26, ఆగస్టు 2022, శుక్రవారం

ధర్మరాజు జూదం - 1


ధర్మరాజు గారు దిగ్విజయం చేసి మహావైభవంగా రాజసూయయాగం చేసారు.
అ వైభవం చూసి దుర్యోధనుడికి అసూయతో మండిపోయింది.
శకుని దగ్గర ఏమని వాపోయాడో చూడండి.

వహ్నిమేవ ప్రవేక్ష్యామి భక్షయిష్యామి వా విషం
అపోవాపి ప్రవేక్ష్యామి న హి శక్ష్యామి జీవితుం


అని. అంటే నిప్పుల్లో దూకుతాను, విషం తింటాను లేదా నీళ్ళలో దూకి చస్తాను కాని యింక జీవించి ఉండలేను అని  అన్నాడు. ఇంకా చాలా వాపోయి చివరని అంటాడూ

కృతోయత్నో మయా పూర్వం వినాశే తస్య సౌబల
తచ్చ సర్వ మతిక్రమ్య సంవృధ్ధోప్సివ పంకజం

ఆంటే ఆ ధర్మరాజును నాశనం చేయటం కోసం ఇంతకు ముందు ఎన్నో ప్రయత్నాలు చేసాను కానీ వాటి నన్నిటినీ‌ దాటుకొని ఆయన నీళ్ళల్లో ఉన్న పద్మం లాగా చక్కగా వృధ్ధిపొందాడూ అని.

అప్పుడు శకుని అబ్బే అలాంటి పిచ్చిపని చేయకు. నేను మంచి ఉపాయం చెబుతాను విను.

అహమక్షే ష్వబిజ్ఞాతః పృథివ్యా మపి భారత
హృదయజ్ఞః పణజ్ఞశ్చ విశేషజ్ఞశ్చ దేవనే
ద్యూతప్రియశ్చ కౌంతేయో న చ జానాతి దేవితుం
ఆహూత శ్చేష్యపి వ్యక్తం ద్యూతా దపి రణా దపి
నియతం తం విజేష్యామి కృత్వాతు కపటం విభో
అనయామి సమృధ్ధిం తాం దివ్యాం చోపాహ్వయస్వతం

అంటే శకుని చేప్పేది ఇది. ఈభూలోకంలో పాచికలు విసరటంలో నాకున్న నేర్పు మరెవ్వరికీ లేదు. ధర్మరాజుకు జూదం అంటే ఆసక్తి ఉంది కాని నేర్పు చాలదు. ఆయన యుధ్ధానికి పిలిచినా జూదానికి పిలిచినా తప్పక వస్తాడు.నేను కపటంతో ధర్మరాజును ఓడిస్తాను. ఆ దివ్యసంపదను నీవశం చేస్తాను. పిలువు జూదానికి అని.

తెలుగు భారతంలో శకుని మాటలు:


క. భాను ప్రభుఁ డగు పాండుమ
హీనాథాత్ముల లక్ష్మి యెల్లను నీకున్
నే నపహరించి యిత్తు ధ
రానుత మాయాదురోదరవ్యాజమునన్
వ. ధర్మతనయుండు జూదంబునకుఁ బ్రియుండు గాని యందుల యుక్కివం బెఱుంగం‌ డే నక్షవిద్య యం దతి దక్షుండ నాతని నశ్రమంబున నోడించి తదీయ రాజ్యవిభూతి నీకిచ్చెద వగవకుండుము.

ఇక్కడ  శకుని స్వయంగా కృత్వాతు కపటం అని చెప్పుకున్నాడు కదా. అంటే మోసం చేసి మరీ గెలుస్తానని తానే స్వయంగా శకుని దుర్యోధనుడితో చెప్పినప్పుడు కౌరవులు న్యాయంగా జూదం ఆడారూ అన్న వాదనకు అర్ధమే లేదు. ధర్మరాజుకు నైపుణ్యం చాలదు అంటూనే మోసం చేసి గెలుస్తాను అంటున్నాడు. అంటే ఏమిటీ? న్యాయంగా జూదం ఆడితే ధర్మరాజు గెలిచే అవకాశం ఉందని తానే అనుమానించుతున్నా డనే‌ కదా అర్ధం? అంటే ధర్మరాజుకు కౌశలం లేకపోవటం జూదం ఆడటంలో కాదు తన మోసాన్ని పసిగట్టటంలో ఆయనకు నేర్పు లేదూ అని చెప్తున్నాడన్న మాట.

ఈ ఉపాయం బాగుందని దుర్యోధనుడు సంబర పడ్డాడు. తాను పిలిస్తే ధర్మరాజు వస్తాడా జూదానికి?‌ కాని పెదనాన్న గారి పిలుపు అంటే తప్పక శిరసావహించి వస్తాడు కదా. అందుచేత పోయి తాను ధృతరాష్ట్ర్డుకి చెవులు కొరికాడు. ఆయన విదురుణ్ణి పిలిచి విషయం చెప్పి ధర్మరాజుని జూదానికి ఆహ్వానించి తీసుకొని రమ్మాన్నాడు. అసలు కురువృక్షాన్ని దొలిచిని పురుగు ఈ ధృతరాష్ట్ర్డుడే! తన కోరిక కూడా పాండవుల కన్నా తన కొడుకులే‌ బాగుండాలని కదా. అందుకని దుర్యోధనుడి పన్నాగం మహబాగా నచ్చింది మరి.

విదురుడు అభ్యంతరం చెప్పాడు.

