30, నవంబర్ 2020, సోమవారం

మా చెల్లెలు అరుణ రచించి పాడిన తెలంగాణా జానపద గీతం

 

 

ఓ మావ జర ఇ నే..

దండ లోని దారమల్లె ఓ మావా
మన  బంధముండి పోవాలి ఓ మావ
పాలు తేనె లెక్క ఓ మావ
మనం కలసి మెలసి ఉండాలి ఓ మావా


ఊపమంటే  ఊపవు ఉయ్యాల
నే ఉసులెట్టా సెప్పాలా ఇయ్యాల
ఉలకవు పలకవు ఈయెళ
నీ అలకే ట్టా తీర్చేది ఇయ్యాల
ఓహో మావ... ఓ బంగారి మావా

సక్కాని సుక్కను నేనైతే
నా నిండు సందమామ  నువ్వు కదా
రంగుల హరివిల్లు నేనయితే
కురిసేటి కరిమబ్బు నువ్వు కదా
ఓహో  మావా.. ఓ బంగారిమామ

అడుగుల అడుగేసి నీవెంట
నే ఏడడుగులు మరి నడవాలా
ఊరంతా పందిరేసి సెయ్యాలా
మన పెండ్లి వేడుకలు చోద్యంగా
ఓహో మావ.. ఓ బంగారిమామ

ఈ పాట రచన, గానం మా చెల్లెలు అరుణవి. 

మా చెల్లాయి పాట కాబట్టి నాకు బాగుంటుంది సహజంగా. బాగా పాడింది అనిపించి నలుగురికి తెలియజేసి ప్రోత్సహించాలన్న దృష్టితో ఆమె పాటను నా బ్లాగుద్వారా కూడా పరిచయం చేస్తున్నాను.

తను చాలా చిన్నపిల్లగా ఉన్నప్పుడే బాగా పాడుతున్నదని అనిపించి కొన్ని చిన్న చిన్న పాటలు నేర్పి పాడించే వాడిని. అంతకంటే నేను తనకి చేసింది ఏమీ లేదు.

స్వయంగా తనకళను తానే అభివృధ్ధి చేసుకుంది.

ఇప్పుడు స్వయంగా పాటలు వ్రాసుకొని పాడుతున్నది అంటే చాలా సంతోషం కలిగింది.

ఈ పాట వెనుక పూర్వాపరాలు నాకు అంతగా తెలియవు. నాకు పంపితే విని బాగుందనిపించి కొన్ని వివరాలు అడిగి తెలుసుకున్నాను.

ప్రొద్యూసర్ గారి పేరు రమణ ప్రసాద్.  మ్యూజిక్ డైరక్టర్ పేరు డేవిడ్. వీడియో ఎడిటర్ సింహ అని చెప్పింది.

ఆసక్తి కలవారు ఈపాటను విని అమె పాటను యూ-ట్యూబ్ ఛానెల్ లింక్ వద్ద లైక్ చేసి ప్రోత్సహించండి.

తనకు తెలంగాణా మాండలికం మీద మంచి పట్టు ఉన్నది. 

చాలా కాలం క్రిందట, అప్పుడు తాను స్కూలు పిల్లగా ఉన్న రోజుల్లోనే ఒకసారి ఒక చిన్న సంఘటన. ఎవరో బయట అరుగుమీద ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు మాట్లాడుకుంటున్నారు. ఫక్తు తెలంగాణా మాండలికంలో. అందులో విశేషం ఏమీ‌ లేదు కాని అందులో ఒక గొంతు మాత్రం బాగా పరిచయం ఉన్న గొంతులాగా అనిపించింది. బయటకు వచ్చి చూస్తే స్నేహితురాళ్ళతో‌ అరుణ కబుర్లాడుతున్నది తెలంగాణా యాసలో. 

కబుర్లు పూర్తై ఇంట్లోనికి వచ్చాక అడిగితే, వాళ్ళకి మన ఆంద్రాభాష అర్ధం‌ కాదు అందుకని ఫ్రెండ్స్‌తో వాళ్ళభాషలోనే‌ మాట్లాడుతాను అని చెప్పింది.

అలా చిన్నప్పటినుండి,  హైదరాబాదీ అమ్మాయే అరుణ. అందుకని ఇదం‌ బ్రాహ్మ్యం ఇదం క్షాత్రం అన్నట్లు మాతో ఆంద్రా యాసలోనూ ఇతరత్రా అవసరమైనప్పుడు తెలంగాణా యాసలోనూ ధారాళంగా మాట్లాడుతుంది.

ఇదిగో ఇప్పుడు తెలంగాణా బాణీ  మాండలికం పాటలూ పాడుతోంది. పాడటమే‌ కాదు వ్రాసి మరీ పాడుతోంది.

ఈ పాటను తను పది నిముషాల్లో వ్రాసిందట.