18, జులై 2016, సోమవారం

శ్యామలీయంపై శ్రీమాన్ లక్కాకుల వేంకట రాజారావుగారి విసుర్లు.


ఈ మధ్యకాలంలో నేను కొందరికి దేముడు కాదండీ దేవుడు అన్నది సరైన పదం అని చెప్పాను. వారు సరిదిద్దుకోవటమూ జరిగింది. సహజంగానే నటనాపూర్వకంగానో కాని కలహప్రియురాలుగా కనిపించే జిలేబి గారి నుండి దేముడు బాబాయ్ అన్న ఒక టపా వచ్చింది. ఆ టపాను ఆరంభించటమే నన్నొక బెత్తం మాష్టారుగా చూపించారు జిలేబిగారు! సంతోషం.

జిలేబీగారు బహుశః ఆశించినట్లుగానే శ్రీమాన్ లక్కాకుల రాజారావుగారు చర్చను ఇలా ఆరంభించారు. (శ్రీరాజారావు గారు తమదైన పధ్ధతిలో ఎత్తిచూపేదాక -మాలికలో వారి వ్యాఖ్యను చూసేదాక -నేనూ గమనించ లేదు, ఇంటి పేరు పొరపాటుగా వ్రాసానని! ఇప్పుడు, అంటే జూలై 21న సరిచేసాను. )

-జూలై 10, 2016న వరూధిని బ్లాగులో వ్యాఖ్య
నీమమ్మున పల్లె జనులు
దేముడనుచు మ్రొక్కులిడెడు తీరు తెలిసియున్ ,
దేముడిలో తప్పు వెదుకు
ధీమతులకు భాష తీరు తెలుపుము దేవా!

జూలై 10,2016న వరూధిని బ్లాగులో వ్యాఖ్య
రావణుడి లోని వా మన
దేవుడిలోనూ గనుపడ తెలుగు జనమ్ముల్
పోవిడి , రాముడిలో గల
మూ వెలయగ దేముడనిరి ముచ్చట గొలిపెన్. 

దేముడు అన్నపదం తప్పుకాదన్నట్లూ, నేను భాషతీరు తెలియకయే తప్పువెదులుతున్నట్లూ వారు స్పష్టంగానే ఆరోపించారు.  ఇది నన్ను తీవ్రంగా బాధించబట్టి నేనుకూడా ఒక సమాధానాన్ని వ్రాసాను దేముడు ఎవరో తెలియని ధీమంతుడిని అట  అంటూ ఒక టపాగా శ్యామలీయంలో. రాజారావుగారు తమ వివరణ అనండీ సమాధానం అనండి ఏదీ ఇవ్వలేదు నాటపాకు వ్యాఖ్యగా. కాని వారు  జిలేబీగారి వరూధిని బ్లాగులో ఇలా నన్ను ఆక్షేపిస్తూ వ్రాసారు.

- జూలై 12, 2016న వరూధిని బ్లాగులో వ్యాఖ్య
జన వ్యవహారము కొరకా
ఘన పండిత సుష్టు కొరకు గలవా భాషల్?
జన భాష నుండి విడివడి
ఘన పండితు లుంట వారి ఘనతా ! అహమా?

పండితుల మాట సుష్టువు!
దండిజనుల నుండి పుట్టి తల్లి పలుకు గా
మెండుగ వ్యవహారము నం
దుండు పలుకు సుష్టువు నకు దూరంబగునా?

భాష జనుల కొరకు , పండితులకు గాదు ,
ప్రజలు మాటలాడు పలుకు సుష్టు ,
పదము మారు , దాని పరమార్థమును మారు
మార్పు లేని భాష మరణమొందు.

ఎరుకగల వారమందురు ,
అరమరికలు లేని జనుల వ్యవహారములో
విరిసిన తాజా మల్లెల
పరిమళ పదసంపద లకు పరిహాసములా!


మరల వారే తమ బ్లాగులో కూడా ఒక టపాగా తమ అక్షేపణలను ఈ క్రింది విధంగా తెలిపారు. పైవ్యాఖ్యకూ దీనికీ కొద్దిగానే తేడా అంతే.

జూలై 12న రాజారావుగారి బ్లాగులో టపా
జన వ్యవహారము కొరకా
ఘన పండిత సుష్టు కొరకు గలవా భాషల్?
జన భాష నుండి విడివడి
ఘన పండితు లుంట వారి ఘనతా ! అహమా?

పండితుల మాట సుష్టువు!
దండిజనుల నుండి పుట్టి  తల్లి పలుకు గా
మెండుగ వ్యవహారము నం
దుండు పలుకు సుష్టువు నకు దూరంబగునా?

