18, మార్చి 2018, ఆదివారం

కనుడి సింహాసనంబున


శ్రీరామచంద్రుడు చిన్మయు డీ నాడే
ఆరోహించె కనుడి సింహాసనంబును

ఉవిద సీతమ్మ తోడ నున్నాడు గద్దెపై
రవికులేశ్వరుడు సకలరాజపూజ్యుడై
సవినయనిజభ్రాతృ సమేతుడై కనుడిదె
పవమానసుతసేవ్యపాదుడై యున్నాడు

కనుడిదే మిత్రుడైన కపిరాజు సుగ్రీవుని
కనుడా యువరాజు నంగదుని వీరుని
కనుడు ఋక్షాగ్రగణ్యు జాంబవంతుని
ఇనకులేశ్వరుని సేవించుచును సభనిదే

ఇదే విభీషణుని లంకేశ్వరుని కనుగొనుడు
సదస్యులై రిదె కనుడు సకల ఋషులును
ముదితాత్ములు సాకేతపురవాసులను కనుడు
విదితయశుడు శ్రీరాముని పేరోలగమునందు


3 కామెంట్‌లు:

  1. శ్రీరామ పట్టాభిషేకాన్ని మనోజ్ఞంగా చిత్రించారు. నాకు సంగీతానికి చెందిన రాగ తాళ జ్ఞానం లేదు. కనుక గేయం నడకను పట్టుకొనలేక పోతున్నాను. యతి ప్రాసలను చక్కగా పాటించారు. అంటే సలక్షణమైన గీతమని స్పష్టమౌతున్నది. అభినందనలు.
    'జాంబవంతుని(న్) + ఇనకులేశ్వరుని = జాంబవంతుని నినకులేశ్వరుని' అవుతుంది కదా! అక్కడ యడాగమం రాదు. అంతగా కావాలనుకుంటే గేయమే కనుక విసంధిగా ఆ పాదాన్ని అచ్చుతోనే ప్రారంభించండి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అవునండీ. అచ్చుతోనే ప్రారంభించా లక్కడ.
      ధన్యవాదాలు.

      తొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.