7, జనవరి 2016, గురువారం

కిరాతార్జునీయంలో చిత్రకవిత్వం - 1

భారవి వ్రాసిన కిరాతార్జునీయం కావ్యంలో కిరాతుడి రూపంలో ఉన్న శివుడికీ తాపసిగా ఉన్న అర్జునుడికీ‌ యుధ్ధం పదునాల్గవ సర్గలో ప్రారంభం అవుతుంది. ఆ యధ్ధం పదునెనిమిదవ సర్గ మొదట్లో ముగుస్తుంది. ఆ సర్గతో‌ కావ్యమూ సంపూర్ణం అవుతుంది. భారవి ఆ ఇద్దరి మధ్య జరిగిన యుధ్ధాన్ని వర్ణించే‌ సందర్భంలో పదిహేనవ సర్గలో చిత్రకవిత్వాన్ని గొప్పగా వ్రాసాడు. మనకు కిరాతార్జునీయం పూర్వాపరాలన్నీ బాగానే తెలుసును. అదీకాక గత టపాలో‌ ముందు మాటలో కొంత తలస్పర్శిగా యుధ్ధానికి దారితీసిన పరిస్థితుల్నీ పరామర్శించాం. ఇప్పుడు ఎకాయెకీన చిత్రకవిత్వం ఉన్న పదిహేనవ సర్గలోనికి వచ్చేస్తున్నాం.

అర్జునుడి మీదికి బోయవాడి వేషంలో శివుడూ అలాగే బోయపరివారంగా కనిపిస్తున్న ప్రమథగణాలూ యుధ్ధానికి దిగాయి. అర్జునుడి బాణాలు ఆ ప్రమథగణాల్ని కప్పేశాయి. ఒక తామరకొలను ఉందనుకోండి. చంద్రోదయం‌ కాగానే పండువెంన్ల ఒక్కసారిగా ఆ తామరపూవులమీద కురిస్తే ఏం‌ జరుగుతుంది. అన్నీ‌ వెలాతెలాపోయి ముడుచుకొని పోతాయి వాడిపోయి. ఒక్కో తామర పూవు మీదకీ‌ ఒక్కొక్క చంద్రకిరణం‌ తాపీగా రాదు కదా. ఆన్నింటినీ ఒక్కసారిగా వెన్నెల ముంచెత్తుతుంది. ఆనీ‌ ఒక్కసారిగా వాడిపోతాయి. అలా అర్జునుడి బాణాలవర్షం ప్రమథసందోహం అందరిమీదా ఒక్కసారిగా వెల్లువెత్తింది. అందరూ శివుడిని కూడా స్మరించకుండా లబోదిబో మని పారిపోయారట. ప్రమథులు శివుణ్ణీ స్మరించకుండా ఉండగలరా? ఎవరికైనా ఆపద వస్తే‌ శివుణ్ణి తలచుకుంటారే. మరి నిత్యం‌ కళ్ళు తెరుస్తే శివుడూ కళ్ళుమూస్తే కూడా శివుడే ఐన ప్రమథులకే శివుణ్ణి వేడాలని తోచలేదా‌ అంటే. బాణాలలా ఒక్కసారి తుఫానులాగా ముంచెత్తేసరికి మనస్సులు పనిచేయక గాభరా పడి పారిపోయారన్నమాట. ఏదో‌ అర్జునుడిని తికమక పెడదాం అని తేలిగ్గా తీసుకొని వచ్చిన ప్రమథులకే ఆపద కలిగినట్లై వాళ్ళు గొప్పగా సంభ్రమం చెంది పారిపోయారు. చివరికి వాళ్ళ కంటికీ‌ మనస్సుకీ‌ శివుడు కూడా అనలేదు!

ఆ బోయసేన దురవస్థను చూసి అర్జునిడి మనస్సు దయతో‌ కరిగిపోయిందట!

స సాసిః సాసుసూః సాసో
యేయేయేయాయయాయయః
లలౌలీలాం లలోఽలోలః
శశీశశిశుశీః శశన్     (5)

ఇది ఈ 15వ సర్గలో 5వ శ్లోకం. చిత్రకవిత్వం రుచిచూపిస్తున్న మొదటిశ్లోకం ఈ‌ సర్గలో.

ఈ శ్లోకంలో‌ చిత్రమైన విషయం ఏమిటీ అంటే చూడండి శ్లోకంలోని నాలుగు పాదాల్లోనూ ఒక్కొక్క పాదానికీ ఒక్కొక్క అక్షరాన్ని గుణింతం బేధంమాత్రం చేసి వాడుతూ నిర్మించటం.

మంచి వయ్యాకరణీ, గొప్పకవీ మహాపండితుడూ‌ ఐతే‌ తప్ప ఇలాంటి శ్లోకం వ్రాయటం‌ కుదిరేపని కాదు.

