30, అక్టోబర్ 2014, గురువారం

శ్రీశైలజలవివాదంపై వనం వారి వ్యాసానికి తెలుగుసేత.

ముందుమాట


శ్రీ వనం‌ జ్వాలానరసింహారావుగారు 27న వ్రాసిన ఆంగ్లవ్యాసానికి ఇది తెలుగుసేత.

నిజానికి జ్వాలాగారే తెలుగులో ఈ‌ పనికూడా చేయవచ్చును.  ఆంగ్లంలో వ్రాయటానికి వారి కారణాలు వారివి. ఆంగ్లంతో ఇబ్బంది ఉన్న తెలుగుపాఠకుల కోసం దీన్ని యథామాతృకానువాదం చేసి ఇక్కడ ఉంచుతున్నాను.

మూలవ్యాసం: 

Decency not at the cost of State

తెలుగు అనువాదం

ఇది ఆంధ్రప్రదేశప్రభుత్వ ప్రజాసంబంధాల సలహాదారు పరకాల ప్రభాకర్ గారి అయాచితమైన నిరాధారమైన అందునా వారు తెలంగాణా ప్రభుత్వ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావుగారిని నిందిస్తూ చేసినదీ ఐన ప్రకటనకు సంబంధించినది. ఆంధ్రప్రదేశ ప్రభుత్వానికి శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలకు సంబంధించిన జీవో 69, 107లను గౌరవించటంలో ఉన్న నిబధ్ధతను విమర్శించుతూ ఔచిత్యానికి సంబధించిన అన్ని హద్దులనూ కేసీఆర్ గారు మీరారని ప్రభాకర్‌గారు ఆరోపించారు. ఆయన తెలంగాణా ప్రభుత్వం ఆ జీవోలను అతిక్రమించిందని కూడా నిరాధారమైన నిందలు వేసారు.

కాని శీశైలం ప్రాజెక్టు కేవలం విద్యుదుత్పాదన కోసమనే రూపకల్పన చేయబడిన అందుకోసమనే నిర్మించబడిన సంగతీ, అంతే కాక, అసలు ఈ‌ ప్రాజెక్టు పేరే శ్రీశైలం జలవిద్యుదుత్పాక ప్రాజెక్టు అన్నది ఈ‌ విషయాన్ని విస్పష్టం చేస్తున్న సంగతీ‌, అంధ్రప్రదేశ పౌరసంబంధాల సలహాదారుగారు మరచిపోయారు. జీవో 69,107ల తరువాత వాటికి అదనంగా వచ్చిన జీవో 233 అప్పటి అంద్రప్రదేశ్ లోని సీమాంద్రప్రాంతం యొక్క స్వార్థప్రయోజనాలను పరిరక్షించటానికీ, తెలంగాణాకు అపారనష్టం కలిగించటానికీ ఉద్దేశించినది. తెలంగాణా రాష్ట్రం యొక్క, ముఖ్యంగా అందులోని ప్రజల యొక్క ప్రయోజనాల పరిరక్షణను పణంగా పెట్టి హుందాగా ఉండటం‌ కుదరదని ఒక పౌరసంబంధాల నిపుణుడిగా అయన తెలుసుకోవలసి ఉంది.

శ్రీశైలాన్ని కేవలం విద్యుత్తుకోసమైన ప్రాజెక్టుగా చూడాలా, కేవలం సాగు-త్రాగునీటి ప్రాజెక్టుగానే చూడాలా అన్నది నేడు వివాదంగా మారింది. ఎప్పుడో 1960లో, దేశం యొక్క విద్యుదవసరాలను తీర్చుకుందుకుగాని అప్పటి ప్రణాళికాసంఘం, శ్రీశైలంతో సహా దేశమంతా అనేక చోట్ల జలవిద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం గురించి అలోచించింది. ఈ‌ శ్రీశైలం ప్రాజెక్టు రూపకల్పనలొ ఎడమ కాలువక్రింద 900మెగావాట్లు, కుడి కాలువ క్రింద 770మె.వా విద్యుదుత్పత్తి లక్ష్యంగా చేసుకున్నారు. అందుచేత ఈ ప్రాజెక్టు కేవలం జలవిద్యుత్తు కోసమే. దీనిని బట్టి, ఈ‌ ప్రాజెక్టు రూపకల్పనలో, ఇందులో ఒక్క నీటిబొట్టు కూడా వేరే లక్ష్యాలకోసం ఉద్దేశించలేదని తెలుస్తోంది.

