9, ఫిబ్రవరి 2016, మంగళవారం

చెప్పాలె v చెప్పాలి

మొన్న ఏడవతేదీన శ్రీ ఆచార్య ఫణీంద్రగారు తమ సమగ్ర సంపూర్ణ విజయం టపాను "ఈ ఎన్నికల విజయంతో తెలంగాణ ఉద్యమ విజయం సమగ్రంగా సంపూర్ణమయిందని చెప్పాలె." అన్న వాక్యంతో‌ ముగించారు.

ఆపైన నిరంతరవ్యాఖ్యాప్రకటనాకుతూహలచిత్తు లొకరు "మీ టపా మొత్తం లో ఆ చెప్పాలె బాగుందండీ !" అని ప్రశంసించటమూ జరిగింది.

ఆ ప్రశంసకు సమాధానం చెబుతూ ఫణీంద్రగారు గమనార్హమైన కొన్నిమాటలు చెప్పారు. ఆయన అభిప్రాయాలు తప్పక ఆలోచనీయాలుగా కనిపించాయి. వాటిలోనుండి ఏవో‌ కొన్ని ప్రస్తావించి నా అభిప్రాయాలను వెల్లడించటం వలన ఆయన కాని పాఠకులు కాని అనవసరమైన అపోహలకు గురి అయ్యే ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి ఆయన వ్యాఖ్యను పూర్తిగా ముందు ఉదహరించిన పిదప నా అభిప్రాయాలను చెబుతాను.

వ్యవహార భాషలోని ఆధిపత్యం నుండి కొద్ది కొద్దిగా స్వాతంత్ర్య సాధనకై నేను చేస్తున్న ప్రయత్న ఫలం అది. ఇంకా కొన్ని సంస్కరించుకోవలసిన ఆవశ్యకత ఉంది.

“చెప్పవలె” అన్న గ్రాంథిక క్రియారూపానికి తెలంగాణ ప్రాంతీయులు ప్రయోగించే “చెప్పాలె” అన్న వ్యవహార రూపం దగ్గరగా ఉంది. “చెప్పాలి” అన్న so called ప్రామాణిక వ్యవహార భాష క్రియారూపానికి ఏ ప్రమాణమూ కనిపించదు. ఆ ప్రయోగంలోని “లి” అన్న అక్షరంలో ఇకారం ఎక్కడ నుండి వచ్చిందో ఆ పరమాత్మునికే తెలియాలె.

ఇన్నాళ్ళు … తప్పుడు ప్రయోగాలు ఒప్పులుగా చలామణియై , ఒప్పులు అవహేళనలకు గురి కావడం నిజంగా తెలుగు భాషకు పట్టిన దౌర్భాగ్యం!


వ్యవహార భాషలోని ఆధిపత్యం అన్న ప్రయోగాన్ని నేను తమ పైన వ్యవహార భాష చేస్తున్న ఆధిపత్యం అన్న అర్థంలో ఫణీంద్రగారు ప్రస్తావించారని భావిస్తున్నాను. వ్యవహారభాష అంటే వ్యవహారంలో ఉన్న భాష అనే కదా అర్థం? వ్యవహారంలో ఉండటం‌ అంటే సమకాలీనులైన ప్రజానీకం‌ తమ నిత్యవ్యవహారంలో ప్రయోగిస్తూ ఉండటం అని కదా? ఇక్కడ ప్రజలు అన్నప్పుడు సాహిత్యంతో అనుబంధం ఉన్న వారూ, అలాంటి అనుబంధం ఏమీ లేనివారూ కూడా ప్రస్తావనలో ఉంటున్నారు. ఎంత కవి యైనా మహాపండితుడైనా సరే తన నిత్యవ్యవహారంలో వాడే భాష ఆనాటి సాధారణవ్యవహార భాష మాత్రమే అవుతూ ఉంటుంది కాని తద్భిన్నంగా ఉండదు కదా. ఐతే సాహితీవేత్తలు అపశబ్దాలను తక్కువగా ఉఛ్ఛరించే సావుకాశం‌ మాత్రం తప్పక ఉంటుంది. ఐనా సరే వారు కూడా నిత్యవ్యవహారంలో నూటికినూరుశాతమూ వ్యాకరణబధ్దమైన భాషను వాడుక చేయట‌ం జరుగదు.  ఒక్క మహామహోపాధ్యాయ కొక్కొండ వేంకటరత్నం పంతులు గారు మాత్రం పచారీ షాపువాడితోనూ కూరగాయల వాడితోనూ చివరికి భార్యతోనూ‌ కూడా నిత్యం‌ మహాశుధ్ధమైన వ్యాకరణజుష్టమైన భాషనే వాడేవారని విన్నాను. ఎంతవరకూ‌ నిజమో తెలియదు.

అందుచేత వ్యవహార భాష మన మీద పెత్తనం చేస్తోంది అన్న ఆరోపణకు నాకు ఆట్టే సామంజస్యం కనబడటం‌ లేదు. ఈ దృక్కోణంలో సంస్కరించుకోవలసిన ఆవశ్యకత అంటే ఏమిటో బోధపడదు మరి.

