30, ఆగస్టు 2013, శుక్రవారం

సనాతనధర్మం ఉన్న పరిస్థితి, పురాణేతిహాసాలలోని ఘట్టాల వక్రీకరణ గురించి

(ఇది ఈరోజున నేను చూసిన పురాణేతిహాసాలలోని ఘట్టాల వక్రీకరణ - దానిపై మనం చేపట్టాల్సిన చర్యలు? అనే టపాకు నా స్పందన)

 సనాతనధర్మాన్ని అనుసరిస్తున్న మనం, కొంత సంకుచితంగానే అనుకోండి, హిందువులం అని ఒక మతంగా పేరు పెట్టుకుని చెప్పుకుంటున్నాం. ఇతర మతాల్లాగా, ఈ‌ సనాతనధర్మం భావవ్యక్తీకరణ స్వేఛ్ఛను నియంత్రించదు. అందుచేత అప్పుడప్పుడూ ఈ సనాతనధర్మం యొక్క మూలస్వరూపాన్నే అర్థంచేసుకోకుండా, అధిక్షేపించే వ్యక్తులు పుట్టుకుని వస్తూ ఉంటారు. అలాంటి వ్యవస్థలూ తల ఎత్తుతూ ఉంటాయి. అటువంటి పరిస్థితులు ప్రబలి నప్పుడు శ్రీకృష్ణులవంటి అవతారపురుషులూ, శ్రీశంకరుల వంటి సద్గురువులూ వచ్చి దిశానిర్దేశం చేస్తారు. దాని అర్థం, సనాతనధర్మాన్ని అవలంబించిన వారు అటువంటి వారి రాకకోసం ప్రతీక్షిస్తూ నిష్క్రియాపరులుగా ఊరుకోవాలీ అని కాదు. సామరస్యపూర్వకంగా సనాతనధర్మాన్ని నష్టపరచే శక్తులను సన్మార్గంలోనికి తీసుకు వచ్చేందుకు ప్రయత్నించాలి. కలిప్రభావం చేత ప్రస్తుతం అధర్మశక్తులది పైచేయిగానే ఉందన్నది ఒప్పుకు తీరవలసిన నిజం.

బాధగురువుల సంఖ్యా, వారి అనుచరగణం సంఖ్యా, ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతోందన్నది వాస్తవం. అటువంటి వారు అజ్ఞానంతోనూ, మిడిమిడిజ్ఞానంతోనూ సద్గ్రంథాలకు దుర్వ్యాఖ్యానాలు చేస్తున్నారు, ఇంకా చేస్తారు. ఎవరైనా ఈ రోజుల్లో కాస్త ప్రచారం చేసుకోగల ట్రిక్కులు చేతనైన వాడైతే, సద్గురువూ జగద్గురువూ అని జనం చేత నీరాజనాలు పట్టించుకుంటున్నాడు. అయన బోధనలో, ఆయనశిష్యుల చేత వ్రాయించుకున్న పుస్తకాలో ఆర్షవాంగ్మయాన్ని తప్పుడు పధ్ధతుల్లో వ్యాఖ్యానించటం ఆశ్చర్యపోవలసిన విషయమేమీ‌ కాదు.  ఇలాంటి వారికి ఎంత అనుచరగణం ఉంటుందీ అంటే, ఒక్క విషయం ఆలోచించండి. ఇప్పటికే చాలా ఇళ్ళల్లోంచి ఆర్షవాంగ్మయమూ, తత్సంప్రదాయానికి చెందిన అన్ని రకాల చిహ్నాలూ మాయం అవుతున్నాయి, ఈ‌ క్రొత్తగురువుల / అవతారపురుషుల / దేవుళ్ళ పుస్తకాలకూ చిహ్నాలకూ చోటు కల్పించటం కోసం. నాకు తెలిసిన ఒక కుటుంబం వారు ఇలాంటి ఒక కొత్త గురుసాంప్రదాయానికి జై అనటమే కాదు, వారింట్లో పెద్దలనుండి వచ్చిన శ్రీరామపంచాయతనాన్ని హుస్సేన్ సాగర్‌లో పారేసారు! దాదాపు ఇప్పటికే, రామ నామం కూడా కొత్త కొత్త దేవుళ్ళ నామధేయాలను ముందో వెనుకో తగిలించుకోకుందా నిలబడ లేని స్థితి కలుగుతోంది.

