8, అక్టోబర్ 2017, ఆదివారం

తీవ్రమైన ఒత్తిళ్ళ మధ్యన ...

దాదాపు ఒక నెల రోజుల నుండి చాలా తీవ్రమైన ఒత్తిళ్ళ మధ్యన ఉన్నాను.

అవి బహుముఖంగా ఉన్నాయి.

అందులో‌ అసలు మనుష్యులంటేనే సర్వవిధాలా సంపూర్ణంగా నమ్మకం అనేది పోయిన పరిస్థితిని కల్పించిన సంగతీ ఉన్నది. మన్నించాలి. ఇప్పుడు వివరించలేను.  ఎందుకంటే నా మనఃస్థితి అస్సలు బాగోలేదు కాబట్టి.

ఈ ఒత్తిళ్ళ ప్రభావం ఎంతగా ఉందంటే నా ప్రవర్తన నాకే సార్లు చిత్రంగా అనిపిస్తోంది. మాటల్లో తడబాటు వ్రాతలో అక్షరదోషాలూ‌ పదాలు కొన్ని మనసులోనుండి కాగితంపైకి రాకుండా ఎక్కడికో ఎగిరిపోవటం. ఒకటి వ్రాయబోయి మరొకటి వ్రాయటం,  ఏ పనిలోనూ‌ ఏకాగ్రత కుదరక పోవటం. స్వభావవిరుధ్ధంగా తరచు అనేక విషయాలలో మరపుకు గురికావటం. స్థిరంగా ఉండలేక చేతిలో ఉన్న పనులు వాయిదా వేస్తూ పోవటం, చేసిన పొరపాట్లే పదేపదే వరసగా చేస్తూ ఉండటం.... ఇత్యాదులు.

ఆకాశంలో మబ్బులు ఎన్నిపట్టినా చివరకు అవన్నీ‌పోయి అది నిర్మలం కావటం జరుగుతుంది.

అలాగే ఈ ఒత్తిళ్ళు దూరమై ఇతఃపూర్వస్థితికి వస్తానన్న నమ్మకం‌ నాకుంది.

ఐతే వత్తిళ్ళను తగ్గించుకుందుకు నాకు వీలైన ప్రయత్నాలు నేను చేయాలి కదా.

అదే చేస్తున్నాను కూడా. కనీసం‌ ఇంంతగందరగోళ స్థితిలోనూ‌ సాధ్యమైనంతగా ప్రయత్నిస్తున్నాను.

అందులో తగ్గించుకోదగిన కార్యక్రమాలూ వ్యాపకాలూ తగ్గించుకోవటం ఒకటి.

ఈ బహుళమైన ఒత్తిళ్ళలో బ్లాగువ్యాసంగం కూడా ఒకటి అనిపిస్తోంది.

బ్లాగుటపాలు వ్రాసుకోవటంలో ఒత్తిడి ఏమీ లేదు.  పోనీ ఒత్తిడి ఏమీ లేదని నేను అనుకుంటున్నాను.

కాని బ్లాగుల్లో వస్తున్న వ్యాఖ్యల ధోరణి వలన మాత్రం నాపై ఒత్తిడి చాలానే ఉంది.

ఈ వ్యాఖ్యలను నేను మాలిక వ్యాఖ్యలపుటలో చూస్తూ ఉంటాను.

ఈ మధ్యకాలంలో కొందరు చేసిన వ్యాఖ్యలను చదివి చాలా చాలా గ్లాని కలిగింది.

ఆవ్యాఖ్యలపైనా అలాంటి వ్యాఖ్యలను చేసిన, ఇంకా చేస్తూనే ఉండే వ్యాఖ్యాతలపైన నేను కూడా వ్యాఖ్యల రూపం లోనూ, కొన్ని సార్లు టపాల రూపంలోనూ స్పందించటం‌ అందరూ గమనించే ఉంటారు.

ఇలా స్పందించవలసి రావటమూ స్పందించటమూ కూడా అసలే పలు ఒత్తిళ్ళ మధ్యన ఉన్న నన్ను మరింతగా ఒత్తిడికి గురిచేయటం జరుగుతోంది.

అసలు అలా స్పందించటం అవసరమా అనో స్పందించకపోతేనేం అనో అనుకోవలసింది. కాని నా బాధ్యత అని అనుకున్నాను. చాలా ఒత్తిడికి గురయ్యాను. స్పందించి ఒత్తిడిని మరింతగా  పెంచుకున్నాను.  ఇందువలన నేను సాధించినది ఏమన్నా ఉందో‌ లేదో‌ కాని నా మనశ్శాంతిని నేను మరింతగా చెడగొట్టుకున్నాను. అందుకే అలోచనలో పడ్డాను ఈవిషయంలో.

సభామర్యాదావిరుధ్దంగా ఉండటానికి ఏమాత్రం సంశయించని బ్లాగర్ల పేర్లతో పాటు శ్యామలీయం అన్న పేరు కూడా మాలిక వ్యాఖ్యలపుటలో కనిపించటం నాకు ఎంతమాత్రమూ ఇష్టం లేదు.

సభామర్యాదను పాటించని బ్లాగర్లను భళీభళీ అని ప్రశంసించే వారూ తెలుగుబ్లాగులోకంలో నాకు బాగానే కనిపిస్తున్నారు.

అందుచేత ఇకపైన నా పేరుతోకాని నా బ్లాగరు నామధేయం ఐన శ్యామలీయం పేరుతో కాని ఏవిధమైన వ్యాఖ్యలనూ‌ చేయబోవటం లేదు.  అంటే అనామకంగా వ్యాఖ్యలు వేస్తారా అని ఎవరైనా సంశయించ నక్కర లేదు. అలా ఇంత వరకూ చేసిందీ‌ లేదు ఇకముందు చేసేదీ‌ లేదు.

అలాగే మాలిక వ్యాఖ్యలపుటను చూడబోవటమూ‌ లేదు.

బ్లాగువ్యాసంగం‌ అంటే నేను వ్రాసుకొనే అథ్యాత్మికరచనలు నా ఒత్తిడిని తగ్గించేవే కాబట్టి వాటివల్ల నాకు ఇబ్బంది లేదు.

ఆ రచనలు కూడా చదివే వాళ్ళున్నారు కొంచెం మంది. వారికి మరొకసారి నా ధన్యవాదాలు. సరసవ్యాఖ్యలను ప్రచురించటానికి ఇబ్బంది ఉండదు. కాని స్పందించి సమాధానాలను ఇవ్వగలనని అనుకోవటం లేదు. అందుకు తగిన మనఃస్థితిలో లేను కాబట్టి అందరూ అర్థంచేసుకొన వలసిందిగా చదువరులకు వినమ్రంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాను.