ధన్యత చెందెను రామయ్యా నీ దయచే నా బ్రతుకు
అన్య మెఱుగ నని జాలిచెంది నన్నాదరించి నావు
అంశలు స్థావరజంగమములు నీయందని తెలిసితిని
సంశయరహితుడనై నీపదముల చక్కగ నొదిగితిని
పుణ్యము పాపము రెండును వలదని బుధ్ధి నెఱింగితిని
అన్యులు లేరిట నందరు నీవా రన్నది తెలిసితిని
నిరుపమానమగు నీతత్త్వమునే నిత్యము తలచితిని
పురుషోత్తమ నీపదపీఠికపై పూవై నిలచితిని
నను చేరిన పొగడిక లవి నీవని మనసున తలచితిని
నను తెగనాడెడు వారును నాహితులనుచు సహించితిని
పరమాత్ముడవగు నీ పారమ్యము భక్తి నెఱింగితిని
హరియే నీవని హరుడవు నీవని యాత్మ నెఱింగితిని
శ్రీచక్రస్థిత లలితాపరమేశ్వరివని యెఱిగితిని
నీ చెయిదంబులు సృష్టిమూలమని నిజముగ తెలిసితిని
నిను కీర్తించుట నాభాగ్యముగా మనసున నెంచితిని
మనవిని విని నా కీర్తనలను విని నను మన్నించితివి
ఇసుమంతైనను తనివి తీరదే యెంతగ పొగడిననను
వసుమతి నిటులే పొగడుచు నుండెద వసుధాధిప నిన్ను