16, డిసెంబర్ 2014, మంగళవారం

వాల్మీకిరామాయణంలో శివధనుర్భంగ ఘట్టం - వివరణతో. (66వ సర్గ)


వాల్మీకి రామాయణం.  బాలకాండ.  66వ సర్గ

[ ఈ టపా అసంపూర్ణం. మార్పులకోసం వేచియుండ వలసిందిగా విజ్ఞప్తి.]
66వ సర్గ సంపూర్ణంగా వ్యాఖ్యానించబడింది.  67వ సర్గ ఇంకా వ్యాఖ్యానం చేయాలి.

తతః ప్రభాతే విమలే కృతకర్మా నరాధిపః 
విశ్వామిత్రం మహాత్మానం ఆజుహావ సరాఘవం 1
జనకమహారాజు గారు ఉదయమే సంధ్యావందనాది నిత్య కర్మ లన్నింటినీ పూర్తి చేసుకున్నారు.  ఆ తరువాత మహాత్ముడైన బ్రహ్మర్షి విశ్వామిత్రుల వారిని, ఆయన శిష్యులుగా వచ్చిన రఘువంశానికి చెందిన ఆ ఇద్దరు రాచబిడ్డలతో సహా ఆహ్వానించారు. 
నిత్య కర్మలనీ నైమిత్తక కర్మలనీ రెండువిధాలు వైదిక కర్మలు. సంధ్యావందనాదులూ, దేవతార్చనా వంటివి నిత్యం చేయవలసినవి. ఏ దైనా సందర్భానికి అనుగుణంగా కాని ఇష్టకామ్యార్థసిధ్ధికి కాని ప్రత్యేకంగా చేసే కర్మలు నైమిత్తికాలు. అంటే పండగల్లో చేసే ప్రత్యేకపూజలూ, సత్యనారాయణవ్రతాలూ వంటివన్నీ నైమిత్తికాలు . ఈ నైమిత్తికాలకు అవి ఏఏ సమయాల్లో చేయాలో వాటి విధివిధానాలు ఆయా కర్మలకు సంబంధించి విడిగా ఉంటాయి. కానీ, నిత్య కర్మలన్నీ కూడా తప్పనిసరిగా సూర్యభగవానుడు ఉదయించటానికి ముందటి ముహూర్తంలోనే పూర్తి చేయాలి. ఈ ముహూర్తాన్ని బ్రాహ్మీముహూర్తం అంటారు. ఈ మధ్య కొందరు తప్పుగా బ్రహ్మముహూర్తం అనటం వినిపిస్తోంది.

ఇక్కడ తతః ప్రభాతే అంటే ఆ ఉదయమే అని చెప్పారు కాబట్టి విశ్వామిత్రులవారు రామలక్ష్మణులతో సహా మిధిలాపురానికి రాత్రికాలంలో వేంచేసారు. ఆ రాత్రి గడచిన వెంటనే ఇప్పుడు చెప్పబోయే వృత్తాంతం అంతా అన్నమాట.

అలాగే విశ్వామిత్రుడికి మహాత్ముడని ఒక విశేషము వేసారు వాల్మీకి.  అలాగే రామలక్ష్మణులను రాఘవులు అన్నారు.  ఎందుకంటే విశ్వామిత్రుడు రామాయణకాలానికే బ్రహ్మర్షిత్వాన్ని సాధించిన మహనీయుడు. సగౌరవంగా అంతా ఆయనను భగవాన్ అని సంబోధిస్తారు.  ఇక ఈ అన్నదమ్ములను రాఘవులు -అంటే రఘువంశంవారు- అనటం మహా ఉచితమైన మాట. ఆ రఘుమహారాజు వారికి వంశకర్తకదా! కుబేరుడి మీదకే దండయాత్రకు సమకట్టగలిగిన మహావీరుడు. పరీక్షించటానికి వృధ్ధబ్రాహ్మణరూపంలో  ఇంద్రుడు వచ్చి, దాసీగా సాక్షాత్తూ మహారాణీనే కోరుకుంటే సరే దానమిస్తున్నాను తీసుకు వెళ్ళండి అనగలిగిన అసామాన్యమానవోత్తముడు. అటువంటి వారి వంశంలో పుట్టిన ఉత్తమక్షత్రియకుమారులని రామలక్ష్మణులను కీర్తించటం ఇలా రాఘవులూ అనటంలోని ఉద్దేశం.
తమర్చయిత్వా ధర్మాత్మా శాస్త్రదృష్టేణ కర్మణా 
రాఘవౌచ మహాత్మానౌ తదావాక్య మువాచహ  2
శాస్త్రవిధిని చక్కగా అనుసరించి జనకమహారాజుగారు విశ్వామిత్ర మహర్షిని పూజించారు. అలాగే రఘువంశసంజాతులైన రామలక్ష్మణులను కూడా మహాత్ములవలెనే సంభావించి సముచితరీతిని సన్మానించారు మహారాజుగారు. అనంతరం అయన ఇలా అంటున్నారు.
అర్షధర్మంలో అన్నింటికీ విధివిధానాలను నిర్ణయించారు. ఆ నిర్ణయాలసమాహారానికే శాస్త్రం అని పేరు. శాసయతి ఇతి శాస్త్రః. అంటే ఇది ఇలా చేయాలి. ఇది చేయరాదు అని నిష్కర్షగా చెప్పేదే శాస్త్రం అన్నమాట. దానిని తూచ తప్పకుండా పాటించటాన్ని సముదాచారం అని పిలుస్తారు. జనకుడు స్వయంగా గొప్ప విద్వాంసుడు, వేదాంతి. ఆ ఆచారాలన్నీ ఆయనకు క్షుణ్ణంగా తెలుసు. అలాగే రామలక్ష్మణులు అతిథులుగా వచ్చారు. అతిథి దేవోభవ అన్నారు కదా.  అందుచేత చాలా పధ్ధతిగా జనకమహారాజు గారు అ మహర్షికీ, అన్నదమ్ములకూ కూడా శాస్త్రోచితంగా సత్కారం జరిపారు స్వయంగా.  ఇక్కడ మన ఇంటికి వచ్చిన వారికి ఏదో తోచినట్లుగా కాకుండా ధర్మం ఎలాచెబుతోందో అలా శాస్త్రప్రకారం మర్యాదలు చేయాలీ అని వాల్మీకులవారు మనకి హితవు చెబుతున్నారు అన్యాపదేశంగా అని తెలుసుకోవాలి.
భగవాన్ స్వాగతం తేస్తు కింకరోమి తవానఘ
భవానాజ్ఞాపయతు మాం ఆజ్ఞాపయ భవతాహ్యహం  3
(వారికి సకల మర్యాదలూ జరిపించిన తరువాత విశ్వామిత్రమహర్షితో జనకులు అంటున్నారు.) ఓ భగవాన్, మీకు స్వాగతం. మీకు నేనేమి చేయగలను? నా వలసిన కార్యం ఏమిటో తమరు ఆజ్ఞాపించండి.
మన ఇంటికి వచ్చిన అతిధులను చూసి వారు ఎందుకు వచ్చారో అని మనం కొంచెం ఆత్రుత పడటం‌ సహజం. అలాగని వారు వచ్చీ రాగానే చెప్పులన్నా విప్పుకోకముందే, నిలబెట్టి, "ఏదో పనిమీద వచ్చినట్లున్నారే? ఏమిటి సంగతి? ఏమన్నా నా సహాయం‌ కావాలా?" అని అడగకూడదు కదా?  ముందు వచ్చిన వారికి తగిన మర్యాదలూ గట్రా చేసి వారు కాస్త కుదురు కున్నాక, అప్పుడు వారిని కుశలప్రశ్నలూ అవీ వేయటమూ, వారు వచ్చిన పని గురించి వివరంగా తెలుసుకుందుకు ప్రయత్నించటమూ ఉచితంగా ఉంటుంది.  అందుచేత జనకులవారు మహర్షికీ, ఆయన శిష్యులిద్దరికీ అతిథిమర్యాదలు శాస్త్రీయంగా జరిపించి, ఆ పిమ్మట, విశ్వామిత్రులవారిని ప్రశ్నిస్తున్నారు. పెద్దవారి ముందు మనం చూపవలసినది వినయం. వారు మనకి పని చెప్పటమూ ఒక్కొక్కసారి మనని అనుగ్రహించటమే! అందుచేత తమకు నా వలన కావలసిన కార్యం ఉంటే తప్పక ఆజ్ఞాపించండీ అని జనకులు సవినయంగా మనవి చేసుకుంటునారు.
ఏవ ముక్తా స ధర్మాత్మా జనకేన మహాత్మనా
ప్రత్యువాచ  మునిర్వీరం వాక్యం వాక్యవిశారదః  4
మహాత్ముడైన జనకమహారాజు తన కేమి ఆజ్ఞ అని సవినయంగా ప్రార్థించగా విశ్వామిత్రులవారికి సంతోషమైనది. మాట్లాడటంలో అనే కళలో నేర్పరి ఐన ఆయన ఈ విధంగా రాజుగారికి జవాబు చెబుతున్నారు.
ఇక్కడ జనకేన మహాత్మనా అని జనకమహారాజుగారు మహాత్ముడు అని చెబుతున్నారు వాల్మీకి. అలా ఎందు కన్నారూ? నా కేమి ఆజ్ఞ అని ఆయన మాటవరసకు అన్నవాడు కాదు. అది ఆయన త్రికరణశుధ్ధిగా చెప్పిన మాటే. మహర్షి ఆజ్ఞను పాలించటం అంటే మాటలు కాదు. ఆయన చెప్పిన పని ఏదైనా చేయగల శక్తియుక్తులు కావాలి. అటువంటి స్థిరచిత్తమూ కావాలి. జనకులు అటువంటి వారు నిజంగానే. అయనేదో ముసలివాడూ వేదాంతగోష్టుల్లో కాలక్షేపంచేసే మనిషే కాని అవసరమైతే ఎవరిమీదనైనా విల్లెక్కుపెట్తగల ధీరుడా ఏమిటీ అని జనం సినీమాలూ సీరియళ్ళూ చూసి అనుకోవచ్చును. కాని ఆయన శాపాదపి శరాదపి అని నిలబడగల గొప్పవాడు. దానికి సంబంధించిన వివరం ఒకటి ఈ సర్గలోనే ముందుముందు వస్తుంది, చదువుదురు గాని. ఎంత అసాధ్యమైన పనిని విశ్వామిత్రులు ఇచ్చినా వెనుదీయక రంగంలోనికి దిగగల మహాత్ముడు. అందుకని వాల్మీకులు అలా మహాత్ముడనే విశేషణం వేసారు రాజుగారికి.  అలాగే ఈ‌శ్లోకంలో విశ్వామిత్రులను మునివీరులనీ వాక్యవిశారదులనీ అనటం కూడా గమనించండి. ఇక్కడా తగిన కారణాలున్నాయి.  నిష్కారణంగా వాల్మీకులవారినుండి ఒక్కముక్కా రాదుకదా. వీరుడన్నమాటను చూదాం. వీరత్వం యొక్క ప్రయోజనం లోకోపకారం. అలా కాని బలం ధూర్తత్వం అవుతుందంతే. విశ్వామిత్రులు లోకోపకారులు. అందులో ఏమీ సందేహం అక్కర లేదు. రాముణ్ణి శిష్యుణ్ణి చేసుకోవటం తనకోసమూ కాదు, రాముడు రక్షించిన యాగం విశ్వామిత్రుడికి స్వర్గభోగాలకోసమూ  కాదు. ఆ ఋషి చేసేదంతా లోకకళ్యాణమే. ఆయన బ్రహ్మర్షి. సాక్షాత్తూ భగవత్స్వరూపుడు. ఆయనకు స్వప్రయోజనం అంటూ ఏమీ ఉండదు. అంతా లోకం కోసమే. అదీ ఆయన వీరం.  ఆయన వాక్యవిశారదత్వం ఆయన యందున్న భగవత్తత్త్వమే. అయనకు అందరి యోగ్యతలూ తెలుసును.  ఎవరు లోకాపకారులో తెలుసును. ఎవరి వలన ఎలా లోకోపకారమో తెలుసును. అందుచేత ఆయన వాక్కు సాక్షాత్తూ వేదమే. అందుచేత ఆయన జనకుడి యోగ్యతను తెలిసినవాడై అబినందన పూర్వకంగా, ఆయన వలన రాబట్టవలసిన లోకోపకారకక్రియను సూచించటానికి కాను, జనకుడికి ప్రీతి కలిగేలా ఇలా మాట్లాడుతున్నారు అని వాల్మీకులవారి హృదయం అని నా భావన.
పుత్రౌ దశరథస్యేమౌ క్షత్రియౌ లోక విశ్రుతౌ 
ద్రష్టుకామౌ ధనుశ్శ్రేష్ఠం యదేతద్వయి తిష్ఠితౌ  5
ఈ ఇద్దరూ దశరథమహారాజుగారి పుత్రులు. లోకప్రసిధ్ధులైన క్షత్రియులు. నీ‌ దగ్గర ఒక శ్రేష్ఠమైన ధనస్సు ఉందని తెలిసి దానిని చూడాలనే కోరికతో వచ్చారు.
ఈ‌ రామలక్షంణులను ఇద్దరినీ దశరథమహారాజుగారి కుమారులూ అని జనకుడికి పరిచయం చేయటం వరకూ బాగానే ఉంది. కాని వారిని విశ్వామిత్రులవారు లోకప్రసిధ్ధులూ అని చెప్పటం కొంచెం అశ్చర్యం కలిగిస్తుంది.

