31, జులై 2020, శుక్రవారం

మిక్కిలి సొగసుకాడు మేటి విలుకాడు


మిక్కిలి సొగసుకాడు మేటి విలుకాడు
నిక్కువమగు కీర్తి ధర నించినవాడు

మిక్కిలి బరువైన విల్లు మోపెట్టినాడు
ముక్కలాయె నంత నది యక్కజము గాను
మిక్కిలి సొగసుకత్తియ మేదినీకన్య
దక్కిన బహుమానమై తగినదాయెను

ఒక్క విల్లెత్తి భార్గవు నొంచి ధృతిమించెను
ఒక్క దర్భశరము పైన నునిచె బ్రహ్మాస్తము
ఒక్క బాణమున గూల్చె నేడుతాళంబు
ఒక్క బాణమున గూల్చె నుధృతుని వాలిని


ముక్కముక్కలుగ చేసి మూలబలము నెల్ల
మిక్కిలి తలలున్నవాని నుక్కడగించెను
చక్కని రామునకు సరిసాటివారు లేరు
మక్కువతో వాని గొప్ప మధురముగ పాడరే

(ఈకీర్తన ఆద్యంతం అప్రయత్నంగా ఏకాక్షర ప్రాసతో‌ నడిచింది!)

చక్కెర చాలని క్షీరాన్నము చక్కనిది కాదు

చక్కెర చాలని  క్షీరాన్నము చక్కనిది కాదు
తక్కువైనచో భక్తి పూజలో తగిన పూజ కాదు

చిక్కని చక్కని పాలతోను చేసిన ఫలమేమి
చక్కగా ఏలకుల పొడిని చల్లిన ఫలమేమి
ఎక్కువగా కిసిమీసు తగిలించిన ఫలమేమి
వెక్కసంబుగ జీడిపప్పును వేసిన ఫలమేమి

మంచిమంచి హంగులు పేర్చిన మంటపమే చాలా
ఎంచి మంచి పట్టుపుట్టములు ధరించినదే చాలా
పంచభక్ష్యపరమాన్నంబుల పళ్ళెరములు చాలా
అంచితంబుగ నిచ్చిన నక్షత్ర హారతులే చాలా

ఆడంబరమగు పూజలేమి యవసరమే కాదు
చూడడు భక్తిని కాని దేవుడు వీడుడు మూఢతను
వేడుక మీఱ భక్తిపొంగార వెలయించుడు పూజ
నేడే చేయుడు రామపూజను నిజమగు భక్తితో

వందనాలు వందనాలు వరలక్ష్మీ‌ (+ఆడియో)


వందనాలు వందనాలు వరలక్ష్మీ‌ జగ
ద్వందిత శుభపాదారవింద లక్ష్మీ

హరి దేవేరివి ఆదిలక్ష్మీ శీఘ్ర
వరదాయిని మా వరలక్ష్మీ
పరమాత్మికా శుభప్రదలక్ష్మీ లోక
పరిపాలనాసద్వ్రతలక్ష్మీ

రావణధ్వంసినీ రామలక్ష్మీ పరమ
పావని శ్రీరామభాగ్యలక్ష్మీ
భావనాగమ్యప్రభావలక్ష్మీ త్రిజగ
దావనగుణశీల అభయలక్ష్మీ

మాధవి రుక్మీణీ‌ మహాలక్ష్మీ భవ
బాధానివారిణి భద్రలక్ష్మీ
సాధుజనానందక జయలక్ష్మీ మా
కాధార మీవే యనంతలక్ష్మీ

ఈ కీర్తనను శ్రీరాగంలో శ్రీ టి.కె,చారి గారి గళంలో వినండి.

20, జులై 2020, సోమవారం

రామ రామ తప్పాయె రక్షించవయ్యె


రామ రామ తప్పాయె రక్షించవయ్యె
ఏమాత్ర మిద్ది యూహించ నైతి

ఒకరీతిగా వ్రాయ నింకొక రీతిగా నెఱిగి
యొకరు చేసిన మార్పు నోపగ లేక
వికలమాయె మనసు వివరించ లేనింక
సకల మెఱిగిన రామచంద్ర మూర్తీ

నిను గాక నన్యుల కనుచు దండంబులు
వినవయ్య యేనాడు పెట్టనేరనుగ
యనుకోని పొరపాటు ననుజేసి దొరలెనే
యను తాపమొక్కటి యధిక మాయె

అపచారమే యని యనుకొందువో
యపరాధి వీడాయె ననుకొందువో
విపరీత మాయెనని కపటినైపోతినని
తపియించు నాపైన దయజూపుము


జయజయ జయజయ జయజయ రాం


జయజయ జయజయ జయజయ రాం జయజయ జయజయ సీతారాం
జయజయ త్రిభువనపోషక రాం జయజయ శివనుత సీతారాం

శ్రీరఘునందన సీతారాం తారకనామా సీతారాం
కారణకారణ సీతారాం కౌసల్యాసుత సీతారాం
భూరిదయాపర సీతారాం పురుషోత్తమ హరి సీతారాం
నారాయణ హరి సీతారాం నళినదళేక్షణ సీతారాం

పతితపావన సీతారాం అమితసుగుణమణి సీతారాం
అతులితవిక్రమ సీతారాం అయోధ్యరామా సీతారాం
శ్రుతినుతవైభవ సీతారాం సురగణపూజిత సీతారాం
కృతరావణవధ సీతారాం కిల్బిషనాశన సీతారాం

వాతాత్మజనుత సీతారాం పరమపావన సీతారాం
పూతచరిత్ర సీతారాం భువనేశ్వర హరి సీతారాం
భూతగణేశ్వర సీతారాం పురాణపురుష సీతారాం
సీతారాం జయ సీతారాం సీతారాం హరి సీతారాం

19, జులై 2020, ఆదివారం

జనహితకర శ్రీరామచంద్రమూర్తీ

 జనహితకర శ్రీరామచంద్రమూర్తీ నా
మనసులో నున్న ఓ‌ మహిత మూర్తీ

అందగాడ వనుచు నీకు ముందే పేరు
మందహాసవదనుడ వని మరి యొక పేరు
అందరి వాడ వనుచు నది యొక పేరు
అందుకే‌ నా మానస మది నిను చేరు

వరగుణోపేతుడవగు సరసమూర్తివి
నిరుపమానపరాక్రమాన్విత మూర్తివి
సరిసాటి లేని పరమశాంత మూర్తివి
మరి యందుకె నాకు మనోహర మూర్తివి

నిరంజనా పరంతపా కరుణ చూపరా
మరియాదా పురుషోత్తమ మాటలాడరా
ధరాత్మజా మనోహరా దశరథ రామా
మరి మరి నిన్నే పొగడి మనసు మురియురా

18, జులై 2020, శనివారం

గడుసు పూజ!


తే। దేవుడా నీకు దండంబు దేవతార్చ
నా గృహంబున మాత్రమే‌ నళిననయన
కూరుచుండుము నిన్ను తోడ్కొనుచు బోవ
వీలుపడ దేను పోయెడు వీధులందు.

తే। ఉదయమే వచ్చి యొకపూవు నుంచి నీకు
చేయుదును నమస్కారమున్ చింతవలదు
మరియు నంతకు మించి సన్మామునకు
నాశ పడకుము నాశక్తి యంతవరకె

ఉ। వట్టి నరాధముండనని భావన సేయకు మయ్య భక్తి లేక కా
దెట్టుల నీకు తృప్తి యగు నించుక యేని నెఱుంగ దేవుడా
గట్టిగ నొక్క మంత్ర మనగా సరిగా పలుకంగ లేను నన్
తిట్టకు మయ్య పూజయని దీనిని చేకొను మయ్య వేడ్కతో

ఆ.వె।  ఒక్క పూవు నిచ్చి యొక్క దండము పెట్టి
చేసినట్టి పూజ చిత్తశుధ్ధి
నరసి నీవు మురిసి యన్ని వేళల నేను
కోరినట్టి వెల్ల కురియవయ్య

కం। ఇంతకు మించి వచింతునె
యెంతైనను నీవు భక్తి నెంచదవు కదా
సంతోషముగా నుండుము
సంతోషము నాకు గూడ సమ్మతి నిమ్మా


వరవరరావు గారు దయార్హులా?

