29, సెప్టెంబర్ 2014, సోమవారం

సౌందర్యలహరి - 5 హరి స్త్వా మారాధ్య ....



మొదటి శ్లోకంవెనుకటి శ్లోకంతదుపరి శ్లోకం


5


హరి స్త్వా మారాధ్య ప్రణతజనసౌభాగ్యజననీం
పురా నారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్ 
స్మరోఽపి త్వాం నత్వా రతినయనలేహ్యేన వపుషా
మునీనామప్యంతః ప్రభవతి హి మోహాయ మహతామ్     


అమ్మ శ్రీదేవి తీర్చలేని కోరిక అంటూ ఉంటుందా? ఉండదు కాక ఉండదు.  నిత్యం లోకసంరక్షణ ఒక్కటే బాధ్యతగా మెలిగే శ్రీహరి కూడా అది నిర్వహించేందుకు కావలసిన శక్తి యుక్తులన్నింటినీ స్వయంగా అమ్మే అందిస్తోందని శ్రీశంకరులు ఈ సౌందర్యలహరిని మొదలు పెజ్డుతూనే నొక్కి చెప్పారుకదా?

దేవాసురులు అమృతంకోసం పాలసముద్రాన్ని మధించిన కథ అందరికీ తెలిసిందే కదా. అలాగే ఆ సందర్భంలో రాక్షసులు ఎత్తుకుపోయిన అమృతకలశాన్ని చేజిక్కించుకుందుకు శ్రీమహావిష్ణువు మోహినీదేవిగా ఒక స్త్రీస్వరూపాన్ని ధరించి రాక్షసులను మోహంలో ముంచి ఆ అమృతాన్ని దేవతలకు పంచిన సంగతీ అందరికీ తెలుసు.

విష్ణువు ధరించిని జగన్మోహినీస్వరూపాన్ని తిలకించాలని కోరికోరి దర్శించి శివుడే ఆ మోహినీదేవిని చూసి మోహించాడని కథ. ఈ శ్లోకంలో శ్రీశంకరులు అలా శివుడి మనస్సే మోహినిని చూసి  సంక్షుభితం కావటాని ప్రస్తావిస్తున్నారు.

శ్రిశంకరులు ఇక్కడ చెప్పే విశేషం ఏమిటంటే, శ్రీమహావిష్ణువు అలా జగన్మోహినిగా అవతారం ధరించటం అమ్మవారిని ఆయన ఆరాధించటం వలన లభించిన ఆవిడ సత్కృప కారణంగానే అని.

అలాగే మనకు తెలిసినదే ఐన మరొక కథ కూడా ఈ శ్లోకంలో ఆచార్యులవారు ప్రస్తావిస్తున్నారు.  మన్మథుడు సాక్షత్తూ పరమేశ్వరుడి మీదే తన పుష్పబాణాలను ప్రయోగించి ఆయనకు తపోభంగం చేసిన సంగతీ,  అందుకు శివుడు ఉగ్రుడై తన మూడవ కన్ను తెఱచి ఆ మన్మథుడిని తన బేసికంటిమంటకు ఆహుతి చేసిన సంగతీ జగత్ప్రసిధ్ధమైన కథయే కదా. ఐతే ఆ తరువాత రతీదేవి ప్రార్థన మేఱకు   అమ్మవారు, రతిదేవి కంటికి మాత్రమే కనుపించేటట్లుగా మన్మథుణ్ణి కనికరించిన సంగతీ అందరికీ విదితమే. ఈ మన్మథుడు సామాన్యుడు కాదు, మహర్షులకూ కామవికారం కలిగించగల సమర్థుడు.  మన్మథుడు అలా మునులను మోహింపచేసిన కథ వామకేశ్వరతంత్రంలోనిది. ఆయన కంత శక్తి యెక్కడి దయ్యా అంటే, అది కూడా ఆ మన్మథుడు అమ్మవారిని ఉపాసించి సంపాదించుకున్న మహిమయే.

అమ్మవారి భక్తుల్లో ముఖ్యమైనవారిగా విష్ణువు, మన్మథుడూ, పరశురాముడు, దుర్వాసుడు మొదలయిన వారు శాక్తేయంలో ప్రసిధ్ధులు.  అమ్మవారి పంచదశాక్షరీ మంత్రం ఋగ్వేదంలో ఉంది.  దానికి ద్రష్ట ఐన ఋషి శ్రీమహావిష్ణువు.  అ పంచదశాక్షరీ మంత్రప్రభావంతోనే విష్ణువు  శివుణ్ణీ మోహింపజేసే ప్రభావాన్ని పొందగలిగాడని శ్రీశంకరుల తాత్పర్యం. మన్మధుడు కూడా అమ్మవారికి సంబంధించిన మంత్రద్రష్టలలో ఒకడు.  అయన వేఱొక పంచదశీ మంత్రద్రష్ట.

అమ్మ మహిమ ఎలాంటిదో చూసారా?  త్రిపురాలను జయించిన మహాత్ముడు శివుడు.  త్రిగుణాలనూ జయించిన జితేంద్రియులు మునులు.  వాళ్ళనూ  మోహినీస్వరూపమూ, మన్మథబాణమూ గందరగోళ పరచాయి.  ఇవి అసాధ్యమైన కార్యాలే!  ఎలా ఇవి సంభవమయ్యాయీ అంటే అంతా అమ్మదయ. అమ్మను ఆరాధించి వారు సంపాదించుకొన్న మహిమల ప్రభావం.

అమ్మను ఆచార్యులవారు ప్రణతజనసౌభాగ్యజనని అన్నారు. ప్రణతజనులు అంటే మనోవాక్కాయకర్మలా అమ్మవారిని నమ్మిసేవించేవారు అని అర్థం. అటువంటి వారికి అమ్మదయ చేత ఎలాంటి దుస్సాధ్యమైన పని ఐనా సుసాధ్యమే అని ఇక్కడ శ్రీశంకరులు ఉదాహరణలతో సహా వివరించారు.

ఈ శ్లోకాన్ని ప్రతిరోజూ రెండువేలసార్లు పారాయణం చేయాలి. ఫలితం ఆనుకూల్యదాంపత్యం. నైవేద్యం బెల్లపు పరమాన్నం.