24, అక్టోబర్ 2014, శుక్రవారం

సౌందర్యలహరి - 21 తటిల్లేఖాతన్వీం ...




మొదటి శ్లోకంవెనుకటి శ్లోకంతదుపరి శ్లోకం


21

తటిల్లేఖాతన్వీం తపనశశివైశ్వానరమయీం
నిషణ్ణాం షణ్ణామప్యుపరి కమలానాం తవ కలామ్
మహాపద్మాటవ్యాం మృదితమలమాయేన మనసా
మహాంతః పశ్యంతో దధతి పరమాహ్లాదలహరీమ్


ఈ శ్లోకంలో శ్రీశంకరులుసూక్ష్మధ్యానం అనే ధ్యానవిశేషానికి సంబంధించిన ప్రక్రియను గురించి చెబుతున్నారు.

అమ్మా భగవతీ, షణ్ణాం‌ అపి ఉపరి కమలానాం అంటే ఆరుచక్రాలకూ పైనున్న సహస్రారకమలంలో ఉన్నటువంటి తవ కలామ్‌ నీ‌యొక్క సదా అనే పేరుకల కళను మహాంతః అనగా మహానుభావులైన యోగీశ్వరులు పశ్యంతః అంటే చూస్తున్నారూ అని చెబుతూ శ్రీశంకరులు ఆ సాదాఖ్య కళావైభవాన్ని మహిమనూ ప్రస్తుతి చేస్తున్నారు.

ఇక్కడ చెప్పబడిన ఆరు చక్రాలగురించి మనం ఇప్పటికే గడచిన శ్లోకాలలో తెలుసుకున్నాం కదా. అవి మూలాధారము, స్వాధిష్ఠానము, మణిపూరకము, అనాహతము, విశుధ్ధము, ఆజ్ఞ అనేవి అని. అంతే‌కాదు అవి మానవశరీరంలో ఉండే ప్రదేశాలను గురించి కూడా ఇప్పటికే ముచ్చటించుకున్నాం.  అలాగే ఆ ఆరు చక్రాలకు పైన శిరస్సులో పైభాగాన సహస్రారం అని ఒక కమలం ఉంటుందని కూడా చదువుకున్నాం. 

ఇక్కడ ఆచార్యులవారు అపి ఉపరి అని అనటంలో ఈ‌ చక్రాలలో ప్రతి రెండు చక్రాలకూ పైన ఒక గ్రంథిచొప్పున ఉండే రుద్ర, విష్ణు, బ్రహ్మగ్రంథులనూ కూడా స్మరించినట్లుగా మనం భావించాలి. ఎందుకంటే సహస్రారం అన్నింటికంటే పైన ఉండేదే కదా.

ఇక్కడ చెప్పబడిన అమ్మ యొక్క కళను సదా అని ఈ శ్లోక వ్యాఖ్యానంలో ఇప్పటికే చెప్పటం జరిగింది. సహస్రారకమలంలో చంద్రుడు ఉంటాడు. ఈ చంద్రుడు నిత్యం పూర్ణచంద్రుడు. కళాతు షోడశో‌భాగః అని చెబుతారు. ఒక కళ అంటే ప్రకాశమానమైన వెలుగులో పదహారవవంతు అని. ఎందుకో మొదట చూదాం. మనకి తెలిసి తిథులు పదిహేను. శుక్లపక్షంలో చంద్రుడు ప్రతిపత్ అంటే‌ పాడ్యమి నుండి పదిహేను రోజులు రోజున కోక కళగా పెరుగుతూ పౌర్ణమాసీ అనగా పున్నమి నాటికి పూర్ణచంద్రుడు అవుతాడు. దానికి విలోమంగా కృష్ణప్రతిపత్ నుండి పదిహేను రోజులపాటు రోజున కొక కళ తరుగుతూ అమావాస్య నాటికి అదృశ్యుడౌతాడు. ఇలా రెండుపక్షాల్లోనూ కూడా పదిహేను కళలు చొప్పున కనిపిస్తున్నాయి. అంటే చంద్రకళలు పదిహేను అన్నమాట.  అటువం టప్పుడు  కళలు పదహారు అన్న సిధ్ధాంతం ఎలా వచ్చింది?

