దయచేసి సంప్రదాయసాహిత్యాన్ని గురించిన రచనలు చేసేవారు కొంచెం జాగరూకులై ఉండండి.
అప్పటి సాహిత్యకారుల రచనలను తెలిసో తెలియకో దిద్ది ప్రకటించే ముందు తమకు ఆపని చేసేందుకు తగిన అధికారమూ సాధసంపత్తీ ఉన్నాయా అన్నది బాగా వివేచన చేసుకొని కాని ఆమహానుభావుల వ్రాతలలో తప్పులు దిద్దే సాహసం చేయకండి.
అన్నమయ్య సాహిత్యాన్ని గురించి, అది ఒక ఆరువందల యేండ్ల క్రిందటి భాషాస్వరూపంగా, కవిత్వధోరణిగా ముందు అవగాహనలో ఉంచుకోండి. వాటి గురించి తగినంత సాధికారికంగా తెలియనిదే ఆయననే తప్పులు దిద్దే పని చేయకండి.
"అదివో అల్లదివో హరివాసము" అన్న దానిని "అదిగో అల్లదిగో శ్రీహరివాసము" అని మార్ఛి పాడే అతితెలివి ప్రచారంలో ఉంది! ఎవరీ పని చేసారో తెలియదు. అన్నమయ్య అదిగో బదులు పొరపాటున అదివో అనలేదండీ. అక్కడ శ్రీ అని చేర్చి యతిభంగం చేసారే అసలు ఆయన యతిప్రాసలను నియమంగా పాటిస్తారని తెలుసుకోలేకపోయారు కదా! తప్పుడుపాఠం ప్రచారం కావటం దురదృష్టం. ఎవరిదో దురహంకారం ఫలితం.
ఈకీర్తనలో ఈటపాలో సతులాల అన్నమాటను సతులారా అనిదిద్దారు. సోబాన అన్న దానిని శోభన అని దిద్దారు! "సతులారా", "శోభన పాడరమ్మ" అని కాదండీ "సతులాల", "సోబాన పాడరమ్మ" అనే సాహిత్యం. తితిదే వారి ప్రచురణను పరిశీలించండి. ఓపికలేదా? ఈప్రయత్నాలు మానుకోండి. తెలిసీతెలియని విధంగా వ్రాసి పెద్దల సాహిత్యాన్ని అవమానించకండి, దాన్ని భ్రష్టు పట్టించకండి.
పైగా "కలశాబ్ది" పదాన్ని "కళాశాబ్ధి" అని మార్చటం ఘోరాతిఘోరవిషయం! ఏమివ్రాస్తున్నారో ఆవ్రాసేవారికి అవగాహన లేదే! దారుణం.
అక్కడ ఆటపాను ఇంక చదువలేదు. చదువలేను కూడా! ఇంకేమి తప్పులున్నాయో! ఈమాటలు కొన్నింటిని టపాకు ఒక కామెంటుగా పంపాను. ఐనా అందరికీ అందుబాటుగా ఉండాలని ఒక టపా రూపంలోనూ బ్లాగులో ఉంచుతున్నాను.
ఇంకా నేల దాఁచేవు యీ సుద్దులు కంకణాలు గట్టిన నీకళ్యాణపు సుద్దులు
ముంగిటికి వచ్చె నివె మోహపు నీ సుద్దులు అంగడిలోనికి నెక్కె నా సుద్దులు కొంగుబంగారము లాయె కోరికె నీ సుద్దులు యెంగిలి మోవికి సోఁకె నీ సుద్దులు
పొంచులకు లోనాయ పొరుగుల నీ సుద్దులు యెంచితే నెన్నైనాఁ గల నీ సుద్దులు కంచపు పొత్తు గలసె కడలేని నీ సుద్దులు దించరాని మోపులాయె దినదినసుద్దులు
ఇసుకపాఁతర లాయె నిదివో నీ సుద్దులు ముసిముసి నవ్వులాయె ముందే సుద్దులు యెసగి శ్రీవేంకటేశ ఇంంతలో నన్నేలితివి కొసరితే నిగిరించీ కూరిమి నీ సుద్దులు
ఇదొక అందమైన శృంగారసంకీర్తనం. ఇరవైతొమ్మిదవ సంపుటంలోని 189వ సంకీర్తనం.
ఈకీర్తనలో మాటిమాటికీ సుద్దులు అన్న మాట వస్తూ ఉంటుంది. సుద్దులు అంటే మంచిమాటలు అని అర్ధం. ఈ సుద్దులు వారివీ వీరివీ కాదు శ్రీవేంకటేశ్వరుల వారివి. అయన అమ్మవారితో సెలవిచ్చిన అందమైన మాటలు. అసలిక్కడ సుద్దులు అంటే అందమైన మాటలు అని తీసుకుంటేనే పసందుగా ఉంటుంది.
అందమైన మాటలు మరి అవి యెటువంటి వనుకుంటున్నారూ? అవి కళ్యాణపు సుద్దులు. అంటే స్వామివారు తమ వివాహ సమయంలో అమ్మవారితో మొదలుపెట్టిన అందమైన పలుకులు. అవి ఇంతలో అందలో వెన్నెతగ్గే రకం మాటలా అని? లోకంలో ఆలుమగలు పెండ్లి ఐన కొత్తలో పరస్పరం ఎంతో అందంగా పొందికగా సరసంగా మాట్లాడుకుంటారు. రానురానూ కొత్త మురిపెం తీరి ఆమాటల్లో కొంత అందచందాలు తగ్గుతాయి. అవి క్రమంగా వెన్నెవాడి మెల్లగా కొంతమందిలో దెప్పుళ్ళకూ దెబ్బలాటలకూ దారితీసేంత అధ్వాన్నంగా మారుతూ ఉంటాయి. ఆ కొంత కాలం అన్నది ఎంతకాలమూ అంటే పదహారురోజుల పండుగ వెళ్ళకుండానే పోట్లాటలకు నిలయమైన కాపురాలూ ఉంటాయి, ఇద్దరూ ఎనభైవపడిలో పడ్డా పరస్పరం ఎంతో ముచ్చటగా సంభాషించుకొనే ఉత్తమదంపతుల కాపురాలూ ఉంటాయి. అంతా సృష్టివైచిత్రి.
కాని సృష్టికే మూలమైన ఆదిదంపతుల కళ్యాణపు మాటల అందచందాలు అలాగే ఉంటాయి ఎన్నటికీ. వాటితీరుతెన్నులను అన్నమయ్య గారు ఈసంకీర్తనలో వర్ణిస్తున్నారు.
మరొకరకంగా కూడా ఈకళ్యాణపుసుధ్దులు అన్న ప్రయోగాన్ని అర్ధం చేసుకోవచ్చును. కళ్యాణప్రదమైన సుధ్ధులు అని. కళ్యాణం అంటే శుభం అని అర్ధం కదా. అంటే శ్రీవారి సుద్దులన్నీ శుభప్రదమైనవి అని చెప్పటం. ఎటువంటి శుభాలో ఈ సంకీర్తన వివరిస్తూ ఉంది. ఐతే ఇక్కడొక చిక్కు వస్తోంది. ఆకళ్యాణపుసుధ్ధులు సామాన్యమైనవి కావూ కంకణాలు కట్టినవీ అంటున్నారే, దానికి అన్వయం ఎట్లా చేయటమూ అని ప్రశ్న ఒకటి ఉంది కదా. దానికి సమాధానం ఏమిటీ అన్నది చెప్పుకోవాలి. రెండువిధాలుగా సమాధానం చెప్పవచ్చును మనం. ఒకడు ఈపని చేస్తానూ ఇలాగే చేస్తానూ అని కంకణం కట్టుకొని కూర్చున్నాడు అని అనటం లోకంలో ఒక వ్యవహారం ఉంది. దాని అర్ధం పట్టుబట్టుకొని ఉండటం అని. నామాటలు శుభాన్నే కలిగించాలీ అని స్వామివారు కంకణం కట్టుకొని ఉన్నారని సమాధానం చెప్పి సమన్వయం చేయవచ్చును. మరి కీర్తనలో కట్టుకొన్న అని కాక కట్టిన అని ఉంది కదా అని శంక చేయవచ్చును. దానికేం ఆచార్యుల వారు గీత సౌలభ్యం కోసం అలా వ్రాసారని అనుకోవచ్చును లెండి. ఇబ్బంది లేదు. మరొక పక్షం ఏమిటంటే, మొదట మనం అనుకున్నట్లే స్వామి వారు కళ్యాణంతో మొదలైన సుద్దులు అని చెప్పుకోవటం.
ఆస్వామి వారి సుద్దుల గురించి సంకీర్తనం ఎలా వివరిస్తోందో చూదాం.
ఈ సంకీర్తనంలో చివరి చరణంలో ఉన్న నన్నేలితివి అన్న ప్రయోగాన్ని బట్టి ఈ మాటలన్నీ అమ్మవారు అయ్యవారిని ఉద్దేశించి పలుకుతున్నట్లుగా భావన చేయాలి మనం.
ఒకరోజున అయ్యవారు కొంచెం ముభావం నటించారు. అయ్యవారికీ అమ్మవారికి మధ్యన ఏమైనా ప్రణయకలహం నడిచిందా ఈసంఘటనకు ముందుగాను లేదా అయ్యవారు మరేదైనా కారణం వలన అలసి ఉండి సరసోక్తులను పలుకకుండా ఉన్నారా అమ్మవారి వద్దకు వచ్చి కూడా కొద్దిసేపు అన్నది విచార్యం. ఐతే అమ్మవారు అయ్యవారిని హుషారు చేయటానికి ప్రసంగం మొదలు పెట్టింది.
ఎందుకయ్యా దాస్తున్నావూ అందమైన నీ మాటలన్నీ నాదగ్గర ఈవేళ, ఎంతో శుభకరమైన నీ మాటలను దాచటం దేనికీ, అని నిలదీస్తున్నట్లుగా అడుగుతోంది.
ఓ వేంకటరాయడా నీ మోహపూరితమైన సుద్దులు నా ముంగిట్లోకి వచ్చాయి. అలా ముంగిట్లోనే మొదలైన ఆ సుద్దులు అంగడికెక్కాయి కదా! అలా ఎవరైనా ముంగిట్లోనే సరసాలు మొదలుపెడతారటయ్యా నీమోహమూ నీవూను కాకపోతే. దానితో బజార్న పడ్దాం. ఊళ్ళో అందరూ మన విడ్డూరం గురించే చెప్పుకోవటమూ నవ్వుకోవటమూ కదా! నీ సరసవచానాలు నాకు కొంగుబంగారాలు ఐనాయి. కోరిన కోరికలన్నీ శుభప్రదంగా తీరుస్తూ ఉన్నాయిలే. అసరసవచనాలు ఎప్పుడూ నామూతిని ఎంగిలి చేసి వదలటమే కదా అని అమ్మవారు ముసిముసి నవ్వులు చిందిస్తూ అంటున్నది. ఇలా స్వామితో ముచ్చటించటం అంతా అయనలో నేడు కనిపిస్తున్న ముభావాన్ని వదిలించటానికే.
మరలా అమ్మవారు ఇలా అంటోంది. నీ ముచ్చట్లు ఎంత గుట్టుగా ఉంటాయో తెలిసిందే అందరికీ. అందుకే ఈమహానుభావుడి నేటి వ్యవహారం ఏమిటో అని అందరూ పొంచి దొంగతనంగా మననిచూడటమే నిత్యమూ. నీకైతే పట్టింపే లేదు కదా! ఇలా అందరి చెవులా పడేలా నువ్వాడే సరసాల గురించి చెప్పేదేముంది. ఇన్నా అన్నా? ఎంచబోతే లెక్కేలేనన్ని కదా!
నీఅంతులేని సరసవచనాలు భోజనాల దగ్గరైనా ఆకాసేపైనా ఆగేది ఉందా అంటే, ఏమి చెప్పేది. ఆధరవులపైన వంకలు పెట్టి కూడా చిత్రమైన సరసవాక్యాలు చెప్తావు కదా. (అన్నమయ్య గారు వేరొక సందర్భంలో కంచపురతులు అన్న చిత్రమైన ప్రయోగం కూడా చేసారు) కంచాల దగ్గర నీ సరసాలు అంతూ పొంతూ లేనివి కదా. అవి మోపులుమోపులుగా పేరుకొని ఉన్నాయి. అవి నాతలకెక్కి దించరాని మాధుర్యాన్ని అందిస్తూ ఉన్నయి నిత్యమూ.
అబ్బే మోపులుమోపు లేమిలే నీసరసాలు అంత చిన్న ఉపమానం సరిపోతు. అవి ఇసకపాతరలే అనుకో. ఎంత తవ్వుకొన్నా తరగకుండా ఉండేవి కదా. అలా అనటమే బాగుంటుంది.
అమ్మవారు ఇలా ఆ శ్రీవేంకటేశ్వరుని సరసవచనాలను గురించి తన భావన ఎలా ఉందో చెప్తూ ఉండే సరికి అయ్యవారికి అనందం కలిగింది. ముభావంగా ఉన్న మోము విచ్చుకుంది.
అంతలోనే ఆయన ముసిముసి నవ్వుల విరజిమ్ముతూ అమ్మను తిలకించటం మొదలుపెట్టాడు ఇంకా ఏమంటుందా అని.
ఓ వేంకటేశా ముందుగా ముసిముసి నవ్వులు పూసాయి నీమోముపై. అమ్మయ్య నన్ను కరుణించావు. సంతోషం. ఇదిగో మళ్ళా విజృంభిస్తున్నావు ఉత్సాహంతో. బాగుంది బాగుంది ఇలా ఉండాలి అంటోంది అలమేలు మంగమ్మ.
ఈ సంకీర్తనలోని కొన్ని పదాలకు ముందుగా అర్ధాలు చూదాం. చాలావరకు పదాలన్నీ తెలిసినవే అందరికీ.
కాంత అంటే స్త్రీ. బత్తి అంటే భక్తికి వికృతి రూపం. అలాగే కోవిల అనేది కోయిలకు మరో రూపం. నీటున అంటే ఇక్కడ అందంగా తెలివిగా అని. వదరు అంటే ఎక్కువగా మాట్లాడటం. పంచసాయకుడు అంటే మన్మథుడు. ఒడబరచటం అంటే ఒప్పించటం. ఈ సాహిత్యంలో ఈపె అన్నమాట తరచు వస్తూ ఉంటుంది - ఈపె అంటే ఈమె అని అర్ధం. వనము అంటే ఏదో అడవి అనుకొనేరు. క్రీడోద్యానం అన్నమాట - అందులో ఛప్పన్న వృక్షాలూ అనేకరకాల పుష్పజాతులూ ఉంటాయి. రట్టుచేయటం అంటే తిట్టటం నిందించటం అని అర్ధం.
ఈ కీర్తన అలమేలుమంగమ్మను గూర్చి ఒక చెలికత్తె మిగిలిన చెలికత్తెలను హెచ్చరిస్తూ చెప్పినట్లుగా ఉన్నది.
ఇప్పుడు ఈ సంకీర్తనాన్ని అర్ధం చేసుకుందాం.
అది వసంతఋతువు. అయ్యవారూ అమ్మవారూ ఒక సమయం చేసుకున్నారు. అంటే ఈరోజు సాయంకాలం చంద్రోదయం వేళకు ఉద్యానవనంలో కాసేపు కులాసాగా కూర్చుందాం అని అనుకున్నారు.
సమయానికి అమ్మ అలమేలుమంగ చక్కగా ముస్తాబై ఎంతో ఆసక్తితో అనందంగా క్రీడోద్యానవనానికి వచ్చి అయ్యవారికోసం ఎదురుచూస్తూ ఉన్నది.