అప్పటికి రాముడు చేసిన గొప్పపనులు తాటకావధ, మారీచసుబాహులను దండించి యజ్ఞాన్ని సంపన్నం చేయటం, అహల్యాశాపవిమోచనం అన్నవి. ఐతే అవి అప్పుడే దేశదేశాలూ తిరిగి రాముడికి అఖండఖ్యాతిని ఆర్జించి పెట్టాయా? లేదనే అనుకోవాలి. ఎందుకంటే ఈ సంఘటనలన్నీ అరణ్యాలలో జరిగినవే కాని ఏదీ నాగరికుల మధ్యన జరిగినది కాదు.

మరి వాక్యవిశారదులైన వాల్మీకులవారు లోకవిశ్రుతులూ అని అనటం ఎలా నప్పుతున్నదీ?  దీనికి సమాధానం చూదాం.

అసలు లోకం అంటే ఏమిటి? భౌతికార్థంలో జీవులకు ఉనికియైన ప్రదేశం. కొంచెం లోతుగా చెబుతే లోకం అంటే జీవుల సమూహం. జీవులసమూహంలో ఈ కుఱ్ఱవాళ్ళిద్దరూ ప్రసిధ్ధులూ అంటున్నారు మహర్షి.  జీవులలో బహుప్రసిధ్ధుడు కేవలం భగవంతుడే.  అయన సర్వజీవులలోనూ తానే నిండి ఉన్నాడు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే సర్వజీవరాశీ ఆయన యందే ఉన్నది అన్నదే సదైన అవగాహన. జీవులలో రెండవవాడుగా బహుప్రసిధ్ధుడు అ భగవంతుని యొక్క భక్తుడు. ఇతరులు అజ్ఞానులు కాబట్టి వారిని వదిలివేద్దాం. ఈ భక్తుడికే అత్యంతమైన అర్హతా, బహగవత్సాన్నిధ్యమూ. ఆ విధమైన భక్తిసామ్రాజ్యాధినేతల్లో అతి ముఖ్యుడు ఆదిశేషువు.

వైష్ణవసంప్రదాయంలో ఆయన గురించి ఒక ముక్క చెబుతారు. ఆదిశేషువు మనకు తెలిసి విష్ణుదేవునికి పరుపుగా ఉంటాడని మనకు తెలిసిన సంతతే కాని, ఇంకా విశేషం ఉందిట. శేషుడు భగవంతునికి ఎప్పుడు ఏ అవసరం పడుతుందో దానిని తగిన విధంగా మారి సేవచేస్తాడట, శయ్యాసనపాదుకాది విధాలుగా అమరి. అన్నమాచార్యులవారు అంటారు కదా ఒక ప్రసిధ్ధమైన సంకీర్తనంలో, "విన్నపాలు వినవలె, వింతవింతలూ.. పన్నగపుదోమతెర పై కెత్త వేలయా?" అని ఆ దోమతెరగా మారిన పన్నగం అంటే‌ శేషుడే.  ఈ విధంగా జీవలోకంలో భగవానునికి అత్యంత సన్నిహితుడుగా అతిప్రసిధ్ధుడైనవాడు శేషయ్యగారు.

ఇలా ఈ రామలక్ష్మణులు ఇద్దరూ సమస్తలోకంలో ప్రసిధ్ధులైన దేవుడూ, ముఖ్యజీవుడూ అన్నది విశ్వామిత్రముని నర్మగర్భంగా సూచిస్తున్నారు. ఇదంతా చాలా దూరాన్వయంగా అనిపిస్తోందా? మరొక చిన్న సమర్థన ఉంది. ఇది మీకు నచ్చవచ్చును.  ఒకాయన వచ్చారు మన ఊరికి. నిజానికి మనఊరి పెద్దమనిషే ఈ మహానుభావుణ్ణి తీసుకొని వచ్చారు ఏదో సభకి. అక్కడ అందరికీ పరిచయం చేస్తూ, ఈయన ఫలాని నగరంలో ఉంటారూ, నాకు తెలిసినవారూ గొప్ప కవీ, జగత్ప్రసిధ్దులూ అంటారు. మనకి అక్షేపణ అనిపించదు. అదేమిటయ్యా మా ఊళ్ళో ఈయన ఎవరో తెలియదే జగత్ప్రసిధ్దుడేమిటీ అనం. ఓహో అక్కడ అందరికీ బాగా తెలిసినవాడన్న మాట అనుకుంటాం. నిజమే కదా? అలాగే మహర్షి ఇక్కడ రామలక్ష్మణులను దశరధమహారాజుగారి కుమారులూ అని చెబుతూ లోకవిశ్రుతులూ అన్నది అదే అర్థంలో అనుకోండి.  అక్కడ దశరధుడికన్నా కూడా రాముడికే ఎక్కువ గా జనం‌ ప్రీతులై ఉన్నారన్నా అశ్చర్యం లేదని మనకూ తెలుసుకదా?

