6, సెప్టెంబర్ 2013, శుక్రవారం

కొత్త దేశి గేయ ఛందస్సు 'సరసపద' లక్షణాలూ వివరాలూ.

సరసపద అనేది నేను నా సౌకర్యార్థం నిర్మించుకున్నది.  ఇది ఒక కొత్త దేశి ఛందస్సు.  దీని  వివరాలూ విశేషాలూ చర్చించటానికి ఈ టపా వ్రాస్తున్నాను.

సరసపద ఒక కొత్త దేశి ఛందస్సు.  దీనిలో  పంచమాత్రాగణాలూ, సూర్యగణాలూ వాడబడతాయి.

పంచమాత్రాగణాలు ఎలా ఉంటాయో ఈ క్రింది పట్టిక చూసి సులభంగా అర్థం చేసుకోవచ్చును.




గణస్వరూపం
గణం పేరు
ఉదాహరణ
I I I I I
నలల
సరసపద
U I I I
భల
సంతసము
I U I I
జల
అనేకము
I I U I
సల
కలవాణి
I I I U
నగ
పలుకవే
U U I

శ్రీరామ
U I U

చంద్రుడా
I U U

అనంతా


సూర్యగణాలు ఎలా ఉండేది అందరికీ తెలుసు.  ఐనా ఛందస్సుతో తక్కువ పరిచయం ఉన్నవాళ్ళ సౌలభ్యం కోసం అవి కూడా ఒక పట్టిక రూపం లో చూపుతున్నాను.
గణస్వరూపం
గణం పేరు
ఉదాహరణ
I I I

కలువ
U I

భామ

ఇలా మనకు 8 పంచమాత్రాగాణాలూ 2 సూర్యగణాలూ ఉన్నాయి.

వీటి సహాయంతో సరసపద ఛందస్సులో పద్యానికి ప్రతిపాదంలోనూ గణవిభజన ఇలా ఉంటుంది


పం  సూ  పం  సూ  పం  సూ  సూ

పైన పం అన్నది పంచమాత్రాగణానికీ,  సూ అన్నది సూర్యగణానికీ సంకేతాలు.

పం అనే సంకేతతో పైన పాదానికి 3 పంచమాత్రాగణా లున్నాయి.  ప్రతి పంచమాత్రాగణానికీ 5 మాత్రలు చొప్పున మొత్తం ఇవి 15  మాత్రలౌతాయి.

సూ అనే సంకేతంతో పైన పాదానికి 4 సూర్యగణా లున్నాయి.  ప్రతి సూర్యగణానికీ 3 మాత్రల చొప్పున మొత్తం ఇవి 12 మాత్రలౌతాయి.

వెరసి ఈ సరసపద ఛందస్సులో ప్రతి పాదానికి 5 + 3 + 5 + 3 + 5 + 3 + 3 =  27  మాత్రలు.

ఈ సరసపద పద్యానికి రెండే‌ పాదాలు.  ద్విపదల్లా అన్నమాట.
ఈ సరసపద పద్యానికి ప్రాస నియమం లేదు.  కాబట్టి మంజరీ ద్విపదల్లా వ్రాసుకోవచ్చును.

తెలుగు పద్యానికి, అది మార్గి ఛందస్సులో (వృత్తాలు) ఐనా, దేశి ఛందస్సులో ఐనా సరే యతి నియమం తప్పని సరి.  ఒక వితాళచతుష్పద అన్న పద్యంలో మాత్రం యతి నియమం లేదు.  తెలుగులో యతి నియమం లేనిది ఒక్క వితాళచతుష్పద పద్యమే.  దానికి కారణం వితాళచతుష్పదలో పాదం బాగా కురచగా ఉండటమే.  మన సరసపదలో పాదాలు తగినంత దీర్ఘంగానే ఉంటాయి కాబట్టి యతిస్థానం ఖచ్చితంగా నియమించాలి.   ఈ  సరసపద పద్యానికి 5వ గణం మొదటి అక్షరం యతిస్థానం.  ఈ పద్యానికి ప్రాస నియమం లేదు కాబట్టి ప్రాసయతి వాడవచ్చును.

ఈ సరసపద అనేది రెండు పాదాల పద్యం అని చెప్పుకున్నాం కదా. వీలుంటే అంత్యప్రాస వాడితే మరింత శోభగా ఉంటాయి.

పాదాంత విరామం పాటించాలి.  సరసపదలో మొదటి పాదం నుంచి రెండవ దానిలోకి పదం కొనసాగ కూడదు.  ప్రతిపాదం చివరా మాట పూర్తి అవాలి.

సరసపదలో పంచమాత్రాగణాల లోని జల (IUII) మాత్రం వాడకూడదు. ఆ గణం అంతగా నడకకు పనికిరాదు. 

