6, జనవరి 2016, బుధవారం

భారవి చిత్రకవిత్వం ఉన్న కథకు ముందుమాటలు.

భారవిమహాకవి వ్రాసిన కావ్యం కిరాతార్జునీయం. అంటే ఒక కిరాతుడికీ అర్జునుడికీ‌ మధ్య జరిగిన కథ అని స్థూలంగా అర్థం చెప్పుకోవచ్చును. పాఠకలోకానికి ఈ‌ కథ పరిచయం ఉన్నదే. ఇక్కడ కిరాతుడిగా వచ్చి అర్జునుడి పరాక్రమానికి సవాలు విసిరిన వాడు సాక్షాత్తూ పరమశివుడే.

అసలు అలా సవాలు విసరవలసిన అవసరం ఏమి వచ్చిందీ‌ శివుడికి అన్న ప్రశ్న వస్తుంది సహజంగా. అర్జునుడేమో పరమేశ్వరుడి నుండి పాశుపతాస్త్రం కోరుతున్నాడు. ఇవ్వటానికి శివుడి కేమీ‌ అభ్యంతరం లేదు. కాని ఇచ్చే ముందు ఒక పని చేయాలి కదా. యావత్తు ప్రపంచాన్నీ తుదముట్టించే శక్తి కల గొప్ప ప్రమాదకరమైన అస్త్రాన్ని పుచ్చుకుందుకు ఆ అర్జునుడికి అర్హత ఉన్నదా అని పరీక్షించి నిగ్గుతేల్చాలి కదా. ఈ విషయంలో‌ సత్యాసత్యాలు తనకి తెలిసినా యావత్ప్రపంచానికీ‌ కూడా వెల్లడి కావాలి మొదట. ఆ తరువాతనే అస్త్రం తానిచ్చేదీ అతడు పుచ్చుకునేదీను. అయన తగిన సమయం కోసం చూస్తున్నాడు.

దేవతలకు జాతి శత్రువులు రాక్షసులు. దేవతలు లోకోపకారులు. రాక్షసులు లోకాపకారులు. ఇవి వారికి సహజగుణాలు. అందుచేత వాళ్ళ మధ్య వైరమూ అంతే సహజం. అర్జునుడిది దేవాంశ. ఇంకా సరిగ్గా చెప్పాలంటే ఆ దేవదేవుడి అంశ. సాక్షాత్తూ విష్ణువు రెండు రూపాలైన నరనారాయణుల్లో ఒకాయన ఐన నరుడే అర్జునుడు, మరొకాయన ఐన నారాయణుడే శ్రీకృష్ణభగవానుడు. ఆ ఇద్దరూ భూమ్మీదకి వచ్చినది రాక్షసాంశలతో‌ జన్మించి లోకాకారం చేస్తున్న దుర్మార్గులందరినీ‌ హతమార్చి భూభారం తగ్గించటానికి. భూమికి భారం అంటే‌ అధర్మమే అని అర్థం. మరి కొన్నాళ్ళల్లో పెద్ద యుధ్ధం రాబోతోంది. తమ అంశలని తుదముట్టించటానికే వస్తోంది యుధ్ధం అని రాక్షసులకు బాగానే తెలుసు. వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళూ శక్తికొద్దీ చేస్తున్నారు. అర్జునుడు పాశుపతం అనే జగత్సంహారకాస్త్రాన్ని కోరి శివుడి కోసం తపస్సు చేస్తున్నాడూ‌ అంటే‌ ఆ అస్త్రం సృష్టించబోయే విధ్వంసానికి బలయ్యేది తమవైపు బలగమే అని రాక్షసులకు నమ్మకంగా తెలుసు. అందుకే ఈ అర్జునుడి తపస్సు సఫలం అయ్యేలా ఉంది అనిపించగానే అర్జునుడిని చంపెయ్యాలని అడవిపంది రూపంలో మూకాసురుడు అనే‌ రాక్షసుడు వచ్చాడు. సమయం వచ్చింది అనుకున్నాడు శివుడు.

