14, జులై 2013, ఆదివారం

తెలుగు పద్యం‌ అంటే జనం ఎందుకు పారిపోతున్నారు?

తెలుగు పద్యం‌ అంటే జనం ఎందుకు పారిపోతున్నారు?

ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న.

అబ్బే, అలాంటి దేమీ‌ లేదూ.  తెలుగు పద్యానికి బ్రహ్మాండమైన ఆదరణ ఉందీ,  జనం‌ ఎగబడి తెలుగు పద్యాలు చదివి సంతోషిస్తున్నారూ అని యెవరైనా అంటే వాళ్ళు అయితే వంచన చేస్తున్నారనైనా అనుకోవాలి లేదా ఆత్మవంచన చేసుకుంటున్నారనైనా అనుకోవాలి.

తెలుగు బ్లాగుల్లో‌ నచ్చిన టపాల మీద కామెంట్లు వేసేది కూడా సాటి తెలుగు బ్లాగర్లే అన్నది జగమెరిగిన సత్యం.  అలాగే తెలుగు బ్లాగుల్లో పద్యాలు వ్రాసే వాటిమీద చర్చించే ఆసక్తి గల వాళ్ళు కొందరున్నా,  తదితరులెవరూ పద్యాల జోలికి పెద్దగా పోవటం లేదన్నదీ‌ మరొక సత్యం. ఇప్పటికీ తెలుగువాళ్ళలో చాలా మందికి బ్లాగులు చూడటం అలవాటు లేదు.  ఈ సోషల్ నెట్ వర్కింగ్ హడావుడిలో బ్లాగుల పాత్ర పెద్దగా ఉన్నట్లు తోచదు.  అందుచేత యీ వ్యాసం బ్లాగులోకంలో పద్యాలకు మాత్రమే సంబంధించినది అని పొరబడ వద్దని విజ్ఞప్తి.  సరే, విషయంలోకి వద్దాం.

ఒకప్పుడు సంస్కృతభాష మాత్రమే కావ్యాలు వ్రాయటానికి తగిన మాధ్యమం అనుకునే వారు.  అయితే‌ కాల క్రమేణా దేశీయ భాషల్లోనూ కావ్యాలు రావటం మొదలయింది.

కన్నడంలో పావులూరి మల్లన అనే ఒక తెలుగు కవి మహాభారతకథను ఒక గ్రంథంగా రచించాడు.  ఆయన జైనుడు కాబట్టి ఆ గ్రంథంలో అందరూ జైనులు. పాండవులు మహాశ్వేత భక్తులు ఇత్యాది. ఆర్షమతానికి జైనం సవాలు విసరటం ఒక కారణంగా, దేశభాషలో మహాభారతాన్ని అందించాలని నన్నయభట్టారకులవారి ప్రయత్నం మెదలయింది.  అయితే నాటి చదువరులు పూర్తి దేశభాషాకవిత్వన్ని మెచ్చే పరిస్థితి లేదు కాబట్టి చాకచక్యంగా తెలుగు సంస్కృతాల మిశ్రమ భాషలో అందంగా నన్నయ గారు వ్రాసారు.  ఒక పద్యం చూడండి ఉదాహరణకు:

మ. వివిధోత్తుంగ తరంగఘట్టన చలద్వేలావనైలావలీ
లవలీలుంగలవంగసంగత లతాలాస్యంబు లీక్షించుచుం
ధవళాక్షుల్ సని కాంచిరంత నెదుటం దత్తీరదేశంబునం
దవదాతాంబుజ ఫేనపుంజనిభు నయ్యశ్వోత్తమున్ దవ్వులన్

మీరు తెలుగువారై ఉండి తెలుగుభాషలో మంచి పాండిత్యం ఉన్నవారై ఉంటే ఈ‌పద్యం అర్థం అవుతుందా?

ఎంతమాత్రం కాదు. ఈ‌ పద్యంలో ఉన్న మాటలనుభాషల వారీగా పట్టీ వేస్తే అలా యెందుకన్నదీ బోధపడుతుంది.

వివిధ, ఉత్తుంగ, తరంగ, ఘట్టన, చలత్, వేలా, వన, ఇలావలీ, లవలీ, లుంగ, లవంగ, సంగత, లతా, లాస్యం, ఈక్షించు, ధవళ, అక్షి, చని, కాంచు, అంత, ఎదుట, తత్, తీర, దేశంబు, అవదాత, అంబుజ, ఫేన, పుంజ, నిభ, ఆ, అశ్వ, ఉత్తమ, దవ్వు.

