26, సెప్టెంబర్ 2016, సోమవారం

పొడవైన నల్లని భూతము (అన్నమయ్య)



పుడమి నిందరి బట్టె భూతము కడుఁ
పొడవైన నల్లని భూతము

కినిసి వోడమింగెడి భూతము
పునుక వీఁపు పెద్ద భూతము
కనలి కవియు చీఁకటి భూతము
పొనుగుసోమపు మోము భూతము
పుడమి

చేటకాళ్ళ మించిన భూతము
పోటుదారల పెద్దభూతము
గాఁటపు జడల బింకపుభూతము
జూటరి నల్లముసుగు భూతము
పుడమి

కెలసి బిత్తలే తిరిగేటి భూతము
పొలుపు దాంట్ల పెద్దభూతము
బలుపు వేంకటగిరిపయి భూతము
పులుగుమీఁది మహాభూతము
పుమి


(వరాళి రాగంలో అన్నమాచార్యసంకీర్తనం. 18వ రేకు)

వివరణ:
ఈసంకీర్తనం ఒక దశావతార ప్రశంశా గీతం.  ఇందులోని అవతార ప్రసంగాలను ఇలా ఒక పట్టిక లాగా చూపుతున్నాను.

మత్స్యకినిసి వోడమింగెడి భూతము
కూర్మపునుక వీఁపు పెద్ద భూతము
వరాహకనలి కవియు చీఁకటి భూతము
నృసింహపొనుగుసోమపు మోము భూతము
వామనచేటకాళ్ళ మించిన భూతము
పరశుపోటుదారల పెద్దభూతము
రామగాఁటపు జడల బింకపుభూతము
కృష్ణజూటరి నల్లముసుగు భూతము
బుద్ధకెలసి బిత్తలే తిరిగేటి భూతము
కల్కిపొలుపు దాంట్ల పెద్దభూతము



మత్సావతారసమయంలో మహావిష్ణువు ఒక పెద్ద చేపగా మారి సత్యవ్రతుడనే పరమభాగబతోత్తముడు సకలసృష్టికీ చెందిన జీవరాశుల మూలాలతో నిండిన ఓడను అధిరోహించగా దానిని తననోటితో పట్టుకొని ప్రళయాంబురాశిని దాటించాడు. అంత పెద్దఓడను నోటితో కరుచుకొని ఆయనసాగటాన్ని అన్నమయ్య గారు ఓడని మింగటంగా చెప్పారు చమత్కారంగా. అది ఎంత పెద్దమత్స్యం అంటే ఆ ఓడ ఇంచుమించు ఆయన నోట్లోనే ఉన్నట్లున్నదట. అదీ సమస్తజీవమూలాలతో కూడిన పెన్నోడ.

కూర్మావతారంలో మహావిష్ణువు ఇది కపాలం ఇది వీపు అని తెలియరాని చందంగా పెద్ద  తాబేలు అయ్యాడు కదా. తలను అంటే వీపు ఉన్నట్లుగా చూపుకు తోచి ఆ కపాలమే వీపుగా కూడా వ్యాపించిందా అనిపించే శరీరం దాల్చాడని చమత్కారం.

వరాహావతారంలో విష్ణువు చమత్కారంగా కనలి అటు హిరణ్యాక్షుణ్ణి పట్టి చీరి వధించాడు. ఇటు తన వీరవిక్రమవిహారాన్ని ఆనందించి ప్రస్తుతిచేసిన భూదేవితో శృంగారవినోదమూ చేసాడు. ఇక్కడ కవయటం అన్నమాట కాకువు. అంటే అటు హిరణ్యాక్షుడి పరంగా ఎదిరించి వదించటాన్ని సూచించటానికి, అలాగే ఇటు జతకూడు అన్న అర్థంలో భూవిష్ణువుల దాంపత్యాన్ని సూచించటానికి అన్నమాచార్యుల వారి చమత్కార ప్రయోగం.

నృసింహావతారంలో విష్ణుదేవునిది పొనుగు సోమపు మోము అంటున్నారు. పొనుగు అంటే ఐతే గడ్డి లేదా పొట్టి. కాదంటే తేజస్సులేకపోవటం. ఉన్నంతలో గడ్డి. అదీ బంగారు రంగు ఎండు వరిగడ్డి అనుకుంటే బాగుంటుంది. సోమము అంటే పరాక్రమం. కాబట్టి ఆయన ముఖం బంగారు వన్నెతో ఉన్న మహాపరాక్రమం కల సింహముఖం కలిగి ఉన్నారని భావం.