అర్జునుడు ఆ రాక్షసుణ్ణి చంపలేడా? చులాగ్గా చంపగలడు. మరింకే. శివుడికి అనుమానం లేదు కదా? ఆ రాక్షసుడికి అర్జునుడి చేతిలో మూడిందిలే అని ఊరుకోవచ్చు కదా. ఊరుకుంటే కథేం ఉందీ? ఆయన ఆలోచన వేరేగా ఉంది. ఈ వంక బెట్టుకుని అర్జునుడి సత్తా పరీక్షించాలి అనుకుంటున్నా డాయన. గిల్లి కజ్జా తెచ్చుకుని అర్జునుడి పరాక్రమం ఏపాటిదో చూసి వినోదించవచ్చును. లోకానికీ తెలిసివస్తుంది.

అర్జునుడి తపస్సు లోని ఆంతర్యం మునీశ్వరులకే అంతుబట్టలేదు. అర్జునుడిని శివానుగ్రహం కోరి తపస్సు చేయమనీ‌ పాశుపతం అడగమనీ‌ సలహా ఇచ్చింది సాక్షాత్తూ‌ శచీపురందర ఋషి. అంటే ఇంద్రుడు. ఆయన ఆంతర్యం అందరికీ ఎలా సులువుగా తెలుస్తుందీ? అందుచేత వాళ్ళు  భయపడి, శివుడి దగ్గర ఆ తపస్సు గురించి ప్రస్తావించారు. అప్పుడు శివుడన్నాడు గదా, ఈ‌ అర్జునుడి ప్రయోజనం మోక్షం కాదు. లోకోపకారం. ఇతను నరనారాయణుల్లో నరుడు. శ్రీకృష్ణుడే నారాయణుడు. వీళ్ళిద్దరూ‌ బ్రహ్మదేవుడి ప్రార్థన మేరకు రాక్షసులను చంపి ప్రజల్ని కాపాడ్డానికి భూమిమీద అవతారాలు ధరించారు. ఇప్పుడు మూకాసురుడనే వాడు అర్జునుడినే చంపాలని అడవిపంది వేషంలో‌ వెళుతున్నాడు. దారేబోయే అడవిపందే‌ కదా అని అర్జునుడు పట్టించుకోడు కాబట్టి దగ్గరగా వెళ్ళాక నిజరూపం ధరించి ఆయన్ను చంపాలని వాడి కుయుక్తి. అందరం అర్జునుడి ఆశ్రమానికి వెళదాం రండి. అర్జునుడితో‌ పోటీపడి ఆ పందిని నేనే చంపి అతడితో‌ కావాలని తగాదా పెట్టుకుంటాను. మిగతా కథ అంతా మీరే స్వయంగా చూద్దురు కాని పదండి అన్నాడు.

శివుడి సంకల్పం ఎలా ఉంటే అలాగే జరుగుతుంది కదా! ఆ అడవిపంది రూపంలోని రాక్షసుడిని అర్జునుడూ బోయవాడి రూపంలో ఉన్న శివుడూ ఒకేసారి బాణాలతో కొట్టటమూ వాడు గిరిగిరా తిరిగి చావటమూ జరిగింది. నా బాణానికి చచ్చాడంటే నా బాణానికే చచ్చాడయ్యా అని శివుడూ అర్జునుడూ గోలగోలగా తగాదా పడ్డారు. చిలికి చిలికి గాలివాన అయ్యింది. యుధ్ధానికి దిగారు. ఒకప్రక్కన బక్కచిక్కిన అర్జునుడు, మరొక ప్రక్కన బోయవాళ్ళ నాయకుడి వేషంలో శివుడూ ఆయన బలగమూ తలపడ్డారు.

ఇదొక చిత్రమైన యుధ్ధం. అర్జునుడి శక్తిని ప్రపంచానికి విదితం చేయటానికి శివుడు లీలా యుధ్ధం చేస్తున్నాడు. అటు శ్రీమహావిష్ణువు అంశ ఐన అర్జునుడు తపస్సు కారణంగా బక్కచిక్కిపోయి ఉన్నా దీపశిఖలాగా ప్రకాశిస్తూ క్షత్రియపౌరుషానికి ఒక బోయవాడు పరీక్షపెట్టటమా అన్న కోపంతో రెచ్చిపోయి యుధ్ధం చేస్తున్నాడు. చిత్రాతిచిత్రమైనది కాబట్టి ఈ‌యుధ్దం భారవిమహాకవి కూడా యుధ్ధవర్ణన అంతా కూడా చిత్రకవిత్వంతో హోరెత్తించాడు.

ఇప్పుడు మనం ఆ చిత్రకవిత్వపు సర్గను పరిశీలించబోతున్నాం.