18, ఏప్రిల్ 2018, బుధవారం

దేవతలూ అప్సరసలూ

ఈ రోజున మిత్రులు మధుసూదన్ గారి నుండి ఒక ప్రశ్న విన్నాను. అందఱను స్వర్గ సౌఖ్య సంతృప్తులనుగాఁ జేయుచున్న దేవవేశ్యలందఱను సతులుగాఁ బరిగణింపవచ్చునా?" యని.

కొంచెం‌ బాధ కలిగినా అది అనేకమందికి ఉండే సందేహమే‌ కాబట్టి అలా వారు అనటాన్ని తప్పుబట్టలేను. ఇది లోకసహజమైన అభిప్రాయం కాబట్టి.

ఈ విషయంలో నాకు తెలిసిన నాలుగు ముక్కలు వ్రాయాలని అనిపించింది.

దేవతలు ప్రధానంగా తైజసమైన రూపం కలవారు. అంటే వారందరూ తేజోమూర్తులే ఐతే వారు శారీరకంగా కరచరణాద్యవయవాలూ మానసికమైన కామాదిక వికారాలూ లేని వారా అంటే లేని వారే కాని కార్యార్థం రూపధారణం చేస్తా రంతే.

మనం ఇంద్రుడు అంటాం. విశ్వనాథవారు శచీపురందర ఋషి అంటారు. సినిమాల్లోనూ‌ నాటకాల్లోనూ వారి అవసరాలకోసం నీచపాత్రను చేసి చూపుతారు నిరభ్యంతరంగా. అంటే కథాగమనం కోసమూ, వారు పైకెత్తవలసిన పాత్రలు పండటం కోసమూ వంటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఇంద్రుడైనా మరెవరైనా సరే దుష్టపాత్ర కావలసి వస్తుంది తరచుగా.

కాని నిజం ఏమిటి చూదాం.

ఇంద్రుడు త్రిలోకాలనూ‌ పాలించే కర్తవ్యం ఉన్నవాడు.

ముఖ్యంగా అయన మునులందరకూ‌ పరీక్షాధికారి.

మీరొక పోటీ పరీక్షకు బాగా తయారవుతారు. ప్రశ్నాపత్రం మరీ సులభంగా ఉందనుకోండి.

అయ్యయ్యో‌ అందరూ సుబ్బరంగా చాలా బాగా వ్రాసేస్తారు. నాలా బాగా తెలివైన వాడికి అది చూపించే‌ అవకాశం ఈ‌డొక్కు పరీక్ష పుణ్యమా అని తప్పిపోయింది అని అనుకుంటారు. ఇబ్బడిముబ్బడిగా అందరికీ మంచి మార్కులు పడిపోతే మనం గుంపులో గోవిందా ఐపోతామే అని ఆదుర్దా పడతారు. నిజమే‌ కదా?

సరే నండి. వీళ్ళిలా అనుకుంటారు అభ్యర్థు లంతానూ అని ఊహించుకొని ప్రశ్నపత్రాన్ని కాస్త కఠినంగా బిగించి ఇచ్చారను కోండి. ఏమవుతుంది?

హారి వీడి దుంపతెగా. ఇంత కర్కోటంగా పరీక్షాపత్రం ఉంటే ఎలాగూ? అందరినీ‌ బాగా ఏడిపించాలని ఎవడో శాడిష్టు మన కొంపముంచాడే! ఏంత బాగా తయారయ్యానూ, ఎంత కాలం నుండి తరారయ్యానూ, దీనికోసం ఎన్ని కష్టాలు పడ్డానూ, వేరే అవకాశాలు ఎన్ని వదలు కున్నానూ అంటూ రాగాలు తీస్తారు. ఇదీ నిజమే‌ కదా.

అసలు పరీక్షా పత్రం అనేదానిలో కాఠిన్యం ఎందుకూ అవసరమా?

మీరే ఒక పరీక్ష పెడుతున్నారనుకోండి. మీ‌ అఫీసులో‌ ఒక జూనియర్ సైంటిష్టో మరొకటో‌ అని.

ఉన్నదేమో ఒక్క పోష్టు. అభ్యర్థులు అక్షరాలా మూడువేలమంది అని కూడా అనుకోండి.

సరే లెక్కప్రకారం పరీక్షలో ఫష్టు పదిమందికీ ఇంటర్వ్యూ నిర్వహించి మీరో మరొక టీమో చివరకు ఒకరిని నిర్థారించాలి. అదీ ప్లాను.