జాగ్రత్తగా పగలగొట్టుకొని ఈ శ్లోకంలోని శబ్దాలను గ్రహించాలంటే సంస్కృతంలోని ఏకాక్షరనిఘంటువులూ వగైరా తెలిసి ఉండాలి. లేకుంటే మనవల్ల కాదు.

స + అసి --> సాసి. అసి అంటే కత్తి. అసిధారావ్రతం‌ అన్నమాట విన్నారా? అక్కడ అసి అంటే కత్తి అని అర్థం మీరు ఎప్పుడో తెలుసుకొని ఉంటారు. ఇక్కడ స+అసి అని సంధిచేసి సాసి అన్నాడు కవి. ఇప్పుడు సాసి అంటే అర్థం కత్తి కలవాడు అని వస్తున్నది.

స + అసుసూః --> సాసుసూః. అసుసుః అంటే బాణం. కాబట్టి సాసుసూః అంటే బాణాలు కలవాడు.

స + ఆసః --> సాసః. ఆసః అంటే విల్లు అని అర్థం. సాసః అంటే ఇప్పుడు ధనుస్సు కలవాడు అని అర్ధం వస్తున్నది కదా.

యేయ + అయేయ + ఆయయ + అయయః --> యేయాయేయాయయాయయః అవుతున్నది. యేయము అంటే ప్రయాణసాధనం వాహనం. యేయః అంటే యేయము కలవాడు. వాహనం‌మీద ఉన్న వాడన్న మాట. అయేయః అంటే వాహనం‌ లేనివాడు. అయయ అంటే అటువంటి వారిని, అయేయః అనగా వాహనాలు లేని వాళ్ళని చేస్తున్నాడు అని అర్థం. అంటే వాహనాలున్న శత్రువుల్నీ నేలమీద ఉన్న శత్రువుల్నీ కూడా చితగ్గొట్టి వాళ్ళ వాహనాలు లాక్కుంటున్నాడు అని తాత్పర్యం.

లలః అంటె అందగాడు అని అర్థం.

అలోలః అంటే ఏవిధంగానూ మనస్సు అటూ ఇటూ చంచలంగా ఉండని వాడు. అంటే మంచి ఏకాగ్రతతో యుధ్ధం చేస్తున్న వాడు అని అర్థం.

శశి +‌ఈశ --> శశీశ. శశి అంటే అందరికీ‌ తెలుసును కదా చంద్రుడని. ఈశుడంటే అధిపతి. శశీశు డంటే చంద్రుడికి ప్రభువు ఐన శివుడు అని అర్థం వస్తోంది.

శశీశ + శిశుశీః  --> శశీశశిశుశీః. శిశువు అంటే బిడ్డ. ఇక్కడ స్మరిస్తున్నది శివుడి కొడుకైన కుమారస్వామిని. కుమారస్వామిని ఎందుకంటే ఆయన గొప్ప అందగాడు. అంతే కాక గొప్పపరాక్రమశాలి. సాక్షాత్తూ దేవతలకు సైన్యాధిపతి కూడా.  ఆయన దేవసేనాధిపతి అన్న మాట అటుంచండి. ఇక్కడ శివుడి సేనలకూ నాయకత్వం వహిస్తున్నది కూడా సాక్షాత్తూ ఆ కుమారస్వామివారేను.

శశన్  అంటే పారద్రోలటం‌ అన్న అర్థం ఇక్కడ.

అందుచేత శశీశశిశుశీః శశన్ అంటే చంద్రుడి ప్రభువైన శివుడి కొడుకు కుమారస్వామిని పరిగెత్తించే వాడు. అంటె దేవసేనాని ఐన కుమారస్వామినే గెలిచే సత్తా ఉన్నవాడు అని అర్థం. అంటే యుధ్ధంలో  అర్జునిడి నైపుణ్యాన్ని ఆ కుమారస్వామి కూడా తట్టుకోలేకపోయాడని కవి హృదయం అన్నమాట.

లీలాం అంటే విలాసాన్ని, శోభను అని అర్థం.

లలౌ అంటే పొందాడు అని అర్థం.

హమ్మయ్య. అర్థాలు తీసాం‌ కదా. ఇప్పుడు మొత్తం‌ శ్లోకం లోని భావాన్ని మననం చేసుకుందాం.

