11, డిసెంబర్ 2015, శుక్రవారం

ఇంద్రవంశంలో‌ రామస్తుతి.







    ఇంద్రవంశం.
    శ్రీజానకీ‌నాథుని చేరి యుండుటే
    యీ‌జన్మసాఫల్యత యెన్న నందుచే
    నే జేయు కార్యంబుల నెల్ల భంగులన్
    రాజిల్లు నా భక్తి నిరంతరంబుగన్





ఈ ఇంద్రవంశం అనే‌ వృత్తానికి గణవిభజన త - త - జ - ర అనేవి. యతిస్థానం‌  8వ అక్షరం. అంటే ఇక్కడ 'జ' గణంలో మధ్యలో ఉన్న గురువుపైన యతిస్థానం వస్తుందన్న మాట. సాధారణంగా వృత్తాల్లో యతిస్థానంలో గురువే ఉంటుంది. సాధారణంగా అనటం‌ ఎందుకంటే‌ అదేమీ‌ బండరూలు కాదు కాబట్టి.

ఈ వృత్తానికి నేమాని రామజోగి సన్యాసి రావు గారు ఒక శంకరాభరణం బ్లాగుటపాలో  ఇచ్చిన పద్యం‌

    ఇందీవరశ్యామ! నరేశ్వరేశ్వరా!
    బృందారక ప్రస్తుత విక్రమోజ్జ్వలా!
    మందస్మితాస్యాంబుజ! క్ష్మాసుతా ప్రియా!
    వందారు మందార! భవప్రణాశకా!

ఇతే ఈ‌ ఉదాహరణ పద్యం అంతా సంస్కృతం‌ కాబట్టి ఇదొక శ్లోకం తప్ప తెలుగు పద్యం‌ కాదనటం‌ వేరే విషయం.  కాని ఇందులో ఉన్నవి తత్సమాలూ వాటితో సంబోధనాప్రథమావిభక్తి ప్రయోగాలు. కాబట్టి ఇది తెలుగు పద్యమే అవుతున్నది.   సరే, ఇంకొక తెలుగుపద్యం‌కావాలంటే వారు అదే టపాలో ఇచ్చిన పద్యం చూదాం.

    దేవా! జగద్రక్షక! దీనబాంధవా!
    కైవల్య యోగప్రద! కామనాశకా!
    భావింతు నీ తత్త్వము ఫాలలోచనా!
    కావింతు నీ సేవల కంజజార్చితా!

 ఈ ఇంద్రవంశం వృత్తంలో‌వాసుదాసులు ఆంధ్రవాల్మీకి వావిలికొలను సుబ్బారావుగారి రామాయణంలోని ఒక పద్యం చూదాం.

    ధీమజ్జనుల్ మెచ్చెడి దేవరానతిన్
    నేమంబుమైఁ దీర్పఁ గ నేనుగోరిన
    ట్లీ మేలిభోగంబుల నిచ్చగింపఁ జూ
    భూమీశ నాకై యిటు పొక్క నేటికిన్

సంస్కృతంలో పాదాంతయతి ఉంది. అంటే పాదం చివరిమాట తరువాతి పాదంలోనికి ప్రవేశించకూడదు. తెలుగులో మనం‌ ప్రవాహగుణం అని చెప్పి ఆ నియమం సడలించి వేసాం. పైని వాసుదాసు గారి పద్యంలో రెండవపాదం చివరి పదం‌ 'కోరినట్లు'. మూదవపాదం మొదటి పదం‌ 'ఈ' కోరినట్లు +‌ఈ => కోరినట్లీ అని ఐపోతుంది. ఉత్తు వెంబడే మరొక అచ్చు వస్తే‌ అంతే అని కదా తెలుగు వ్యాకరణం. సరే ఇప్పుడు పదం ఏమిటి? 'కోరినట్లీ' అని కదా. మూడవపాదం మొదట ఈ‌'ట్లీ' వచ్చి కూర్చుంది సదుపాయంగా. ఇలా తెలుగులో వీలవుతుంది కాని సంస్కృతంలో కాదు. పాదం చివరకు మాట పూర్తి ఐపోయి తీరాలి.

అలాగే సంస్కృతశ్లోకాల్లో‌ యతిస్థానం దగ్గర కొత్తపదం‌ మొదలవ్వాలి. అక్కడ మన తెలుగులో లాగా అక్షరసామ్య యతి నియమం లేదు. నేమాని వారిది శ్లోకంలా ఉన్నా అది తెలుగుపద్యమే అనుకున్నాం కదా. నాలుగవ పాదంలో‌యతిస్థానం దగ్గర లోపం‌ కనిపిస్తోంది కాని సరిగానే ఉంది - ఎందుకంటే‌ భవ అన్న పదంలో రెండవ అక్షరం దగ్గర విశ్రామం రావలసి వస్తోంది కాబట్టి సంస్కృతం ఒప్పకపోయినా తెలుగుపద్యంలో అలా అంగీకరిస్తాం కదా.

