31, జనవరి 2020, శుక్రవారం

న్యాయంతో నిర్భయ హంతకుల బంతులాటలు


వాస్తవం అన్నది  ఒక్కొక్కసారి నమ్మశక్యంగా ఉండదు.

2012నాటి నిర్భయ కేసులో నిందితులు కాదు కాదు నేరస్థులు మరొకసారి న్యాయవ్యవస్థతో బంతులాట ఆడారు. సమాజాన్ని మరొకసారి వెక్కిరించారు.

మొట్టమొదట ఆ రాక్షసాధముల్లో ఒకడు బాలుడట!

వాడు బాలుడా?

బాలుడి ప్రవర్తన అలాగ కూడా ఉంటుందా ఎక్కడన్నా?

అటువంటి నీచకృత్యాలు బాలురు చేసేవా?

అంత నీచంగా ప్రవర్తించగలిగిన వాడిది మానసికంగా బాలప్రవృత్తి అనగలిగిన వాళ్ళది నాలుకా తాటిమట్టా?

సాంకేతికంగా వాడికి బాల్యావస్థ దాటలేదట. ఇంకొక పది నిముషాలు సమయం ఉన్నా ఆ బాల్యావస్థావినోదం దాటటానికి, వాడు ఎలాంటి నీచనికృష్టమైన దారుణానికి తెగబడినా, బాలుడన్న నిర్వచనం క్రిందకే వచ్చేసాడు మరి. అహా మన న్యాయవ్యవస్థ ఎంత ఉదారమైనది! తలచుకుంటే ఎవ్వరికైనా ఒళ్ళు కంపరం ఎత్తిపోవలసిందే కదా దేవుడా!

అందుచేత వాడు తన బాల్యం అన్న బంతిని ఎరవేసి ఇంచక్కా తప్పించుకున్నాడు, ఆ తప్పించుకున్న ఘనకార్యం వలన ఎంత లభ్ది వాడికి?

ఇప్పుడు వాడు ఎక్కడ ఉన్నాడో ఎవరికీ తెలియదు. అసలు వాడెవడో కూడా ఎవరికీ తెలియదు. వాడి పేరుతో సహా అన్నింటినీ వాడి సంక్షేమం కోసం మార్చి మహోపకారం చేసి వాడి నెత్తిన పాలు కాదు కాదు అమృతం కురిపించింది మన వ్యవస్థ. వాడి గురించి ఎవరికీ ఏమీ తెలియకూడదు. వాడికి ఎవరన్నా అపకారం చేస్తారేమో అని వాడికి ఇలా శ్రీరామరక్ష కల్పించారు. అందుచేత వాడు హాయిగా జనం మద్యన తిరుగుతూ మరొక ఘోరం చేసేందుకు వాడికి అన్నివిధాలా అనుజ్ఞ దయచేసి సంరక్షించటం జరిగిందన్న మాట.

ఈ అరడజను మందీ ఇలా బాలురు అన్న నిర్వచనం లోనికి రాలేకపోయారు కదా పాపం. అందులో ఒకడు తొందరపడి ఆత్మహత్య చేసుకున్నాడు. వాడికి మన చట్తాల గొప్పదనం మీదా వాటిని అమలు చేయవలసిన వ్యవస్థల ప్రయోజకత్వం మీదా అనవసరంగా చాలా నమ్మకం ఎందుకు కుదిరేసిందో తెలియదు. వాడు చచ్చి నరకానికి పోయాడు.

ఇక మిగిలింది నలుగురు. వీళ్ళు బంతాటలో ఎంత ఘనులో చూడండి. మన శిక్షావ్యవస్థను అక్షరాలా ఆడుకుంటున్నారు.

ఒకరి వెనుకాల ఒకరు పిటీషనులు దాఖలు చేస్తూ ఉరిశిక్షను విజయవంతంగా వాయిదాల మీద వాయిదాలు వేస్తూ పోతున్నారు.

ఈ నేరస్థులు ఎవరూ తమ చేతికి చిక్కిన అమాయక జీవికి తప్పించుకుందుకు ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదే, మరి వీళ్ళకి వ్యవస్థలు అవకాశాల మీద అవకాశాలు అనంతంగా ఇస్తూ పోవటం ఏమిటీ? ఏమిటీ విడ్డూరం?

ఇలా అవకాశాలు ఇస్తూ పోవటానికి అంతేం లేదా?

ఇప్పటిదాకా సామాన్య జీవులం అంతా రాష్ట్రపతి క్షమాభిక్ష నిరాకరిస్తే అంతే సంగతులు అనుకుంటూ ఉండే వాళ్ళం కదా? అంతే కదా?

