23, నవంబర్ 2013, శనివారం

భద్రాచలం విషయంలో సీమాంధ్రులకు విజ్ఞప్తి.

నేడు మాన్య కవిపుంగవులు శ్రీ గుండు మధుసూదనులవారు మావి మావి యనంగనె మీవి యగునె "నోరు మూయుఁడు! మాటలు మీఱఁ బోక, పరువు దక్కించుకొనుఁడయ్య పలుకుఁ దక్కి" యని నిందాపూర్వకముగా బహుతీవ్రస్వరముతో కవిత్వము వ్రాయుట జరిగినది.  వారి భావన వారిది.  వారిట్టి ధోరణిలో వ్రాయుట క్రొత్తగాదు.  దానికి సీమాంద్రులు నొచ్చుకొన బనిలేదు.  నొచ్చుకొని ప్రయోజనమును లేదు.  సాటి తెలుగువారి  మనోభావముల నవమానపరచుటలో గుండువారికి వినోదము కలుగవచ్చును.  కాని గాయపడిన సీమాంధ్రులకు కొన్ని స్వాంతన వచనములను చెప్పబూనుట తప్పని సరియని భావించి కొంత వ్రాయవలసి వచ్చుచున్నది.  ఈ వ్యాసములో ఏ పక్షము వారిని గాని యధిక్షేపించు కార్యక్రమము లేవియును లేవు.  ఎవరైన భుజములు తడవుకొనట తటస్థించినచో దానికి నేను చేయగలుగునది కూడ లేదు.

అయ్యా అఖిలాండకోటిబ్రహ్మాండనాయకుండైన శ్రీహరిచే నమరించబడిన  సమస్త ప్రపంచంబు నందు గల యశేషశ్రేష్ఠ ప్రాంతవస్తుజనాదికంబును కేవలము తెలంగాణమువారి యాజ్ఞకును హక్కుభుక్తంబులకును లోనుగా వలసినవియే గాని తదన్యంబులు గానేరవు.  తెలంగాణమువారు తమకు నిరుపయోగంబని భావించి విసర్జించి యన్యులకు కృపతో నాజ్ఞ శాయించి యనుగ్రహించినట్టి ప్రాంతవస్తువిశేషంబులు మాత్రము తెలంగాణేతరప్రాంతీయులకు వినయపురస్సరంబుగా స్వీకరణయోగ్యంబులై యున్నవి.  ఈ విషయంబునందు తెలంగాణేతర ప్రాంతవాసులు నిరుపయోగమైన వాదనలకు దిగరాదని విజ్ఞప్తి.

నేడు కాలము తమ కనుకూలంబుగా వర్తించు చున్న దని తెలంగాణము వారలు మిక్కిలి సంతోషముతో నున్న పరిస్థితిలో నితరులు వృధావాదంబులతో తెలంగాణాప్రజలకుగాని తెలంగాణాప్రాంతనాయకులకు గాని క్రోధవిచారంబులను కల్పించు వాక్క్రియావ్యవసాయంబులకు పాల్పడరాదు.  అట్లుపాల్పడియును కార్యంబు లేదు గావున తెలంగాణేతరులు ప్రాప్తకాలజ్ఞులై పరమేశ్వరానుగ్రహంబునకు వేచి యుండవలసినదిగా తెలియగలరని ఆశించుచున్నాను.

మన విచిత్రప్రజాస్వామ్యనామకకాంగ్రేసుపాలనావ్యవస్థావిశేషవిజ్ఞతాకారణముగా కాంగ్రేసువారి స్వప్రయోజనమే దేశప్రయోజనము గాన, వారు దొరతనములోనుండి శాయించిన శాయించుచున్న మరియును శాయించగల సమస్తమైన శాసనంబులచేత బధ్ధులైన దేశప్రజలకు పరమేశ్వరానుగ్రహంబు దప్ప విమోక్షణావకాశము గలుగు నుపాయంబు మృగ్యంబు.  ప్రస్తుత మా కాంగ్రేసుదొరతనము వారలీ  ఆంధ్రప్రదేశంబు నుండి తెలంగాణమును విడదీసి ప్రత్యేక మగు రాష్ట్రంబుగా నేర్పరచుట యందే తమకు విశేషంబగు ప్రయోజనంబు సంఘటిల్లు నని భావించి తదనుగుణంబులగు చర్యలయందు  నిమగ్నులై యున్నారు కావున తత్తద్విషయంబులను గూర్చి ప్రశ్నించుట దుస్సాహసముగా భావించబడు చున్నది.