ఇక ఈ‌ఇంద్రవంశం నడకను గూర్చి కొంచెం ఆలోచిద్దాం.  నాకైతే ఇంద్రవంశం‌పాదం రెండు లేదా మూడు ఖండాలుగా నడుస్తుందని అనిపిస్తోంది.

నేమాని వారి శ్లోకం

    దేవా! జగద్ర - క్షక! దీన - బాంధవా!
    కైవల్య యోగ - ప్రద! కామ - నాశకా!
    భావింతు నీ త - త్త్వము ఫాల - లోచనా!
    కావింతు నీ సే - వల కంజ - జార్చితా!

నే నిచ్చిన పద్యం

    శ్రీజానకీ‌నా - థుని చేరి - యుండుటే
    యీ‌జన్మసాఫ - ల్యత యెన్న - నందుచే
    నే జేయు కార్యం - బుల నెల్ల - భంగులం
    రాజిల్లు నా భక్ - తి నిరంత - రంబుగన్

అలాగే వాసుదాసుగారి పద్యంలో చివరి రెండు పాదాలు చూపుతాను.

    ఈ మేలిభోగం - బుల నిచ్చ - గింపఁ జూ
    భూమీశ నాకై - యిటు పొక్క - నేటికిన్

అలాగే రెండే‌ ఖండాలుగా ఈ‌ ఇంద్రవంశం‌ నడక చూస్తే

    శ్రీజానకీ‌నాథుని  - చేరి యుండుటే
    యీ‌జన్మసాఫల్యత  - యెన్న నందుచే

 ఇలా ఉంటుంది.

ఏ పద్యాన్ని సాధన చేయాలన్నా ముందుగా దాని నడకను బాగా పరిశీలించాలి. అప్పుడు వ్రాయట‌ం తేలిక అవుతుంది.  అబ్యాసం‌ చేయగా చేయగా మంచి ధార వస్తుంది. అంతకన్న విశేషం లేదు.

చాలా మంది అపోహపడే మరొక సంగతి ఉంది. చాలా మంది భాషమీద మాంచి పట్టూ, పాండిత్యం ఉంటే కాని పద్యాలు వ్రాయటం‌ ఆసాధ్యం‌ అనుకుంటారు. పట్టు చాలు పాండిత్యం అక్కరలేదు. నేను కూడా తెలుగులో మంచి పండితుడను ఏమీ కాను.  అనేకమంది కవులకు పాండిత్యం తగినంత ఉంటుంది - ఉండాలి. కాని కవి ఉద్దండపండితుడు కావాలసిన అవసరం‌ లేదు.  తెలుగులో‌ మంచి పాండిత్యం‌ కలవారు ఉంటారు అనేక మంది ఉంటారు . కాని వాళ్ళలో పద్యాలు వ్రాయటం రాని వారే హెచ్చుమంది ఉంటారు.  అభిరుచి ఉంటే పద్యవిద్యను అభ్యాసం చేయవచ్చును.


6 కామెంట్‌లు:


  1. జానకి వారి ని తలచినారు; సర్వం ఇక ఇనకులతిలకులవారు చూసుకుంటారు !

    శుభోదయం
    జిలేబి

    రిప్లయితొలగించండి
  2. భక్త కవి తిలకులు శ్రీ శ్యామలీయం గారు,
    మధురమైన భావగర్భితమైన చక్కని పద్యమిది.
    ౧.ఒక మాట - పద వైశేష్యం మీద తద్ధిత రూపం సిద్ధించదు.
    సమర్థము (పదం) - సమర్థత (తద్ధిత రూపం) లేదా సామర్థ్యం (వైశేష్యం) ; సామర్థ్యత సిద్ధించదు. అలాగే సఫలం కూడా.
    తజ్జన్యాలు - సఫలత, సాఫల్యం. సాఫల్యత సిద్ధించదు.
    2.స్వస్స్థులైన పండిత నేమాని వారు రచించినది తెలుగు పద్యమే. శ్లోకం కాదు. ఆ పద్యంలో ఉన్నవి సంస్కృత తత్సమాలైన తెలుగు పదాలే అని చెప్పవచ్చు - పదాంతాలలో ఉన్న దీర్ఘాలను బట్టి.
    సంస్కృత శ్లోకం లో పురుష సంబోధనలెన్నడు దీర్ఘాంతాలు కానేరవు. తెలుగు లో రాముని 'రామ' అనీ, 'రామా' అనీ ఛందోనుగుణంగా పిలిచే సౌలభ్యం ఉంది కానీ సంస్కృతంలో రామ అని హ్రస్వాంతంగా పిలవాలి. పైలక్షణ పద్యం లో సంబోధనలు పురుష వాచకాలు మరియు దీర్ఘాంతాలు కనుక తెలుగు పద్యమే. పైపెచ్చు తెలుగు సంబోధన ప్రథమా విభక్తి తప్ప ఇతరేతర సంస్కృత ప్రత్యయాలేమీ లేవు. అందుకే వారి పద్యంలో మీరు గమనించినట్లు నాల్గవ పాదంలోనే కాక మొదటి పాదంలో కూడ యతి 'విరామ లోపం' కనిపిస్తోంది.

