలవారు, హరిబాబు గారు, భండారు శ్రీనివాసరావుగారు, వనం జ్వాలా నరసింహారావు,  గుండు మదుసూదన్ గారు, శ్రీకాంత్ చారి గారూ, భమిడిపాటి వారూ, పురాణపండవారూ , మనవు బ్లాగు నరసింహారావు గారూ ఇలా  నచ్చే బ్లాగర్లూ చాలామందే ఉన్నారు. అందరి పేర్లూ చెబుతే చాలా పొడుగు జాబితా ఐపోతుంది. కొద్ది మందితో అభిప్రాయబేధాలున్న మాట వాస్తవమే కాని అవి గణనీయమైనవి కావు.

ప్రశ్న     : బ్లాగుల వల్ల ఉపయోగమేమిటని మీ అభిప్రాయం?
జవాబు : ఉపయోగించుకోవటం మనకు చేతనైతే బ్లాగులవల్ల చాలా ఉపయోగాలే ఉన్నాయి. కాని పరిస్థితి అలా కనిపించటం లేదు. గ్రంథపఠనం వలన ఉపయోగం ఏమిటి? చలనచిత్రాలవలన ఉపయోగం ఏమిటి? రేడియో వలన ఉపయోగం ఏమిటి? టివీఛానెళ్ళవలన ఉపయోగం ఏమిటి? అంతర్జాలం వలన ఉపయోగం ఏమిటి? ఇలా సవాలక్ష ఉన్నాయి, అన్నీ ఉపయోగపడేవే. వ్యక్తులకూ సమాజానికీ దశాదిశానిర్దేశం చేయగలవే. ఐతే మనుష్యులు ఎంత ఉపయుక్తమైన దానినైనా దురుపయోగం చేసుకొనే దుర్విద్యలో ఆరితేరిన జీవులు. ఎంత గొప్ప అవకాశం కలిగినా దానితో చవకబారు కాలక్షేపం పొందేందుకు ప్రయత్నించటం మానవనైజం. అంతర్జాలంలో ఎంతో మంచి పేజీలూ సైట్లూ వెదికితే ఎన్నో కనిపిస్తాయి. ఎక్కువ ప్రయత్నం అవసరం లేకుండానే అసహ్యకరమైనవీ, అవాంఛనీయమైనవి కుప్పలు తెప్పలుగా కబబడతాయి. కాలక్షేపం పుస్తకాలకే ఆదరణ, కాలక్షేపం సినిమాలకే ఆదరణ అన్నట్లుగా చెత్త సైట్లకే చెలామణీ ఎక్కువేమో. బ్లాగులు అంతర్జాలంలో ఒక భాగం. అందుచేత బ్లాగుల్లోనూ కాలక్షేపం సరుకే రాజ్యం చేస్తున్నదేమో. విజ్ఞానం‌కన్నా వినోదం ముఖ్యం అనుకునే పరిస్థితినుండి బయటపడగలిగినప్పుడు బ్లాగులు సమాజాన్ని చైతన్యపరచటానికి ఉపయోగిస్తాయి. వ్యక్తివికాసానానికి తోడ్పడతాయి. విద్యాప్రదాయినులుగా రాణిస్తాయి. ఐతే ముందు మన ప్రజానీకం దృక్పథం‌మారాలి. లేకుంటే బ్లాగుప్రపంచం అధోమార్గంలోనే ప్రయాణిస్తూ ఉంటుంది.

ప్రశ్న     : ఇతరుల బ్లాగులలో మీకు నచ్చిన పోస్టులు ఏమిటి? 
జవాబు : విషయం ఉందనిపించే, అనేక పోష్టులు నాకు నచ్చుతూ ఉంటాయి. అందులో లోకనీతులూ రీతులూ వివరించే శర్మగారి టపాలూ, ఫణిబాబుగారి బ్లాగులో కబుర్లూ, పద్మార్పిత, వనజవనమాలి వంటి వారి కవిత్వాలూ, ఆలోచింపజేసే ప్రజ బ్లాగులోని కొన్ని ప్రశ్నలూ నచ్చుతూ ఉంటాయి. ఈ రకం టపాలు నచ్చుతాయి నాకు అని ఖచ్చితంగా చెప్పలేను కాని విషయం ఉందనిపించే అనేక టపాలు నాకు నచ్చుతూనే ఉంటాయి. వీలైతే చిన్నదో పెద్దదో వ్యాఖ్యలూ చేస్తుంటా. ఐతే ఈ మధ్యకాలంలో వ్యాఖ్యలను చేయటమూ చెప్పుకోదగినంతగా తగ్గిందనుకుంటాను.