ఈ ప్రాజెక్టు 1981లో విద్యుదుత్పత్తిని మొదలు పెట్టింది. అందుకోసం జలాశయంనుండి వినియోగించబడిన నీళ్ళు అంతిమంగా నాగార్జునసాగర్ జలాశయం చేరుతాయి కాబట్టి నీరు వృధాగా పోవటం జరగదు. ఈ‌విధంగా శ్రీశైలం ప్రాజెక్టు కృష్ణాజలాలకు ఒక బేలెన్సింగ్ జలాశయంగా ఉపయోగంలోకి వచ్చింది. ఈ సం. 2014 జూన్ 2 నుండి తెలంగాణా రాష్ట్రం ఉనికిలోనికి వచ్చి, అప్పటినుండి మొదలు, ముందటి ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విధానాల కారణంగా కష్టాలు ఎదుర్కుంటూ ఉంది నేటికీ. ఈ శ్రీశైలం జలాల విషయంలోనూ జలవిద్యుదుత్పాదన విషయంలోనూ అమితశ్రధ్ధతో లోతుగా విశ్లేషణ చేయవలసి ఉంది. సముద్రంలో పెద్దపెద్ద మంచు దిబ్బలు తేలుతూ‌కనిపిస్తాయి కాని పైకి కనిపించేవి వాటి పరిమాణంలో అతిచిన్న ఉపరితలాలే - లోపల కొండలంత ఉంటాయి కాని. ఇప్పుడు బయటపడ్డ విషయం, ఈ శ్రీశైల జలవిద్యుత్తు ప్రాజెక్టు సంగతి అనేది కూడా, అనాదిగా తెలంగాణా ప్రాంతప్రజలకు జరుగుతున్న అన్యాయానికి సంబంధించిన పైకి పేలిన అటువంటి వ్యవహారమే.

తెలంగాణాలో ఉన్న దారుణమైన విద్యుత్తు కొరతకు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ రాష్ట్రంలో ఇంతకు ముందువరకూ నడిచిన కాంగ్రెసు, టీడీపీ పార్టీలవారి లోపభూయిష్టమైన విధానాలే‌ కారణమని ఒక ప్రాథమికపాఠశాల విద్యార్థి కూడా అర్థం చేసుకోగలడు. తెలంగాణారాష్ట్రంలో విద్యుత్తు రంగానికి సంబంధించిన ఈ పరిస్థితికి ఆ రెండు పార్టీలదే‌ పూర్తి బాధ్యత. గత ఇరవై సంవత్సరాలలోనూ‌ఈ రెండు పార్టీల పాలకులూ తెలంగాణాలో ఒక్కటంటే ఒక్క మెగావాట్ విద్యుత్తును కూడా అదనంగా ఉత్పత్తి చేసిన పాపానపోలేదు. ఈ‌ నేపద్యంలో ఆవిర్భవించింది తెలంగాణారాష్ట్రం.

తెలంగాణాప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నింఛి నప్పటికీ, రాష్ట్రంలో ఇంకా విధ్యుత్తుకు కొఱత ఉంది. సమయానికి రైతులకు నిరంతరాయంగా విద్యుత్తు అందించకపోతే, అది కూడా పంటలు వేసే సమయంలో ఐనప్పుడు రైతులమీద ప్రతికూల ప్రభావం పడుతుంది. అంతిమంగా అది తిండిగింజల కొఱతకు కారణం అవుతుంది. తెలంగాణా రాష్ట్రంలో సగటు విద్యుదవసరం 6,800 మె.వా ఉంది. నికరమైన ఉత్పత్తి, కేంద్రం ఇచ్చే వాటాలు కలిసి కేవలం 4,500 మె.వా ఉంది. లోటున భర్తీచేసుకుందుకు తెలంగాణా రోజువారీగా 760మె.వా కొనిగోలు చేస్తోంది. ఐనా సరే ఇంకా కొఱత ఉంది. తెలంగాణాకు అందుబాటులో ఉన్న జలవిద్యుత్తు 1000 మె.వా. ఇందులో 700 నుంది 800 మె.వా శ్రీశైలం నుండే వస్తుంది. అందుచేత తెలంగాణాకు ఇది అత్యంత ముఖ్య మైనది.