ప్రమథసైన్యాన్ని అవలీలగా పారద్రోలిన అర్జునుడి పరాక్రమశోభను కవి ప్రస్తుతి చేస్తున్నాడు. అర్జునుడు నడుముకు ఖడ్గాన్ని ధరించాడు. చేతిలో విల్లమ్ములు పట్టుకున్నాడు. వాహనాలమీద వచ్చి యుధ్ధానికి దిగిన వాళ్ళనీ, పదాతిసైన్యాన్నీ చిందరవందరచేసి పారద్రోలి వాళ్ళ ఆయుధాలూ వాహనాలూ స్వాధీనం చేసుకున్నాడు. అర్జునుడు గొప్ప అందగాడు. అందలోనే‌ కాదు పరాక్రమంలోనూ‌ సాక్షాత్తూ కుమారస్వామినే మించిపోయాడు! అటువంటి వాడైన అర్జునుడు యుధ్ధరంగంలో గొప్పశోభతో‌ ప్రకాశిస్తున్నాడు. ఎందుకంటే ఆ కుమారస్వామితో అనే కాదు ఆయన తండ్రిమీదనే తెగబడి యుధ్ధం చేస్తున్నాడు కదా, అందువల్ల ఆయన శోభ చాలా గొప్పగా ఉందట యుధ్ధంలో.

ఇదీ ఈ‌శ్లోకం లోని భావం.



14 కామెంట్‌లు:

  1. చిత్రకవిత్వాన్ని అభిమానించే నాకు ఈనాటి పోస్ట్ నిజంగా విందు భోజనమే. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శంకరయ్యగారూ, ఈ సర్గ అంతా చిత్రకవిత్వమయం కదండీ. నా చేతనైన రీతిలో‌ దాన్ని ఈ‌తరం‌ పాఠకులకు పరిచయం చేయాలనే నా తాపత్రయం. మీకు నచ్చినందుకు ధన్యుడిని. ఈ‌ మధ్యకాలంలో పండితులనీ‌ కవుల్నీ‌ ఈసడించి మాట్లాడుతున్నారు కదా వాళ్ళ కవిత్వంలో ఏమీ లేదన్నట్లూ భావయుక్తంగానూ అందంగానూ వ్రాయటానికి కొత్తపుంతల్ని తామే ఏదో కనిపెడుతున్నా మన్నట్లుగానూ! అందుచేత ఎన్నాళ్ళ నుండో ఈ భారవి సర్గను పరిచయం చేద్దాం చేద్దాం అనుకుంటూ‌నే సమయాభావం వలన వాయిదాలు వేస్తున్న నాకు నడుం బిగించి వ్రాయక తప్పటం లేదు. కొందరి కైనా ఈ‌ కాలం వారికి పూర్వకవులకు కూడా కాస్త భావయుక్తంగా వ్రాయటం తెలుసునూ‌ అన్నసంగతి అవగాహన అవుతుందేమో చూదాం.

      తొలగించండి
    2. శ్యామలరావు గారూ,
      మీరు ప్రారంభించిన ఈ శీర్షికను పరిచయం చేస్తూ శంకరాభరణం బ్లాగులో ఒక పోస్ట్ పెట్టి, లింకు ఇచ్చి, ఈరాత్రి 12-05 గం.లకు షెడ్యూల్ చేశాను. మీ పోస్ట్ అందరూ చదివి ఆనందించాలని నా ఆకాంక్ష.

      తొలగించండి
    3. చాలా సంతోషం శంకరయ్యగారూ, ధన్యవాదాలు. అందరూ చదవితే మరీ‌ ఆనందం.

      ఈ శీర్షిక ప్రారంభించి ఇది మూడవ టపా, ముందు టపాల లింకులను పేజీ కుడివైపున గమనించ ప్రార్థన.

      తొలగించండి
  2. చాలా బాగా చెపారు. భారవి "న" అనే అక్షరం మీద మొత్తం పద్యం చెప్పాడని చిన్నప్పుడు మహాకవి భారవి సీరియల్లో చూసినట్టు గుర్తు.
    ఇలాంటి పద్యం చూడటం ఇదే మొదటిసారి. ధన్యవాదాలు.

    పిడకలవేట: ఆ సీరియల్లో భారవి పాత్రధారికి భార్య గా వేసినావిడ మాత్రం గుర్తుండిపొయింది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భారవి కథ ఒక ధారావాహికగా వచ్చిందా. చాలా సంతోషం. మీరు చెప్పినది నిజమే, ఒక సర్వనకారశ్లోకమూ‌ ఉందిక్కడ ఈ సర్గలో. అది ముందుముందు వస్తుంది. ఈ సర్గలో ఔరా అనిపించే శ్లోకాలు చాలానే ఉన్నాయండి.

      తొలగించండి
  3. >> మంచి వయ్యాకరణీ, గొప్ప పండితుడూ అయితే తప్ప....