ప్రశ్న     : మీకు తెలుగు భాషపై పట్టు ఎలా ఏర్పడింది? 
జవాబు :  బాగా చదవటం వలననే నాకు తెలుగుమీద పట్టు వచ్చింది. నిజానికి నాకు వ్యాకరణం మీద ఎన్నడూ‌ పెద్ద శ్రధ్ధ ఉండేది కాదు విద్యార్థి జీవితంలో. ఐనా నేను చదివిన తెలుగు తక్కువనే చెప్పాలి. నిజానికి ప్రబంధాలు కూడా ఏమీ అధ్యయనం చేయలేదు. నాకు గ్రాంధిక భాషమీద పట్టనండీ, మోజనండీ దానికి కారణం తిక్కనగారి శైలీ‌ భాషాను. అలాగే తెలుగు గ్రాంథికంగా వ్రాయాలని ప్రయత్నించి విద్యార్థి దశలోనే ఉపాధ్యాయులని ఠారెత్తించాను. ఒకసారి చంద్రుడు అనటానికి కాబోలు ఒక లైనంత పొడుగు సమాసం వేసాను. వెంకటరావుగారు అది చూసి నాయనా పేపర్లు దిద్దే వాళ్ళ మీద కాస్త దయచూపించాలి నువ్వు అని నవ్వారు.

ప్రశ్న     :   తెలుగు భాష అభివృద్ధికి మీవంతుగా ఏమి చేస్తున్నారు?
జవాబు : తెలుగులో మాట్లాడుతున్నాను - కాస్త ఇంగ్లీషు డోసు తగ్గించి తెలుగులో మాట్లాడమని అందరినీ ప్రోత్సహిస్తున్నాను. సాధ్యమైనంత సరళమైన భాషలో కొన్ని కావ్యాలు వ్రాయాలని ఆశ. ఒకటి రెండు నిర్మాణదశలో ఉన్నాయి. కొన్ని ఖండకావ్యాలూ, మరికొన్ని చిన్నచిన్న కవితలూ వంటివీ, అనేక పద్యసంపుటులూ వ్రాస్తూనే ఉన్నాను - అన్నీ సరళమైన భాషలోనే. కీ.శే. నేమాని రామజోగిసన్యాసిరావుగారు నన్ను ఒక సందర్భంలో కవికుంజరసత్తమా అన్నా, ఒక చిన్నస్థాయి కవిగా ఇంతకంటే ఏమి చేయగలనో తెలియదు. పూర్తిగా వృత్తిజీవితం నుండి విరమించుకున్నాక భుజాన సంచీ వేసుకుని పాఠశాలలకు పోయి తెలుగుభాష గురించి ఉపన్యాసాలివ్వాలేమో! అదేమంత తక్కువ పుణ్యకార్యం కాదని నా ప్రగాఢవిశ్వాసం.



ప్రశ్న     : మీకు రాముడంటే ఎందుకంతటి అభిమానం?
జవాబు : కొన్ని విషయాలకు కారణాలు చెప్పటం సాధ్యపడదు. నాకు తెలియదు అనే చెప్పగలను. నాకు ఊహతెలిసి నప్పటి నుండీ రాముని యందు చెప్పనలవికాని ప్రీతి. అది జన్మాంతరసుకృతం అని నేను అనుకోవచ్చును. అది నా అదృష్టం అని కొందరు అనుకోవచ్చును. నాది ఆజన్మమౌఢ్యం అని మరికొందరు అనుకోవచ్చును. ఎవరేమనుకున్నా ఫరవాలేదు. నేనేమీ చేయలేను. ఆయనది నిర్వ్యాజప్రేమాకృతి. నాది నిర్వ్యాజాభిమానధృతి.

