25, అక్టోబర్ 2014, శనివారం

సౌందర్యలహరి - 21 తటిల్లేఖాతన్వీం.. (కొనసాగింపు)



మొదటి శ్లోకంవెనుకటి భాగంతదుపరి శ్లోకం
తటిల్లేఖా తన్వీం...  అనే శ్లోకంలో ఇంతవరకు మనం షణ్ణామప్యుపరి కమలానాం తవ కలామ్ అన్న ప్రస్తావనను గూర్చి చర్చించుకున్నాం.  ఆరు కమలాలకు పైనున్న దిగా వర్ణించారు కాబట్టి అది సహస్రారకమలం అన్న భావంలో తీసుకున్నాం.

ఆచార్యులవారు కూడా ఇది సహస్రారం అన్న విషయాన్ని ఈ‌ శ్లోకంలో స్పష్టంగానే చెబుతున్నారు.  మహాపద్మాటవ్యాం నిషణ్ణాం అని అక్కడ ఉన్నది అమ్మ అని. మహాపద్మం అనే అడవి.  వేయి రేకుల పద్మం అనే అర్థంలోనే అచార్యులవారు ఇక్కడ సహస్రారం గురించి చీబుతున్నట్లుగా స్పష్టంగానే ఉందిగా.   మనం ముందు చెప్పుకున్న సహస్రారపద్మంలోని చంద్రమండలస్థానం ఈ‌ పద్మం యొక్క కర్ణిక అంటే మధ్యన ఉండే భాగం. అక్కడ ఆసీనురాలై ఉంటుంది భగవతి అని చెబుతున్నారు.

ఈ సహస్రారపద్మకర్ణికాంతర్గత చంద్రమండలంలో ఉండే సదాఖ్య అనబడే అమ్మయొక్క దివ్యమైన కళ ఎలాటిదంటే, అది తటిల్లేఖా తన్వీం అని చెప్పారు శ్రీశంకరులు.  తటిత్ అంటె మెఱుపు.  తట్టిల్లేఖ అంటే మెఱుపు తీగె. అటువంటి తనువు అనకా ఆకారం కలది అట.  ఇక్కడ రెండు సంగతులు ఉన్నాయి, మొదటిది మెఱుపుతీగలాగా అత్యంత దీర్ఘంగా సన్నగా ఉంటుందనేది. కాగా, రెండవది, మెఱుపు తీగ లాగా కేవలం క్షణకాల్తం మాత్రమే దర్శనభాగ్యం అనుగ్రహించేది అని.

ఈ మెఱుపుతీగ వెలే తృటికాలం దర్శనం ఇచ్చే అమ్మ తపనశశివైశ్వానర మయి అట. తపనుడు అంటే సూర్యుడు, శశి అంటే చంద్రుడు. వైశ్వానరుడు అంటే అగ్ని.  ఈ మూడు తేజస్సులూ కలగలసిన ప్రకాశం అని చెబుతున్నారు.  ఇంతకు ముందే చక్రాలను గురించి వివరించుకున్న సందర్భంలో సూర్యచంద్ర అగ్ని ఖండాల ప్రసక్తి వచ్చినప్పుడు షట్చక్రాలనూ ఈ మూడు ఖండాలుగా విడమరచి తెలుసుకున్నాం.  అంటే ఇక్కడ మనం అన్వయించుకోవలసిన సంగతి ఏమిటి?  అమ్మ ఇక్కడ ఆరుచక్రాలయొక్క తత్త్వాలనూ తానే కలిగి, వాటిని అధిగమించి ఏడవదైన సహస్రారంలోని చంద్రమండలంలో ఉన్నది అని.

ఆ భగవతి యొక్క దర్శనం ఎటువంటి వారికి మాత్రమే దొరకగలదో చెప్పటానికి ఆచార్యులవారు మహాంతః  పశ్యంతః మృదితమలమాయేన మనసాః అన్నారు.   ఇక్కడ మలములు అనగా కామము, క్రోధము,లోభము, మోహము, మదము, మాత్సర్యము అనే అరిషడ్వర్గాలూ, మాయ అని చెప్పబడినవి అస్మితా, అహంకారము, అవిద్యా అనేవి.  వీటిని మృదితము చెసినవారు అనగా తొలగించుకున్న మహాంతః అంటే మహాత్ములైన వారు మాత్రం మనసాః తమతమ అంతఃకరణములలో భగవతి దర్శనం పొందగలరని అంటున్నారు. 

ముందే చెప్పుకున్నాం కదా, ఇక్కడి భగవతీ స్వరూపం అమృతాన్ని ఇస్తుందని.  చంద్రమండలం అమృతస్థానం అని కూడా చెప్పుకున్నాం కదా.  ఇలా అమృతధారలు కురిపించే అమ్మ యొక్క దివ్యప్రకాశాన్ని సర్వాత్మనా అన్ని వికారాలనూ జయించిన మహాత్ములే పొంది ఆనందిస్తున్నారని శ్రీశంకరులు చెబుతున్నారు.

అందుకనే అమ్మయొక్క దర్శనాన్ని పరమాహ్లాదలహరీమ్‌ అని స్పష్టికరిస్తున్నారు.  ఇంతకంటే ఉన్నతమైన ఆనందం లేదు అని చెప్పదగినది ఈ‌ దర్శనం ఇచ్చే ఆనందం.  అమ్మదర్శనం క్షణకాలం కలుగవచ్చును.  కాని అంతులేని ఆనందం యొక్క ప్రవాహం మాత్రం ఆ మహాత్ముల మనస్సులలో స్థిరంగా ఉంటుందని చెప్పటానికి మహాంతః పశ్యంతో దధతి అని అన్నారు. దధతి అనగా స్థిరంగా ధరించి ఉంటున్నారు అని అర్థం.

ఈ శ్లోకానికి రోజూ వేయి సార్లు చొప్పున నలభైఐదురోజులు పారాయణం.  నైవేద్యం తేనె, బెల్లం, అరటిపండ్లు ఫలసిధ్ధి సకల జనామోదము, శత్రుబాధానివారణం.