31, డిసెంబర్ 2015, గురువారం

రాముని శ్రీ పెంపు కనరండి.







     శ్రీ పెంపు.
     రా మ 
     స్వామీ
     నా మా 
     టే మీ




శ్రీ పెంపు / స్త్రీ.

ఈ స్త్రీ వృత్తానికి గణవిభజన గగ. అంటే పాదానికి రెందు గురువులు మాత్రం. పాదం నిడివి రెండు కాని ఆపైన కాని ఉన్నప్పుడు ప్రాసనియమం‌ తప్పదు. పదక్షరాల లోపు పాదాల్లో యతినియమం అక్కర లేదు.

కావ్యాలంకారచూడామణి కారుడు ఈ వృత్తాన్ని శ్రీ పెంపు అనటం తప్ప మిగిలిన అందరు లక్షణకారులూ ఈ‌వృత్తానికి  స్త్రీ అన్న పేరే ఇచ్చారు. అంటే ఒకే వృత్తానికి వేరేవేరే పేర్లను పెట్టటం ఇక్కడి నుండే మొదలన్నమాట.

ఐనా, మనకు అనందం కలిగించే విషయం‌ ఒకటుంది ఈ వృత్తానికి సంబంధించి.  అదేమిటంటే, ఒక వృత్తానికి తెలుగుపేరు పెట్టటం. పెంపు అన్నది తెలుగు మాట కదా. అందుచేత మనం‌ తెలుగు వాళ్ళుగా సంతోషించాలి. సాధారణంగా కవులందరికీ ఒకే అభిప్రాయం ఉంటుంది వృత్తాల పేర్లన్నీ‌కేవలం సంస్కృతంలోనే ఉంటాయీ అని. ఈ శ్రీపెంపు వృత్తం ఆ నియమానికి మినహాయింపు అన్నమాట.

ఈ వృత్తనామ‌ శ్రీపెంపు గురించి ఒక ప్రశ్న రావాలి. వచ్చింది కూడా. శ్రీ పెంపు దుష్ట సమాసమా ? అని.  శ్రీ అనేది తెలుగు పదం‌ కాదు సంస్కృతపదం. పెంపు అనేది తెలుగుపదమే. సంస్కృతపదం తరువాత తెలుగుపదం వేసి సమాసం చేయరాదు మరి. దుష్టసమాసమే.  అందుకేనేమో కావ్యాలంకారచూడామణి కారుడు తప్ప అందరూ ఈ వృత్తాన్ని స్త్రీ వృత్తం అనటం‌ జరిగింది.  ఈ‌ శ్రీ పెంపు అన్నది దుష్టసమాసం‌ కావటం వలనో మరొక కారణమో తెలియదు ఆ పేరు ప్రచారంలో‌ లేదు. స్త్రీ అన్న పేరే ఈ‌వృత్తానికి ప్రచారంలో ఉన్నట్లుంది. ఐతే పూర్వ కవి ప్రయోగాలు కనిపించలేదు.

ఈ  శ్రీ‌ పెంపు లేదా స్త్రీ అనే వృత్తానికి అనంతుడు ఇచ్చిన ఉదాహరణ చూడండి:
    స్త్రీరూ
    పారున్‌
    ఘోరా
    ఘోరీ