29, జులై 2013, సోమవారం

ఇంతోటి రాతలని గొప్ప పోతన పద్యాల్లా చదివి తరించాలి కాబోలు..!

నిన్న (జూలై 28) సాయంత్రం 5:30ని॥లకు ఒక అజ్ఞాతగారు ఈ‌ శ్యామలీయం బ్లాగులోని నా టపా  ముఖ్య గమనిక: శ్యామలీయం నుండి భాగవతం కోసం ప్రత్యేకంగా కొత్త బ్లాగు. పైన వ్యాఖ్యానిస్తూ "ఇంతోటి రాతలని గొప్ప పోతన పద్యాల్లా చదివి తరించాలి కాబోలు..!"అని ఎత్తిపొడిచారు.

వారు ఒక ప్రశ్నకూడా వేశారు. యేం ఎందుకు చూపించాలి మీ బ్లాగుని..వాళ్ళ badge ని పెట్టుకోవడానికి మీకు స్థలం వుండదు తమ బ్లాగులో? అని. 

ఈ‌ అజ్ఞాతగారి వ్యాఖ్యకు నేను గతరాత్రే స్పందించటం‌ జరిగింది. కాని ఆ స్పందన అసమగ్రం అనిపించటం వలన, నేను చెప్పదలచుకున్నది నా పాఠకులకు ఒక టపా ద్వారా వివరంగా చెప్పటం సముచితంగా ఉంటుందని భావించి వ్రాస్తున్నాను.

ముందుగా అజ్ఞాతగారి ప్రశ్నకు సంబంధించి నేను తీసుకున్న చర్య వివరిస్తాను.  నా స్పందనలో తెలియజేసినట్లే కొంత శ్రమ తీసుకుని ప్రస్తుతం ఈ శ్యామలీయం బ్లాగును చూపిస్తున్న సంకలినుల తాలూకూ‌ బేనర్లను ఒక పధ్ధతిలో అమర్చి ప్రదర్శించటం‌మొదలు పెట్టాను. ఇదివరలో కూడా ఈ బేనర్లన్నీ కనిపించేవి శ్యామలీయంలో - కాని అవన్నీ అడ్డదిడ్డంగా ఉండి కంటికి నదరుగా లేకపోవటంతో తొలగించాను. సరిగ్గా అమర్చటానికి కొంచెం‌ శ్రమతీసుకోవటానికి బధ్ధకించాను. సరే అజ్ఞాతగారు వాత పెట్టిన తరువాత, కొంచెం‌ కదిలి, సరిజేసానన్నమాట. కదలిక తెచ్చినందుకు అజ్ఞాతగారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను.

ఇప్పుడు మొదటిది, అతిముఖ్యమైనదీ అయిన అజ్ఞాతగారి ఎత్తిపొడుపు "ఇంతోటి రాతలని గొప్ప పోతన పద్యాల్లా చదివి తరించాలి కాబోలు..!" అన్న దానిని గురించి కొంచెం వివరణాత్మకంగా నా అభిప్రాయాలు వెల్లడించవలసి ఉందని భావిస్తున్నాను.  ముఖ్యంగా ఈ టపా ఉద్దేశం‌ అదే.

ఈ యెత్తిపొడుపు నాకు చాలా విచారం కలిగించిందని ఈ‌ టపా ముఖంగా చదువరులందరికీ మనవి చేసుకుంటున్నాను. 

ఎన్నడూ నేను అన్నమయ్య అంతటివాడిననో పోతన అంతటివాడినో‌ అని గొప్పలు చెప్పుకున్నది లేదు.  నేను ఎన్నడైనా అలా చెప్పుకునే వాడినని ఈ అజ్ఞాతగారు కాని మరొకరు కాని భావించవద్దు.  అలా జరిగే అవకాశం లేదు.  నా ఉపాధి యొక్క పరిమితులపైన నాకు స్పష్టమైన అవగాహన ఉంది. అందుకు భగవంతుడికి నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి.

అజ్ఞాత గారు ఇంతోటి రాతలు అన్నారు.  నా వ్రాతలు గొప్పగా ఉన్నాయనో ఉంటాయనో కూడా నేను ఎన్నడూ అనలేదే? నా భాషాజ్ఞానం యొక్క పరిమితులగురించీ, నా వ్యాకరణజ్ఞానం యొక్క పరిమితుల గురించీ నాకు తెలుసు. ఏదో‌కొంచెం తెలుగు తెలిసిన వాడిని. నన్ను మించిన వారు అన్ని కాలాల్లోనూ కోకొల్లలు. అసలు నా లోకజ్ఞానం గురించి కూడా నాకు పెద్దగా నమ్మకం లేదు.  అందుచేత నావి సాదాసీదా వ్రాతలనే స్పష్టమైన విషయం నాకు తెలుసు.

