24, డిసెంబర్ 2015, గురువారం

ముగ్గురే చదివిన పద్యం!

కవికి నిర్వేదం‌ కలిగించే సంగతి ఏమిటంటే వాడి కవిత్వాన్ని ఎవరూ పట్టించుకోక పోవటం.

ఈ టపా వ్రాస్తున్న సమయానికి నేటి పద్యం 'రామరధోద్దతము'ముఖం చూసిన వారి సంఖ్య కేవలం మూడు. 
పదిహేడున్నర గంటల్లో మూడు సార్లు దర్శించబడిన టపా ఇది.
అంటే ఆరు గంటలకు ఒకరన్నమాట.
బాగుంది.

ఏ గతి రచియించిరేని సమకాలము వారలు మెచ్చరే కదా! అని ఒక పద్యంలో వస్తుంది.
ఆముక్కతో ఆ పద్యం ప్రసిధ్దం ఐనట్లుంది.
అదలా ఉంచి, ఆ మాట అక్షరసత్యం.

ఎందరో పద్య కవులు మనమధ్యన ఉన్నారు.
కొద్దిమంది చదువుతున్నారు నా పద్యాలను కూడా. అందుకు ఆనందం.
పది మంది పెద్దలు చదివి తప్పొప్పులు చెబితే నాబోటీ అల్పకవికి ఎదిగేందుకు కాస్త అవకాశం వస్తుంది.
లేకుంటే నా బోటివాడికి అభివ్బృధ్ధి ఎట్లాగు?

ఎందరో పద్యరచనా ప్రయత్నాలు చేస్తున్న ఔత్సాహికులున్నారు మనమధ్య.
వారిలో‌ అధికులు ఈ బ్లాగు ముఖం చూదను కూడా చూడరు!
బహుశః నేను వారి స్థాయికి తగిన వాడిని కాకపోవచ్చును.
అది వారిలో‌ కొందరి ఉద్దేశం‌ కావచ్చును.
కొందరికి నా కవిత్వంతో పరిచయం కూడా లేక పోవచ్చును.
కొందరికి వారి కవితావ్యాసంగంతోనే తీరిక లేక ఇతరులు వ్రాసేది చదివే ఓపికా తీరికా లేకపోవచ్చును.

కొందరు చదువుతున్నారు నా కవిత్వాన్ని.
అది నాకు చాలా ఉత్సాహాన్ని ఇస్తున్నది.
శ్రీ విష్ణునందన్ గారు కావ్యనిర్మాణం చేసిన కవివరేణ్యులు. వారు సలహాలనిచ్చి ప్రోత్సహిస్తున్నారు.
శ్రీ గుండు మధుసూదన్ గారు వృత్తిరీత్యా ఉపాధ్యాయులు. వారు కూడా నాకు ప్రోత్సాహాన్నిస్తున్నారు నా పద్యాలను పరామర్శిస్తూ.
శ్రీ ఆచార్య ఫణీంద్ర గారు లబ్ధప్రతిష్ఠులైన కవి.  వారు చదువుతున్నారు.  ఒక అభినందన వ్యాఖ్యకూడా ఇచ్చారు.

కొందరు వింతవింత వ్యాఖ్యలూ చేస్తున్నారు కాని వాటీ సంఖ్య స్వల్పమే.
అంటే స్వల్పమైన దర్శనాలు కల అంతకంటే స్వల్పమైన వ్యాఖ్యలు కల టపాల్లో -
స్వల్పసంఖ్యలోనే వింతవ్యాఖ్యలు వచ్చాయి లెండి.
గుడ్డిలో మెల్ల.

మొత్తం మీద చదువుతున్నవారు బాగా తక్కువే.
ఐనా వ్రాస్తూనే ఉంటాను.
ఎందుకంటే ఈ పద్యాలు నా రాముడి కోసం వ్రాస్తున్నవి.
ఎవరు నేడు చదివినా చదవక పోయినా ఇబ్బంది లేదు.
రాముడు మెచ్చిన చాలును కదా!

ఏ మంటారు?