ఈ రోజున ఒక వార్త చూసాను అది వరవరరావు గారికి సంబంధించినది. ఈనాటి ఆంధ్రజ్యోతి ఆన్‌లైన్ పత్రికలో అది వరవరరావు నాకు రాజకీయ గురువు: కరుణాకర్‌రెడ్డి అనే‌ శీర్షికతో‌ లభిస్తున్నది. ఈ వార్తాకారుడు సదరు వార్తను లిఖిస్తూ "ఈ లేఖ ఎవరినైనా కదిలించేలా ఉంది." అని వాక్రుచ్చారు.

అవును. నిజమే. ఇంతవరకూ విరసం‌నాయకుడు వరవరరావు గురించి కాని అసలు విరసం అనబడే సంస్థ గురించి కాని నేను ఎన్నడూ ప్రస్తావించలేదు నా బ్లాగులో. ఈ లేఖ నన్నూ‌ వ్రాసేలా కదిలించింది కదా. అందుకే‌ ఆ వార్తాకారుడు అన్నది నిజం అంటున్నది.

సమగ్రత కోసం, కేవలం ఈవ్యాసం‌యొక్క సమగ్రత కోసమే సదరు వార్తావ్యాసాన్ని యథాతధంగా ఇక్కడ ముందుగా చూపుతున్నాను.

విరసం నేత వరవరరావును కాపాడాలంటూ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు వైసీపీ ఎమ్మెల్యే కరుణాకర్‌రెడ్డి లేఖ రాశారు. ఎమర్జెన్సీ సమయంలో వరవరరావుతో తనకున్న అనుబంధాన్ని లేఖలో గుర్తుచేశారు. ఎంతో బరువెక్కిన హృదయంతో రాసినట్లు అనిపిస్తున్న.. ఈ లేఖ ఎవరినైనా కదిలించేలా ఉంది.‘‘

వరవరరావు నిర్బంధం, అనారోగ్యం గురించి మీకు తెలిసే ఉంటుంది. అనారోగ్యంతో ఆసుపత్రిలో ఆయన బందీగా ఉన్నారంటే హృదయం చెమ్మగిల్లుతోంది. 48 సంవత్సరాల క్రితం నాలో రాజకీయ ఆలోచనల అంకుర్భావ దశలో నాకు లభించిన ఎందరో గురువులలో ఆయనా ఒకరు. నలభై‌ ఆరు సంవత్సరాల క్రితం ఎమర్జెన్సీ బాధితులుగా మీరు, నేను ఇరవై ఒక్క నెలలు ముషీరాబాద్ జైల్లో ఉన్నప్పుడు ఆయన మన సహచరుడు. సాహచర్యం భావజాలంలో కాదు గానీ, కటకటాల వెనుక కలిసి ఉన్నాము, రాజకీయ సిద్ధాంతంలోనూ, జనక్షేమంకై నడిచే మార్గంలోనూ ఎవరి భావాలు వారివే. కానీ మనం మనుషులం. శరీరం మంచానికి కట్టుబడే 81 సంవత్సరాల వయసులో, అందులోనూ అనారోగ్యంతో ఉన్న ఆయనపైన ప్రభుత్వం దయ చూపాల్సిన అవసరం ఎంతో ఉంది. యాభై మూడు సంవత్సరాలుగా అడవులలో ఆయుధాలు పట్టుకుని తిరిగే సాయుధులు సాధించలేని విప్లవం మంచం పట్టిన వృద్ధుడు సాధించగడా ?. ఈ స్థితిలో ఆయన ఇంకా నిర్బంధంలో ఉంచడం అవసరమా? రాజకీయాలతో సంబంధం సంబంధం లేకుండా మానవాళి మంచికి ఎన్నో కార్యక్రమాలు చేసిన మీరు దయతో ఆలోచించండి. రాజ్యం ఇంత కాఠిన్యమా, న్యాయం ఇంత సుదూరమా అని ఏ మేధావి ఈ దేశంలో భావించకూడదు. అహింసయే పరమ ధర్మం, శత్రువులు సైతం క్షమించాలి, వేదాంత వారసత్వ భారతదేశపు ఉప రాష్ట్రపతి అయిన మీరు... వరవరరావు విడుదల విషయంలో వెంటనే జోక్యం చేసుకోవాలని సజల నయనాలతో విన్నవించుకుంటున్నాను. అనారోగ్యంతో అడుగులు తడబడుతూ నిస్సహాయంగా ఉన్న ఓ సిద్ధాంతం నిబద్ధ వృద్ధుడిని ప్రజాస్వామ్యవాదులులైన మీరు సానుభూతితో కాపాడమని కోరుకుంటున్నాను’’ అని భూమన కరుణాకర్‌రెడ్డి కోరారు.



ఇప్పుడు ఈ పైన చెప్పబడిన లేఖ గురించి నా అభిప్రాయాలు వ్రాస్తున్నాను. ఒకవేళ ఈ లేఖయే అసత్యం‌ ఐన పక్షంలో ఈ వ్యాసం అనవసర ప్రయాస అవుతుంది.

"శరీరం మంచానికి కట్టుబడే 81 సంవత్సరాల వయసులో, అందులోనూ అనారోగ్యంతో ఉన్న ఆయనపైన ప్రభుత్వం దయ చూపాల్సిన అవసరం ఎంతో ఉంది." అన్న వాక్యం చదివారా? వృధ్ధుడైన కారణంగానూ, అనారోగ్యంతో ఉన్న కారణంగానూ ప్రభుత్వం‌ ఆయన పైన దయ చూపాలని అంటున్నారు. గత యాభైమూడు సంవత్సరాల కాలంలో అడవుల్లో నుండి సాయుధవిప్లవం నడిపించిన యోధులు ఎంతో‌ మందిని చంపారు. వారిలో వృధ్ధులూ అనారోగ్యంతో ఉన్నవారూ‌ లేరా? ఎన్నడైనా సరే ఆ విప్లవకారులు దయ అన్నది ఎవరిపైన ఐనా చూపించారా? వారు ఎవరినైనా చంపటానికి పెద్దగా కారణం ఎప్పుడూ అవసరం పడలేదు కదా. కేవలం విప్లవవ్యతిరేకులనో పోలీసు ఇన్ఫార్మర్లు అనో మరొకటనే అనుమానం కొంచెం వచ్చినా చాలు. అవతలి వ్యకి ఎంత అవధ్యుడు ఐనా సరే చచ్చినట్లు చావవలసిందే‌. అంతే‌ కద. ఎన్నడూ అలాంటి దయలేని కిరాతక విప్లవహత్యలను ఖండించని వాడూ పైగా ఆ హత్యలకు సిధ్ధాంతాల ముసుగులు వేసి సమర్ధించే సంస్థకు చెందిన వాడూ, నాగరికసమాజంలో రచయిత ముసుగులో ఆయుధమున్ ధరింప అని కగ్గముగా నొకపట్ల ఊరకే సాయము సేయువాడ అన్నట్లు అడవివీరుల పక్షాన పనిచేసి చేసి జైలు పాలైన పెద్దమనిషి పట్ల ప్రభుత్వం‌ ఎందుకు దయ చూపాలి? ఆయన ఎప్పుడన్నా కొంచెం విచక్షణా దయా చూపమని తమ విప్లవవీరులకు సందేశం ఇచ్చారా నిజాయితీగా?


"ఈ స్థితిలో ఆయన ఇంకా నిర్బంధంలో ఉంచడం అవసరమా?" ఎన్నడైనా విచక్షణా దయా అనేవిలేకుండాఏదో ఒక ముద్రవేసి కిట్టనివారిని విప్లవంపేరిట అక్షరాలాహత్యలుచేయటం అవసరమా అని ఈమేథావి వరవరరావుగారు తమ విప్లవమిత్రుల్ని ప్రశ్నించారా నిక్కచ్చిగా నిజాయితీగా? వ్యతిరేకుల్ని ఎలాగన్నా ఎంత క్రూరంగా అన్నా చంపటం సబబే అన్న విప్లవవిధానం సరైనదే ఐన పక్షంలో రాజ్యం కూడా అటువంటి దయారహితుల్ని ఎంతకాలం అంటూ కనికరం చూపకుండా కఠిన నిర్భంధంలో ఉంచటం అత్యవసరమే అని వేరే చెప్పాలా?