భాష జనుల కొరకు , పండితులకు గాదు ,
ప్రజలు మాటలాడు పలుకు సుష్టు ,
పదము మారు , దాని పరమార్థమును మారు
మార్పు లేని భాష మరణమొందు.

ఎరుకగల వారమందురు ,
అరమరికలు లేని జనుల వ్యవహారములో
విరిసిన తాజా మల్లెల
పరిమళ పదసంపద లకు పరిహాసములా!

ప్రజల నాల్కల పయి బ్రతుకును భాషలు ,
పండితుల మెదళ్ళ పైన కాదు,
ప్రజల నాల్కల పయి పరవశించు పలుకు
జీవ గుళిక  , గొప్ప చేవ కలది .


వారి టపాకు వారే ఒక వ్యాఖ్యను ఇలా జోడించారు మరికొంచెం వివరణగా.
జూలై 12న వారి టపాక్రింద వారిదే ఒక స్పందన
జనంలో ఎవ్వరూ నాన్నను అలా అన్న వారు లేరు,మీరు పిలుచుకుంటానంటే తమ ఘనతను కీర్తిస్తాను .
దేముడు అనే పదం బూతూ కాదు , పైత్యమూ కాదు. దేవుడు అనే పదానికి పర్యాయంగా నెల్లూరు, కడప ఇంకా చాలా జిల్లాల్లో జనం వాడుకలో ఉంది . ఎరుక లేనందున వ్రాయగా దిద్దేనంటాడాయన . పైగా జనం వాడుకలో లేదంటాడు .
భాష సృష్టికర్తలు జనం . పండితులు కాదు . భాష
మాట్లాడే జనం నాల్కల మీద బ్రతికుంటుంది .
పండితుల మెదళ్ళలో కాదు .
తెలుగు మాట్లాడే వాళ్లంతా ఎరుక లేని వాళ్లూ కాదు . బూతులే మాట్లాడుతూ కూర్చోడం లేదు .
' దేవుడు అనే పదానికి పర్యాయంగా కొన్ని చోట్ల
దేముడు అనే వ్యవహారం కూడా ఉండొచ్చు .
ఐతే , అది దేవుడు అనే పదం నుండి ఏర్పడిందే కదా! దేవుడు అని రాస్తే బాగుంటుంది ' అని మర్యాదగా, సున్నితంగా కూడా చెప్పొచ్చు . కానీ, ఇది తప్పు , ఇలానే ఉండాలి అని శాసించడాన్ని
పండితాహంకారమంటారు .

జూలై 13న వారి స్పందన అదే టపాక్రిందను.
వాడుకలో పదాలు మార్ఫుకు లోనగుట సహజం. దీన్ని భాషాపరిణామమంటారు. అసలు దేముడు అనే మాట వాడుకలోనే లేదన్నాడే, దాన్ని విభేదించాను. ఎవ్వరైనా తాము సర్వఙ్ఞుల మనుకోవడం అఙ్ఞానమని తెలుసుకుంటే మంచిది. అలాగే భాషా విషయంలో ఒక్కొక్కరి పంథా ఒక్కో రకం . ఈ పదం అసదు, ఈ పదం గ్రామ్యం, జనవాడుకపదాలు రాతలో వాడరాదు. అనే వాళ్లకు
అనేక నమస్సులు. అసలు భాషకు పరమ ప్రయోజనం జన వ్యవహారము. తతిమ్మా వ్యాసంగాలన్నీ ఆనుషంగిగాలు.  


మీరు గమనించారా? ఆయన ఏకవచనంలో నన్ను సంబోధించటం. నాకైతే నొవ్వు కలిగి ఆయనకు తెలియబరిస్తే ఆయన స్పందన చూడండి.
జూలై 13నవారి వ్యాఖ్య. ఇది వారు చేసిన ఏకవచనప్రయోగాన్ని ఎత్తిచూపినందుకు వారి స్పందన
పల్లెల్లో పుట్టి పెరిగి
పల్లెల ప్రాంతీయ తత్త్వ బహు సహజత్వం
బుల్లంబున పాదుకొనెను,
నెల్లూరు పలుకు బడులు నెలకొను కతనన్ -

అన్నా శ్యామల రాయా!
పన్నుగ నేకవచనమున పలుకుబడి విథం
బన్నది మా పలుకు తీరు
ఉన్నది ఉన్నట్లు పలుక ఉలుకేలయ్యా!

తెచ్చి పెట్టుకున్న తెగగౌరవము కన్న
ప్రేమ లూరు పిలుపు పేర్మి గాదె!
అన్న యనుటకన్ప ఆత్మీయ బంధమ్ము
గారు గీరనుటలొ కాంచ గలమె? 