ఇకపోతే, మహర్షి రామలక్ష్మణులు వచ్చిన పని గురించి క్లుప్తంగా నీ దగ్గర గొప్పవిల్లేదో ఉందిట కదా, దాన్ని చూదాం అని కుతూహలంతో వచ్చారూ అని చెబుతున్నారు.  ఇది గమనించండి. సినీమాలూ సీరియళ్ళూ చెప్పేటట్లుగా మిధిలాధీశులు ఏ ధనుర్యాగమూ చేయటం లేదు. సీతాస్వయంవర సభ అని ప్రకటన ఏదీ చేయలేదు. విల్లెక్కుపెట్టే పోటీ ఏదీ ఏర్పాటుచెసి దేశదేశాల వాళ్లనీ సభకు రావించలేదు కూడా. చూసారా అసలు కథకు మనం తెలుసూ అనుకుంటున్న కథావిధానానికి ఎంత తేడా ఉన్నదో?
ఏతద్దర్శయ భద్రం తే కృతకామౌ నృపాత్మజౌ.
దర్శనాదస్య ధనుషో యథేష్టం ప్రతియాస్యతః  6
(జనకమహారాజా!) నీకు శుభం కలుగుగాక. ఈ రాజకుమారకులకు ఆ ధనువును చూపించు. దానిని మనసారాచూసి ఈ బిడ్డలు యధేఛ్ఛగా తిరిగి వెళతారు.
ఇక్కడ గమనించవలసి అంశాలు కొన్ని ఉన్నాయి. ఈ పిల్లలు మీ దగ్గర ఉన్న మహాధనువును చూడటానికే వచ్చారని విశ్వామిత్రమహర్షి చెబుతున్నారు. అ ధనస్సును ఎక్కుపెట్టాలన్న ఉద్దేశం వారికి గాని, వారు దానిని ఎక్కుపెడితే బాగుంటుందన్న ఉద్దేశం తనకే ఉన్నట్లుగాని విశ్వామిత్రులు చెప్పటం‌ లేదు. మనం ఎన్నో సినిమాలు, హరికథలు, నాటకాలు, టీవీ సీరియళ్ళలో చూసామో చెప్పనలవి కానంతగా మనకు రామలక్ష్మణులు మిధిలకు వచ్చినది జనకుడి దగ్గర ఉన్న శివధనస్సును ఎక్కుపెట్టి స్వయంవరంలో విజేతలు కావాలని అన్నది ప్రచారం ఐపోయింది. కాని నిజానికి అటువంటిది ఏమీ లేదని తెలుసుకోవాలి.

వాల్మీకులవారి శ్రీమద్రామాయణం బాలకాండ 31వ సర్గలో ఈ శివధనువు ప్రసక్తి వస్తుంది.  రామలక్ష్మణులు విశ్వామిత్రులవారి యాగాన్ని సంరక్షించిన పిదప, మునుజనపరివేష్ఠితులైన ఆయనను సమీపించి తాము ఇక మీద చేయవలసిన కార్యం ఏమిటో అజ్ఞాపించవలసిందని అడుగుతారు.  అప్పుడు విశ్వామిత్రాది మునులు మిధిలాధిపతి జనకరాజు గొప్పయాగం చేస్తున్నారనీ మీరు కూడా రండనీ రామలక్ష్మణులకు చెప్పి, అందరూ మిధిలా ప్రయాణం మొదలు పెడతారు. ఇదే సందర్భంలో ఆ ధనస్సును గురించి మునులు రామలక్ష్మణులకు వివరంగా చెబుతారు. సీతాస్వయంవరం వంటి ప్రసక్తులేమీ లేవిక్కడ.