"రాజ్యం ఇంత కాఠిన్యమా, న్యాయం ఇంత సుదూరమా అని ఏ మేధావి ఈ దేశంలో భావించకూడదు." చక్కటి అభిప్రాయం. తప్పకుండా ఒప్పుకోవలసిందే. ఏకాఠిన్యాన్నీ అన్యాయాన్నీ కుంటిసాకులకు హతమారిపోయిన మనుష్యుల పట్ల ఎంతమాత్రం చూపని వారిపై రాజ్యం ఎందుకని మృదువుగా వ్యవహరించాలి? అటువంటి వారికి మిక్కిలిగా సత్కారం చేసి వారుకోరిన న్యాయం అందించాలని రాజ్యం‌ఎందుకు ఆలోచించాలి? రాజ్యపౌరులపట్ల అది ద్రోహం కాదా? తమని నిష్కారణంగా కూడ చంపిపారేసే వ్యక్తుల్నీ వారికి సైధ్ధాంతిక నైతిక రాజకీయ సామాజిక మద్దతును అందించే వారిని దయగా చూడటం‌ అంటే రాజ్యప్రజలను ప్రమాదంలో బ్రతకమని చెప్పటం‌ కాదా? అదెలా సమర్ధనీయం?

"అహింసయే పరమ ధర్మం, శత్రువులు సైతం క్షమించాలి" అహా ఎంతటి గంబీరోపదేశం. ఇక్కడ ఒక చిన్న పొరపాటు దొర్లింది. నిజానికి లేఖకుని ఉద్దేశం‌ "అహింసయే పరమ ధర్మం, శత్రువును సైతం క్షమించాలి" అని సులభంగానే తెలుస్తున్నది. హింసయే పరమధర్మం. శత్రువును ఎలాగైనా చంపితీరవలసిందే అని నిత్యం‌ జపించే వారిని సమర్ధించే వ్యక్తి పట్ల ఈ‌ మహోపదేశాన్ని ఎలా అమలుచేయటం? "తుపాకి గొట్టం నుండే రాజ్యాధికారం వస్తుంది" అన్న నినాదం మనసా వాచా కర్మణా నమ్మే వారికి సైధ్దాంతిక గురుస్థానంలో ఉన్నారు కదా ఈ విరసం వారూ వారి తాలూకు వరవర రావు గారూను? అందుచేత ఈ గంభీరధర్మపన్నాలు వారి పట్ల వర్తింప జేయరాదు. చేయరాదు కాక చేయరారు. భారతంతో శ్రీకృష్ణుడు నిర్వచించిన ఆతతాయిలు అనే‌ పరిధిలోని వారు ఈ విప్లవకారులూ వారి తాలూకు వారూను. నిష్కారణంగా హత్యలకు తెగబడే వారు ముమ్మాటికీ ఆతతాయిలే. ఆతతాయిలు వేరే యితరకారణాల వలన అవధ్యులు ఐనా సరే, ఆతతాయిలు కాబట్టి అవశ్యం వధ్యులు. అశ్వత్థామ అందుకే బ్రాహ్మణుడూ, గురుపుత్రుడూ, తపస్వీ కూడా ఐనా సరే వధ్యుడైనాడు. అందుచే వృధ్ధుడు, అనారోగ్యవంతుడూ, మేథావి వంటి సాకులు వరవరరావు పట్ల దయనూ అహింసనూ చూపటానికి ఎంతమాత్రమూ ప్రాతిపదికలు కావు. సరే అయన స్వయగా తుపాకీ పుచ్చుకొనీ‌ కత్తిపుచ్చుకొనీ‌ హత్యలు చేయలేదంటారా? నివారణదక్షుడై కూడా అటువంటి హత్యలను ఉపేక్షించాడు, పైగా ప్రోత్సహించాడు. శ్రీకృష్ణుడు సారపు ధర్మమున్ అన్న పద్యంలో చెప్పినట్లు "దక్షు లెవ్వార లుపేక్ష సేసిరది వారల చేటగు" అన్నది సత్యం. అందుచే వరవరరావు గారు దయాపాత్రులు కానేకారు.

"అనారోగ్యంతో అడుగులు తడబడుతూ నిస్సహాయంగా ఉన్న ఓ సిద్ధాంతం నిబద్ధ వృద్ధుడిని ప్రజాస్వామ్యవాదులులైన మీరు సానుభూతితో కాపాడమని కోరుకుంటున్నాను". ప్రజాస్వామ్య వారులైన వారు ఆ ప్రజాస్వామ్య‌ం‌పట్ల కించిత్తు నమ్మకం కూడా లేని వారిని దయచూడాలి అన్న మాట ఒకటి వినటానికి బాగుంది. నిజంగా హత్యలు చేస్తున్నప్పుడు తాము హత్యచేస్తున్న వారు తమ వృత్తినిబధ్ధతో పోలీసుపని చేస్తున్నవారైనప్పుడు ఇలా ఆలోచించి ఎన్నడైనా వారిని కాపాడాలని దయతో ఆలోచించారా ఈ విప్లవం వాళ్ళూ వాళ్ళ విరసం గురువులూ? ఎన్నడూ అనారోగ్యంతో‌నో‌ మరొక కారణంగానో‌ నిస్సహాయంగా ఉన్నవారిని వీళ్ళు దయాదాక్షిణ్యాలు చూపి చంపకుండా వదిలారా? లేదే?

"రాజకీయ సిద్ధాంతంలోనూ, జనక్షేమంకై నడిచే మార్గంలోనూ ఎవరి భావాలు వారివే" అంటూ వరవర రావు గారు కూడా జనక్షేమం‌కోసం నడిచిన వారని సెలవిచ్చారు. ఈ విప్లవమార్గం జనక్షేమం కోసం ఐన పక్షంలో అది ఎటువంటి జనక్షేమ‌ం‌ చెప్పండి? తుపాకీ గొట్టం ద్వారానే వాళ్ళు రాజ్యాధికారం సంపాదించుకోవాలని తాపత్రయ పడుతున్నారు. ఇక్కడ జనం‌ కాని జనక్షేమం ప్రసక్తి కాని లేదు. తమ మార్గంలో నడిచే వారూ, తమ మార్గానికి అడ్డురాని వాళ్ళూ, తమ మార్గానికి అడ్డువచ్చే వాళ్ళూ‌ అని వారి దృష్టిలో జనం మూడు తెగలు. ఆ మూడో రకం‌ జనం, అంటే అడ్డు వచ్చే వాళ్ళ పట్ల వారి సిధ్ధాంతం చెప్పే విధానం అటువంటి వారిని ముళ్ళపొదల్లాగా నరికి పారెయ్యటమే. ఇది సుస్పష్టమే. కర్మ కా వీరి తుపాకీలు వీరికి రాజ్యాధికారాన్నే ఇస్తే జరిగేది ఏమిటి? అప్పుడు అడ్డూ అదుపూ ఉంటుందా వీరికి? అడ్డు చెప్పే సాహసం ఎవరికైనా ఉండటం వీలే‌కాదు కదా? అప్పుడు వీరు రెండవరకం జనం‌ అంటే‌ తమకు వ్యతిరేకులు కాకపోయినా అనుకూలురు కూడా కాని వారి పనీ పడతారు. కేవలం తమకు అనుకూలురైన వారికే‌ బ్రతికే‌ హక్కు ఉంటుంది వారి రాజ్యంలో. ఈవిషయంలో డొంకతిరుగుడు ఏమీ‌ లేదు. కచ్చితంగా అదే నిజం. ఆపుడు వారు ఎవరిపైన ఐనా దయా దాక్షిణ్యమూ చూపుతారా చెప్పండి. నమ్మలేక పోతున్న వారి కోసం ఒక ఉదాహరణ. తియాన్మన్‌ స్క్వేర్‌ వద్ద చైనా విద్యార్థులను కమ్యూనిష్టు చైనా ప్రభుత్వం ఎలా పురుగుల్ని చంపినట్లు చంపి పారేసిందో గుర్తు తెచ్చుకోండి. ముక్కుపచ్చలారని పసివాళ్ళే అని అక్కడి కమ్యూనిష్టు ప్రభుత్వం వా కనికరం ఏమన్నా చూపారా? విప్లవం లేదా కమ్యూనిజం‌ లెక్క ప్రకారం వ్యతిరేకులు అందరూ వర్గశత్రువులు - వావటం తప్ప వారికి మరొక నిష్కృతి లేదు. వారికి మరొక శిక్షలేదు. అక్కడ దయాదాక్షిణ్యాలు లేవు. విచక్షణ అన్న మాట ఊసే లేదు. ఇప్పుడు ఆలోచించండి. ఇటువంటి ఆతతాయి సంస్థలకు చెందిన వ్యక్తులపైన ధర్మం పేర అహింస పేర దయాదాక్షిణ్యాలు చూపటం పాములకు పాలు పోయటం మాత్రమే అవుతుంది కదా.