ఐతే మూడువేల మందిలో దాదాపు అందరూ ఒకేలా సరైన సమాధానాలు ఆటోమాటిగ్గా గీకి పారేసేలా PV = RT అనే సూత్రాన్ని ఏమని పిలుస్తారూ. అందులో R అంటే ఏమిటీ అనొకటీ, సోడియం క్లోరైడ్ అనే రసాయనపదార్థాన్ని ఏమంటారూ దాన్ని ఎందుకు వినియోగిస్తారూ, గ్రిగ్నార్డ్ రియేజెంట్లు ఎందుకు పనుకొస్తాయీ లాంటి ప్రశ్నలు సంధించారనుకోండి. చివరికి ఏంజరుగుతుందీ. సగానికి పైబడి అభ్యర్థులంతా నూటికి నూరు తెచ్చికొని గుమ్మంలో కూర్చుంటారు? ఏ పదిమందిని పిలుస్తారు వాళ్ళలోంచి?

అందుచేత ప్రశ్నాపత్రం అవసరానికి తగినంత కఠినంగా ఉండవలసి వస్తుంది. తప్పదు. నిజానికి అవసరమైన దానికన్నా కూడా సాధారణంగా కష్టంగానే ఉంటుంది మరి.

ఏదో నూరు యజ్ఞాలు చేసేస్తే చాలు ఇంద్రుడి పదవి ఊడగొట్టి ఆ యజ్ఞకర్త కాస్తా ఇంద్రుడైపోతాడూ అందుకే ఇంద్రుడు ఎవరి యాగాలూ సాగనివ్వడూ. అలాగే మునులు తపస్సు చేస్తుంటే వాళ్ళ తపస్సు వల్ల ప్రకృతి వారికి వశమై పోతుందీ‌ తన ప్రభ పదిపోతుందీ అని అందరి తపస్సులనూ ఇంద్రుడు చెడగొడుతూ ఉంటాడూ‌ అని కూడా జనం అనుకుంటారు.

నిజం‌ కాదు.

అయనకు తపస్సూ తెలుసును. దాని విలువా తెలుసును. ఆయస స్వయంగా గొప్ప ఋషి, వేదమంత్ర దృష్ట. అమ్మవారి ముఖ్యభక్తులలో ఒకడు.

ఎవరైనా తపస్సు ద్వారా ఏదన్నా ఉద్దేశాన్ని సాధించుకొనేందుకు చేస్తున్నా రనుకోండి. అది ఫలిస్తే వారికి అపూర్వమైన అవకాశంగా ప్రకృతిపై పెత్తనమే వస్తుంది అనుకోండి. ఇంకా గొప్పగొప్ప మంచీ చెడులు వారి అధీనంలోని వస్తాయనుకోండి.

అప్పుడు ఇంద్రుడు కలుగ జేసుకోవాలి.

అదికావాలీ‌ ఇదికావాలీ అని తపస్సు చేసే వాళ్ళకు ఆ తపఃఫలితంగా లభించే‌ శక్తిని భరించే సామర్థ్యం ఉండాలి ముందుగా.

అది ఉందా వాళ్ళకి అని చూసే పూచీ ఆ ఇంద్రుడు తీసుకోవాలి.

ఉదాహరణకు విశ్వామిత్రుడు కేవలం వశిష్ఠమహర్షి పైన కక్షసాధింపు కోసమే తపస్సును ఎన్నుకున్నాడు. తపశ్శక్తితో ఆయన ముందుకు వెళ్ళి చూడూ‌ ఇప్పుడు నా తపస్సే గొప్పది అని చూపా లనుకున్నాడు. ఆయన లక్ష్యంగా నిర్దేశించుకొన్న బ్రహ్మర్షిత్వం అన్నది ఎంత గొప్ప శాంతమూర్తికి తప్ప సాధ్యం కానిదో ఆయన తొలుత అవగాహన చేసుకోలేదనే చెప్పాలి.

ఇంద్రుడు ఆయనకు పరీక్షలు పెట్టాడు. రకరకాలుగా విసిగించాడు.

ఆయనతో కాపురంచేసిన మేనక అలాంటి ఒక కథానాయకి.

ఆయన కోపాగ్నికి బలై శిలారూపం ధరించిన రంభ మరొక పాత్ర.

కాని ఈ‌పరీక్షలే విశ్వామిత్రుడిలో మొదట అసహనాన్నీ కోపాగ్నినీ‌ రగిల్చినా ఆయన చివరకు విషయం అర్థం చేసుకున్నాడు.

