14, జులై 2020, మంగళవారం

అంగన్యాస కరన్యాసాలతోనే సహస్రనామస్తోత్రం చదవాలా?


అంగన్యాస కరన్యాసాలతోనే సహస్రనామ స్తోత్రాలు చదవాలా అన్న ప్రశ్న ఒకటి వచ్చింది. దానికి సమాధానంగా నాకు తెలిసినంతవరకూ వ్రాస్తున్నాను.

లలితా సహస్రనామ స్తోత్రమూ విష్ణుసహస్రనామం స్తోత్రమూ‌ వంటివి రెండు విధాలుగా చూడవచ్చును.

మొదటిది అవి స్తోత్రాలు. కాబట్టి సర్వజనపఠనీయాలు, పారాయణీయాలు. స్తోత్రపారాయణంలో అంగన్యాస కరన్యాసాలు అవసరం‌ లేదు.

రెండవది, అవి మాలా మంత్రాలు. కొంత అక్షరపరిమితిని మించి ఉండే‌ మంత్రాలకు మాలా అని సంజ్ఞ. ఉపనయన సంస్కారం పొందిన వారు, గురూపదేశం‌ తీసుకొని ఆయా మంత్రాలను అనుష్ఠానం‌ చేయవచ్చును. అలా అనుష్టానం చేసేవారు మాత్రమే అంగన్యాస కరన్యాసాలతో‌ సహా చేయాలి.

ఉపనయన సంస్కారం బ్రహ్మక్షత్రియవైశ్యవర్ణాలకు విధించబడింది సంప్రదాయంలో. అందుచేత ఆయా వర్ణాలవారు మాత్రం మంత్రోపదేశంగా మాలామంత్రాలను కాని ఇతరమంత్రాలను కాని, ఏమంత్రమైనా సరే‌, గురూపదేశంగా పొందినప్పుడు దానికి ఉద్దిష్టమైన అంగన్యాసకరన్యాసాలతో‌ సహా చేయవలసి ఉంటుంది. గురూపదేశం‌ లేని మంత్రాలను వారు కూడా కేవలం స్తోత్రాలవలెనే‌ (అంగన్యాస కరన్యాసాలు విడచి) పారాయణం చేయవలసి ఉంటుంది.

గురూపదేశంతో‌ మంత్ర దీక్షాస్వీకారం‌ చేసాక మంత్రానుష్టానాన్ని మహాశ్రధ్ధతో నిత్యమూ మిక్కిలి మడీదడీ వంటి నియమాలు పాటిస్తూ, మంత్రాధిష్టాన దేవతకు సాంగోపాంగ పూజాదికాలూ‌ నైవేద్యసమర్పణమూ అత్యంత భక్తిపూర్వకంగా సమర్పిస్తూ చేయవలసి ఉంటుంది. మంత్రం‌ నోటిలో‌ ఉన్నట్లే‌ మంత్రాధిష్ఠాన దైవతం‌ ప్రత్యక్షంగా ఎదుటనే ఉన్నట్లు భావించాలి కాని తదన్యంగా వ్యవహరించరాదు. మంత్రలోపం, శ్రధ్ధాలోపం, భక్తిలోపం వంటివి అనుష్ఠానాన్ని నిష్పలం చేయటమే‌ కాదు లోపతీవ్రతను బట్టి ప్రమాదకరమైన పరిణామాలకు కూడా దారితీస్తాయి కాబట్టి మిక్కిలి అప్రమత్తులై సేవించాలి.

