19, నవంబర్ 2015, గురువారం

వంశస్థవృత్తంలో రామస్తుతి.






  
      వంశస్థం.
      ధరాపతుల్ కోరి ధరింపరాని విల్
      బిరాన తానెత్తె విశేష మేమయా     
      పురారివిల్లెత్త మురారికే తగున్
      నరావతారంబున నున్నదాతడే




ఈ వంశస్థవృత్తానికి గణాలు జ - త  జ - ర అనేవి. 7వ అక్షరం‌ యతిస్థానం.  పాదానికి మొత్తం 12 అక్షరాలు మాత్రమే ఉండే పొట్టి వృత్తం. చిట్టిపొట్టి భావాన్ని సూటిగా చెప్పటానికి చాలా బాగుంటుంది.

సంస్కృత కవుల్లో భారవి మహాకవికి వంశస్థం చాలా యిష్టమైన వృత్తం అంటారు.  ఆయన కిరాతార్జునీయంలోని ఒక శ్లోకం చూదాం.

కిరాతార్జునీయంలోని పదిహేనవసర్గ చిత్రకవిత్వం పుట్ట! దానిపైన ప్రత్యేకం వ్రాయాల్సిందే.  ఆ పదిహేనవసర్గ అంతా కిరాతరూపంలో ఉన్న శంకరుడికీ పాండవమధ్యముడైన అర్జునుడికీ మధ్య జరిగిన అతిచిత్ర విచితమైన యుధ్ధం. అందుకే‌ మరి భారవి ఆ సర్గనంతా చిత్రకవిత్వమయం చేసాడు.  అందులోని ఒక వంశస్థం చూపుతాను.

    వికాశమీయుర్జగతీశమార్గణా
    వికాశమీయుర్జగతీశమార్గణాః
    వికాశమీయుర్జగతీశమార్గణా
    వికాశమీయుర్జగతీశమార్గణాః

మీరేమీ పొరబడటం లేదు.  మొదటి చరణమే,మిగిలిన మూడు చరణాలూను. దీన్ని మహాయమకం అంటారు. ఊరికే సరదాగా అలా భారవి రాసెయ్యలేదండి. ఈ శ్లోకానికి అర్థం భేషుగ్గా ఉంది. అదంతా ఇక్కడ ప్రస్తుతం‌ కాదు.