మీరు ఆవేదన చెంది ప్రతిఘటిస్తే ఏం జరుగుతుంది? మీకున్న వాక్స్వాతంత్ర్యం వారికీ ఉంది. వారి వెనుక నిలబడే వారి సంఖ్య మీ వెనుకాముందూ ఉన్న వారికన్నా అత్యధికంగా ఉండి, మీ వాదం చెల్లకుండా పోతుంది. ఒక అనుమానం రావచ్చును, అలా ఎందుకు జరుగుతుందీ, ఇలా కొత్త కొత్త పుంతలు తొక్కుతున్న వాళ్ళ కన్నా కూడా, సాంప్రదాయికమైన పంథాలో పోయే వాళ్ళ సంఖ్యే ఎక్కువగా ఉంటుంది కదా అని.

 మన వాళ్ళలో చాలా మందికి అకర్మణ్యత్వం మీద చాలా గురి. మనకెందుకూ, అనవసరమైన గొడవల్లో తలదూర్చటం, మనకేమీ ఇబ్బంది లేదు కదా అని ఊరుకునే వాళ్ళే ఎక్కువగా ఉంటారు. మరి కొంత మందైతే మనకేం తెలుసూ ఏ పుట్టలో ఏ పాముందో అనుకుని చూస్తూ ఉంటారు. కొత్త కొత్త దారుల్లో కాలు మోపినవాళ్ళు మాత్రం చక్కగా తమని తాము సంరక్షించుకుందుకే చూస్తారు కానీ‌ అలా ఊరుకోరు.  వాళ్ళకు తోడుగా ఇతర మతాలవాళ్ళూ, హేతువాదులూ ప్రజాహక్కులవాళ్ళూ అంటూ అనేక మంది అనేక కోణాల్లో విరుచుకు పడతారు.  అవసరమైతే సాక్షత్తూ ప్రభుత్వాలూ రంగంలోకి దిగుతాయి మిమ్మల్ని కట్టడి చేయటానికి. అసలు ఈ‌ దేశంలో హిందూ అన్న పదాన్ని రాజకీయ వర్గాలు ఒక టెర్రరిష్టు పరిభాషలోని పదంలాగా చిత్రీకరిస్తున్నారు. క్రమంగా కొంత కాలానికి రామా అన్న మాట కూడా అభ్యంతరకరం ఐన పదం ఐపోయినా ఆశ్చర్యం లేదు.

సనాతనవాదుల మాట చెల్లక పోయేందుకు మరొక కారణం కూదా ఉంది. ఈ కొత్త కొత్త గురుపీఠాలూ, దైవాలదివ్యక్షేత్రాలూ భక్తబృందాలు ఇచ్చే అఖండ సిరిసంపదలతో తులతూగుతూ ఉంటాయి. సమాజంలో బడాబాబులూ, రాజకీయనాయకులూ ఇంకా అనేక రకాల లబ్ధప్రతిష్టులూ వారికి భక్తులుగా శిష్యులుగా ఉంటారు. అభ్యంతరం చెప్పే సనాతన వాది వెనుక ఎవరూ నిలబడతారనే నమ్మకం లేదు కాని, వ్యతిరేకంగా ఎందరో నిలబడతారని సులువుగా తెలుసుకోవచ్చును. భక్తపరమాణువులకు పవిత్రజీవనం గురించీ, కామినీకాంచనాల వల్ల ప్రమాదాల గురించీ దివ్యసందేశాలు ఇచ్చే ఈ‌ మహానుభావులు, దివ్యవ్యక్తులు కాబట్టి వారు మాత్రం ఈ ఉపదేశాలకు ఆవల వెలుగొందుతూ‌ ఉంటారు. 'శూలి భక్తాళి దుశ్శీలముల్ గన్న, మేలుగా గైకొనుమీ‌ బసవన్న' అన్నట్లుగా వీళ్ళ అభ్యంతరకరమైన విలాసాలు కల్లోలం కలిగించినా, ఆ భక్తశిఖామణులు వాటిని స్వామివార్ల లీలలుగానే గ్రహించి ఆనందించి తరించి ప్రచారం చేస్తారు. అందుచేత స్వామివార్లు సనాతన సంప్రదాయానికి తప్పుడు వ్యాఖ్యలు చేసినా, కొత్తకొత్త విషయాలు పౌరాణిక వాంగ్మయానికి జతచేసి దుర్వాఖ్యానాలు చేసినా అవన్నీ వారు చెప్పిన కొత్త కొత్త ప్రామాణిక విషయాలు ఐపోతాయన్న మాట. సామాన్య సంప్రదాయవాది కాదని నెగ్గే పరిస్థితి లేదు.