ఇందులో‌ఎన్ని తెలుగు మాటలున్నాయి? చని, కాంచు, అంత, ఎదుట, ఆ, దవ్వు. ఈ‌ కాసిని మాటలేగా?  మిగతావన్నీ సంస్కృత పదాలే!

అందు చేత ఈ పద్యం చదివి ఆనందించాలీ అంటే తెలుగు పాండిత్యం అక్కరకు రాదు.  సంస్కృతంలో‌మంచి ప్రవేశం ఉండి తీరాలి.

నన్నయగారు అన్ని పద్యాలూ ఇలాగే వ్రాసారనుకునేరు. విషయం అదికాదు. ఆయనకు సంస్కృతం దట్టించి తెలుగుపద్యాలు వ్రాయవలసిన అక్కర యేర్పడింది నాటి వారి మనోరంజనం కోసం.

కవిత్రయం‌వారు మహాభారతాన్ని తెలుగువారికి అందించారు. తెలుగువాళ్ళు దానిని నెత్తిన బెట్టుకున్నారు. తెలుగులో బోలెడు మంది మహాకవులు రచనలు చేసారు. కాని ఎవరూ సంస్కృతం జోలికిపోకుండా తెలుగులోనే మహాకావ్యాలు వ్రాయలేదు. ఒక్క తిక్కన గారు మాత్రం తెలుగుకు పెద్దపీట వేసి వ్రాసారు సాధ్యమైనంత వరకూ. తరువాత వచ్చినది ప్రబంధయుగం.

ఇన్నాళ్ళ తరువాత అయినా మన తెలుగుకవులు సంస్కృతభాష మీద మోజు నుండి బయట పడ్డారా అంటే లేదనే చెప్పాలి.  ప్రబంధాలలోనూ‌ కవిత్వానికి వాడే భాషలో సంస్కృతానికే అగ్రతాంబూలం.

అందుచేత తెలుగు కావ్యాలూ వగైరా చదువుకోవాలీ అంటే కొంత తెలుగూ బోలెడు సంస్కృతమూ అర్థం అయేటంత భాషాజ్ఞానం సంపాదించాలి. అల్లసాని పెద్దనగారికి ఆంధ్రకవితాపితామహుడని బిరుదు.  ఆయనగారి మనుచరిత్రంలోని ఒక పద్యం చూడండి:

చ.  అటజని కాంచె భూమిసురు డంబర చుంబి శిరస్సరజ్ఝరీ
పటల ముహుర్ముహుర్ లుఠ దభంగ తరంగ మృదంగ నిస్వన
స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపి జాలమున్
గటక చరత్కరేణు కర కంపిత సాలము శీతశైలమున్

  
మంచి పద్యం. సందేహం లేదు. ఈ‌ ఒక్క పద్యం సొగసుమీద ఒక వ్యాసం వ్రాయవచ్చును!

ఈ‌ పద్యం నిండా సంస్కృతమే! అట, చను, కాంచె అన్న మొదటి మాటలు మినహాయిస్తే అంతా గంభీరమైన సంస్కృత సమాసాల ఆడంబరవిన్యాసమే.  దాని అందం దాని దనుకోండి. అది వేరే విషయం.  కాని తెలుగుపద్యంలో తెలుగు ఎంతా అన్నది ప్రశ్న.

ఆధునికులు ఏమీ‌తక్కువ తినలేదు. కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణగారి రామాయణ కల్పవృక్షంలోని యీ పద్యం చూడండి:

శా. నిష్టావర్షదుదారమేఘపటలీ‌నిర్గఛ్చదుద్యోతిత
స్పేష్ఠేరమ్మదమాలికాయుగపదుజృంభన్మహాఘోరబం
హిష్ఠస్ఫూర్జదుషండజర్ఝరరవాహీనక్రియాప్రౌఢి ద్రా
హిష్ఠంబై యొకరావమంతట నెసంగెన్ ఛిన్న చాపంబునన్