    ప్రకృతమనుసరామ - మీ రామ భక్తి, కవితా శక్తి రెండూ ప్రశంసనీయాలు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విష్ణునందనులవారూ,

      పద వైశేష్యం మీద తద్ధిత రూపం సిద్ధించదు కాబట్టి సాఫల్యత అన్నది మార్పుచేయలవసి వస్తుంది. వీలు చిక్కగానే ఆలోచించి సరిజేస్తానండి. ఈ సంగతి నాకు అంతగా పరిచితం కానిది. నిజానికి వ్రాయటానికి రాని ఇబ్బందులు సరిజేయటంలో ఉంటాయని కవివరులైన మీకు తెలియంది కాదు - వ్రాసేటప్పుడు ధార చూసుకుంటుంది అంతా. మార్పు చేసేటప్పుడు అతుకులాగు అనిపించకుండా ఉండటం కించిత్తు శ్రమతో కూడి ఉంటుంది. కాని తప్పులు సరిచేయవలసిందే కదా!

      రెండవసంగతి. నేమానివారు సంబోధనాప్రథమావిభక్తిగా దీర్థాంతంగా అకారాంత పుంలింగమైన రామ శబ్దానికి తత్సమం రామపదాన్ని రామా అని అన్నారని స్పష్టం. ఈ విషయం గమనించితే నేమానివారిది తెలుగుపద్యమే అవుతున్నది. బాగుంది. మొదటిపాదం యతివిషయం నా గమనికకు వచ్చింది కాని అక్కడ యతిసరిపోయినదేమో అని అనిపించినదండి.నరేశ్వరేశ్వరా అన్న సమాసంలోని ద్వితీయాక్షరంపైన యతిస్థానం వచ్చింది కదా. అక్కడ నర + ఈశ్వరేశ్వరా అని సంధి ఉన్నది. పదఛ్ఛేదం ఐనది కాబట్టి యతిసరిపోయినట్లే అని అనుకున్నాను.

      తొలగించండి
    2. విష్ణునందనులవారూ, నేమాని వారిది సంస్కృతంలా కనిపించినా అది తెలుగుపద్యమే అవుతున్నది కాబట్టి అక్షరసామ్యయతి బాగానే వచ్చింది కదా అన్ని పాదాల్లోనూ - ఇబ్బంది లేదు.

      తొలగించండి
  3. శ్రీ శ్యామలీయం గారు, అవును - పండిత నేమాని వారి పద్యంలో మీరన్న 'యతి విరామ లోపం' సంస్కృతమైతేనే వర్తిస్తుంది, యిప్పుడు తెలుగు కనుక - కాదని చెప్పడానికే అక్కడ '' ఆ గుర్తులను నిక్షేపించాను. అదొక సంశ్లిష్ట వాక్య నిర్మాణం కనుక మీరన్యథా భావించడానికాస్కారమిచ్చినట్లుంది.
    సంస్కృత పరంగా 'దృశ్యమానమైన' యతి విరామ లోపం తెలుగు పద్యం అయింది కాబట్టి అలాంటి దేమీ లేదని చెప్పడమే స్వీయాభిప్రాయం.

    ఇక మీ గురించి -

    "అమితోత్సాహము పొంగులెత్త రఘువంశాంభోధి చంద్ర ప్రభా
    వము సౌజన్యము బాహు విక్రమము శుంభద్దివ్య వృత్తాంతమున్
    దమివోవన్ విరచించి పాడునిట విద్యాశీలి యీ 'శ్యామలీ
    యము' పుంస్కోకిలమై రసజ్ఞవరు లౌరా యంచు కొండాడగన్!

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.