క్రీడోద్యానం అన్నాక అక్కడ అనేక ఫలవృక్షాలూ పూలమొక్కలూ పూపొదలూ గట్రా ఉన్నాయి.
ఫలవృక్షాలన్నా మావిడిచెట్లు లేకుండా ఉంటాయా ఏమిటి చెప్పండి? మామిడి చెట్లూ వసంతఋతువూ అన్న తరువాత అక్కడ కోయిలలు గుంపులుగుంపులుగా కొమ్మకొమ్మనా హడావుడి చేస్తూ ఉండవా మరి!
పెత్తనాలు చేసివచ్చిన చిలకలు ఎన్నో ఎన్నెన్నో గూళ్ళకు తిరిగి వచ్చి హడావుడిగా అరుస్తున్నాయి. వాటితో పాటే పావురాలూను.
ఒక ప్రక్క సాయంకాలం ముదిరిపోతోందన్న తొందరలో తుమ్మెదలు గోలగోలగా పువ్వుల దగ్గర ఝుంకారాలతో హోరెత్తిస్తున్నాయి.
చల్లటి సాయంకాలం వేళ పిల్లగాలి మెల్లగా వీస్తున్నది హాయిగొలుపుతూ.
కొంతసేపు అలమేలు మంగకు ఈవినోదం అంతా మంచి కాలక్షేపంగానే ఉన్నది.
అయ్యో సాయం సంధ్య దాటి చంద్రోదయ వేళ అవుతోందే, శ్రీవారేమిటీ పత్తాలేరు అని ఆమెకు విరహం హెచ్చి పోతూ ఉంటే ఈవినోదాలే వెగటయ్యాయి! కొంచెంసేపు హాయి నిచ్చినవే ఇప్పుడామె మనస్సును నొప్పిస్తున్నాయి.
శృంగారం రెండు రకాలూ అని చెప్తారు. ఒకటి సమాగమశృంగారం రెండవది వియోగశృంగారం.
ప్రియసమాగమంలో ఏవేవి ఐతే ఆహ్లాదకరమూ శృంగారోద్దీపకమూ అని పేరుపడ్డవి ఉంటాయే అవి వియోగావస్థలో దుర్భరంగా ఉంటాయి.
వివిధరకాలుగా విరహావస్థలను వర్ణించి చెప్పటం అంటే కవులకు భలే యిష్టం. కావ్యసంప్రదాయంలో అన్ని కావ్యాలలోనూ ఇదొక ప్రథానమైన అవకాశంగా దొరకబుచ్చుకొని మన కవులు రెచ్చిపోతారు.
మన్మథుడు అని ఒకడున్నాడు. వాడు భలే తుంటరి. రకరకాలుగా ప్రేయసీప్రియులకు ఆకర్షణ కలిగించటం వాడి పని. ఆ మహాకార్యక్రమంలో వాడికి తోడ్పాటుగా పెద్దవ్యవహారమే ఉంది.
ఆది శంకరులు సౌందర్యలహరీ స్తోత్రంలో ఈవిషయకంగా ఒక శ్లోకం చెప్పారు. బాగుంటుంది చిత్తగించండి.
ధనుఃపౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖాః
వసన్త స్సామన్తో మలయమరు దాయోధన రథః!
తథాప్యేకస్సర్వం హిమగిరిసుతే కామపి కృపామ్
అపాఙ్గాత్తే లబ్ధ్వా జగదిద మనఙ్గో విజయతే!!
ఈ అందమైన శ్లోకంలో ఏమని ఉందంటే శంకరులు లలితాపరాభట్టారికా అమ్మవారితో అంటున్నారు. ఈమన్మథుణ్ణి చూడమ్మా. వీడి ధనుస్సు చూస్తే పూవులతో కూర్చినది. అంటే సుతిమెత్తనిది. ఆవింటికి అల్లెత్రాడు అంటావా తుమ్మెదల బారు అట! వాడిచేతులో ఉన్న బాణాలు చూస్తే ఐదంటే ఐదే నట. వాడికి సహాయంగా నిలబడేది ఎవడయ్యా అంటే వసంతుడట సంబడం - వాడు ఉండేదెన్నాళ్ళని కూడా? వాడి రథమట మలయమారుత మట. అదేమో ఎప్పుడే దిక్కుగా పోతుందో దానికే తెలియదు. ఇంకా ఈ పటాటోపం అంతా వెంటవేసుకొని తిరిగే వీడికైతే అస్సలు శరీరమే లేదు. అబ్బే, అబ్బే. ఎందుకు పనికి వస్తాడమ్మా! కాని తమాషా ఏమిటంటే తల్లీ, నీ అనుగ్రహం పొంది నీ కడగంటి చూపు సంపాదించి ఈప్రపంచాన్నంతా జయించి గడగడలాడిస్తున్నాడు. అని.
ఇప్పుడు అర్ధమైనది కదా, ఈ వసంతమూ, ఈపువ్వులూ, తుమ్మెదలూ వగైరా అంతా మన్మథుడి పార్టీ అని.
అలాగే ఈమన్మథుడికి చిలుకతత్తడిరౌతు అన్న బిరుదం కూడా ఉంది. అంటే మరేమీ లేదు ఆయన వాహనం చిలుక అని. చిలుక గుర్రాన్ని స్వారీ చేసే రౌతు అని. ఇప్పుడు చిలుకలూ మన్మథుడి పార్టీయే అని తెలిసింది కదా.
ఇకపోతే చంద్రుడనే వాడూ మన్మథుడి పార్టీ అనే చెప్పాలి. విరహావస్థలో ప్రేమసీప్రియులకి చల్లని వెన్నెల వేడిగా అనిపిస్తుందని కవిసమయం. చంద్రుడికి శృంగారవర్ణనకూ సాహిత్యంలో బోలెడంత గ్రంథం ఉంది. సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను ఈసందర్భం చూసుకొని చంద్రుణ్ణి తిట్టించని కవిలేడు. ఒకాయన ఐతే అంటాడూ నీకు జాలి దయా ఎక్కడివయ్యా చంద్రుడా నువ్వు తురకల జండా ఎక్కి కూర్చుంటావు కదా అని!
అందాకా ఎందుకు చందమామను చూపకుండా సినిమావాళ్ళు మాత్రం వదులుతారా చెప్పండి.సినిమాల్లో చందమామ మీద ఉన్నన్ని పాటలు మరే ఇతర వస్తువుమీదా లేవు కదా! మనలో మనమాట సినిమాచంద్రుడికి చచ్చినా చిన్నమచ్చ కూడా ఉండదు.
సరే ఇప్పుడు అమ్మవారు ఎదురుచూస్తూ విరహంలో ఉంటే సాయంత్రం దాటి చంద్రోదయమూ ఐనది. ఆవిడ విరహాన్ని రెచ్చగొడుతున్న వాతావరణాన్ని గమనిస్తూ, ఆవిడ వేదన చూడలేక చెలికత్తెలు మన్మథుణ్ణీ వాడి పరివారాన్నీ కట్టగట్టి తిడుతున్నారు! అదీ సందర్భం.
ఈమహానుభావుడు శ్రీవేంకటేశ్వరుడేమో ఎంతకూ రాడాయె.
ఆచెలికత్తెలలో ఒకామె ఇతరులతో అంటున్నదీ, అలమేలుమంగమ్మపై మిక్కిలి భక్తిప్రపత్తులున్న ఓ చెలులారా,
మీరు
మన క్రీడోద్యానంలోని కోయిలలను పట్టుకొని ఎందుకు తిడుతూ అల్లరి
చేస్తున్నారు? పూవులకోసం పోటీలు పడి ఝుంకారాలు చేస్తున్న తుమ్మెదలను చూసి
ఎందుకు కోప్పడుతున్నారు? పనిగట్టుకొని చంద్రుణ్ణి చూసి ఎందుకు
నేరాలెంచుతున్నారు? ఎందుకర్రా యీ మాటలన్నీను? తిన్నగా మీరేమన్నా
చెప్పుకోదలచుకుంటే వెళ్ళి శ్రీవారికే విన్నవించుకో రాదా? ఎందుకీ పనులు అమ్మకు ఉత్సాహం కలిగించేలా మాట్లాడండర్రా.
ఆ చిలకలను చూడండి,
వాటి మానాన అవి ఉంటే వాటిని
బెదిరిస్తూ మాటలెందుకూ మాట్లాడటం? ఆ చల్లని పిల్లగాలిని పట్టుకొని నిందించటం
ఏమిటి మరీ అందంగా ఉంది. అదేం చేసిందీ? ఆ వసంతుడితో నువ్వెంతపోరా అంటూ ఆ
పంతాలు పలకటం ఏమిటీ? ఈడాబుసరి హడావుడులు అన్నీ ఎందుకమ్మా? శ్రీవారి
దగ్గరకే వెళ్ళి మీ నేర్పేదో చూపి నెమ్మదిగా సామవాక్యాలు పలికి
రప్పించరాదా? అందాకా మిగిలిన వాళ్ళు అమ్మకు ధైర్యోత్సాహాలు కలిగేలా మాట్లాడరాదా?
అ అరుగుల మీద వాలుతున్న పావురాలను చూసి నోటికి
వచ్చినట్లు తిడితే ఏమెస్తుందీ మీకు? ఆ మన్మథుణ్ణి బ్రతిమాలి ఒప్పించాలని
ప్రయత్నాలేమిటీ?
ఉండండి ఉండండి. ఇదిగో శ్రీవారు విచ్చేస్తున్నారు. అల్లదే చూడండి.
ఇదిగో ఆయన రానే వచ్చారు అమ్మవారి దగ్గర ఉన్నారు.
రండి. వీరికి వేడుకగా ఏమేమి ఉపచారాలు చేయాలో ఆసంగతి చూదాం పదండి. చేసినపనులు చాలు కాని వాళ్ళకి ఏం కావాలో చూదాం. పోయి మనవి చేసుకుందాం రండి.
ఇలా చెలికత్తె ఒకామె మిగిలిన చెలికత్తెలతో అన్నమాటలు ఈసంకీర్తన.
అలమేలు మంగ అమ్మవారు చాలా నేర్పుగల పడతి సుమా అని అన్నమాచార్యుల వారు ఈకీర్తనలో ప్రతిపాదిస్తున్నారు. ఎందుకలా అంటాం కదా అని వివరణలను ఇస్తున్నారు.
ఆమె కన్నులతో నవ్వుతున్నదట! అంటే సంతోషభావం ఆవిడ కళ్ళల్లోనే కనిపిస్తున్నది. అటువంటి సంతోషం వెలిబుచ్చేకళ్ళతో ఆమె భర్త ఐన శ్రీవేంకటేశ్వరుని పదేపదే చూస్తూ చల్లగా ప్రియమైన మాటలు చెబుతున్నదట. అంటే ఓరకళ్ళతో చూసీచూడనట్లే చూస్తూ అందంగా ఆయనతో సంభాషణ చేస్తున్నది అని పిండితార్ధం. అంతే కాదు తన వివిధమైన సంజ్ఞలతో ఆయనకు ఆశలు రేకెత్తిస్తూ సరసవాక్యాలు మాట్లాడుతూ ఉన్నది. అలాగని ఆయన కొంచెం చొరవచూపించినంత మాత్రాన ఏమి చేస్తోందండీ? ఆవిడ కనుబొమలు మన్మథుడి విండ్లలాగా ఉన్నాయి కదా వాటిని కొంచెంగా ముడివేసి వంచి చూస్తూ బెదిరిస్తున్నట్లుగా అభినయం చేస్తూ ఉంది. ఇలా అలమేలుమంగమ్మ ఆయనతో కొసరికొసరి సరసాలాడుతూ ఉన్నది.
కనుబొమలు మన్మథుడి విండ్లలాగా ఉండటం గురించి సౌందర్యలహరీ స్తోత్రంలో శంకరులు ఇలా అంటారు.
భువౌ భుగ్నే కించిద్భువన భయభంగవ్యసనిని
త్వదీయే నేత్రాభ్యాం మధుకర రుచిభ్యాం ధృతగుణమ్
ధను ర్మన్యే సవ్యేతరకర గృహీతం రతిపతేః
ప్రకోష్టే ముష్టాచ స్థగయతి నిగూఢాంతర ముమే.
ఇది సౌందర్యలహరిలో 47వ శ్లోకం.
ఈ శ్లోకం భావం ఏమిటంటే, అమ్మా నీ కనుబొమలు తుమ్మెదల బారులాగా నల్లగా అందంగా ఉన్నాయి. అవి కొంచెం వంగి ఉన్నాయి. మన్మథుడి విల్లులా అనిపిస్తుందమ్మా వాటి తీరు. రెండు బొమలూ కలిపి ఒక విల్లు. కాని మధ్యలో కొంత భాగం కనబడటం లేదు. కాబట్టి రెండుగా కనిపించటం అంతే. ఆఁ అక్కడ మన్మథుడు తనచేతితో పట్టుకొన్నాడు కదా వింటిని. అందుకే కొంచెం అక్కడ మరుగు అయ్యింది. అంతే నమ్మా" అని.
ఈవిధంగా కనుబొమలను మన్మథుడి వింటితో పోల్చటం అనే శృంగారసంప్రదాయం ఒకటుంది కదా. అలా ఆ మన్మథుడి వింటి వంటి కనుబొమలను అలమేలుమంగ మాటిమాటికీ కొద్దిగా కదుపుతూ ఉంటే అమన్మథచాపాన్ని ఎక్కుపెట్టటం విన్యాసంలా ఉంది.
కాని తాను మాత్రం తిన్నగా ఎదుటనే కూర్చుంటుందా ఇలా మాట్లాడుతూ? ఊఁ హూఁ. కూర్చోదు. ఆయన ప్రక్కనే వచ్చి కూర్చుంటుంది తాకుతూ. తానే హద్దు మీరి ఆయన బుగ్గలు నొక్కుతూ వినోదిస్తూ ఉంటుంది.
కొద్ది సేపటికి ఆవినోదం చాలించి ఆయనకు ప్రేమతో కర్పూరతాంబూలం అందిస్తుంది. ఆయనకు తన దృష్టే తగులుతుందని భయపడినట్లుగా హారతి ఇచ్చి దిష్టితీస్తుంది!
ఇలా ఆయనతో సరసాలు ఆడీఅడీ సంతోషిస్తుంది. అయనకు వివిధోపచారాలు చేస్తుంది.
ఈపదహారు కళాస్థానాలు మళ్ళా చంద్రకళలతో ముడిపడి ఉంటాయి. ఏరోజున ఏతిథి అవుతున్నదో దానికి సంబంధించిన కళాస్థానం మిక్కిలిగా శృంగారోద్దీపనశక్తిని కలిగి ఉంటుందని శాస్త్రం. ఇవి సంచరించే క్రమం శుక్లపక్షంలో ఒకరీతిగానూ కృష్ణపక్షంలో వేరొక రీతిగానూ ఉంటుంది. మరలా ఇవి పురుషులకూ స్త్రీలకు భిన్నవిధానాల్లో సంచరిస్తాయి. కాబట్టి ఈసంగతి చక్కగా తెలిసిన వారు తగిన కళాస్థానాన్ని స్పృశించటం ద్వారా శృంగారభావోద్దీపనం చేయగలరు.
ఈకళల వ్యవహారం గురించి ఒక ఐతిహ్యం ఉంది. మండనమిశ్రులను వాదంలో కాలడి ఆదిశంకరులు జయించారు. ఓడిన మండనమిశ్రుడు సన్యాసం స్వీకరించాలి. కాని ఆయన భార్య ఉభయభారతి ఒక అడ్డుపుల్ల వేసింది.