నా దగ్గర కల్పవృక్షం లేదు.  కేవలం నా ధారణలో ఉన్నది వ్రాసాను. విజ్ఞులు అవసరమైతే సరిజేయండి.  నాకు తెలిసి తెలుగుసాహిత్యంలో ఇంతకంటే జటిలమైన పద్యం మరొకటి లేదు!  అదే విశ్వనాథవారు తెలుగుసాహిత్యంలో‌ అతి తేలికైన పద్యాన్నీ‌ వ్రాసిన కీర్తి మూట గట్టుకున్నారు.  అది తన పుస్తకం ఒకదానిని గొట్టిపాటి బ్రహ్మయ్యగారనే ఆయనకు అంకితం ఇస్తూ చెప్పిన పద్యాలలో ఉంది. చిత్తగించండి:

తే. కొందరకు యౌవనంబున కూడి వచ్చు
కొందరకు వార్థకంబున కూడి వచ్చు
కొందరకు బ్రతుకంతయును కూడి వచ్చు
కొందరకు బ్రతుకంతయును కూడి రాదు

ఇందులో సగటు తెలుగువాడికి తెలియని పదం ఏదయినా ఉందా?  అందుకే చప్పున అర్థం అవుతున్నది కదా?  ఏమంటారు?

మన్నించాలి.  టపా పెద్దదైపోతోంది.  ఇంకా వ్రాయవలసింది మిగిలే ఉంది. ప్రస్తుతానికి చాలిద్దాం.  మరొక టపాలో దీన్ని కొనసాగిస్తాను.

8 కామెంట్‌లు:

  1. తెనుగు పద్యం అంటే భూతం అనుకోవడం మొదటి పొరపాటు, తరవాత పద్యాన్ని అన్వయించుకోవడం, చెప్పకపోవడం, మిగిలినది తెనుగు పదాలు తక్కువ ఉండటం, పోతనగారి పద్యాలంటే ద్రాక్షాపాకం, కాని ఆ పద్యానికి కూడా అర్థం చెబుతాను. ఎందుకంటే పద్యం అంటే భయపడేవారికి ఇది తేలిక అని చెప్పడానికే, ఆ తరవాత బరువైన పద్యాలకి వెళ్ళచ్చు. అందుకే నా బ్లాగులో పద్యాలకి అర్థం కూడా చెబుతాను,అలవాటు చెయ్యాలి కదండీ!

    రిప్లయితొలగించండి
  2. " బుద్ధ దేవుని భూమిలోన పుట్టినావు -
    సహజమగు ప్రేమ నీలోన చచ్చెనేమి?
    అందమును హత్యజేసెడి హంతకుండ!
    మైల పడిపోయెనోయి నీ మనుజ జన్మ!"
    - కరుణశ్రీ విరచిత కమనీయ పద్యం.
    ఎక్కడైనా కాఠిన్యం ఉందా?
    పద్య కవిత్వం అనగానే కొందరు కవులు భాషాప్రౌఢిమ, వ్యాకరణ నిష్ఠ ఉండాలి అనుకొంటారు. కాని పద్యంలో రసపోషణ జరిగి ఆ రసం పాఠకుని మెదడును, హృదయాన్ని స్పందింపజేయాలి. భాష కన్న భావుకత ముఖ్యం. వ్యాకరణ నిష్ఠ కన్న రస నిష్ఠ ముఖ్యం.

    రిప్లయితొలగించండి
  3. పద్యవిద్యాభిమానులకు ఒక విన్నపం. నేనేమీ పద్యం పట్ల విముఖత ఉన్న వాడిని కాదు. ప్రస్తుత పరిస్థితికి దారితీసిన కారణాలను నిర్మొగమాటంగా ప్రస్తావించటం ఈ వ్యాసం యొక్క ఉద్దేశం. ఇది వ్యాసంలో మొదటి భాగం‌ మాత్రమే. అన్ని విషయాలు మనం తలస్పర్శిగా పరామర్శించాక పద్యవిద్యను యెలా ప్రోత్సహించటం, పద్యపఠనాన్ని యెల్లా మళ్ళా తెలుగువాళ్ళలో పునరుథ్థరించటం వంటి వాటిని చర్చిద్దాం.

    రిప్లయితొలగించండి

  4. పాదములతో బెదిరిస్తా ఉంటే, పారి పోకుండా ఇంకేమి జేయమంటారు స్వామీ !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  5. మీకు చాలా దమ్ము ఉందండి శ్యామలీయం గారు. నేనూ చదివాను పద్యాలు, కానీ పాడలేదు, పాత తెలుగు సినీమాల్లో తెలుగు పద్యాలను పాడే విధానం బహు ముచ్చటగా అనిపించేది.

    వృత్తంటి గారు చెప్పినట్లు మన సంస్కృతిలో ఉన్న కళలు సమున్నతికి తోడ్పడుతాయి అని నాకు గట్టి విశ్వాసం.