అందుచేత రామలక్ష్మణులు మిధిలకు వచ్చినది జనకమహారాజునూ, ఆ శివధనస్సునూ దర్శించాలనే.
ఏవముక్తస్తు జనకః ప్రత్యువాచ మహామునిమ్.
శ్రూయతామస్య ధనుషో యదర్థమిహ తిష్ఠతి  7
ఈ విధంగా విశ్వామిత్రులు సెలవియ్యగానే, జనకమహారాజుగారు విశ్వామిత్రమహామునికి ఇలా ప్రత్యుత్తరం ఇస్తున్నారు. అయ్యా, ఏ కారంఅగా ఆ మహాధనుస్సు మా వద్ద ఉన్నదీ (ముందుగా) తమకు తెలియజేస్తాను.
ఇక్కడొక చమత్కారం ఉంది.  విశ్వామిత్రులకు ఈ మహాధనస్సు సంగతి వివరంగా తెలియదనా జనకులు మరలా చెప్పటం? అయనకు స్పష్టంగా తెలిసి ఉంటుందనటంలో‌ జనకులకు అనుమానం అక్కర లేదు. అలాగే ఆయన ఈ పిల్లలను ఫలాని గొప్పధనస్సును చూపిస్తాను రండి అని తీసుకొని వచ్చారంటే దాని అర్థం మహర్షి ద్వారా ద్బనస్సుకు సంబంధించిన సకలవృత్తాంతమూ ఈ కుఱ్ఱవాళ్లకూ తెలిసి ఉంటుందన్నదీ రాజుగారికి ఎలాగూ అర్థమయ్యే ఉంటుంది. ఐనా సరే, రాజుగారు మరలా ధనస్సు గొప్పదనమూ అది తమ వద్ద ఉన్న కారణమూ అన్నవి మరలా ఎందుకు చెబుతున్నట్లూ అన్నది ఆసక్తికరమైన సంగతి. మనకూ జనకుల నోట వృత్తాంతం అంతా విన్నాక అయన అలా ఎందుకు దాని కథంతా చెప్పిందీ అర్థం అవుతుంది. ప్రస్తుతానికి వేచి ఉందాం.
దేవరాత ఇతి ఖ్యాతో నిమేష్షష్ఠో మహీపతిః
న్యాసోయం తస్య భగవన్ హస్తే దత్తో మహాత్మనా  8
భగవాన్ విశ్వామిత్రమహర్షీ. మా వంశకర్త నిమి అనే మహాత్ముడు. అయన నుండి ఆరవ రాజుగారి పేరు దేవరాతుడు. సాక్షాత్తూ పరమశివుడే సంరక్షించ వలసిందిగా ఈ వింటిని అ దేవరాతుడికి ఇచ్చాడు.
ఏదైనా అపురూపమైన వస్తువును మనం ఇతరులకు చూపించే సందర్భంలో దాని వైశిష్ట్యాన్నీ, అది మనవద్దకు చేరిన విధానాన్నీ అందరిముందూ మరొకసారి ప్రస్తావించటం సహజం. ఇక్కడ జనకమహారాజుగారూ అదేపని చేస్తున్నారు. ఇప్పుడాయన రెండు విషయాలు ప్రస్తావించారు. అవి ఆ ధనువు సాక్షాత్తూ పరమశివుడిదీ అన్న సంగతీ, దాన్ని ఆ పరమేశ్వరుడి ప్రసాదంగా స్వీకరించినది తమ వంశంలోని పూర్వీకుడు కాని అది ఈ మధ్య సంగతి కాదు అన్నదీ. ఈ దేవరాతుడు నిమినుండి ఆరవవాడైతే, జనకమహారాజుగారి నుండి పదహారు తరాల పైన వాడు. అంటే ఎంతో కాలం నుండీ ఆ దివ్యధనువు జనకుల ఇంట పూజలందుకుంటూ ఉన్నదన్నమాట. ఇదే శ్లోకంలో మరొక కీలకమైన మాట మన దృష్టినుండి తప్పిపోరాదు. దానిని శివుడు తమ వంశంవారికి 'న్యాసం'గా ఇచ్చాడట.  దాని అర్థం, ఆ ధనువుకు దాము సంరక్షకులమే కాని దానికి తాము యజమానులం కాము అన్నది చెబుతున్నారు.
దక్షయజ్ఞవధే పూర్వం ధనురాయమ్య వీర్యవాన్.
రుద్రస్తు త్రిదశాన్ రోషాత్సలీలమిదమబ్రవీత్  9
శివుడు దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసిన సందర్భంలో, ఆయన ఆ యజ్ఞానికి వెళ్ళిన దేవతలమీదా ఆగ్రహించారు. వారి అవజ్ఞతకు రోషించిన ఆయన కోపంతో వారిపైన విల్లెక్కు పెట్టి ఇలా అన్నాడు.
ఒకప్పుడు దక్షుడనే ప్రజాపతి ఒక యాగం చేసాడు - అదీ శివుడికి యజ్ఞభాగాన్ని పరికల్పించకుండానే. అందుచేత నింద్యమైన యజ్ఞానికి వెళ్ళి దేవతలూ తప్పుచేసినవారయ్యారు. ఆ దక్షప్రజాపతి శివుడికి సాక్షాత్తూ మామగారు. ఈ దేవతలు అంతా శివుడి అనుజ్ఞతో లోకాలను సంరక్షించే వారు.  భగవద్విరోధం కారణంగా దక్షుడు, శివరహితయాగం పేర నేరం చేసి శిక్షార్హుడైనాడు. అటువంతి యాగం లోకోపద్రవకారణం కాబట్టి దాన్ని శివుడు విఛ్ఛిన్నం చేసాడు. అలా లోకహితేతరమైన యాగానికి లోకరక్షకులైన దేవతలు పోవచ్చునా? పోరాదన్న సంతతి తెలిసీ, ప్రజాపతి అన్న గౌరవంతో దక్షుణ్ణి మన్నించి ఆ యాగానికి వెళ్ళారే కాని శివేతరమైన ఆ యాగం సాక్షాత్తూ శివుణ్ణే అగౌరవించటం అని అర్థమైన తరువాత వాళ్ళు అ యాగాన్ని తిరస్కరించాలి కదా? అలా చేయకపోవటం లోకేశ్వరుడైన శివుణ్ణే తిరస్కరించటం అవుతున్నది కదా? అందు కని వారు శివుడి ఆజ్ఞ మీరిన వారయ్యారు. అందుకే శివుడు వారిపై కోపించి రుద్రుడై ఇక లోకాలకు మీ వలన ప్రయోజనం శూన్యం అని వారిపై విల్లెక్కు పెట్టాడు.
యస్మాద్భాగార్థినో భాగాన్నాకల్పయత మే సురాః
వరాఙ్గాణి మహార్హాణి ధనుషా శాతయామి వః  10
వేదవిహితమైన క్రతుభాగాన్నినాకు సమర్పించకుండా యజ్ఞం చేయవచ్చునా ఓ దేవతలారా? మీ‌ ఉత్తమాంగాలను నేను నా ధనుస్సుతో ఖండించి వేస్తాను.
యజ్ఞంలో దేవతలకు హవిస్సులు అర్పించబడతాయి. అవి దేవతలకు తేజస్సును వృధ్ధి చేస్తాయని వేదం చెబుతున్నది. హవిస్సులు అందుకున్న దేవతలు యజ్ఞకర్తకు కామితార్థాన్ని ప్రసాదిస్తారు. యజ్ఞాలలో దేవతలకే కాదు, అంతకన్న ముఖ్యంగా త్రిమూర్తులకూ భాగం కల్పించబడుతుంది.  త్రిమూర్తుల తేజస్సును ఆ హవిస్సులు వృధ్దిచేస్తాయనా? కాదు. వారు లోకకర్తలు. వారికి అర్పించబడిన హవిస్సు లోకాలకు తేజోవృధ్ధి కరం. అంటే లోకక్షేమకరం. అందుచేత విహితమైన భగవద్భాగాల యొక్క ప్రయోజనం లోకక్షేమకరమై లోకకర్తకు లోకేశ్వరుల అశీర్వాదాన్ని ప్రసాదిస్తుంది. ఇదీ దాని రహస్యం. ఐతే మంగళదాయకుడైన పరమేశ్వరునికి యజ్ఞభాగాన్ని కల్పించకపోవటం తప్పు అన్న స్పృహ లేకపోగా ఆయనను విడచి కేవలం కామ్యార్థఫలప్రదాతలు మాత్రమే ఐన దేవతలకు హవిస్సులు అందించటం, లోకక్షేమాన్ని విసర్జించి కేవలం స్వార్థం కోసమే యాగం చేయటం. అది ఘోరం. కాబట్టి ఆ యజ్ఞమూ చెడింది. దానినుండి హవిస్సులు ఆశించిన దేవతలూ శిక్షార్హులయ్యారు. అందుకే పరమేశ్వరుడు, మీ శిరస్సులను తీసివేస్తాను అని హెచ్చరిస్తున్నాడు.
తతో విమనసస్సర్వే దేవా వై మునిపుఙ్గవ
ప్రసాదయన్తి దేవేశం తేషాం ప్రీతో భవాద్భవః 11
ఓ మునిపుంగవా, విశ్వామిత్రా, ఆ మాటలు విని హతాశులైన దేవతలంతా దేవాధిదేవా పరమేశ్వరా మా తప్పు కాచి మాపైన దయ చూపవలసింది అని పరిపరి విధాలుగా వేడుకున్నారు. ఆయన వారికి ప్రసన్నుడై రుద్రుడుగా ఉన్న మూర్తినుండి కరుణాసముద్రుడైన భవుడుగా మారాడు.
ముందటి తొమ్మిదవశ్లోకంలో శివుడు కోపంతో రుద్రుడయ్యాడని చదువుకున్నాం. రుద్రుడంటే శోకింప జేసేవాడు, నశింపచేసేవాడు. ఇప్పుడేమో‌ దేవతలు తప్పైపోయింది రక్షించండీ అని ప్రార్థిస్తూ కాళ్ళమీద పడగానే ప్రసన్నుడై భవుడు అంటే జన్మప్రసాదకుడు అయ్యాడు. ఈ సందర్భంలో చావుదప్పి దేవతలకు పునర్జన్మ లభించినట్లే కదా. అందుకనే భవుడు అనటం అన్నమాట.
ప్రీతియుక్తస్స సర్వేషాం దదౌ తేషాం మహాత్మనామ్
తదేతద్దేవదేవస్య ధనూరత్నం మహాత్మనః
న్యాసభూతం తదా న్యస్తమస్మాకం పూర్వ కే విభో  12
దేవతలపై ప్రీతి చెందిన పరమేశ్వరుడు వారికి ప్రాణదానం చేయటమే కాదు.  వాళ్ళపై తాను ఎక్కుపెట్టిన ఆ మహాధనస్సునూ ఆ దేవతలకే అనుగ్రహంతో ఇచ్చివేసాడు. ఓ మహర్హీ,  అలా శివుడు తమకు అనుగ్రహించిన ధనూరత్నాన్నే ఆ దేవతలు మా పూర్వీకుడైన దేవరాతునికి దాచమని ఇచ్చారు.
చూడండి, శివుడు ఎంత కరుణాసముద్రుడో.  ఆయనకు కోపం వచ్చి తప్పుచేసిన దేవతలని దండిస్తానని రుద్రుడై ఒక మహా ధనస్సుని వాళ్ళపైకి ఎక్కుపెట్టాడు.  మళ్ళా ఆ దేవతలు తప్పొప్పుకుని కాళ్ళమీద పడగానే అనంతమైన కరుణతో వారికి తన కోపాగ్నినుండి పునర్జన్మను ప్రసాదించాడు.  అంతే కాదు శివుడి కోపానికి బిక్కచచ్చి చిన్నబోయిన దేవగణాల్ని సంతోషపెట్టాలని తన వింటిని, ఆ దేవతలకు బహుమతిగా ఇచ్చేసాడు.
అథ మే కృషతః క్షేత్రం లాఙ్గూలాదుత్థితా మయా
క్షేత్రం శోధయతా లబ్ధా నామ్నా సీతేతి విశ్రుతా  13
ఆ పిమ్మట కొంత కాలమునకు నేను నాగలితో యాగభూమిని దున్నుచు శుధ్ధి చేయుచు నుండగ ఆ భూమిని చీల్చుకొని పైకి వచ్చి నా కొక బాలిక లభించినది.  అమె సీత యన్న పేరుతో‌ ప్రఖ్యాతి గాంచినది.
ఇక్కడ పిమ్మట అని చెప్పినది, దేనిని గురించి? శివుడు ధనస్సును దేవతలకు ఇచ్చుట, దానిని వారు నిమి వంశమునకు నిక్షేపముగా నిచ్చుట యను నవి జరిగిన కొంతకాలము నకు అని.  అప్పటికి జనక మహారాజు కాలము వచ్చినది.
భూతలాదుత్థితా సా తు వ్యవర్ధత మమాత్మజా
వీర్యశుల్కేతి మే కన్యా స్థాపితేయమయోనిజా   14
అప్పుడు భూతలమునుండి పైకి వచ్చి ఈమె నా స్వంత బిడ్డగా పెరిగినది. అంతేకాని ఒక స్త్రీగర్భమునుండి సాదారణ బాలికవలె జన్మించలేదు.  ఈమెను తన ప్రతాముతోనే గెలుచుకొన గలిగినవానికి ఇచ్చుటకు నిశ్చయించుకొంటిని.
ఉథ్థానం అంటే పైకి లేవటం. ఈ శ్లోకంలో జనకమహారాజుగారు సీత స్వయంగా భూతలాన్ని చీల్చుకొని పైకి ఆవిర్భవించిందని స్పష్టం చేస్తున్నారు. అంటే ఆ తల్లి తనంతతానుగా భూమినుండి ఆవిర్భవించి, నాగలితో నేలను దున్నుతున్న జనకులవారి ముందు ప్రత్యక్షం ఐనది. అంతే కాని ఇందులో జనకులు కాని మరొకరు కాని ప్రయత్నంతో ఆమెను భూమినుండి పైకి తీయలేదు.

సీత అన్నమాటకు నాగేటి చాలు అని అర్థం ఉంది. అంటే నాగలితో భూమిని దున్నుతుంటే దాని ములికితో ఏర్పడిన లోతైన చారిక అన్నమాట.  అలా జనకులవారి నాగలి ఒక చాలు తీస్తూ పోతూ ఉంటే దానినుండి హఠాత్తుగా భూమిని చీల్చుకొని అమ్మ ఆవిర్బవించింది బాలికా రూపంలో.

ఒకానొక ప్రవచనంలో శ్రీచాగంటివారు ఆ బాలిక తనపేరు సీత అని అప్పుడే అందరికీ స్పష్టం చేసిందని చెప్పారు. అంటె సీత అన్నది జనకులో ఆయన పురోహితులో ఆ బాలికకు ఇచ్చిని పేరు కాదు.

ఉథ్భిజము అంటే భూమిని చీల్చుకొని జన్మించేది చెట్టు అన్న అర్థం సాధారణంగా చెబుతూ ఉంటాము. జీవులు నాలుగు రకాలు స్వేదజములు, అండజములు, ఉథ్భిజములు జరాయుజములు అని. స్వేదజము అంటే చెమటనుండి జనించినవని కీటకాదులు. అండజము అంటే గ్రుడ్ఢునుండి జనించినవి అని పక్షులు, ఉథ్భిజము అంటె భూమిని పెకలించుకొని పుట్టినవి అని వృక్షజాతి, జరాయుజములు అంటే మావినుండి జనించినవి అని పశుమనుష్యజాతులు.

