22, జూన్ 2022, బుధవారం

మరి మన వెంకయ్యనాయుడు గారి సంగతేమిటీ?


ఊరికే అన్నాను లెండి.

లేకపోతే మన వెంకయ్య నాయుడు గారేమిటీ, మతి లేని మాట కాకపోతే!

అర్థరాత్రి అడ్డగోలు విభజన సందర్బంలో ఆయన గారు ఆంధ్రప్రాంత ప్రజలందరి తరపునా వకాల్తా పుచ్చుకొని ఎంతో దీనంగా వినమ్రంగా మరియు ఎంతో కచ్చితంగా ప్రజలు అడుగుతున్నారు అని చెప్పి సాధించినట్టి ఆంధ్రప్రదేశానికి ప్రత్యేకహోదా అనే‌ తాయిలం తాలూకు అతీగతీ ఏమన్నా అయన మళ్ళా పట్టించుకున్న దాఖలా ఐతే ఏమన్నా ఉందా? 

తన పార్టీ పట్ల వినయవిధేయతలు అంటే అలా ఉండాలీ అని అందరూ శబాసో శబాసు అనే విధంగా ఆవిషయంలో ఎంతో చక్కగా మౌనం దాల్చారు కదా వెంకయ్య గారు?

అన్నట్లు ఆయన్ను మనం ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు అని కదా అనాలి మర్చిపోయాను. అసలు ఆ విషయం గురించే కదా ఈవ్యాసంలో చెప్పదలచుకున్నది. ఐనా మర్చిపోయాను.

అదే లెండి, వెంకయ్య నాయుడు గారు... తప్పు తప్పు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు ఆంధ్రప్రదేశానికి తమ పార్టీ వారు ఒక ఊరడింపుగా సాధించి పెట్టిన ప్రత్యేకహోదా అన్నదాని విషయం ఎంత గమ్మున మర్చిపోయారో అలాగే నేనూ మర్చిపోయానన్నమాట.

అయనకు అసలు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు అని అనిపించుకోవటం సుతరామూ ఇష్టం‌ లేదట. నిన్నమొన్ననే ఆవిషయం ఒక పత్రికలోని ఒక వ్యాసరాజంలో చదివి తెలుసుకున్నాను.

అయ్యా వెంకయ్య నాయుడు గారూ, ఎందరో ఉపరాష్ట్రపతులు దరిమిలా రాష్ట్రపతులుగా పదోన్నతిని పొందినట్లు మన ఘనమైన చరిత్ర చెబుతున్నది కదా. ఆవిషయం దృష్టిలో పెట్టుకోండి. అసలు ఆఉద్దేశంతోనే మీకు ఉపరాష్ట్రపతి పదవిని ఇవ్వజూపుతున్నది మన పార్టీ అని ఆయనకు అప్పట్లో చక్కగా నచ్చజెప్పిన పిదపనే ఆయన మెత్తబడి, అలాగా ఐతే ఓకే అనేసారట.

మరిప్పుడు అదేమిటీ ఆ పార్టీ కాస్తా ఒక ద్రౌపదినో దమయంతినో తెచ్చి ఆవిడ గారు కాబోయే రాష్ట్రపతి గారు అని ప్రకటించేసిందీ?

అంటే ఆ పార్టీ వారు వెంకయ్య నాయుడు గారిని అవసరానికి వాడుకొని వదిలేసారా అని మనకు అనుమానం రావచ్చును కదా?

అదేమిటండీ, వారికేం అవసరం అని మీరు అడుగుతారు కదా. నేనూ చెప్పాలి కదా? మీకు మాత్రం తెలియదా? ఆమాత్రం తట్టదా యేమి కాని, కేంద్రంలో అధికారంలోనికి వచ్చిన ఆపార్టీ వారికి ఆంధ్రావారికి ప్రత్యేకహోదా ఇచ్చి తమ మాట నిలబెట్టుకొనే ఉద్దేశం ఎంతమాత్రమూ లేదు. మరి ఆ ప్రత్యేకహోదాకోసం పట్టుబట్టి మరీ సాధించుకొని వచ్చిన వెంకయ్య నాయుడు గారు గోలచేయరా? నా మాట పోతే ఎలా? మన పార్టీ మాట తప్పితే ఎలా? అంధ్రాకు హోదాకు ఇవ్వకపోతే ఎలా అని? మరేమో తమకు అలాంటి ఉద్దేశం ఏకోశానా లేదు. మళ్ళా వెంకయ్యగారు ఏతలనొప్పినీ తేకుండా చూడటమూ ముఖ్యమే. అందుచేత అయన్ను ములగచెట్టు ఎక్కించి ఉపరాష్ట్రపతి పదవిని కట్ట బెట్టారు. ఆయన ఇంక రాజకీయాలకు దూరం కాక తప్పదు కదా. ఆంధ్రాకు ప్రత్యేకహోదా వంటి చిన్నాచితకా విషయాలను అస్సలు పట్టించుకోకూడదు కదా. అందుకని వారా పాచిక విసిరారు. అది కాస్తా చక్కగా పారింది.

ప్రత్యేకహోదా అనే‌ పాచికతో ఆంధ్రావారిని బుజ్జగించి దిగ్విజయంగా తెలుగుగడ్డను నిస్సిగ్గుగా చీకటికొట్లో చిదిమేసారు. ఉపరాష్ట్రపతి పదవి అనే పాచికతో వెంకయ్య నాయుడు గారి నోరు మూయించారు. అలా అంటే బాగుండదేమో లెండి. వారిని నోరెత్తకుండా చేసారు. ఇలాకూడా బాగుందదేమో. వెంకయ్య గారు మౌనం వహించేలా చేసారు. ఇలా బాగున్నట్లుంది కదా!

