18, ఫిబ్రవరి 2022, శుక్రవారం

భక్తిసముద్రంలో ప్రజాయుధ్ధనౌక మునిగిపోతేనేమీ?


ఈ రోజున ఆంధ్రజ్యోతి పత్రికలో రంగనాయకమ్మ గారి వ్యాసం ఒకటి  భక్తి సముద్రంలో మునిగిపోయిన ‘ప్రజాయుద్ధ నౌక' అన్న శీర్షికతో వచ్చింది.

ఈమధ్య గద్దర్ గారి ధోరణిలో కొట్టవచ్చినట్లు కనిపించిన మార్పు ప్రజానీకానికి ఆశ్చర్యం కలిగించిన మాట వాస్తవం. అయన దైవసంకీర్తనం చేస్తూ టీవీలో కనిపిస్తారని కలలో కూడా మనం ఊహించలేదు కదా.

రంగనాయకమ్మ గారు ఆశ్చర్యపోయి ఊరుకోలేదు మనలాగా.

మనం మెచ్చుకునే కవి, అతని మాటలకే, రాతలకే విరుద్ధంగా తిరిగితే, విమర్శించక మానకూడదని చిరాకుపడి ఆయన్ని అక్షేపించటానికి ఈవ్యాసం వ్రాసారు.

అయనలో వచ్చిన ఈ మార్పునుమెచ్చుకుంటూ‌ ఎవరైనా వ్యాసాలు గట్రా వ్రాసారేమో తెలియదు. నాదృష్టికి ఐతే రాలేదు.

రంగనాయకమ్మ గారి వ్యాసంలో ముఖ్యమైన విషయాలు సంక్ష్హిప్తంగా.  

గద్దర్ మొదట్లో చొక్కా కూడా ధరించే వాడు కాదు. అది ఎబ్బెట్టుగా అనిపించి 2004లో రంగనాయకమ్మగారు ఒక వ్యాసంలో ప్రస్తావిస్తే ఆతరువాత నుండీ ఆయన చొక్కా ధరించటం మొదలు పెట్టాడు. 

నేడుగద్దర్ రియల్ ఎస్టేట్ వ్యాపారులూ, పాలకవర్గాల స్వాముల వాళ్ళూ, ప్రజా వ్యతిరేక ప్రభుత్వాధినేతలు కలిసి తలపెట్టిన భక్తి టూరిజానికి ప్రచారకుడిగా గద్దరు తయారయ్యాడు చూడండి, అది చూసి ఎందరో బాధపడుతూ ఉంటే చూడలేక మళ్ళా రంగనాయకమ్మ గారు ఈవ్యాసం వ్రాస్తున్నారు.

గద్దర్‌ను అనుసరించి ఎందరో మా జీవితాలు ఆగమైపోయాయి అనుకుంటున్నారు. ఇప్పుడు రామ జపం, క్రిష్ణ జపం, రామానుజ జపం చేస్తున్నాడే గద్దర్ అని జనఘోష.  గతంలో ప్రత్యేక తెలంగాణ రావాలని భద్రాచలంలో, సీతమ్మ తల్లిని గద్దర్ మొక్కుకున్నాడని  ఒక వార్త కూడా ఉంది. 

రంగనాయకమ్మ ఆంటారూ, ". నిన్న ఏకంగా, జీయరు చానల్ అని అనధికారికంగా పిలిచే ఒక టీవీ చానల్లో, ఏం జరిగిందో చూశాను! భక్తి పారవశ్యంలో మునిగాడు గద్దరు. అతడు చేసిన ప్రశంసా వాక్యాల్నీ, భజన కీర్తనల్ని గుర్తు చేసే మైలు పొడవు పాటనీ విన్నాను. అంటే, ఒక నాటి ప్రజాయుద్ధ నౌక, ఈ నాడు భక్తి సముద్రంలో మునిగి పోయిందన్న మాట!" అని

రంగనాయకమ్మ గారి ఉద్దేశ‌ం‌ ప్రకారం, ఏఁ, ఒక మనిషికి అభిప్రాయాలు మార్చుకునే హక్కు లేదా? అభిప్రాయాలు మారవా?’ అని గద్దరో, అతడి భక్తులో, అడగొచ్చు. తప్పకుండా, ఆ హక్కు వుంది. ఉంటే, తగిన కారణం చెప్పాలి!‘ఒకప్పుడు వీర విప్లవ కవిత్వ నినాదాలు ఇచ్చి, గానాలు చేసి, ఇప్పుడు ఇలా పాలకవర్గ ఆధ్యాత్మిక సేవకుడైనావేమీ?’ అని విమర్శలతో అడిగే హక్కు, అతడి వెనకటి అభిమానులకు కూడా వుంటుంది.

ఇక్కడ ఇటువంటి మార్పును మనం ఇదివరలో చూడలేదా ఎక్కడా అని ఒక్కసారి ఆలోచిద్దాం.

విప్మవకారుడిగా బందిఖానాకు వెళ్ళిన అరవింద ఘోష్ అక్కడి నుండి యోగి అరవిందులుగా బయటకు వచ్చాడు.  అయన్ని నిజానికి తన తండ్రి విదేశాల్లో ఉంచి భారతీయ వాసనలు అంటి పాడైపోకుండా ఉండాలని ఆశించి ఎంతో కట్టుదిట్టాలు చేసి పెంచాడు. కాని విధి, అరవిందుణ్ణి ఋషిని చేసింది.

చలం సాహిత్యం ఎంత అలజడి రేపిందో అందరికీ తెలుసు. చివరికి పదిమందికీ తెలిసేలా అయన పుస్తకాలు చదవటానికి కూడా అరోజుల్లో జనం భయపడే వారని విన్నాను. స్త్రీస్వాతంత్ర్యం అంటూ గోలగోలగా దాదాపు విశృంఖల శృంగారం వ్రాసిన చలం చివరకు రమణాశ్రమంలో చేరాడు. తానంత వరకూ వ్రాసినదంతా ప్రక్కకు త్రోసి పారేసాడు. మీకి తెలుసా? భగవద్గీతకు మంచి వ్యాఖ్యను కూడా వ్రాసాడు. గీతాంజలిని కూడా తెలుగు చేసాడనుకుంటాను.

తన అభిప్రాయాలు మారితే దానికి ఎవరు కాని ప్రజాబాహుళ్యానికి ఎందుకు సమాధానం చెప్పుకోవాలీ? చలం తన అభిమానులకు సమాధాన‌ం ఎమని చెప్పాడూ? అరవిందుడు విప్లవకారులకు క్షమాపణ ఏమైనా చెప్పాడా?

ఈరోజున గద్దర్ నిజంగా భక్తి మార్గం పట్టి ఉంటే అదేదో‌ అనిదంపూర్వం అన్నట్లు రంగనాయకమ్మ ఆక్షేపించటమూ గోలపెట్టటమూ పొరపాటు.