శ్రీశ్లైలం జలాశయంలో నీటిమట్టం తగ్గిపోతోందని ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం వాదిస్తోంది. సాగు నీటికీ, త్రాగు నీటికి ప్రాథాన్యతను ఇవ్వాలని కూడా ఆ ప్రభుత్వం వాదిస్తోంది. ఇది నిరాధారమైన వాదన. లభ్యంగా ఉన్న జలాల్లో త్రాగు సాగులకు ప్రాథాన్యత ఇవ్వాలన్నది నిజమే కావచ్చును. కాని, మనదేశంలో కొన్ని ప్రాజెక్టులు కేవలం విద్యుదుత్పత్తికోసమే నిర్మించబడ్డా యన్నది వాస్తవం. వీటిలో శ్రీశైలం ఒకటి. ఈ శ్రీశైలం కేవలం విద్యుదుత్పత్తి కోసమే రూపకల్పన చేయబడింది. ఈ ప్రాజేక్టు ఆలోచన నుండి నిర్మాణం దాకా ఎక్కడా ఒక్క టిఎమ్‍సీ కూడా వ్యవసాయం కోసం అని కేటాయించలేదు. తరువాత కాలంలో, కృష్ణాకు తరచుగా వరదలు వస్తాయనీ, వరదకారణంగా అదనంగా నీరు పుష్కలంగా లభ్యం అవుతుందనీ ఒక వాదన వచ్చింది. ఈ నీళ్ళను వాడుకుందుకు అప్పటి రాష్ట్రప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణానికి పూనుకుంది. అదనపు నీటి వాడకం హక్కు అనేది తెరమీదకు వచ్చింది. అదనపు నీళ్ళూ వరదనీళ్ళూ అంటూ ఉన్న వాదన ప్రక్కకు బెట్టి క్రమంగా శ్రీశైలం ఒక వ్యవసాయం కోసమైన ప్రాజెక్టుగా చూడటం మొదలయ్యింది. చివరికి ఈ వాదన ఆధారంగనే జలాల పంపకం జరగటం జరుగసాగింది.

శ్రీశైలం నుండి ఇతర ప్రాజెక్టులకు నీటిని కేటాయించాలని నిర్ణయించటం జరిగింది. ఆ నిర్ణయం ప్రకారం 19 టీఎమ్‍సీలు కె.సి.కాలువకు, 15 టీఎమ్‍సీలు తెలుగుగంగకు, అంటే మొత్తం మీద ఆంద్రాకు 34టీఎమ్‍సీలు పోతున్నాయి శ్రీశైలం నుండి. అలాగే 25 టీఎమ్‍సీలు కల్వకుర్తికి, 20టీఎమ్‍సీలు భీమాకు, 22టిఎమ్‍సీలు నెట్టంపాడుకు, 30టిఎమ్‍సీలు SLBCకి తెలంగాణా వాటాగా మొత్తం 97టీఎమ్‍సీలు కేటాయించారు. ఐతే సీమాంధ్రుల పాలనలో తెలంగాణాలో ప్రాజెక్టులు కట్టలేదు.  అందుచేత 97టీఎఎమ్‍సీలు తెలంగాణా వాడుకో లేక పోయింది.  ఉన్నవి 34టీఎమ్‍సీలే ఐనా ఆంద్రాలో మాత్రం పులిచింతల, పోతిరెడ్డిపాడు, హంద్రీనీవా ప్రాజెక్టులు కట్టి అక్రమంగా శ్రీశైలం జలాలను తరలించుకు పోయారు. ఈ దోపిడీ ఇంకా నడుస్తూనే ఉంది. తెలంగాణా తనకు హక్కుగా ఉన్న జలాలను వాడుకోలేకపోతోంది. తమకు హక్కు లేని జలాలను ఆంద్రావారు మాత్రం వాడుకుంటున్నారు. ఈ యేడాది కూడా ఆంద్రాప్రభుత్వం అక్రమంగా 60టీఎఎమ్‍సీ జలాలను తరలించుకు పోయారు. తెలంగాణా మాత్రం కనీసం 10టీఎమ్‍సీలు కూడా వ్యవసాయానికి వాడుకోలేక పోయింది. తెలంగాణాకు జలాల నిచ్చే ప్రాజెక్టులు మాత్రం కట్టబడలేదు.