ఇక్కడ మంత్రలోపం అంటే ఒక సంగతి తప్పకుండా చెప్పుకోవాలి. సహస్రనామస్తోత్రాలు చదివే వారు కేవలం అనుష్టుప్పుల నడకను అనుసరించి చదవటమో లేదా రాగతాళాలను పెట్టి పాడాలను చూడటమో చేస్తూ ఆ స్తోత్రాల్లో ఉండే నామాలను సరిగా పోల్చుకొని సుష్ఠువుగా ఉఛ్ఛరించటం లేదు. ఇది చాలా తప్పు. కొన్ని కొన్ని సార్లు ఇటువంటి మంత్రలోపం కారణంగా తప్పుడు నామాలను చదువుతూ‌ ఉంటారు. నామ విభజన సరిగా తెలుసుకోవటం మొట్టమొదటి కర్తవ్యం. ఎవరూ యూ-ట్యూబ్‌లో ఉన్న స్త్రోత్రాలను విని అవి సరిగ్గా ఉన్నాయని భ్రమపడనవసరం లేదు. సాధారణంగా అవి తప్పులతోనే ఉంటున్నాయి.

ఒకరకంగా మంత్రాధికారం లేని వర్ణోపర్ణాల వారే అదృష్టవంతులు. వారికి స్తోత్రపారాయణం చాలు. మిక్కిలి శ్రధ్ధాళువైన వ్యక్తి మంత్రాన్ని మిక్కిలి భక్తితో అంగన్యాసకరన్యాసాదులూ పూజాపునస్కారాలతో సేవిస్తే ఎటువంటి మంచి ఫలితాన్ని పొందటం‌ జరుగుతుందో, మంత్రాధికారం లేని వారు కేవలం భక్తితో‌ స్తోత్రాన్ని పారాయణం చేసి అంతటి ఫలమూ‌ పొందుతారు. ఇందులో ఎంతమాత్రమూ‌ సందేహం అక్కర లేదు.

ఇలా అవకాశం ఉన్నది కదా అని మంత్రాధికారం సంపాదించుకొన్నవారు ఎవరైనా కాని దానిని విడచి కేవలం‌ స్తోత్రంగా పారాయణం చేస్తామంటే‌ అది బధ్ధకమూ‌ అవినయమూ‌గా లెక్కకు వస్తుంది కాని మంచి ఫలితం‌ రానేరాదు.

మంత్రాధికారానికి అవకాశం ఉన్న వర్ణం వారైనా మంత్రాధికారం ఉపదేశం‌గా పొందని మాలామంత్రాలను పారాయణంగా అంగన్యాస కరన్యాసాలు లేకుండా చేయటానికి అభ్యంతరం‌ ఉండదు.

కొన్ని మినహాయింపులు ఎప్పుడూ‌ ఉంటాయి. స్త్రీలు ఎప్పుడూ మాలా మంత్రాలను పారాయణంగానే చేయవచ్చును. ఉపనయన రాహిత్యం కారణంగా వారికి ఉపదేశం ఉండదు కాబట్టి. కొన్ని కొన్ని మంత్రాలను స్త్రీలు ఉపదేశంగా పొందవచ్చును. కాని ఆ ఉపదేశం జపధ్యానాదులకు మాత్రమే కాని అంగన్యాసకరన్యాసాదులతో పూజావిధులకు అవకాశం ఇవ్వదు.

అనారోగ్యవంతులూ, కడువృధ్ధులూ, ప్రయాణకాలంలో అననుకూలతల మధ్యన చిక్కుబడిన వారూ, అశక్తత కారణంగా ఉపదేశం‌ ఉన్నప్పటికీ‌ పారాయణం చేస్తే సరిపోతుంది.

శ్రధ్ధగా మాలామంత్రాలను పారాయణం చేసే వారు కూడా అత్యవసరంగా పారాయణం చేయదలిస్తే మంత్రాధిదేవత ఎప్పుడూ 'సోహ మేకేన శ్లోకేన స్తుత ఏవ నసంశయః' అని ఒక్క శ్లోకం పారాయణం చేసి భక్తిగా నమస్కరించినా చాలు అంటుందని గుర్తించాలి. ఐతే‌ ఇది విధిలేని పరిస్థితుల్లో‌ మాత్రమే‌ పాటించవలసిన పధ్ధతి అని గుర్తించాలి.