    ఇక్కడే నండి మీతో నాకు పేచీ. ఎంత గొప్పవాడైనా భగవదనుగ్రహం లేకపోతే ఒక్క అక్షరం రాయలేడు - ఎంత మంచి వయ్యాకరణి అయినా పండితుడైనా. ఇటువంటివి రాయడానికి శివానుగ్రహం ఉండాలి. అది చెప్పడం మర్చిపోయారు మీరు.

    మనోహర్ గారూ ఇక్కడ చూడండి
    దేవనాగరి (https://en.wikipedia.org/wiki/Kir%C4%81t%C4%81rjun%C4%ABya)
    न नोननुन्नो नुन्नोनो नाना नानानना ननु ।
    नुन्नोऽनुन्नो ननुन्नेनो नानेना नुन्ननुन्ननुत् ॥

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. DG గారూ, మీతో‌ నాకు పేచీ లేదండీ. శివానుగ్రహం ప్రాథమికావసరం అన్నది సర్వేసర్వత్రా వర్తించే సత్యం కాబట్టి ప్రత్యేకంగా పేర్కొనకపోయినా విప్రతిపత్తి ఏమీ‌ ఉండదు. ఇకపోతే ముందుముందు రాబోయే శ్లోకాన్ని మీరు ముందే ప్రకటించెయ్యటం దేనికో అర్థం కాలేదు. అన్ని శ్లోకాలూ క్రమంలో త్వరత్వరగానే వస్తాయి. దయచేసి అందరూ‌ కొంచెం ఓపిక పట్టవలసిందిగా నా విన్నపం.

      తొలగించండి
  4. చాలా బాగుందండి.నేనుMAచదివేటప్పుడు భారవినిగూర్చి ,చిత్రకవిత్వాన్ని గూర్చి చదివాను.36సంవత్సరాల తర్వాత మళ్ళీ చదవుతుంటే చాలా సంతోషంగా వుంది.

    రిప్లయితొలగించండి
  5. మన పాత తరం వారి సాహిత్యం అధ్బుతం. కానీ మొహమాటం లేకుండా ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. ఈ రోజుల్లో మీవంటి వారు వీటి అర్ధాలను వివరించి చెప్పకుంటే మాకు వానిలోని రసమును ఆస్వాదించే అదృష్టం ఉండదు.
    మీవంటి వారు ఇటువంటివి చెప్తూ ఉండండి. మావంటివారు మహా ప్రసాదంగా వీనిని అందుకుంటూ ఉంటాం.
    ధన్యులం
    దీపిక
    http://deepika-neerajanam.blogspot.in/

    రిప్లయితొలగించండి
  6. శ్రీ శ్యామలరావుగారికి నమస్కారములు.
    ఎంతో కాలంగా సంస్కృతము చదివి నేర్చుకోవాలని కుతూహలము. అది ఎంతవరకు సఫలమవుతుందో తెలీదుకానీ, మీ శీర్షిక పుణ్యమా అని కొన్ని సంస్కృతపదాలైన తెలిసే అవకాశము కలుగుతున్నది.అదీగాక ఇంత మధురమైన కావ్య పరిచయము, పదగుంభనములు నిజంగా ఆనందాన్ని యిస్తున్నాయి.
    ధన్యవాదములండీ.

    రిప్లయితొలగించండి
  7. శ్యామలీయం గారూ !
    ధన్యవాదములు !
    మీ కృషి శ్లాఘనీయం !

    గరికపాటి వారు ఎప్పుడూ చెబుతుంటారు

    "ఇప్పుడు వ్రాసేవాళ్ళు కాదు - చదివేవాళ్ళు కావాలి
    ప్రాచీన కవిత్వం-పాత కవిత్వం ఎంతో ఉంది
    కాని దాన్ని చదివి నలుగురికీ చెప్పేవాళ్ళు ఉంటేనే
    తెలుగు కవిత్వం మనుగడలో ఉంటుందని "

    మీరు చెప్పినట్టు ఇటువంటి శ్లోకం వ్రాయడానికే కాదు
    చదివి అర్థం చేసుకోవడానికీ
    కొన్ని అర్‌హతలతో పాటూ అభిరుచీ ఆసక్తి కృషి పట్టుదలలే
    కాక ముఖ్యంగా సమయం వెచ్చించ గలగాలి
    మీరు చేస్తున్న విశేష కృషికి వేన వేల ధన్యవాదములు !
    మన తరంలో కనీసం శతక సాహిత్యమన్నా మన వెంట ఉంది
    ఇప్పుడు వేమన పద్యం కూడా తెలియని తరం తయారవుతోంది
    ఆ తరువాత ఎటువంటి తరం రాబోతోందో ????????????







































    రిప్లయితొలగించండి
  8. ధన్యవాదాలు శ్యామలరావు గారూ !!

    మీ సమయం వెచ్చించి చిత్రకవిత్వం పరిచయం చేస్తున్నందుకు !!
    రామ్

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.