రాష్ట్రవిభజన తరువాత, రెండు రాష్ట్రాలకూ దీనిమీద హక్కు ఉంది కాబట్టి, శ్రీశైలం ఇరురాష్ట్రాలకూ ఉమ్మడి ప్రాజెక్టు అయ్యింది. ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాలూ పరస్పరం ఆవలి వారి హక్కుల్ని గౌరవించాలి. తనకు ఉన్న హక్కు కారణంగా తెలంగాణా శ్రీశైలం ఎడమ కాలువ ద్వారా 900 మె.వా విద్యుత్తును ఉత్పత్తి చేసుకోగలదు. ఇలా తన హక్కును వినియోగించుకునే కమంలో ఎన్నడూ తెలంగాణా తన హద్దుల్ని మీరలేదు. తన కోటాగా కేటా యించబడిన జలాలను గత ప్రభుత్వాలు ఇచ్చిన 69, 107, 233 నంబర్ల జీవోల ప్రకారమే వాడుకుంది. నిజానికి కృష్ణా జలలాలో ట్రిబ్యునల్ వారిచ్చిన కోటా తెలంగాణాకు 261.9 టీఎమ్‍సీ. ఇందులో నికరజలాలు 184.9 కాగా అదనపు వరద నీరు 77టీఎమ్‍సీలు. ఇంతవరకూ తెలంగాణా వాడుకున్నజలాలు మహాఐతే 75.67టీఎమ్‍సీ మాత్రమే . ఉంటాయి. ఇలాగైతే ఖరీఫ్ పంటకు మరొక 26టీఎమ్‍సీల నీళ్ళు కావలసి ఉంటుంది.

జీవో 107 ప్రకారం శ్రీశైలంలో కనీసం 854 అడుగుల మట్టం నిల్వ ఉంచాలి. గతంలో చంద్రబాబు ప్రభుత్వం జీవో 69 ఇస్తూ 834 అడుగులు ఉంటే చాలని నిర్థారించింది. తెలంగాణా ప్రభుత్వం ఈ జీవోలను అతిక్రమించలేదు. ఇప్పుడు కూడా శ్రీశైలంలో 857 అడుగుల నీళ్ళున్నాయి. రోజూ విద్యుదుత్పత్తికి గాను కొన్ని నీళ్ళు ఖర్చు అవుతున్నాయి. ఇందులో తప్పేమీ లేదు. ఆంద్రాప్రభుత్వం మరియు కృష్ణాజలాల నిర్వహణా బోర్డు వారి ప్రకారం వ్యవసాయానికే ప్రాథాన్యత ఇవ్వాలి. సరే, ప్రస్తుతానికి ఈ వాదాన్నే ఒప్పుకుందాం. మరి తెలంగాణా శ్రీశైలం జలాలను ఎందుకు వాడుతోంది? విద్యుత్తు కోసం కదా. ఆ విద్యుత్తు దేనికీ? రైతుల వ్యవసాయ అవసరాల కోసం కాదా? నేరుగా లభ్యజలాలనే వాడుకుందుకు తెలంగాణాలో ప్రాజెక్టులే లేవు. వ్యవసాయానికి గాను ఉన్నవి బోరు బావులే. కరంటు ఉందంటేనే ఆ బావులలోంఛి నీళ్ళు వస్తాయి. ఈ బోరు మోటార్ల వల్ల 500 టీఎమ్‍సీల నీళ్ళు వస్తున్నాయి వ్యవసాయానికి, ఈ పంపుసెట్ల వల్ల 40లక్షల ఎకరాలే సాగులోనికి వస్తున్నప్పటికీ. శ్రీశైలం నుండి కొద్ది పాటి నీళ్ళు మాత్రమే తెలంగాణా తీసుకుంటున్నా వాటిసహాయంతోనే అంతకన్నా అనేక రెట్ల జలసంపదను వ్యవసాయానికి అందించటం జరుగుతోంది.