"శంకరా, భార్య భర్తలో అర్ధభాగం కదా. నువ్వు మండనులు అనే ఒక అర్ధభాగాన్ని జయించావు సంతోషం. ఇంకా నువ్వు ఈఉభయభారతి అనే అర్ధభాగాన్నీ జయిస్తే తప్ప నీవిజయం పరిపూర్ణం కాదు సుమా. అహా, నీకు తెలియదని కాదు. ముందుముందు ఎవరూ ఈమాట లేవనెత్తి నీవిజయం అసమగ్రం అనకుండా ఉండేందుకే గుర్తుచేస్తున్నాను" అన్నది.
శంకరులు "సరే నమ్మా, నీకు ఇచ్చవచ్చిన శాస్త్రంలో ప్రశ్న వేసి వాదం ప్రారంభించు" అన్నారు.
"శంకరా, కళాస్థానాలు ఎన్ని? అవి యేవేవి? స్త్రీకి ఏఏ దినాల్లో అవి ఎలా సంచరిస్తాయి" అని ప్రశ్నవేసింది ఉభయభారతి.
శంకరుడు నిర్ఘాంతపోయాడు. పచ్చి వెలక్కాయ నోట్లో పడినట్లైంది. సమాధానం చెప్పగలడు. కాని చెప్పకూడదు. సన్యాసివి నీకు ఎలా తెలుసు అనగలదు. అంతే కాదు స్వానుభవం లేకుండా శాస్త్రం వల్లెవేయటం అని ఎత్తిపొడవగలదు.
"అమ్మా ఉభయభారతీ. నీవు సాక్షాత్తూ సరస్వతీదేవివి! ఒక సన్యాసిని శృంగారశాస్త్రంలో పరీక్షిస్తున్నావా అమ్మా! తప్పు అనకూడదు. నేను కాశ్మీరం వెళ్ళి నీ సర్వజ్ఞపీఠాధిరోహణం చేయాలని ఆశించేవాడిని. నీకు తెలుసు. అన్ని శాస్త్రాలూ తెలిసి ఉండాలి నాకు. ఈశాస్త్రం తెలిసినా దాని గురించి మాట్లాడే అధికారం లేదు ప్రస్తుతం. నువ్వు గడువు ఇస్తే మరలా వచ్చి నీప్రశ్నకు జవాబులు చెప్తానమ్మా" అన్నాడు.
ఉభయభారతి నవ్వి "అలాగే శంకరా, నాకు తొందరేమీ లేదు. జవాబును మళ్ళీ వచ్చి చెబుదువు గానిలే" అని అంగీకరించింది.
ఆపిమ్మట శంకరులు పరకాయప్రవేశం చేసి ఒక రాజు శరీరంలో కొన్నాళ్ళు ఉండి తిరిగివచ్చి ఉభయభారతిని వాదానికి పిలిచారు. ఆవిడ అన్నదీ "శంకరా, అంతా తెలుసును నాకు. నీవిజయం పరిపూర్ణం అయ్యింది. ఇంక మండనులకు సంతోషంగా సన్యాసానికి అనుమతి నిస్తున్నాను" అన్నది.
అప్పుడు మండనులకు సన్యాసార్హత వచ్చింది. భార్య అనుమతి లేనిదే భర్త సన్యాసం స్వీకరించరాదు. ఆ మండనమిశ్రులు సురేశ్వరాచార్యులు అయ్యారు.
అమ్మవారికి తెలియని శాస్త్రం ఏముటుంది. ఆవిడ శ్రీవారి కళాస్థానాల్ని పదేపదే తాకుతూ ఆయనకు భావోద్దీపనం చేస్తూ వినోదిస్తున్నది.
ఇలా చేసి శ్రీవేంకటేశ్వరుడి కౌగిట చేరి ఆనందిస్తున్నది.
ఈకీర్తనను అచ్చముగా ఉరమెక్కే నలమేలుమంగ అని చెప్పి ముగించారు. అమ్మవారు శ్రీవేంకటేశ్వరులతో లీలావినోదం చేసి ఆయన అక్కర తీర్చి ఆనందంతో వక్షస్థలంలో చేరి ఉన్నది అని అర్ధం. ఈ అక్కర తీర్చటం అన్న ప్రతిపాదనను మనం పల్లవిలో చూడవచ్చును. కొంచెం ఈముగింపుకు శృంగారశాస్త్రపరమైన వేరే అన్వయం కూడా చెప్పవచ్చును కొందరు. కాని అది అంత అవసరం కాదనుకుంటాను.
పల్లవిలో అక్కర దీరిచి పతిని అనటంలో ఒక సొగసుంది గమనించండి. అక్కర పతిది. అది తీర్చటంలో అలమేలు మంగ మిక్కిలి నేర్పరి అట అలమేలమంగ. ఇంతకూ ఈశృంగారాభినయం అంతా శ్రీవేంకటేశ్వరుడి అక్కర అట. ఆయన గారు సంకల్పించబట్టి ఇంత గ్రంథం మిక్కిలి నేర్పుతో అమ్మవారు నడిపిందట. ఇదేదో పూజ చేసి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అన్నట్లుంది! ఆవిడ ఇలా శ్రీనివాసుడి ఇఛ్చమేరకు నేర్పుగా శృంగారం అభినయించి మరలా అచ్చముగా శ్రీవారి ఉరమెక్కి వ్యూహలక్ష్మీ స్వరూపంతో విరాజిల్లుతోంది.
(అన్నమాచార్య శృంగారసంకీర్తనలు 7వ సంపుటంలో 20వ కీర్తన)
ఈ కీర్తన కూడా కొంచెం క్లిష్టమైనది లాగానే ఉంది. ముందుగా దీనిలో ఉన్న కొన్ని పదాల అర్ధాలు తెలుసుకుందాం:
జవ్వనము: యౌవనము
పదను దీయు: వాడి తగ్గు. తాఁట తూఁట: సగంసగం అరకొర
పాటించు: ప్రకటించు
పొల్లవోవు: వ్యర్ధం అగు.
సొగయు: పరవశించు జూజాలు: జూదాలి
దప్ప: శ్రమ.
ఇంతి: మగువ: ముదిత: చెలియ: స్త్రీ (ఇక్కడ చెలికత్తెలను ఉద్దేశించి)
పల్లవిలో అమ్మవారి పలుకు "ఇచ్చకము లాడరే యింతులాలా , పచ్చిజవ్వన మింతలో పదను దీసీనా!" అని ఉంది. అమ్మ చెలికత్తెలను ఉద్దేశించి చెబుతున్న మాటలు. వాళ్ళని శ్రీవేంకటేశ్వరుడి వద్దకు పంపుతోంది. ఆయన గారు దక్షిణనాయకుడు కదా. ఇప్పటి వరకూ జాడలేడు. సంగతి సందర్భాలు తెలుసుకొని రండర్రా అని చెలికత్తెలను ఆదేశిస్తోంది ఆమె. మీరు వెళ్ళి ఆయనగారితో ఇచ్చకాలు (మనస్సుకు నచ్చే మాటలు) చెప్పి తీసుకురండి. నాదింకా పచ్చిజవ్వనమేను (లేతవయస్సేను) ఇంతలోనూ పసతగ్గింది అనుకుంటున్నాడేమో కాస్త నాపట్ల మీరు అయ్యవారికి ఆసక్తి కలిగేలా సానుకూలవచనాలు(అదేలెండి ఇచ్చకాలు) చెప్పి తీసుకొని రండి అని వారికి చెబుతోంది.
ఇక చరణాలను పరిశీలిద్దాం.
మొదటిచరణంలో అమ్మవారి పలుకుతున్నది ఏమిటంటే, అయన గారు ఎందుకని రావటం లేదో మరి. పోనీలెండి కావలిస్తే అలాగే ఇంట్లోనే ఉండమనండి. మీరు పోయి కనీసం మాటలాడి రండి (ఏమో మీమాటలతో ఆయన మనస్సు కరిగి రావచ్చును కదా అని) ఇలా చెప్పి అంతలోనే కొంచెం నిరాశగా అంటోంది. ఐనా సగం సగం ప్రయత్నాలు ఎందుకు లెండి. ఆయన వచ్చినప్పుడే వస్తాడు. ఇలా ఆయనపట్ల నా ప్రేమ అంతా వికసించి వ్యర్ధం కావలసిందేనా!
రెండవచరణంలో అమ్మవారి మాటలు. ఆయనకు ఎంతపరాకో అలాగే ఎక్కడికో పోయి జూదాలాడుతూ కూర్చుంటాడు పరవశించి (ఇక్కడ బావాజీ గురించి అమ్మవారి ఎత్తిపొడుస్తున్నారు!). ఇక నేను ఆసమయంలో గుర్తుకు రానే రాను కదా! మీరు వెళ్ళి ఒకసారి అయన గారి ముఖం చూచి రండి. మిమ్మల్ని చూసిన తరువాత ఐనా అయనకు నేను గుర్తుకు వస్తానేమో చూదాం. అని అంటున్నారు అమ్మవారు. మళ్ళీ అంతలోనే ఆయన్ను ఆక్షేపించటం ఉచితంకాదని అనిపించి ఇలా అంటోంది. ఐనా ఆయనతో మనకు ఎకసెక్కాలెందుకు లెండి. ఆయన ఇష్టం. భక్తుల దగ్గర అయనకు ఒళ్ళు తెలియదు కదా. దానికేం. మనం కూడా అయన ధోరణిలో కలిసి ఉండటమే మంచిది. అయన ఒక్క చిరునవ్వు నవ్వితే చాలు కదా. ఇంక సరసోక్తులు మొదలౌతాయి కదా అంటోంది అమ్మవారు.
ఇక మూడవచరణంలో మాటలు. ఒక వేళ ఆయన అలసిపోయి విశ్రయించి యున్నాడేమో చూడండి. అయన బడలిక తీరనీయండి కాని అటువంటప్పుడు ఆయన్ను పలుకరించి శ్రమపెట్టకండి. ఐనా ఊరికే దూరం నుండి నమస్కారం చేసిరండి.
ఇలా అమ్మవారు చెలికత్తెలకు ఉపదేశం చేస్తూనే ఉండగా శ్రీవారు వేంచేసారు.
ఇంకేమర్రా. అయ్యవారిదే వచ్చి నాప్రక్కనే ఉన్నారు కదా. మరేం కావాలి! ఇంక పొందరాని కోరికలు అంటూ ఏముంటాయి. అని అమ్మవారు చెలికత్తెలతో సంతోషంగా అంటోంది.
మొత్తం మీద ఈకీర్తనకు అన్వయం అంత సుభగంగా కుదరటం లేదు అనే చెప్పుకోవాలి. మొదటి చరణంలో "తావచ్చినట్టే వత్తము" (తాను వచ్చినట్లే వద్దాం) అన్నది ఎలా అన్వయించాలి? వద్దాము అని చెప్పటం సరిగా అన్వయం కావటం లేదు. రెండవచరణంలోని "యేకమౌద మీతనితో" అన్నది మరింత గడ్డు సమస్య. ఏకం అవుదాం అని చెలికత్తెలను తనతో సమానం చేసుకోవటం ఏమిటీ? బోధపడటం లేదు. అలాగే అక్కడ సరసాలు నాని విరియటం కూడా సుగమంగా లేదు. చివరి చరణంలో "కోయరాని కోరికలు" అంటే కోరరాని కోరికలు అనుకోవాలి. మరొక దారి?
కొన్ని చిక్కులున్నా మొత్తం మీద కీర్తన భావం బాగుంది.
ఈ సంకీర్తనంలో చెలికత్తె అమ్మవారితో శ్రీవారి గొప్పదనం గురించి చెబుతోంది.
అమ్మా మీ ఆయన అచ్చం గాలివంటి వాడమ్మా. (ఆయన వ్యాపించి ఉండని చోటే లేదు అని చెప్పటం) ఆయన మీద నువ్వు వెదజల్లుతున్న వలపులు బాగానే సరిపోయాయి. ఇక్కడ చల్లేటి నీ వలపులు అని కదా. చల్లటం అంటే ఏదో పరిమళద్రవ్యం లాగా వెదజల్లటం అనుకోండి. నిత్య వ్యవహారంలో స్పే చేయటం అంటామే. అలాగా అన్నమాట. చెలికత్తె అంటోందీ, నువ్వేమీ వలపుగంధాలు ఆయనమీద గుమ్మరిస్తున్నావు ఒకటే చిలకరించటం. ఒకటే చిలకరించటం. కానీ ఆయన ఏమో గొప్పదనంలో అచ్చం గాలివంటివాడు అని. అంటే అర్ధం అయిందా? గాలి ఏమి చేస్తుందండీ? పరీమళాన్ని నాలుగుదిక్కులా వ్యాపింపజేస్తుంది. వలపులు ఆవిడ అందిస్తే అది ఆయనగారు అన్నిచోట్లా పంచేస్తున్నాడమ్మా అని మేలమాడటం అన్నమాట. చెలికత్తె మాటల్లో అంతరార్ధం ఏమిటంటే వలపు రుచీ, వలపింప నేర్పూ అవి ఆయనగారికి నీవు నీవలపుల ద్వారా తెలియజేసావు - ఆవిద్యను ఆయన నాలుగుచోట్లా తన వలపులు పంచటానికి వాడేస్తున్నాడమ్మా అని. ఇదంతా ఎలా కూపీ లాగామూ ఈపల్లవిలో విషయం ఇదీ అని అంటే దానికి మనకి దారి చూపినవి రెండు మాటలున్నా యిక్కడ చల్లేటి అని ఒకటీ గాలి అని మరొకటీను. గాలిలోనికి ఏమి చల్లుతారండీ సుగంధపరీమళ ద్రవ్యాలు కాక. అదీ సంగతి. ఈకీలకం పట్టుకున్న వెంటనే మనకి పల్లవిలో చెలికత్తె అమ్మవారితో చెప్తున్నదేమిటో అవగతం అవుతోంది అన్నమాట.
ఇప్పుడు మనం చరణాలను కూడా ఒక్కటొక్కటిగా అర్ధం చేసుకొనే ప్రయత్నం చేద్దాం.
ముందుగా ఒకమాట. మొదటి చరణం చివరి పాదం "మేలిమి నీమగఁడు తుమ్మిదవంటి వాఁడు" అని ఉంది కదా. ఇక్కడ కొంచెం తికమక అనిపించవచ్చును. కొంచెం అవసరార్ధం ఇక్కడ పదాల స్థానాలు తారుమారయ్యాయి అంతే. ఈపాదాన్ని "నీమగఁడు మేలిమి తుమ్మిదవంటి వాఁడు" అని హాయిగా చదువుకోండి. అప్పుడు అన్వయం సులభంగా ఉంటుంది. సరేనా. సరేనయ్యా అలాగే చదువుకుంటాం కాని ఈ మేలిమి తుమ్మెద అన్న ప్రయోగం ఎందుకూ అని అంటే సరే, మనం అక్కడ నుండే మొదలు పెడదాం ఈ మొదటిచరణాన్ని పరిశీలించటం.
