29, జూన్ 2013, శనివారం

హనుమంతులవారిని గుర్తించ లేక పోయానే!

ఈ వారం అంతా దంపతులము ఇద్దరమూ ఇంటికి దూరంగా ఉండవలసి వచ్చింది.
ఈ‌ రోజు సాయంకాలమే యింటికి పునరాగమనం.
అందుచేత యీ విషయాన్ని మీతో పంచుకుందుకు కొద్ది రోజులు ఆగవలసి వచ్చింది.

రెండు రోజుల క్రిందట ఒక విచిత్రమైన స్వప్నం కలిగింది.
ఆ స్వప్నంలో నేను లింగస్వరూపుడైన పరమేశ్వరుని మూర్తిని అన్వేషిస్తూ తిరుగుతున్నాను.
తిరగ్గా తిరగ్గా ఒక దేవాలయంలో శివలింగం సాక్షాత్కరిస్తుందనిపించింది.
నమ్మకం‌ బలవత్తరమై అటు అడుగులు పడసాగాయి.
నేను స్వామి దర్శనంకోసం వెళుతున్న సమయంలో ఒక చిత్రం జరిగింది.

శివలింగాన్ని సమీపించేలోగా నాకు శ్రీసీతారామలక్ష్మణుల దివ్యమూర్తుల దర్శనం కలిగిస్తూ వేరొక దేవళం‌ సాక్షాత్కరించింది.  ఆహా యేమీ ఆ దివ్యమూర్తుల శోభ, వర్ణించే సామర్ధ్యం నాకు లేదు.  మీరు అర్థం చేసుకోవలసిందే.

సాధారణంగా ఆలయాల్లో శ్రీసీతారామలక్ష్మణుల ప్రతిష్టిత మూర్తులు శిలావిగ్రహస్వరూపాలుగా నల్లగానే‌ ఉంటాయి.  కాని యిక్కడ యీ‌ మూర్తులు చక్కగా అందంగా రంగుల్లో ఉన్నాయి. పైగా అతిమనోహరమైన దయాపూర్ణమైన కన్నులూ‌ నవ్వులూ కలిగి ఉన్నాయి.  

అటువంటి మూర్తుల్ని మనం యెక్కడా చూడం.

నాకు అమితానందమైనది.
కాని ఒక విషయంలో మిక్కిలి ఆశ్చర్యం కలిగింది కూడా.
ఇక్కడ శివదర్శనం‌ అవుతున్నదని గ్రహించి కదా వచ్చింది?
మరి రాములవారు దర్శనమిస్తున్నారే!
ఆశ్చర్యంగా అటూ ఇటూ పరికించాను.
అక్కడ శివయ్యా ఉన్నాడు.

అంతే‌ కాదు, అక్కడ ముఖ మంటపంలో మరెవరో‌ కూడా ఉన్నారు.
వారినీ‌ సందర్శించాలని దగ్గరగా వెళ్ళాను.

ఆయన పెద్దవాడు. ఒక డెబ్భై యేళ్ళ వాడేమో.
చాలా ఆకర్షణీయమైన ముఖం.
చాలా పరిచయమైన ముఖమే అనిపిస్తోంది.
 కాని సరిగా గుర్తుకు రావటంలేదు ఎవరైనదీ.
ఎంత ప్రయత్నించినా గుర్తుపట్టలేక పోయాను.
ఆయన చల్లగా నవ్వారు!
దగ్గరకు పిచిచారు.

ఆయన నాతో‌ చాలా ఆదరంగా మాట్లాడారు.
ఎన్నో విషయాలు చర్చించుకున్నాం‌ ఇద్దరమూ.
చాలా సందేహాలు నివృత్తి అయ్యాయి.

అయ్యా తమరెవరూ‌ అని మాత్రం అడగలేక పోయాను.
కారణం తెలియదు.
బహుశః ఆయన నా ప్రయత్నాన్ని తన సంకల్పంతో‌ అడ్డుకుని ఉంటారు.

ఏమయితేనేం , నాకు చాలా సంతోషమూ‌ తృప్తీ‌ కలిగాయి.
ఆయన కృపాపూర్ణవదనం నాకింకా కళ్ళ ముందే‌ ఉంది.
అది మరింత సంతోషం‌ కలిగించే విషయం .

మెల్లగా కల కరిగిపోయింది.

క్రమంగా నాకు అవగాహనకు వచ్చింది.
శ్రీరామచంద్రులవారి సమ్ముఖంలో‌ఉండేది సాక్షాత్తు శ్రీ‌హనుమంతులవారు కాదా?
అయ్యో, ఆ విషయం నాకు తట్టనేలేదే!
ఎందుకని స్వామి నన్ను నిరోధించారో.
అదీ‌ కాక వారిని చూస్తున్నంత సేపూ వారు నాకు మిక్కిలి పరిచయస్తుల వలె తోచారే!
అదేమిటలా?

ఆలోచించగా ఆలోచించగా నాకు ఇటువంటి వేరొక వృత్తాంతం గుర్తుకు వచ్చింది.
ఆ వృత్తాంతం 'ఒక యోగి ఆత్మకథ' అనే పుస్తకంలో ఉంది. శ్రీయుక్తేశ్వరగిరిగారు ఒక సందర్భంలో మహావతార్ బాబాజీగారి సమక్షాన్ని పొందీ‌ ఆయన్న గుర్తుపట్టలేక పోయారు.  బాబాజీగారు తనను గిరిగారు గుర్తించకుండా అడ్డుకున్నారు అక్కడ.

ఇక్కడ శ్రీహనుమంతులవారు తనను నన్ను గుర్తించనీయ లేదు.
నా సాథనాస్థితి ఇంకా అందుకు తగిన యోగ్యత కలిగింది కాకపోవటమే కారణం అనుకుంటున్నాను.

అయినా వారు దయతో‌ నాకు కొన్ని సందేహాలు తీర్చారు.
అదే స్వప్న ప్రయోజనం.

కొన్ని కారణాల వలన, స్వామివారితో‌ నాకు స్వప్నంలో‌ జరిగిన సంభాషణను అందరితో‌ పంచుకోలేదు. సహసాథకులకు దానికి గల కారణం అర్థం అవుతుందనే ఆశిస్తున్నాను.

స్వప్నవృత్తాంతాన్ని మాత్రం పంచుకుంటున్నాను అందరితో. 
దీని వలన సాథకులకు అందరకూ మరింత ధ్యైర్యమూ, ఉత్సాహమూ‌ కలుగుతుందన్న భావనతోనే యిలా పంచుకుంటున్నాను తప్ప మరేమీ‌ కారణం లేదని సవినయంగా మనవి చేసుకుంటూ ముగిస్తున్నాను.