26, సెప్టెంబర్ 2014, శుక్రవారం

సౌందర్యలహరి - 2 తనీయాంసం పాంసుం ...



మొదటి శ్లోకంవెనుకటి శ్లోకంతదుపరి శ్లోకం


2

తనీయాంసం పాంసుం తవ చరణ పంకేరుహ భవం
విరించిః సంచిన్వన్ విరచయతి లోకానవికలమ్ 
వహత్యేనం శౌరిః కథమపి సహస్రేణ శిరసాం
హరః సక్షుద్యైనం భజతి భసితోద్ధూళనవిధిమ్ 

శ్రీశంకరభగవత్పాదులవారు మొదటి శ్లోకంలో అమ్మను గురించి ఆరాధ్యాం  హరిహరవిరించాదిభిరపి అంటే త్రిమూర్తులకూ ఆరాధ్య అని అన్నారు కదా. అలా యెందుకని అన్నదీ ఈ శ్లోకంలో వివరిస్తున్నారు.

అమ్మా నీ యొక్క పాదపద్మాల పరాగరేణువులున్నాయే, వాటిలో ఒకదానిని గ్రహించి బ్రహ్మగారు ఈ పధ్నాలుగు లోకాల్నీ సక్రమంగా సృష్టిస్తున్నారు. ఆదిశేషుడుగా శ్రీమహావిష్ణూవే ఆపరాగరేణువునే అతికష్టంమీద వేయితలలతో అపసోపాలు పడుతూ మోస్తున్నాడు. ఇక ఈశ్వరుడైతే దానినే చక్కగ మెదిపి ముద్దగా చేసి  భస్మంగా నిత్యం ఒళ్ళంతా పూసుకుంటున్నాడు/

ఇక్కడ చరణాలు అంటె పాదాలు అని సామాన్యార్థం కాని విశేషంగా వాటిని శుక్లరజస్తమోనిర్వాణాలనే నాలుగుపాదాలుగా చెప్పుకోవాలి. ఇక్క రజోగుణప్రధానుడైన బ్రహ్మ అమ్మవారి పాదపద్మపరాగరేణూవునే చతుర్దశభువనాలుగా మళుస్తున్నాడని అర్థం.  శంకరరులు న్రహ్మసృష్టి అవికలంగా ఉందీ అని కితాబునిచ్చారు.  అవికలం అంటే ఈ గ్రహతారకాదులతో కూడిన భువనాలు ఒకదానితో ఒకటి పొరపాటునకుడా ఢీకొనకుండా అన్నమాట.

సత్వగుణం విష్ణుతత్త్వం. ఆయన ఈ బ్రహ్మగారు చేసిన భువనాల్ని వహిస్తూ అంటే వాటి భారం స్వీకరింఇ పోషిస్తూ ఉంటాడు. ఆయన్నిక్కడ శంకరులు శేషుడనే అర్థంలో చెబుతూ శౌరి అన్నారే మరి శౌరి అంటే కృష్ణుడు విష్ణువు అని కదా అని అనుమానం రావచ్చును.  బలరామకకృష్ణులు శూరుడనే రాజుగారి వంశీకులు. అందుచేత ఇద్దరికీ శౌరి అన్న మాట వాడవఛ్ఛును.  అది కాక శృతి ప్రసిధ్ధంగా సహస్రశీర్షా పురుషః అని భగవంతుని చెబుతున్నాం కదా.  అందుచేత కూడ అది సబబైనదే. మరికొన్ని సమర్థింపులూ ఉన్నాయి కాని వాటిని ప్రస్తుతం తడమటం అనవసరం.

శివుడు అమ్మవారి పాదపరాగరేణువునే భస్మంగా చేసి ఒళ్ళంతా పూసుకున్నాడని చెబుతున్నారు. శివుడు భస్మస్నానప్రియుడు. భస్మస్నానమునందు ఆయన ధరించు చున్నవి పృధివ్యాది పంచభూతాలే. అగ్నిరితి భస్మః అని ప్రారంభమయ్యే భస్మస్నానమంత్రం దీన్ని స్పష్టం చేస్తోంది కదా. ఈ పంచభూతాలూ అమ్మవారి పాదపరాగంనుండే జన్మిస్తున్నాయి. వీటి ఆధారంతోనే బ్రహ్మ సృష్టి చేసేది కూడా. ప్రళయకాలంలో తమోగుణప్రధానుడై శివుడు లోకాల్ని చూర్ణం చేసి  అలా వాటికి  తనశరీరాన్ని ఆలంబనం చేసి రక్షిస్తాడన్నమాట.

ఇక నాల్గవచరణం నిర్వాణం. అది కేవల సదాశివస్వరూపం. అది సాక్షాదానందస్వరూపం.

ఇలా ఈ శ్లోకంలో శంకరులు త్రిమూర్తుల క్రియాకలాపం అంతా ఏ విధంగా అమ్మవారి దయామాత్రమే అవుతున్నది వివరించారు. అటువంటి క్రియాకలాపనిర్వహణాశక్తులను అమ్మవారిని ఆరాధించి త్రిమూర్తులు పొందుతున్నారూ అని స్పష్టంగా తెలియబరుస్తున్నారు.

ఈ శ్లోకానికి ప్రతిదినం వేయిమార్లు పారాయణం, ఫలితం జనామోదం లభించటం,  అముష్మికం ప్రకృతివిజయం. నైవేద్యం ఆవుపాల పరమాన్నం.