ప్రశ్న     : ఆధ్యాత్మికతకు మీరిచ్చే నిర్వచనం? 
జవాబు : నేనెవరిని అన్న ప్రశ్నకు సమాధానాన్ని అన్వేషించే శాస్త్రమే అధ్యాత్మికవిజ్ఞానం. నేను ఈ‌ శరీరాన్ని మాత్రమే అనుకోవటం ఒక సమాధానం. అప్పుడు మనిషి స్వేఛ్ఛకు సైధ్ధాంతికంగా నియంత్రణ ఏదీ లేదు. సమాజం తన అవసరం కోసం నైతికత అనే కృత్రిమభావజాలాన్ని మనిషిమీద రుద్దక తప్పదు - లేనప్పుడు బలవంతుడికి సమాజం మాట వినవలసిన అగత్యం ఏమీ లేదు. నేను ఈ‌ శరీరం కన్నా భిన్నుడిని, ఉన్నతుడిని అనుకోవటం మరొక సమాధానం. అప్పుడు ఆ భిన్నత్వం ఎటువంటిది? ఆ ఔన్నత్యం ఎటువంటిది అన్న ప్రశ్నలు వస్తాయి. అందరూ తమతమ శరీరాలకన్నా భిన్నమైన ఒక సైధ్ధాంతికమైన ఉనికిని కలిగి ఉన్నట్లైతే, మానవలోకంలోని అందరికీ అటువంటి ఉనికి వేర్వేరుగా ఉందా? లేదా ఒకటే అటువంటి ఉనికి ఉమ్మడిగా ఉన్నదా అన్న ప్రశ్న కూడా వస్తుంది. ఒకవేళ వేర్వేరుగా శరీరాతీతమైన ఉనికి ఉన్న పక్షంలో అయా ఉపాధులకూ పైస్థాయి ఉన్నదా అన్న ప్రశ్నా వస్తుంది. ఇలాంటి ప్రశ్నలు అన్నీ ఒక రకంగా గణితం వంటి శాస్త్రంగా తయారౌతాయి. రకరకాల సిధ్దాంతాలు ఈ‌ ప్రశ్నకు జవాబులు వెదుకుతున్నాయి. "ఈ‌గందరగోళం అంతా అనవసరం, నేనొక సార్వత్రికమైన ఉనికి గలవాడిని. అందరు మానవులూ - ఇంకా స్పష్టంగా చెప్పాలంటే అందరు జీవులూ, అన్ని నిర్జీవులూ కూడా అదే సార్వత్రికమైన ఉనికి యొక్క ఛాయలు, బేధాలు కేవలం పైకి కనబడే శరీరాలు మాత్రమే" అని ఒక సిధ్ధాంతం చెబుతుంది. ఆ సార్వత్రికమైన ఉనికికే బ్రహ్మం అని సాంకేతిక నామం. అప్పుడు సమాజం అంతా ఒకే బ్రహ్మము యొక్క వివిధమైన స్వరూపం కాబట్టి లౌకికసమాజానికి కావలసిన నైతికత కూడా సహజంగానే నిష్పన్నం అవుతున్నది. అందుచేత "సమస్తమూ ఒకే బ్రహ్మమే" అని గ్రహించటమే నిజమైన ఆధ్యాత్మికత అన్న సిధ్ధాంతం నాకు సమ్మతం. కాని ఇదంతా వినటానికి సులభంగా ఉండవచ్చును ఆచరణలో అంత సులభమేమీ కాదు. ఎవరి కృషితో వారి అనుభవంలోనికి తెచ్చుకోవలసినదే.