మనుషుల్లో మెతకరకం గడుసురకం మొండిరకం అంటూ రకరకాలుగా ఉంటారు కదా. అలాగే సర్వత్రానూ అనుకోండి. అభ్యంతరం ఏమిటీ? మేలిమి తుమ్మెద అంటే తుమ్మెదల్లో మంచిరకం అన్నమాట. ఈమంచిరకం ఏమిటో చూదాం. అసలు తుమ్మెద ప్రసక్తి ఏమిటో చూడాలి ముందుగా. ఇది శృంగార సంకీర్తనం. ప్రసక్తిలో ఉన్నది తుమ్మెద. అందరికీ తెలిసినదే పురుషులను తుమ్మెదలతోనూ స్త్రీలను పూవులతో పోల్చటం అనే వ్యవహారం. కాబట్టి ఎక్కువ కష్టపడకుండానే శ్రీవారిని చెలికత్తె తుమ్మద అని అనటంలో సూచన గ్రహించటం కష్టం ఏమీ కాకూడదు. తుమ్మెదతో పోల్చటం ద్వారా శ్రీవారు దక్షిణనాయకుడు అని అమ్మగారితో చెలికత్తె చెప్తున్నది అన్నమాట. అదేమీ కొత్త విషయం కాదు ఆవిడ కొత్తగా తెలుసుకోవలసిన విషయమూ కాదు.
చమత్కారం అంతా మేలిమి తుమ్మెద అనటంలోనే ఉంది! ఈ తుమ్మెద మేలిమి గుణం తుమ్మెద కాబట్టి ఏపూవు దగ్గర ఎలా ఉండాలో తెలిసినది. శ్రీవారు మేలిమి తుమ్మెద. అయన దక్షిణనాయకత్వాన్ని కోపగించుకోకుండా సహించిన వారికి అన్నికోరికలూ నెరవేరుతున్నాయి. అలాగని సహించం కోపం చేస్తాం అనే వారిని ఆయన విడిచే రకం కాదు. మంచి రకం తుమ్మెద కదూ. నీకిదంతా తెలిసిందే కదటమ్మా. ఐనా ఎందుకమ్మా ఇదోదో కొత్తవిషయం అన్నట్లు చూస్తున్నావూ అని చెలికత్తె దెప్పుతోంది అమ్మవారిని.
ఇప్పుడు రెండవచరణాన్ని చూదాం. అందులో చివరిపాదంలో చివరిపాదంలో "మంతుకెక్కి పతి నీడమానివంటి వాఁడు" అంటోంది చెలికత్తె. సరిగా "పతి మంతుకెక్కి నీడమాని వంటి వాఁడు" అన్వయం చేసుకుందాం. నీడమాను అంటే మంచి నీడ నిచ్చే చెట్టు. అన్ని చెట్లూ గొప్ప నీడను పరచాలని ఏమీ లేదు. కొబ్బరిచెట్టో తాడిచెట్టో ఐతే అది అంతెత్తుంటుంది కదా. మరి దాని నీడ ఎంత గొప్ప విస్తీర్ణంగా ఇస్తుందీ. దాని నీడ ఏమి లాభం. ఎవడన్నా బాటసారి మర్రిచెట్టు నీడన దుప్పటీ పరచుకొని హాయిగా నిద్రపోవచ్చును. ఆనీడ ఏమీ దూరంగా జరిగిపోదు అతను నిద్రలేచినా సాయం సమయానికి, నీడలోనే ఉంటాడు. ఇలా జీవులకు హాయిని స్థిరంగా నీడనిచ్చే చెట్టే నీడనిచ్చే చెట్టు కాని మిగతా చెట్లకు వాటితో పోలిక ఏమీ లేదు కదా. చెలికత్తె శ్రీవారు నీడనిచ్చే మాను అంట. అందులోనూ మంతుకెక్కిన మాను అంటోంది. శ్రీవారిని ఆశ్రయించుకొన్న వారు ఏకాలంలో ఐనా చల్లగా ఉంటారని చెప్తోంది మంచి సూచనగా స్పష్టంగానే. శ్రీవారు తనను ఆశ్రయించుకొన్నవారికి ఎప్పుడూ నీడ నిచ్చే చెట్టు లాంటి వారమ్మా. ఆ శ్రితజనపోషకుడిని ఆశ్రయించుకొని నమ్ముకొని ఉన్నవారికి కోరికలు నెరవేరుతాయి. అలా కాదు ఆయన అందరికీ ఆశ్రయం ఇవ్వటం ఏమీటీ అని పంతగించుకొని మూర్ఖిస్తే అటువంటి స్త్రీలకే మనస్సులో దైన్యం కలుగుతుంది అని హెచ్చరిస్తోంది. అంటే ఆయన దక్షిణనాయకుడు కావటాన్ని హర్షించలేకపోతే నష్టపోయేది ఆయన కాదు నువ్వే అని చెప్తోంది. అమ్మా ఆయన ఎలా ఇలా చేస్తాడు అలా ఎందుకు చేస్తాడూ ఇప్పుడేం చేస్తే బాగుంటుందీ ఆయనను ఎలా దారికి తెచ్చేదీ అంటూ ఊరికే నాతో చర్చలు చేయకమ్మా, అయన జగన్నాథుడు. అందరికీ ఆశ్రయం ఇచ్చే చెట్టువంటి వాడూ అని చెప్తోంది.
చివరి చరణాన్ని "తోడ నితఁ డెంచితే చంద్రుని వంటి వాడు" అని ముగించింది చెలికత్తె. ఎంచితే శ్రీవారు చంద్రునివంటి వాడట. చంద్రుడితో పోల్చటం ఎందుకూ అంటే అందులో చాలా రమ్యత ఉంది కాబట్టి. చంద్రుడు ఎక్కడ నుండి కనిపిస్తాడూ అంటే మన చూడ దలచుకుంటే ఒకచోట అనేముందీ ఎక్కడ నుండి చూచినా ఆకాశం మీద చంద్రుడు నవ్వుతూ కనిపిస్తూనే ఉంటాడు. శ్రీవారు ఎక్కడ ఉన్నారూ అని అందోళన ఏమిటీ ఆయన అన్ని చోట్లా దర్శనం ఇస్తారు. అయన్ను కలసి ఉండాలని కోరుకొనే వారిదే మంచిగుణం. అటువంటి కోరిక కలవారికి లోపల అంతరంగంలోనూ బయట అన్నిచోట్లా కూడా అయనే సన్నిహితుడై ఉంటాడు. ఇదిగో చూడు ఇక్కడే ఉన్నాడు నీ వేంకటేశ్వరుడు. అయన నీ చెంతనే ఉన్నాడు చూడవమ్మా అంటోంది చెలికత్తె.
శ్రీవేంకటేశ్వరుడు మంచి చాకచక్యం కల తుమ్మెదలాగా ఆశ్రయించిన వారి కోరికలూ తీరుస్తున్నాడు తనను దూరం పెట్టాలని చూసే వారినీ వదలడు. ఇక్కడ చమత్కారంగా కొన్ని విశేషార్ధాలు తీయవచ్చును. తాలిమి గల వారలంటే తాపసులూ దేవతలూ అనీ కోపగత్తెలంటే దుష్టులూ రాక్షసులూ అనుకోవచ్చును - వారి కాయాలు సోకు అంటే వారిని పడగొడుతున్నాడని అర్ధం. అలాగే చంద్రునితో పోల్చినప్పుడు ఒక విశేషం. చంద్రుడు వెన్నెలరూపంలో ఓషధులకు అమృతం అందిస్తాడు కాబట్టి అమృతాంశువు అంటారు. శ్రీవేంకటేశ్వరుడు అమృతప్రాయమైన తన కరుణను జీవులందరికీ సమంగా అందిస్తున్నాడు. వేడుకతో తెలుసుకొన్న వారికి అంతరంగంలోనూ బయటా కూడా అయనే నిత్యం దర్శనం ఇస్తూ ఉంటాడు.
రీతిగౌళ వెఱవకువయ్య నిన్ను వేసరించను కఱకులాడఁగ నేను గబ్బిదాననా
మోము చూడఁగా నీకు మొక్కితి నింతే కాని కామించి యేపనులకు గాదు సుమ్మీ చేముంచి యాపె నీ చేయి పట్టు కుండఁగాను వేమరు నే నాసపడ వెఱ్ఱిదాననా
గక్కనఁ జేయి వేయఁగ కై దండ యిచ్చితిఁ గాని లెక్క సేయ నంత పనిలేదు సుమ్మీ మక్కళించి మక్కళించి మాట లాపె యాడఁగాను యిక్కడ నీసేవ సేయ నెడ్డదాననా
బడలి రాఁగా నీకు పాదము లొత్తితిఁ గాని యెడసినందుకు బంత మీయఁ జుమ్మీ అడరి శ్రీవేంకటేశ అట్టె నన్ను నేలితివి కొడిమె లింకా నెంచ గొల్లదాననా
ఇది అన్నమాచార్య సంకీర్తనల్లో పన్నెండవ సంపుటంలోని సంకీర్తన.
ఇక్కడ అమ్మవారు నాయిక. చిన్నపాటి ప్రణయకలహం ఇక్కడ సందర్బం. అమ్మవారు శ్రీవేంకటేశ్వరుని దెప్పటం ఈసంకీర్తనలో వర్ణించబడింది. శ్రీవారు దక్షిణనాయకుడు. అయన ఇద్దరుభార్యల ముద్దుల మగడని మనకు తెలిసిందే కదా. సవతుల కయ్యాలు జగత్ప్రసిధ్ధం. గంగాగౌరీ సంవాదం అని ఏకంగా ఒక పెద్దపాటే ఉంది గంటసేపు పాడవచ్చును. సవతులు తమలోతాము గొడవపడటంతో పాటుగా మగడినీ ఒకదులుపు దులుపుతూ ఉంటారు.
ఇది అటువంటి ఒక పాట. అమ్మవారు వెంకన్నను దులుపుతూ పాడినది.
ఓ వేంకటేశ్వరుడా ఏమీ వెఱవకు (అంటే భయపడకు). నిన్నేమీ నేను వేసరించనులే (వేసరించటం అంటే శ్రమపెట్టటం). నేనైమైనా గబ్బిదాన్నా (కొంటెదాన్నా అని భావం) నీమీద కొపగించుకొని కఱకుమాటలు (కఱుకు మాట అంటే కఠినమైన మాట అని అందరికీ తెలిసిందే) పలకటానికి? ఇదీ పల్లవి.
నువ్వు నాముఖం కేసి చూసావని మరియాదకు నీకు మొక్కానంతే. అంతే కాని నీవల్ల నాకేదో కావాలని ఆశించి మాత్రం కాదులే! చేముంచి (అంటే సాహసించి - నేనిక్కడే ఉన్నానన్న జంకూ గొంకూలేకుండానే) ఆమె నీచేయి పట్టుకొని ఉండగానే నీమీద ఇంకా వేయిరకాల ఆశలు పెట్టుకోవటానికి నేనేమైనా వెఱ్ఱిదాన్నా?
నువ్వు ఇలా చొరవగా గ్రక్కన (వెంటనే - నన్ను చూసి వెంటనే) మీద చేయి వేసావు. నేను చిరాకుపడి తప్పుకుంటే తూలిపోయేవాడివి. అలా చేస్తే నీవు తూలిపోతావని పోనీలే అని నాచేయి నీకు ఆసరా ఇచ్చానంతే. ఆమాత్రానేనికే ఏదో నేను ఉప్పొంగి పోయానని లెక్కలు వేసుకోకు సుమా!
ఆమే నీతో నాయెదురుగానే ఇలా నిన్ను ఉబ్బెస్తూ గోముగా మాట్లాడుతూ ఉంటే, ఇంకా ఇక్కడే ఉండి నీకు సేవలు చేయటానికి నేనేమైనా మంచీచెడ్డా తెలియని ఎడ్డిదాన్నా?
ఇంతవరకూ అమ్మవారు వేంకటేశ్వరుడి మీద కోపం అభినయించింది. అయన చేష్టలతో ఏదో అనునయించాడని ఆమె కరిగి చివరిపాదంలో ఇలా అంటోంది.
నువ్వు (తిరిగితిరిగి) బడలికతో వచ్చావని నీపాదాలు నొప్పులు పుడుతున్నాయని జాలిపడి ఆ పాదాలని ఒత్తానా లేదా? నన్ను ఎడబాసి ఎక్కడెక్కడో తిరిగినావనని పంతం పట్టుకొని కూర్చోలేదు కదా? నువ్వు కూడా ఎంతో ఉత్సాహంగా నన్ను చేరదీసుకున్నావు. ఇప్పుడు ఇంకా నీ కొడిమెలు (తప్పులు దోషాలు పాపాలు ఇలా) ఎంచటానికి నేనేమన్నా ముద్దరాలైన గొల్లపిల్లనా? ఇక్కడ సారస్యం ఏమిటంటే గోపకన్నెలు శ్రీకృష్ణస్వామి యెడల కడు స్వతంత్రులు - ఆయనతో నిత్యం కలిసి తిరుగుతూ ఉండే వారు - అయన కాని తమను విడచి కొంచెం ఏమారినట్లు తోచినా నిర్మొగమాటంగా అయనతో దెబ్బలాటకు దిగేవారు కూడా. వారికి అలాచేస్తే స్వామికి కోపం వచ్చి దూరం అవుతాడన్న ఊహ ఉండేది కాదు. చిన్నపిల్లలు. తాను ప్రౌఢ. స్వామికి అలా అసందర్భపు మాటలు పలికి కోపం తెప్పించటానికి తానేమీ పద్దతి తెలీని గొల్లపిల్లను కాను అంటోంది.
తానె బుధ్ధెరిఁగితే తప్పు లేల వచ్చీని మానక యేలిక లెస్స మన్నించుఁ గాక మేనిలోఁ బాపము లేక మించిన భయ మేటికి ఆనుకొని రక్షించ శ్రీహరి యుండఁగాను
చేరి తానె కొలిచితే జీత మేల తప్పీని ధారకుఁడై దొరయే చేపట్టుఁ గాక మారుముద్ర గాని మంచిమాడకు వట్టము లేల తారుకాణగా హరి తానె రక్షించుఁ గాక
చనవె కలిగితేను సలి గేల తప్పీని తన చెప్పినట్లు రాజు తాఁ జేసుఁ గాక పనివడి రాచవారి పసులకు బందె యేది నను శ్రీవెంకట నాథుఁడు రక్షించఁగా
(సంపుటం 10 - కీర్తన 25)
ఇది శ్రీతిరువెంగళనాథ దేవునికి తాళ్ళపాక అన్నమాచార్యుల కొమారుఁడు పెదతిరుమలాచార్యులు, పెదతిరుమలాచార్యుల కొమారుఁడు చినతిరుమలాచార్యుడు విన్నపం చేసిన ఆధ్యాత్మసంకీర్తన.
ఈరోజుల్లో జనసామాన్యం తాళ్ళపాక కవుల సంకీర్తన లన్నీ అన్నమయ్య సాహిత్యంగా వాడుక చేస్తున్నారు!
అందమైన ఈకీర్తన భావం చూదాం.
పల్లవిలో అనవసరంగా ఎందుకు విచారపడుతూ ఉండటం తనకి? ఎందుకు అనవసరంగా మనస్సులో దిగులు పడుతూ ఉండటం తాను స్వల్పవిషయాలకు?. నన్ను రక్షించటానికి స్థిరమైన సంకల్పంతో దేవుడు లేడా? అని ప్రశ్న వేస్తున్నారు.
అలా ఎందుకు తాను ప్రశ్న చేసారన్నది కూడా చాలా చక్కగా సమర్ధింపులతో వివరిస్తున్నారు చూడండి.
