23, డిసెంబర్ 2015, బుధవారం

అలసగతి శ్రీరామం





    అలసగతి.
    హరిహరులు మిత్రులని యందరను టొప్పున్
    పురహరుని బాణముగ బొల్చె హరి యట్లే
    హరి నరుడుగా నగుడు నంధకరిపుండున్
    ధరకు డిగె మారుతిగ దాను కడు వేడ్కన్




అలసగతి.

ఈ‌అలసగతి వృత్తానికి గణాలు న - స - న - భ - య. అంటే పాదానికి 15 అక్షరాలు. యతిస్థానం 10వ అక్షరం.
నడక ప్రకారం ఇది మూడు పంచమాత్రాగణాల పైన ఒక చతుర్మాత్రా గణం అనుకోవచ్చును. పాదం చివరి గణానికి మనం అదనపు మాత్రలను అవసరం మేరకు చేర్చుకోవచ్చును కాబట్టి ఈ పద్యం అంతా పంచమాత్రాగణాల పైన నడుస్తుందని భావించితే పొరపాటు లేదు.

అలసగతి వృత్తాల్లో జెజ్జాల కృష్ణ మోహన రావు గారు వ్రాసిన వాటిలోఒకటి  ఈ క్రింద ఇస్తున్నాను. మిగిలినవి అక్కడ చదువుకొన గలరు.
 
    జనని నను బ్రోవఁగను శాంతముగ రావా
    కనుల దయ జూపఁగను గావఁగను రావా
    వినుము మన మందెపుడుఁ బ్రేమమయి నీవే
    దినము కడు చల్లగను దీవెనల నీవే

విశ్వనాథవారు కూడా అలసగతి వృత్తంలో వ్రాసినట్లు తెలుస్తున్నది. ఎవరైనా వారి పద్యాలు ఈ వృత్తం లోనివి తమవద్ద ఉంటే పంపితే ఇందులో చేర్చగలను.
 
మహామహోపాధ్యాయ కొక్కొండ వేంకటరత్నం పంతులుగారి పద్యం

    అనువుగను వా రటు విహారమును జేయన్
    వన మదియు దానఁ గన వర్ణనను దానున్
    ఘనయశముఁ గాంచ ననఁగా నమృతభానుం
    డొనరె నపు డీశుఁ డిటు లొప్పుగను జెప్పెన్
 
ఇతర కవు లెవరైనా ఈ‌ అలసగతి వృత్తంలో వ్రాసారా అన్నది తెలియదు.

ఇక నడక ప్రకారం మనం చెప్పుకున్న శివకేశవస్తుతి పద్యం ఇలా ఉంది:

హరిహరులు మిత్రులని యందరను టొప్పున్
పురహరుని బాణముగ బొల్చె హరి యట్లే
హరి నరుడు గా నగుడు నంధకరి పుండున్
ధరకు డిగె మారుతిగ దాను కడు వేడ్కన్



2 కామెంట్‌లు:


  1. శ్యామలీయం వారు,

    యతి ప్రాసల కోసం అక్షరాలని పేర్చి నట్టని పిస్తోందండి ;

    ఉచ్ఛ స్వరం తో చదివితే అంత సొబగు గా అనిపించడం లేదు ; (ఉ: పుండున్)

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. యతిప్రాసలకోసం‌ అక్షరాలను పేర్చుతున్నాననా! అటువంటి స్థితికి దిగజారిన పక్షంలో ఇంక నేను వ్రాయకపోవటమే మంచిది కదా.

      యతిప్రాసలకోసమూ పదాలకోసమూ‌ తడుముకునే‌ స్థాయి వ్యక్తికి ఒక తేటగీతిని కూర్చాలన్నా గంటలు పట్టవచ్చును. కాని మీరు నమ్మినా నమ్మక పోయినా ఈ‌ పద్యం‌ కేవలం మూడు నాలుగు నిముషాల్లోనే వచ్చింది, టైపు చేయటానికి పట్టిన సమయంతో‌ సహా. తడుముకుంటూ ఇలా చేయటం సాధ్యం కాదు కదా. కొంచెం హేతువాదం లాంటిది చేసి శ్యామలరావు చెబుతున్నది అబధ్ధం అనవచ్చును. ఎవరేమి అన్నా నేను చేయగలిగింది లేదు కదా. అటువంటి విషయాలపై ఆలోచించే ఉద్దేశం‌ లేదు.

      మీకు సంగీత పరిఙ్ఞానం అంటే రాగతాళాదులగురించి చక్కని అవగాహన ఉన్న పక్షంలో, ఒక పాటకు ఒకటి కంటే ఎక్కువ బాణీలు కట్టటం‌ కుదరుతుంది సాధారణంగా అన్నది తెలిసే ఉంటుంది. అలాగే సాధారణ సంగీత పరిఙ్ఞానం కూడా లేని వ్యక్తి అన్నామాచార్యులవారి కీర్తనను చదివి ఒక పద్జ్దతీ పాడు లేకుండా ఏదో రాసినట్లుంది అనవచ్చును. మీ గురించి తెలియకుండా మీరు సరిగా పద్యపు నడకను పట్టుకోలెకపోయారనో మీకు సంగీతం గురించి అవగాహన లేదనో మరొకటో అనటానికి నాకు మనస్కరించదు. అది నా పధ్ధతి కాదు. మీరు మరికొంచెం‌ ప్రయత్నం చేయండి బాణీ కట్టుకుందుకు.

      తొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.