31, మే 2026, ఆదివారం

క్షేత్రదర్శనం ఫలం నిజంగా ఉంటుందా?

పుణ్యక్షేత్రాలకు పొలోమని పోయే వాళ్ళందరూ నిజమైన భక్తులు కారు.

ఈవిషయాన్నిఋజువుపరచే ఐతిహ్యం మనకు శ్రీశైలక్షేత్రమాహాత్మ్యంలో కనిపిస్తుంది.

శ్రీశైలశిఖరం దృష్ట్వా పునర్జన్మ నవిద్యతే అని ఒక మాట ఉంది. అది బహుప్రసిధ్ధం. అందుకేనేమో శ్రీశైలానికి భక్తులు బాగా వస్తూ ఉన్నారు. పార్వతీ అమ్మవారికి ఒక అనుమానం కలిగింది. ఏమిటి ఈజనసందోహం అందరికీ ముక్తి వస్తుందా అని శివుణ్ణి అడిగింది. అయన నవ్వి, అందరికీ ఎందుకు వస్తుంది? శ్రీశైలానికి వచ్చిన నిజమైన భక్తులకే వస్తుంది ముక్తి తప్పకుండా అని చెప్పాడు. అవునా అని పార్వతి అంటే శివుడు పద, ఈవచ్చినవాళ్ళలో ముక్తిని పొందే సద్భక్తి ఎవరికి ఉందో పరీక్షిద్దాం అని బయలదేర దీసాడు.

అమ్మవారు పెద్దముత్తైదువ వేషంలో, అయ్యవారు పండుముదుసలి రూపంలో శ్రీశైలానికి వెళ్ళారు. అక్కడ గుడికిపోయే దారికో ఒక నీటిగుంటను సృజించి అయ్యవారు అందులో పీకలోతున దిగి గడబడ చేయటం మొదలు పెట్టాడు. అమ్మవారు మొత్తుకుంటూ అందరినీ ముసలాయన్ను కాపాడండీ అని వేడుతూ నాటకం రక్తికట్టిస్తోంది.

చాలామంది మనకెందుకు వచ్చిన తంటా, ఈగుంట లోతుగా కనిపిస్తోంది కూడానూ, మనం మన దారిన గుడికిపోదాం అని తప్పుకొని చేదుకో మల్లన్నా అని అరుస్తూ పోతున్నారు.

అప్పుడప్పుడూ ఎవరో ధైర్యం చేసి ముందుకు వచ్చి దిగబోతే ముసలావిడ మాత్రం పుణ్యాత్ములైతేనే అయన్నంటుకోండి లేకపోతే ప్రమాదం సుమా అని హెచ్చరిస్తోంది. దాంతో ఇక ఎవరూ తెగించకుండా బాబోయ్ మనకెందుకు అంత పుణ్యాత్ములం అని హామీ ఎలాగిచ్చేదీ అని వెళ్ళిపోతున్నారు.

ఇలా చాలా గంటలపాటు ఈగడబిడ నడచింది.

ఇంతలో ఒక పడుచు ముందుకు వచ్చింది. ముసలావిడ హెచ్చరికను విని కూడా లెక్కపెట్టకుండా తల ఊపి ముసలాయన్ను రెక్క పట్టుకొని జాగ్రత్తగా బయటకు లాగుకొని వచ్చింది.

ముసలావిడ మెచ్చుకొని ఎంత పుణ్యాత్మురాలి వమ్మా కాకపోతే ఈయన్ను రెక్కపుచ్చుకొని ఏప్రమాదం లేకుండా తీసుకొని వచ్చావు, ఏమి చేస్తుంటావమ్మా, ఎవరమ్మాయివి అంటూ ఆరాతీసింది. ముసలాయన తల ఊపుతూ అవునవును అన్నాడు.

ఆపిల్ల ఇద్దరికీ నమస్కరించి, క్షమించండి. నేనొక వేశ్యను. శివదర్శనానికి వచ్చాను అంది.

ముసలావిడ నిర్ఘాంతపోయి ఎంత ధైర్యం నీకు అని నిలదీసింది.

ఆ అమ్మాయి అందికదా, తల్లీ నేను శ్రీశైలశిఖరాన్ని తనివితీరా చూచాను. ఇంక పాపం ఎక్కడిది నాకు? శివుడి క్పప వలన నాకు పునర్జన్మ కూడా లేదు కదా అని.

వెంటనే శివపార్వతులు నిజరూపాలతో ఆఆమ్మాయికి దర్శనం ఇచ్చారు.

శివుడు అమ్మవారితో చెప్పాడు. ఎందరో వచ్చారు. కాని ఈ అమ్మాయికి మాత్రమే జన్మరాహిత్యం అని.

శిఖరదర్శనం చేయటం కాదు పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఎవ్వరూ చేయటం లేదు. చేసిన వారికి జన్మరాహిత్యం సిధ్ధం.