ఇట్టి తరుణమందు న్యాయాన్యాయంబులను గురించి గాని ధర్మాధర్మంబులను గురించి గాని యుభయప్రాంతంబులందు వసించు చున్న ప్రజలకు కాలక్రమంబున వాటిల్ల గల కష్టనష్టంబులను గురించి గాని విశాలదేశప్రయోజనంబులకు భవిష్యమందు సూచితమగు చున్న ప్రమాదంబులను గురించి గాని కాంగ్రేసువారితో గాని ఆనందడోలికలలో దేలియాడు చున్న  తెలంగాణము వారికి గాని వివరించి విన్నవించి వాదించి యుపయోగము లేదు.  కాంగ్రేసు దొరతనము వారికి  ఆసన్నవిపదోల్లంఘనాప్రయోజనకారియును సార్ధకనామధేయుడైన రాహులుని పట్టాభిషేకమునకు తోడ్పడునదియును నై యున్న కార్యమే ముఖ్యము గాని కించిద్విషయంబులైన దేశప్రయోజనాదులు కావు. తెలంగాణామువారికి వారి మనోభీష్టము నెఱవేరి తెలంగాణము ప్రత్యేకరాష్ట్రముగా నావిర్భవించుటే ముఖ్యము గాని దానివలన నితరులకు గలగు వెతలతో గాని దేశప్రయోజనము వంటి  యల్పవిషయముతో గాని యిసుమంతైననను పని లేదు.  పని యుండవలయు నని భావించుట అమాయకత్వము. అనగా రాజకీయముల తీరు దెన్నులను గ్రహించ లేక పోవుట.  దీనిని కాంగ్రేసు దొరతనము వారు దుస్సాహసుముగా పరిగణించి శిక్షింతురు మరియును తెలంగాణమువారు దుష్టత్వముగా పరిగణించి  క్రోధపరవశులై యీసడించి దూషించి శపించి పట్టి పల్లార్చగలరు. కావున తస్మాత్ జాగ్రత జాగ్రత యని తెలియ జేయడమైనది.

ఇది యంతయును యావద్దేశవాసులైన తెలుగువారును బాగుగా గ్రహించి కాంగ్రేసు దొరతనము వారితో గాని తెలంగాణము వారితో గాని యీషణ్మాత్రంబును విబేధించక వారి కోరికమేరకు వర్తించుట కాలోచితమైన కార్యము. ఈ తెలుగుగడ్డను నేటి దనుక నెందరో పరాయివారు పాలించలేదా మరియును ఖండఖండములుగా విభజించి పాలించలేదా యని యూరడిల్ల వలసినది. ఈ విషయములో కాంగ్రేసుదొరతనము వారి యొద్ద పెద్దపాలేర్లుగా పనిచేయుచు హస్తినాపురవాస్తవ్యులై చెలంగుచున్న మన కేంద్రమంత్రులు మిగుల బుధ్ధిమంతులై యున్నట్లు తోచుచున్నదన్న నతిశయోక్తి యించుకయును లేదు కదా. వారు సేవాధర్మపరాయణులై తెలుగు జాతిలో కొందరు ప్రాప్తకాలజ్ఞులు నేటికిని కలరని చాటుట మిక్కిలి ముదావహము మరియు తెలుగుజాతి యని యొకటి నిజముగా నున్నచో దానికి నిశ్చయముగ గర్వకారణము.

కాల మన్నది  యొకే తీరుగా నుండదని మనకు తెలియని విషయము కాదు.  చక్రనేమిక్రమముగా  నుండును గదా దాని విధానము.  నీచైర్గచ్ఛత్యుపరి చ దశా చక్రనేమి క్రమేణ యనియును సుఖం దుఃఖం భ్రమత్యేవ చక్రనేమి క్రమేణ చ  యనియును గదా వినబడు చున్నది.  నే డొకరికి మంచి రోజు వచ్చిన రేపు మరొకరికి రావచ్చును.  ఇంత సామాన్యమైన దానికి  కాలబలగర్వితులు కన్నుమిన్ను గానక సాటివారిని  విషముఖులని నిందించుచుటయును నోళులు మూసుకొమ్మని దూషించుటయును కేవలము పిల్ల చేష్టలు. కాని కాలవంచితులీ మాటలు పడక తీరదు కదా.  పోనిం డిట్లు పడ్డ వారందరును చెడ్డవారు కాదనెడు సామెతను గురుతు చేసుకొని వారు దురపిల్లుట మాని యూరడిల్లక తీరదు.  ఏ పాలనమునుండి ఏ ప్రాంత మెప్పుడు జారిపోవునో మరల నే పాలనములోని కే ప్రాంతము వచ్చి కలయు చుండునో యన్న విషయమును గూర్చి వ్యగ్రత నిరర్థకము.  అంతయు కాలము చేతులో నున్న వ్యవహారము.  మానావమానములు కాలము చేతనే కలుగుచున్నవి కాని వ్యక్తుల ప్రయోజకత్వగరిమావిన్యాస మందు శూన్యమని బలి చక్రవర్తి యింద్రునకు చేసిన బోధను స్ఫురణకు దెచ్చుకొన వలయిను సుమా.

