17, ఫిబ్రవరి 2015, మంగళవారం

శ్రీమదాంధ్రమహాభారతంలో నన్నయ్యగారు అర్జునుడిచే చేయించిన శివస్తుతి దండకం









శ్రీకంఠ లోకేశ లోకోద్భవస్థానసంహారకారీ పురారీ మురారిప్రియా చంద్రధారీ మహేంద్రాది బృందారకానందసందోహసంధాయి పుణ్యస్వరూపా విరూపాక్ష దక్షాధ్వరధ్వంసకా దేవ నీదైవ తత్త్వంబు భేదించి బుద్ధిం బ్రధానంబు గర్మంబు విజ్ఞాన మధ్యాత్మయోగంబు సర్వక్రియాకారణం బంచు నానాప్రకారంబుల్ బుద్ధిమంతుల్ విచారించుచున్ నిన్ను భావింతు రీశాన సర్వేశ్వరా శర్వ సర్వజ్ఞ సర్వాత్మకా నిర్వికల్ప ప్రభావా భవానీపతీ నీవు లోకత్రయీవర్తనంబున్ మహీవాయుఖాత్మాగ్నిసోమార్కతోయంబులం జేసి కావించి సంసారచక్ర క్రియాయంత్రవాహుండవై తాదిదేవా మహాదేవ నిత్యంబు నత్యంతయోగస్థితిన్ నిర్మలజ్ఞానదీపప్రభాజాల విధ్వస్త నిస్సార సంసారమాయాంధకారుల్ జితక్రోధరాగాదిదోషుల్ యతాత్ముల్ యతీంద్రుల్ భవత్పాదపంకేరుహ ధ్యానపీయూష ధారానుభూతిన్ సదాతృప్తులై నిత్యులై రవ్యయా భవ్యసేవ్యాభవా భర్గ భట్టారకా భార్గవాగస్త్యకుత్సాదినానామునిస్తోత్రదత్తావధానా లలాటేక్షణోగ్రాగ్నిభస్మీకృతానంగ భస్మానులిప్తాంగ గంగాధరా నీ ప్రసాదంబున్ సర్వగీర్వాణగంధర్వులున్ సిద్ధసాధ్యోరగేంద్రాసురేంద్రాదులున్ శాశ్వతైశ్వర్య సంప్రాప్తులై రీశ్వరా విశ్వకర్తా సురాభ్యర్చితా నాకు నభ్యర్థితంబుల్ ప్రసాదింపు కారుణ్యమూర్తీ  త్రిలోకైకనాథా నమస్తే నమస్తే నమః.


శ్రీమదాంధ్రమహాభారతం - ఆరణ్యపర్వం.