నాకు వరవర రావు గారితోగాని, కరుణాకర్ గారితో గానీ వ్యక్తిగతంగా పరిచయం లేదు. వ్యక్తిగత రాజకీయ శత్రుత్వ మిత్రత్వాల వంటివేమీ లేవు. కేవలం ప్రస్తుతం ఉన్న పరిస్థితి గురించి నా అభిప్రాయం వ్రాసానంతే.

17, జులై 2020, శుక్రవారం

ఎవరిని పొగడేరో యెందుకు పొగడేరో


ఎవరిని పొగడేరో యెందుకు పొగడేరో
భువిని రాముడొక్కడే పొగడదగిన వాడు
 
కొందరు బంధువులను గొప్పగ పొగడేరు మరి
బందుగుడన రామునంత వాడెవ్వడుండును
కొందరు ధనవంతులను గొప్పగ పొగడేరు కన
నందరి ధనములును నారాము డిచ్చినవే

కొందరు పండితుల గొప్పగ పొగడేరుమరి
యందరి పాండిత్యములు నారాము డిచ్చినవే
కొంద రధికారులను గొప్పగ పొగడేరు మరి
యందరి యధికారములు నారాము డిచ్చినవే

కొందరు గురువులను గొప్పగ పొగడేరు కన
నందరు గురువులును నారాముని యంశలే
కొందరు దేవతలను గొప్పగ పొగడేరు మరి
యందరు దైవతములు నారాముని యంశలే

15, జులై 2020, బుధవారం

ఏమి చెప్ప మందువయ్య భగవంతుడా



ఏమి చెప్ప మందువయ్య భగవంతుడా శ్రీరామునికథ చిత్రమాయె భగవంతుడా
నా మనసిది దాని నెన్ని భగవంతుడా వాడు నావాడని గర్వించు భగవంతుడా

శ్రీమహావిష్ణువేమి భగవంతుడా తనకు చింతలు కడగండ్లేమి భగవంతుడా
రాముడై మనిషివలె భగవంతుడా తాను కోమలికై యేడ్చుటేమి భగవంతుడా

పట్టాభిషేకవేళ భగవంతుడా కైకవచ్చి చెడగొట్టుటేమి భగవంతుడా
పట్టరాని క్రోథమును భగవంతుడా అన్న వంకజూచి యణచితిని భగవంతుడా

దాసపోషకు డేమి భగవంతుడా వనుల దైన్యమును పొందుటేమి భగవంతుడా
కౌసల్యా సుతుడేమి భగవంతుడా తాను కారడవుల నుండుటేమి భగవంతుడా

పంక్తిరథుని కొడుకేమి భగవంతుడా వాడు బన్నములు పడుటేమి భగవంతుడా
పంక్తికంఠు డెవ్వడయ్య భగవంతుడా మాకు వాని తోడ వైరమాయె భగవంతుడా

బంగారులేడి యేమి భగవంతుడా అది ముంగిటికి వచ్చుటేమి భగవంతుడా
చెంగుచెంగున యెగిరి భగవంతుడా అది సీతమ్మను మురిపించెను భగవంతుడా

దనుజుల మాయ యని భగవంతుడా నేను తలబాదుకొన్న వినదాయె భగవంతుడా
తన ముచ్చట చెప్పి వదిన భగవంతుడా విభుని దానిని తెమ్మన్నదో భగవంతుడా

రాకాసుల మాయ యని భగవంతుడా మా రాముడైన యెఱుగడేమి భగవంతుడా
చేకొని కోదండము భగవంతుడా అతడు శీఘ్రముగ పరువెత్తెను భగవంతుడా

అది రాముని చేజిక్కి భగవంతుడా అంత హాసీతా యనుచు జచ్చె భగవంతుడా
వదిన విని భీతి చెంది భగవంతుడా నన్ను పతి వద్దకు పంపుటేమి భగవంతుడా

ఇది యును మాయ యంటె భగవంతుడా తల్లి యెన్ని కారు లరచినది భగవంతుడా
వదిన బాధ చూడ లేక భగవంతుడా నేను పర్ణశాల వీడవలసె భగవంతుడా

దనుజుడా సందుచూచి భగవంతుడా మా తల్లి నపహరించినాడు భగవంతుడా
ఇనకులేశు శోకమో భగవంతుడా చెప్ప నింతిం తనరాదయ్య భగవంతుడా

రావణుడే దొంగయని భగవంతుడా పక్షిరాజు జటాయువు చెప్పె భగవంతుడా
దేవేరి జాడకొఱకు భగవంతుడా అన్ని దిక్కుల గాలించితిమి భగవంతుడా

హనుమంతుడు సీతమ్మను భగవంతుడా తా నరసివచ్చె లంకలోన భగవంతుడా
వననిధి మధ్యలోన భగవంతుడా ఆ స్వర్ణలంక యున్నదాయె భగవంతుడా

కడలికి వారధి కట్టి భగవంతుడా వార్ధి గడచి లంక చేరినాము భగవంతుడా
దుడుకు రావణుని తోడ భగవంతుడా పెద్ద దొమ్మి చేయవలసి వచ్చె భగవంతుడా

తుదకు రావణుని జంపి భగవంతుడా అన్న తొయ్యలిని తిరిగిబడసె భగవంతుడా
ఇదియేమి టయ్యె ఓ‌ భగవంతుడా అన్న కేల నిట్టి కష్టములు భగవంతుడా

దుష్టులను సంహరించి భగవంతుడా అన్న దోర్భలము చాటినాడు భగవంతుడా
కష్టమెల్ల తీరినట్లె భగవంతుడా ఇదే గద్దె నెక్కె రామమూర్తి భగవంతుడా

దానవాంతకుడు హరి భగవంతుడా ఈ దశరథాత్మజు డంట భగవంతుడా
వాని లీల లెన్నగా భగవంతుడా మా వశము కాకుండు నయ్య భగవంతుడా
 

రావణుని పైకి పోవు రామబాణమా


రావణుని పైకి పోవు రామబాణమా వాని
కావరము నణచి హరి ఘనత చాటుమా

వాడు మూడు లోకాలు గెలిచిన వాడైతే నేమి
వాడు శివదేవుడు మెచ్చు నట్టి భక్తుడైతే నేమి
వాడు పది తలలను కలిగినట్టి వాడైతే నేమి
వాడు రామబాణమునకు నేడు పడక తీరునా

వాడు మునుల నెల్ల బాధించు వాడగుట వలన
వాడు వనితలను చెఱబట్టు వాడగుట వలన
వాడు సురల కెల్ల దుస్సహుడగు వాడగుట వలన
వాడు చేసిన తప్పులకు శిక్ష పడక తీరునా

వాడు తన కపజయమే లేదని భావించు వాడు
వాడు తన కెప్పుడు మృతి లేదని భావించు వాడు
వాడు హరి భక్తుల నెల్లప్పుడు బాధించు వాడు
వాడు నే డిపుడు నీ దెబ్బకు పడక తీరునా


14, జులై 2020, మంగళవారం

అంగన్యాస కరన్యాసాలతోనే సహస్రనామస్తోత్రం చదవాలా?


అంగన్యాస కరన్యాసాలతోనే సహస్రనామ స్తోత్రాలు చదవాలా అన్న ప్రశ్న ఒకటి వచ్చింది. దానికి సమాధానంగా నాకు తెలిసినంతవరకూ వ్రాస్తున్నాను.

లలితా సహస్రనామ స్తోత్రమూ విష్ణుసహస్రనామం స్తోత్రమూ‌ వంటివి రెండు విధాలుగా చూడవచ్చును.

మొదటిది అవి స్తోత్రాలు. కాబట్టి సర్వజనపఠనీయాలు, పారాయణీయాలు. స్తోత్రపారాయణంలో అంగన్యాస కరన్యాసాలు అవసరం‌ లేదు.