తనకే తగినంత మంచి బుధ్ది కుశలత ఉంటే తప్పులెందుకు దొర్లుతాయి? తన యజమాని తప్పకుండా తనని చక్కగా మన్ననగా చూస్తాడు కాని? అలాగే మనం ఈశరీరంతో ఏతప్పూ చేయకపోతే పాపం ఉండదు కదా, పాపమే లేనప్పుడు భయం మాత్రం ఎందుకు ఉంటుంది? మనని అంటిపెట్టుకొని ఉండి రక్షించటానికి అప్పుడు మనకు శ్రీహరి ఉంటాడు కదా అంటున్నారు. శరీరంలో తప్పులేకపోవటం అంటే మనోవాక్కాయకర్మలా శుధ్దంగా ఉండటం. అలా ఉంటే పాపమూ ఉండదు ఇంక భయమూ ఉండదు. మనకు రక్షణ కూడా ఉంటుంది హరి ద్వారా. అంటే ఇక్కడ తానుత్రికరణ శుధ్ధి కలవాడను కాబట్టి పాపం అంటని వాడననీ తనకు ఏభయమూ లేదనీ హరి తనని రక్షించటానికి ఉన్నాడనీ అంటున్నారు. అందుచేత తనకి ఏవిచారమూ ఏచింతా లేదట.
మనం సరిగా పనిచేస్తే జీతం ఎందుకు తగ్గుతుంది? పని చేయ నప్పుడే కదా యజమాని జీతం విరుగగోసుకొని మరీ ఇచ్చేది! ధారకుడు అంటే తిండిపెట్టేవాడు. మనం సరిగ్గా చెప్పినపనులు చేస్తూ ఉంటే మన యజమానే మన మంచిచెడ్డలు చూసి తిండికీ గుడ్డకూ లోపం రాకుండా యేలుకుంటాడు. లేదా పస్తులే. చెల్లని నాణానికి మారకంగా ఏదీ కొనుగోలు చేయలేం కాని మంచినాణానికి దుకాణంలో తిండి దొరుకుతుంది కదా! అంటే ఇక్కడ, తాను సరిగా ప్రభువు (శ్రీవేంకటేశ్వరుడు) చెప్పిన పనులు చక్కగా చేసే వాడినే కాని డాబుకొట్టే చెల్లని నాణెం వంటి వాడను కాననీ, ఆ ప్రభువే తనని రక్షించుతూ తిండితిప్పలకు లోపం రాకుండా చూసుకుంటూ ఉంటాడనీ అంటున్నారు. అందుచేత తనకి ఏవిచారమూ ఏచింతా లేదట.
తనకు మంచి చనువే ఉంటే రాజుగారి దగ్గర ఆశ్రయానికి లోపం ఎందుకు వస్తుంది? తాను చెప్పినట్లుగా రాజే తప్పకుండా చేస్తాడు మైత్రిని పాటించి. అంతే కదా. ఊళ్ళో వాళ్ళ పశువులు దారితప్పి ఇతరుల చేలలో పొరపాటున మేస్తే వాటిని బందెల దొడ్లో పెడతారు అధికారులు. కాని ఆ పశువులు కాని రాచవాళ్ళవి ఐనప్పుడు అంత సాహసం చేస్తారా అదే అధికారులు? అంత సాహసమా వాళ్ళకి? అంటే ఇక్కడ తాను ప్రభువైన శ్రీవేంకటేశ్వరుడి సొత్తును అనీ తనకు కల ఈగుర్తింపు ఆధారంగా తనని ఎవ్వరూ ఏమీ చేయలేరనీ అంటున్నారు! అధికారులు సామాన్యులను సాధించదలచుకుంటే అది సులువే కావచ్చు కాని రాజాశ్రయం కలవారిని సాధించాలంటే వశమా! రాజే తన మాట విని అడిగింది చేస్తాడు కదా, అటువంటప్పుడు తన జోలికి అధికారులు రాలేరు కదా అని అంటున్నారు.
ఈ కీర్తనలో కొన్ని విశేషాలు చూదాం. మారుముద్ర అన్న మాటను బట్టి దొంగనాణాల బెడద అప్పట్లో కూడా ఉండేది అన్నమాట విశదం అవుతోంది. అధికారులు సామాన్యులను వేధిస్తూ రాజాశ్రయం కలవారి పట్ల భయభక్తులతో ఉండటం అనే లోకరీతి విదితం అవుతోంది. బుధ్ధి ఉన్నవాళ్ళు తప్పులు చేయరనీ పాపమే భయహేతువు అనీ నిష్కర్ష చేయటమూ ఇందులో చూస్తున్నాం.
అన్నమయ్య చెప్పిన పెండ్లిపాట ఇది. లక్ష్మీవిభుని పెండ్లికి అన్నమయ్య చెప్పిన పాట. ఈ కీర్తన శృంగారసంకీర్తనాల్లోనిది. కాని నిజానికి ఇది ఒక అధ్యాత్మికసంకీర్తనం ఇది 22వ సంపుటంలో 1216వ రేకు పైన ఉన్న సంకీర్తన. ఈ అన్నమాచార్యుల సంకీర్తనకు మంగళకౌసిక రాగం అని ఇచ్చారు. ఈరాగం ప్రచారంలో లేదు. బాలకృష్ణప్రసాద్ గారు దీనిని రామక్రియా రాగంలో పాడారు.
ఈ పాట పల్లవిలో అడరోపాడరో అప్సరోగణము అన్నారు. ఈ అప్సరసలను గురించి నాటకాలా సినీమాల పుణ్యమా అని సమాజంలో తక్కువస్థాయి అభిప్రాయం కనిపిస్తుంది. అది పొరపాటు. దేవతలు దివ్యదేహులు. మనవంటి పాంచబౌతికమైన దేహాలూ అభిరుచులూ ఉన్నవారు కారు. అప్సరసలు అందరూ విశ్వచైతన్యానికి వివిధరకములైన ప్రతీకలు.
పురూరవుడి కథ అని ఒకటుంది. ఆయన ఊర్వశిని కాంక్షిస్తాడు. సరే కొంత కథ నడుస్తుంది. ఆవిడ వెళ్ళిపోతే మరలా రమ్మని కోరుతాడు. అదొక కథ. ఆమె వస్తుంది.ఆ ఊర్వశీపురూరవులు ఒక కొండమీద విహరిస్తుండగా ఆమె అంటుంది "రాజా, ఇక్కడ ప్రహ్లాదుణ్ణి అనుగ్రహించిన నరసింహస్వామి వారు వెలసి ఉన్నారు. మరుగై ఉన్నారు. వెదుకుదాం పద" అని అలా చెప్పి ఆరాజు చేత నరసింసస్వామిని అన్వేషింప జేసి ఆఅ సింహాచలం అప్పన్నను నరలోకానికి అందిస్తుంది. పురూరవుణ్ణి తరింప జేస్తుంది. ఆయన భౌతికవ్యామోహాలను వదలలేక పోతుంటే ఆయనకు బ్రహ్మవిద్యను ఉపదేశిస్తుంది. ఇదిగో అప్సరసలు ఇలాంటి వారు.
ఇటువంటి అచ్చరో గణం అంతా దేవుడి పెళ్ళికి వచ్చారట. మీరంతా దేవుడి కోసం ఆడండి ఆయన కీర్తిని పాడండి అన్నమయ్య పురికొల్పుతున్నారు.
దేవుడి పెళ్ళికి అందరూ పెద్దలే. ఎందరెందరో మహానుభావులు. నరలోకంలోని శ్రీవైష్ణవులు. స్వర్గం నుండి దేవతానీకం ఇతరలోకాలనుండి మహాత్ములు ఎందరెందరో కుతూహలంతో ఉత్సాహంగా వచ్చారు. అందరికీ ఈ వైభవం జరుగుతున్న సమయంలో తాంబూలాలనిచ్చి ఆహ్వానించండీ అని అన్నమయ్య చెప్తున్నారు. ఎవరికీ? అప్సరసలకే లెండి. వారంతా అక్కడ పేరంట్రాండ్రు. పెళ్ళిపెద్దలు.
ఇక్కడ అన్నమయ్య చెప్పిన పెండ్లి హడావుడి విశేషాలు చూదాం.
అన్నమయ్య ఏ దైవతాన్ని ఉద్దేశించి సంకీర్తనం చేసినా ఆ దైవతం తరుమలకు రావలసిందే, వేంకటేశముద్ర వేయించుకోవలసిందేను.
ఇక్కడ పెండ్లి ఎవరిదయ్యా అంటే ఆ విషయం చివరి చరణంలో చెప్తున్నారు శ్రీవేంకటపతికి శ్రీసతికి పెండ్లి అని. మొదటి చరణంలో ఆయన్ను కమలారమణుడు అంటున్నారు.
ఆయన అప్పటికే కమల అంటే లక్ష్మీదేవికి భర్త అని చెప్పనే చెప్తున్నారు కదా మరలా చివరన శ్రీవేంకటపతికి శ్రీసతికి పెండ్లి అంటారేం, ఎన్నిసార్లు చేస్తారూ పెండ్లి అని అడగకండి.
భగవంతుడి కళ్యాళం లోకకళ్యాణం. అందుకే గుళ్ళల్లో దేవుడి పెళ్ళి చేసినప్పుడు మాంగల్యాధారణం మంత్రంలో చిన్న మార్పుతో చెప్తారు గమనించండి. సాధారణంగా ఆమంత్రంలో వరుడి చేత మమజీవన హేతునా అని చెప్పిస్తారు. వరుడి జీవనానికి అప్పటి నుండి ఈ వస్తున్న భార్యయే అధారహేతువు అని అ వరుడే స్వయంగా చెప్పుకుంటున్నాడన్న మాట. కాని దేవుడి పెళ్ళిలో ఆ ముక్కని మార్చి లోకరక్షణ హేతునా అని చెప్పిస్తారు.
అంటే ఏమన్న మాట?
దేవుడి పెళ్ళి లోకరక్షణార్ధం. అది లోకకళ్యాణహేతువు.
అందుచేత భక్తులు గుళ్ళల్లో యథాశక్తి లోకసంగ్రహార్ధం దైవకళ్యాణం జరిపించి పుణ్యం మూటకట్టుకుంటారు.
గుళ్ళల్లో అనే ఏముంది, శక్తి ఉంటే సందర్భం కుదిరితే ఇళ్ళదగ్గరా దైవకళ్యాణమహోత్సవం జరిపించవచ్చు.
చేయించిన వారికి పుణ్యం.
దర్శించిన వారిదీ పుణ్యం.
ఇలా దైవకళ్యాణం భక్తిగా చేయటం అనేది వేదోక్తమే, ఆగమోక్తమే.
అటువంటి లోకకళ్యాణార్ధం జరుగుతున్న వేంకటేశ్వర స్వరూపుడైన శ్రీమహావిష్ణువునకూ పద్మావతీ అమ్మవారి రూపంలో ఉన్న శ్రీలక్ష్మీ అమ్మవారికీ జరుగుతున్న కళ్యాణం యొక్క వైభవాన్ని అన్నమయ్య కీర్తిస్తున్నాడు.
కమలారమణుని కళ్యాణము, లక్ష్మీవిభుని పెండ్లి అని మరలా శ్రీవేంకటపతికి శ్రీసతికి అనీ పదేపదే చెప్పటంకేవలం భక్త్యావేశాన్ని సూచించటం.భక్తిసాహిత్యంలో అందుకే పునరుక్తి దోషం లేదు. కళ్ళకు కట్టినట్లు చెప్పటంలో ఆ సంతోషాన్ని వ్యక్తం చేయటానికి అదే సంగతిని వివిధాలుగా చెప్పటం అన్నది సహజం. అది బాగుంటుంది కూడా.
అ వేంకటేశ్వర ప్రభువు కళ్యాణంలో గరుడధ్వజం ఎత్తారు అని చెప్పారు. అ సందర్భంలో సర్వం ప్రతిధ్వనించేలా దేవదుందుభులు మ్రోగాయట. ఈదేవదుందుభులు అనటంలో ఒక విశేషం ఉంది. మన వద్ద ఉన్న దుందుభులు ఐతే ఎవరో పని కట్టుకొని వాయించాలి. వాటంతట అవి ఎందుకు మ్రోగుతాయీ - మ్రోగవు కదా. అందుకే ఇవి దేవదుందుభులు అనటం. ఒక మహావిశేషం జరుగుతున్నప్పుడు ఆ దేవలోకపు దుందుభులు వాటంతట అవే బ్రహ్మాండమైన శబ్దాలతో మ్రోగుతాయి. అలా ఇప్పుడు మ్రోగుతున్నాయి. జరుగుతున్నది దేవుడి పెళ్ళి ఐతే మ్రోగవా మరి?
ఓ దేవతలారా, మీలోకంలో ఉన్న దుందుభులు విశ్వం మారుమ్రోగేలా ఉరుముతున్నాయి వింటున్నారా గమనిస్తున్నారా దేవుడి పెళ్ళి వేదుకనూ అని అన్నమయ్య హెచ్చరిస్తున్నారు.
పూర్వం జరాసంధుడి దుర్గం మీద రెండు అద్భుతమైన దుందుభులు ఉండేవి. ఎవరైనా శత్రుభావంలో కోటలోనికి వస్తున్నట్లైతే అవి రెండూ వాటంతట అవే భీకరంగా మ్రోగేవి. రెండు ఉండటంలో ఒక గడుసుతనం ఉంది. మీరు ఒకదాన్ని పగలకొట్టగానే ఎలాగో అలా ఆ రెండోది ఈలోగా అల్లరి చేస్తుంది. రెండూ ఒకసారి పదకవేస్తే తప్ప నగరంలోనికి హెచ్చరిక వెళ్ళకుండా అపలేం కదా. అందుకని శత్రువులకు కోటలో దూరటం దుస్సాధ్యంగా ఉండేది.
ఐతే శ్రీకృష్ణపరమాత్మ దీనికి విరుగుడు చేసాడు. ఆయన సూచన మేరకు భీముడు ఆ రెండు దుందుభుల మీదకీ ఒక్కసారిగా దూకాడు. అవి రెండూపచ్చడి అయ్యాయి ఒకేసారి. జరాసంధుడికి శత్రువుల రాక తెలియ లేదు.
మానవలోకం లోనే రెండు వాటంతట అవే మ్రోగే దుందుభులు అంటూ ఉన్నాయి కదా, ఏదో విశేషంగా ఐనా, మరి దేవలోకంలో వాటంతట అవి మోగవా ఏమి?
అదిగో మ్రోగుతున్నాయి మీ దుందుభులు గమనించారా? దేవుడి పెళ్ళి అని అన్నమయ్య హెచ్చరించాడన్న మాట.
పెళ్ళిలో అంకురార్పణం అని చేస్తారు. లోకవ్యవహారంలో అంకురార్పణం అంటాం కాని అసలైన పేరు అంకురారోపణం. పెండ్లి కుమార్తె చేత పాలికలలో నవధాన్యాలను మొలకలుగా నాటిస్తారు. ఇలా అంకురములను (విత్తనాలను) పాలికలలో ఆరోపించటం (నాటటం) కాబట్టి ఇది అంకురారోపణం. జనం నోటిలో ఈమాట క్రమంగా అంకురార్పణం అయింది. ఇదీ బాగానే అర్ధవంతంగానే ఉంది. అంకురములను ప్రకృతికి (మొక్కలుగా ఎదిగెందుకు) అర్పించటం కాబట్టి అంకురార్పణం అన్నది సబబైన మాటయే అవుతున్నది.
అంకురాలను మొలవేయటం ఎందుకూ అంటే ప్రాణులకు ఆధారం అన్నం. దీనిని ఉపనిషత్తుల భాషలో రయి అని కూడా అంటారు. ఇప్పుడు ఇద్దరు, కాని మున్ముందు వీరు వంశాభివృధ్ధి చేస్తారు. అందరికీ అన్నం కావాలి. అన్నానికి మూలమైన అంకురాలను ప్రకృతికి అర్పించి పూజించటం అన్నది ఇక్కడ ఆచారంలోని అంతరార్ధం.