నేడు తెలంగాణావారి దృష్టిలో భద్రాద్రీశుడు తెలంగాణపు నవాబుల యేలుబడి కొకప్పుడు లోనై యుండిన కారణము చేత పునర్దాస్యయోగ్యుడై నాడు. శాంతం‌ పాపమ్‌.  తెలంగాణమువారి దృష్టిలో నిది భద్రాద్రిరామచంద్రునకు విడుదల ప్రసాదించి రక్షించుట కావచ్చును కదా.  కానిండు దానికేమి.  కట్టబెట్టువారు కలిగినచో కాశీక్షేత్రంబును తెలంగాణావారిదే కావచ్చును.  శక్తి కలిగినచో కాలబలము గలవార లితరుల యూళ్ళలో నెండయు వెన్నెలయును గూడ కాయరాదని శాసింతురే కదా.  వృధా విచారము మాని యోచించవలయును.  రామాలయమను నొక కట్టడము తెలంగాణములోనికి వచ్చినంత మాత్రము చేత శ్రీరాముడు తెలంగాణవారి కట్టుబానిస కాబోడు కదా యని చక్కగా గ్రహించి తెలంగాణాప్రాంతవాసులు కాని వారును నిర్విచారముగా నుండ వచ్చును.  విజ్ఞులైన వారు కాలగమనంబుచే గలుగు వింతలకు చింతించక జరుగుచున్నది  నిర్వికారులై సాక్షిమాత్రులై గమనించు చుందురు. మానాపమానయోస్తుల్యస్తుల్యో మిత్రారిపక్షయోః అని గీతాకారుడు చెప్పినట్లుగా నుండుటయే తెలుగువారికి కర్తవ్యము.  ముఖ్యముగా సీమాంధ్రప్రాంతవాసులైన తెలుగువారికి కాలము ప్రసాదించిన కర్తవ్యము.  శుభం భూయాత్.

17 కామెంట్‌లు:

  1. తెలబాన్ల కూతలే కపితలయ్యేనా
    విషపు రాతలే చందస్సు కాదా
    విద్వెషమే ప్రాస అయ్యిందిరా
    అబద్దాలే అంత్య ఆది ప్రాసలు
    ముక్కలుగ నరకడమే తెలుగు కవిత దౌర్భాగ్యం,
    ఆముదంపు చెట్లే మహ వౄక్షాలు
    కాకి పిల్ల కాకికి ముద్దు,
    "మొద్దు" రాతలే "సర్పాచారి" కి ముద్దు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నిందాలాపాలు ఎవరు చేసినా బాగుండవు.

      తొలగించండి
    2. నేను విభజనకి వ్యతిరేకం కాదు. కాని ఎవరి అభిప్రాయం వారు స్వెచ్చగా చెప్పగలగాలి.కాని ఇక్కడ జరుగుతున్నది వేరు.మన అభిప్రాయం తొ వ్యతిరేకించిన వాళ్ళని తిట్టడం, విషం, విద్వెషం కక్కడం.పక్క వాడి మీద అసూయ తొ రగిలి పోవడం,మంకౌ చేతకానిది పక్క వాడు సాధించగలిగితే వాడి మీద అబద్దాలు ప్రాచరం చెయ్యడం ఇదే నిత్య కృత్యమయ్యింది కొందరు విభజన వాదులకి.మన సాత్త్వికతని చేతకానితనం అనుకొవడం. దీనికి వ్యతిరేకముగా యుద్దం చెయ్యాలి. చివరి వరకు పోరాడాలి.