ఇతర మతాలలో ఇలాంటి పరిస్థితి ఎందుకు లేదూ అంటే ఆయా మతాలు సాంప్రదాయిక భావనాస్రవంతికి భిన్నంగా బయటి వాళ్ళైనా, లోపలి వాళ్ళైనా సరే, ఒక్కముక్క అన్నా సహించవు కనుక. తరచుగా ఏ మతం ఐనా మైనారిటీగా ఉండే దేశంలో దాని యొక్క సాంప్రదాయిక భావజాలం మరియు ఆచారాల పట్ల హెచ్చుగా ఆరాధనా భావం ఉంటుంది తన్మతస్థుల్లో.  ఇందులో ఆశ్చర్య పోవలసింది ఏమీ లేదు.

కాబట్టి ఈ‌ దేశంలో సినీనాటకరంగాల్లో (ఇంకా తెలుగు నాటకరంగం అనేది ఎక్కడుంది లెండి), శ్రీకృష్ణుణ్ణి ఒక టక్కరి పాత్రగానో, కపటిగానో చవకబారుగా చూపిస్తే  లేదా వినాయకుణ్ణి ఒక హాస్య పాత్రగా చూపిస్తే, నారదుణ్ణి ఒక వెకిలిపాత్రగా చూపిస్తే నూటికి తొంభైతొమ్మిది మంది హిందువులం అని చెప్పుకునే వాళ్ళు హాయిగా నవ్వుకుంటూ చూస్తారు. ఒక్కరికీ మనస్సు చివుక్కు మనదు. మరి ఈ సినీనాటకరంగాల వాళ్ళకి ఏసుక్రీస్తునో, మేరీమాతనో, గురుగోబింద్ సింగ్‌నో, సాయిబాబానో, మహమ్మద్ ప్రవక్తనో అలా ఈషణ్మాత్రంగా నైనా స్థాయి దిగజార్చి చిత్రీకరించే దమ్ము ఉంటుందా? నిజానికి అనుకోకుండా ఐనా అదికొద్దిగా నైనా జరిగితే, ఆ మతానుయాయుల మనోభావాలు దెబ్బతింటే, ఏం జరుగుతుందో తెలుసు కదా? ఆ మతాలవాళ్ళు తమ నిరసనను బ్రహ్మాండంగా తెలియజేస్తారు. మన ప్రజాస్వామ్య వ్యవస్థను నడిపే ప్రభుత్వాలూ, న్యాయస్థానాలూ కళ్ళెర్ర జేస్తాయి. అందుచేత ఈ సినీనాటకరంగాల వాళ్ళు హిందూ దేవుళ్ళను ఋషులనూ సినిమాలు ఆడించటానికి పనికి వచ్చే‌ పాత్రలుగానే చూస్తూ ఎలా పడితే అలా ఈడుస్తున్నారు. కాని ఇతరమతాల మహాత్ముల విషయంలో ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు.