ప్రశ్న     : మతం పై మీ అభిప్రాయం? 
జవాబు : మతం అన్న మాటకు అభిప్రాయం అని అర్థం. ఐతే రూఢార్థంలో అధ్యాత్మికమైన అభిప్రాయ సంపుటిగానే చెబుతున్నాం. కొన్ని దైవప్రతిపాదన చేసే మతాలూ ఈ దేశంలో వికసించాయి. మరికొన్ని భగవంతుడితో ప్రసక్తి లేనివీ ఈ‌ దేశంలో వికసించాయి. దైవత్వం అనే ఆలోచననే నిరసించే మతాలూ ఈ దేశంలో నిరాటంకంగా మనగలిగాయి. ఏ మతాలకు ఉథ్థానపతనాలైనా ఆ మత సిధ్ధాంతాల ప్రాతిపదికనూ కాక, ఆయా మతాలను ప్రవచించిన మహనీయుల గొప్పదనాలను బట్టీ‌కాక, తరువాతి తరాలవారి అజ్ఞతా విజ్ఞతల కారణంగానే జరిగాయి. నిర్మలమైన మనస్సే నిశ్చయమైన ముక్తి మార్గం అన్న సంగతి ముందు గ్రహించాలి. ఆ మనో‌నైర్మల్యం అనేది కొందరు భగవద్విశ్వాసం ద్వారా సిధ్ధింపజేసుకుంటే అది మంచిదే. కేవలం నైతికజీవనం ద్వారా సిధ్ధింపజేసుకుంటారా అదీ‌ మంచిదే. ఎవరి పధ్ధతి వారిది. కాని తమ పధ్ధతులను ఇతరులకు తెలియ జెప్పే అధికారమే కాని ఒత్తిడిచేసే అధికారం కాని ఇతరుల పధ్ధతులని ఎద్దేవా చేసే అధికారం కాని ఎవ్వరికీ లేదు. మీకు, ఇతరులకు, సమాజానికీ ఎవరికైనా హాని చేసే పధ్ధతులు తప్పు. అటువంటిది కానప్పుడు మీ‌ మతం మీది. నా మతం నాది. ఎవరికైనా ఎందుండాలి అభ్యంతరం? ఇంగ్లీషువాడి సామెత ఒకటుంది. You go to your church, I go to mine అని. అంతే.



ప్రశ్న     :   సనాతన ధర్మం పై మీ అభిప్రాయం? 
జవాబు : సనాతనం అన్న మాటకు అర్థం, మన లెక్కకు అందనంత కాలం నుండీ మనకు తరతరాలుగా అందివచ్చిన ధర్మం అని. ఈ ధర్మం ఇక్కడి వారికి వినయం, సహనం, శాంతి, అహింస వంటి దివ్యగుణాలనిచ్చింది. అందుచేత మన సనాతనధర్మాన్ని చూసి మనం‌ సిగ్గుపడవలసినది ఏమీ లేదు. అతిథి దేవో‌భవ, మాతాపితృభ్యాం‌ నప్రమదితవ్యమ్‌ , సత్యం వద వంటి సూక్తులు చెప్పనది తప్పుడు ధర్మం కాదు కదా? ఐతే, గత కొన్ని వందలసంవత్సరాలుగా ఈ సనాతనధర్మాన్ని దురాచారాల్లో ముంచెత్తిన వారు దానికి చెడ్డపేరు తెచ్చారు. అందులో అబధ్దం ఏమీ లేదు. పచ్చినిజం. ఏ ధర్మంలో ఐనా పిడివాదులు బయలు దేరుతారు. వారు కొంత విధ్వంసం భావజాలంలోనూ, ఆచారకాండలోనూ కూడా సృష్టిస్తారు. సమాజాన్నీ‌ బాగా ప్రభావితం చేస్తారు. ఇటువంటిది అన్ని మత ధర్మాలలోనూ‌ జరిగింది. అన్ని దేశాల్లోనూ జరిగింది. సమాజం‌ సమాజం అంతా అత్యున్నత స్థాయి చింతన చేయగలిగే స్థితి ఎప్పుడూ కలగదనే వాస్తవం మనం‌గ్రహిస్తే, ఇదంతా సహజమే అని అర్థం అవుతుంది. ఐనా ఎప్పుడు ఆయా మతదృక్పథాలలో ఉన్న సత్యవస్తువు అటువంటి విధ్వంసాలను జయించి తన నిజస్థితిలో తాను పునఃపునః సుప్రతిష్ఠితం అవుతుంది. అందుచేత సనాతనధర్మం పైన ఉన్న అపోహలూ తొలగిపోతాయి క్రమంగా. ఎంత కాలమైన పట్టవచ్చును, ఎంతో కాలం పట్టకపోవచ్చును. అది చర్చనీయాంశం కాదు.