కాదట!

రాష్ట్రపతికి వివరాలు సరిగ్గా చెప్పలేదూ అని కోర్టుకు విన్నవించుకోవచ్చునట.

ఠాఠ్‍ రాష్ట్రపతి నిరాకరించటం వెనుక కుట్ర ఉందీ అని న్యాయస్థానానికి ఎక్కవచ్చునట!

ఇంకా నయం , రాష్ట్రపతికి తిరస్కరించే హక్కు లేదూ అనో ఆ హక్కునుప్రశ్నిస్తున్నాం అనో కూడా న్యాయస్థానానికి ఎక్కవచ్చునేమో.

ఇవన్నీ చెల్లని వాదనలు కావచ్చు.

కాని ప్రతిసారీ న్యాయస్థానాలు సాదరంగా వారి దిక్కుమాలిన అర్జీలను స్వీకరించటం ఒకటి.

వెంఠనే ఉరిని నిలుపు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చేస్తూ ఉండటం ఒకటి.

మళ్ళా ఏదో బ్రహ్మాండమైన పాయింట్లున్న కేసుల్లాగా వాటిపైన తీరిగ్గా విచారణలు జరిపించటం ఒకటి.

ఏమిటిదంతా?

బాధితులు న్యాయం కోసం యుగాలకు యుగాలు ఎదురుచూడవలసి రావటం వారికి అన్యాయాన్ని తీవ్రతరం చేయటమే కాదా?

అది బాధితులకు మరింత అన్యాయం చేయటమే కాదా?

పైపెచ్చు ఈ రాక్షసులకు ఎప్పటికీ ఉరిశిక్ష అమలు కాదంటూ దోషుల తరఫు న్యాయవాది ఏపీ సింగ్ ఘట్టిగా బాధితురాలి తల్లిని ఛాలెంజి చేయటం ఎంత దారుణం. అలా ఆవిడను వెక్కిరించే హక్కు ఆ లాయరుగారికి ఎవరిచ్చారు? అసలు అటువంటి వ్యక్తిని న్యాయవాది అనటం కూడా అన్యాయం కావచ్చును.

ఒకడిని చట్టం అక్షరాలా రక్షించగా, మరొకడు భయపడి చావగా ఇంక మిగిలిన వారు కేవలం నలుగురు మాత్రమే. ఇలా ఒకరి తరువాత ఒకరు బంతాటను నడిపిస్తూ ఎంత కాలయాపన చేసినా , మనం చూస్తుండగానే ఆ ఆటలన్నీ అంతం కాక తప్పదు. వాళ్ళకు ఉరి కూడా తప్పదు.

గ్రుడ్డిలో మెల్ల అన్న ఒక సామెత ఉంది. ఇక్కడ ఆట ఆడుతున్నది నలుగురు మాత్రమే. అదృష్టం కొద్దీ అదేదో కేసులో లాగా  ఇరవై ముగ్గురో నలభై ముగ్గురో కాదు.

అంటే ఇలా సామూహిక అత్యాచారాల వంటి అకృత్యాలకు దిగే వాళ్ళకు అధికస్య అదికం ప్రయోజనం అన్నమాట ఉరితప్పించుకొనే బంతాటలో.

ఇంకా మనకు తెలియని దిక్కుమాలిన చట్టసౌలభ్యాలే మన్నా ఉన్నాయేమో మెల్లగా అవీ తెలియవస్తాయి.

అసలు ఇంత హంగామా జరగటానికి పూర్వరంగంలో వవస్థ ఎంత కాలయాపన చేసిందీ ఎంత ఉదాసీనంగా ఉన్నదీ అన్న విషయం కూడా మనం మర్చిపోకూడదు.

సినిమాల్లో చెబుతూ ఉంటారే ఒక్క నిర్దోషికి కూడా శిక్షపడకూడదూ అంటూ, అటువంటి గొప్ప ఆత్రంలో మన వ్యవస్థలు నేరగాళ్ళకు తప్పించుకు తిరిగేటందుకు గాను వీలైనంత పొడవైన తాళ్ళని అందిస్తూ ఉన్నాయన్న మాట. ఎంత ఔదార్యం ఎంత ఔదార్యం!

ఆదేవుడెవరో పాపులను రక్షించును అన్నట్లుగా ఈ వ్యవస్థ ఏదో నేరస్థులను రక్షించును అని అనిపిస్తోంది.

అవును మరి justice delayed is justice denied కదా!

చట్టం నేరస్థులకి శిక్షలు అమలు చేస్తుంది అని ఎలా నమ్మకం కలుగుతుంది ఇంక మన దేశంలో సామాన్యులకు?