రెండవది, అవి మాలా మంత్రాలు. కొంత అక్షరపరిమితిని మించి ఉండే‌ మంత్రాలకు మాలా అని సంజ్ఞ. ఉపనయన సంస్కారం పొందిన వారు, గురూపదేశం‌ తీసుకొని ఆయా మంత్రాలను అనుష్ఠానం‌ చేయవచ్చును. అలా అనుష్టానం చేసేవారు మాత్రమే అంగన్యాస కరన్యాసాలతో‌ సహా చేయాలి.

ఉపనయన సంస్కారం బ్రహ్మక్షత్రియవైశ్యవర్ణాలకు విధించబడింది సంప్రదాయంలో. అందుచేత ఆయా వర్ణాలవారు మాత్రం మంత్రోపదేశంగా మాలామంత్రాలను కాని ఇతరమంత్రాలను కాని, ఏమంత్రమైనా సరే‌, గురూపదేశంగా పొందినప్పుడు దానికి ఉద్దిష్టమైన అంగన్యాసకరన్యాసాలతో‌ సహా చేయవలసి ఉంటుంది. గురూపదేశం‌ లేని మంత్రాలను వారు కూడా కేవలం స్తోత్రాలవలెనే‌ (అంగన్యాస కరన్యాసాలు విడచి) పారాయణం చేయవలసి ఉంటుంది.

గురూపదేశంతో‌ మంత్ర దీక్షాస్వీకారం‌ చేసాక మంత్రానుష్టానాన్ని మహాశ్రధ్ధతో నిత్యమూ మిక్కిలి మడీదడీ వంటి నియమాలు పాటిస్తూ, మంత్రాధిష్టాన దేవతకు సాంగోపాంగ పూజాదికాలూ‌ నైవేద్యసమర్పణమూ అత్యంత భక్తిపూర్వకంగా సమర్పిస్తూ చేయవలసి ఉంటుంది. మంత్రం‌ నోటిలో‌ ఉన్నట్లే‌ మంత్రాధిష్ఠాన దైవతం‌ ప్రత్యక్షంగా ఎదుటనే ఉన్నట్లు భావించాలి కాని తదన్యంగా వ్యవహరించరాదు. మంత్రలోపం, శ్రధ్ధాలోపం, భక్తిలోపం వంటివి అనుష్ఠానాన్ని నిష్పలం చేయటమే‌ కాదు లోపతీవ్రతను బట్టి ప్రమాదకరమైన పరిణామాలకు కూడా దారితీస్తాయి కాబట్టి మిక్కిలి అప్రమత్తులై సేవించాలి.

ఇక్కడ మంత్రలోపం అంటే ఒక సంగతి తప్పకుండా చెప్పుకోవాలి. సహస్రనామస్తోత్రాలు చదివే వారు కేవలం అనుష్టుప్పుల నడకను అనుసరించి చదవటమో లేదా రాగతాళాలను పెట్టి పాడాలను చూడటమో చేస్తూ ఆ స్తోత్రాల్లో ఉండే నామాలను సరిగా పోల్చుకొని సుష్ఠువుగా ఉఛ్ఛరించటం లేదు. ఇది చాలా తప్పు. కొన్ని కొన్ని సార్లు ఇటువంటి మంత్రలోపం కారణంగా తప్పుడు నామాలను చదువుతూ‌ ఉంటారు. నామ విభజన సరిగా తెలుసుకోవటం మొట్టమొదటి కర్తవ్యం. ఎవరూ యూ-ట్యూబ్‌లో ఉన్న స్త్రోత్రాలను విని అవి సరిగ్గా ఉన్నాయని భ్రమపడనవసరం లేదు. సాధారణంగా అవి తప్పులతోనే ఉంటున్నాయి.

ఒకరకంగా మంత్రాధికారం లేని వర్ణోపర్ణాల వారే అదృష్టవంతులు. వారికి స్తోత్రపారాయణం చాలు. మిక్కిలి శ్రధ్ధాళువైన వ్యక్తి మంత్రాన్ని మిక్కిలి భక్తితో అంగన్యాసకరన్యాసాదులూ పూజాపునస్కారాలతో సేవిస్తే ఎటువంటి మంచి ఫలితాన్ని పొందటం‌ జరుగుతుందో, మంత్రాధికారం లేని వారు కేవలం భక్తితో‌ స్తోత్రాన్ని పారాయణం చేసి అంతటి ఫలమూ‌ పొందుతారు. ఇందులో ఎంతమాత్రమూ‌ సందేహం అక్కర లేదు.

ఇలా అవకాశం ఉన్నది కదా అని మంత్రాధికారం సంపాదించుకొన్నవారు ఎవరైనా కాని దానిని విడచి కేవలం‌ స్తోత్రంగా పారాయణం చేస్తామంటే‌ అది బధ్ధకమూ‌ అవినయమూ‌గా లెక్కకు వస్తుంది కాని మంచి ఫలితం‌ రానేరాదు.

మంత్రాధికారానికి అవకాశం ఉన్న వర్ణం వారైనా మంత్రాధికారం ఉపదేశం‌గా పొందని మాలామంత్రాలను పారాయణంగా అంగన్యాస కరన్యాసాలు లేకుండా చేయటానికి అభ్యంతరం‌ ఉండదు.

కొన్ని మినహాయింపులు ఎప్పుడూ‌ ఉంటాయి. స్త్రీలు ఎప్పుడూ మాలా మంత్రాలను పారాయణంగానే చేయవచ్చును. ఉపనయన రాహిత్యం కారణంగా వారికి ఉపదేశం ఉండదు కాబట్టి. కొన్ని కొన్ని మంత్రాలను స్త్రీలు ఉపదేశంగా పొందవచ్చును. కాని ఆ ఉపదేశం జపధ్యానాదులకు మాత్రమే కాని అంగన్యాసకరన్యాసాదులతో పూజావిధులకు అవకాశం ఇవ్వదు.

అనారోగ్యవంతులూ, కడువృధ్ధులూ, ప్రయాణకాలంలో అననుకూలతల మధ్యన చిక్కుబడిన వారూ, అశక్తత కారణంగా ఉపదేశం‌ ఉన్నప్పటికీ‌ పారాయణం చేస్తే సరిపోతుంది.

శ్రధ్ధగా మాలామంత్రాలను పారాయణం చేసే వారు కూడా అత్యవసరంగా పారాయణం చేయదలిస్తే మంత్రాధిదేవత ఎప్పుడూ 'సోహ మేకేన శ్లోకేన స్తుత ఏవ నసంశయః' అని ఒక్క శ్లోకం పారాయణం చేసి భక్తిగా నమస్కరించినా చాలు అంటుందని గుర్తించాలి. ఐతే‌ ఇది విధిలేని పరిస్థితుల్లో‌ మాత్రమే‌ పాటించవలసిన పధ్ధతి అని గుర్తించాలి.

13, జులై 2020, సోమవారం

తారకనామము చేయండీ


తారకనామము చేయండీ సంసారసముద్రము దాటండీ
నారాయణుని చేరువిధానము నమ్మకముగ నిదియేనండీ


తీరికూర్చుని కబురులాడుచు తిరుగుచు కాలము గడిపెదరా
నేరము లెంచుచు పొరుగువారిలో నిత్యము కాలము గడిపెదరా
చేరి కొలిచినను మెచ్చని కుజనుల సేవల కాలము గడిపెదరా
ఊరక ధనములు ప్రోవులుపెట్టెడు నూహల కాలము గడిపెదరా

హరి సర్వాత్మకు నచ్యుతు నభవుని యంతరంగమున తలచండి
సురసేవితుడగు శ్రీరఘురాముని శోభనమూర్తిని తలచండి
పురుషోత్తముని భక్తులందరకు మోక్షము కలదని తలచండి
మరలపుట్టుట మరలచచ్చుటను మాటే వలదని తలచండి

యువకులు వృద్ధులు నువిదలు పురుషుల కుచితం బిదియని తెలియండి
అవిరళముగ హరి నామము చేయుట కందరర్హులని తెలియండి
పవళులు రేలును తారకనామము వదలరాదని తెలియండి
శివుడీ తారకనామము నెప్పుడు చేయుచుండునని తెలియండి

