26, ఆగస్టు 2013, సోమవారం

పాహి రామప్రభో - 212.. 219 ఉత్సాహరామాయణం (అయోధ్యాకాండ)

అయోధ్యాకాండ.

రామచంద్రమూర్తికిం ధరాధిపత్యమీయగా
నా మహాత్ముడైన తండ్రి కభిమతంబు గలిగి శ్రీ
రామునిం‌ బ్రసన్నముఖుని రాజసభకు బిల్చి రే
పే ముహూర్తమోయి రాజు వింక పైన నీవనన్       212


సన్నుతాంగి కైక యెఱిగి చాల నొచ్చి భూవిభున్
మున్ను నాకు వరములిచ్చి భూమినాథ మరచితే
పన్నుగాను నాదు సుతుని ప్రభువుగా నొనర్చి రా
మన్న పదియు నాలుగేడు లడవినుండ బంచుమా      213



అనిన రాజు నేల గూలె నంత రామచంద్రు డా
మనుజవిభుని సత్యవ్రతుని మాట నెంచి కానకుం
జనెను ఛాయవోలె సీత స్వామి వెంట నడువగా
అనుజుడైన లక్షణుండు నన్న తోడు నీడగాన్      214


వారు గంగ డాసి నంత వచ్చి గుహుడు భక్తితో
శ్రీరమణుని పాదరజము చిన్న మెత్తు సోకినన్
నారి యగునొ పడవయంచు నగుచు రామ పాదముల్
వారిధార గడిగి యవలి వంక మువురి జేర్చగా      215


ఓజ మీర నగ్నులనగ నొప్పి మువ్వురా భర
ద్వాజమునిని గాంచి మ్రొక్కి తపసి కుటిని వారలా
రోజు గడపి వేడ్కమై పురోగమించి చేరిరా
పూజితమునికూటమనగ పొలుచు  చిత్రకూటమున్      216


అనుజు డైన భరతు డంత నాత్రపడిచు వచ్చి శ్రీ
యినకులేశు పాదసీమ నిమిడి రాఘవేంద్ర నీ
జనుట కోర్వలేక తండ్రి జనెను స్వర్గసీమకుం
మనుజనాథపదవి గొనుము మహితమూర్తి నీవనన్    217


మనుజనాథు తండ్రి పనుపు మానరాదు నాకు నీ
వనఘ యేలవయ్య నేను వచ్చు దాక రాజ్య మీ
వనగ నొల్ల కతడు రామ పాదుకలను పీఠిపై
నునిచి యేల నన్నగారి నొడబరచెను భక్తుడై    218

అడవి లోన నొక విరాధు డన్న రాక్షసుండు పై
బడి ధరాతనూజ నొడిసి పట్టి మింటి కేగ గా
వడి వధించి వాని తపసి వ్రాత మడుగ వారికిన్
జడుపు నుడుప రాక్షసాళి జంప దలచె రాముడున్  219