ఇక్కడ సీతమ్మవారు భూమిని స్వయంగా చీల్చుకొని ఆవిర్బవించినది. అది కేవలం దైవసంబంధమైనదే  ఐన జననం కాని తదన్యం‌ కాదు.

జనశ్రుతిలో ఒక కథ ఉన్నది.  సినిమాలలోనూ కనబడుతున్నది, జనకమహారాజుగారు యజ్ఞార్థం భూమిని దున్నుతుంటే, నాగేటి చాలులో ఒక చిన్న పెట్టె దొరికిందనీ, దానిని తెరిచి చూస్తే అందులో కనిపించిన బాలికయే సీత అని.

ఇంకా చిత్రమైన విషయం కూడా ఉన్నది. రామాయణసారోధ్దారము అనే ఉద్గ్రంథంలోనూ కనిపిస్తున్నది. ఆ కథలో పితా స్త్వాం దుహితరాం అంటూ రావణుడిని ఉద్దేశించిన ఒక విషయం ప్రస్తావనకు వస్తుంది. సీత రావణపుత్రికయే నట. ఆమెవల్ల లంకకు చేటు అని కార్తాంతికులు చెప్పగా రావణుడే ఆ బిడ్దను ఒక పెట్టెలో పెట్టి భూస్థాపితం చేసాడనీ ఆమె తదనంతరం జనకుడికి దొరికి ఆయన పుత్రికగా పెరిగి అన్నంతపనీ చేసిందనీ.

ఇతే ఈ‌ కథలకు శ్రీమద్రామయణంలో ఆథారం కనిపించదు.  జనకులవారు సీత భూమినుండి ఆవిర్భవించింది అని చెబుతున్నారు కాబట్టి పెట్టె గిట్టె అన్నది అసంగతం. ఆమె స్వయంగా ఆవిర్బవించినప్పుడు అయోనిజ కావటమే స్పష్టం.  పెట్టెలో దొరికితే వేరెవరో అక్కడ వదిలి వెళ్ళి ఉండవచ్చును కదా అన్న అనుమానం ఎవరికైనా వచ్చే అవకాశం ఉంది కదా? స్వయంగా ఆవిర్భవించిన తల్లి తాను సీతను అని అన్నది అందరితో అప్పుడే అని చాగంటివారు చెప్పినది సముచితంగానే అనిపిస్తోంది. 
భూతలాదుత్థితాం తాం తు వర్ధమానాం మమాత్మజామ్
వరయామాసురాగమ్య రాజానో మునిపుంగవ  15
ఓ మునిపుంగవా, వినండి. అలా భూమినుండి ఉద్భవించి దినదిన ప్రవర్థమానయై వివాహయోగ్యమైన వయస్సు వచ్చిన నా పుత్రికను వరించి ఎందరో రాజులు ఆశతో వచ్చారు.
ఈ శ్లోకంలో కొంతభాగం ముందటి శ్లోకంలోనుండే తీసుకున్నట్లు కనిపించటం లేదూ?

సీత సామాన్య స్త్రీ కాదూ, ఆమె స్వయంజాత. అయోనిజ. నా కళ్లముందే భూమిని చీల్చుకొని వచ్చిన తల్లి అని ఆయన అనందంతో మరొకమారు అదే విషయాని నెమరు వేసుకుంటున్నారు. అదేమీ అసహజం కాదు కదా. పైగా ఎంతో సమయోచితమైన భావన. ఇక్కడ సీత ప్రసక్తి నడుస్తోంది. ఆమె గురించి చెబుతూ జనకులవారు తన్మయులై ఉన్నారని మనం స్పష్టంగా గ్రహించాలని శ్రీవాల్మీకులవారి భావన.

అంతే కాదు, ముందటి శ్లోకంలో వలనే ఇందులోనూ మమాత్మజా అని సీతను సంబోధిస్తున్నారు జనకులవారు. ఆత్మజులు అంటే లౌకికార్థంగా సంతానం అనే అర్థం. లౌకికార్థంలో కవిత్వంలో కూడా ఆత్మ అన్న మాటను తాను అన్న పదానికి పర్యాయంగా వాడుకచేస్తూ ఉంటాం. అందుచేత ఆత్మజుడు అంటే కొడుకు. ఆత్మజ అంటే కూతురు.

ఐతే, ఇక్కడ అర్థం కొంచెం విశేషం కలదిగానే చెప్పుకోవాలి. జనకులకూ, సీతమ్మకూ ఉన్న సంబంధం ఆత్మసంబంధం. జనకుడు మహాయోగి. ఆయన పరబ్రహ్మానుసంధానమైన స్థితిలో నిత్యం ఉండే మహానుభావుడు. ఆయనకు విదేహుడు అని బిరుదు. విదేహుడు అంటే దేహంతో సంబంధం లేని స్థితిలో ఉండేవాడు. ఆయన కుమార్తెగా  వచ్చి అమ్మవారు వైదేహి అన్న నామధేయంతో ప్రసిధ్ధ ఐనది. అమ్మవారు జగన్మాత. ఆవిడ ఆత్మవిద్యాస్వరూపిణి. శ్రీలలితాసహస్రనామావళిలో

 ఆత్మవిద్యా మహావిద్యా శ్రీవిద్యా కామసేవితా।
 శ్రీషోడశాక్షరీవిద్యా త్రికూటా కామకోటికా॥

అని ఉంది కదా. ఆత్మయోగి ఐన మహాత్మునకు అత్మవిద్యాస్వరూపిణి పుత్రికగా రావటం ఆశ్చర్యం కలిగించదు కదా. అమ్మ అనుగ్రహం అనేది అద్భుతం. అది ఆనాడూ, ఈ నాడూ కూడా అదే విధంగా గోచరిస్తూనే ఉంది. మనకాలం వారే ఐన తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు బాలా త్రిపుర సుందరీ ఉపాసకులు. ఆయనను అమ్మవారు చిన్నపిల్ల రూపంలో నిత్యం ప్రత్యక్షంగా అంటిపెట్టుకొని తిరుగుతూ ఉండేది. అందుచేత సందేహించవలసింది ఏమీ లేదు. జనకులదీ సీతమ్మవారిదీ ఆత్మసంబంధం.  అందుకే మమాత్మజా అని ఆయన చెప్పుకున్నారు. కేవలం లౌకికార్థంలో కాదని గ్రహించాలి.
తేషాం వరయతాం కన్యాం సర్వేషాం పృథివీక్షితామ్
వీర్యశుల్కేతి భగవన్ న దదామి సుతామహమ్ 16
భగవాన్ విశ్వామిత్రమహర్షీ, వాళ్ళు వరించి వచ్చినా,  నా పిల్లను కేవలం ఎవరైనా సమర్థుడు పరాక్రమంతో గెలుచుకోవలసిందే అని చెప్పి,  నా కన్యను వారిలో ఎవరికి ఇవ్వటానికీ నేను ఒప్పుకోలేదు. 
తన బిడ్డ కేవలం పరాక్రమం చేతనే గెలుచుకోదగినదీ అని జనకులవారు మరలా స్పష్టంగా చెబుతున్నారు. తన మనోనిశ్చయాన్ని ఇంతకు ముందే ఆయన ప్రస్తావించారు. ఇప్పుడు ఆ నిశ్చయాన్ని ఇప్పటికే ఆమె కోసం వచ్చిన రాజులకు చెప్పానని చెబుతున్నారు.

అంటే అనేక మంది రాజులు ఆ అమ్మాయి అందచందాల గురించి విని తమ కిమ్మని కబురులు చేసి ఉంటారు. కాని జనకమహారాజుగారు మాత్రం అలా ఎవరికి పడితే వారికి ఇవ్వటం కుదరదనీ, అపురూపమైన ఆ కన్యను కేవలం పరాక్రమంలో అద్వితీయుడిగా నిరూపించుకున్న వాడికే ఇవ్వటం జరుగుతుందనీ సమాధానం పంపించారన్న మాట.

అది అప్పటి కాలానికి అనుగుణమైన సంగతిగానే మనం పరిగణించాలి.  బ్రాహ్మణులలో వేదాధ్యయనమూ, క్షత్రియుల్లో పరాక్రమమూ, వైశ్యుల్లో ధనసంపత్తీ, ఇతరుల్లో కార్యదక్షతా అనేవి ముఖ్యగుణాలుగా చెప్పబడతాయి కదా. సహజంగానే ఒక క్షత్రియుడికి తన కుమార్తెకు ఉత్తమమైన సంబంధం అంటే వరుడు క్షాత్రగుణసంపన్నుడుగా ఉండటమే అని అనటంలో ఆశ్చర్యకరం ఏమీ లేదు.

ఐతే మరొక సంగతీ ఇక్కడ అర్థం చేసుకోవాలి. వివిధ దేశాల రాజులు లేదా వారి తండ్రులు సంబంధం కలుపుకుందుకు వర్తమానాలు చేసారు అంటే అక్కడ వంశప్రశస్తి ఆధారంగా కూడా సంబంధాలు కుదిరేవని అనుకోవచ్చును. అలాగే రాజ్యాధిపతులను నుండి వర్తమానాల వెనుక ఆయా రాజ్యాల బలాబలాలూ అంచనాకు వస్తాయి కదా. అంటే బలవంతమైన రాజ్యానికి అమ్మాయిని కోడల్ని చేస్తే అమెకు భద్రత అన్న కోణమూ అప్పట్లోనూ పరిశీలనలో ఉండేదీ అన్నది కూడా అవగతం చేసుకోవచ్చును.

