19, జనవరి 2016, మంగళవారం

మదరేఖాశ్రీరామం







        మదరేఖ.
        స్వామీ వందన మయ్యా
        నీ మాహాత్మ్యము నెన్నన్
        సామాన్యుండను రామా
        యే మాత్రంబును చాలన్




మదరేఖ.

మదరేఖావృత్తానికి గణవిభజన మ-స-గ. పాదం నిడివి 7అక్షరాలు. పొట్టి కాబట్టి యతిమైత్రి అవసరం లేదు. ప్రాసనియమం ఉంది. గురులఘుక్రమం UUU IIU U.

ఈ‌వృత్తానికీ తనుమధ్యావృత్తానికీ చాలా దగ్గరి చుట్టరికం. తనుమధ్యపాదానికి ముందు మరొక గురువును చేరిస్తే అది మదరేఖ అవుతుంది. తనుమధ్యకు గురులఘుక్రమం UUI IUU కదా.

మరొక సంగతి ఏమిటంటే మదరేఖా పద్యపాదం కందపద్యంలో బేసిపాదంగా కూడా సరిపోతుంది!  ఎందుకంటే మ-స-గ అనగా UUU IIU U అనే గురులఘుక్రమాన్ని UU UII UU అని వ్రాస్తే అది గగ-భ-గగ అవుతున్నది కదా, ఈ‌ గగ, భ గణాలను కందంలో వాడుకచేస్తాము కదా. బేసిపాదంలో గగ-భ-గగ నప్పుతుంది కాని సరిపాదాల్లో మూడవగణం‌ కందంలో జ-గణం కాని నల-గణం కాని కావాలి కాబట్టి ఆ పాదాలకు కుదరదు.

మదరేఖకు కల పూర్వకవి ప్రయోగాలు తెలియవు.

ఈ‌ మదరేఖా వృత్తం నడకను చూదాం. ఈ వృత్త పాదంలో  గురులఘువులు UUUIIUU వీటిని UU UII UU అనగా గగ-భ-గగ అని మూడు చతుర్మాత్రాగణాలుగా వ్రాయవచ్చునని చూసాం. అందుచేత దీని నడక చతురస్రగతిగా ఉంటుంది. పై పద్యం నడక ప్రకారం ఈ‌క్రింది విధంగా చూడవచ్చును.

స్వామి వందన మయ్యా
నీ మా హాత్మ్యము నెన్నం
సామా న్యుండను రామా
యే మా త్రంబును చాలన్