      తొలగించండి
  2. గ్రాంథిక భాషలో చాలా బాగా అక్కసు కక్కారు. మీరు అన్నట్లు ఆ రాముడే అన్ని చూసు కుంటాడు. నీతులు చెబుతూనె విషం కక్కారు. ఇంకొకరిని భాధ పెత్తందంటూ మీరు చెబుతూనే మీ కొపం చూపించారు. నీతులు చెప్పడం చలా తేలిక.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చిత్తం. యధాస్మై రోచతే విశ్వం తదే దం పరి వర్తతే అని ఆనందవర్థనుడు అన్నది ఇక్కడా వర్తిస్తుంది! తీక్ష్ణమైన దృష్టి కోణంతో చూసే వారికి తమ హృదయం అమృతమయం - తదన్యమైన ప్రపంచమంతా విషపూరితం. వింత లేదు. మీరు అన్నది కొత్త మాటా కాదు. కాబట్టి చింతా లేదు.

      తొలగించండి
    2. కోతి మిణుగురు పురుగుల కధ వినే ఉంటారు కదా.అజ్ఞానులకి నీతి రుచించదు.throwing pearls before the swine.

      తొలగించండి
  3. తివిరి ఇసుకన తైలంబు తీయవచ్చు ........... అన్నది వినే ఉంటారు గదా శ్యామలరావు గారూ.

    రిప్లయితొలగించండి
  4. మధుసూదన్‍గారిపై అక్కసుతో గ్రాంధికంలో ఈ వ్యాసం రాశారంటే, మీలో ఎంత అసహనం, కుట్ర ఉందో అర్థం అవుతోంది. మీ మనస్సు అశాంతితో రగులుతోంది. మీ చిత్తం అనైకాగ్రం అయింది. పైగా శాంతాన్ని ఆంధ్రులకు బోధిస్తున్నారు. "య స్స్వయం చల చిత్త స్స స్థైర్యం నోపదిశేత్పరమ్"అని కదా సూక్తి. పైగా నీతులు చెబుతున్నారు. "ఎదుటి వారికి చెప్పేటందుకు నీతులు ఉన్నాయి". మధుసూదన్ గారు చెప్పిన వాటిలో అసత్యాలుంటే ఖండించండి. నిందించకండి.చులకన చేయకండి. ఆంధ్రుల చేత తిట్టించకండి. విషంకక్కించకండి.
    గమనిక: "విషయసంబంధం లేని వ్యాఖ్యలూ, సభ్యత పాటించని వ్యాఖ్యలూ తొలగించబడతాయి" అని అంటూనే మొదటి అజ్ఞాత వ్యాఖ్యను ప్రచురించారంటే, మీ చిత్తశుద్ధిని గురించి ఎందుకు శంకించరాదో ఆత్మవిమర్శ చేసుకోగలరు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నేను చేస్తే శృంగారం అన్న చందాన ఉంది.అంటే వేరే వాళ్ళ బ్లాగుల్లొ ఏది ప్రచురించాలో కూడా మీరే నిర్ణయిస్తారు.మీ బ్లాగుల్లొ చూసుకోండి. గురువిందని గురుతు చేస్తాయి. ఏ బ్లాగ్ లొ అయినా చర్చ జరిగిందా. ఎంతసేపు అర్ద సత్యాలు, అసత్యాలతొ విషం, విద్వెషాల్తొ నింపేసి ఈరోజు ఈ పరిస్థితి.

      తొలగించండి
    2. మరి మీరిచ్చిన బదులు కూడా ప్రచురించారు కదా. మీ బదులు చూస్తుంటేనే మనసులో ఎంత అసూయా , ద్వెషాల్తొ రగిలిపోతున్నారో స్పష్టమౌతోంది.

      sankar

      తొలగించండి
    3. బదులిచ్చారంటే దానర్థం? సభ్యత పాటించని వ్యాఖ్యలు తొలగించకుండా, తొలగింపబడతాయంటూనే, నేను నిన్ను మందలించినట్టు రాస్తాను, నువ్వు తిడుతూనే ఉండు అనేట్లుండడం, అసత్యవాదిత్వం కాదా? ఆ వ్యాఖ్యల్ని తొలగిస్తే నమ్మేవాళ్ళం. కాని వెనకేసుకొచ్చినట్టుండడం అనుమానాలకు తావిస్తోంది.

      తొలగించండి
    4. అజ్ఞాత (23 నవంబర్ 2013 6:47 PM) గారు కొన్ని చిత్రమైన మాటలు మాట్లాడారు.

      >మధుసూదన్‍గారిపై అక్కసుతో గ్రాంధికంలో ఈ వ్యాసం రాశారంటే, మీలో ఎంత అసహనం, కుట్ర ఉందో అర్థం అవుతోంది.

