14, అక్టోబర్ 2014, మంగళవారం

సౌందర్యలహరి - 17 (ముగింపు)



మొదటి శ్లోకంవెనుకటి శ్లోకంతదుపరి శ్లోకం




మొదటి భాగం    రెండవ భాగం


ఈ శ్లోకంలో వశిన్యాది అని చెప్పటం వలన  ఎనిమిది మంది వశినీదేవతలనూ‌ వారితో‌ పాటుగా యోగినులనూ కర్షిణులనూ కూడా స్మరించారని చెప్పుకున్నాం కదా. తదుపరి విషయం చూదాం. 

అమ్మ మాతృకావర్ణరూపిణి అని చెబుతూ ఉంటారు కదా.  అంటే పంచాశత్ వర్ణాలే స్వరూపంగా ఉన్నది అని అర్థం.  ఈ వర్ణాలు అంటే అక్షరాలు సంస్కృతంలో ఏభై ఉన్నాయి.  వీటినే ఎనిమిది వర్గాలుగా విభజించి చెబుతారు.

ఆ విభజన అంతా ఒక పట్టిక రూపంలో చూదాం.

వర్గం పేరు అధిష్టాన దేవత వర్ణాలు మొత్తం
1 అకార వర్గం వశిని అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ ఌ ౡ
ఏ ఐ ఓ  ఔ అం అః
16
2 క వర్గం కామేశ్వరి క ఖ గ ఘ జ్ఞ 5
3 చ వర్గం మోదిని చ చ జ ఝ ఞ 5
4 ట వర్గం విమల ట ఠ డ ఢ ణ 5
5 త వర్గం అరుణ త థ ద ధ న 5
6 ప వర్గం జయిని ప ఫ బ భ మ 5
7 య వర్గం సర్వేశ్వరి య ర ల వ 4
8 శ వర్గం కౌలినీ శ ష స హ ళ 5


ఈ పై పట్టికలో చూపినట్లుగా సంస్కృతంలోని ఏభై వర్ణాలకూ ఇలా వశిన్యాదులు అధిష్ఠానదేవతలుగా ఉన్నారు.  అందుచేత ఇక్కడ వశిన్యాద్యాభ్యాః అని వశిన్యాదులు ఎనిమిది మంది పరంగాను కూడా అన్వయం చేసుకుంటే అన్ని వర్ణమాతృకలూ ఈ‌ వశిన్యాదులే అన్నది కూడా అన్వయంలోనికి తెచ్చుకున్నట్లు అవుతున్నది కదా. 

ఈ ఏబదివర్ణాలలో అ కారం మొదలు ఠ కారం వరకూ ఉన్న వర్ణాల యొక్క రంగు ధూమ్ర వర్ణం. అంటే వెలిబూడిద రంగు.

డ నుండి ఫ వరకు ఉన్న వర్ణాలు శుక్లవర్ణాలు అంటే తెల్లని రంగు కలవి.

బ నుండి ల వరకు అరుణ ఛ్చాయ కలవి అంటే ఎర్రగా ఉండేవి. ళ కారం కూడా ల కారం గానే ఎర్రనిది.

న నుండి స వరకు ఉన్న వర్ణాలు స్వర్ణఛ్ఛాయ కలవి అంటే బంగారు వన్నె కలవి.

హ కారమూ మెఱుపు వంటి రంగు కలది.  క్ష కారం కూడా అలాంటి వన్నె కలదే.

మూడవ ఆవరణం అష్టకోణం. అంటే మధ్యస్థ త్రికోణాన్ని ఆనుకుని ఉన్న ఎనిమిది త్రికోణాల వలయం. దీనికి సర్వరోగహరచక్రం అని పేరు. ఇక్కడ ఉండే దేవతలు ఎనిమందీ‌ ఈ‌ వశిన్యాదులని చదువుకున్నాం కదా.   సుధాబిందువును కలిగి ఉన్న త్రికోణాన్ని ఆనుకుని ఈ‌ అష్టకోణ చక్రం ఉందని మనకి ఇప్పటికే తెలుసు కదా.  అలాగే ఈ‌ అష్టకోణ చక్రం శివ-శక్తి త్రికోణాల మేళనం వలన యేర్పడుతోందనీ మనకు తెలుసును కదా.  దీని వలన సిధ్ధిస్తున్నది ఏమిటంటే ఏబది వర్ణమాతృకలూ శివశక్తి సమ్మేళనం ఆధారంగా కలవి అని.

అలాగే ఈ‌ అష్టకోణ చక్రం ఏ త్రికోణాన్ని ఆనుకుని ఉందో దానిలో ఉన్న వాగ్భవ, పూర్ణగిరి, జాలంధరపీఠాలను గురించికూడా చదువుకున్నాం సూక్షంగా. ఇందులోనివాగ్భవకూటాన్నే ఇక్కడ వర్ణించారన్న మాట. ఈ‌ మూడు కూటాలను అనుకుని కదా వర్ణమాతృకలు ఉన్నదీ?

అందుచేత ఈ వాగ్భవకూటాన్ని వర్ణమాతృకలకు మూలంగా సారస్వత ధ్యానం ఉందని చెబుతున్నారన్న మాట శ్రీశంకరులు.