    అందరూ నిరాశా మాటలు చెప్పేవారే కాని, దిక్కులు పిక్కటిల్లేలా, మన్ను తిన్న పాముల్లా పడి ఉన్న జనాలు దిగ్గున లేచి పరిగెత్తేలా మనుషులను ఉర్రూతలూగించే కళలు, నేటి ప్రపంచపు పోకడ అయినటువంటి ఏదోలా బ్రతికేస్తూ సమాజంతో సాగుదాం అనుకుంటున్న మనుషుల ముందు నిలవలేక కనుమరుగై పోతున్నాయి.

    మరి ఆ దమ్మున్న కళాకారులు నిద్ర లేచే వరకు కళామతల్లులు మౌనంగా ఎదురుచూస్తుంటాయి.. కొన్నాళ్ళకి కనుమరుగై పోతాయి..

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చాలా సంతోషం అండీ.
      ప్రశ్నలు వేయటం వెనుకాల మీ‌ చిత్తశుధ్ధిను నేను శంకించ లేదు.
      మంచి ప్రశ్నలు. సమాధానాలు వెదకటం అవసరమే అనిపించి వ్రాస్తున్నాను.
      ఈ‌ వ్యాసానికి కొద్ది నిముషాల ముందు రెండవ భాగం కూడా ప్రాసాను. చదవగలరు.

      తొలగించండి
  6. మంచి ప్రయత్నం శ్యామలీయం గారు. పద్యం పట్ల ఆసక్తి పెరగాలంటే మీరన్నట్లు పద్యం తెలుగులోనూ , కొందరు కామెంటర్లు సూచించినట్లు అర్ధమయ్యేలా ఉండాలి. కాయ గారు చెప్పినట్లు ప్రజాకళలకు తిరిగి జీవం పోయగలిగే దమ్మును పెంచాలి. మన పాఠ్యాంశాలలో సంస్కృతిని , సంస్కారాన్ని నేర్పే అంశాలు ఎక్కడుంటున్నాయి? ప్రయివేటీకరణ మోజులో కనీసం పిల్లలు ఆటలాడుకోవడానికే వీలుండడం లేదు. ఇక ప్రభుత్వాలు పద్యం గురించి ఆలోచిస్తాయని నేననుకోవడం లేదు. పద్యం దమ్ము తెలియాలంటే వేమన గురించే చెప్పుకోవాలి. ప్రజలకొరకు ఆయన ఆటవెలదిలో ఆసువుగా చెప్పినవి నేటికీ ప్రజల నాలుకలపై నాట్యం చేస్తున్నాయి అంటే పద్యానికున్న పవర్ తెలియడం లేదా? ఇక ఎవరికీ అభ్యంతరం కాదనుకుంటే పద్యం గురించి చర్చించేటప్పుడు నాకు NTR తప్పకుండా గుర్తుకు వస్తాడు. దాన వీర శూర కర్ణ లాంటి సినిమాని ఆయన జనం చేత మెప్పించారు. పురాణాలలోని నెగిటివ్ పాత్రలను సైతం ఆయన పాజిటివ్ గా మలచి జనాన్ని మెప్పించారు. ఆయా పాత్రల స్వభావాన్ని ప్రజలకు వివరించగలిగారు. ఆశ్చర్యమేమిటంటే నేటికీ ఆ సినిమాలోని డైలాగులు, పద్యాలు మొబైల్ రింగ్ టోన్స్ గా ఉన్నాయి. అంటే చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే, ప్రజలకవసరమైన కోణం ఉంటే, పద్యాన్ని కాపాడుకోవచ్చు. పద్యం చనిపోతుందని నేననుకోను. కానీ మన సంస్కృతి అన్నింటా నాశనమవుతున్నట్లే పద్యానికీ ఆ ప్రమాదం పట్టుకుంది. శ్యామలీయం గారి లాంటి అనుభవజ్ఞులు - ఇలాంటి విషయాలపై అవగాహన ఉన్నవారు పూనుకుంటే పద్యం మనగలుగుతుంది. అయితే పద్యం లక్ష్యం ప్రజా చైతన్యం కోసం కావాలి తప్ప వ్యక్తి ప్రతిభా పైత్యాన్ని ప్రదర్శించడం కోసమైతే అది ఎక్కువకాలం నిలబడదని నా అభిప్రాయం.

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.