వామనమూర్తివి చేటకాళ్ళట. అంటే అంతంత పెద్ద వైన ముల్లోకాల మీదా అయన పాదం మోపితే వాటిమీద - ఏదో చిన్న వస్తువు మీద పెద్ద చేట బోర్లించినట్లుగా అయ్యిందని కవి వాక్యం. ఇక్కడ మించటం అంటే పరాక్రమించటమే. వామనుడికి త్రివిక్రముడని కదా పెద్దపేరు.

పరశురాముడు పోటుదారల వాడట. ఆకాలంలో ధర్మద్రోహులైన రాజులపై ఆయన గొడ్డలి పోట్లు వేయటం నెత్తుటి దారలతో నేల చెరువులు కావటం అన్నది ప్రస్తావిస్తూ అన్నమయ్య చమత్కృతి.

ఈ సంకీర్తనంలో రాముడిగా విష్ణువు గాటపుజడల వేషం వాడు. ధర్మవరోధియైన రావణుణ్ణి వధించటం అయన అవరారప్రయోజనం. అందుకే అరణ్యవాసమూ మునిలాగా దట్టంగా జడలు పెంచటమూను.  రావణుడి సీతాపహరణం తనకు తాను వాడు నెత్తిన కొరవి పెట్టుకోవటం. వాడి ఇరవైచేతులూ పదితలలూ విష్ణుతేజపు బింకంలో అణగిపోవటం ప్రస్తావించటానికే బింకపు అన్నమాట జోడింపిక్కడ.

ఇక కృష్ణయ్య. ఆయన జూటరి వాడట. అంటే భలే కొంటె కోణంగి అని. ఈ‌మాటని అన్నమయ్య అనేక మార్లు వాడాడు తన సంకీర్తననాల్లో. నల్లముసుగు అంటే నీలదేహం‌ అనో విష్ణుమాయ అనో చెప్పాలి.  నల్లని ముసుగువేసుకొన్న దొంగ చీకట్లో దొరకడు. అలాగే నల్లనయ్యా తాను ఎవ్వరికీ దొరకడు. లోకం మీద వెన్నుడు విసిరిన నల్లముసుగు విష్ణుమాయ. ఆ మాయావికృష్ణుని ఇక్కడ ప్రస్తావన చేస్తున్నాడు అన్నమయ్య.

అందరూ అనుకునే టట్లుగా శాక్యముని బుద్ధుడు దశావతారాల్లోని బుద్ధుడు కాదు. వేరే. ఆపన్నివారక స్తోత్రంలో దైత్యస్త్రీమనభంజినే అని చెబుతారు. దైత్యస్త్రీలు కూడా తమ పాతివ్రత్యమహిమతో అధర్మపరులైన రాక్షసరాజుల్ని అజేయుల్ని చేయటం గమనించి విష్ణువు పరమసమ్మోహనకరమైన దిగంబరయువసన్యాసి వేషంతో త్రిపురాల్లో సంచరిస్తూ ధర్మబోధలు చేయటం మొదలు పెట్టాడు. ఆయనను దర్శించి ఆ పతివ్రతలు కించిత్తు వ్యగ్రతకు లోనుకావటంతో త్రిపురాసురులకు రక్ష నశించింది. కెలసి అంటే విజృంభించి విచ్చలవిడిగా యువసన్యాసి బిత్తలగా తిరిగి కార్యసాధనం చేసుకోవటాన్ని ఉద్దేశించి ఇక్కడ ప్రస్తావన. వేరే సంకీర్తనంలో అన్నమయ్య పురసతుల మానములు పొల్లజేసినచేయి అని అనటం‌ గమనించండి.

చివరగా కలియుగాంతంలో వచ్చే కల్క్యావతారం. ఆ కల్కిమూర్తి పేరు విష్ణుయశుడు. ఆయన ఎంతో ధైర్యంగా పెద్దపెద్ద అంగలతో కలిమీదకు ఉరికి తరిమివేస్తాడని ఇక్కడ ప్రశంస.

బలుపు అంటే ఇక్కడ సర్వావతారాల బలసంపదల సమాహారమైన తత్త్వం. ఆది ఊతగా శ్రీవిష్ణువు వేంకటగిరిపై వెలసి అందర్నీ రక్షిస్తున్నాడట. అన్నట్లు ఆయన పులుగుమీద విహరించే వాడు. ఆపులుగు అంటే పక్షి - గరుత్మంతుడు. గరుడుడు వేదస్వరూపుడే. శ్రీవేంకటేశ్వరుడు వేదములను అధిష్టించి ఉండటం అంటే అయన వేదవేద్యుడు అని సూచన.

అ వేదవేద్యుడు శ్రీవేంకటేశ్వరుడు భూమిపైన అందరినీ చేపట్టి రక్షించుచున్నాడని పల్లవిలో సూచన.