ప్రశ్న     : మీరు డిప్రెషన్ కు గురైనప్పుడు రీచార్జ్ కావడానికేమి చేస్తారు?
జవాబు : భగవన్నామం. సర్వకాలసర్వావస్థల్లోనూ నాకు ఆలంబనంగా ఉండేది అదే. ప్రాపంచిక విషయాలు మనస్సును ఉద్రేకింపజేయగలవు. సంతోషం కలగినా, దుఃఖం కలిగినా అది మనస్సు ఉద్రేకపడటం క్రిందికే వస్తుంది. ఏదైనా అది ఇంద్రియానుభవమే. మనస్సూ ఒక ఇంద్రియమే. కేవలం బాహిరం కానిదీ, ఒక స్థూలస్వరూపం లేనిదీ అది. అంతే. అన్ని రకాల ఇంద్రియానుభవాలలోనూ మానసికమైన అనుభూతుల హెచ్చుతగ్గులనే మనం సుఖదుఃఖాలంటున్నాము కాని నిజానికి సుఖాలుకూడా తరచుగా దుఃఖాలుగానే పర్యవసిస్తాయని వేదాంతం బోదిస్తుంది. అందుచేత వివేకులు సంతోషాతిరేకత కలుగవలసిన సమయాల్లోనూ భగవన్నామం వదలరు. దుఃఖోద్విగ్నత కలిగిన సమయాల్లోనూ భగవన్నామం వదలరు. నాకూ అందుకే భగవన్నామమే ఊతకర్ర. ఈ‌ మాట అన్నానని నేనేదో వివేకినని భ్రమపడిపోతున్నానని భావించుకోవద్దు. నా వివేకం అల్లా భగవన్నామం వివేక మార్గం అని తెలుసుకోవటం వరకే అనుకోండి. వివేకిగ వర్తించటానికి ప్రయత్నం చేసే వాడిని మాత్రమే అనుకోండి. అంతకు మించి మరేమీ లేదు.

ప్రశ్న     : నేటి యువతకు మీరిచ్చే సలహాలు ఏమిటి? 
జవాబు : నేను సలహాలు ఇచ్చేపాటివాడినని అనుకోను. యువతరానికి వృధ్ధతరం వారి పట్టుదలలతో కూడిన మనస్తత్త్వంపై అసహనం ఉంటుంది . అలాగే పెద్దతరం వారికి యువతరపు ఉద్రేకపూరితమైన స్వభావంపైనా అంతే అసహనం ఉంటుంది. పెద్దవారి జీవితానుభవాలనుండి పిన్నలు పాఠాలు నేర్చుకొనే గొప్ప మంచి అవకాశాన్ని వారు వదులుకో కూడదు. అలాగే యువశక్తిని ప్రోత్సహించంలో పెద్దలు భేషజాలకు పోకూడదు. ఇదంతా చెప్పటానికీ వినటానికీ బాగానే ఉంటుంది. కాని యువతరం అన్నది నాడైనా నేడైనా తమకు రోల్ మోడల్స్‌గా ఎప్పుడూ సెలబ్రిటీలనే భావిస్తుంది. ఎవరో సాదాసీదా ముసలాయన ఏదైనా సలహా ఇచ్చినా అది వినేవారు పెద్దగా ఉండరనే చెప్పాలి. నేను ఎదిగినది కొంచెమే అనుకోండి, అదైనా కేవలం స్వయంకృషితో ఎదిగాను, ఎంతోకొంతగా - అందుకని నన్నడిగితే కృషితో‌నాస్తి దుర్భిక్షం అన్నది మరవద్దంటాను. మీలో‌ దాగి ఉన్న అనంతశక్తిసామర్థ్యాలపట్ల అచంచలమైన విశ్వాసం కలిగి ఉండాలంటాను. అంతకంటె మరేమీ చెప్పలేను.