ఐతే ఫణీంద్రగారి వ్యాఖ్యను ఫూర్తిగా తీసుకొని చూడాలి, వారి వ్యాఖ్యను మాత్రమే కాక వారి టపా స్ఫూర్తిని కూడా మనం పరిశీలించవలసి వచ్చినా రావచ్చును.

అ కోణంలో పరిశీలించితే, ఫణీంద్రగారు వ్యవహారభాష అన్నప్పుడు దాని అర్థం, సీమాంద్రనుండి దిగుమతి ఐనదీ, ముఖ్యంగా తెలంగాణాలోనికి దిగుమతి ఐపోయి విస్తరించి తెలంగాణా మాండలికం మీద ఆధిపత్యం కనబరుస్తున్నదీ ఐన సీమాంధ్రుల వ్యవహార భాష అని అర్థం చెప్పుకోవలసి వస్తున్నది.

ఇప్పుడు వారు తమ భాషను సంస్కరించుకోవటం అంటే సీమాంధ్ర వ్యవహార భాష వాడుక చేస్తున్న తమ అలవాటును వదుల్చుకోవటం. ఇలా వారి భావనను నేను అర్థం చేసుకున్నాను.

చెప్పవలెను అన్న ప్రయోగం‌ నుండి గ్రంథప్రయోగార్హమైన మరొక రూపంగా చెప్పవలె అన్నది ఉండటం‌ యధార్థం. ఇది తెలంగాణావారు వాడే చెప్పాలె అన్న వాడుకకు దగ్గరగా ఉండటమూ కాదనరాని వాస్తవమే.

ప్రస్తుతం వ్యవహారభాషలో చెప్పాలి అన్న రూపం ప్రచురంగా వినిపిస్తుంది. ఇది తప్పుడు ప్రయోగమనీ, చెప్పాలి అన్న రూపంలోని 'లి' ఉనికికి ప్రమాణమేమీ లేదనీ ఫణీంద్రగారి అభిప్రాయం. ఈ అభిప్రాయాన్ని ఆయన ,“చెప్పాలి” అన్న so called ప్రామాణిక వ్యవహార భాష క్రియారూపానికి ఏ ప్రమాణమూ కనిపించదు.  అని ఘాటుమాటలతోనే అన్నారు.

వ్యవహారభాష సీమాంధ్రులు తెచ్చి తెలంగాణామీద రుద్దారన్న అభిప్రాయంతో ఆయన సదరు సీమాంధ్రవ్యవహారభాషను  so called ప్రామాణిక వ్యవహార భాష అని ఈ‌సడించటాని అర్థంచేసుకోవచ్చును.

వ్యవహారభాష పేరుతో సీమాంధ్రభాష బహుళప్రచారం లోనికి రావటం కారణంగా అన్నిచోట్లా అనేక తప్పుడు మాటలు ప్రచారంలో ఉండటం వలన తెలుగుభాష భ్రష్టుపట్టిపోయిందని ఫణీంద్రగారు అభిప్రాయపడు తున్నట్లున్నారు. ఆయన అభిప్రాయం ఆయనది. దానిపైన నేను చర్చించటం లేదు.

నేను నా అభిప్రయాన్ని వారి వ్యాఖ్యలోని ఒక భాగానికి పరిమితం చేయా లనుకుంటున్నాను.  అది “చెప్పాలి” అన్న so called ప్రామాణిక వ్యవహార భాష క్రియారూపానికి ఏ ప్రమాణమూ కనిపించదు. ఆ ప్రయోగంలోని “లి” అన్న అక్షరంలో ఇకారం ఎక్కడ నుండి వచ్చిందో ఆ పరమాత్మునికే తెలియాలె అన్నది


తెలుగులో పల్లె అన్న పదం ఉంది. ఆ మాటకు అర్థం ఏమిటో ఎవరికీ వివరించనవసరం ఉండదు. నా చిన్నప్పుడు మేము గెద్దనాపల్లె అన్న ఊళ్ళో ఉండే వాళ్ళం. గతవారం రోజులుగా మారుమోగుతున్న ఊరు కిర్లంపూడికి రెండు మూడు కిలో మీటర్ల దూరంలో ఉంటుందీ గెద్దనాపల్లె. ఆవూరిని అందరూ గెద్దనాపల్లి అనే పిలచేవారే కాని ఎవరూ గెద్దనాపల్లె అని పిలవటం‌ వినలేదు. చదువరులారా, మీకు పల్లె అన్న మాటతో అంతమయ్యే పేరు గల ఊళ్ళు కొన్నైనా తెలిసే ఉంటాయని భావిస్తున్నాను. సాధారణవ్యవహారంలో ఎంతమంది ఆయా ఊళ్ళ పేర్లను సరిగా పల్లె అని వచ్చేలా పలుకుతున్నారో ఒక్కసారి ఆలోచించండి.