      నేను అక్కసుతోవ్రాయటమేమిటో, అసహనపరుడనూ కుట్రదారుడనూ కావటం ఏమిటో బోధపడటం లేదు. అటువంటి వాడనే ఐతే, వీరతెలంగాణావాదులనుఖండిస్తూ పుంఖానుపుంఖాలుగా కవిత్వం వ్రాస్తూ ఉండేవాడిని కదా? అలా చేస్తున్నానా? లేదే! తెలంగాణావాదులతో మమేకం కాని వారంతా కుట్రదారులే అంటే అసహ్యంగా ఉండదా?

      >మీ మనస్సు అశాంతితో రగులుతోంది. మీ చిత్తం అనైకాగ్రం అయింది. పైగా శాంతాన్ని ఆంధ్రులకు బోధిస్తున్నారు. "య స్స్వయం చల చిత్త స్స స్థైర్యం నోపదిశేత్పరమ్"అని కదా సూక్తి. పైగా నీతులు చెబుతున్నారు. "ఎదుటి వారికి చెప్పేటందుకు నీతులు ఉన్నాయి".

      ఈ‌ అజ్ఞాతగారు నాకు నీతులు చెప్పాలని ఎందు కనుకుంటున్నారు? నాలో అశాంతి ఉందని వీరు భావిస్తే దానికేం చేస్తాం? వీరి తరపు మహాకవిగారు నోరుమూయండి వంటి మాటలతో అక్షరాలా తిట్టుకవిత్వం వ్రాయవచ్చును కాని దానికి ఎవరూ అభ్యంతరం చెప్పరాదా? విద్వేషాన్ని బోధించే వీరి కవీంద్రులవాగ్విన్యాసం కన్నా శాంతాన్ని బోధించే ఒక ప్రయత్నం తప్పక మంచిదే కదా? వీరికి అదీ సమ్మతం కానట్లుంది! దానికేం చేస్తాం?

      >మధుసూదన్ గారు చెప్పిన వాటిలో అసత్యాలుంటే ఖండించండి. నిందించకండి.చులకన చేయకండి. ఆంధ్రుల చేత తిట్టించకండి. విషంకక్కించకండి.

      నేను సత్యాసత్యాల ప్రసక్తి తేలేదు నా వ్యాసంలో. తెచ్చానా? తెస్తే అది పెద్ద రాజకీయవ్యాసం అవుతుంది. నాకంత ఆసక్తి లేదు. తీరికా లేదు - ఓపికా లేదు. నేను ఎవరినీ నిందించలేదే, ఎవరినీ చులకన చేసి ఏమీ చెప్పలేదే! నిందలు దూషణలూ అనేవి వీరి కవీంద్రబృందం వారి దైనందిన కార్యక్రమం కావచ్చును కాని అటువంటిది నేను ఎన్నడూ చేయలేదే? ఆంధ్రులచేత తిట్టించటం ఏమిటీ? వీరు మాత్రం ఆంధ్రులు కాక ఆంగ్లేయులా? తురుష్కులా? ఎవరినీ తిట్లకు దిగమని నేను ఎక్కడా సలహా ఇవ్వలేదే? ఇదా వీరు అర్థం చేసుకున్నది? నేను సహనం వహించమని వ్రాస్తే వీరికి ఇలా అర్థం అవటం ఏమిటీ? దానికేం చేయగలం?

      ఈ విషం కక్కటం అనే మాట చాలా అసహ్యంగా ఉంది. విషమేమిటి? విషం కక్కట మేమిటి? తెలంగాణావాదులకి ఈ పదప్రయోగం ఒక పరమప్రీతికరమైన ఊతపదం ఐపోయింది! పైత్యరోగికి విషముగా పంచదార అన్నట్లుంది!

      >గమనిక: "విషయసంబంధం లేని వ్యాఖ్యలూ, సభ్యత పాటించని వ్యాఖ్యలూ తొలగించబడతాయి" అని అంటూనే మొదటి అజ్ఞాత వ్యాఖ్యను ప్రచురించారంటే, మీ చిత్తశుద్ధిని గురించి ఎందుకు శంకించరాదో ఆత్మవిమర్శ చేసుకోగలరు.