ఇప్పుడు రాష్ట్రపతి పదవికి వెంకయ్య గారి పేరును కూడా పరిశీలించినట్లు తోచదు.

ఇంకా ఉపరాష్ట్రపతిగానే ఉన్నారు కదా వెంకయ్య గారు, ఏమీ ఈవిషయంలో బహిరంగంగా మాట్లాడకూడదేమో‌ కదా !

ఇంక వారు తమ శేషజీవితాన్ని కూడా ఇంతే  హుందాగా అంటే మౌనంగా గడిపివేయాలేమో. మళ్ళా రాజకీయాల్లోనికి వస్తున్నా అంటే ఛండాలంగా ఉంటుంది కదా! బాగోదు మరి.

తన స్వంత పార్టీ తనను వాడుకొని వదిలేసిందని ఆయన మనస్సులో ఎంత గుడుసుళ్ళు పడినా ఏమీ లాభం లేదు.

ఇక్కడ ప్రతిపక్షాలకు ఒక బ్రహ్మాండమైన అవకాశం లభించింది. కాని వాళ్ళంతా దద్దమ్మల్లా ఆలోచించి ఎవరో‌ సిన్హా గారిని కాబోలు పోటిలోనికి దించారు. దించారు అనటం ఎందుకంటే‌ ప్రతిపక్షాల అభ్యర్ధికి గెలిచే అవకాశం లేదు కాబట్టి.

ఒకరకంగా గెలిచే అవకాశం లభించింది. వాళ్ళు గమనించుకోలేదు. అందుకే దద్దమ్మల్లా అలోచించారు అనటం.

ప్రతిపక్షాలన్నీ కలిసి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారినే తమ ఉమ్మడి అభ్యర్ధిగా రాష్ట్రపతి పదవికి పోటీలోనికి దించవలసింది. 

అప్పుడు అధికారపార్టీ ఇరుకున పడేది. అధికారపార్టీ ఓట్లు చీలిపోయే పరిస్థితి వచ్చేది. వెంకయ్య  గారిని ప్రతిపక్షాలు అన్నీ‌ కలిసి అధికారపార్టీనుండి చీలివచ్చిన ఓట్ల సహాయంతో సులభంగా గెలిపించగలిగేవి.

బంగారం లాంటి అవకాశం.

పోటీలోనికి దిగటానికి వెంకయ్య గారు ఒప్పుకొనే వారా అని మీరు అడగవచ్చును. గెలిచే అవకాశం ముంగిట్లోనికి వచ్చినప్పుడు, స్వంతపార్టీ చేతుల్లో భంగపడ్డ నాయుడు గారు, ఒప్పుకొనే వారే అని నమ్మవచ్చును.

తన ప్రస్థానంలో చివరి మజిలీలో ఉన్న వెంకయ్య గారు ఈఅవకాశాన్ని ఎందుకు జారవిడుచుకొనే వారూ? ఇంత మోసం చేసిన పార్టీ ఇంకా ఏదో తవ్వి తన తలకెత్తుతుందన్న ఆశ యేమన్నా అయనలో ఉంటుందా ఏమన్నానా?

నిజంగా వెంకయ్య నాయుడు గారు చిత్తశుధ్ధితోనే ఆంధ్రాకోసం ప్రత్యేకహోదా అని ఆనాడు అడిగి ఉన్న పక్షంలో ఆవిషయంలో‌ ఇప్పుడు ఆయన ప్రతిపక్షాల వద్ద హామీ అడిగి మరీ పోటీకి దిగే అవకాశం కూడా అయనకు లభించి ఉండేది.

ఇంత ఉభయతారకమైన అవకాశాన్ని ఆయన జారవిడుకోవటానికి చిన్న పిల్లవాడు కాదు కదా!

ఒకవేళ వెంకయ్య గారు రాష్ట్రపతి పదవికి అభ్యర్ది ఐన పక్షంలో ఆంధ్రాకు ప్రత్యేకహోదా అంశంలో ఆయన పట్టుపట్టే అవకాశం‌ ఉంది కాబట్టి, మహా ఐతే, తెలంగాణా ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు గారు చచ్చినా వెంకయ్య గారి అభ్యర్ధిత్వాన్ని ఒప్పుకోను అనవచ్చును.  కాని అయనకు ఉన్న ఓట్లు బహుపరిమితం కాబట్టి అదేమంత ప్రతిబంధకం కానే కాదు. ఆసంగతి ఆయనకూడా ఒప్పుకోక తప్పని పరిస్థితి ఉంటుంది. అదీ కాక, ప్రత్యేకహోదా సంగతి తరువాత ఆలోచించవచ్చును, ముందు అధికారపార్టీ అభ్యర్ధిని ఓడించేద్దాం అని చెప్పి అయనా ఒప్పుకోవచ్చును కూడా. ఆలోచించండి.

ఇప్పటికైనా మించిపోయింది లేదు. 

ప్రతిపక్షాలు అన్నీ కలిసి వెంకయ్య గారిని నిలబెట్టినా -- లేక -- అయన స్వతంత్ర అభ్యర్ధిగా పోటిలోనికి దిగేలా ప్రోత్సహించి మద్దతు ఇచ్చినా సరిపోతుంది.

అంతరాత్మ సాక్షిగా ఓటు వెయ్యండి అని పిలుపునిస్తే చాలు కదా!

ఈ మాట - అదే అంతరాత్మ సాక్షి - అన్నది ఇలాంటి సందర్భంలోనే‌ పూర్వం నిన్నట్లు మీకు గుర్తుకు వస్తోందా? 

చాలా సంతోషం.