ఎంతో దూరం‌ ఎందుకు లెండి. హైదరాబాదు వాళ్ళకి నాంపల్లి గురించి వేరే చెప్పాలా? దాని అసలు శుధ్ధమైన గట్టిగా మాట్లాడితే తెలంగాణావారికే దాదాపు స్వంతమైన పలుకుబడిలో నాంపల్లె అనాలి కదా? ఎలా పిలుస్తున్నారు అందరూ? హైదరాబాదీలైనా నాంపల్లె అంటున్నారా?  నాంపల్లి అని ఒకటే కాదు, ఇంకా కొంపల్లి, బాచుపల్లి వగైరా పల్లితో ముగిసే ప్రాంతాలు మరికొన్ని ఉన్నాయి.

మల్లెపూల గురించి తెలియని వాళ్ళుండరేమో. అవును మరి వ్రాసేటప్పుడు మల్లె అనే వ్రాస్తాం. కాని వాడుకగా జనం పలుకుబడిలో ఉన్నది మల్లి అనే కదా. మల్లి అన్నమాటే మల్లె అన్న మాటకన్నా ఎక్కువ ప్రచారంలో ఉది కదా. మల్లీశ్వరిలో ఉన్నది మల్లి కాని మల్లె కాదేమో కదా.

గారెలు తెలుగువారికి యిష్టమైన పిండివంటల్లో ఒకటి. ఆలోచించండి. వాడుకలో గారె అంటున్నామా గారి అంటున్నామా?

పెట్టె, గిన్నె అన్నపదాలను మనం పెట్టి, గిన్ని అనే వ్యవహారంలో పలుకుతున్నాం. గేదె అన్న మాట తరచుగా గేది అని వినబడుతూఏ ఉంటుంది. ఇలా చాలా మాటలే ఎకారాంతమైనవి జనం నోటిలో‌పడి ఇకారాంతాలుగా వాడుకలో ఉన్నాయి.

చెప్పాలె అన్న మాటలో ఏ దోషమూ‌ లేదు.  అలాగే చెప్పాలి అనటంలో‌ కూడా ఏదోషమూ‌ లేదు. రెండురకాలుగానూ వ్యవహారం బాగానే ఉన్నది.

దయచేసి ఇప్పుడు చెప్పండి. వాడాలి, చెప్పాలి, వినాలి వంటి మాటలలో ఉన్న ఇకారాంత ప్రయోగం తెలుగును నిజంగానే భ్రష్టుపట్టిస్తోందా? లేదా ఈ విధమైన వాడుకలు సీమాంద్రవారి చలువ వలనే ప్రచారంలో హెచ్చుగా ఉన్నాయి కాబట్టే తెలుగుభాష భ్రష్టుపట్టిపోతోందా?

నిత్యవ్యవహారంలోని భాష కాబట్టే అది వ్యవహారభాషగా చెప్పబడుతోంది కదా. అలాంటప్పుడు ఒక సందర్భంలో మన తెలుగువారు వ్యవహారంలో ఎలావాడుతున్నారు అన్నది పరిశీలించితే సరిపోయేదానికి పరమాత్మునికి నివేదించుకోవలసినంత దారుణమైన దౌర్భాగ్యంగా భావించటం ఎలా సబబు?

ఈ వ్యాసం చివరన ఒక ముక్క చెప్పటం అవసరంగా అనిపిస్తోంది. విషయసంబదంధిగా ఫణీంద్రగారి అభిప్రాయాన్ని ఖండించటమే కాని వారిని చిన్నబుచ్చటం‌ నా ఉద్దేశం‌ కాదు. మామధ్య బహుకాలంగానే స్నేహసంబంధాలు చక్కగా ఉన్నాయి.



3, ఫిబ్రవరి 2016, బుధవారం

శ్రీరామ ప్రియావృత్తం







           ప్రియ.
           నను నీ యశం
           బును రాఘవా
           కొని యాడనీ
           తనివారగన్




ప్రియ.

ఈ ప్రియావృత్తం ఒక ఇట్టిపొట్టి వృత్తం.  గణవిభజన స-వ. అంటే పాదానికి 5 అక్షరాలే అన్నమాట. అందుచేత యతిగొడవ లేదు. ప్రాసనియమం మాత్రం తప్పదు.

ఈ ప్రియావృత్తంలోని నాలుగు పాదాలనూ కలిపి ఒకే పాదంగా వ్రాస్తే అది గీతిక అనే వృత్తం అవుతుంది.  దానికి గణవిభజజన స-జ-జ-భ-ర-స-వ అవుతుంది. గీతిక పాదం నిడివి ఇరవై అక్షరాలు కదా, అందుకని యతినియమం వర్తిస్తుంది 13వ స్థానం వద్ద. ఈ గీతికను అప్పకవి ప్రభాకలిత వృత్తం అన్నాడు.

ఇలా చిట్టి పొట్టి పద్యాలు ముక్తకాలుగా బాగుంటాయి. కావ్య నిర్మితిలో కాదని బహుశః  పూర్వకవులు భావించేవారేమో. అందుచేత ఇలాంటివి కావ్యాల్లో అరుదుగా కనిపిస్తాయి.