వారికి నన్ను ఎంత అధిక్షేపించినా తనివి తీరటం లేదండి. ఇది చూడండి.
- జూలై 14, 2016న వరూధిని బ్లాగులో వ్యాఖ్య
భవదీయాంద్ర మహాద్భుత
కవితా ధను ముక్త రగడ ఘన శరములు తా
కి , వికావికలైరి ఘనులు,
స్తవనీయము తవరి పద్య ధను తాడనముల్.



వారు ఈ క్రింది వ్యాఖ్యలో తెలుగుతూలిక బ్లాగులోనికి వెళ్ళి మరలా నాపై కత్తులు దూస్తున్న విధం గమనించండి.


ఆ బ్లాగులోని సదరు టపాక్రింద నేను వ్యాఖ్యను ఉంచలేదే! కాని వారు నేనే తప్పక ప్రతి బ్లాగు దూరి తలమునకలుగాతప్పులె వెదికెడు ఘనుడనని అక్కడకు పోయి ఆక్షేపణ చేస్తున్నారు.
 జూలై 17, 2016న తెలుగుతూలికలో వ్యాఖ్య
తప్పులు వెదుకుటె పనిగా
తప్పక ప్రతి బ్లాగు దూరి తలమునకలుగా
తప్పులె వెదికెడు ఘనులకు
ఒప్పదు రచనా మనోఙ్ఞ మొప్పరు గుణముల్ .
తప్పులు వెదికే వారలు
తప్పక తమ రచన చదివి తమలో గల యీ
తప్పులు వెదికే దుర్గుణ
మిప్పటికైనా విడుచుట మేలగు నండీ .

వారు నన్ను ఏకవచనంలో సంబోధించటంపై నేను నిరసన తెలిపినపుడు చక్కగా 'అన్నా శ్యామల రాయా! ' అన్నారు. తనది ' ప్రేమ లూరు పిలుపు' కాని వట్టి అలాంటిలాంటి ఏకవచనప్రయోగం కాదన్నారు. దానిని ఒక 'ఆత్మీయ బంధమ్ము' అంటూ చిత్రించారు. సంతోషం.

కాని ఇతరత్రా వీలైనంత ఘాటుగా హేళన చేస్తూ మాట్లాడారు ప్రతిసారీ. చదువరులు కొంచెం గమనికతో చదివితే అది సులభంగానే పోల్చుకొన వచ్చును. నాది పండితాహంకారం అట. పండితుడను కాను బాబో అని ఎన్నిసార్లు బ్లాగులోకానికి స్పష్టం చేసాను!? మాటిమాటికీ ఘనుడు అని ఎత్తిపొడవటంలో ఉన్న ప్రేముడిని మీరే చూడండి. అన్నట్లు నాపై విసుర్లు పడ్డప్పుడల్లా జిలేబీగారు ఆనందోత్సాహాలతో స్పందించటమూ గమనించండి. ఎందుకో ఈ నిరుపయోగమైన అకారణవైరాలు!

నేను రాజారావు గారికి ఏ విన్నపమూ చేయటం లేదు.  వారు ఉచితానుచితాలనుకొంచెంగా అలోచించుకుంటే బాగుంటుందని ఆశిస్తున్నానంతే. అకారణవైరం వారికి నాపైన ఉన్నపక్షంలో నేను చేయగలిగింది ఏమీ లేదు, కేవలం ఉపేక్షించి ఊరకొనటం తప్ప. నాకైతే వారితో ఏవైరమూ లేదు ఏవిధమైన వైరకారణమూ లేదు.  


రామాయణంలో వాల్మీకులవారు మంధర అలా ఎందుకు చేసిందండీ అంటే మంధరాః పాపదర్శినీ అని చెప్పి వదిలేసారు. నా దురదృష్టం కొద్దీ, నేనేమి వ్రాసినా ఎవరికి ఏమి సలహా ఇచ్చినా అది ఒక అపరాధం లాగే తోస్తోంది వారి దృష్టికి!  చెప్పానుకదండీ దురదృష్టం అని. అంతే. అందుచేత ఆవిషయంలో ఏమీ చేయలేను. ఉపేక్షయే శరణ్యం.

ఈ టపా వ్రాయటానికి కారణం?
నా మనసులోనుండి ఈ విషయాన్ని ఇంతటితో దూరం పెట్టటం.

నా మనసునుండి నొవ్వును తొలగించుకొనటానికి వ్రాసాను కాని ఎవరినీ నొప్పించటం నా ఉద్దేశమూ కాదు, వృత్తీ కాదు,  ప్రవృత్తీ కాదు. ఎవరికైనా ఇబ్బంది కలిగితే, మన్నించాలి.