విశ్వామిత్రుడు బ్రహ్మర్షి కావటమే‌ కాదు. విష్ణ్వతారమైన రామచంద్రమూర్తికి గురువు కూడా కాగలిగాడు.

ఇంద్రుడి పరీక్షల వలన మంచే‌ జరిగించి.

ఆయన స్వయంగా అందరూ నిత్యం ఆరాధించే గాయత్రీ మంత్రదఋష్ట అన్నది మనకు తెలుసు.

అయన గొప్పదనానికి ఇంద్రుడు కూడా గొప్ప కారణమే.

అనవసరంగా ఇంద్రుడి సోది ఎందుకు చెప్పాను అనవచ్చును. సరే, ఇంక అప్సరసల సంగతి చూదాం.

పురూరవుడు అని గొప్పరాజు. అయన ఊర్వశిని వలచి ఇంద్రుడి అనుమతితో‌ భార్యను చేసుకొన్నాడు.

కొన్నాళ్ళ తరువాత ఆవిడ కాస్తా గడువు తీరిపోయింది. సెలవు అని చులాగ్గా అనేసి వెళ్ళిపోతే పురూరవుడు అక్షరాలా లబలబ లాడాడు.

మళ్ళీ కాళ్ళావేళ్ళా పడి ఆమెను వెనక్కు తెచ్చుకున్నాడు.

ఒకసారి ఊర్వశి పురూరవుడితో ఒక కొండమీద విహారానికి వెళ్ళింది ఆ కొండమీద అడవుల్లో కొంత కాలం విహరించారు. అప్పుడు ఆవిడ పురూరవుడితో, రాజా ఈ‌కొండమీద సాక్షాత్తూ విష్ణుమహాదేవుడు వరాహనారసింహద్వయ రూపిగా వెలసి ఉన్నాడు సుమా- ఇది మహనీయమైన పుణ్యక్షేత్రం అన్నది. పురూరవుడికి ఎంతో అబ్బురం‌ కలిగింది. ఎక్కడ ఎక్కడ అని ఆరాట పడ్డాడు. ఆవిడ తాపీగా ఈ కొండమీదా నిశ్చయంగా ఉన్నాడు. ఎక్కడో మనం వెదుకుదాం అన్నది.

ఇద్దరూ శ్రమపడి చెట్లూ పుట్టలూ గుహలూ వగైరా బాగా గాలించి స్వామిని దర్శనం చేసుకొన్నారు.

అదే పరమపవిత్రమైన సింహాచల మహాక్షేత్రం.

ఈవిధంగా ఊర్వశీదేవి మనకు వరాహనరసింహస్వామిని పరిచంయం చేసింది. మహనీయురాలు.

అవిడ దేవత. మనలాగా పరిమితులు కల మానవశరీరి కాదు.

అవిడకు ఆకొండమీద దేవు డున్నాడని ముందే గమనిక కలిగింది.

తన దివ్యశక్తితో భవద్దర్శనం చేసుకొన్నది.

కాని పురూరవుణ్ణి తరింపజేయాలన్నది ఆమె సంకల్పం.

అందుకే తనకు సరిగా తెలియదు అని అమాయకంగా చెప్పి, ఆయనతో జాగ్రత్తగా స్వామిని భక్తితో వెదకించింది.

నిజానికి ఇది ఆమెసంకల్పమా?

దేవతల సంకల్పం.

దేవప్రభువూ‌ పురూరవుడికి శ్రేయోభిలాషీ మిత్రుడూ ఐన ఇంద్రుడి సంకల్పం ఇది.

ఊర్వశి మంచి పాత్రపోషించింది ఈ వ్యవహారంలో.

ఇంద్రుడు ఒక పధకం ప్రకారం ఊర్వశిని పురూరవుడికి పరిచయం చేసాడు నాటకీయంగా. ఆమెను సశరీరంగా చూడటంతో పురూరవుడు ఆమెపై మరులు గొనటమూ దేవసంకల్పమే.  ఆయనద్వారా సింహాచలం దేవుణ్ణి మనకు చూపటం అన్నది దేవతల పధకం. దాని కారణంగా పురూరవుడు నిత్యస్మరణీయుడూ తరించిన వాడూ అయ్యాడు.

చివరికి ఊర్వశీ పురూరవుల కథలో ఏమి జరిగింది.

దేవసంకల్పం నెఱవేరింది,

ఊర్వశి వెనుదిరిగింది.

మళ్ళా ఆ పురూరవుడు ఆమెకోసం‌ ఈ సారి పెద్ద తపస్సు చేసాడు.

