5, ఫిబ్రవరి 2024, సోమవారం

ఇక వ్యాఖ్యలు స్వీకరించబడవు.


శ్యామలీయం బ్లాగు ఇక వ్యాఖ్యలను  స్వీకరించదు.


ఈనిర్ణయానికి రావటం అంత సులభమైన విషయం కాదు. 

ఎంతో ఆలోచించి మథనపడిన తరువాతనే తప్పని సరి అని భావించి ఇలా చేయవలసి వచ్చింది.

కారణం ఏమిటో పాఠకులు సులభంగానే గ్రహించగలరని ఆశిస్తున్నాను.

ఐనా చెప్పవలసిన బాధ్యత ఉందని భావించి చెబుతున్నాను.

కొందరు అజ్ఞాతంగా చేస్తున్న వ్యాఖ్యల వలన ఇబ్బంది కలుగుతున్నది.

నేను ఆవ్యాఖ్యలను ప్రచురించవలసిన అవసరం లేదు. 

వాటిని పట్టించుకోవలసిన అవసరమూ లేదు.

పేరు కూడా దాచుకొని నా తప్పులను వెదకుతూ నాకు అహంకారమూ అవివేకమూ వంటి గుణాలను ఆపాదిస్తూ వ్రాస్తున్నారు.

సరే, వారు తమకారణాలను తాము చూపుతున్నారు.

సమంజసమైన అభిప్రాయాలు కాని అనుమానాలు కాని కొన్ని ఆవ్యాఖ్యలలో ఉన్నా వాటి ధోరణీ భాష వంటి కారణాలవలన ప్రచురణకు అంగీకరించటం జరగలేదు చాలా వాటి విషయంలో.

ఐతే అవి కొనసాగుతూనే ఉండటంతో వీటి ధోరణి ఎలా ఉందో పాఠకలోకానికి ఒకటపా ద్వారా కొన్నింటిని ఎత్తి చూపి పరిచయం చేయటం జరిగింది.

కాని ఆ విధమైన వ్యాఖ్యలు వస్తూనే ఉన్నాయి.

సమంజసమైన అనుమానాలకు నేను నేరుగా (వ్యాఖ్యలను ప్రకటించకపోయినా) సమాధానాలను ప్రకటించటం చేస్తూనే ఉన్నాను.

ఐనా, అవి అలా కొనసాగటమే కాదు.

దమ్ముంటే నావ్యాఖ్యను ప్రకటించండి అనటం వరకూ వచ్చింది.

ఇప్పుడు ఆలోచించండి దయచేసి.

నేను బ్లాగు తెఱచినప్పుడు ముందుగా ఎవరి వ్యాఖ్య ఐనా ఉంటే పరిశీలిస్తాను. వ్యాఖ్యను పంపినవారిని వీలైనంత తొందరగా గమనించాలి కదా అని.

ఆతరువాత బ్లాగులో నామానాన నేను రామసంకీర్తనం వ్రాసుకుంటాను,.

నీకు మనశ్శాంతి లేకుండా చేస్తాం. నువ్వెలా వ్రాయగలవో ఇంక చూస్తాం అన్న మహోద్దేశంతో కొందరు చేసే వ్యాఖ్యలు నాకు ఎందుకు ఇబ్బంది కలిగించాలి?

ఆవలి వారికి ఎంత ఆసక్తి ఉన్నా అనవసరమైన చర్చలకు నాకెందు ఆసక్తి ఉండాలి?

నాకు దొరికే సమయమే చాలా తక్కువ.

అది కాస్తా రాముడికి బదులు ఈఅనామకులకు ధారపోయలేను.

వాళ్ళు ఛాలెంజీలు చేస్తున్నారని కుస్తీ పట్టటానికి నేను సిధ్ధం కాలేను.

ఈబ్లాగును ఒక చర్చావేదికగా మార్చటానికి నేను సిధ్ధంగా లేను. ఎవరో ఏదో అంటారు. నేను జవాబు చెబుతాను. దానిని మళ్ళా వారో మరొకరో సాగదీస్తారు. రొంపిలోని దిగినాం కదా అని మరలా మరింత వివరణ ఇస్తాను. మళ్ళా మరికొన్ని మాటలు వస్తాయి. జవాబులు చెబుతూ పోవలసి వస్తుంది. ఇదంతా అవసరమా? తమాషా ఏమిటంటే తరచుగా ఇటువంటి చర్చలు టపాలోని విషయానికి సంబంధం కూడా లేకుండానే నడుస్తాయి. ఎందుకవి?

ఈఛాలెంజీలూ చర్చలూ అవసరమా?

నాకంత అవసరమూ లేదు.. ఆసక్తీ లేదు. సమయమూ లేదు. 

ఇకపోతే బ్లాగు అన్నాక వ్యాఖ్యలు స్వీకరించకపోతే చదువరులకు ఇబ్బంది కాదా అంటే అవుననే ఒప్పుకుంటాను. 

కాని ఈబ్లాగుకు వచ్చే వీక్షకుల సంఖ్యా తక్కువే, వ్యాఖ్యల సంఖ్యా తక్కువే.

ఆసక్తి కలవారు రామసంకీర్తనం చదివి ఆనందించటానికి ఈ నానిర్ణయం ఏమీ అడ్డంకి కాదు.

ఇప్పటికే కొందరు బ్లాగర్లు తమ బ్లాగుల్లో వ్యాఖ్యలను స్వీకరించటం లేదంటే వారికీ ఈఅనామకుల వలన వచ్చిన ఇబ్బందులే కారణమేమో

ఇకచాలు అనిపించి వ్యాఖ్యలను చేసే సదుపాయం ఉపసంహరించటం జరిగింది.