నాభినందామి తే రాజన్ వ్యవసాయ మిమం ప్రభో
పుత్రేర్బేధో యథా న స్యాత్ ద్యూతహేతో తథా కురు

తెలుగు భారతంలో విదురుడి మాట


ఆ. ఇట్టి కార్యంబునకు నే నవశ్యంబును
నొడ బడంగ నోప నుక్కివమున
సుతుల తోడ నేల సుతులకు భేదంబు
సేయ గడఁగి తిదియు జెట్ట యనక

తే. ఒలసి నీపుత్రులెల్ల నొండొరుల తోడ
నెట్లొడంబడి యుండుదు రట్ల చేయ
వలయుఁ దమలోన జూదంబు వాదు నగుటఁ
కలహ మూలంబ యెట్టి శాంతులకు నైన

వ. నీ‌ నేర్చు విధంబుల శకుని దుర్యోధనుల దుర్వవసాయం బుడిగించి యిక్కురు వంశంబు రక్షింపుము.

రాజా నీవు ఇలా కొడుకుల మధ్య జూదం నడిపిస్తే కలహం వస్తుంది సుమా అని చెప్పాడు. కాని గ్రుడ్డి రాజు మనస్సు కూడా పుత్రమోహంతో గ్రుడ్డిదై ఉంది కదా అందుచేత విదురుడిని ఆజ్ఞాపించాడు.

తదద్య విదుర ప్రాప్య రాజానం మమ శాసనాత్
క్షిప్ర మానయ దుర్ధర్షం కుంతీపుత్రం యుధిష్టిరం

సరే నా శాసనం ఇది, ఈ ప్రకారం దర్మరాజును జూదానికి పిలుచుకొని రా అంటే ఆయన ఏంచేస్తాడు పాపం!

విదురమహాశయుడు వచ్చి ఆహ్వానం అందించగానే ధర్మరాజు విరక్తుడై ఏమన్నాడో వినండి.

ద్యూతే‌ క్షత్రః కలహో విద్యతే నః
కో వై ద్యూతం రోచతే బుధ్యమానః
కిం వా భవా న్మన్యతే యుక్తరూపం
భ్వద్వాక్యే సర్వ ఏవ స్థితా స్మః

మహాత్మా ఈ జూదం అనేది కలహ హేతువు.  ఏ బుధ్ధిమంతుడు దాన్ని కోరుకుంటాడు? ఇప్పుడు మేము ఏమి చేస్తే బాగుంటుంది. నీవు ఎలా చేయమంటే అలాగు చేస్తాం అన్నాడు ధర్మరాజు.

పాపం విదురుడు మాత్రం తన నోటితో తాను జూదం ఆడమనీ చెప్పలేడు. రాజాజ్ఞ ఉండగా జూదానికి రావధ్దు అనీ చెప్పలేడు. అందుకే

జానామ్యహం ద్యూత మనర్ధమూలం
కృతశ్చ యత్నోఽస్య మయా నివారణే
రాజా చ మాం ప్రాహిణోత్త్వకాశం
శ్రుత్వా విద్వన్ శ్రేయ ఇహాచరస్వ

తెలుసునయ్యా అనర్ధాలకు మూలం ఈజూదం అనీ, రాజుకు చెప్పి చూసాను కూడా. కాని ఆయన ద్యూతానికి నిన్ను పిలువమనే‌ అన్నాడు. బాగా అలోచించుకొని నీకేది మంచిది అనిపిస్తే అలా చేయవయ్యా అని విదురుడు అన్నాడు. ఇంకే మనగలడూ పాపం?

సరే అక్కడ జూదానికి ఉబలాట పడుతున్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారూ‌ అని దర్మరాజు అడిగితే‌ విదురుడు శకుని పేరు చెప్పనే చెప్పాడు. అప్పుడు దర్మరాజు గారు ఏమన్నారంటే

మహామాయాః కితవా సన్నివిష్టా
మాయోపవా దేవితారోఽత్ర సంతి
ధాత్రా తు దిష్టస్య వశే  కి వేదం
సర్వం జగ త్తిష్టతి న స్వతంత్య్రం

నాహం రాజ్ఞా ధృతరాష్ట్రస్య శాసనా
న్న గంతు మిఛ్ఛామి కవే దురోదరం
ఇష్టోహి పుత్రస్య పితా సదైవ
తదస్మి కర్తా విదురాత్&థ మాం యథా

న చా కామ శ్శకునినా దేవితాఽహం
న చే న్మాం ధృష్ట ఆహ్వయితా సభాయాం
ఆయూతోఽహం ననివర్తే కదాచి
త్తదా హితం శాశ్వతం వై వ్రతం మే

మాయావులు జూదానికి సిధ్ధంగా ఉన్నట్లు కనిపిస్తూనే‌ ఉందే! ఈప్రపంచం అంతా విధికి వశమై అస్వతంత్రంగా ఉంది. పిలుపు పంపినది సాక్షాత్తూ పెదనాన్నగారు. ఆయన అజ్ఞను కాదనటం ఎలా? ఆయన తండ్రి - నేను కొడుకును. నాకాయన ఎప్పుడూ ఇష్టుడే కదా. ఈ ఆహ్వానం అంగీకరించవలసిందే. సభలో మాత్రం శకుని తానై పిలిస్తే తప్ప అతడితో జూదం ఆడను. అతడు పిలిస్తే మాత్రం ఆడక తప్పదు - అది నా వ్రతం.

అప్పటికే ధర్మరాజు గారు దాయాదులకు అహితంగా ప్రవర్తించను అని ఒట్టువేసుకొన్నారు కదా, కలహాలను నివారించటానికి. అందుకని వెళ్ళటం తప్ప గత్యంతరమూ లేదు!

సరే ధర్మరాజుగారు ఆహ్వానం మేరకు బయలు దేరి వెళ్ళారు.ఆయనతో పాటుగా సోదరులూ ద్రౌపదీదేవీ వారి పురోహితుడు ధౌమ్యుడు కూడా వెళ్ళారు.