అందుచేత, నా చదువరులు నా బ్లాగు చదివేటప్పడు వారికి నా వ్రాతలు నచ్చవచ్చు - నచ్చకపోవచ్చును. ఏదైన టపా, నచ్చిన వారు మెచ్చి మరొక సారి నా వ్రాతలను చదివేందుకు ఇష్టపడవచ్చును. నచ్చనివారు నా బ్లాగును దూరం పెట్టవచ్చును.  ఈ‌ విషయంలో పాఠకులకు పూర్తి స్వేఛ్ఛ ఉంది కదా? నా బ్లాగు ఎవరికీ‌ పాఠ్యపుస్తకం లాంటిది కాదే? అందుచేత నచ్చని వారు, దూరం జరగవచ్చును గాని ఎద్దేవా చేయటం‌ అవసరమా?  అలా ఎద్దేవా చేయటం‌ సభ్యత అనిపించు కుంటుందా?  విజ్ఞులే‌ నిర్ణయించాలి.

అజ్ఞాతగారి ఆక్రోశం‌ బహుశః అల్పజ్ఞుడూ చిల్లరవ్రాయసకాడూ అయిన నా బోటి వాడూ భాగవతం గురించి వ్రాయటానికి సాహసించటమా అని అయి ఉండవచ్చునని భావిస్తున్నాను.  అలా గయితే, అజ్ఞాతగారి ఆక్రోశంలో కొంత అర్థం‌ ఉంది.  తప్పుపట్ట నవుసరం లేదు దానికి వారిని. 

అటువంటప్పుడు, అసలు శ్యామలీయం భాగవతం అని ఒక బ్లాగు తెరచి పోతన గారి భాగవతం గురించి టపాలు వ్రాయటానికి సాహసం ఎందుకు చేస్తున్నానూ అన్నది అందరికీ మరొక సారి చెప్పుకోవలసిన అవసరం నాకు చాలా ఉంది.

భగవత్కథలకు సంబథించిన విషయాలతో కొన్ని టపాలు వ్రాయాలన్న సంకల్పం కలిగింది కొన్నాళ్ళ క్రిందట.  ఈ విషయమై నేను చదువరుల అభిప్రాయాలను కూడా కోరటం జరిగింది.  వివరాలకు భగవత్కథలు - కొత్త శీర్థిక - మీ స్పందన తెలియ జేయండి!   అనే టపా చూడండి. అలాగే ఆ టపాతో పాటు దానికి వచ్చిన స్పందన కూడా చూడండి. ఈ విధంగా నేను పోతనగారి భాగవతం టపాల రూపంలో పునఃపరిచయం చేయాలని ఎందుకు ప్రయత్నిస్తున్నదీ‌ అవగతం అవుతుంది.  నాబోటి అల్పసత్వుడు ఇలాంటి బృహత్కార్యక్రమం తలపెట్టటంపై ఎవరికైనా అభ్యంతరం ఉంటే అప్పుడే వెల్లడించవలసింది కదా?  ఈ‌ రోజున నన్ను ఆక్షేపించిన అజ్ఞాతగారు అప్పుడు ఎందుకు తన అభ్యంతరాలతో ముందుకు రాలేదో తెలియదు!  నిజానికి ఆ భగవత్కథలు - కొత్త శీర్థిక - మీ స్పందన తెలియ జేయండి!   అనే టపాకు స్పందనగా కాయ గారు కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు. ఆ ప్రశ్నలకు నేను తదుపరి టపాలలో సవిస్తరంగా జవాబిచ్చాను. వాటిలో  తెలుగు పద్యం‌ అంటే జనం ఎందుకు పారిపోతున్నారు?   అన్న ప్రశ్నకు జవాబు ఇంకా కొనసాగుతూనే ఉంది. బహుశః మరి రెండు మూడు టపాలు రావచ్చు ఆ జవాబులో.

సరే, నా  శ్యామలీయం భాగవతం బ్లాగులో నేను వ్రాసే భాగవతం టపాలు చదివి తరించమని నేను చెప్పటానికి సాహసించను. నాకు సాధ్యమైనంత చక్కగా పోతనగారి భాగవతాన్ని నేటి తరాల తెలుగువాళ్ళకు మరొకసారి పరిచయం చేయాలన్నదే నా ఆకాంక్ష.

స్వయంగా పోతన్నగారిని చదువుకుని తరించగలిగే అదృష్టం ఉన్నవాళ్ళు తప్పకుండా అలా చేయవలసిందిగా కూడా నా విజ్ఞప్తి.

ఒక్క విషయం చెప్పి ముగిస్తాను. ప్రశ్నించటం‌ తప్పు కాదు. ప్రశ్నించి జవాబులు తెలుసుకోవటం సముచితమే.  కాని ప్రశ్నించే తీరు సభామర్యాదలను అతిక్రమించకుండా ఉంటే బాగుంటుంది.