ఐతే, జనకుల వారు మాత్రం అబ్బే మీ గొప్పలూ అవీ ఏవీ లెక్కలోకి రావూ మీ మీ వరుల పరాక్రమం చూసాకే నిర్ణయించటం అవుతుందీ అని ఖరాఖండిగా చెప్పేసారు.
తతస్సర్వే నృపతయ స్సమేత్య మునిపుంగవ
మిథిలామభ్యుపాగమ్య వీర్యజిజ్ఞాసవస్తదా  17
ఓ మునిపుంగవా విశ్వామిత్ర మహర్షీ, అప్పుడు, తమతమ పరాక్రమాలను నిరూపించుకొనే ఆసక్తితో ఆ రాజులంతా కలిసి మిథిలకు వచ్చారు.
ఇక్కడ మనం గమనించ వలసిన విషయాలు ఏమిటంటే, రాజులంతా కలిసి మిథిలకు రావటం. వారికి తమ బలాన్ని నిరూపించుకోవాలన్న ఆసక్తి కలగటం.

నిజానికి ఒకరాజు మరెవరైనా రాజును నీ  బలం నిరూపించుకో అనటం యుధ్ధరంగంలోనే జరుగుతుంది కాని మరొక రకంగా జరగదు. జనకమహారాజు ఈ మాట అనేకమంది రాజులతో అన్నాడు.  వాళ్ళంతా ఒప్పుకొని మిథిలకు వచ్చారు.

మానవ స్వభావంలోని ఒక విశేషం చూడండి. ఒక బలీయమైన కాంక్ష కలిగినప్పుడు మనషులు దానిని సాధించుకుందుకు గాను ఎటువంటి వాటినైనా త్యజించటానికి సిధ్ధపడతారు. వారు ఇంటిప్రతిష్ఠను పణంగా పెడతారు. యావత్తు కులంప్రతిష్ఠను కూడా పణంగా పెడతారు. తమ వ్యక్తిగతమైన కీర్తిప్రతిష్ఠలను పణంగా పెడతారు.

సీత అనే అమ్మాయి యొక్క సౌందర్యం అనేది మిగతా రాజలోకానికి ఎంత ఆకర్షణీయమైనది అయ్యింది అంటే వారు ఆమెను సాధించుకోవాలనే పట్టుదలతో సాటి రాజు జనకుని వద్దకు తమతమ బలాలకు అయనపెట్టే పరీక్షను ఎదురుకుందుకు సిధ్ధపడి వచ్చారు.

వాళ్ళకు జిజ్ఞాస కలిగిందట. ‌ఈ‌ జనకుడు తమబలాన్ని ఎలాపరీక్షిస్తాడూ‌ అని.  దానితో‌ పాటుగా తమలో ఎవరికి ఆ మహాబలశాలి అన్న కీర్తిదక్కుతుందీ‌ అని కూడా తప్పకుండా  జిజ్ఞాస కలిగే ఉంటుంది.

అన్నింటికన్నా ముందుగా తాము అంతకాలమూ ఏ అమ్మాఅయి సౌందర్యాన్ని గురించి ఐతే కడు కుతూహలంతో వింటూన్నారో ఆమె నిజంగా ఎంత గొప్ప సుందరాంగి ఐనదీ తమ కళ్ళతో చూడాలి స్వయంగా అన్న జిజ్ఞాస తప్పకుండా కలిగే ఉంటుంది.

ఇలా తహతహలాడుతూ ఆ రాజులంతా మిథిలానగరానికి వచ్చారట.  జనకమహారాజుగారు వాళ్ళంతా కలిసే వచ్చారు అన్నారు అన్నప్పుడు ఫలాని రోజున రమ్మని జనకులవారు ఏమైనా నిర్ణయం చేసి చెప్పారా అన్నది స్పష్టంగా లేదు.
తేషాం జిజ్ఞాసమానానాం వీర్యం ధనురుపాహృతమ్
న శేకుర్గ్రహణే తస్య ధనుషస్తోలనేపి వా  18
అలా జిజ్ఞాసతో వచ్చిన రాజులు తమ వద్దకు తీసుకొని రాబడిన శివధనువును చేబట్టలేక పోయారు. ఎవరూ దానిని తిన్నగా చేతులలో తిన్నగా నిలబెట్టేందు శక్తులు కాలేదు.
ఈ శివధనువు అనేది మహాసత్త్వవంత మైనది. దానిని సాక్షాత్తూ పరమమేశ్వరుడే ధరించదగినవాడు కాని అన్యులు దానిని స్వాధీనం చేసుకొన లేరు. అటువంటి ధనస్సును ఆ మానవమాత్రులు ఎలా లొంగదీసుకోగలరు? ఆ శివధనుస్సు ఒక మందసంలో నిక్షిప్తమై ఉంది. ఆ మందసాన్ని ఒక చక్రాలబండి వంటి వేదికపైన అమర్చి ఉంచారు.

వచ్చే సర్గలో వాల్మీకులవారు అలా పదిలపరచబడిన శివధనస్సును ఐదువేలమంది బలవంతులైన పురుషులు కష్టపడి తీసుకొని వచ్చారన్నది చెబుతారు. కొన్ని రామాయణాలలో శివధనస్సును వందలకొద్దీ శ్రేష్ఠమైన వృషభాలు లాగికొని వచ్చాయనీ, అది భారమైన ధనువు కాబట్టి అనేకమంది లాగికొనివచ్చారనీ చెప్పారు.  ఐనా మనకు శ్రీమద్రామాయణం అనే ఆదికావ్యాన్ని ఇచ్చిన వాల్మీకులవారి వచనమే ప్రమాణం ఈ విషయంలో. జనశ్రుతిలోనికి ఒక కథ వచ్చి చేరింది. అది నాటకాలద్వారానూ సినిమాలద్వారానూ మరింతగా ప్రజలలో వ్యాపించింది, ఆ కథ ప్రకారం, ఒకానొక సందర్భంలో సీతాదేవి ఆ ధనువు ఉన్న చక్రాలవేదికను అవలీలగా ప్రక్కకు జరిపి దాని క్రిందకు పోయిన తన బంతిని తీసుకుందట. ఈ‌ కథ వాల్మీకం అనుకోను. ఐనా పరిశీలించకుండా నిర్థారణగా చెప్పనూ లేను. ఈ కథ ద్వారా స్పష్టీకరించబడే విషయం యేమిటంటే సీతాదేవి సాక్షాత్తూ శక్తిస్వరూపిణి ఐన జగన్మాత కాబట్టి అలా జరిగిందని.

ఏది యేమైనా ఒక విషయం ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి. అది దైవసంబంధమైన దనువు. దాని మీద దైవానికి, దైవభక్తులకూ మాత్రమే యేమైనా అధికారం ఉంటుంది కాని అన్యులకు ఎంతమాత్రం దాని జోలికి పోవటం వల్లకాదు. ఈ బలపరాక్రమాలను ప్రదర్శించటానికి వచ్చిన రాజులకు దృష్టి రెండే రెండు విషయాలమీద ఉన్నది. ఒకటి తమ శక్తిని ప్రదర్శించే విషయంలో ఉత్సాహమూ గర్వమూ. రెందవది సీతాకరగ్రహణం చేయాలనే మనోభీష్టమూ. అంతే‌కాని ఆ ధనువును గురించి వారి మనస్సులలో భక్తిశ్రధ్ధలు లేవు. కాబట్టి వారందరికీ‌ పరాభవం తప్పదు. ఒకవేళ వారిలో ఎవరికైనా ఆ ధనువు దైవీయమైనది అన్న స్పృహ కలిగితే‌ కలుగవచ్చును. కాని తాత్కాలికంగా వారికి కలిగే ఆ వినయం సంస్కారజం కానీ దైవీయమైనది కానీ కాదు కనుక వారికీ పరాభవం నిశ్చయమే.

శ్రీమద్రామాయణంలో శ్రీరాముడు శివధనస్సును ఎక్కుపెట్టే సందర్భంలో ఆయనకు క్షత్రియోచితమైన కుతూహలమే కాని రాజదర్పమూ బలగర్వమూ ఏమీ లేవని స్పష్టంగా తెలుస్తున్నది కథాగమనంలో. ఆ ధనువును కూడా ఆయన గురువుల అనుజ్ఞ మేరకే ఎక్కుపెట్టిన వినయశీలి. శివకేశవులకు అబేధం కనుక ఆ ధనువు ఆయనదే. దైవీయమైన ఆ ధనువును అందుకే ఆయన ఒక్కడే ఎక్కుపెట్టగలిగాడు.
తేషాం వీర్యవతాం వీర్యమల్పం జ్ఞాత్వా మహామునే
ప్రత్యాఖ్యాతా నృపతయస్తన్నిబోధ తపోధన  19
మహామునీ విశ్వామిత్రా, ఈ రాజులంతా అలసత్త్వులని తెలిసిపోయింది. ఓ‌ తపోధనా, నిర్మొగమాటంగా వాళ్ళందరినీ నీరాకరించి పంపివేసాను. 
జనకమహారాజుకు సీతమ్మ యొక్క తత్త్వం దైవీయమైనది అని తెలుసు. ఆమె అయోనిజ, తనంత తానుగా భూమి నుండి ఆవిర్భవించి స్వయంగా నేను నీ కూతురిని అని ప్రకటించినది ఆ బాల. అటువంటి దైవసంబంధమైన ఘటన కాక మానవలోక సహజం కానే కాదు కదా. 