అదిగో అంకురార్పణ మహోత్సవం జరుగుతోంది. అందరికీ గంధపుష్పాక్షతలను
ఇస్తున్నారు. విష్ణుభక్తులు అందరూ అందుకోండి అని అన్నమయ్య దైవకళ్యాణానికి
ఇచ్చేసిన భక్తవైష్ణవులను ఆహ్వానిస్తున్నాడు.
పెళ్ళిలో తలంబ్రాల తంతు వచ్చింది.
అసలు సిసలు తంతు ఐన జీలకర్రా బెల్లం కార్యక్రమానికీ, అతి ముఖ్యమైన తంతు ఐన మాంగళ్యధారణకీ కన్నా ఈ తలంబ్రాలకి విశేషమైన స్పందన ఉంటుంది. వధూవరుల నుండీ, ఆహూతుల నుండీ కూడా. మిగతావి వైదికమైన కార్యక్రమాల్లో భాగం మాత్రమే ఐనా తలంబ్రాలు మాత్రం గొప్పవినోదం. అందరికీ కూడా.
ఈవినోదం దర్శించటానికి భక్తులు తహతహ లాడుతున్నారు. నడిచీ పరుషలు నానా ముఖముల అంటే అన్ని దిక్కులనుండీ భక్తసమూహాలు కదలి వస్తున్నారని మనకి చెప్తున్నారు.
చూసారు కదా ఓనరులారా, భక్తులారా, ఇంక ముడుపులు సమర్పించుకోండయ్యా అంటున్నారు అన్నమయ్య గారు. ఇక్కడ ఆచార్యుల వారి ముయిగా అన్నారు. ఈపదం ఇప్పుడు వాడుకలో లేదు కాబట్టి అర్ధం స్పష్టత లేదు. వేరొక కీర్తనలో ముట్టినదెల్లా ముయి పట్టినదెల్లా బంగారు అంటారు. మరొక కీర్తనలో ముట్టితేనే ముయిముచ్చటలూ అంటారు. దీనిని బట్టి ముయిగా అంటే చక్కగా వంటి అర్ధం తీసుకోవాలి అనిపిస్తున్నది.
ఈ కీర్తనకు అర్ధం చెప్పమని శారదావిభావరి బ్లాగులో ఎవరో అడిగారు.
నేనొక ప్రయత్నం చేస్తే బాగుంటుందని అనిపించింది.
అందరికీ తెలిసిందే గోపాలబాలు డంటే ఎవరో! గోకులంలో పెరిగిన కొంటె కృష్ణయ్య అని. ఐతే తాత్త్వికులు మరొక రకంగా కూడా అర్ధం చెబుతారను కోండి.
గోవు అంటే ఆవు అని మనకు తెలిసిందే. కాని సంస్కృతంలో ఒక శబ్దానికి తరచుగా అనేకమైన అర్ధాలుంటాయి. గోః అన్న శబ్దానికి ఉన్న అర్ధాల్లో భూమి స్వర్గము వంటివి ఎన్నో ఉన్నాయి. అంద్చేత గోపాలు డంటే ఎంతో అర్ధ విస్తృతి ఉన్నదన్న మాట గ్రహించాలి మనం. ఐనా రూఢార్ధం చేత గోపాలబాలు డంటే మన గొల్లపిల్లవాడు కిట్టప్పే అనుకుందాం.
భావయామి అన్న పదబంధానికి అర్ధం. తలచుకుంటూన్నాను అని.
మనస్సేవితం అంటే తన మనస్సు నిత్యం సేవించుతూ ఉండే వాడు అయిన గోపాలబాలుణ్ణి అంటే గోపాలబాలుడైన శ్రీకృష్ణుని మనసారా తలచుకుంటూన్నాను అని తాత్పర్యం.
అటువంటి గోపాలబాలుడి పాదాలను గురించి సదా తత్పదం చింతయేయం అంటున్నారు. ఇక్కడ కొంచెం సరిగా అన్వయం కావటం లేదు. చింతయేహం అని ఉండాలి. ఆ పాదాలను ఎల్లప్పుడూ నేను చింతిస్తూ ఉంటున్నాను అని దీని అర్ధం.
ఆ గోపాల బాలకుడు ఎటువంటి వాడూ అంటే చూడండి ఏమని చెబుతున్నారో
మొదటి చరణం
కటిఘటితమేఖలాఖచితమణిఘంటికా
పటలనినదేన విభ్రాజమానం
కుటిలపదఘటితసంకులశింజితే నతం
చటులనటనాసముజ్జ్వలవిలాసం
ఈ చరణంలోని శింజితే నతం అన్నది అంత అర్ధవంతంగా తోచదు. శింజితేన త్వం అంటే అర్ధవంతంగా తోస్తున్నది.
సమాసక్రమంలో వ్రాస్తే ఇలా ఉంటుంది.
కటిఘటితమేఖలాఖచితమణిఘంటికాపటలనినదేన విభ్రాజమానం
కుటిలపదఘటితసంకులశింజితేన చటులనటనాసముజ్జ్వలవిలాసం
త్వమ్
మేఖల అంటే మొలత్రాడు. కటి అంటే మొల. ఘటితం అంటే కట్టబడింది అని. ఇప్పుడు కటిఘటితమేఖల అంటే మొలకు కట్టబడిన మొలత్రాడు అని అర్ధం.
మామూలు మొలత్రాడు అని అనుకుంటూన్నారా. బంగారు మొలత్రాడు లెండి.. మీకు గుర్తు లేదా మన అందమైన తెలుగుపద్యం
చేత వెన్నముద్ద చెంగల్వ పూదండ
బంగరు మొలత్రాడు పట్టు ధట్టి
సందె తాయెతులును సరిమువ్వ గజ్జలు
చిన్ని కృష్ణ నిన్ను చేరికొలతు.
అన్నట్లు ఈ పద్యాన్ని నానా భ్రష్ణుగానూ ముద్రించటం చూసాను. బంగారు మొలత్రాడు అని కాదురా బాబూ అంటే వినే వాళ్ళెవ్వరు. బంగారు మొలత్రాడు కాకపోవటం ఏమిటీ అని అలుగుతారు. ఏంచేస్తాం పద్యంలో ఛందస్సు కోసం బంగరు అని వ్రాస్తే చాలు అంటే ఎవరికీ ఎక్కటం లేదు.
సరే మన పాటలోనికి వద్దాం. ఈ కటిఘటితమేఖల అంటే గోపాలబాలుడి బంగారు మొలత్రాడు అన్న మాట. అది వట్టి బంగారపు పోచలు నాలుగు మెలికలు వేసి చేసిన సాదాసీదా మొలత్రాడు అనుకుంటున్నారా ఏమిటీ కొంపదీసి. అందుకే ఆచార్యుల వారింకా దాని సొగసు గురించి చెబుతున్నారు.
ఆ మొలత్రాడు మణిఘంటికాపటలఖచితం అంట. అంటే ఏమన్న మాట? దానికి మణులు పొదిగిన బంగారు గంటలున్నాయని తాత్పర్యం. ఏమయ్యా మణిఘంటికా అన్నారు కాబట్టి మణుల్నే గంటలుగా చెక్కి తగిలించారూ అనాలి కదా అని ఎవరికన్నా సందేహం వస్తుందేమో తెలియదు. మణుల్ని గంటలుగా చెక్కితే అవి మోగుతాయా ఏమన్నానా?
అచార్యులవారి సందేహ నివృత్తి చూడండి ఘంటికాపటలనినదేన అంటూ ఆ గంటలు మ్రోగుతున్నాయీ అని చెప్పారు. అందుచేత అవి మణిమాణిక్యాలు పొదిగిన బంగారు గంటలు. అలాంటి గంతలు బోలెడు ఆ మొలత్రాటికి తగిలించారు.
ఇంకేం. అవి ఆయనగారు హుషారుగా గంతులు వేస్తుంటే ఘల్లు ఘల్లుమని మ్రోగుతున్నాయి.
విభ్రాజమానం అంటే ఏమిటో తెలుసునా మీకు? బ్రహ్మాండంగా అందగించటం అని. ఒక్కసారి మన బాలకృష్ణ మూర్తిని మనస్సులో ఊహించుకోండి. బాగా తలచుకోండి మరి.
ఆయన హుషారుగా గంతులు వేస్తుంటే ఆ పిల్లవాడి మొలకు చుట్టిన బంగారపు మొలత్రాడూ దానికి బోలెడు గంటలూ - అ గంటలనిండా రకరకాల మణిమాణిక్యాల సొబగులూ. ఇవన్నీ కలిపి చమక్కు చమక్కు మని మెరుస్తూ ఎర్రటి ఎండనూ పట్టించుకోకుండా ఎగురుతూ ఉన్న గొల్లపిల్లవాడి ఒంటి మీదనుండి వస్తున్న ఆ మెరుపుల శోభను మీరంతా ఒక్కసారి మనసారా భావించండి.
పదేపదే భావించండి కటిఘటితమేఖలాఖచితమణిఘంటికాపటలనినదేన విభ్రాజమానం ఐన గోపాలబాలుడి దివ్యమూర్తిని.
ఇక్కడ ఈచరణంలో ఉన్న రెండవభావన కుటిలపదఘటితసంకులశింజితే నతం చటులనటనాసముజ్జ్వలవిలాసం అన్నది చూదాం.
శింజితం అంటే అలంకారాలు గణగణమని చేసే ద్వని. ఈ గణగణలకు కారణం గోపాలబాలుడి కుటిలపదఘటనం. అంటే ఆ గోపబాలుడు అడ్డదిడ్డంగా అడుగులు వేస్తూ గంతులు వేయటం అన్న మాట. ఆ బాలుడి అలా చిందులు వేస్తుంటే ఆయన ఒంటి మీద ఉన్న ఆభరణాలు అన్నీ కదలాడుతూ ఉన్నాయి. అసలు మొలత్రాడే చాలు, అదిచేసే చప్పుడే చాలు. ఐనా ఇతరమైన ఆభరణాలూ ఉన్నాయి మొడనిండానూ చేతులకూను. అవన్నీ కూడా మేమేం తక్కువ తిన్నామా అన్నట్లుగా గణగణలాడుతూ ఉన్నాయట. ఇవన్నీ సంకులంగా మోగుతున్నాయంటే అంటే ఒకటే గొడవ అన్న మాట. అవేం వాయిద్యగోష్ఠి చేస్తున్నాయా ఒక పద్ధతిలో గణగణలాడటానికి. దేని గోల దానిదే అన్నట్లు ఒకదానితో ఒకటి పోటీ పడి మరీ హడావుడిగా మ్రోగుతున్నాయట.
చటులనటనాసముజ్జ్వలవిలాసం అంటే ఇప్పటికే చెప్పినట్లే కదా. చటులం అంటే కదలటం వట్టి కదలటమా. పిల్లలు ఊరికే కదులుతారా ఎక్కడన్నా. గోపాలబాలుడి గంతులే గందులు అన్నమాట. అదంతా ఒక నటనం అనగా నాట్యవిలాసంలా ఉన్నదని చెప్పటం. ఈ చటులనటనం అంతా ఒక సముజ్వలవిలాసం అటున్నారు అన్నమయ్య. సముజ్వలం అంటే ఎంతో మనోరంజకంగా ఉండి ప్రకాశిస్తున్నది. అదంతా బాలగోపాలుడి విలాసం. నటనావిలాసం అన్నమాట.
ఇంకా ఈచరణంలో మధ్యలో ఉన్న నతం అన్నదానిని అన్వయించుకోవాలి. ఈ పదం అంత సరిగ్గా అతకటం లేదు. శింజితేన త్వం అని పాదాన్ని సవరించుకోకుండా అర్ధం కుదరటం లేదు. శింజితతేన అంటే శింజితం వలన అన్నది ఇప్పటికే అన్వయించుకున్నాం. ఇక త్వం అన్నది ఎలా చెప్పుకోవాలీ అంటే ఆ పదాన్ని సమాసం చివరకు తెచ్చుకోవాలి. అప్పుడు త్వం గోపాలబాలం భావయామి అని పల్లవితో కలిపి అన్వయించుకోవాలి. అన్నట్లు త్వం అంటే నిన్ను అని అర్ధం.
ఇంక రెండవ చరణం చూదాం.
నిరతకరకలితనవనీతం బ్రహ్మాది
సురనికరభావనాశోభితపదం
తిరువేంకటాచలస్థిత మనుపమం హరిం
పరమ పురుషం గోపాలబాలం
ఈ చరణంలో ఉన్న భావనలు
నిరతకరకలితనవనీతం
బ్రహ్మాదిసురనికరభావనాశోభితపదం
తిరువేంకటాచలస్థితమ్
అనుపమమ్
హరిమ్
పరమపురుషమ్
గోపాలబాలమ్
నవనీతం అంటే వెన్న. అప్పుడే చల్ల చిలికి తీసిన వెన్న. అదెప్పుడూ మనవాడి చేతినిండా ఉంటుంది కదా. అదే చెప్తున్నారు. కరకలితం అంటే చేతిలో ఉన్నది అని. నిరతం అంటే ఎల్లప్పుడూ అని. అందుచేత నిరతకరకలితం అంటే పొద్దస్తమానూ చేతిలో ఉన్నది అని ఉన్నమాట సెలవిస్తున్నారు.
అదే లెండి మన తెలుగుపద్యంలో చేత వెన్నముద్ద అని చెప్పారే, అదే భావన ఇక్కడ.
నికరం అంటే గుంపు. ఎవరి గుంపు అనుకున్నారు బ్రహ్మాది సురల గుంపు. అందుకే బ్రహ్మాది సుర నికరం అని సెలవిచ్చింది. వీళ్ళందరూ ఆ బాలకృష్ణుడి చిట్టి పాదాలను ఎంతో అందంగా తమతమ హృదయాల్లో చింతిస్తున్నారట.
తిరువేంగడం అని తిరుపతికి ప్రాచీన నామాల్లో ఒకటి. ఈ తిరు అన్నమాట తమిళపదం. శ్రీ అన్న సంస్కృతపదానికి సమానార్ధకం. దానికి వైష్ణవసంప్రదాయంలో సమాంతరంగా వాడుకలో ఉన్నపదం. తిరుపతి కొండకే వేంకటాచలం అని పేరు. తరిగొండ వేంగమాంబగారు వేంకటాచల మాహాత్మ్యం అని ఒక గ్రంథం వ్రాసారని అందరికీ తెలిసినదే. దానిలోనిదే మనం చెప్పుకొనే వేంకటేశ్వరస్వామి గాథ. ఆ వేంకటాచలం పైన శ్రీవేంకటేశ్వరుడిగా బాలకృష్ణుడే స్థిరంగా ఉన్నాడట. ఈ దేవుడు ఆదేవుడు అని లేదు. అన్నమయ్య ఏదేవుడి గురించి ఒక కీర్తన చెప్పినా సరే సదరు దేవుడు తిరువేంకటాచలం రావలసినదే వేంకటేశ ముద్ర వేసుకోవలసినదే. తప్పదు.
అనుపముడు అని అని బాలకృష్ణుడి గురించి ఒక ముక్క కూడా చెప్తున్నారు. అవును మరి ఆయనతో పోల్చి చెప్పదగిన పిల్లవాడు అంతకు ముందున్నాడా ఆయన తరువాత ఉన్నాడా చెప్పండి? అందుకే అమ్మలందరూ ముద్దుముధ్దుగా తమ పిల్లలకి చిన్నికృష్ణుడి వేషం వేసి మురిసిపోయేది.