అలాగే దైవదర్శనం పేరుతో క్షేత్రాల చుట్టూ తిరిగే వాళ్ళలో చిత్తశుధ్ధితో నమ్మకంతో వెళ్తున్నవారు అల్పాల్పంగా ఉంటారు. భక్తి ఒక వ్యాపారం కాదు. ఒకడు వచ్చాడని ఉబ్బిపోయి ముక్తినో వేరే కోరికలనో దేవుడు ఇవ్వడు. చిత్తశుద్ధి ఉన్నవాళ్ళకు తప్పకుండా ఇస్తాడు. కాని అటువంటి వాళ్ళు కోటికొకరు ఉంటారు.

మిగతా సజ్జు అంతా భక్తితో వ్యాపారం చేసేవాళ్ళూ దురాశాపరులే. ఇటువంటి పామరులు పుణ్యక్షేత్రాల్లో కూడా వెర్రివేషాలూ వెకిలివేషాలూ వేస్తారు. 

సందర్భం వచ్చింది కాబట్టి మరొక విషయం ప్రస్తావిస్తాను. భక్తికి సంబంధించినదే.

కోర్సు పూర్తిచేసిన వాళ్ళందరినీ ఎక్కడా పాస్ చేసేయరు. పరీక్షలో వడపోసి చిత్తం లగ్నం చేసి పాఠాలు ఒంటబట్టించుకున్న వాళ్ళనే పాస్ చేస్తారు. అలాగే ఉద్యోగార్ధు లందరిలో  కావలసిన కొద్దిమందిని ఎన్నుకోవాలంటే ఏఆఫీసులో ఐనా కఠినపరీక్షలు తప్పవు. ఎవరూ అన్యాయం అనరు.

కొన్నికొన్ని విద్యలను సాధన చేసినవారిని ఆవిద్యాధిదేవత కఠినంగా పరీక్షించటం జరుగుతుంది. 99.999% మంది సాధకులు ఆ దేవత గురిచేసే ప్రలోభాలకు లొంగిపోయి భ్రష్టులైపోతారు. తపస్సులు చేసే వాళ్ళను ఇంద్రుడు దారుణంగా పరీక్షిస్తాడు అవసరం ఐతే అప్సరసలను ఎరవేసి ఫెయిల్ చేస్తాడు. ఇటువంటి పరీక్షలను ఎక్కడో ఎవరో తట్టుకొని నిలబడటం జరుగుతుంది. వారికి సిధ్హి కలుగుతుంది. ఇంద్రియవిజయం లేని వారికి సిధ్ధిని అనుగ్రహిస్తే లోకానికి వారి వలన అపకారం కలుగుతుంది.

చాలా పురాతనమైన కొన్ని గుళ్ళలో అభ్యంతరకరమైన అసభ్యమైన భంగిమలలో శిల్పాలుంటాయి. చాలా కొద్ది మంది మాత్రమే నిర్వికారంగా వాటిని దాటుకొని పోయి శుధ్ధచిత్తంతో దైవదర్శనం చేస్తారు. వాళ్ళకు తప్పకుండా అనుగ్రహం దొరుకుతుంది. వాళ్ళకు మాత్రమే దొరుకుతుంది. మిగతావాళ్ళు ఏదో దర్శనం మమ అనిపించుకొని చేసి వస్తారంతే. ఆధునికుల్లో కేవలం ఈబొమ్మలను చూడటం కోసమే ఆపుణ్యక్షేత్రాలకు పోయేవాళ్ళు హెచ్చు శాతంగా ఉన్నారు.

భక్తిలో నిజాయితీ, నమ్మకంలో పూర్ణత్వం ఉన్నవాళ్ళకే క్షేత్రదర్శనఫలాలు దక్కుతాయి. మిగతా వాళ్ళ కోలాహలం అంతా వట్టి తమాషాగా మిగులుతుంది.

చిల్లరమనుషులు ఎక్కడకు పోయినా పోకపోయినా ఒకటే. పుణ్యక్షేత్రంలో ఐనా వాళ్ళ ప్రవర్తనలు పూర్తి పామరత్వంతో ఉంటాయి.

తిరుమల దేవుణ్ణి దర్శించుకోవటానికి వెళ్ళే వాళ్ళలో ఎక్కువమంది శ్రధ్ధ మంచిమంచి సదుపాయాలను ఎలా కొనుక్కొని మంచి దర్శనం చేసుకోవటమా అనే ఉంటుంది. ఈసుఖలాలసే ఎక్కువగా ఉన్న జనం వేంకటేశ్వర స్వామిని గొంతెమ్మ కోరికలతో విసిగిస్తారు! వాళ్ళ కోరికలు నెరవేర్చమని దేవుడికి ఒక పరీక్షలాగా మాట్లాడుతారు. 

మరొకసారి జగ్రత్తగా గమనించండి. నిజమైన భక్తులకే క్షేత్రదర్శనం ఫలవంతం అవుతుంది.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.