సరే, అమావాస్య నాడు చంద్రుడు కనబడకుండా పోతున్నాడు.  లేకుండా పోతున్నాడా?  ఉండే ఉండాలి కదా?  లేకుండా పోతే, లేని చంద్రుడికి వృధ్ధిని ఎలా చెప్పటం కుదురుతుంది నాటి నుండి? కాబట్టి చంద్రుడు అన్నవాడు ఉన్నాడు. కాని చాలా హీనంగా కనబడేందుకు వీలు లేనంత శోభారహితంగా ఉన్నాడు. అంతే. అందుచేత కళలు పదహారు అన్నారు. మిగిలిన పదిహేను కళలూ‌ వస్తూ పోతూ ఉంటాయి. చంద్రుడు పౌర్ణమి నాడు షోడశకళాప్రపూర్ణుడు. ఆ చంద్రుడే, అమావాస్య నాడు ఆ కనబడని కళ మాత్రమే మిగిలినవాడు.  ఈ పదహారవదీ, నిత్యమూ చంద్రునికి ఉన్నదీ ఐన కళనే సదా అని నిత్య అనీ అంటారు. దీనినే సంప్రదయంలో షోడశీ అనీ ధృవకళ అని కూడా అంటారు.

అమ్మ సహస్రారకమలంలో ఉన్న చంద్రమండలంలో ఉంటుంది.  లలితాసహస్రనామాల్లో చంద్రమండల మధ్యగా అని ఒక నామం ఉంది. ఈ చంద్రుడు పదహారు కళలూ‌ ఉన్న పూర్ణచంద్రుడు. ఈ‌ చంద్రుని యొక్క షోడశీ లేదా సదా కళ సాక్షాత్తూ అమ్మవారి యొక్క స్వరూపమే.

శ్రీ చక్రంలో మధ్యన ఉండేది బిందువు. ఈ బిందువుకు సహస్రారకమలంలో  ఉన్న ఈ‌ చంద్రమండలంతో  సమన్వయం.  ఈ శ్లోకలంలో‌ షణ్ణాం అని ఆరుచక్రాలనూ స్మరించటం జరిగింది కాబట్టి మరికొంత వివరంగా చూదాం. అజ్ఞా చక్రానికి శ్రీచక్రంలో బిందువు మీది త్రికోణంతో సమన్వయం. విశుధ్ధి చక్రమే అష్టకోణచక్రం.  అనాహతచక్రమే అంతర్దశారం.  మణిపూరకం బహిర్దశారం. స్వాధిష్ఠానం చతుర్దశారం. మూలాధారమే శ్రీచక్రం యొక్క భూపురం.  ఇలా మూలాధారాది కమలాలను శ్రీచక్రంతో సమన్వయం చేయటానికే స్థూలచక్రమేళనం అని పేరు.

సందర్భం వచ్చింది కాబట్టి ఒక్క విషయం గుర్తు చేయవలసి ఉంది.  అగ్ని సూర్య చంద్రాది నామాలు అన్నీ‌ ఈ‌ శ్రీవిద్యలో సాంకేతికపదాలు. శ్రీవిద్యలో బ్రహ్మాండ, పిండాండ, శ్రీచక్రాలకు అబేధం. అందుచేత ఈ‌ పదాలు ఒక్కొక్క సారి నిజమైన బహిఃప్రపంచపు అర్థాల్లో అంటే సూర్యచంద్రులు మనకు ఆకాశంలో కనిపించే వారే కావచ్చును. కాని అన్నిసార్లూ అలాగే అనుకోకూడదు.  ఉదాహరణకు సహస్రారం అమృతత్త్వానికి ప్రతీక. అది సాక్షాత్ పరబ్రహ్మస్థానం కాబట్టి దివ్యప్రకాశం కలది.  ప్రకాశం అంటే వెలుగుచే అమృతాన్ని కురిపించే వాడన్న సామ్యంతో ఇందులో ఉండే తేజోమండలానికి చంద్రమండలం అని సంకేతం. పరమాత్మకు వృధ్ధిక్షయాలు ఉండవు కాబట్టి అక్కడ ఉండే చంద్రతత్త్వంలో సదాకళ చెప్పబడుతుంది. ఇలా గ్రహించాలి. ఈ‌ విషయం గురించి మరికొన్ని సంగతులు ఈ శ్లోకానికి వ్యాఖ్యానం ముగింపులో ప్రస్తావించుకుందాం.

ఈ విధంగా మనం శ్రీశంకరులు ఈ‌ శ్లోకంలో సహస్రార చంద్రమండల మధ్యగత ఐన అమ్మ శ్రీదేవి యొక్క నిత్యకళావైభవాన్ని గురించి చెబుతున్నారని అర్థం చేసుకున్నాక శ్లోకంలో ఏవిధంగా ఆ సదాఖ్యను గురించి వర్ణిస్తున్నారో  తదుపరి టపాలో చూదాం.