శ్రీవైకుంఠుని చిత్తశుధ్ధితో సేవించుటయే


శ్రీవైకుంఠుని చిత్తశుధ్ధితో సేవించుటయే పరమానందము
దేవదేవుని దివ్యత్త్వమును భావించుటయే‌ పరమానందము

హరి సర్వాత్మకు నచ్యుతు నభవుని యంతర్యామిని శ్రీకరుని
నరనాయకుని సురనాయకుని వరదాయకుని రాఘవుని
కరుణామయుని వారిజలోచను పరమోదారు గుణాకరుని
ధరణీతనయాహృదయేశ్వరుని దశరథనందను రాముని

దానవవిషవనదావానలుని ధర్మస్వరూపుని దాంతుని
మానవనాథకులాథిపు నిర్మము మరియాదాపురుషోత్తముని
జ్ఞానానందమయాకృతి నీశ్వరు సజ్జనగణసంసేవితుని
ప్రాణాధికుని పరమయోగిగణభావితమూర్తిని రాముని

కాలకాలవనజాసనసన్నుత కళ్యాణప్రదమూర్తిని
కాలాతీతుని మాయామానుషకమనీయశుభమూర్తిని
పాలితాఖిలభువనజాలుని పతితపావనమూర్తిని
నీలగగనఘననిరుపమసుందర నిర్మలమూర్తిని రాముని




12, జులై 2020, ఆదివారం

నలుగురు మెచ్చితే నాకేమీ



నలుగురు మెచ్చితే నాకేమీ ఆ
నలుగురు నవ్వితే నాకేమీ

కలనైన రాముని ఘనతనే పాడెద నీ
యిలమీద రామునే యెంచి పొగడెద
వలచి నా రామునే భావించుచుందును
తిలకించువా రెట్లు తలచితే నేమి

స్తవనీయుడగు రామచంద్రుని విడిచి నే
నవికోరి యివికోరి యన్యుల పొగిడు
నవినీతుడ కానేర  నది నా విధానము
భువిని నా కితరుల బుధ్ధితో పనేమి

హరి భక్తి నాయదృష్ట మని నా నమ్మకము
పరులు వేరుగ నెట్లు భావించ నేమి
తిరమైన నా బత్తి దేవుడే యెరుగు
యెరుకలేని వారెట్టు లెరిగిన నేమి


దినదినము దిగులాయె దీనత మెండాయె



దినదినము దిగులాయె దీనత మెండాయె
నను కరుణించని ఘనుడవు నీవాయె

తనువు దుర్బలమాయె దానికి వయసైపోయె
మనసేమో చెడిపోయె మరి యది యలసిపోయె
మనికి దుస్సహమాయె మహాప్రభో రామ
ఉనికి యింక చాలునీ యుపాధికి నననాయె

మొదట బుధ్ధి లేదాయె ముందుచూపు లేదాయె
తుదిని చెడ్డ బ్రతుకాయె మెదుకు సహించదాయె
ముదిమి చాల బరువాయె మ్రొక్కెదను రామ
యిదిగో యీబ్రతుకు చాలు నింక నన్నటులాయె

తలపులన్ని నీవాయె తదితరములు చేదాయె
కలల నైన నీవాయె కడు హితుడ వైతి వాయె
పలుకు లన్ని నీకాయె పట్టాభిరామ
వలపు లేదైహికముల పైన నన్నటులాయె

రవిచంద్రవిలోచన రామ పాహి


రవిచంద్రవిలోచన రామ పాహి భక్త
భవపాశవిమోచన పాహి పాహి

కాలము కబళించరాని ఘనకీర్తి కలవాడ
మేలైన గుణములు మెండుగా గలవాడ
నేలకు దిగివచ్చిన నీలమేఘశ్యాముడ
ఏలుకోవయ్య వేగ ఇందీవరాక్షుడ

రావణు నణచిన రణనీతికోవిదుడ
భూవలయపాలకుడ పురుషపుంగవుడ
మా వలని తప్పులను మన్నించెడు వాడ
కావవయ్య వేగమె కరుణాసముద్రుడ

సీతాసమేతుడ చిన్మయాకారుడ
ప్రీతి భక్తకోటి నేలు వీరరాఘవుడ
చేతులెత్తి మ్రొక్కేము చిత్తజగురుడ
ఏతీరున నైన రక్షించవలయు నయ్య


9, జులై 2020, గురువారం

ఇదె వచ్చె నిదె వచ్చె నీ మాయజింక


ఇదె వచ్చె నిదె వచ్చె నీ మాయజింక
పదపద దాని వెంటబడ వలయు నింక

ఈ మాయలేడితో నిదే మొదలాయె
రామనాటకంబు నందు రావణవధాంకం
శ్రీమహిళామణి లంక చేరగ మొదలౌను
తామసుని పతనము త్వరపడవయ్య

దేవకార్యము దీర్చ దిగివచ్చినావు
దేవదేవుడ వీవు దివిజులందరును
నీవంక జూచుచు నిలచియున్నారు
లేవయ్య పోవయ్య లేడి వెంబడి

రావణుడై యున్నది నీవాకిట నే
కావలి యుండు జయుడు కాదటయ్యా
నీవానిపై కరుణ నిను నరునిగ జేసె
వేవేగ రమ్మనుచు పిలిచెరా వాడు


8, జులై 2020, బుధవారం

రాజాధిరాజు శ్రీరామచంద్ర

రాజాధిరాజు శ్రీరామచంద్ర సుర
రాజపూజితాంఘ్రియుగ్మ రామచంద్ర

రమణీయగుణసాంద్ర రామచంద్ర శ్రీ
రమానాయక హరి రామచంద్ర
రమణీయచారిత్ర్య రామచంద్ర శూ
రమణిగణసమర్చిత రామచంద్ర

కామితార్ధదాయక రామచంద్ర శ్రీ
భూమిజామనోహర రామచంద్ర
స్వామి భక్తపాలక రామచంద్ర సు
శ్యామశుభకోమలాంగ రామచంద్ర

సామీరీనుత శ్రీరామచంద్ర సం
గ్రామనిహతరావణ రామచంద్ర
క్షేమసంధాయక రామచంద్ర మా
యామానుషసువేష రామచంద్ర

5, జులై 2020, ఆదివారం

లేడు లేడంటే రాముడు లేకపోయేనా ఖలులు

లేడు లేడంటే రాముడు లేకపోయేనా ఖలులు
కాడు కాడంటే దేవుడు కాకపోయేనా

వాడు భక్తజనవత్సలడై పరగుచుండు వాడు
వాడు శిష్టజనరక్షకుడై వరలుచుండు వాడు
వాడు దానవాంతకు డనబడుచుండు వాడు
వాడు వెలసి యున్నా డిదే భవతారకుడై

వాడు హరి యన్న పేరుగల వాడాప్తకాముడు
వాడు జగములను సృజియించి పాలించు వాడు
వాడు జీవుల హృత్పద్మముల వసియించు వాడు
వాడు మనవాడై యున్నాడు పరమాప్తుడై

వాడు మన బాగు కోసమై ప్రభవించినాడు
వాడు సీతమ్మ తల్లితో వచ్చియున్నాడు
వాడు సర్వజగద్వంద్యుడై వర్ధిల్లు వాడు
వాడు సనాతను డైన మనవాడు రాముడు

అహరహమును మే మర్చింతుమయా


అహరహమును మే మర్చింతుమయా
ఇహపరములు మా కితడే‌ కాన

చేతల పలుకుల చిత్తమునందున
భూతలనాథుని పుణ్యచరిత్రుని
వీతిహోత్రువలె వెలిగెడు వానిని
సీతాపతినే చేతోముదముగ

హరి వీడే నని యంతరంగమున
మరువక రాముని మహిత చరితుని
కరుణామయుని కలుషాంతకుని
పరిపరి విధముల బాగొప్ప సదా

అత్మీయుని హరి నచ్యుతు దిట్టు దు
రాత్ముల మాటల కలుగక పర
మాత్ముడు రామున కనురాగముతో
నాత్మసమర్పణ మను యజ్ఞంబున