ఆయనను హరి అని చెబుతున్నారు. తెలిసిందేగా శ్రీహరియే కృష్ణుడు. కృష్ణస్తు భగవాన్ స్వయం అని ప్రమాణ వాక్యం. ఆయన అవతారమే కాదు స్వయానా విష్ణువే అని దాని అర్ధం. వామనావతారం పూర్ణావతారమే కాని కేవలం ఒక ప్రయోజనం కోసం వచ్చినది. పరశురామావతారం ఆవేశావతారం. రామావతారం అంశావతారం. ఇక కృష్ణావతారం అనటం పైననే భిన్నాభిప్రాయాలున్నాయి. దశావతారాల్లో బలరాముణ్ణి చెపుతున్నారు కాని కృష్ణుణ్ణి కాదు. చూడండి
మత్సః కూర్మో వరాహశ్చ నారసింహశ్చ వామనః
రామో రామ రామశ్చ బుధః కల్కి రేవచ
ముగ్గురు రాముళ్ళట. పరశురామ, శ్రీరామ బలరాములు. కృష్ణుడు పట్టికలో లేడు. ఎందుకంటే ఆయన స్వయంగా విష్ణువే కాని అంశావతారం కాదు కనుక.
విష్ణువే పరమపురుషుడు. అసలు మీరు మీరాబాయి నడిగితే కృష్ణు డొక్కడే పురుషుడి. తతిమ్మా విశ్వంలోని జీవులందరూ స్త్రీలే అని సిధ్ధాంగ చెబుతుంది. గీతలో ఆ శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా అహం బీజప్రదః పితా అని చెప్పుకున్నాడు కదా. ఇంకా సందేహం ఏమిటీ మీకు?
ఇదిగో ఆ పరమపురుషుడే నేటి గోపాలబాలుడు.
అటువంటి గోపాల బాలుణ్ణి మనసారా భావిస్తున్నాను అని అన్నమయ్య పాడుతున్నాడు.
ఈ గీతానికి ఒక ఆటవెలది పద్యరూపం లాంటిదే పైన మనం చెప్పుకున్న చేత వెన్నముద్ద పద్యం.
ఇది అన్నమాచార్యుల వారు నరసింహస్వామిపైన చెప్పిన సంకీర్తనం.
అన్నమయ్య శ్రీవేంకటేశ్వర స్వామి వారి పైన అనేక వేల సంకీర్తనలు విరచించారు. అలాగే భగాంతుడి ఇతర అవతార మూర్తుల గురించి కూడా సంకీర్తనలు చెప్పారు. వాటిలో అధికభాగం నరసింహ స్వామి పైన చెప్పినవే.
అహోబిలం సుప్రసిధ్ధ నారసింహ క్షేత్రం. అక్కడ ఉన్న పీఠానికి తొలి అధిపతి ఐన శఠకోప యతి అన్నమయ్యకు వేదాంత గురువు. అంతే కాదు శఠకోప యతి వద్ద అన్నమయ్య నరసింహ మంత్రాన్ని ఉపదేశం పొందారు.
ఆ నరసింహ మంత్రం 32 బీజాక్షరాలు కలది. బహుశః అందుకే అన్నమాచార్యులు శ్రీవేంకటేశుడి పైన ముప్పది రెండు వేల సంకీర్తనలను వెలువరించారు.
ఈ సంకీర్తనలో అహోబిలం లక్ష్మీనరసింహస్వామి వారి వైభవం వర్ణిస్తున్నారు అన్నమయ్య.
అంటూ విందు ఆరగించి దర్జాగా కూర్చున్న నరసింహ స్వామి వారిని స్తుతిస్తున్నారు.
ఈపాట పల్లవిని లక్ష్మీనారసింహుడు అని ముగించినట్లే ఆచార్యుల వారు పాటలోని మూడు చరణాలను కూడా అదేవిధంగా లక్ష్మీనారసింహుడు అనే ముగించారు. విశేషం ఏమిటంటే పరిష్కర్తలు సరిచేసిన విధంగా లక్ష్మీనారసింహుడు అని మనకు కనిపిస్తున్నది కాని నిజానికి రాగిరేకు మీద ఈపాటలో అంతటా లక్ష్మీనారసింహ్వుడు అనే ఉన్నది.
మీకు తెలుగు భాష పైనా దాని నుడికారం పైనా మంచి మక్కువ ఉంటే ఈపాట మీకు తప్పకుండా మనస్సుకు హత్తుకుంటుంది. చూడండి ఈ పాట నిండా హాయిగా పరచుకున్న తెలుగు పదాల రాజసం.
ఈ పాటను తిరుమల తిరుపతి దేవస్థానంలో గాయకుడైన పారుపల్లి రంగనాథ్ గాత్రంలో వినవచ్చును.
ఈ సంకీర్తనాన్ని బాలకృష్ణ ప్రసాద్ గారి గళంలో కూడా మనం వినవచ్చును.
అంటే, శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారు హాయిగా భోజనం చేసి కూర్చున్నారని పాట మొదలు పెడుతున్నారు ఆచార్యుల వారు.
అదిగో చూడండయా వాడే, మనకు దగ్గరగానే, ఎదురుగానే లక్ష్మీనారసింహుఁడు హాయిగా ఆరగింపు కానిచ్చి కూర్చున్నాడు అంటున్నారు. అయన ఎలా ఉన్నాడు?
ఇందిరనుఁ దొడమీద నిడుకొని కొలువిచ్చీ
అందపు నవ్వులు చల్లీ నల్లవాఁడె
చెందిన మాణికముల శేషుని పడగె మీఁద
చెంది వరాలిచ్చీ లక్ష్మీనారసింహుఁడు
అయన మనతల్లి ఇందిరమ్మను (అంటే లక్ష్మీదేవిని) తన తొడమీద కూర్చుండ బెట్టుకొని సభ తీర్చి ఉన్నాడు. హాయిగా అందమైన చిరునవ్వులు చిందిస్తున్నాడు. అదుగో ఆయనే చూడండి మరి అని మనని హెచ్చరిస్తున్నాడు అన్నమయ్య.
ముందుగా అన్నమయ్య సాహిత్యంలో వచ్చీని చేసీని వచ్చీని వంటి మాటల గురించి ఒక మాట చెప్పుకోవాలి. ఈ రోజు మనం చేసెను/చేసేను వచ్చెను/వచ్చేను అన్న అర్ధంలో చేసే వచ్చే అన్న మాటలను వాడుతున్నాము. అన్నమయ్య కాలంలో ఆ మాటలనే చేసీని వచ్చీని అని వాడేవారు అన్నమాట. అలాగే చివర ద్రుతం లేకుండాను కూడాఅ వచ్చీ అప్పట్లో అన్న మాటకు నేటి వాడుక వచ్చే అని.
ఇక్కడ కొలువిచ్చీ వరాలిచ్చీ అన్నప్పుడు ఈకాలం వారు వాటిని కొలువిచ్చే వరాలిచ్చే అని అన్వయం చేసుకోవాలి. అంటే కొలువిచ్చెని వరాలిచ్చెను అని అర్ధాలు తీసుకోవాలి అన్నమాట.
అందపు నవ్వులు చల్లీ నల్లవాఁడె అన్న పాదం నేటి పధ్ధతిలో అందపు నవ్వులు చల్లే నల్లవాఁడె అని వ్రాయవలసి ఉంటుంది. చల్లేను అల్లవాడే అని పదవిభాగం వస్తుంది. ఈ చల్లేను అన్నది ఆనాటి భాషలో చల్లీని అని ఉందన్నమాట. అందుచేత మూల ప్రతిలో చల్లీని అల్లవాడె అని ఉంది.
ఐతే ఇటువంటి పాటలు పాడేటప్పుడు ఒక సందిగ్ధత వస్తుంది. చల్లీని అని పాడితే మన కాలం శ్రోతలకు వింతగా అనిపిస్తుంది. కాని మూలం సాధ్యమైనంత వరకూ ఏమాత్రమూ మార్చకుండా పాడటం అన్నది చాలా ఉచితమైన విధానం. మనం పూర్వకాలపు వాగ్గేయకారుల రచనలను మనకాలానికి అనుగుణంగా భాష మార్చి పాడటం మంచి పధ్ధతి కాదు.
అల్లాగే మరొక ముఖ్య విషయం. అన్నమయ్య తన సంకీర్తనల్లో వాడిన విధానం ఏమిటంటే ఆయన ప్రతి పాదంలోనూ - అది పల్లవిలో ఐనా, చరణాల్లో ఐనా సరే - ప్రాసనూ యతినీ పాటించారు. ఒక్కొక్కసారి యతి ప్రాసలకు అనుగుణంగా చెప్పే ఉద్దేశంతో ఆయన వాక్యంలో పదక్రమాన్ని చిత్రమైన విధాలుగా ముందువెనుకలు చేసారు. తెలుగులో అది దోషం కాదు.
రాముడు ఇంటికి వెళ్ళెను అన్న వాక్యాన్ని మనం ఇంటికి రాముడు వెళ్ళెను అన్నా వెళ్ళెను రాముడు ఇంటికి అన్నా తేడా లేదు. కవిత్వంలో ఇది సాధారణమే.
ఐతే అన్నమయ్య ఒక్కొక్క సారి పదబంధాలను కూడా విరుగకొట్టి మరీ తన దారికి తెచ్చుకొని అటూఇటూ చేయటం పరిపాటి. ఒక్కొక్కసారి అవి చాలా వింతగా అనిపిస్తాయి. కనీసం మనకాలం వాళ్ళకు వింతగానే ఉంటాయి.
చెందిన మాణికముల శేషుని పడగె మీఁద చెంది అంటే ఏమిటో చూదాం. శేషుడు అంటే తెలుసు కదా ఆది శేషుడు. ఆయన గారు స్వామివారికి పడక మంచం. నిజానికి శేషుడు భగవానునికి ఏది అవసరం ఐతే ఆరూపం లోనికి మారి సేవచేస్తాడు. శయ్య అవుతాడు, ఆసనం అవుతాడు. కావలసి వస్తే పాదుకలు కూడా అవుతాడు.
అంత గొప్పవాడు ఆ శేషుడు. అయనకు పదివేల పడగలు. ఆపడగల మీద ధగధగ లాడే మణులు. వాటిని ఇక్కడ అన్నమయ్య మాణికములు అన్నాడు అంటే మాణిక్యాలు అన్నమాట. ఇక్కడ పదాలను శేషుని పడగె మీఁద చెందిన మాణికముల చెంది అని మార్చుకోవాలి. అంటే ఆ పడగ(లు) పట్టిన శేషుడి సేవ కారణంగా స్వామివారు మరింత ధగధగను చెందుతున్నారని అర్ధం. ఈ విధంగా శేషుడు తన తనువెల్లా స్వామివారి సేవకు వినియోగిస్తున్నాడు. స్వామివారు శేషుని ఆసనంగా అంగీకరించారు. ఆ శేషస్వామి పడగల మణులను తాను తన శిరోభూషణాలుగా స్వీకరించారు. అవి ఆయన శోభను మరింతగా హెచ్చిస్తున్నాయి.
ఆదిశేషుడి పడగల మీది మాణిక్యాలు ఆదిశేషుడికి చెందినవి. కాని వాటి ధగధగల సొంపంతా శ్రీలక్ష్మీనరసింహస్వామికి సేవగా చెందుతోంది.
ఇదీ విషయం.
మరి, ఆరగింపు ముగించుకొని, అంత ధగద్ధగాయమానంగా కొలువు తీరి లక్ష్మీసమేతుడై దర్శనం ఇచ్చిన స్వామివారు ఊరికినే ఉన్నారా?
ఉండరండి. దేవతల దర్శనమే అమోఘం. వారు మనకు కనిపించాక ఏదో ఒకటి అనుగ్రహించాలి మనకు. అది వారి రివాజు. సంప్రదాయం.
మరి దేవాధిదేవుడైన లక్ష్మీనారసింహుడు వట్టినే ఉంటాడా? ఉండడు కదా. అందుక వరాలిచ్చీ లక్ష్మీనారసింహుఁడు అన్నాడు అన్నమయ్య. అయన మనకు వరాలు అనుగ్రహిస్తున్నాడని చెబుతున్నారు.
ఆ లక్ష్మీనారసింహస్వామి వారి వైభవాన్ని ఇంకా ఇలా వర్ణిస్తున్నారు.
బంగారు మేడలోన పచ్చల గద్దియల మీఁద
అంగనల ఆట చూచీ నల్లవాఁడె
రంగగు సొమ్ముల తోడ రాజసపు విభవాల
చెంగట నున్నాడు లక్ష్మీనారసింహుఁడు
అది బంగారు మేడ. ఆ మేడ మీద ఒక గొప్ప సభాభవనం. దానిలో ఒక దివ్య మంటపం. ఆమంటపంలో ఒక పచ్చలు తాపడం చేసిన గద్దె ఉంది. ఆ గద్దె మీద స్వామివారు మంచి రంగైన సొమ్మలను అలంకరించుకొని కూర్చున్నారట. ఇక్కడ రంగగు అంటే మణిభూషణాలకు సంబంధించిన రంగురంగులు అని అర్ధం కాదు. రంగగు అంటే దివ్యమైన అద్భుతమైన అని అర్ధం. అటువంటి సొమ్ముల దిగవేసుకొని మహారాజవైభవంతో మరీ కూర్చున్నాడు స్వామి.
ఆయన మనకు చెంగటనే ఉన్నాడు అని హెచ్చరికగా చెబుతున్నారు ఆచార్యులు. అంటే మనం ఆ సభాభవనంలోనే అయనకు ఎదురుగా కొంచెం పెడగా ఉభయపార్శ్వాలనూ సభాసీనులమై ఉన్నాం అని చెప్పటం.
అలా గొప్ప సభతీర్చి కూర్చున్న స్వామి వారు ఏం చేస్తున్నారయ్యా అంటే అంగనల ఆట చూచీని అనగా నట్టువరాండ్రు ఆయన యశోగీతాలు గానం చేస్తుంటే తిలకిస్తున్నాడట.
ఇదంతా స్వామి వారు ఆరగింపు ముగించుకొని కూర్చున సభలో జరుగుతున్న ముచ్చట.
ఇక్కడ నేనొక విషయం మనవి చేయాలి. ఆమంటపంలో ఒక పచ్చలు తాపడం చేసిన గద్దె ఉంది అని నేను వ్యాఖ్యానం చేసాను కాని నిజానికి కీర్తనను పరికిస్తే పచ్చలగద్దియల మీఁద అంగనల యాట చూచీ అని కనిపిస్తోంది కదా అన్న అనుమానం వస్తుంది చదువరులకు. గద్దె లేదా గద్దియ అన్నమాటకు ఆసనం అన్న అర్దప్రతీతి ఉన్నది కాని వేదిక అన్న ప్రతీతి లేదు. ఆసనం మీద నాట్యం చేయటం అన్నది అసంగతమైన అన్వయం కదా. అందుచేత మనకు గద్దియ అన్నమాటకు వేదిక అన్న అర్ధం కావలసి వస్తున్నది. కాని అది పొసగదు. వాంగ్మయంలో కూడా గద్దెకెక్కటం అన్న నానుడికి అర్ధం సింహాసనం ఎక్కడం అనే అన్నది అందరికీ తెలుసు. కాబట్టి సభాంగణంలో పచ్చలవేదికల మీద నాట్యం జరుగుతున్నది అన్న అన్వయం తీసుకోవటం లేదు. స్వామి వారు బంగారు మేడలోన పచ్చల గద్దియ పైన ఆసీనులై ఉన్నారన్న అన్వయాన్ని తీసుకున్నాను.