దేవతలకు నియమం. తమకోసం తపస్సు చేస్తే వాళ్ళకు యోగ్యమైన వరాలు ఇవ్వాలి. తప్పదు.

ఊర్వశీ దిగిరాక తప్పదు.

వచ్చి ఏమిచేసింది?

ఓ రాజా, శరీరధారులకు ఉండే ఈ‌కోరికలు స్వల్పప్రయోజనం కలవి మాత్రమే సుమా అని చెప్పింది. ఆయనకు బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశం చేసింది.

పురూరవుడు జ్ఞానవంతుడై తన శరీరాన్ని కాక సంపూర్ణంగా భగవంతుని ప్రేమించి తరించాడు.

ఈ‌కథలు ఎందుకు చెప్పానో‌ పాఠకులు కొంచెం అవగాహన చేసుకొని ఉంటారని ఆశిస్తున్నాను.

దేవతల తప్పులు వెదకకండి. అది దోషం.

భగవంతుడి తప్పులు వెదకకండి. అది అపచారం.

మన శక్తియుక్తులు అతిస్వల్పమైనవి. మొన్న రాత్రి భోజనంలో ఏమి కూర తిన్నావు అంటే ఈ‌ ఉదయం ఎంతో‌మందికి సరిగా గుర్తుకు రాదు. ఎన్నో‌ జన్మల గురించీ వాటిలో మనం ప్రోగుచేసుకొన్న కర్మఫలాల గురించీ ఎవరికి తెలుస్తుంది?

దేవతలకు తెలుస్తుంది.

వారు సహాయం చేస్తారు.

మనకోసం, అవసరమైతే, మనమధ్యనే ఉండి వారు నయానో భయానో, మనకు అభ్యున్నతిని చేకూరుస్తూ ఉంటారు.

ఒక్కొక్క సారి వాళ్ళు మనని కష్టాల పాలు చేస్తున్నారని అనిపించవచ్చు. వాళ్ళు క్రూరులనీ అనిపించవచ్చును.

వారు ఉద్దేశించిన మంచిని మనం అందుకొన్న నాడు వాళ్ళు సంతోషిస్తారు.

అందుచేత దయచేసి దేవతల పట్ల కాని అప్సరసల పట్ల కాని చులకన మాటలు మాట్లాడ కూడదని అర్థం చేసుకోండి.

మాట వరసకు ఒక అప్సరస స్వర్గంలో ఒకనికి కామాది సుఖాలను అందిస్తున్నది అనుకుంటే దాని అర్థం ఆమె మానవలోకం నుండి వచ్చిన ఒకడి కోసం మానవస్త్రీలాగూ ఐపోయి మన లోకంలో ఉంటారని చెప్పబడే ఒక వేశ్యలాగా ప్రవర్తిస్తుందని కాదు. కానే‌ కాదు. ఆ భోగాల పట్ల ఆజీవికి మిగిలి ఉన్న ఆసక్తిని తగ్గించి నయంచేసేందుకు ఆవిడ దగ్గర ఉపాయం ఉందని. తేజో‌జీవులైన వారి వద్ద ఉండే ఉపాయం ఏమిటంటే వారి తేజస్సుల ప్రభావం ఆ జీవులను ఆకర్షించి వారి నుండి మోహాదులను తొలగించటం. ఆమె అలా తొలగిస్తున్నది అని అర్థం.

లౌకిక సాహిత్యంలోనికి తెచ్చేసరికి ఈ అవగాహనలన్నీ కూడా పరమపవిత్రము లన్నవి పరమ జుగుప్సాకరంగా ప్రతిబింబించబడ్దాయి.

అది కవుల తప్పా మనతప్పా అన్నది పక్కన బెడదాం. ఆచర్చ వలన మనకు ఉపయోగం లేదు.

ఇప్పడు సరైన దృక్పథంతో అర్థం చేసుకోవటం మేలు చేస్తుంది.

చివరగా పాఠకులకు ఒక విన్నపం. నాకు తోచిన ముక్కలు నాలుగు చెప్పాను. అందరికీ‌ నచ్చకపోవచ్చును. ఏదో‌ పత్రికల వాళ్ళకు నా స్వబుధ్ధి వ్యవహారమే అని హామీ ఇచ్చినట్లుగా మీకు కూడా ఇది నాకు తెలిసిన నాలుగుముక్కలే‌ కాని ఎవర్నీ‌ మెప్పించటానికి కాని నొప్పించటానికి కాని కావని వివ్నవించటమైనది అని చెప్పుకుంటున్నాను.