28, ఫిబ్రవరి 2017, మంగళవారం

ప్రభుత్వపు మొక్కా - వ్యక్తిగతమైన మొక్కా?

ప్రభుత్వపు మొక్కా - వ్యక్తిగతమైన మొక్కా?

మొక్కులు ప్రభుత్వ పక్షానే....తప్పేంటీ? అని వనం జ్వాలానరసింహారావు గారు తన బ్లాగులో ఒక వ్యాసం‌ ప్రకటించారు. ఆ బ్లాగు శీర్షిక ప్రకారం ఆ వ్యాసం ఈనాటి ఆంధ్రజ్యోతిలో వచ్చి ఉండాలి.  వారు లబ్ధప్రతిష్ఠులు. మంచి విషయపరిజ్ఞానమూ‌ పలుకుబడీ‌ ఉన్నవారు కాబట్టి వారు వ్రాసినదల్లా అచ్చయ్యో పరిస్థితి ఉండవచ్చును కాని వ్రాసినదల్లా అంగీకారయోగ్యం‌ కావలసిన అవసరం లేదు.

"దర్శనం స్వామి ఇస్తేనే దొరికేది"...అంతే కాని ఎవరూ ఇచ్చేది కాదు. అదో నమ్మకం. అన్నారు వారు. అక్షరసత్యం. శ్రీ పివీఅర్కే ప్రసాద్ గారి నాహం‌కర్తా హరిః కర్తా అన్న పుస్తకంలో కూడా ఈ‌విషయమై ఒక మంచి ఐతిహ్యం‌ ఉంది. కాని అధికారిక పదవుల్లో ఉన్నవారికి దొరికే ప్రత్యేకదర్శనాలు ప్రత్యేకవిషయాలు. వాటికి ఈ‌నియమం పూర్తిగా వర్తించక పోవచ్చును. అనునిత్యమూ బంగారుపూలతో పూజించిన చక్రవర్తికంటే అడపాదడపా తనకోసం ఒక మట్టిపూవును సమర్పిస్తూ కుండలు చేసుకొనే సామాన్యుడే తనకు అత్యంత ప్రీతిపాత్రుడని స్వామివారే స్వయంగా తెలియజేసిన వృత్తాంతాన్ని స్మరించుకోవాలి ఇక్కడ మనం. తామున్న స్థితి కారణంగా సులభంగా తమ విగ్రహసాన్నిధ్యాన్ని పొంది గర్వించినంత మాత్రాన ఎవరికీ అది తమ ఆత్మీయ సన్నిథి కాదని స్వామివారి సూచన అని గ్రహించటం మంచిది. నిత్యం కేవలం‌ సినీమానటులైనంత మాత్రనే లేదా మరొక పలుకుబడి కల వ్యక్తి ఐనంత మాత్రనే ఎవరెవరో ఎందరెందరో‌ స్వామివారిని దర్శనం చేసుకొని వెడుతున్నారు. వారందరిని స్వామివారు ఆత్రుతతో పిలిపించుకొన్నారని అనుకో గలమా? అసలు వీళ్ళంతా స్వామివారి దర్శనం కోసం వస్తున్నట్లు కాక స్వామివారికి దర్శనం ఇవ్వటానికి వస్తున్నట్లుగా హడావుడి చేస్తున్నారు. శాంతమ్‌ పాపమ్.


ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రభుత్వ పరంగా చెల్లించిన మొక్కులపై అనవసర రాద్ధాంతం పూర్తిగా అసమంజసం అని వనం వారి అభిప్రాయం. ప్రభుత్వపరంగా సొమ్ము వెచ్చించాలంటే అది ప్రభుత్వం‌ తీర్మానం చేయటం అన్న క్రియాకలాపం ద్వారా జరగాలి కదా? అలా జరగక పోతే అది అనుచితం కాదా?  రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రజల బాగోగుల కోసం, రాష్ట్రం బాగుకోసం, ప్రజల పక్షాన, ప్రభుత్వ పక్షాన మొక్కులు చెల్లించుకోవడంలో తప్పేంటో అర్థం కాకపోవటం‌ చిత్రం. ప్రభుత్వమే ఒక తీర్మానం చేయకుండా ఎంత ముఖ్యమంత్రి ఐనా ప్రభుత్వధనాన్ని నేరుగా ఎలా వినియోగిస్తారు? ఇవే ఉద్దేశాలను చూపి మరికొందరు మంత్రులూ‌ ఈ పని చేస్తే సదరు ముఖ్యమంత్రి గారు మాట్లాడటానికి ఏమన్నా ఉందా? ఏమని వారిస్తారు? అసలు వారిస్తారా? ఇలా ప్రభుత్వంలోని మంత్రులే ప్రజలకోసం క్రతువులూ మొక్కులూ‌ అని ప్రభుత్వ ధనాన్ని వెచ్చిస్తుంటే రేపొక కార్యనిర్వహణాధికారో‌ మరొక అధికారో అలాగే ఖజానా సొమ్ముతో యాగాలూ దేవుళ్ళకు ఆభరణాలూ చేయిస్తే ఏమి చేస్తారండీ? వారిది తప్పు అంటారా? ఏ అధికారంతో? తాము చేస్తే ఒప్పైనది ప్రజలకోసం అన్న ఆ మిషలతోనే వేరొక అధికారి చేస్తే తప్పే విధంగా అవుతుందీ?


రాష్ట్రం ఏర్పాటైతే ఫలానా...ఫలానా...దేవుళ్లకు , ఫలానా...ఫలానా ఆభరణాలు మొక్కుగా చెల్లిస్తానని సీఎం కాకముందు కేసీఆర్ మొక్కున్నారు అని వనం వారి వక్కాణింపు. నిజమే  కావచ్చును. అప్పట్లో వ్యక్తిగతంగా మొక్కుకున్న మొక్కుబడిని ఇప్పుడు అధికారిగా ఎలా తీరుస్తారూ?  ఒకానొక వ్యక్తి నాకు ఉద్యోగం వస్తే పదివేలు హుండీలో వేస్తానని మొక్కుకున్నాడు. ఉద్యోగం వచ్చింది. ఆఫీసు సొమ్ము పదివేలను తీసుకొని వెళ్ళి దేవుడి హుండీలో వేసాడు. అది తప్పా ఒప్పా అన్నది పాఠశాలా విద్యార్థిని అడిగినా చెబుతాడు. అవునా కాదా?

సీఎం ఎప్పుడూ తన సొంత డబ్బుతో మొక్కులు చెల్లిస్తానని అనలేదే? అలాంటప్పుడు ఎందుకీ విమర్శలు? అని వనంవారి సమర్థన. బాగుంది. ఇందాక చెప్పిన పిట్టకథలోని వ్యక్తి ఆఫీసు సొమ్ము వేస్తే తప్పేమిటీ నా సొంత డబ్బును హుండీలో వేస్తానని మొక్కుకోలేదే అంటే ఏమన్నమాట? ఈ‌  సమర్థన కూడా అలాగే ఉంది కదా? ఏమన్నా బాగుందా?

కేసీఆర్ గారి ఘనతను వనం వారు ఇలా సెలవిచ్చారు. "గతంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం శ్రీవారికి ఆభరణాలు సమర్పించలేదని, స్వతంత్ర భారత చరిత్రలో కేసిఆర్ కొత్త సాంప్రదాయానికి నాంది పలికారని టీటీడీ కార్యనిర్వహణ అధికారి స్వయంగా అన్నారు. ప్రభుత్వ పరంగా, శ్రీకృష్ణ దేవరాయలు, మైసూర్ మహారాజు లాంటి వారు మాత్రమే గతంలో శ్రీవారికి ఆభరణాలు సమర్పించారని చెప్పారు. ప్రభుత్వం తరఫున ఆభరణాలు సమర్పించడం కొత్తేమీ కాదనే కదా అర్థం?"  వనం వారు చెప్పేది భలేగా ఉంది. మహారాజులతో ముఖ్యమంత్రులకు పోలిక ఎందుకు? అది చెల్లని వాదన. రాజు సర్వస్వతంత్రుడు. ఆయన చేసే ఖర్చుకు ఎవరికీ‌ రాజు జవాబుదారు కాడు. కాని ముఖ్యమంత్రి కూడా ఒక రాజులాగా ఎవరికీ జవాబుదారు కాని వ్యక్తిగా ఉంటాడా ఎక్కడన్నా? అలోచించండి. కేసీఆర్ గారు నెలకొల్పిన కొత్త సంప్రదాయం అల్లా ప్రభుత్వధనాన్ని ముఖమంత్రి యధేచ్ఛగా వెచ్చించవచ్చును అన్నదే కాని తదన్యం కాదు.