ఐతే ఇక్కడ ఒక ప్రశ్న రావచ్చును నాకు. అన్నమయ్యకు మెఱుగులు దిద్దటమా, ఉచితమా అన్నది. సభలో సింహాసనానికి ఎదురుగా నాట్యవేదిక ఒక్కటే ఉందనుకోవటం, అనేక నాట్యవేదికలు అలా ఉన్నాయనుకోవటం కన్నా ఎక్కువ సబబుగా ఉండటం కూడా ఒక కారణం అని ఒక సమర్ధన. మరొకటి, నా అభిప్రాయంలో పచ్చల గద్ధియ మీఁద అన్నదే మంచి పాఠంలా అనిపించటం ముఖ్యకారణం నా వివరణకు.
సాంకేతికాంశం ఒకటి ఉందిక్కడ.చరణాల్లోని రెండవపాదాలు మినహాయించి ప్రతిపాదంలోనూ ఉత్తరార్ధం అనగా యతిస్థానం నుండి పాదాంతం వరకూ కల భాగం పదిమాత్రల ప్రమాణంతో ఉన్నది. నేను చెప్పేది ఉఛ్ఛారణాప్రమాణం గురించి. వరుసగా ఇడుకొని కొలువిచ్చి, శేషుని పడగ మీద, క్ష్మీనారసింహుడు, రాజసపు విభవాల, పెనచి ఒక పాదము, కోరి యహోబలమున అన్నవి అన్నీ ఇలా పదిమాత్రల ఉఛ్ఛారణకు చక్కగా వస్తున్నాయి. కాని పచ్చల గద్దియల మీద అన్నప్పుడు పదకొండు మాత్రల ప్రమాణం అవసరం అవుతున్నది. పచ్చల గద్దియ మీద అంటే చక్కగా సరిపోతున్నది.
కాబట్టి పచ్చలగద్దియల మీద అన్నది వ్రాయసకాని పొరపాటే కాని ఆచార్యుల వారి రచనలో పచ్చల గద్దియ మీద అని ఉన్నదనే అభిప్రాయం స్థిరపడుతున్నది.
అలా నాట్యాది విలాసాలను తిలకిస్తున్న స్వామి వారి గురించి ఇంకా ఇలా చెబుతున్నారు.
ఆయన పాదాలకు గండపెండేరాలు ఉన్నాయి. అవి బ్రహ్మాండమైన శోభను వెదజల్లుతున్నాయి. ఒక పాదం క్రిందకు పదపీఠంపైన ఆన్చి ఉంచారు స్వామి. మరొక పాదాన్ని మడత వేసుకొని ఉన్నారు. అప్పుడే కదా మరి అది అమ్మవారు అంకపీఠిపై కొలువు తీరటానికి ఆసనంగా అమరేది. అందుకని అన్నమాట.
ఈ లక్ష్మీనారసింహ స్వామి ఎవరను కుంటున్నారు?
సాక్షాత్తూ వేంకటాద్రి కొండల మీద వెలసి ఉన్న శ్రీ వేంకటేశుడే ఇతడు!
ఆయనే కోరికోరి ఇలా అహోబలం లో శ్రీలక్ష్మీనారసింహుడై వెలసి ఉన్నాడు.
చూడండి, ఈయన ఎంత గొప్పగా ఇక్కడ (అహోబిలంలో) ప్రకాశిస్తూ ఉన్నాడో!!
ఈ సంకీర్తనంలో ఋతువులను చమత్కారంగా ప్రస్తావించటం మనం గమనించ.వచ్చును. చూడండి. వసంతము , వేసవి, జడివానలు, శారదసమయంబు, మంచుకాలము, చలికాలము అంటూ ఋతువులను సూచిస్తున్నారు.
చెలికత్తె నాయికతో అంటున్న మాటలుగా ఈ సంకీర్తనం ఉంది. చెలికత్తియ అంటున్నది కదా
ఎవ్వనిఁ దలఁచితివే ఎక్కడ మోహించితివే
చివ్వనఁ జెప్పవే నాతో సిగ్గుపడనేఁటికి
అని. అంటే
అమ్మాయీ నీతీరు చూస్తుంటే నువ్వు ఎవరినో తలచి క్రిందుమీదు లౌతున్నావని తెలుస్తూనే ఉంది. అతడెవరో చెప్పవే. నేను నీ యిష్టసఖిని కదా, నాతో చెప్పవచ్చును కదా, సిగ్గుపడటం దేనికీ? వెంటనే సంగతి ఏమిటో చెప్పు. ఎక్కడి మోహాలివీ? ఎవరిని తలచుకొనీ?
నువ్వు చెప్పకపోయినా నీ తీరు పట్టి యిస్తూనే ఉంది, విషయం ఏదో ఉందని.
చెక్కులేల చెమరించె చెలియ నీ కిదె నేఁడు
వెక్కసపు టెండలతో వేసవి రాదు
చెక్కులు అంటే చెక్కిళ్ళు. అవి చూపుతూ సఖి అంటున్నది ఇలా. చూడూ నీ చెక్కిళ్ళు ఎలా చెమరిస్తున్నాయో. ఎందుకలా చెమటలు పడుతున్నట్లూ? ఏం వేసవి కాలం ఏమీ రాలేదే దుస్సహం ఐన ఎండలతో?
గక్కున నీమేనేల కడుఁ బులకించె నేఁడు
వక్కణింప నింక జడివానలు రావు
పైగా నీ ఒళ్ళు చూస్తే ఒకటే పులకరింతలు వస్తున్నాయని తెలిసిపోతూ ఉంది. చెప్పాలంటె ఇది వానాకాలం కాదే, భోరున వానలూ కురవటం లేదే?
వానాకాలానికీ పులకరింతలకూ సంబంధం ఏమీ లేదు కాని ఆచార్యులవారు ఎందుకు ఇలా ముడేసి చెప్పారో మరి. ముగ్ధ ఐన నాయిక జడివానల భీభత్సానికి బెదరి నాయకుడి చెంత చేరటం అన్నది ఒక ముచ్చట. కనీసం నాయకులకు ముచ్చట. అటువంటి సందర్భాలు నాయికా నాయకుల మధ్యన నడిచాయనుకోండి. వానలు పడినప్పుడల్లా నాయిక పూర్వస్మృతుల లోనికి వెళ్ళి పరవశించటమూ తత్కారణంగా ఆమె మేను పులకరించటమూ అన్నవి ఇక్కడ సూచించబడింది అనుకోవాలి. అన్నట్లు మగవాళ్ళకు పులకరింత అనకూడదు రోమాంచం అనాలి. విషయం ఒక్కటే.
ఇక్కడ సఖి అంటున్నది ఏమిటంటే ఏమి తలచుకుంటున్నావే అని కదా. అంటే ఏపూర్వ సంఘటనలు నెమరు వేసుకొంటూ నీ మేను పులకరిస్తున్నదీ అని నిలదీస్తున్నది అన్నమాట.
ఇంకా చెలికత్తె ఏమంటున్నదీ అంటే
వెలువెల్లఁ బారనేలే వెన్నెలబొమ్మ వలె
అలరు శారదసమయంబు గాదు
ఏమిటోయ్ అమ్మాయీ అలా వళ్ళంతా తెలతెల్లగా ఐపోతున్నదీ? చూడటానికి అచ్చం వెన్నెలను ముద్దచేసి బొమ్మచేసినట్లున్నావు. ఇదేమనా శరదృతువా? కాదే?
ఋతువులన్నింటిలో శరత్తుకు ఒక విశిష్ఠ స్థానం ఉంది. వానలు వెనుకబట్టి, ఆకాశం నిర్మలంగా ఉంటుంది. పుష్కలంగా నీరు దొరికిన ప్రకృతిలోని చెట్టూ చేమా అంతా నిండుగా పచ్చగా ఉంటుంది. దానికి తోడు వెన్నల రాత్రులైతే ఆ శోభ చెప్పనలవి కాదు. శారదరాత్రు లుజ్వల తారక హార పంక్తులం జారు తరంబులయ్యె వంటి పద్యాలను స్మరించుకుంటే ఆ ఋతుశోభ మనసుకు వస్తుంది. ధగధగలాడే శరత్పూర్ణిమ రాత్రి వెన్నెలకు సాటే లేదు ప్రకృతిలో.
ఇప్పుడు మన నాయిక, ఆ శరత్పూర్ణిమ రాత్రి వెన్నలను పిసికి ముద్దచేసిన బొమ్మలా ధగదగ లాడుతోందట.
చెలికత్తియకు అనుమానం వస్తోంది, చూస్తుంటే ఇదేదో వ్యవహారం తనకుతెలియకుండా నడిచినట్లుంది అన్న భావన కలిగి అంటున్నది కదా,
పలకే నీమోవి నేల పక్కులుగట్టే నేఁడు
కలికి యిప్పుడు మంచుకాలము గాదు
ఈ మాట చెప్పూ? నీ ముఖం ఏమిటీ అక్కడక్కడా పుండ్లు ఆరి పక్కులు కట్టినట్లు తోస్తోందీ? విషయం ఏమిటీ? ఊరికే పగుళ్ళు వచ్చి అలా అవటానికి ఇదేం మంచు పడే కాలం కాదే అని గదమాయిస్తోంది. అంటే నీకు నాయకుడితో సమాగమం కలిగి ఉండాలె? నాక్కొంచెం కూడా ఉప్పంద లేదే అని నిష్టూరంగా అంటోందన్న మాట.
పైగా
కప్ప నేల పయ్యదను కాలమిది చలి గాదు
అంటోంది కదా, ఎందుకలా పమిట కప్పుకుంటున్నావూ, ఇప్పుడు చలికాలం కాదు కదా అని.
అంటే నాయిక తనకు నాయకుడితో సమాగమం కలిగిందా అన్నప్రశ్నకు సమాధానం ఇవ్వటానికి బదులుగా తనను సఖి మరీ పరిశీలనగా చూడకుండా పమిట కప్పుకుంటున్నదిట, ఆ సంగతి చెలి గ్రహించి ఎత్తిపొడుస్తున్నది ఇది చలికాలం కాదే ఎందుకు పమిట కప్పుకోవటం అని.
ఎలాగూ చెలికత్తెకు విషయం తెలిసిపోయింది. ఇంక దాపరికం ఏముంది. చెలి మాత్రం తెలిసిందిలే అని ఊరికే వదుల్తుందా
మొదట
చెప్పలేదు వసంతము చిగిరించెను
అని మేలమాడింది. నాయిక అచ్చం వసంతలక్ష్మి లాగా ఉందట. వసంతం సంతోషానికి ప్రతీక కదా, నాయిక సంతోషం అంటే నాయక సమాగమం అన్నసంగతి చెప్పాలా వేరే. అందుకే ఇష్టసఖి అంటున్నది కదా,
దప్పిదేర నిటు గూడె తరగ నిన్ను నింత చేసె
యిప్పుడా శ్రీ వేంకటేశుఁ డేడనున్నాఁడే
సరే నమ్మాయీ విషయం తెలిసిపోయిందిలే. నీకు సమాగమసౌఖ్యాన్ని ప్రసాదించి శ్రీ వేంకటేశ్వరుడు నిన్నిలా విరహంలో ముంచి వెళ్ళినట్లు తెలుస్తున్నది. ఇంతకీ శ్రీవారు ఆ శ్రీవేంకటేశ్వరుడు ఎక్కడున్నాడమ్మా?
దొంగా, అడడు ఎక్కడున్నాడో నీకు తెలుసును, వస్తున్నాడనీ తెలుసును. ఆయనకోసం ఎదురుచూస్తున్నావు కదా అని మేలమాడటం అన్నమాట.
ఈ సంకీర్తనంలో ఆచార్యుల వారు వేదాంతపరిభాషను వంకాయలో కారం కూరినట్లు దట్టించారు.
కొంత మందికి ముందుగా ఈ పరిభాష ( అంటే terminology) ముందుగా పరిచయం చేయకపోతే వారికి అవగాహన కావటం కష్టం కాబట్టి ముందుగా ఆపదాల సంగతి చూదాం.
అని మొదలుపెట్టారు. పౌఁజు అంటే బలగం. అనగా సైన్యం అన్నమాట. ఒడయడు అంటే రాజు. శ్రీపతివైన ఓ వేంకటేశా నువ్వేమో అన్నిటికీ ఏలికవు. ఐనా మా బలం ఏమంత తక్కువేం కాదయ్యా, కావలిస్తే వివరిస్తాను. నువ్వే లెక్కించుకో అని ఈ పల్లవి భావం.
ఇంక చరణాల్లో ఆ లెక్కా డొక్కా అంతా ఇల్లా వివరిస్తున్నారు.
అయ్యా ఈ లెక్క విను. ఈ శరీరి (శరీరం కలవాడు శరీరి అనగా జీవుడు) ఉన్నాడే, వీడికి జ్ఞానేంద్రియాలొక ఐదు ఉన్నాయి. అలాగే మరొక ఐదు కర్మేంద్రియా లున్నాయి. ఇంకా కామక్రోధాదులని ఒక వర్గం వాళ్ళొక అరుగు రున్నారు. ఈ వీడి శరీరాన్ని ఆశ్రయించుకొని పంచభూతాలని లొంగదీయరానివి ఒక అయిదు ఉన్నాయి. మా బలగాన్ని లెక్కవేసుకో వయ్యా.
రెండవచరణం.
తప్పని గుణాలు మూడు తనువికారములారు
అప్పటి మనోబుద్ద్యహంకారాలు
వుప్పతిల్లువిషయము లుడివోని వొక అయిదు
యిప్పటి మించే కోపము యెంచుకో మాపౌఁజు
ఈ జీవితో పాటుగా త్రిగుణాలని ఉన్నాయి. శరీరానికి వికారాలని అవొక ఆరు ఉన్నాయి. అంతఃకరణ చతుష్టయం అని ఒక నలుగు రున్నారు. (ముగ్గురిని పేరుపెట్టి చెప్పారిక్కడ వారిలో) . వీరు కాక విషయాలని మరొక ఐదుగురు ఉన్నారు. అపైన కోపం అనే పెద్ద వీరుడొకడు. లెక్కపెట్టుకోవయ్యా మా సైన్యాన్ని.
ఈచరణంలో మూక అన్నా గమి అన్నా దండు అనే అర్ధం వస్తుంది కాని గమికాడు అంటే దండుకి అధిపతి అని తీసుకున్నాక మూక గమికాడ అంటే ఇంత పెద్ద దండుకు అధిపతిని అని గ్రహించాలి.
ఏకట అంటే ఇష్టం. ఏకటి + ఆర --> ఎంతో ఇష్టంగా (తనివార లాగా అన్నమాట)
అంతే కాదయ్యోయ్. ద్వంద్వాలని కొందరు జంటవీరులున్నారు. వాళ్ళ సంఖ్యా? ఓ. బోలెడు మంది సుఖమూ దుఃఖమూ, వేడీ, చల్లనా, ఆకలీ దప్పికా ఇలా లెక్కలేనంత మందున్నారు బలగం.
ఇంత దండుకి నేను సేనాపతిని. ఐనా నీకు దాసుణ్ణి. మ్రొక్కుతున్నానయ్యా నీకు వినయంగా. ఎంతో ఇష్టంగా నీ సేవలో గడిపే వాడిని. నా సైన్యాన్ని ఎంచుకోవయ్యా. ఇదంతా నీదేను, నీ సేవకై ఉన్నదేను.
ఈ సంకీర్తనంలో ఇలా ఆచార్యుల వారు జీవుడిని ఆశ్రయించుకొని ఉన్న సమస్తమూ అతడి సైన్యం వంటిదనీ, దానితో వాడి భగవత్కైంకర్యం ఇష్టంగా చేస్తూ ఉన్నాడని చమత్కారంగా చెబుతున్నారు.