ఈ‌ సరసపద ఛందస్సులో కవిత్వం ద్విపదల్లాగా గానం చేయటానికి చాలా అనువుగా ఉంటుంది. పాదాంతంలో సూర్యగణం ఉండటం వల్ల పెద్ద ఇబ్బంది ఉండదు గేయలక్షణానికి.  గేయాల్లో చివరి లఘువుని సాగదీసి పాడటం కొత్త విషయం కాదు కదా.  ఈ సరసపదలో ప్రతిపాదమూ నాలుగు కాలఖండాలుగా విడుతుంది. పం-సూ । పం-సూ । పం-సూ। సూ ।  అని.  ఇక్కడ మొదటి మూడు కాలఖండాల్లో‌ ప్రతిదానికీ  5+3 మాత్రల చొప్పున 8 మాత్రలు. చివరి ముక్తాయింపు కాలఖండానికి మాత్రం 3మాత్రలు.  ఇలా వీలున్నంత వరకూ కాలఖండాలుగా పాదం విరిగితే చాలా సొగసుగా ఉంటుంది.  గణానికి ఒక పదం చొప్పున పడినా ప్రాస నియతి లేని దేశి ఛందాల్లో చాలా బాగుంటుంది.


ఒక  ఉదాహరణ చూదాం.



శ్రీరామచంద్రమూర్తిగా హరియు సీతమ్మ యగుచు సిరియు
ధర్మావతారులై దివ్యలీల నిర్మించినారు కరుణ

ఈ  ఉదాహరణలో అంత్యప్రాస పాటించలేదు. నియతంగా పాదాంత విరామం ఉంది గమనించండి.  మొదటి పాదంలో సారూప్యాక్షర యతి ఉంది, రెండవపాదంలో ప్రాసయతి ఉంది.  నడక విషయానికి వస్తే పై పద్యంలో  కాలఖండాలు  క్రింద పట్టికలో చూపినట్లు ఉన్నాయి. ఇంకొక విశేషం ఏమిటంటే మొదటి పాదంలో యతి వద్ద విరిస్తే వచ్చే రెండు ఖండాలకూ అంత్యప్రాస పొసగింది.



 శ్రీరామ చంద్ర
మూర్తిగా హరియు
సీతమ్మ యగుచు
సిరియు
ర్మావతారు
లై దివ్య లీల
నిర్మించి నారు
కరుణ


 
సాధారణంగా గేయంగా ప్రయోగించినప్పుడు, చివరిదైన కాలఖండం తగినంత దీర్ఘంగా మారుతుంది.  పై పద్యంలోని పాదాల్లో సిరియు, కరుణ అన్నవి ఉఛ్ఛారణలో  'సిరియూ ఊ ఊ' అనీ 'కరుణా ఆ ఆ' అనీ దీర్ఘాలుగా పలుకుతారు.  అప్పుడు ప్రతిపాదం లోనూ చివరి దైన సూర్యగణం మరొక 5 మాత్రలు దీర్ఘాన్ని కలుపుకుని ముందున్న కాలఖండాల్లాగే  మాత్రల ప్రమాణం పొందుతుంది.  అప్పుడు పాదం మొత్తం 27+5 =  32 మాత్రల ఉఛ్ఛారణ కాలప్రమాణం కలిగి ఉంటుంది.  యతిస్థానం 16  మాత్రల తరువాత వస్తుంది కాబట్టి పాదం యతిస్థానం వద్ద సమద్విఖండనం అవుతుందన్న మాట.  ఇలా నాలుగు అష్టమాత్రా కాలఖండాలుగా గానయోగ్యత కలిగిన ఈ ఉపజాతి పద్యం చతురస్రగతిలో ఆదితాళాని అనువుగా ఉంటుంది.

మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, జాతిపద్యాలలో మాత్రాసమకంగా ఉన్నది కందం ఒకటే. ప్రతి పద్యానికీ సరిగ్గా 12 + 20 + 12 + 20 = 64 మాత్రలు.  అలాగే, ఉపజాతిపద్యాల్లో మాత్రాసమకంగా ఉన్నది ఈ సరసపద ఒక్కటే - ప్రతి పద్యానికి సరిగ్గా 27 + 27 = 54 మాత్రలు.

ఈ సరసపద లక్షణం సింహావలోకనం:
 1. గణాలు:   పంచమాత్రాగణాలూ, సూర్యగణాలూ
 2. పద్యంలో పాదాలు:    2.
 3. పాదంలో గణవిభజన:    పం   సూ   పం   సూ   పం   సూ   సూ
 4. ప్రాసనియమం:    లేదు.
 5 యతిస్థానం:   5వగణం మొదటి అక్షరం.
 6. ప్రాసయతి:    వాడవచ్చును.
 7. పాదాంతవిఛ్ఛేదం:   తప్పనిసరి.
 8. నిషిధ్ధగణం:    జల (IUII)

 9.  విభాగం:      ఉపజాతి.
10. మాత్రాసమత: ప్రతిపాదానికి  27 మాత్రలు.
11.  నడగ:  చతురస్రగతి.
12. తాళం:  ఆదితాళం.