4, జులై 2020, శనివారం

గోరంత పుణ్యము కొండంత పాపము


గోరంత పుణ్యము కొండంత పాపము
పేరుగొప్ప నరజన్మ పెద్దమోసము

గహనమైన సంగతుల గజిబిజి శాస్త్రాల్లో
విహరించగలేని వాడి కహరహము పాపము
సహనముతో పుణ్యక్రియాచరణుడై యున్నా
యిహమందున పాపస్పర్శ యెందు లేకుండును

పులులు గోవులను తిని పొందవుగా పాపము
తెలియక ఒక మనిషి తింటే దేవుడా పాపమే
పలుచనైన పుణ్యముల ఫలములా స్వల్పము
తెలియని పాపాల వలని తీవ్రశిక్ష లధికము

భూమిని పాపపుణ్యముల గోల పడనేల
రామచంద్రు నమ్ముకొన్న రక్షకలుగును
మీమీ బుధ్ధులను వాడు మిగుల నేర్పుగ నడిపి
స్వామి విడిపించు మిమ్ము జన్మచక్రము నుండి

ప్రభవించుటే తప్పు వసుధపై నరుడు


ప్రభవించుటే తప్పు వసుధపై నరుడు
విభుని మరచి యుంట వేరొక్క తప్పు

సిరులకై యాశించి చెడుటొక్క తప్పు
చిరకాల ముండునా చెడిపోక తను వని
గురుతించక ఎగిరి కూలుట తప్పు
నరహరీ చూపవే కరుణ యిసుమంత

ఆలుబిడ్డల కంగలార్చుట తప్పు
మేలైన సౌఖ్యాలు మేని కెంతద్దినా
కాలమోర్వమి తెలియజాలమి తప్పు
కాలాంబుదశ్యామ కరుణించ వయ్య

శ్రీరామనామము చింతించుమన్న
ప్రారబ్ధమున జేసి పతితుడై తాను
చేరి పరుల సేవ చేయుట తప్పు
కారుణ్యమూర్తివై కాపాడ వయ్య


3, జులై 2020, శుక్రవారం

దగాకోర్లూ‌ మోసగాళ్ళూ అందరూ ఉన్నత కులజులేనా?

మిత్రులు లక్కాకుల వెంకట రాజారావు గారి సుజన-సృజన బ్లాగులో జ్యోతిషానికి సంబంధించిన రసవత్తరమైన చర్చ ఒకటి నడుస్తున్నది. ఆసందర్భాన్ని పురస్కరించుకొని, నా అభిప్రాయాలను తెలియజేయటానికి ప్రయత్నిస్తున్నాను.

ఇక్కడ చర్చకోసం వైద్యరంగాన్ని కూడా కలిపి ప్రసంగిస్తున్నాను. అంతమాత్రం చేత ఆ వైద్యరంగం పట్ల నాకేదో ద్వేషం వంటిదేదో ఉందనో లేదా జ్యోతిషం పట్ల నాకు మితిమీరిన ప్రేమ ఉందనో భావించవద్దని మనవి.

రాజారావు గారు ఒక మాట అన్నారు, నమ్మకమే జ్యోస్యుల వ్యాపార పెట్టుబడి అని. వారి భావాన్ని ప్రత్యేకించి విశ్లేషించి చెప్పనవసరం లేదు. వారు సూటిగానే చెప్పారు. ఒకముక్క అడుతున్నాను. మనం హాస్పిటళ్ళచుట్టూ తిరుగుతున్నాం. ఒకప్పుడు ఇంత లేదు. ఇప్పుడు అంతా కార్పొరేట్ వైద్యం. ఫామిలీ డాక్టర్ అన్న పధ్ధతి లేకుండా పోయింది. ప్రతి చిన్న సమస్యకు కూడా స్పెషలిష్టు దగ్గరకు పరుగెడుతున్నాం. మళ్ళా కార్పొరేట్ హాస్పిటళ్ళలో వైద్యం పేర దోపిడీ జరుగుతోందనీ నిత్యం గోల పెడుతూనే ఉన్నాం. మరి ఆ దోపిడీ‌కి కారణం ఏమిటి? మన నమ్మకమే పెట్టుబడిగా ఆ హాస్పిటళ్ళు దోపిడీ చేయటం లేదా? అవసరం లేని టెష్టులు చాలా అవసరం అని ఆ హాస్పిటళ్ళలో డాక్టర్లు మనని నమ్మించటం లేదా? అవసరం ఏమాత్రం లేకపోయిన సందర్భాల్లో కూడా అతితరచుగా ఈమధ్య పేషంట్లని ఈ డాక్టర్ల చేత అక్షరాలా చెప్పించి మరీ ఐసీయూల్లో కుక్కటం లేదా ఈ కార్పొరేట్ హాస్పిటళ్ళు?  కాని మనం తొందరగా నమ్మకమే డాక్టర్ల వ్యాపార పెట్టుబడి  అనో నమ్మకమే హాస్పిటళ్ళ వ్యాపార పెట్టుబడి అనో‌ ఎందుకని అనటం లేదూ? ఎందుకంటే ఆధునిక విజ్ఞానం ఈ డాక్టర్లు వాడుతున్నారు కాబట్టీ ప్రాచీనమై తుప్పుపట్టిన జోస్యాన్ని జ్యోతిష్యులు వాడుతున్నారు కాబట్టీ కదా?

విన్నకోట నరసింహారావు గారు అన్నట్లు అంతావ్యాపారమయం ఐపోయింది. అలా జ్యోతిషాది పాత శాస్త్రాలే కాదు అధినిక వైద్యాది విజ్ఞాన శాస్త్రాలూ నేడు వ్యాపారమయం ఐపోయాయి. నిజం.

చాలామంది జ్యోతిషాన్నిఆధునిక వైద్యం ఎదురుగా నిల్చోబెట్టటాన్ని హర్షించలేక పోవచ్చును. కాని మనం ఏమనుకుంటున్నాం అన్నది అటుంచి జ్యోతిషం ఒక వేదాంగం. ఒక శాస్త్రం. మనం నమ్మినా నమ్మకపోయినా ఏశాస్త్రమూ‌ కూడా శాస్త్రం కాక పోదు.

పొట్టకూటి వేషగాళ్ళు చేరి భ్రష్టుపట్టించనిది ఏదన్నా శాస్త్రం ఉందా? అది సంప్రదాయిక వైదిక శాస్త్రాల్లో ఐనా, ఆధునిక విజ్ఞానశాస్త్రాల్లో ఐనా? అందుకే ఇక్కడ పోలికతెచ్చి విశ్లేషించి చూపటం. దయచేసి అర్ధం చేసుకోగలరు.

ఆధునికవైద్యశాస్త్రాన్ని సొమ్ములు సంపాదించుకొనేందుకే ఎక్కువగా వాడుకుంటున్నారా లేదా నేటి డాక్టర్లలో హెచ్చుమంది? అంత మాత్రాన ఆధునికవైద్యం బూటకం అని మనం అనలేం‌ కదా. కాని సుళువుగా పొట్టకూటి జోస్యులను చూపి జ్యోతిషశాస్త్రం బూటకం అనటంలో అంత న్యాయం లేదేమో అన్నది ఆలోచించాలి.

ఇద్దరు మంచి డాక్టర్లే ఐనా చేసే చికిత్సలో పైకి ఐనా తేడా ఉంటోంది కదా, అది మనం అర్ధం చేసుకుంటున్నాం‌ కదా సహజమే అని? కాని ఇద్దరు జోస్యులు విభిన్నమైన ఫలితాలు చెప్పినంత మాత్రాన అదిదో చూడండి జ్యోతిషం శాస్త్రం కాదు బూటకం అని వేరే ఋజువు కావాలా అనటంలో తొందరపాటుదనం ఉందేమో‌ అని కూడా ఆలోచించాలి.

ఆవలివాడి భయం అన్నది సొమ్ము చేసుకుందుకు లేదా భయపెట్టి మరీ ఆ భయం నుండి లాభపడటానికి ప్రయత్నించటం అన్నది తప్పుడు మనుషుల ఆలోచనావిధానం. అటువంటి విధానంలో జోస్యులు దిగ్విజయంగా బ్రతగ్గలిగితే వారిలో అత్యధికులు కోటీశ్వరుగా ఉండాలి. కాని అత్యధికులు ఏదో‌ పొట్టకూటికోసం జ్యోతిషాన్ని నమ్ముకొనే వారిగా ఉన్నారన్నది గమనించ దగిన సంగతి. అదే సమయంలో విజ్ఞులు మరొక విషయం గమనించగలరు. నేటి డాక్టర్లలో హెచ్చుమంది రోగుల భయపెట్టి మరీ‌ ధనసంపాదన చేస్తున్నారు. వారిలో అత్యధికులు దినదిన గండంగా యేమీ‌ బ్రతకటం లేదు.