ఈ నీళ్ళతోనే తెలంగాణా విద్యుత్తును ఉత్పత్తి చేస్తోంది. కాబట్టి శ్రీశైలం నుండి తెలంగాణా తీసుకుంటున్న నీళ్ళను వ్యవసాయం కోసమే అని భావించవలసి ఉంటుంది. అందుకని 854 అడుగుల నిబంధనను కూడా తొలగించాలి. ఆంధ్రాప్రభుత్వమూ, కృష్ణాజలాల బోర్డూ కూడా శ్రీశైలం నీటిని వ్యవసాయం కోసం అని చెబుతున్న దానిని తెలంగాణా కూడా బలపరుస్తోంది. తెలంగాణాకు 834అడుగుల వరకూ నీటిని వాడుకుందుకు హక్కు ఉండాలి. ఆంధ్రాప్రభుత్వమూ, కృష్ణాజలాల బోర్డూ వాస్తవిక ధృక్పధంతో ఆలోచించాలి. ఇక్కద మరొక విషయం ఏమిటంటే ఇప్పుడున్న ప్రాజెక్టులూ, వాటికి నీటి కేటాయింపులూ, వాటి నిర్వహణా అన్ని విషయాలూ కూడా సంయుక్ర ఆంధ్రప్రదేశ ప్రభుత్వం చేత నిర్ణయించబడ్డాయి. ఆ పాత ప్రభుత్వాలు తెలంగాణా రైతులగురించి పట్టించుకోకుండా పక్షపాతంతో వ్యవహరించాయి. అన్ని విషయాలనూ సీమాంధ్రకోణంలోంచి మాత్రమే చూడటం జరిగింది. చివరకి హైదరాబాదుకు, తెలంగాణాకూ త్రాగునీరు ఇవ్వటంలో కూడా పక్షపాతం చూపటం జరిగింది. ఈ కారణంగా, తెలంగాణా ప్రభుత్వం కృష్ణాజలాల కేటాయింపులు, వినియోగాల విషయంలో మరొక సారి పరిశీలన చేయవలసిందిగా కృష్ణాజలాల బోర్డుకు విజ్ఞప్తి చేసింది. దానికి వారు కూడా అంగీకరించారు. కేటాయింపుల్లో మార్పులు రాబోతున్నాయి. అంతవరకూ, తెలంగాణా రైతుల పంటల్ని కాపాడేండుకు గాను, శ్రీశైలం జలాలను 834అడుగుల వరకూ వాడుకుందుకు తెలంగాణాకు హక్కు ఉండాలి. ఇలా విద్యుత్తు కోసం తెలంగాణా వాడుకున్న నీటిని తెలంగాణా కోటాలో జమకట్టుకోవచ్చును. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలంగాణా రైతులపట్ల ద్వేషం ఉండకూడదు, ఆ ద్వేషంతో వారిని బాధించకూడదు.

శ్రీశైలంలో విద్యుదుత్పాదనను ఆపివేస్తే తెలంగాణాకు 300 మె.వా విద్యుత్తుని ఇస్తానని ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ప్రతిపాదన విడ్డూరంగా ఉంది. ఇది విషయాన్ని తప్పు దారి పట్టించేదిగా ఉంది. ఎందుకంటే, రైతులకు రోజూ ఐదు లేదా ఆరు గంటల పాటు విద్యుత్తుని ఇవ్వాలంటే 800 మె.వా విద్యుత్తు ఉత్పత్తి చేస్తేనే అది సాధ్యపడుతుంది. ఇది వదలుకుని 300 మె.వా తీసుకుందుకు అంగీకరిస్తే, రోజుకు నాలుగు గంటలు ఇవ్వటం కూడా సాధ్యం కాదు. తెలంగాణా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ యొక్క దయా భిక్షం కోరుకోవటం లేదు. అది తన హక్కును నిలబెట్టాలనే కోరుతోంది. తనకు హక్కుగా రావలసిన 54శాతం విద్యుత్తు కోటాను కోరుతోంది. కృష్ణపట్నంతో సహా అన్ని విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలలోనూ తనకు ఉన్న న్యాయమైన వాటాను కోరుతోంది.


(గమనిక: ఇది యథామాతృకానువాదం అంటే అనువాదాన్ని సాధ్యమైనంతగా మూలానికి సరిపోలేలాగు చేసాను. సందేహ నివృత్తి అవసరం అనుకున్న చోట్ల మూలాన్ని పరిశీలించగలరు. ఈ అనువాదం పట్ల వనంవారికి అభ్యంతరం ఉంటే, ఈ టపాను తొలగించవలసి ఉంటుంది.)