"ఇవాళ దేవుడే నన్ను పిలిపించుకున్నాడు." అని తన పూర్వానుభవాన్ని పురస్కరించుకొని కేసీఆర్ అన్నమాట ఉచితంగానే ఉంది. కాని అధికారంలో ఉన్నవాళ్ళు ఎవరన్నా కొండకు వచ్చినా, సెలబ్రిటీలం అంటూ చివరకు సినిమావాళ్ళు వచ్చినా ఆలయాధికారులు పూర్ణకుంభాలతో‌ మేళతాళాలతో వారికి ఎదురేగి స్వామివారి తరపున అన్నట్లు మహారాజమర్యాదలు చేయటం అన్న చెడ్ద సంప్రదాయం కొనసాగుతోంది నేడు. ఇదంతా దేవుడే నిర్ణయించి అర్చకస్వాముల్ని పురమాయించి చేయిస్తున్నాడని వనం వారు నమ్మి మనని నమ్మమంటే వారికొక నమస్కారం.

మరి ఎందుకీ అర్థం లేని విమర్శలు? అని వనం వారు ప్రశ్నిస్తున్నారు. నిజంగా విమర్శలను అర్థం లేనివి అన్నంత మాత్రాన తప్పులు ఒప్పులై పోతాయా?

23, ఫిబ్రవరి 2017, గురువారం

శివస్తుతి



భజే శంభు మీశాన మానంద కందం
భజే సర్వలోకైకనాథం‌ మహేశం
భజే పార్వతీవల్లభం‌ పాపనాశం
భజే కామదం మోక్షదం శంకరం త్వం

భజే కాలకాలం ప్రపన్నార్తినాశం
భజే యక్షరాజేంద్రమిత్రం పవిత్రం
భజే వాయుభుంగ్మాలికాభూషితాంగం
భజే కామదం మోక్షదం శంకరం త్వం

భజే సర్వలోకేశసంసేవ్య మూర్తిం
భజే సర్వమౌనీంద్రసంచిత్య మూర్తిం
భజే సాంబమూర్తిం సదాశాంతమూర్తిం
భజే కామదం మోక్షదం శంకరం త్వం

భజే వేదవేదాంగసంస్తుత్య మూర్తిం
భజే మౌనముద్రాస్థితం జ్ఞానమూర్తిం
భజే ధ్యానమూర్తిం పరబ్రహ్మమూర్తిం
భజే కామదం మోక్షదం శంకరం త్వం

భజే రుద్రమూర్తిం భజే భద్రమూర్తిం
భజే ప్రాణమూర్తిం భజే విశ్వమూర్తిం
భజే యోగమూర్తిం భజే లింగమూర్తిం
భజే కామదం మోక్షదం శంకరం త్వం


12, ఫిబ్రవరి 2017, ఆదివారం

అవనిపై నుండు వా రందరు నిటులే


అవనిపై నుండు వా రందరు నిటులే
యెవరి దారి వారిదగుచు నేగెడు వారే

ఎవరి నడక వారిది యెవరి నడత వారిది
ఎవరి బలిమి వారిది యెవరి కలిమి వారిది
ఎవరి పలుకు వారిది యెవరి గిలుకు వారిది
ఎవరి పదము వారిది యెవరి చదువు వారిది
అవని

ఎవరి కులుకు వారిది యెవరి ఉలుకు వారిది
ఎవరి తెగువ వారిది యెవరి తెగులు వారిది
ఎవరి తలపు వారిది యెవరి వలపు వారిది
ఎవరి మెతుకు వారిది యెవరి బ్రతుకు వారిది
అవని

ఇవల సకల జీవులు తివురు వికట విధమిది
యవల కలుగు జీవిత మెవరి కెఱుక గానిది
ఎవడు రామచంద్రుని యెఱిగి కొలుచు నాతడె
ఇవల నవల రాముని యెదుట నుండు నెప్పుడు
అవని