13, జనవరి 2016, బుధవారం

కిరాతార్జునీయంలో చిత్రకవిత్వం - 4

దేవత లన్నాక రాక్షసులతో యుధ్ధాలు రాకుండా ఉండవు. రాక్షసు లన్నాక వాళ్ళకి లోకం మీద పడి అల్లకల్లోలం చేయకపోతే తోచదు. దేవతలతో తలపడక పోతే వాళ్ళకు తీట తీరటమూ‌ కుదరదు. ఒక్కో సారి రాక్షసులదే‌ పైచేయ్యి ఐనట్లూ కనిపిస్తుంది. అలాంటి సందర్భాలు వస్తే దేవతలు పోయి శివకేశవుల ముందు గోడు వెళ్ళబోసుకుంటారు. అవసరం ఐన సందర్భాలలో విష్ణువు భూలోకానికి వచ్చి మరీ రాక్షసుల సంగతి చూస్తాడు. ఒక్కొక్క సారి శివుడే స్వయంగా ప్రమథగణాలతో సహా వెళ్ళి దేవతలకు యుధ్ధంలో సహాయం చేస్తాడు.  ఆ యుధ్ధాలలో‌ ప్రమథులకు రాక్షసులతో‌ యుధ్ధం మంచినీళ్ళ ప్రాయంగా ఉంటుంది. అదొక అట వాళ్ళకి.

అలాంటి ప్రమథులు శివుడితో పాటు పోయి అర్జునుడనే నారాయణాంశసంభూతుడితో తలపడి తలలు బొప్పి కట్టించుకొని పారిపోసాగారు.  కుమారస్వామి వాళ్ళకు నాయకుడు కాబట్టి వాళ్ళను మందలిస్తున్నాడు.

మీరేమో‌ రాక్షసులతోనే ఒక ఆటలాగా యుధ్ధం చేసే వాళ్ళే. ఎంత వీరుడైనా కానీ ఒక మనిషి ముందు నిలబడలేక పారిపోతారా? అని కోప్పడి ఇంకా ఇలా అంటున్నాడు.

మీరు కంగారు కంగారుగా పరుగులు పెడుతూ‌ పారిపోతుంటే, మీ‌ బడాబడా కత్తులమీద సూర్యకాంతి తళుక్కు తళుక్కు మని మెరుస్తూ మీ‌ ముఖాల కేసి చూసి నవ్వుతున్నట్లుగా అనిపిస్తోంది. ఓరి బడుధ్ధాయిలూ యుధ్ధంలోంచి పారిపోయేవాళ్ళకు కత్తులెందుకురా అని మిమ్మల్ని అవి పరిహాసం చేస్తున్నాయి సుమా.

వనేఽవనే వనసదాం
మార్గం మార్గముపేయుషామ్‌
బాణైర్భాణైః సమాసక్తం
శంకేఽశంకేన శామ్యతి

వనసదాం అన్న మాటకు వనాలు అనగా అడవుల్లో తిరిగేవారని అర్థం.  వనే+అవనే --> వనేఽవనే అవుతున్నది. ఇక్కడ అవనము అంటే రక్షణ అని అర్థం. వనే అన్న మాటకు మార్గం+ ఉపేయుషాం (దారిని పట్టిన వారికి) అన్న చోటి మార్గం తో‌ అన్వయం.  బాణైః + బాణైః  --> బాణైర్బాణైః అంటే (రివ్వు రివ్వుమని) చప్పుడు చేస్తూ పోయే బాణాలు అని అర్థం.  శంకే+అశం+కేన --> శంకేఽశంకేన అవుతోంది. అశం అంటే దుఃఖం. శంక అంటే తెలిసిందే‌,అనుమానం అని. కేన అంటే ఎలాగు అని ప్రశ్నార్థం.

ఈ‌శ్లోకం‌ భావం తెలుసుకుందాం. అడవుల్లో మృగాలుంటాయి. వనచరులైన మనుష్యులూ‌ ఉంటారు. వాళ్ళ సంచారానికి అనువైన మార్గాలు కొన్ని అడవిలో గుర్తులుగా తెలుస్తూనే ఉంటాయి. ఆ మార్గాలు వాళ్ళ గుంపులు సంచరించే మార్గాలు కాబట్టి వాటిలో తిరుగున్నంత కాలం ఆ వనచరులకు ఆ అడవుల్లో కొంతగా రక్షణ ఉంటుంది. దారితప్పి తిరిగితే వాళ్ళకూ‌ భయమే అడవుల్లో. ఇప్పుడు మీరంతా అలాంటి సురక్షితమైన దారుల్ని ఈ అడవులో వెతుక్కుంటూ పరుగులు తీస్తున్నారు అని ప్రమథులపై కుమారస్వామి ఆక్షేపణ. అలా తలదాచుకుందుకు పరిగెట్టే మీకు చేతులో దనుస్సులూ మూపున వాడిబాణాలూ‌ ఎందుకూ? రివ్వురివ్వున చప్పుళ్ళు చేస్తూ‌ శత్రువులను హడలెత్తించే బాణాలతో‌ కూడిన అమ్ములపొదులు మీ‌ మూపున ఉన్నా ఏమీ లాభం లేకుండా ఉందే? మీ‌ కష్టం ఎలా తొలగుతుందా అని నాకు అనుమానం వస్తోంది అని కుమారస్వామి తన వీరులపైన జాలి పడుతున్నాడు.

చేతిలో‌ తళతళల కత్తులూ మూపున వేగంతోనే భయంకరమైన చప్పుళ్ళు చేసే‌ బాణాలూ ఉన్న మీకు ఎంత కష్టం వచ్చిందీ అని కుమారస్వామి ఎత్తిపొడుపు.

ఈ శ్లోకంలో‌ కూడా యమకాలంకారం ఉంది.

ఐతే ఇక్కడ యమకానికి వాడిన అక్షరసముదాయాలు వెంటవెంటనే‌ పాదం మొదటనే రావటం చూస్తున్నాం. దీన్ని పాదాది యమకం అంటారు. సంధికార్యాలవలన యమకం సాధించటం కొన్నిచోట్ల చూస్తున్నాం. వనేమార్గే అంటే అడవిదారిలో అనీ, మార్గముపేయుషాం అంటేదారి వెతుక్కుంటున్నారనీ అర్థవైచిత్రి ఒకటి చూస్తున్నాం, అలాగే బాణైః అన్నపదాన్నే రెండుసార్లు వరసగా ప్రయోగించినా అర్థాలు వేరుగా తీసుకున్నాడు కవి.