భవిష్యత్తును ముందుగా తెలుసుకోవాలనుకోవడం దురాశ . ఈ‌ మాట తప్పక ఒప్పుకోవాలి. ఎంతో నిజం. ఒక జోస్యుడి దగ్గరకు వెళ్ళే సగటుమనిషి రాబోయే కాలంలో అన్నా కాస్త పరిస్థితులు మెరుగుపడతాయా అన్న ఆశతో వెళ్తున్నాడు కాని, రేపు ఎన్నిమేడలు కట్టబోతున్నానో అన్న దురాశతో వెళ్ళటం లేదు. నిజానికి అంతా బాగున్నప్పుడు ఎవడూ వైద్యుడి దగ్గరకూ వెళ్ళడు జోస్యుడి దగ్గరకూ వెళ్ళడు!

జోస్యుడిని ఎంత త్వరగా పరిస్థితులు మెరుగౌతాయీ అని అడుగుతాడు సగటుమనిషి. వాడే డాక్టరును జబ్బు ఎంత తొందరగా నయం అవుతుందీ అనీ అడుగుతున్నాడు. డాక్టరును అడిగినప్పుడు అది ఆశగానూ జోస్యుడిని అడిగినప్పుడు దురాశగానూ చెప్పవచ్చునా? అలా చూడటం సబబు కాదేమో అని యోచించ వలసింది.

రాజారావు గారు జ్యోతిష్యం నమ్మడం , కార్తాంతికులు నమ్మబలకడం మోసం ,దగా అని నిష్కర్ష చేసారు. నిజానికి ఎవరన్నా అసత్యపూర్వకంగా మరొకరిని నమ్మబలకటం ఎప్పుడూ దగా క్రిందకే వస్తుంది. ఆనమ్మబలికే వాడు కార్తాంతికుడైతే మాత్రమే కాదు అలాంటి వాడు కార్పొరేట్ హాస్పిటల్ డాక్టర్ ఐనా సరే మనం మోసం దగా అనే అనాలి.

అన్నిరంగాల్లోనూ ఈ మోసం దగా ఉన్నదని మనకు తెలుసును. పిల్లలను మళ్ళా కార్పొరేట్ బళ్ళలో వేస్తున్నాం. వాళ్ళు లక్షల్లో ఫీజులు గుంజుతున్నారు. కాని అరకొర చదువులు చెప్తున్నారని తల్లిదండ్రులు అంటున్నారు. అప్పుడు ఆ కార్పొరేట్ విద్యావ్యవస్థనిండా మోసం దగా ఉన్నదని మనం ఒప్పుకోవాలా లేదా?

నమ్మి ఓట్లు వేసాక రాజకీయవ్యవస్థలో జనానికి అందుతున్నది సాధారణంగా నమ్మకద్రోహాలే. అక్కడా మోసం దగా తప్ప మరేమీ లేదు. అదీ మనం ఒప్పుకుంటున్నాం.

ఇన్ని చోట్ల, మరిన్ని చోట్ల, నిజానికి అన్ని చోట్లా మోసం దగా వంటివి మాత్రమే చూస్తూనే కేవలం‌ పొట్టకూటి జోస్యులను మాత్రమే మోసగాళ్ళు దగాకోర్లు అని శపిస్తూ జ్యోతిషం అంతా హంబగ్ అనేయటం ఏమంత న్యాయమైన పనో మనం ఆలోచించవలసి ఉంది తప్పకుండా.

ఇంక ముగించే ముందు ఒక్క సంగతి మనవి చేయదలచుకున్నాను. అందరున్నత కులజులే అని తమ యీ టపాకు పేరు పెట్టారు రాజారావు గారు. అంత సబబుగా అనిపించలేదు నాకు. అలాగని వారి అభీష్టాన్ని అధిక్షేపించటం లేదు. వినయంగా ఒక్క మాట అడుగుతున్నాను.  రాజారావు గారు తమ పద్యాన్ని ముగిస్తూ "అంద రున్నత కులజులే , అందులోను శాస్త్ర పాండితీ ధిషణులే ,  చదువు నింత ఘనముగా వాడుచున్నారు కడుపు కొఱకు" అన్నారు. జ్యోతిర్విద్య కేవలం అగ్రవర్ణాలకే పరిమితం ఐనది కాదండీ. ఒకప్పుడు అలా ఉండేది అని అనుకున్నా, నేడు అందరికీ అందుబాటులోనే ఉంది. ఎందరో అగ్రవర్ణాలకు చెందని వారూ జ్యోతిష్యపండితులు ఉండవచ్చును. కేవలం అగ్రవర్ణాలవారు మోసం దగా కోసం జ్యోతిషం అనే‌ నాటకం ఆడుతున్నారని అని నిందించటం అంత ఉచితం అంటారా?  నేటి సర్వరంగాల్లోనూ నడుస్తున్న మోసాలూ దగాలూ కేవలం అగ్రవర్ణాలే చేస్తున్నాయంటే చెప్పగలగింది ఇంకేమో లేదు. కాని అది మానవుల దురాశ కారణంగా నడుస్తున్న వ్యవహారం అని అందరకూ తెలిసిందే. కేవలం అగ్రవర్ణాలను మాత్రమే నిందించటం అంత హర్షించలేక పోతున్నాను మన్నించాలి.

2, జులై 2020, గురువారం

రాముని భజన చేయవె





రాముని భజన చేయవె సీతారాముని భజన చేయవె
కామితవరదుని మనసా కరుణాధాముని భజన చేయవె


సుజనుల బ్రోవగ నరుడై దశరథసుతుడై వెలసిన దేవుని
కుజనుల నణచి ధర్మము నిలిపిన గుణశీలుడు మన దేవుని
విజయ శీలుడై ధరపై వెలసిన వీరరాఘవ దేవుని
ప్రజలను బిడ్డల వలెపాలించిన భక్తవరదుడగు దేవుని


పదుగురి మధ్యను నిలచి యాడుచు పాడుచు చక్కగ వేడుచు
సదమల చిత్తముతో‌ పురుషోత్తము సత్కీర్తిని కొనియాడుచు
విదులను గూడి వివిధరీతులను వివరించుచు హరి సత్కథలు
మదిలో రాముం డొక్కని దక్క మరి యన్యులను తలపకను


నడచుచు కుడుచుచు ముడికొను పనులను నరుల తోడ భాషించుచును
పడకను చేరుచు రాముని నామము పరమభక్తితో‌ పలుకుచును
విడచుచు లౌకికములపై బుధ్ధిని విడువక రాముని పదములను
తడయక సర్వవిధంబుల రాముని తత్త్వమునే చింతించుచును 


1, జులై 2020, బుధవారం

ఘనుడు రాముడు మనవాడు



ఘనుడు రాముడు మనవాడు కామితవరదుడు మనవాడు
మనవాడండీ‌ మనవాడు మహితాత్ముడు హరి మనవాడు

శ్రీరఘురాముడు మనవాడు హరి సీతారాముడు మనవాడు
సారసనేత్రుడు మనవాడు హరి సాకేతపతి మనవాడు
ధీరుడు శాంతుడు మనవాడు హరి దేవదేవుడు మనవాడు
మారజనకుడు మనవాడు హరి మంగళకరుడు మనవాడు

సర్వమోహనుడు మనవాడు హరి శాంతస్వభావుడు మనవాడు
సర్వాధికుడు మనవాడు హరి జ్ఞానగమ్యుడు మనవాడు
సర్వేశ్వరుడు మనవాడు హరి సర్వజగత్పతి మనవాడు
సర్వవంద్యుడు మనవాడు హరి సర్వమంగళుడు మనవాడు

కరుణాసింధువు మనవాడు హరి కమలానాథుడు మనవాడు
పరమపురుషుడు మనవాడు హరి భక్తవత్సలుడు మనవాడు
విరించివినుతుడు మనవాడు హరి వీరరాఘవుడు మనవాడు
పరమశుభదుడు మనవాడు హరి భవతారకుడు మనవాడు