      ఇదొక మూర్ఖపు అరోపణ. నేను నిరంతరాయంగా నా బ్లాగులు చూస్తూ, ముఖ్యంగా నా టపాకు వచ్చే స్పందనలకోసం ఎదురుచూస్తూ‌ కూర్చుంటానని అనుకోవటం వెంగళితనం కాదా? ఈ‌బ్లాగులో వ్యాఖ్యలపైన నియంత్రణ (moderation) ఉంచలేదు. వచ్చిన వ్యాఖ్యలు వచ్చినట్లు ప్రచురించ బడుతున్నాయి. అసంగతమైన వ్యాఖ్యలు వీలు వెంబడి తొలగించబడతాయి. ఒక్కొక్కసారి అసంగతమైన వ్యాఖ్యలు నా కంట పడే సరికే వాటి పుణ్యాన బోలెడంత అనవసరమైన చర్చ జరిగి తొలగించటం కొంత ఇబ్బందికరం అవుతుంది. అలాంటి దుర్వ్యాఖ్యలకు ఈ అజ్ఞాతగారి వ్యాఖ్యయే పెద్ద ఉదాహరణ. చాలా?

      తొలగించండి
    5. ఎర్ర గురివింద తన నలుపును ఎరుగదు. మీ కసి, మధుసూదన్ గారిని వ్యంగ్యంగా మహాకవి, కవీంద్రులు అని వెక్కిరించడంలోనే కనిపిస్తున్నది. ఆమాత్రం అర్థం చేసుకోలేమా. పిర్రగిచ్చి జోలపాడడం అంటే ఇదే. ఒక వ్యక్తి గురించి ఒక పోస్టు రాయడమే మీ కోపాన్ని చెబుతున్నది. నోటితో అని నొసటితో వెక్కిరించినట్టు, దుర్వ్యాఖ్యను తొలగించకుండా ’నిందాలాపాలు ఎవరు చేసినా బాగుండవు’ అనడం..ఆ దుర్వ్యాఖ్యను లోలోన మెచ్చుకొన్నట్టేగదా. పయోముఖ విషకుంభంలాగా భావించాలి. పైకి శాంతి కాముకత్వం. లోన రెచ్చగొట్టే స్వభావం. కబుర్లెన్నైనా చెప్పవచ్చు. తెలంగాణ వాళ్ళకు అన్యాయం జరగకపోతేనే, మీ లాంటివాళ్ళు అవమానించకుండానే ఆత్మాభిమానం దెబ్బతిని, రాష్ట్రం కోరుతున్నారా? ఈ విషయం తెలియని అమాయకులా తమరు? తెలిసీ తెలంగాణా వాళ్ళ బ్లాగుల్లో నీతులు వల్లిస్తున్నారంటే మిమ్మల్ని ఏమనాలి.

      తొలగించండి
    6. మిమ్మల్ని ఏమనాలి అంటున్నా రొక అజ్ఞాతగారు, అనదలచుకున్న అవాకులూ చెవాకులూ అన్నీ అన్నాక. తిట్లపురాణంలో ఆరితేరిపోయిన యీ అజ్ఞాతలు తమను మిగతా ప్రపంచం అంతా శాంతికాముకులుగాను సాధుపుంగవులుగాను భావించాలని కోరుతూ ఉంటారు పాపం.
      అజాగళస్తనసగోత్రీకులైన యీ అజ్ఞాతలకు సమాధానం ఇచ్చే ఆసక్తి కాని అవసరం కాని కనిపించటం‌ లేదు.

      తొలగించండి
    7. జై తెలంగాణ-జై ఆంధ్ర-జై విభాజ్యాంధ్రప్రదెశ్ అనడమే సమాధానం. సర్వేజనా స్సుఖినో భవంతు.

      తొలగించండి
  5. ఇంక ఇక్కడ సమయం వృధా తప్ప వేరే ఎం లేదు. మనకు నచ్చని దాన్ని కూడా సహృదయంతొ వినే ఓపిక లేనప్పుడు చెవిటి వాడి ముందు శంఖం ఊదడమే.అంటే వేరే వాళ్ళ అభిప్రాయం గౌరవించడం అనేదే లేదు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి.నీ అభిప్రాయం తప్పు అది మార్చుకుంటేనే నువ్వు మంచివాడివి అ prejudiced mindsetనే ఉంటే ఏమీ చెయ్యడానికి లేదు.

    రిప్లయితొలగించండి
  6. కట్టబెట్టువారు కలిగినచో కాశీక్షేత్రంబును తెలంగాణావారిదే కావచ్చును...Kavachunu kadu sir...maade antaru veeru....Adbuthaha

    --

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.