ప్రశ్న     : ఇతరులను నొప్పించకుండా మాట్లాడాలంటే ఏమి చేయాలి? 
జవాబు : ఒకరు మనమాటను గౌరవించాలన్న పట్టుదల ఉన్నచోట, ఆశాభంగం చెందటమూ సహజంగానే జరుగుతూ ఉంటుంది. పట్టుదల అనేది వాక్పారుష్యానికి దారితీస్తుంది. ఆశ ఉన్న చోట ఆశాభంగమూ ఉంటుంది కాని ఎవరినుండీ ఏమీ ఆశించనప్పుడు ఆశయే లేదు కాబట్టి ఆశాభంగమూ లేదు కదా. "వర్త ఏవచ కర్మణి" అని నిర్వికారంగా ఉండగలప్పుడు ఇతరులను మనం కావాలని నొప్పించే పరిస్థితి రాదు. "దక్షు లెవ్వార లుపేక్ష సేసి రది వారల చేటగు, ధర్మనిస్తారక మయ్యు, సత్యశుభదాయక మయ్యును దైవ ముండెడిన్" అన్న సూక్తికి అనుగుణంగా కర్తవ్యంలో భాగంగానే ఒక్కొక్కసారి ఆవలి వారికి నచ్చని మాటలూ పలుకవలసి వస్తుంది. అక్కడ స్వార్థం లేనంత వరకూ తప్పులేదు. సత్యాసత్యాలు పరికించక, ఉచితానుచితాలు గమనించక ఎదుటివారి మాటలకు నొచ్చుకొనే వారూ, కొండొకచో ఆగ్రహించేవారూ ఉండనే ఉంటారు. దానికేమీ చేయలేం. కేవలం హితంగా, మితంగా మాట్లాడటమే మనం చేయగలం.

ప్రశ్న     : ఇంకా మీరు చెప్పదలచుకున్నదేమైనా.....?
జవాబు : చదువు అనేది చాలా ఖరీదైన వస్తువై పోయింది. అంతర్జాలం సహాయంతో డిగ్రీ‌స్థాయిదాకా ఉచితంగా విద్యాభ్యాసం చేయించగలిగే పరిస్థితిని సృష్టించగలగాలి. ఆ కృషిలో బ్లాగులూ అద్భుతమైన పాత్ర పోషించవచ్చును. ఇంకా నిత్య జీవితంలో ఎంతో అవసరమైన విజ్ఞానాన్ని అందించేందుకు కూడా అంతర్జాలాన్ని వినియోగించగలగాలి. కాని అంతా కాలక్షేపమయంగా ఉన్న అంతర్జాలం నిరాశ కలిగిస్తోంది. ఏమన్నా కొన్ని మంచి సైట్లూ బ్లాగులూ ఉన్నా అవి అక్షరాలా చెత్తపోగుల్లో ఇరుక్కుని అందరి కళ్ళా పడటం దుష్కరంగా ఉంది. ఈ పరిస్థితి మారాలి. తమ వంతుగా బ్లాగర్లు విషయప్రథానమైన బ్లాగులకు ప్రాణంపోయాలి. అలా జరిగే అవకాశాలు నాకైతే కనిపించటం లేదు. "తెలుగుబ్లాగు అంటే కాలక్షేపం సరుకు కాదు" అని అందరూ గర్వంగా అనుకునే రోజువస్తే సంతోషించే వాళ్ళల్లో నేను మొదటివాడిని.

3, మే 2015, ఆదివారం

ఈవేళ తేలిపోవాలి రావయ్య ఓ అందగాడా



నీవాడ నైతినో నేను
నావాడ వైతివో నీవు
ఈవేళ తేలిపోవాలి
రావయ్య ఓ అందగాడా

బెలిపించి భూమికి పంపింది ఎవరు
వలపించి కలలన్ని పండించి రెవరు
తలపులన్నిట నిండి తబ్బిబ్బు చేసిన
తులలేని స్నేహసద్గుణరాశి ఎవరు
॥నీవాడ॥
నేనన్న భావన నీవు చేసిన మాయ
ఆనాటి నుండి నే నీనాటి వరకు
నీ నాటకంబునే నీ తృప్తి కొఱకు
పూని యాడుచు నుంటి భూలోకమందు
॥నీవాడ॥
నీ వాడనే యని నీవు ఆడించితే
నా వాడవే యని నమ్మి యాడేను
ఏ వార లెవరి వా రెవరు తేల్చేది
రావయ్య మాయపొర లావల పెట్టి
॥నీవాడ॥