ఈ శివధనస్సు దైవీయం. భగవదనుగ్రహం వలనే ఆ ధనువూ, ఈ పుత్రికా తనకు లభించారు. అందుచేత ఆ కుమార్తెకు వరుడుగా అర్హమైన వ్యక్తి కూడా దైవీయమైన శక్తి యుక్తులు కలవాడే అవుతాడు. 

అన్యులు ఏ పాటి? వారి శక్తులు ఏ పాటి? వారంతా తమకు తాముగా పరీక్షకు అంగీకరించి ఓడి తమది అల్పసత్త్వమే‌ కాని ఏ దైవీయమైన విశేష బలపరాక్రమాలూ తమ వద్ద లేనేలేవని తామే సభాముఖంగా నిరూపించుకున్నారు. జనకమహారాజుగారి ఆంతర్యాన్ని మూర్ఖులైన ఆ రాజులు గుర్తించలేరు. సామాన్యులైన సభాసదులు ఎవరూ గ్రహించలేరు. 

కాని మహా తపస్వి ఐనవాడూ, అపరబ్రహ్మ ఐన విశ్వామిత్రమహర్షి గ్రహించగలడని చెప్పటానికి యేమీ అనుమానం ఉండదు కదా. ఆ రాజులను అల్పసత్త్వులని చెప్పటమూ, విశ్వామిత్రులను మహామునీ, తపోధనా అని రెట్టించి సంబోధించటమూ ఈ విషయాలను గుంభనగా చెబుతున్నాయి.
తతః పరమకోపేన రాజానో నృపపుఙ్గవ
న్యరుంధన్మిథిలాం సర్వే వీర్యసందేహమాగతాః  20
తమతమ ప్రతాపాల గొప్పలు సందేహాస్పదం అని ఇలా సభాముఖంగా ప్రకటించినట్లుగా జరిగింది. దాంతో అవమాన భారంతో ఆ రాజులందరికీ పిచ్చికోపం వచ్చింది. వాళ్ళు అవమానంతో కుతకుతలాడి, అంతా కలిసి మిథిలను ముట్టడించారు.
నిజానికి ఆ రాజులంతా శ్రేష్ఠమైన పరాక్రమం కలవాళ్ళే కాని సభలో విల్లుముందు తేలిపోయారు. ఆ మాట చెప్పటానికే ఆ రాజుల్ని జనకులు నృపపుంగవులు అన్నారు. 

వాళ్ళెంత పరాక్రమవంతులైనా వారి పరాక్రమంలో దైవీయమైన కోణం ఏమీ లేదు కాబట్టి ఆ విల్లు వారిని నిరోధించింది. అందుకే జనకులు వారిని పొమ్మన్నారు. వాళ్ళకి కోపం రావటంలో వాళ్ళ తప్పు కాని ధూర్తత్వం కాని ఏమీ‌ లేదని ఈ‌ శ్లోకంలో జనకులు ఈ‌నృపపుంగవ అన్న మాటతో సూచించారు. 

ఏదో ఒక్క ముక్క పట్టుకుని ఇలా అనటం కుదురుతుందా అంటే తప్పకుండా కుదురుతుంది. వాల్మీకి మాటల్లో పొల్లుమాటలు ఉండవు. అందులోనూ జనకుడి మాటలుగా చెబుతున్నవి ఖచ్చితంగా జనకమహారాజు హృదయాన్ని ఆవిష్కరించేవే కాని ఏదో పూరణకోసం అల్పకవి వాక్యాలుగా ఉండనే ఉండవు.
ఆత్మానమవధూతం తే విజ్ఞాయ నృపపుఙ్గవాః
రోషేణ మహతాఽఽవిష్టాః పీడయన్మిథిలాం పురీమ్  21
ఓ మునిపుంగవా,  ఈ రాజులంతా నేనేదో వాళ్ళని కావాలని అవమానించి పంపివేసానని భావించారు. అందుకే వాళ్ళంతా కలిసి మిథిలపైన ముట్టడి చేసారు.
అంటే ఆ రాజులంతా ఈ మిథిలారాజు కపటి అని భావించారని అర్థం. 

ప్రపంచంలో ఒక వస్తువు యొక్క ధర్మాలను మనం మన ఇంద్రియానుభూతుల సహాయంతో నిర్ణయిస్తాం. తరచుగా పూర్వానుభవమూ, లోకానుభవమూ అనేవి కూడా సహాయం చేస్తాయి ఈ విషయంలో. 

ఇది ఒక రకంగా బలమే. నిత్యజీవితంలో అనేకవిషయాలను పదే పదే అనుభవించవలసిన పరిస్థితి తప్పుతుంది.  తడిగా ఉన్న నున్ననిగచ్చు మీద నడిస్తే పడతామని లేదా ఇతరులు పడగా తెలుసుకున్నామనీ జ్ఞానం ఉన్నప్పుడు ప్రతిసారీ పడి తెలుసుకోవలసిన పని లేదు కదా? అలాగే చెక్క వస్తువు కన్నా ఇనుపవస్తువు బరువుగా ఉంటుందన్నదీ స్వానుభవమో లోకానుభవమూ కూడా కదా. 

ఇలాంటి ఇంద్రియ జ్ఞానాన్ని భ్రమపరచి తప్పుదోవ పట్టించి ఇంద్రజాలికులు వినోదం కలిగిస్తారు. మోసగాళ్ళు నిలువునా ముంచి పోతూ ఉంటారు. జనకమహారాజు ఒక విల్లును ఎత్తమన్నాడు. విల్లును ఒక ధృఢమైన వెదురు వంటి వాటితో చేస్తారు. కాని లోహంతో చేయరు కదా.  తీరా చెక్కవస్తువు అని భ్రమపెట్టేలా ఏదో బరువైన లోహపు వింటిని ఇచ్చాడు జనకుడు. అదీ కాక పట్తుకుందుకు అనువుగా లేకుండా దాని తయారీలోనే ఏదో చమత్కారం ఉంది. అది ఒక విల్లు అని భ్రమపడి అందరూ మోసపోయారు. పిల్లని ఇవ్వటం ఇష్టం లేక మిథిలా రాజు ఈ ఎత్తు వేసి అందర్నీ నిందుసభలో అవమానం చేసాడు. 

ఇదీ ఆ రాజుల అనుమానం. 

బహుశః ఆ వింటి గొప్పను జనకుడు ఆ రాజులకి చెప్పినా వాళ్ళు పామరత్వంతో ఆ కథనాన్ని నమ్మలేరు. అంతా మోసం అనే వారి అనుమానం. జనకుడు కూడా బలశాలి ఐన రాజోత్తముడు కాబట్టి ఏ రాజో దండెత్తి ఓడించేది అనుమానం. అందుకే అందరూ కలిసి జనకుణ్ణి ఓడించాలని మిథిలా నగరాన్ని ముట్టడించా రన్నమాట.
తతస్సంవత్సరే పూర్ణే క్షయం యాతాని సర్వశః 
సాధనాని మునిశ్రేష్ఠ తతోఽహం భృశదుఃఖితః  22
ఈ‌ రాజులంతా కలిసి ఒక సంవత్సరం పాటు ముట్టడించారు. నగరంలో ఆహారపదార్థాలకు కొఱత వచ్చే పరిస్థితి దాపురించింది. ఓ ముని శ్రేష్ఠా, అది నాకు చాలా కష్టం కలిగించింది.
అంటే వాళ్ళంతా కలిసి ముట్టడించినా మిథిల లొంగలేదు. ఒక సంవత్సరం పాటు వాళ్ళు పట్టువిడవకుండా ఆ దాడిని కొనసాగించినా జనకుడు వాళ్ళని సమర్థంగా నిగ్రహించగలిగాడు. 

ఏ‌ కాలంలో ఐనా ఒక ప్రాంతాన్ని దశదిశలా దిగ్భంధం చేసి ముట్టడిస్తే ఎంత సమర్థంగా వాళ్ళని లోపలకి చొరబడకుండా నిలువరించినా క్రమంగా చిక్కుబడ్డ ప్రాంతానికి తిండి కొరత వస్తుంది తప్పకుండా.  

ఎందుకంటే ఏ ప్రాంతమూ సర్వవిధాలా స్వయం సమృధ్ధం కాలేదు కదా. కొన్ని రకాల తిండి దినుసులను మనం తయారు చేసుకుంటే మరికొన్ని ఇతరప్రాంతాలనుండి దిగుమతి చేసుకుంటాం. ఒకచోట్నే అన్ని అవసరమైన పంటలూ పండవు కదా. అలా బయటినుండి రావలసిన దినుసులకు తప్పకుండా కరువు వచ్చితీరుతుంది. 

ఆన్ని దినుసులూ ముఖ్యావసరాలు కాకపోవచ్చును. కాని వాటిలో కొన్నైనా ముఖ్యావసరాలు ఉండితీరతాయి. కేవలం చింతపండుకో, ఉల్లిపాయలకో కొరత వస్తే ఎంత గడబిడ చెలరేగుతుందో అందరం చూస్తూనే ఉంటాం కదా. అలాంటిది నిత్యావసరాలు బయటినుండి నగరంలోనికి వచ్చే దారులన్నీ మూసుకొని పోతే, అదీ ఒక సంవత్సరం పాటు ఐతే. నగరంలో జీవితం అత్యంత సంకతస్తితిలోకి వచ్చేస్తుంది. 