 ఒకప్పుడు గణేష్ బొమ్మను బీడీ కట్టలమీద ముద్రించటాన్ని అడ్డుకోమని న్యాయస్థానాలను ఆశ్రయిస్తే ఏం జరిగింది? లోదుస్తుల్లోనూ చెప్పులమీదా, కమోడ్ సీట్లమీదా హిందూ దైవాల బొమ్మలు ముద్రించకుండా ఇవే‌ ప్రభుత్వాలూ ఇవే న్యాయస్థానాలు అడ్డుకున్నాయా?  హిందూమతం మెజారిటీ మతం ఇక్కడ. కాబట్టి వాళ్ళకి, ఏ అభద్రతా లేదు. అందుచేత వాళ్ళు కలిసికట్టుగా ఉండరు.  కాబట్టి ఈ‌ మతం వాళ్ళు ఓటు బాంక్ కాదు. అందుచేత ఎవ్వరూ‌ పట్టించుకోరు. ప్రస్తుత రాజకీయ వ్యవస్థ ఏమీ సహాయం చెయ్యదు. అసలు ఒకవేళ వివేకానందుడు ఈ‌ కాలం మనిషి ఐతే, హిందూఉగ్రవాది అన్న ముద్రతో కటకటాల వెనుక ఉండేవాడు.  ఏదో అమెరికా వాడు వీసా ఇవ్వటం దేవుడెరుగు.

అందుచేత వేదవ్యాసులవారి భాగవతంలో ఫలాని ఘట్టం ఇలా లేదూ, ఫలాని పాత్ర ఇలా లేదూ, వీళ్ళెవరో ఎలా మారుస్తారూ అని, హిందువులని చెప్పుకునే వాళ్ళు కోర్టు తలుపులు తట్టరు.  ఎవరైనా రాముడిని గురించి హీనంగా మాట్లాడితే బ్లాస్ఫెమీ అంటూ ఎవరూ కేసులు వేయరు. అలా మాట్లాడినవారు మేథావులుగా వెంటనే చెలామణీలోకి వచ్చేస్తారు కూడా తరచుగా.

ఈ విషయంలో మొన్ననే ఒక వ్యక్తి చేసిన వాదం (బ్లాగుల్లో కాదు) ఏమిటంటే, పూర్వం వ్యాసుడో, వాల్మీకో చెప్పినదే సంపూర్ణం అని ప్రమాణం అనుకోమంటే ఎలా?  మా ఫలాని గురువుగారు సాక్షాత్తూ అప్పట్లో శ్రీరామవతారం ఎత్తిన, తరువాత శ్రీకృష్ణావతారమూ ఎత్తిన దేవుడే -- ఆమాట ఆయనే చెప్పారు, మేం నమ్ముతున్నాం -- కాబట్టి కొత్త కొత్త విషయాలు పూర్వ ఋషులు చెప్పకపోతే ఈయన ఎందుకు చెప్పకూడదూ? మాకు ఇవీ‌ ప్రమాణమే.  ఆమాటకు వస్తే వ్యాసవాల్మీకాదుల రచనల్లో మా దేవుడి మాటలకు విరుధ్ధంగా లేని మాటలే మేం ప్రమాణం అనుకుంటాం అని. ఇప్పుడు, ఈ వాదానికి ప్రతివాదం ఏమిటీ? ఎవరైన వాదించి ఒప్పించటానికి ప్రయత్నించటం వలన ఉపయోగం ఉంటుందా?

సనాతనధర్మం పట్ల నిష్ఠ ఉన్న వాళ్ళు బాధపడటం తప్ప ఏమీ చేయగల పరిస్థితి లేదు ప్రస్తుతం. మీరు బయటి వాళ్ళకు నచ్చచెప్పలేరన్న సంగతి పక్కన బెట్టండి. చివరికి ఇంట్లో వాళ్ళముందు కూడా, సనాతనధర్మం గాడిదగుడ్డూ అంటూ‌ మాట్లాడి, లోకువ కావటం ఇబ్బందులు తెచ్చుకోవటం ఎందుకూ అనుకునే పరిస్థితి. కాదంటారా?

ఇదీ సనాతనధర్మం ఉన్న పరిస్థితి.