7, నవంబర్ 2013, గురువారం

రాస్ట్రవిభజన ఆపేందుకే రాయల తెలంగాణా అంటున్నారా?

రాస్ట్రవిభజన ఆపేందుకే రాయల తెలంగాణా అంటున్నారా?

ఇదేమంత ఆశ్చర్యపోవలసిన సంగతి కాదు.

దిగ్విజయసింగ్‌గారు కాంగ్రెసు వర్కింగ్ కమిటీ నిర్ణయాన్ని ప్రకటిస్తూనే ముక్తాయింపుగా, ఇంక కాంగ్రెసులో తెరాస విలీనం అవుతుంది అని ఆశాభావం‌ ప్రకటించి, తెలంగాణా సెంటిమెంటును గౌరవించటం కన్నా ప్రత్యేకరాష్ట్ర ప్రకటన నిర్ణయం వెనుక రాజకీయ ప్రయోజనాలే ముఖ్యపాత్ర పోషిస్తున్నాయని స్పష్టంగానే ప్రకటించారు.

ఐతే, కాంగీపార్టీలో దూరితే సముద్రంలో దూరిన నదిలాగా చిరునామా కూడా మిగలకుందా పోతామని కచరా గారికి బాగా తెలుసు.  అందుకే ఇన్నాళ్ళూ కాంగీని ఆశపెట్టి, తీరా సమయం రాగానే ఓడ దాటాక బోడి మల్లన్న అన్న సామెత చందంగా, తెరాస విడిగానే ఉంటుందని ఆయనగారు ఢంకా బజాయిస్తున్నారు.

అదీ కాక, తెరాసకు కావలసినది ఉద్యమం కొనసాగటం కాని అది ముగియటం కాదన్న వాదనా బలంగానే వినిపిస్తూ ఉంటుంది తరచుగా.  అందుకే రాష్ట్రం సాకారం కాకుండా ఎప్పటికప్పుడు రెచ్చగొట్టే ప్రకటనలతో ఆయన కదనకుతూహలరాగం పాడుతున్నారు.  దీని వల్ల రెండు ప్రయోజనాలున్నాయి తెరాసకు.  ఒకటి, రాష్ట్రం ఏర్పడితే, ఇంకా తమకు కొన్ని ముఖ్యమైన డిమాండ్లు అసంపూర్తిగానే ఉన్నాయనై యాగీ చేసి ఎన్నికలలో హవా తగ్గకుండా చూసుకోవటం.  రెండవది, కాంగీవారు రాహ్ట్రం ఎన్నికలలోగా ఇవ్వకుంటే, వారిని దుమ్మెత్తిపోసి రాష్ట్రాన్ని సాధిస్తాం అంటూ గర్జించి తమ హవాకు ఎదురు లేకుందా చూసుకోవటం.  ఏదైనా తెరాసకు మంచిదే నని కచరాగారి ఆలోచన కావచ్చును.

ఇక కాంగీ ఆలోచనా ధోరణి చూద్దాం.  కచరాగారు, తెరాసను కాంగ్రెసులో విలీనం చేయకుండా విడిగా ఉండి సీట్లన్నీ తన్నుకు పోవాలని చూస్తున్నారు.  అలా అవన్నీ ఆయన పట్టుకు పోవటం కాంగీవారికి సమ్మతం కానే కాదు.  కెసీఅర్‌గారి దూకుడు వల్లనే ఇబ్బందులు వచ్చాయని యాగీ చేసి తామే రాష్ట్రసాధకుల మని చెప్పి ప్రజలను నమ్మించాలని వారి ఆలోచన.  ఇది ఫలించే అవకాశాలూ దండిగానే ఉన్నాయి.  కాబట్టి కెసీఅర్ బూచిని చూపి, ఏవోవో ఇతర కారణాలు చూపీ రాష్ట్రవిభజన విషయంలో కొంత తాత్సారం చేస్తే కచరాగారికి బదులు కాంగీయే లాభపడితే, ఆనక కెసీఅర్‌గారి బ్లాక్‌మెయిల్ అవకాశానికి తప్పకుండా గండి పడుతుంది.  విశ్వసనీయత పోయింది కాంగీలో కచరాగారి మీద.  అందుకే అది, ఆయన ప్రమేయం లేకుండా గెలిచే అవకాశాలు అన్వేషిస్తున్నట్లుంది.  రాష్ట్రవిభజన కాకుండా ఎన్నికలు వచ్చిపడితే ప్రజలు ఇచ్చే దారిలో ఉన్న కాంగీకా,  తెచ్చేహడావుడి చేస్తున్న తెరాసాకా - దేనికి ఓటు వేయాలీ అని తేల్చుకోవాలి మరి.  ఇది కాంగీకి లాభిస్తుం దనుకుంటే కేసీఅర్‌గారు దిగిరాక తప్పదు.  అలాగే, రాష్ట్రవిభజన కష్టం అవుతుందీ, అది ఎలాగూ జరగదూ అన్న భ్రమలు సీమాంధ్రకు కలిగించటమూ పిల్లకాంగ్రెసుకు హెచ్చుగా లాభిస్తుంది - అంటే అంతిమంగా కాంగీకే లాభం అన్నమాట.

అందుచేత ఈ రాజకీయ డ్రామాను అర్థం చేసుకుంటే ఎవరికీ తికమక ఏమీ‌ ఉండదు.
అంతా పక్కాగా ప్లాను ప్రకారమే జరుగుతోందనేది స్పష్టం.

ఎవరు లాభపడతారూ ఎవరు నష్టపోతారూ అన్న ప్రశ్నలు పక్కన పెట్టండి.
రాజకీయ అనిశ్చితి వల్ల ప్రజలు మాత్రం భారీగా నష్టపోతారు.