పాలకుల మీద తీవ్రమైన ఒత్తిడి వస్తుంది. ఇలా వచ్చింది ముట్టడి ప్రభావం అని జనకులు చెబుతున్నా రిక్కడ,
తతో దేవగణాన్ సర్వాన్ తపసాఽహం ప్రసాదయమ్
దదుశ్చ పరమప్రీతా శ్చతురంగ బలం సురాః   23
నేను సమస్త దేవగణాలనూ‌ సహాయం కోసం ప్రార్థించాను. వారి దయ కోసం నేను చేసిన తపస్సుకు దేవతలు సంతోషించి నాకు చతురంగ బలాల్నీ అనుగ్రహించారు.
మానవ ప్రయత్నంతో జనకరాజుగారు కోపాలసులైన ఆ రాజుల్ని ఏడాది పాటు ఎదిరించి నిలిచినా, పౌరజీవనానికి అంతరాయం కలగటం వలన దుఃఖించి, ఈ ముట్టడిని అంతంచేసే శక్తి కోసం దేవతల్ని ప్రార్థించారు. 

జనకుడు తనకోసం కాక ప్రజలకోసమే దేవతలను ఉద్దేశించి తపస్సు చేసారు కాబట్టి ఆ దేవగణాలు చాలా సంతోషించాయి. వారి అనుగ్రహం ఎలా వచ్చిందంటే దేవతలు ఆయనకు చతురంగబలాలను సమకూర్చారట. అంటే దేవతలదయ వలన ఆయనకు రథ, గజ, తురగ పదాతి బలాలు కొత్తగా సమకూడా యన్నమాట. దీని విషయంలో మనకు వివరం తెలియదు. కాబట్టి ఏదో ఒక విధంగా అర్థం చేసుకోవాలి మనమే. 

యుద్దంలో క్షతగాత్రులైన సైనికులూ, అలాగే గాయపడిన గుఱ్ఱాలూ, ఏనుగులూ అన్నీ తిరిగి మంత్రం వేసినట్లుగా మరలా యుధ్ధానికి సర్వం సిధ్ధం కావటం‌ జరిగి ఉండవచ్చును. దెబ్బతిన్న రథాలన్నీ దేవతల అనుగ్రహం వలన సులభంగా బాగుపడి ఉండవచ్చును. దానితో ఆయన బలం పెరిగి ఉండవచ్చును. 

దేవతలు అఘటనఘటనా సమర్థులు కాబట్టి నిజంగా వారి మాయ వలన బోలెండంత బలగం ఆయనకు ఏర్పడి ఉండవచ్చును అని కూడా చెప్పుకోవచ్చును.
తతో భగ్నా నృపతయో హన్యమానా దిశో యయుః
అవీర్యా వీర్యసన్దిగ్ధా స్సామాత్యాః పాపకర్మణః  24
దానితో ఆ పాపాత్ములైన రాజులంతా సందిగ్థంలో పడిపోయారు. పెరిగిన నా బలాన్ని ఎదుర్కోలేక ఇంక తమతమ ప్రతాపాలను నమ్ముకోలేక ఆ రాజులూ వారిని ప్రేరేపీస్తున్న మంత్రులూ అంతా చెల్లాచెదరుగా తలో దిక్కుకూ పారిపోయారు. 
ఇక్కడ జనకమహారాజుగారు ఆ రాజుల్ని పాపాకర్ములని నిందిస్తున్నారు. తాము తమ చేతకాని తనంతో కొనితెచ్చుకున్న పరాభవానికి జనకుని నిందించటమూ, ఆయనతో యుధ్ధం పేర పౌరులకు తిండికి తిప్పలు తేవటమూ అనే తప్పుడు పనులకు వాళ్ళు పాల్పడ్డారు. అమాయకులకు హింసచేసే వాళ్ళని పాపకర్ములని తిట్టరా మరి? 

సాధ్యమైనంత వత్తిడి తెచ్చారు. మిథిల లొంగలేదు. ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు కాని మరింత సైన్యంతో విరుచుకు పడి జనకమహారాజు తమని ఊచకోత కోస్తున్నాడు. అందుకే వాళ్ళకు దిక్కు తోచలేదు. అసలు ఈయన మూలబలం ఇంకా ఎంత ఉందో ఏమిటో? ఏడాదైనా అలవడు. చివరకు తమబలం అంతా నాశనం అయ్యే చిక్కు ఉంది. 

అందుకే ఇంకేమీ చేసేది లేక, ఆయనకు తాళలేక ఎవరి ఊరి దిక్కుకు వాళ్ళు చక్కాపోయారు. అంటే ఇన్నాళ్ళూ ఐకమత్యంగా ముట్టడి చేసారు కాని ఇంక ఎవరి మాటా ఎవరూ వినే స్థితి లేదు. ఎగదోస్తున్న మంత్రులూ, నచ్చచెబుతున్న పట్టు వదలని రాజుల తాలూకు మంత్రులూ అంతా కూడా నోరు మూసుకోవలసి వచ్చింది. గందరగోళం నెలకొంది. ఎవరి దారిన వారు ఎవరు ఏమి చెబుతున్నా వినకుండా పలాయనం చిత్తగించారు.
తదేతన్మునిశార్దూల ధనుః పరమభాస్వరమ్
రామలక్ష్మణయోశ్చాపి దర్శయిష్యామి సువ్రత  25
ఓ ముని శార్దూలా, ఇదే నయ్యా ఆధనుస్సు సంగతి. అది అత్యంత ప్రకాశవంతమైనది.  ఆ వింటి జోలికిపోయే వచ్చిన రాజాదిరాజు లందరూ చిన్నబోయినది. ఈ రామలక్ష్మణులకు కూడా ఈ వింటిని చూపిస్తాను.
జనకుడు చెప్పిన ఈ మాటలు గమనార్హమైనవి. ఆయన ఇంకా రామలక్ష్మణుల సామర్థ్యాన్ని నమ్మటం లేదు. నమ్మటానికి ఆట్టే ప్రాతిపదికలు లేవు కూడా కదా ఆయనకు.  

రాముడూ ఆయన తమ్ముడూ విశ్వామిత్రుడి యాగాన్ని సంరక్షించిన సంగతి జనకుడికి ఈ‌ పాటికి తెలిసే ఉండవచ్చును. అలా జరగటం నిస్సందేహంగా గొప్ప విశేషమే. కాని అందులో విశ్వామిత్రుడి మహత్తు కూడా ఎంతో ఉండి ఉందవచ్చును రామలక్ష్మణుల గొప్పదనం కన్నా కూడా. 

ఏమో తనకు ఏమి తెలుసును? అరణ్యంలో ఎన్ని జంతువులు ఉన్నా అవన్నీ పులిముందు తోక ముడుస్తాయి. అలాగే పులి లాంటి ముని ఐన విశ్వామిత్రుడి ముందు రాక్షసులు ఒకరిద్దరి ఆటలు సాగుతాయా? ఆయన తలచుకోబట్టే రామలక్ష్మణులు ఆ రాక్షసుల్ని ఎదిరించే సాహసం చేసి ఉండవచ్చును కదా? అందులో అసంభావ్యం ఏమీ లేదు. 

అందుకే కొంచె ముక్తసరిగానే అదే నయ్యా విల్లు కథ, ఈ పిల్లలకీ చూపిస్తాను అనేసాడు.
యద్యస్య ధనుషో రామః కుర్యాదారోపణం మునే
సుతామయోనిజాం సీతాం దద్యాం దాశరథేరహమ్  26
మహామునీ, ఒకవేళ ఈ‌ రాముడు గనుక ఆ వింటికి నారిని తొడగ గలిగితే, ఆయోనిజ ఐన నా కుమార్తె సీతను ఈ‌ దాశరధికి ఇస్తాను.
రాముడు శివధనస్సుకు నారిని తొదగగలిగితే అతడికి సీతను ఇస్తాను అంటున్నారు జనకమహారాజు. ఆయనకి రాముడి పైన పూర్ణవిశ్వాసం కలగలేదు కనుకనే అలా చేయగలిగితే అని అనటం. 

ఈ‌ రాముడేమో కాకలు తీరిన యోధుడా? ఆయన పేరు వీరుల్లోకి ఎక్కి దేశదేశాలా ప్రాకిందా? ఇంకా అలాంటి దేమీ‌ లేదే? ఇతనా పిల్లవాడు. దశరథుడు విశ్వామిత్రుడి వెంట రాముణ్ణి పంపటానికి మొదట తటపటాయించాడు కదా. నిర్మొగమాటంగా "ఊన షోడశ వర్షో మే రామో రాజీవలోచనః" అని అన్నాదు కదా నిండా పదహారు యేళ్ళు లేని పిల్లవాడే అని సాకు చెబుతూ. 

కాకలు తీరిన భుజబలశాలురు ఓడి వెనుదిరిగిన సంగతి చూసిన జనకుడు, ఆ వింటిని ఈ నూనూగు మీసాల రాముడు ఎత్తగలడనీ దానికి నారిని సంధించగలదనీ ఒక పట్టాన ఎలా నమ్మగలడు?