25, సెప్టెంబర్ 2014, గురువారం

సౌందర్యలహరి - 1 శివః శక్త్యా యుక్తో


మొదటి శ్లోకంవెనుకటి శ్లోకంతదుపరి శ్లోకం


1

శివః శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం
న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి
అతస్త్వామారాధ్యాం హరిహరవిరించాదిభిరపి
ప్రణంతుం స్తోతుం వా కథమకృతపుణ్యః ప్రభవతి


శ్రీశంకరభగవత్పాదులు అనుగ్రహించిన దివ్యస్తోత్రాల్లో సౌందర్యలహరి ఒకటి. దీనిలో అమ్మవారిని స్తుతిస్తూ నూఱు శ్లోకా లున్నాయి.

ఒక్కొక్కసారి ఒక్కొక్క శ్లోకాన్ని గురించి చెప్పుకుందాం.

ఏ పని చేయాలన్నా దానికి తగిన శక్తి మనకు కావాలి. లేకపోతే మనం అసలు కదలటం కూడా చేయలేం. ఎందుకంటే కొంచెం కదలాలన్నా దానికీ ఎంతో కొంత శక్తి వినియోగించక తప్పదు కదా.  అందుకే శక్తిహీనుడు చొప్పకట్టలా పడి ఉంటాడు. అసలు అతడిలో చైతన్యమే ఉండదు.

అసలు లోకంలో ఏ క్రియాకలాపం జరగాలన్నా దానికి పరమేశ్వరుడి అనుగ్రహం కావలసినదే.  అందుకనే ఒక సామెత పుట్టింది తెలుగులో.  శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదూ అని.

ఈ చీమ అనేది ఎంతటి జీవి చెప్పండి? అది కుట్టటానికి కూడా పాపం అది ఎంతో కొంత శక్తిని వినియోగిస్తుందన్నది పక్కన పెడితే, అలా ఓ చీమ కుట్టటం వల్ల మనకి కలిగే కష్టం ఏమంత చెప్పుకోదగ్గది కానే కాదన్నది విషయం. ఐతే అంత చిన్న పనికీ ఆ చీమకు శివుడి ఆజ్ఞ ఐతే కాని కార్యం లేదు.

ఇక్కడ శ్రీశంకరులు చమత్కారంగా ఈ శ్లోకంలో ఎలా ప్రార్త్ఝిస్తున్నారో అమ్మని చూడండి.

అమ్మా, ఈ శివుడున్నాడే, ఆయన నీతో కూడి శక్తియుక్తుడు అనిపించుకుంటే గాని తనంతట తానుగా ఏమీ చేయలేడమ్మా .మరి శివుడికి కూడా పిపీలికాది బ్రహ్మపర్యంతం అందరికీ  ఆజ్ఞలు జారీ చేయాలంటే కూడా తగినశక్తి కావాలిగా?  నీవు ప్రక్కన ఉండి సాయపడబట్టి ఆయన ప్రపంచాల్ని సృష్టిస్తున్నాడు. అంతే. అంతే. లేకపోతే  కొంచెంగా నైనా  ఏ విషయంలోనైనా స్వయంగా స్పందించటానికీ ఆయనకు కుదరదు సుమా.

అమ్మా  అటువంటి నిన్ను త్రిమూర్తులూ తదితర దేవతాగణాలూ నిత్యం ఆరాధిస్తుంటే వారి చేత  నీవు లోకాలన్నింటినీ నిర్వహింపజేస్తున్నావు. అంటే వారికి నీ సాన్నిద్యం ఉండబట్టి వారికి నిన్ను స్తుతించేందుకూ  పూజించేందుకూ  సామర్థ్యం కలిగింది.

అమ్మా,  నా సంగతి ఏమని చెప్పనూ? నేనేమీ పుణ్యం చేసుకున్న వాడిని కాదే!  నీకు మ్రొక్కటానికీ నిన్ను స్తుతించటానికీ నాకు సమర్థత ఎక్కడిదీ?

ఇలా ప్రారంభం చేస్తూ అమ్మా నేను తగినంత సమర్థత లేకపోయినా సాహసించి నిన్ను స్తుతిస్తున్నానూ అనుగ్రహించూ అని చమత్కారంగా ప్రార్థిస్తున్నారు.

శ్రీశంకరులు ఇలా అమ్మవారిని గురించి స్తోత్రం శివశబ్దంతో ప్రారంభం చేస్తున్నారు.

ఈ శ్లోకానికి పారాయణం పన్నెండు రోజులు, రోజూ వేయిసార్లు చొప్పున. నైవేద్యం త్రిమధురం అంటే బెల్లం, కొబ్బరి, అరటిపళ్ళ కలిపిన మిశ్రమం. ఫలితం కార్యసిధ్ధి, సకలశ్రేయోవృధ్ధి.